Friday, March 16, 2012

ఒక పాట జ్ఞాపకం

పాత కాయితాలు వెతుకుతున్నప్పుడు ఏం దొరుకుతాయి? కొన్ని జ్ఞాపకాలు! నెమలీకలు! ఎండిన రావి ఆకుల బుక్ మార్కులు! రంగు వెలిసిన ఉత్తరాలు.

ఎటో వెళ్ళిపోయిన స్నేహితుల స్మృతులు! నిన్నటి చేతిరాతలోంచి నిండుగా నవ్వే అమాయకపు ఆ ఆత్మీయ ముఖ పుస్తకాలు! మరలి వస్తే బాగుణ్ణు అనుకునే కొన్ని క్షణాలు!

(మిగతా.. ఆవకాయ లో

Monday, February 20, 2012

తొలి ఆధునిక ముస్లిం కవయిత్రి - అక్బర్ బేగమ్!

(ఇది నిన్న ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీ "వివిధ"లో అచ్చయిన వ్యాసం)


అక్బర్ బేగమ్....తొలి ఆధునిక ముస్లిం కవయిత్రి ?
1850 నుంచి 1910 - తెలుగు సాహిత్య సాంస్కృతిక చరిత్రలో వొక మేలు మలుపు. కొత్త రూపం దిద్దుకుంటున్న సంప్రదాయాలు, ఇంకా పూర్తిగా ప్రసరించని ఆధునికతల మధ్య వొక సందిగ్ధ ఉదయ సంధ్య.
సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తూ కొంత, విచ్ఛిన్నం చేయకుండా కొంత, కొత్త భావనల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం ఈ కాలంలో జరిగింది. ఒక భావనగా ఆధునికత – ఈ మార్పులన్నిటికీ మూల బిందువు. ఆధునికత ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయంలో ఇప్పుడు కొన్ని కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ఆధునికత అనేది విశ్వజనీన భావన కాదన్నది బలంగా వినిపిస్తున్న వాదన. స్థానిక ఆధునికత అనేది పాశ్చాత్య ఆధునిక భావనకి, వలస ఆధునికతకీ ఎంత భిన్నంగా వుంటుందో కొత్త ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. అయితే, తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణంలో ఈ కొత్త భావన ఎలాంటి పాత్ర పోషించబోతుందో ఇంకా మనకి స్పష్టంగా రూపు కట్టడం లేదు. ముఖ్యంగా, 1900 తరవాత ఆధునిక సాహిత్యంలో ప్రధాన పాత్ర పోషించిన కథ, కవిత లేదా పద్యం, వ్యాసం, పత్రికా రచన లాంటి సాహిత్య రూపాల మీద ప్రత్యేకించి కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఈ కొత్త ఆధారాలు నొక్కి చెబ్తున్నాయి. ఇప్పటికే, ఆధునిక కథకి సంబంధించినంత వరకూ, భండారు అచ్చమాంబ కథల గురించి కొంత చర్చ మొదలయ్యింది. అచ్చమాంబ కృషిని సాహిత్య దృష్టితో మాత్రమే కాకుండా, స్త్రీల చరిత్ర నిర్మాణంలో భాగంగా చూడాలని పరిశోధకులు గుర్తిస్తున్నారు. ఈ చర్చని విస్తరిస్తూ, 1904 లో “హిందూ సుందరి” పత్రికలో అక్బర్ బేగమ్ అనే వొక ముస్లిం తెలుగు కవయిత్రి ప్రచురించిన పద్యాన్ని అప్పటి చారిత్రక నేపధ్యం నుంచి పరిచయం చెయ్యడం ఈ వ్యాసం ఉద్దేశం.
ఆధునికత కేవలం సాహిత్య భావన కాదు, అది వివిధ స్థాయిలలో ఆచరణలోకి అనువాదమయ్యేటప్పుడు వొక సామాజిక భావనగా తనదయిన బహిరంగ ఆవరణ (పబ్లిక్ స్ఫియర్ లేదా పబ్లిక్ స్పేస్) ని సృష్టించుకుంటుంది. పత్రికల ఏర్పాటు – వాటిలో పాఠకులకు తగినంత చోటు, విద్యా సంస్థల ప్రారంభం, గ్రంథాలయోద్యమం వ్యాప్తి, టౌన్ హాళ్ళ వంటి పబ్లిక్ సంఘాల నిర్మాణం, చర్చా వేదికలు, ప్రకటనలు, కరపత్రాలు – ఇవన్నీ ఇందులో భాగమే. మనకు తెలిసిన ఈ ఆధునిక చరిత్రలో స్త్రీల స్థితిగతుల ప్రస్తావనకి లోటు లేదు. కానీ, స్త్రీలకి సంబంధించిన ఈ కొత్త భావనలూ, ఉద్యమాలూ, సంఘాలు కూడా పురుషుల ఔదార్యం, స్పూర్తి వల్ల మాత్రమే జరిగినట్టు చదువుతూ వుంటాం. ఇలాంటి రంగాలలో అధికారిక చరిత్ర విస్మరించిన కొన్ని కోణాల లోతుల్లోకి వెళ్తే, ఆధునిక భావాల నిర్మాణంలో స్త్రీల పాత్ర నిర్లక్ష్యానికి గురయ్యిందని అర్థమవుతుంది. మనకి తెలిసిన చరిత్రకి భిన్నంగా, స్త్రీలు సంఘాలుగా ఏర్పడడం, చర్చా వేదికలు నిర్వహించడం, స్త్రీ విద్య లాంటి భావనల్ని మారుమూల పల్లెలకి తీసుకు వెళ్ళడం మొదలయినవి స్త్రీల వైపు నించి విస్తృత స్థాయిలో జరిగాయని కూడా అర్థమవుతుంది. “స్త్రీల కొరకు స్త్రీలు నిర్వహించిన” తొలి ఆదునిక పత్రికా ప్రయోగం “హిందూ సుందరి” సంపాదకీయాలు చదువుతున్నప్పుడు ఈ చర్చలు చాలా సందర్భాలలో ఉద్వేగభరితంగా కూడా జరిగాయని తెలుస్తుంది.
1902 తరవాత మొసలికంటి రామాబాయి (ఈమె, ఈమె భర్త సత్తిరాజు సీతారామయ్య ఇప్పటి ప్రసిద్ధ చిత్రకారులు “బాపు” పూర్వీకులని అంటున్నారు) అనే వొక మహిళ సంపాదకత్వంలో వెలువడిన “హిందూ సుందరి” పత్రికలోని స్త్రీల రచనలని ఈ చారిత్రక నేపథ్యం నించి తిరిగి పరిశీలించాల్సిన అవసరం వుంది. ఈ పత్రికలో సంఖ్యానేకంగా వెలువడిన స్త్రీల రచనలు ఆధునికత అనే భావన చుట్టూ వాళ్ళు స్వతంత్రంగా నిర్మించిన కొత్త ఆలోచనా వ్యవస్థ గా చూడవచ్చు. ఇవి విడివిడిగా ఆయా రచయిత్రులు తమ తమ వ్యక్తిగత పరిధుల్లోనే చేసినప్పటికీ, కొన్ని ప్రయత్నాలు స్థానికంగా సంఘ నిర్మాణం దాకా వెళ్ళినా, అచ్చు సంస్కృతి లోకి ప్రవేశించడం వల్లా, వొక పత్రిక దానికి వేదిక అవ్వడం వల్లా వాటికి వొక సమష్టి బహిరంగ రూపం దక్కింది. స్త్రీ విద్యా కేంద్రంగా నిర్మితమయిన ఈ భావాల వ్యవస్థ సంప్రదాయాన్ని పూర్తిగా నిరాకరించలేదు, అట్లా అని పూర్తిగా అంగీకరించ లేదు కూడా. సాంప్రదాయ భావనల్ని తిరగదోడి, వాటి అసలు ఉద్దేశాలను పునర్నిర్మించే ప్రయత్నం ఈ రచనల్లో గట్టిగా కనిపిస్తుంది. దీనికి అప్పటి హిందూ భావనల పునర్నిర్మాణ ప్రక్రియతో సంబంధం వుంది. ఇది హిందూ పునరుద్ధరణ ప్రక్రియ కాదన్నది మనం స్పష్టంగా గుర్తించాలి.
అయితే, ఈ పరిధిలో కథ, వ్యాసం, పత్రికా రచన లాంటి వచన ప్రక్రియలు చేసే పనికీ, కవిత్వం లేదా పద్యం లాంటి ప్రక్రియలో జరిగే పనికీ చాలా వ్యత్యాసం వుంటుంది. సాహిత్యంలో వ్యక్తమయ్యే స్పందనలు అనుదిన జీవితంతో ముడిపడి వుండేవే అయినప్పటికీ, అనుదిన జీవన సంస్కృతికి వుండే చట్రాన్ని కూడా అవి ఉద్వేగంగా ప్రశ్నిస్తాయి. అయితే, ఆయా సాహిత్య ప్రక్రియల సంవేదనాత్మకత స్వభావాన్ని బట్టి ఈ చట్రం ఎదుర్కొనే ప్రశ్నలు వుంటాయి. కవిత్వం వొక విధమయిన సజీవ సంవేదనాత్మకతని ప్రతిబింబిస్తుందని ప్రసిద్ధ స్త్రీవాద కవయిత్రి ఎడ్రియన్ రిచ్ వొక సందర్భంలో అంటుంది. ముఖ్యంగా సాహిత్యంలో పూర్వ నిర్ధారిత సంప్రదాయ రాజకీయ సంస్కృతి చట్రం ఎలాంటి పాత్ర పోషిస్తుందో విశ్లేషిస్తూ, ఆమె ఇలా అంటుంది: In a political culture of managed spectacles and passive spectators, poetry appears as a rift, a peculiar lapse, in the prevailing mode.
రాజకీయ సంస్కృతి అనే భావనని ఆమె చాలా విస్తృతార్థంలో వాడినట్టు ఇక్కడ వేరే చెప్పక్కర్లేదు. అయితే ఆ సంస్కృతిలో సంప్రదాయం పాత్రని ఇక్కడ ప్రత్యేకించి గమనించాలి. అందునా, స్త్రీ సమస్యలకి సంబంధించి ఈ సంప్రదాయిక నిర్మాణం బలంగా పని చేస్తుంది. అందుకే, తెలుగు నాట స్త్రీల సమస్యలకి సంబంధించి సంస్కర్తలు అయినా, సాహిత్య వేత్తలు అయినా కొంత అదనపు శక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రయోగించాల్సి వచ్చింది. దీనికి వొక ఉదాహరణ “హిందూ సుందరి” పత్రిక నిర్వహణ. ఈ పత్రికలో వచన రచనలన్నీ వొక ఎత్తు, కవిత్వం వొక ఎత్తు. కవిత్వంలో వుండే వొక సహజమయిన భావ తీవ్రత, ఆవేశం ఆ ప్రక్రియని వొక peculiar lapse గా మార్చుతుంది. ఇలాంటి సన్నివేశంలో స్త్రీగా రాయడం, అందులోనూ భావ తీవ్రత మూలమయిన కవిత్వ ప్రక్రియలో ఆ స్త్రీ తన ఆలోచనని వ్యక్తం చెయ్యడం అనేక వొత్తిళ్ల మధ్య సంఘర్షణ పడడమే. దీనికి తోడు, ఆ కవయిత్రి ముస్లిం సమాజం నించి వచ్చినప్పుడు, తన తల్లి భాషలో కాకుండా, స్థానిక భాషలో రాయడం ఎంత సంఘర్షణో ఊహించుకోవచ్చు. ఆయా భాషల చట్రాలు కూడా ఆమె మీద గట్టిగానే వొత్తిడి పెడతాయి. వీటిని దాటుకొచ్చి వొక సాహంకార పద్యంగా నిలబడిన వ్యక్తి అక్బర్ బేగమ్.
ఎవరీ అక్బర్ బేగమ్?
తొలి ఆధునికులలో సుప్రసిద్ధుడయిన కవి ఉమర్ అలీ షా భార్య అక్బర్ బేగమ్. తన విశిష్ట కావ్యం “సూఫీ వేదాంత దర్శము” ఆయన తన భార్య అక్బరాంబ కి అంకితమిస్తూ, అక్బరాంబ గొప్ప పండితురాలని, తన కావ్యాలన్నిటికీ ఆమె మొదటి పఠిత, విమర్శకురా లనీ అంటారు ఉమర్ అలీ షా కవి. వ్యక్తిగా, పండితురాలిగా ఆయనపైన అక్బర్ బేగమ్ గాఢమయిన ప్రభావం కలిగించిందని ఈ అంకిత పద్యాల్ని బట్టి తెలుస్తుంది. అక్బర్ బేగమ్ చనిపోయిన తరవాత ఉమర్ అలీ షా కవి కూడా దాదాపూ వొక విధమయిన మౌనంలోకి వెళ్ళిపోయారు. 1935 లో ఆమె డిల్లీలో కన్నుమూసినప్పుడు ఆమె మృతికి సంతాప సూచకంగా డిల్లీ శాసన సభకి ఆ రోజు సెలవు ప్రకటించారు.ఒక వైపు క్రియాశీల రాజకీయవేత్తగా అప్పుడే జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న ఉమర్ అలీ షా ఈ అనూహ్యమయిన మరణ విషాదాన్ని తట్టుకోలేక, లోలోపలే బాధని దిగమింగుకుంటూ, అస్వస్థులయ్యారు. ఆ తరవాతి కాలంలో ఆయన మెదడు నరాలు చిట్లి, కన్ను మూశారు.
తమ ఇద్దరి అనుబంధంతో పాటు, అక్బర్ బేగమ్ కుటుంబ చరిత్రని కూడా ఉమర్ అలీ షా ఈ పద్యాల్లో కొంత రాశారు.
ఏను రచించినట్టి కృతులెన్నిటనో వినె తల్లి; తండ్రి నా
నా నవనాటక ప్రకరణంబులు నాడగ జూచినారు; ఢి
ల్లీ నగరాంగ్ల భారత మహీధవ శాసన సభ్య సత్పదం
బానగ గాంచి “అగ్బ”రమరాలయమేగే వెలుంగు చుక్కయై.

పరమ పవిత్ర యీ వెలది పండితురాలు నితాంత సత్యసం
భరిత రసాత్మక ప్రకృతి వడ్డికిబారెడు ప్రేమమూర్తి సుం
దర సముపాసితం బయిన ధర్మపదంబును సంతరించి యీ
శ్వరునెద నగ్బరాంబ కడు ప్రార్ధన సేయుచు నెల్ల వేళలన్.
ఉమర్ అలీ షా గారి ఈ అంకిత పద్యాలు తప్ప, ఈ కవయిత్రి గురించి ఇంతకు మించి సమాచారం ఏదీ దొరకడం లేదు. “హిందూ సుందరి” లో ప్రచురితమయిన పద్యం కూడా చివరలో “సశేషం” అని వుంది. తరవాతి సంచికలలో ఆ పద్యం రెండో భాగం కూడా లభ్యం కావడం లేదు. అయితే, 1915 తరవాత ఉమర్ అలీ షా సూఫీ గురువుగా ప్రసిద్ధులవ్వడంతో, ఆయనతో పాటు అక్బర్ బేగమ్ సూఫీ ప్రచారంలో విరామమెరుగక పర్యటించేవారని, ఉమర్ అలీ షా శిష్యులలో చెప్పుకోదగిన సంఖ్యలో మహిళలు కూడా వుండడం వల్ల వారి కోసం ఆమె ఎక్కువ సమయం వెచ్చించే వారని ఉమర్ అలీ షా గారి ఇతర రచనల ద్వారా తెలుస్తోంది.
అక్బర్ బేగమ్ కూడా తన పద్యం లో ప్రవర చెప్పుకునే కావ్యగానం ఆరంభిస్తుంది. “నేను మహమ్మదీయ కాంతనయిననూ మజ్జననియును అత్తమామగార్లు కళ్యాణగుణ గణాలంకార విద్యా కాంతార విహార చేతస్కులై, జగద్ధిత కీర్తి బ్రవర్తింపుటం జేసి, తదీయ సహవాస వాసన నా మంద బుద్ధికి సోకి, భ్రమర కీట న్యాయానుసారము నొక్క తృటిలో నీ మహత్తర నీతి కథా చరిత” రాస్తున్నట్టు చెప్పుకుంది. ఈ పద్యంలో ఆమె తల్లి శిలార్ బీబీ జీవితంలోని వొక ముఖ్యమయిన ఘట్టాన్ని మాత్రమే అక్బర్ బేగమ్ వివరించింది. పద్యం నడకని బట్టి చూస్తే ఆమె వొక దీర్ఘ ఆత్మకథాత్మక కావ్యం రాయాలని మొదలు పెట్టినట్టుగా వుంది. ఈ పద్యంలో ఆమె శిలార్ బీబీ అత్తవారింటికి రావడం, అక్కడ ఆమె అనుసరిస్తున్న కొత్త ఆచార పద్ధతులతో, తన సూఫీ చదువూ, కొత్త సంస్కారం వల్ల (“ యీ జెష్ట మంత్రంబులెక్కడో నేర్చి/ దెయ్యాల ప్రార్ధించు”) ఆమె గర్విలా కనిపిస్తుంది అక్కడి వాళ్ళకి- అప్పుడు భర్త ఆమెని “కోపంబుతో ముండరండా అనుచు” కర్రలతో మొత్తుతుంటాడు. “ఇట్లనేక విధముల బాధలనుభవించి/ నోర్చి” కాలం గడుపుతూ వుంటుంది శిలార్ బీబీ. చివరికి వొక అగ్ని పరీక్ష లాంటిది ఆమె కూడా ఎదుర్కొంటుంది. ఆ అగ్ని పరీక్షలో ఆమె నెగ్గుతుంది. అందరూ ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించడం మొదలెడ్తారు. పతివ్రతగా వుంటూనే, తనదయిన వ్యక్తిత్వ ముద్రతో ఆమె ప్రవర్తిస్తుంది. ఈ కథ నిజానికి ఇప్పుడు అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. కానీ, వొక స్త్రీ, అందునా ముస్లిం స్త్రీ ఈ మాత్రం తన కథని చెప్పడం విశేషంగానే భావించాలి.
ఈ పద్యం ప్రవరలో ఆమె ప్రస్తావించినట్టు ఆమె మామ గారు, ఉమర్ అలీ షా కవి తండ్రి మహర్షి మొహియుద్దీన్ బాషా ఆధ్యాత్మిక విద్యా పీఠాధిపతి. ఆయన ప్రధానంగా తెలుగులో సూఫీ తత్వాలు కూర్చారు. అయితే అవి కేవలం ఆయన భక్తులకు మాత్రమే పరిమితం. ఆ వారసత్వం నుంచి వచ్చిన ఉమర్ అలీ షా కవి కూడా చాలా కాలం పాటు ఆశు సంప్రదాయంలోనే వుండిపోయారు. ఉమర్ అలీ షా ఖండికలు 1905 వరకూ అచ్చు రూపం దాల్చిన దాఖలాలు లేవు. అయితే, అప్పటికే ఆయన పద్యాలు మౌఖిక రూపంలో బాగా ప్రాచుర్యంలో వుండేవి. వొక సూఫీ తత్వవేత్తగా ఆయన రూపాంతరం చెందుతున్నారు. లిఖిత సంస్కృతి చరిత్ర నించి చూస్తే, 1904లో “హిందూ సుందరి” పత్రికలో “అపూర్వ పతివ్రతా చరిత్రము” అనే శీర్షికతో వెలువడిన అక్బర్ బేగమ్ పద్యమే అచ్చు రూపం దాల్చిన తొలి తెలుగు ముస్లిం పద్యమే కాక, అచ్చు సంస్కృతీ, ఆధునికతా, పబ్లిక్ స్పేస్ ల కొత్త మేధో వాతావరణంలోకి ప్రవేశించిన తొలి ముస్లిం రచన కూడా అవుతుంది.
అక్బర్ బేగమ్ పద్యం సమకాలీన సాహిత్యం పట్ల ఆమెకి వున్న లోతయిన అవగాహనని చెబుతుంది. ఆమె ఉద్దేశపూర్వకంగా రెండు రకాల సామాన్యీకరణ వ్యూహాల్ని వినియోగించుకున్నట్టు కనిపిస్తుంది. మొదటి వ్యూహం: సాహిత్య వస్తువుని పూర్వ గాథల నించి విముక్తం చెయ్యడం, రెండు: భాషలో సామాన్య భాషని వాడడం. ఈ పద్యంలో ఆమె ద్విపద, ఉత్పల మాల, సీసం, తేటగీతి వృత్తాలని వుపయోగించింది. కానీ, సంప్రదాయ పద్యంలో వుండే సంస్కృత ప్రభావాన్ని వదిలించుకొని, వాడుక తెలుగుని వాడాలన్న పట్టుదల ఈ పద్య పాదాల్లో కనిపిస్తుంది. స్త్రీల పట్ల పురుషులు ఎట్లాంటి తిట్టు పదాలు వాడతారో ఈ సామాన్యీకరణ వ్యూహంలో వొక భాగమే. అదే విధంగా, మొహియుద్దీన్ బాషా లాంటి సూఫీ తత్వ కవులు భక్తి కవిత్వంలో ప్రవేశపెట్టిన సామాన్యీకరణని, నిరలంకారతని ఆమె వారసత్వంగా పుణికి పుచ్చుకున్నట్టు ఈ పద్యాల్ని బట్టి తెలుస్తుంది. తరవాతి కాలంలో ఉమర్ అలీ షా సూఫీ విశ్వ విజ్ఞాన పీఠంలో క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి వీలుగా ఆమె ఈ పద్యాలలో ఆశు సంప్రదాయ రూపం వైపు మొగ్గు చూపించింది. అయితే, ఈ రూప పరమయిన అంశాలన్నీ ఆమె “ఆధునిక మహిళ” అనే భావన పట్ల ఆమె ఆలోచనలోని భిన్నత్వం వల్ల సాధ్యమయ్యాయి.
సంప్రదాయ కథనం- ఆత్మకథనం
“హిందూ సుందరి” పత్రిక ప్రధానంగా స్త్రీ విద్య మీద, స్త్రీ కేంద్రంగా సంఘంలో రావాల్సిన మార్పుల మీదా దృష్టి పెట్టింది. అప్పటి ముస్లిం స్త్రీలు చదువు ప్రాధాన్యాయాన్ని గుర్తిస్తున్నారనడానికి అక్బర్ బేగమ్ పద్యం వొక ఉదాహరణ. విద్య ద్వారా మాత్రమే స్త్రీల స్థితిలో మార్పు వస్తుందన్న లక్ష్యంతో ఈ పత్రిక సంపాదకులు కేవలం స్త్రీలు రాసిన వ్యాసాలను ప్రచురించడం మొదలు పెట్టారు. వూరూరా విద్యావంతులయిన స్త్రీలతో రాయించడం ఈ పత్రిక ప్రధానంగా చేసిన పని. ఇలా చేయడం ద్వారా “మన దేశ స్త్రీలు భయముడిగి, ఇతర దేశపు స్త్రీల వలె తామే వొక పత్రికా భారం వహించే” స్థితికి రావాలన్నది వారి ఆకాంక్షగా ప్రకటించుకున్నారు. అందులో భాగంగా విద్యావంతులయిన స్త్రీలను తామే సంప్రదించి వారి చేత రాయించడం మొదలు పెట్టారు. స్త్రీ తన ఔన్నత్యాన్ని తానే నిబ్బరంగా ప్రకటించుకోవడం ఈ రచనల ఉద్దేశంగా కూడా వారు చెప్పుకున్నారు. ఆ క్రమంలో స్త్రీల వున్నత స్థితిని చెప్పే కొన్ని సంప్రదాయ భావనల్ని విమర్శనాత్మక దృష్టితో స్వీకరించారు. వాటిలో వొకటి: పతివ్రతా భావన. ఈ భావనని స్త్రీ విద్యా దృక్పథం నించి సవరించి చూడడం ఈ కథల్లో ప్రత్యేకత. అయినప్పటికీ, ఈ కథలు చాలా మటుకు పురాణాల నించి తీసుకున్నవే; సంప్రదాయ కథన పద్ధతిని అనుసరించినవే. 19 వ శతాబ్దిలో పాశ్చాత్య ఆధునికతకి ప్రతివాదంగా నిలబడిన “నియో క్లాసికల్ హిందూయిజం” ధోరణి ఇందులో కనిపిస్తుంది. “హిందూ” అనే అస్తిత్వాన్ని నిరాకరించకుండా, అందులో వున్న భావనలకి ఆధునిక రూపం ఇవ్వడం సాహిత్యపరంగా ఈ దశలో బలమయిన ధోరణి.
దీనికి భిన్నంగా, మూడు కొత్త ప్రత్యామ్నాయాలని అక్బర్ బేగమ్ తన పద్యంలో చూపించింది. వొకటి: కేవల “హిందూ”అస్తిత్వం నించి స్త్రీ విద్యని విడదీయడం; రెండు: ఆధునిక భావాల్ని ముఖ్యంగా స్త్రీ నైతికతని స్త్రీ కోణం నించి మాత్రమే చూడడం; మూడు: సాంప్రదాయ కథన పద్ధతిని నిరాకరించి ఆత్మ కథన పద్ధతిని స్వీకరించడం. ఈ మూడు కారణాల వల్ల “హిందూ సుందరి” పత్రికలో ప్రచురితమయిన ఇతర రచనల కంటే అక్బర్ బేగమ్ రచన చదివిన వెంటనే భిన్నంగా అనిపిస్తుంది. “పూర్వ పతివ్రతామహాత్మ్య యశస్సంపద లనేకములు విని వారయోని సంభూతుల వలె దలంచి హాశ్చర్యాంతఃకరణులై సంతసించుటయే గాని మనవలెనే జన్మించిన వారల” కథలు చెప్పాలని తన ప్రయత్నాన్ని చెప్పుకుంది ఆమె. కథని సాధారణీకరించాలన్న ఆమె మౌలికమయిన ఆలోచనే, మిగిలిన భిన్నత్వాలకు దారి తీసింది. తల్లి శిలార్ బీబీ కథనే ఆమె వస్తువుగా తీసుకోవడం వల్ల ఆ ఆత్మకథనాత్మక లక్షణం మిగిలిన రెండు అంశాలు- ‘హిందూ” అస్తిత్వ ప్రభావం నుంచి బయట పడడం, స్త్రీ నైతికతకి కొత్త కోణం- సాధ్యమయ్యాయి. ఆ విధంగా ఆత్మకథాత్మకత ఈ పద్యానికి కేంద్ర బిందువు అయ్యింది.
స్థానిక ఆధునికతలో ఆత్మకథాత్మకత వల్ల సాధ్యపడే అన్ని సాంస్కృతిక లక్షణాలను ఈ పద్యం పుణికిపుచ్చుకుంది. అలాగే, సూఫీ తత్వం అనేది అనుదిన జీవితంలో లీనమవుతున్న క్రమాన్ని కూడా ఈ పద్యంలో అర్థం చేసుకోవచ్చు. శిలార్ బీబీ జీవన విలువలు సూఫీ స్థానికతలోంచి ఎలా రూపు దిద్దుకున్నాయో, అవి తొలినాళ్ళలో ఎలాంటి అపోహల్ని సృష్టించాయో చెప్పడం, అవి ఆమెని కుటుంబ హింసకి ఎలా గురి చేసాయో చెప్పడం ఈ పద్యంలో అక్బర్ బేగమ్ సాధించిన ఇతర విజయాలు. నైతికతకి సంబంధించినంత వరకూ కేవలం పురుష దృక్కోణం నుంచి ఆమె వ్యక్తిత్వం పైన తీర్పు చెప్పలేమన్న ఆలోచన బీజప్రాయంగా అయినా ఈ పద్యంలో కనిపిస్తుంది. మైనారిటీ సాంస్కృతిక స్వరం ప్రకాశంగా వినిపించడంలో ఆత్మకథాత్మకత ఎలాంటి సాధనంగా ఉపయోగపడుతుందో, ఆ ఆత్మకథాత్మకత సామూహిక కథగా ఎలా రూపు దిద్దుకుంటుందో ఈ పద్యం నిరూపిస్తుంది. ఆధునిక తెలుగు సాంస్కృతికతా వికాసంలో తొలి మెరుపై మెరిసిన నెలవంక ఈ పద్యం.

(అక్బర్ బేగమ్ పద్యం సేకరించి పంపడమే కాకుండా, నేను ఈ వ్యాసం రాసేంత వరకు పట్టు వదలని మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ కి, ఉమర్ అలీ షా కవి రచనలన్నీ దూరభారం లెక్క చేయక పంపిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి కృతజ్ఞతలు. ఈ వ్యాసకర్త అక్బర్ బేగమ్ గురించి మాత్రమే కాకుండా 1850-1910 ప్రాంతాలలో తెలుగులో రచనలు చేసిన ముస్లిం సాహిత్య వేత్తల గురించి, అప్పటి సూఫీ ధోరణుల గురించి ఇంకా పరిశోధిస్తున్నారు. ఆ వివరాలు తెలిసిన వారు afsartelugu@gmail.com కి పంపవలసిందిగా మనవి.)


*

Saturday, February 18, 2012

అమ్మ పేరు




అమ్మని ఆ నేల పొత్తిళ్లలో నిద్రపుచ్చుతున్నంత సేపూ
కురుస్తూనే వుంది వాన.

చర్చి నించి శ్మశానం దాకా.

మా కాళ్ళ కింది బురద నీళ్ళు
వొక శూన్యాన్ని చప్పుడు చేస్తున్నాయి.


పాస్టర్ పిలిచినప్పుడు చెయ్యెత్తి నిలబడ్డాను
"మరణంతో ఆగిపోతుంది ఈ దేహం చెయ్యాల్సిన పని.
ఇక మొదలు ఆత్మ యానం...."


తీరా వెనక్కి తిరుగుతున్నప్పుడు రానే వచ్చాడు సూరీడు.
వెనక్కి తిరుగుతున్న నా వేపు తీక్షణంగా చూశాడు,

వెనక్కి తిరిగాను
అమ్మని అక్కడే వదిలేసి.


ఇంటికి వెళ్తున్న దారినిండా గతుకులు
ఎప్పుడూ అది గతుకుల దారే.

నెమ్మదించినా నా అడుగులు,
క్షణం నిలవదుగా, ఈ కాలం!

పోయిన వాళ్ళ పేర్ల మధ్య నా సంచారం

అమ్మ పేరు
నా తల కింద రాతి తలగడ.


మూలం: Natasha Trethewey

ఇది స్వేచ్ఛానువాదం

Monday, February 13, 2012

ఊరికే!


ఓ కల నిండా
కలిసి ప్రయాణం

నగరం మురికి కాల్వ
ముక్కు మూసుకుంటూ
చెయ్యూపింది

ఆకాశం వో షాండ్లియర్.

గంటలు మోగిస్తూ
వెన్నెల్లో ఎడ్ల బండి


ఇంకే లోకమూ తెలియనివ్వని
సహయాత్ర

ఓ ఆకాశం నిండా
కలల ప్రయాణం

ఇప్పుడూ
ఎప్పుడూ.


(1996, "వలస" నించి)

నిస్సందేహంగా ఇది ప్రేమ కవితే!

'రాలేదు'లో అఫ్సర్!

వార్త ఆదివారం అనుబంధంలో నిన్న ప్రముఖ కవి, విమర్శకుడు దర్భశయనం శ్రీనివాస రావు గారు "ఊరి చివర" కవితలో "రాలేదు" అనే వొక కవితపై చేసిన విశ్లేషణ.

ఈ వ్యాసాన్ని స్కాన్ చేసి పంపిన కవిమిత్రుడు కుమార్ వర్మ గారికి ధన్యవాదాలు.

Tuesday, February 7, 2012

అంతకన్నా...

సర్లే, పోనీలే అనగలనా,

దాని నునుపైన దేహమ్మీద చెయ్యి వెయ్యకుండా.

దాని చేతిలో చెయ్యేసి,

తన గోర్వెచ్చనితనాన్ని నాలోకి వొంపుకోకుండా.

(మిగతా కవిత చదవండి ఆవకాయలో...)

Wednesday, February 1, 2012

ఆమె నిశ్శబ్దంగా వెళ్లిపోయింది!





నాకు బీథోవెన్ సంగీతంలోని ప్రశాంత బీభత్సం ఇష్టం. అట్లాగే, భాషలోంచి నిశ్శబ్దంగా నవ్వుకుంటూ వెళ్లిపోయే “ఐరనీ” అంటే పిచ్చి. ఈ రెండూ వొక చోట కలిసినప్పుడు, ఆ కలయిక కవిత్వమయినప్పుడు నా లోపలి ఖాళీలన్నీ పగలబడి నవ్వుకుంటాయి. రుద్ర తాండవమే చేస్తాయి. పోలిష్ కవయిత్రి విశ్వావ సింబోర్ స్కా కవిత్వం నా లోపలి ఆ “ఐరనీ” రుద్ర తాండవ వేదిక. ఇవాళ్టి పొద్దుటి నిద్రలో ఆమె కన్ను మూసిందని తెలిసినప్పుడు, ఎందుకో ఆ మృత్యువు నాకు దేజావూలా, వొకానొక పూర్వస్మృతిలాగా అనిపించింది.

అతి తేలికయిన మాటలతో బతుకు చిక్కు ముడులు విప్పుకుంటూ వెళ్ళిన సింబోర్ స్కా అంతకంటే తేలికగా నిద్రలోంచి ఇంకో నిద్రలోకి వెళ్లిపోయింది. పెద్ద పెద్ద మాటలూ, వస్తువులూ అక్కర్లేదు కవిత్వానికి – రోజువారీ బతుకులోంచి ఎంతో కొంత అరువు తెచ్చుకొని, వాటినే లోతయిన ఆలోచనలతో నింపితే చాలు అనుకున్న నిశ్శబ్ద కవయిత్రి.

ఈ అనువాదాలు ఆమె స్మృతికి వొక నిస్సహాయ నివాళి -

ఆమె కవితల్లోంచి కొన్ని పంక్తులు మాత్రమే.
పూర్తి అనువాదాలు తరవాత వీలు వెంబడి.



మూడు మరీ అడ్డగోలు మాటలు

భవిష్యత్తు అన్న పదం పలకబోతానా,
దాని మొదటి అక్షరం గతంలోకి జారిపోతుంది అప్పటికే.

నిశ్శబ్దం అనబోతానా,
దాన్ని కుప్పకూల్చేస్తాను.

“ఏమీ లేదు,” అన బోతానా,
అసలే అస్తిత్వరాహిత్యమూ పట్టి నిలపలేని
దేన్నో వొకదాన్ని చేసి అక్కడ పెట్టేస్తాను.


మరణం, అతిశయోక్తులు లేకుండా

అబ్బే, దానికి నీ జోకులేవీ ఎక్కవు
నీ చుక్కలూ, నీ వంతెనలూ ఏవీ ఏవీ తెలీవు

అల్లికలూ, తవ్వకాలూ, అరక పట్టడమూ
నౌకల్ని తయారు చెయ్యడమూ, పోనీ, కేకులు చెయ్యడమూ
అబ్బే, అవేవీ దానికి చాత కావు.

-
సరే, దాని పనులయినా అది సరిగ్గా చేసుకుంటుందా అంటే
అదీ లేదు.

శుభ్రంగా సమాధి తవ్వుకోవడం
శవపేటిక చేసుకోవడమూ
ఆనక అన్నీ నీటుగా సర్దుకోవడమూ
అదీ రాదు.


కొన్ని సాధ్యాలు

నాకు సినిమాలు కావాలి
పిల్లులు కావాలి

ఆ నది వొడ్డున మహా వృక్షాలు కావాలి
దాస్తావస్కీకి బదులు డికెన్స్ కావాలి

నాకు ఆకుపచ్చ రంగు కావాలి
నాకు మినహాయింపులు కావాలి
తెల్లారకట్ట వెళ్లిపోవడం కావాలి

Sunday, January 29, 2012

ముస్తఫా మరణం

ఇవాళ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అచ్చయిన "ముస్తఫా మరణం" కథ బ్లాగులో ప్రచురిస్తే బాగుంటుందని చాలా మంది మిత్రులు సూచించారు. వారి సూచన మేరకు ఈ కథ ఇక్కడ...



“ఆ గదిలోకి మాత్రం తొంగి అయినా చూడద్దు, బేటా!!” అని కేకేస్తున్న ఫాతిమా ఫుప్మా(అత్తయ్య) గొంతే వినిపిస్తోంది ఎప్పటిదో గతంలోంచి!
“అబ్బాజాన్ కి పదో రోజు చేస్తున్నాం,” అని మునీర్ భాయ్ మూడు రోజుల క్రిందట ఫోన్ చేసినప్పటి నించీ ఆ కేక ఆ గతంలోంచి ఎన్ని సార్లు వినిపించిందో లెక్క లేదు.
ఇవాళ పొద్దున ఫస్ట్ బస్సు అందుకుని, మధ్యాన్నం కల్లా వూళ్ళో వుంటే, పదో రోజుకి అందుకున్నట్టూ వుంటుంది, మునీర్ భాయ్ తో, ఫాతిమా ఫుప్మా తో, గోరీమాతో, అందరితో కాసేపు మాట్లాడినట్టూ వుంటుందని వూరికి బయలుదేరాను. మాట్లాడాలి, చాలా మాట్లాడాలి, ముఖ్యంగా ఆ గది గురించి!
ఇప్పుడు మునీర్ భాయ్ అబ్బా ముస్తఫా కన్ను మూసాక, ఆ గది ఏమవుతుంది? అతని వారసత్వంగా ఆ గది, ఆ పరంపరని మునీర్ అందుకుంటాడా? అసలు ఆ ఇంటి పెద్ద కొడుకుగా మునీర్ భాయ్ తండ్రి మరణాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నాడో నాకు అర్ధం కాలేదు. తండ్రి వుండగానే అతిపెద్దదయిన ఆ కుటుంబ భారాన్నంతా తన వొంటరి భుజాల మీద మోసిన మునీర్ భాయ్ ఇప్పుడేం చేస్తాడు? ముస్తఫా దారిన బయలుదేరిన వందలాది భక్తజనం ఇప్పుడు ఏం చేస్తారు?
చాలా ప్రశ్నలు వున్నాయి, కానీ, నా ప్రశ్నలన్నీ ఆ గదితో మొదలయ్యే, చివరికి అక్కడే అంతమవుతున్నాయి.
చూస్తూ చూస్తూ వుండగానే అనేక రంగులు మారిన అతి సంక్లిష్టమయిన పెయింటింగ్ ముస్తఫా జీవితం. ఆ పెయింటింగ్ వొక కన్నుకే వివిధ సందర్భాల్లో వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఏ రంగు నిజంగా ముస్తఫా జీవితాన్ని ఆవిష్కరిస్తుందో? నా మటుకు నాకు అది సందిగ్ధ వర్ణ సమ్మేళనం.
అసలు బాబా ముస్తఫాకి మరణమే లేదని కదా వూరంతా అనుకుంది. అట్లా అని గుడ్డిగా నమ్మేసే అతార్కిక స్థితికి వచ్చేసింది జనమంతా అతని కథలు విని, అతని మాటల మార్మికలోకంలో పడి! వూరంతా చెప్పే కథలు, చుట్టూరా వూళ్ళన్నీ పాక్కుంటూ వెళ్ళిపోయిన కథలు అటు వినీ ఇటు వినీ “నిజమేనేమో, ముస్తఫా దరిదాపుల్లోకి కూడా మరణం రాదు పో” అని నమ్మే స్థితికి నన్ను నేనూ తోసుకుంటూ వెళ్లిపోయాను.
ప్రళయం అనేది పెను ఉప్పెనలా వస్తే, ముస్తఫా ఆ ఉప్పెన తల మీద నాట్యం చేస్తాడని, అది నిప్పుల రూపంలో వస్తే, అతను ఆ నిప్పులతో ఆడుకుంటాడని గట్టి నమ్మకం ఏర్పడిపోయింది వూళ్ళో! ఆ నమ్మకాలలో నాకేమీ నమ్మకం లేదు. మౌలానా అంటే నాకు మునీర్ భాయ్ తండ్రి. ఫాతిమా అత్త భర్త. నాతో కలిసి ఆడుకున్న మునాఫ్, ముజఫర్, ముంతాజ్, మోమిన్, మహమూదాల తండ్రి. అన్నిటికీ మించి, నేను అమితంగా ఇష్టపడే గోరీమా కొంతకాలం పాటు అమితంగా గౌరవించిన వ్యక్తి. గోరీమా మాటల్లో చెప్పాలంటే, “దీని మాలుమాత్ (ఇస్లాం చదువు) వున్నవాడు. భక్తి అంటే ఏమిటో నిజంగా అర్థమయిన వాడు.”
కానీ, చివరికి ఈ హోదాలేవీ అతను మిగుల్చుకోలేదు. అన్నిటిని విదుల్చుకుని వెళ్లిపోయాడు, ఆ చీకటి గదిలోకి!
అబ్బా చనిపోయాడని మునీర్ భాయ్ చెప్పినప్పుడు – నేను కాస్త సందిగ్ధంలో పడ్డాను, వెళ్లగలనా లేదా! వెళ్ళినా, దాదాపూ నా కుటుంబంలాంటి మునీర్ కుటుంబాన్ని చూడగలనా? ఎందుకో, ముస్తఫా చివరి చూపుకి వెళ్ళి రావాలని లోపల్లోపల అనిపించింది, కానీ, అంత కంటే ఎక్కువ మునీర్ భాయ్ తండ్రి పోయాడని, వాడిని కనీసం చూడాలని అనిపించింది. కానీ, మృత్యు ముఖాన్ని నేరుగా చూసే ధైర్యమేదో నా లోపల లేదు.
మునీర్ నా జీగ్రీ దోస్తు. చిన్నప్పుడు వూళ్ళో మా ఇళ్ళు దూరం అనే మాటే కానీ, రోజులో ఎక్కువ భాగం ఇద్దరం కలిసే వుండే వాళ్ళం, వొకటే క్లాసు కూడా కావడంతో కలిసే చదివే వాళ్ళం కూడా. ‘మీరిద్దరూ కవలలేమిట్రా?” అని అందరూ సరదాగా కాసేపు, కచ్చగా కాసేపు అనే వాళ్ళు. నేను వూరు మారాను కానీ, వాడితో స్నేహంలో ఏమీ మార్పు లేదు, కాకపోతే, ఇద్దరి మధ్యా ఇప్పుడు సమాచారం అంత వేగంగా బట్వాడా కావడం లేదు, అంతే!
ఒక సాయంత్రం నేను ముస్తఫా గది అరుగు చివరకు కూర్చొని, ఆ తెల్ల కర్టెను మెల్లిగా లాగుతున్నప్పుడు, మోమిన్ చూసింది, వెంటనే, “అమ్మీ,” అని వొక్క కేక వేసి, “అమ్మీ, అఫూ భాయ్ అబ్బాజాన్ గదిలోకి వెళ్తున్నాడమ్మీ?” అంది. లోపలేక్కడో వున్న ఫాతిమా ఫుప్మా వొక్క పరుగున వచ్చి నన్ను లాక్కుపోయింది. “వద్దురా బాబూ, వద్దు! మామయ్య చంపేస్తాడు చూస్తే..” అని సముదాయించింది.
నిజానికి వాళ్ళ ఇంట్లో నాకు ఎప్పుడూ ఎలాంటి నిషేధాలూ, ఆంక్షలూ లేవు. అట్లాంటిది ఆ మాట వొకటికి రెండు సార్లు విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అంతకంటే ఎక్కువగా, అది నా లోపల వొక కుతూహలాన్ని తవ్వుకుంటూ వెళ్లిపోయింది.
ఇంతకీ ఏం వుంది ఆ గదిలో? మునీర్ భాయిది చిన్న ఇల్లు, చాలా పాతకాలం ఇల్లు కూడా. అట్లాంటిది వొక గది వాళ్ళ అబ్బా జాన్ ముస్తఫా కోసం విడిగా వుంచడం వల్ల తూనీగ రెక్కల మా కాళ్ళకి సంకెళ్లు వేసినట్టయింది. మూడు గదుల ఇంట్లో వొక గది అట్లా ఇచ్చేస్తే, ఇక మిగిలేది రెండు గదులు. ఆ రెండు గదుల్లో అర డజను మంది వుండడం అంటే, వొకళ్లనొకళ్లు రాసుకుంటూ పూసుకుంటూ తిరగడం, కోపం వస్తే తిట్టుకోవడం..అంతే! మా ఆట పాటలు బంద్. మా దూకుడు బంద్. ఫలితంగా, మునీర్ భాయ్ తో పాటు నేనూ వాడి చెల్లెళ్ళు, తమ్ముళ్ళమంతా బయటికెళ్ళి చెట్ల కిందా, రోడ్ల మీదా ఆడుకునే అలవాటు పట్టడానికి చాలా కాలం అయ్యింది.
అప్పుడే మాకు బయటి ప్రపంచం కాస్త అర్ధమవ్వడం కూడా మొదలయ్యింది. ఈ బయటి ప్రపంచంలో ముస్తఫా బాబాగా మారడమూ అర్థమవుతోంది. చూస్తూ చూస్తూ వుండగానే, ముస్తఫా ఆ గదిలోకి పూర్తిగా బదిలీ అయిపోవడమూ, అదే అతని ప్రపంచపు తుదీ మొదలుగా మారడమూ జరిగిపోయాయి.
ముస్తఫా గది నాకు అంతుపట్టని మిస్టరీ. ఆ గది రహస్యం చేదించాలన్న వీరోచిత స్వప్నమేదో ఆ రోజుల్లో నన్ను నిద్రపోనిచ్చేది కాదు. పైగా, అందరూ ఆ గదిలోకి మా పిల్లల ఎంట్రీని నిషేధించేసరికి ఆ ఆసక్తి ఇంకా పెరుగుతూ పోయింది నాలో!
అదే సమయంలో గోరీమా మాకు ఖురాన్ పాఠాలు మొదలు పెట్టింది. పదకొండేళ్లు నిండేసరికి ఖురాన్ పూర్తి చేసేయ్యాలన్నది అక్కడ మా అన్ని ముస్లిం కుటుంబాలలో ఆనవాయితీ. అరబ్బీ మొదటి పుస్తకం “అలీఫ్ లామ్ మీమ్” అయిపోయిన వెంటనే, “బచ్చే, నువ్వు ఈ శుక్రవారం నమాజ్ తరవాత ఇంటికి రా. బెల్లం ఫాతెహా చదివించి నీకు ఖురాన్ షరీఫ్ షురూ చేస్తా” అని ముందే గోరీమా ప్రకటించెయ్యడంతో ఇంకో కొత్త ఉత్సాహం మనసులో-
మొదటి అరబ్బీ వాచకం చదివాక అరబ్బీ అంటే అల్లం మురబ్బా అయిపోయింది నాకు. ఓహ్, ఈ అల్లం మురబ్బా కథ కూడా వొకటి చెప్పాలి తరవాత- పొద్దున్నే చాయ్ కి ముందు మీరా సాయిబు అల్లం మురబ్బా తినకపోతే, మాకు తెల్లారినట్టే వుండేది కాదు. అసలు ఖురాన్ చదవడానికి ముందే, కొన్ని ఖురాన్ సూరాలు మా చేత బట్టీ కొట్టించింది గోరీమా. అరబ్బీ మురబ్బాలంత తేలికగా ఆ ఖురాన్ సూరాలు నోటి మీంచి ప్రవహించుకుంటూ వెళ్ళిపోయేవి. నిజానికి ప్రతి శుక్రవారం నమాజ్ లో మసీదులో మౌలానా నోటి వెంట అరబ్బీ వాక్యాలు వినడం కూడా బాగుండేది. జగ్ నే కీ రాత్ (జాగారం) చేసే రోజుల్లో కేవలం అతని కంఠస్వరంలో అరబ్బీ వినడం కోసం రాత్రంతా మసీదులో వుండేవాళ్లం.
కానీ, ఇవన్నీ చూస్తూ చూస్తూ వుండగానే అన్నీ మారిపోయాయి. ముస్తఫా గొంతు మారిపోయింది. తీరు మారిపోయింది. వొక కొత్త మనిషి అతని శరీరంలోంచి దూసుకుంటూ వచ్చినట్టనిపిస్తోంది.
మసీదు బయట ముస్తఫా నిర్మించిన కొత్త లోకంలో మాకు చోటు లేకుండా పోయింది, ఆ గదితో సహా.
“ఆ గదిలోకి మీరు వెళ్లకపోవడమే మంచిది రా! మీ సోబత్ పైనున్న అల్లాహ్ తోనే కానీ, కింద తిష్ట వేసిన ఈ షైతాన్ తో కాదు!” అని వొక రోజు పని కట్టుకుని గోరీమా చెప్పినప్పుడు, ఆ గదిలోకి వెళ్ళి తీరాల్సిందే అని ఖాయం చేసుకున్నాం మేం నలుగురయిదుగురం!



2
ఏముంది ఆ గదిలో?
ఇదే, ఇదే ... మా అన్వేషణ అప్పట్లో.
ఆ గదిలోని రహస్యాల శోధన కోసం అప్పటి మా చిన్ని ప్రపంచం వూహించగలిగిన అన్ని వూహా లోకాలూ చుట్టి వచ్చేవాళ్లం. ఆ తెల్లటి తెర తొలగించుకుని లోపలికి అడుగు పెడితే, ఏమేం చూడవచ్చు? ఫాతిమా అత్తయ్య ప్రతి రాత్రీ ఆ తెరని శుభ్రంగా కడిగి, ఉతికి, మళ్ళీ తెల్లారేటప్పటికి ఆ తెరని వేలాడదీసేది.
“ఎందుకు పుఫ్మా?’ అని దాదాపూ రోజూ అడిగే వాణ్ని.
“చాదస్తం చుట్టుకుంది రా...చాదస్తం...షైతాన్ నెత్తి మీద కూర్చుంటే, లోకం అంతా అష్టవంకర్లుగా కనిపిస్తుంది. అట్లుంది మీ మామయ్య వ్యవహారం?” అనేది.
మునీర్ నా కంటే రెండు మూడేళ్లు పెద్ద అయినా, వాడికి కూడా ఆ వ్యవహారం ఏదో అంత ఖరాగా అర్ధమయ్యేది కాదు. కానీ, వాడి మాటల్లో కూడా వొక రకమయిన అయిష్టత వినిపించేది. ఆ ఇంట్లో తలకొక ఆలోచన అన్నట్టుగా మారిపోయింది.
ఆ గది చుట్టూ మా ఆలోచనలు ఎంతగా కమ్ముకుని వుండేవంటే, చాలా కాలం పాటు ఆ గది నా కలల్లోకి వచ్చేది. ముస్తఫా స్వయంగా ఆ గదిలోకి మమ్మల్ని తీసుకు వెళ్ళి, అక్కడి వింత వింతలన్నీ చూపిస్తున్నట్టు, మేం కళ్ళప్పగించి వింటున్నట్టు, అక్కడి విచిత్ర వస్తు సముదాయాన్నంతా చేతులతో తాకి తాకి చూస్తున్నట్టు కలలు కనే వాళ్ళం, ఆ కలల్ని వొకరికొకరం చెప్పుకునే వాళ్ళం. మునీర్ భాయ్ అవన్నీ విని, “మీకు ఆ పిచ్చి బాగా పట్టుకుందిలే.. అస్సల ఆ గదిలో ఏమీ లేదురా బాబూ!’ అనే వాడు.
“నువ్వు లోపల చూశావా?”
“లేదు...ఎవరినీ లోపలికి రానివ్వడు అబ్బా,” అనే వాడు మునీర్.
“మరి, నీకేం తెలుసు?’
“ఏమీ తెలియదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు!” అనేసి అక్కడి నించి వెళ్లిపోయే వాడు మునీర్ భాయ్. గోరీమాని మొదటి సారి ఈ విషయం అడిగినప్పుడు, “ముస్తఫా కి జ్ఞానం మరీ ఎక్కువయి ఏడుస్తున్నాడురా! లేనిపోని ఆశలు, కోరికలు పెంచుకొని వట్టి వూహల్లో బతుకుతూ పోతున్నాడు. ఇట్లాంటి వాటిని అల్లాహ్ అస్సల క్షమించడు,” అని ఆ రోజు ఖురాన్ లో వున్న అల్-బఖ్రా సూరాలు మా చేత బట్టీ కొట్టించింది. అయితే, గోరీమాలో వున్న గొప్ప తనం ఏమిటంటే, కేవలం బట్టీ కొట్టించి, వూరుకోదు. వాటి అర్థాలు విడమర్చి చెప్తుంది. అయినా, ఆమె చెప్పిన అర్థాలకు మించిన అద్భుత లోకమేదో ఆ గదిలో వుందని మా నమ్మకం.
మాకు తెలియని, అస్సలు అర్థం కానిదేదో అక్కడ గుప్తనిధిలా వుందని అనిపించడం మొదలయ్యింది. అప్పుడే కాస్త కాస్త లోకం అర్థమవుతున్న మునీర్ భాయ్ కి ఈ సంగతులు కొంచెం స్పష్టంగా వున్నట్టున్నాయి, అతను పైకి చెప్పకపోయినా!
ఈ ఉత్కంఠలోంచి మేం తేరుకోక ముందే, ముస్తఫా ఇల్లు తీర్థక్షేత్రంగా మారింది. నెమ్మదిగా పదుల సంఖ్యలో మొదలయిన జనాలు కొద్ది కాలంలోనే వందల్లోకి చేరుకున్నారు. వొక రెండు నెలల తరవాత ముస్తఫా వాళ్ళు ఇప్పుడు వున్న ఇంటికి కొద్ది అడుగుల దూరంలో ఇంకో చిన్న గది కట్టించారు భక్తులెవరో! వొక తెల్లారుఝాము మేం లేచేసరికి, ముస్తఫా బాబా సామగ్రి అంతా ఆ గదిలోకి మారింది. ఆ కొత్త గది ఎదురుగుండా చెట్టు మీద ఆకుపచ్చ జెండా వొకటి రెపరెపలాడడం మొదలెట్టింది.
“ఇదేం పోయే కాలం!” అనుకుంటూ, ఫాతిమా అత్త ఆ రోజు నెత్తీ నోరూ కొట్టుకోవడం చూశాను నేను! “ముస్తఫా ఏం చేస్తున్నాడో వానికే తెలియదు,” అనేసి ఆ తరవాత ముస్తఫా విషయంలో ఇంకేం మాట్లాడినా అనవసరం అన్నట్టు మౌనంలోకి వెళ్లిపోయింది గోరీమా.
కానీ, నా లోపల మౌనానికి చోటు లేదు. వొక అవిశ్రాంత సముద్రమేదో ఘూర్ణిల్లుతున్నట్టు, కొన్ని నల్ల మబ్బుల గుంపులు శరవేగంగా కురవబోతునట్టు లోపల వొక అశాంతి. జరగకూడనిది ఏదో జరుగుతున్నట్టు, అది వూరిని ఉప్పెనలా ముంచేస్తున్నట్టు వొక అనిర్వచనీయ భయం.
ఇవన్నీ జరుగుతూండగానే, నాన్నగారికి ఇంకో వూరు బదిలీ అయింది. ఆ వూరికి దగ్గిరగానే వున్న పట్నం చేరుకున్నాం వో ఎండాకాలం! ఆ తరవాత వూరు కేవలం వొక జ్నాపకం, మునీర్ వొక చిన్ననాటి దోస్తు మాత్రమే. కానీ, ఆ గది మాత్రమే నా మనసు మూలల్లో వుండిపోయింది. ఆ గది తలుపు మీద వేలాడుతున్న తెల్లటి తెర, గది ముందు చెట్టు మీద పెద్ద జెండా అప్పుడప్పుడూ కళ్ల ముందు రెపరెపలాడడం మానలేదు.
ముస్తఫా బాబా గురించి అప్పుడప్పుడూ ఎవరి మాటల్లోనో వినడం మాత్రమే. ఎప్పుడయినా మునీర్ ఫోన్ చేస్తాడు, వూళ్ళో సంగతులు చెప్తాడు, తన తండ్రి గురించి తప్ప. తండ్రి పాత్రని క్రమంగా చెరిపివేయాలన్న వాడి ప్రయత్నం నేను వూళ్ళో వుండగానే కొంత చూశాను. మేం పట్నం వచ్చాక అతను అసలు తండ్రి వూసే ఎత్తకపోవడం చాలా సహజంగానే అనిపించేది నాకు, ఇతరుల నించి విన్న మాటల్ని బట్టి కూడా!
మునీర్ దృష్టిలో ఆ గది వొక శత్రువు.
వొక చీకటి గుహ.
అజ్ఞానమో, విపరీత జ్ఞానమో ముప్పిరిగొన్న అదేదో వొక వలయం.
ఇంతకూ ముస్తఫా ఆ గదిలో ఏం చేసేవాడు? వొకటి మాత్రం నిజం- ఆ గది వొక్కటే అతని బాహ్య అంతర్లోకాల మధ్య వాకిలి. ఆ తరవాత అతనికి కుటుంబం లేదు, బాధ్యతలు లేవు, మసీదు లేదు, ఇల్లు లేదు. భార్యా పిల్లలు ఎవరూ లేరు. తన కోసం వచ్చే భక్త జనం తప్ప. వాళ్ళు చేసే వ్రతాలూ పూజలు తప్ప. వాళ్ళ కోసం తను ఆ గదిలో దేవుడితో చేసే సంభాషణలు తప్ప!
ప్రతి సారీ భక్తులు రాగానే, వాళ్ళ విన్నపాలు విన్న వెంటనే, ముస్తఫా ఆ గదిలోకి తను వొక్కడే వెళ్ళి, వొక అర గంట తరవాత బయటికి ప్రత్యక్షమయ్యే వాడు. ఆ వ్యవధిలో ముస్తఫా బాబా గురించి రకరకాల కరామత్ కథలు భక్త జనాన్ని ఆవహించేవి.
ముస్తఫా కోసం భజనలూ పూజలూ రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలంలో గోరీమా ఎన్ని సార్లు హెచ్చరింఛిందో తెలియదు, “ముస్తఫా, ఆఖరి రోజున దేవుడి దగ్గిర సమాధానం చెప్పుకోవడానికి నీ దగ్గిర వొక్క వాక్యం కూడా వుండదు. నువ్వు చేస్తున్నది తప్పు. అది ఏ ఇస్లాంలోనూ ఎవరూ చెప్పలేదు. నువ్వు తరగని పాపం మూటగట్టుకుంటున్నావ్?” అని.
కానీ, ముస్తఫా వింటే కదా! కానీ, వొక్కటే మంచి విషయం ఏమిటంటే, ముస్తఫా డబ్బు మనిషి కాదు. అతను తను చేస్తున్న పని నిజంగా ఆధ్యాత్మికంగా వున్నతమయిందనీ, పవిత్రమయిందనే భావనలోనే వున్నాడు.
అది ఇంకో రకంగా కుటుంబానికి నష్టం. ముస్తఫా బాబాగా రూపాంతరం అయ్యాక కుటుంబభారం అంతా అతని తలపైన వొక్కసారిగా పడింది. అంత పెద్ద కుటుంబం మోయలేక అస్తవ్యస్తమవుతూ, మునీర్ నరక యాతనలో పడ్డాడు. మొత్తంగా కుటుంబం అంతా ముస్తఫా దారిని అసహ్యించుకునే పరిస్తితి కూడా వచ్చేసింది. “అసలు ఇబాదత్ (భక్తి) అంటే ఏమిటి? కుటుంబాన్ని దిక్కు లేకుండా చెయ్యడమా?” అని గోరీమా వొకటికి పది సార్లు ముస్తఫాకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, కానీ, “ఇప్పటికీ ఇదే నా దారి. నా దారిన నన్ను వెళ్లనివ్వండి,” అంటూ తన గదిలోకి నిష్క్రమించే వాడు ముస్తఫా.
ఆ గదిలోకి అంతర్ధానం కాక ముందు ముస్తఫా అయిదు పూటలా నమాజ్ చదివే వాడు. అతని నుదుటి మీద ఆ నల్ల మచ్చ దేవుడి సంతకంలా వుండేది, అతని నిష్టకి గుర్తుగా.
రంజాన్ నెల వచ్చిందంటే మసీదులో ముస్తఫా ప్రసంగం కోసం ఎదురుచూస్తూ వుండే వాళ్ళం. అతని స్వరంలో ఆ ఖురాన్ సూరాలు వీనుల విందుగా వుండేవి. ఖురాన్ చదవని బతుకేం బతుకు అనిపించేది. గోరీమాకి కూడా ఆ రోజుల్లో ముస్తఫా అంటే గొప్ప గురి. ఇక వూళ్ళో ముస్తఫా మాటకి తిరుగు లేదు. వున్నట్టుండి, ముస్తఫా వొక తీవ్ర ఆధ్యాత్మిక చింతనలో పడిపోయి, కొన్ని సార్లు కాలం అనే స్పృహ లేకుండా, బతకడం మొదలెట్టాడు. అదే అతని మార్గంగా స్థిరపడిపోయింది ఆ తరవాత – “ముస్తఫా వొక మూర్ఖమయిన దారిలో అదే భక్తి అనుకోని దారి తప్పిపోయాడు. ఇక మనం చెయ్యగలిగేదేమీ లేదు!” అని గోరీమా వో రోజు అంది కూడా. కానీ, ఈ దారిలో ముస్తఫా చేస్తున్నదేమిటో నాకు ఏ నాడూ బోధపడలేదు.
ఆ గదిలో ముస్తఫా వొక విధంగా తనని తాను సజీవ సమాధి చేసుకుంటున్నాడా అని కూడా అనిపించింది.
కానీ, ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కునే వీలు లేకుండా మేము వూరు మారిపోయాం, అప్పుడప్పుడూ మునీర్ కబుర్లు అతని ఫోన్ ద్వారానో, వేరే స్నేహితుల ద్వారానో అక్కడి సంగతులు తెలియడం తప్ప.
ఫోన్ లో మాట్లాడిన వొకటి రెండు ముక్కల్ని బట్టి మునీర్ భాయిని అర్థం చేసుకోవడం కష్టమే. ఇప్పుడు ఆ తండ్రి మరణాన్ని మునీర్ ఎట్లా అర్థం చేసుకున్నాడో నాకు ఇంకా సందిగ్ధం గానే వుంది. ముస్తఫా రహస్య గది గురించి వున్న సందిగ్ధంలాంటిదే ఇది కూడా!
నేను బస్సు దిగేసరికి మునీర్ నా కోసం బస్ స్టాపు దగ్గిర ఎదురుచూస్తూ నిలబడి వున్నాడు.


3
ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. ఇంకా నా మనసు నిండా ఆ గది వొక్కటే ఆవహించి వున్న మాట నిజం.
“ఇక్కడ చాయ్ తాగి పోదాం” అని తనే అన్నాడు.
బస్ స్టాప్ దగ్గిర టీ కొట్టులో రాజు నన్ను గుర్తు పట్టి, “ఎట్లున్నవ్ సారూ?” అని అడిగాడు.
“మంచిగే!” అని టీ తీసుకొని, నేనూ, మునీర్ చెట్టు కింద నిలబడి టీ తాగాం. టీ తాగుతున్నంతసేపూ మునీర్ మా ఇంటి విషయాలు అడిగి తెలుసుకున్నాడు తప్ప తన ఇంటి విషయాలేమీ చెప్పలేదు. నాకు కూడా వెంటనే అడగాలని అనిపించలేదు. నడుస్తూన్నప్పుడు అడుగుదాంలే అనుకున్నా.
మునీర్ అసలే మౌని. ఇప్పుడు ఇంకా ఘోర మౌనిగా మారినట్టు వాడి తీరుని బట్టి అర్థమయింది. మనిషి ముఖం బాగా అలసిపోయినట్టు పీక్కుపోయి వుంది. తలలో సగం వెంట్రుకలు నెరిసిపోయాయి. శరీరం బలహీనంగా వుంది. అన్ని విధాలుగా అలసిపోయాడా అనిపించింది. ముస్తఫా బాబాగా మారి, మనిషిగా ఎంత విఫలమయ్యాడో ప్రత్యక్ష సాక్ష్యంగా వున్నాడు మునీర్. కుటుంబం బరువు మోసీ మోసీ మునీర్ వీపు నిజంగానే బాగా వంగిపోయినట్టుగా అనిపించింది.
ముస్తఫా మరణం గురించి ఎక్కడ మొదలెడదామా అనుకుంటూ వుండగానే, వాళ్ళ ఇంటి దాకా వచ్చేశాం. ఫాతిమా అత్త, మునీర్ తమ్ముళ్లూ చెల్లెళ్లూ నన్ను చూడగానే కాస్త సంతోషం వ్యక్తం చేశారు.
గోరీమా కూడా అక్కడే వుంది. నన్ను చూడగానే దగ్గిరకి తీసుకుని నా తల నిమిరింది. చాలా కాలం తరవాత గోరీమాని చూడడం నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. ఆమె మొహంలో అదే ప్రశాంతత.
నేను ముందు వసారాలో కూర్చొని వున్నా, ఆ ముందు ముస్తఫా గది కోసం వెతుకుతూ.
మధ్యాన్నం ఆ పదోరోజు ఆచారాలన్నీ ముగిశాక, వున్న కొద్ది మంది చుట్టాలూ వెళ్లిపోయాక, కాసేపు కుర్చీలోనే వో కునుకు తీశాడు మునీర్.
అట్లా కునుకు తీస్తున్న మునీర్ ముఖంలోకి చూస్తూ వుండి పోయాను.
అతనిలో వొక అశాంతీ వుంది, వొక ప్రశాంతతా వుంది.
అతని మొహంలో వొక విషాదమూ వుంది, అదే ముఖమ్మీద వొక ఉపశమన రేఖ కూడా సన్నగా కదులుతోంది.
నాకు కర్బలా యోధుడిలా కనిపిస్తాడు మునీర్ వొక్కో సారి! ఆ యుద్ధ క్షేత్రంలో కనీసం కొంత మంది అయినా మిగిలారు అప్పటి యోధులకు - కానీ, ఈ కర్బలా మైదానంలో అతనెప్పుడూ వొంటరి యోధుడే అనిపిస్తాడు. ఎన్ని యుద్ధాలు కలిస్తే వొక జీవితం! ఆధ్యాత్మికత గొప్ప శాంతి కావచ్చు, గొప్ప యుద్ధమూ కావచ్చు.
కానీ, జీవితం మాత్రం అనేక యుద్ధాల గందరగోళమే! అన్ని యుద్ధాలు చెయ్యలేకనే, ఆధ్యాత్మికత అనే వొకే వొక్క యుద్ధంలో మునిగిపోయాడా ముస్తఫా? ఏమో? ముస్తఫా యుద్ధం ఏమిటో నాకు తెలియదు. మునీర్ కీ తెలియదు, గోరీమాని అడిగితే వొక సారి “ఆధ్యాత్మికత అనేది మైదానం లాంటిది. దిగంతం కనిపించాలి. పైన ఆకాశమూ కింద నేలా కనిపించాలి. అంతే కానీ, అది ఇరుకు గది కాదు,” అని వొక వాక్యంలో తేల్చేసింది. అవునా? అల్లా ఏడు ఆకాశాలు అన్నాడే కానీ, ఏడు నేలలు అని ఎక్కడయినా అన్నాడా? తెలియదు. చాలా విషయాలు తెలియవు.
ముస్తఫా వొక తేలికపాటి స్వర్గాన్ని ఇక్కడ జనం కోసం నిర్మించి పెట్టాడు. ఆ కొద్ది పాటి స్వర్గమే చాలు అనుకుని, ముస్తఫా లోనే ఆ దేవుడినీ వూహించుకున్నారు జనం! కానీ, తన వాళ్ళందరికీ ముస్తఫా కేవలం షైతాన్! ఈ తేడా ఎక్కడుంది? నా ఆలోచనల్ని తెంపుతూ, “అలా బయటికెళ్దామా కాసేపు?” అన్నాడు మునీర్ అప్పుడే కన్ను తెరుస్తూ.
“చాయ్ తాగి పోరాదా?” అని మేం సరే అనేలోపే రెండు గ్లాసులు మా ముందు పెట్టింది ఫాతిమా అత్తయ్య.
ఆమె కళ్ళు ఎప్పుడూ ప్రశాంతమయిన రెండు నదులు. కానీ, ఆ నదిలో రాయి విసిరితే, ఆ రాయిని కడుపులోకి లాక్కు వెళ్తుంది ఆ నది. కానీ, వొక్కటంటే వొక్క చిన్నవలయం కూడా కనిపించదు. ఏ స్థితినయినా వొకే వొక్క నిర్మమకారంతో స్వీకరించే నిరాడంబరమయిన నిర్మలమయిన కళ్ళు ఆమెవి.
అన్నేళ్లు తనతో కలిసి వుండి, ఇంత మంది పిల్లలకు కలిసి జన్మ ఇచ్చిన భర్త శరీరం చల్లబడిపోయిన క్షణాన ఆమె ఎలా వుండింది? అందరిలా గుండెలు పగిలిపోయేలా, నేలకి చేతులు బాదుకొనీ బాదుకొనీ ఏడుస్తూ వుండిపోయిందా? అలా జరిగి వుండకపోవచ్చు. ఆమె వొక మూలలో ఆరిపోయిన దీపంలా ముడుచుకు కూర్చోనిందా? ఏమో..అలా కూడా వూహించలేను. ఇంకెలానూ, ఎలానూ వూహించలేను!?
మునీర్ చాయ్ కానిచ్చేసి, “పద బయటికెళ్దాం,” అన్నాడు.
“ఒరేయ్, అడుగుదాం అనుకుంటూ, నువ్వేం అనుకుంటావో అని సందేహిస్తున్నా. అబ్బా మరణం గురించి బయటి జనాలకి చెప్పలేదా?”
“వూళ్ళో తెలుసు. బయట వూళ్లలో తెలియదు. కావాలనే చెప్పలేదు.”
“ఎందుకు?”
“ఇదంతా మాకిష్టం లేదు. నీకు తెలుసుగా. నేను, అమ్మా, గోరీమా మొదటి నుంచీ వీటన్నిటికి దూరమే.”
“అవును, నాకు తెలుసనుకో. ఫుప్మాకి అస్సలు ఇష్టం లేదు ఈ దారి.”
“అసలు ఇది దారి కూడా కాదు నన్నడిగితే! వొక దారి మళ్లింపు. దేవుడు వొక ముసుగు. భక్తి వొక వంచన!”
“అర్థమయ్యింది. కానీ, ఆ మనిషి పోయినప్పుడు ఆ విషయం అనవసరం కదా!”
“ఎందుకో...ఇదంతా మా లోపల చాలా అసహనాన్ని కలిగించింది. కొన్నేళ్ళ నివురు పేరుకుపోయిన నిప్పు. తట్టుకోలేని స్థితి కూడా వచ్చేసింది.”
అంత కంటే ఎక్కువగా వాడి చేత మాట్లాడించడం నాకు ఇష్టం లేకపోయింది. నిజానికి, ఈ విషయంలో వాళ్ళంతా ఎలా ఫీలవుతున్నారో నాకు తెలియని విషయం అయితే కాదు కదా!
“మరి, ఆ గది?”
“చూస్తావా? చూపిస్తా. పద!”


అంటూ, ఆ గది వున్న చోటుకీ, ఆ జెండా చెట్టు దగ్గిరకీ తీసుకువెళ్లాడు. అక్కడ గది లేదన్న విషయం నేను వచ్చిన మరుక్షణమే గుర్తించాను. కానీ, ఏమయినా పొరపడ్డానేమో అనుకుని వెంటనే ఏమీ అడగలేదు.
“ఇదే గది వున్న చోటు.” అని చూపించాడు. ఆ చూపించిన చోటున గతంలో వొక గది వున్న జాడ కనీసంగా అయినా లేదు. అంతా చదునుగా వుంది. “అది కూలగొట్టాం, అబ్బా పోయిన మర్నాడే!” అన్నాడు మునీర్.
“అవునా? అంత వెంటనేనా?”
“అవును. దానికి ఏ రకమయిన కొనసాగింపూ మాకు ఇష్టం లేకపోయింది. ఆ కథ అక్కడితో ముగించడం లోకానికి, మాకూ మంచిదని అనుకున్నాం.” అన్నాడు చాలా స్పష్టంగా మునీర్.
నేను అక్కడే వున్న వొక రాయి మీద కూర్చొని, కాసేపు ఆ గది వున్నట్టే వూహించుకున్నాను. నన్ను చిన్నప్పటి నించీ వెంటాడిన ఆ గది ఇప్పటికీ నాకు ఊహ! అంతే! ఆ కనిపించని గది చుట్టూరా ముస్తఫా నీడ ఏదో తారట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు.
“సర్లే...ఇక వెళ్దాం పద!” అన్నాడు మునీర్ చాలా మామూలుగా, నా ఆలోచనల్లో ఆ గది ఇంకా నిలబడే వుందన్న విషయం గుర్తించి కూడా గుర్తించనట్టు.
“ఆ గది ఎప్పటికీ నాకు చీకటి గుహ. దేవుడు వున్నాడని నేను గట్టిగా నమ్ముతాను, కానీ ఈ చీకటి గదుల్లోనో, విచిత్ర శక్తుల్లోనో, గుహల్లోనో వున్నాడని ఎవరు చెప్పినా నేను నమ్మను. దాన్ని కూల్చినప్పుడు నాకు ఆ చీకటి నించి విముక్తి దొరికింది,” అన్నాడు మునీర్ బయటికి వస్తూ.
“ఓ, ఈ కథ ఇలా ముగిసిందా?” అన్నాను పైకే.
“అవును, కొన్ని కథలకు మనమే బలవంతంగా ముగింపు ఇవ్వాలి,” అన్న మునీర్ వాక్యం ఆ రోజు నన్ను నిద్రపోనివ్వలేదు!
*

Saturday, January 28, 2012

చాన్నాళ్ల తరవాత వొక కథ.."ముస్తఫా మరణం"

"ఇది చదివాకే నాకనిపిస్తున్నాది మీరో కథ రాస్తే చదవాలని. ఇంతమంది సాహిత్యవేత్తలతో పరిచయం ఉంది. వారి ప్రభావమూ మీ పై ఉంటుంది. మీరు కథ రాస్తే ఎలా రాస్తారో, ఏ పంధాలో ఉంటుందో, ఎలాంటి ఆలోచనలను చర్చిస్తారో తెలుసుకోవాలని ఉంది. ఆ ఆశలు ఫలిస్తాయంటారా?"

రెండు మూడు వారాల కిందట ఆలమూరు సౌమ్య రాసిన వ్యాఖ్య అది.
సౌమ్యకి దివ్య దృష్టి వుందని నాకు అనుమానం.

అంతకు ముందు వారమే నేనొక కథ రాసి, ఆంధ్రజ్యోతికి పంపాను. ఆ విషయాన్ని క్రాంతదర్శి అయిన సౌమ్య ముందే పసిగట్టేసిందా?ఏమో?! ఇదిగో మొత్తానికి ఆ కథ "ముస్తఫా మరణం" ఇక్కడ...

కథ రాయడంలో కవిత్వానికి మించిన ఆనందం ఏదో వుంది! ఈ కథ చదివితే మీకూ అట్లా అనిపిస్తుందా? అనిపించినా అనిపించకపోయినా మీరేమనుకున్నారో తప్పక రాయండి.

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2012/01/29/index.shtml

Wednesday, January 25, 2012

నువ్వొచ్చేటప్పుడు....!




ఎటు నించి ఎప్పుడొస్తావో
తెలీదు గాని
నువ్వొచ్చేటప్పుడు
కాసింత నిశ్శబ్దాన్ని పట్రా...


వొక నిరామయ నిరాలోచననీ పట్రా...

1

సతమతమయి వున్న గదిలో గాలినీ వెలుతురినీ నులిమేసిన ఇరుకు గోడల్లో లోపలంతా ఇంకిపోయిన ఎడారిలో


2

రాలినపూల వొంటి మీద వూరేగుతున్న శబ్దాల రెపరెపల్లో నిప్పు పూలు పూసిన కన్రెప్పల్లో కాయలై కాసిన చూపుల్లో

3

కలల్ని నిద్రపోనివ్వని కళ్ళల్లో నీడల్ని నెమరేసే నీళ్ళల్లో

4

ఎటు నించి ఎప్పుడొస్తావో కానీ,

నువ్వొచ్చేటప్పుడు

చింతాకంత నిశ్శబ్దం
ఎంతో కొంత మౌనం!

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...