యుద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, మనసుకి మధ్య ఘర్షణ జరిగితే ? మనిషి ఎటుపోవాలి ? దేనితో యుద్ధం చేయాలి? అదిగో సరిగ్గా అలాంటి మీమాంసతో యుద్ధ భూమిలో నువ్వు, నేను, వాళ్ళు, వీళ్ళు అందరం చిక్కబడి ఉన్నామిప్పుడు అంటారు కవి. యుద్ధం ఎక్కడో జరుగుతోంది, మనమిక్కడ శాంతిగా ఉన్నాం అనుకుంటూ భ్రమల్లో బతుకుతూ, కళ్ళ ముందు రగులుతున్న మంటలను చూస్తూ కూడా నిద్రని నటిస్తూ, శాంతిని కల కంటున్నాము అనుకుంటూ, రణరంగంలాంటి మనసుతో ఎటువైపు అడుగేయాలో తెలియక అనుక్షణం మనిషి తనతో తానే ఘర్షణ పడుతున్నాడు. నిరంతరం తన మనసుతో తానే తలపడి యుద్ధం చేస్తున్నాడు. కార్చిచ్చు లాంటి ఆ యుద్దాగ్ని జ్వాలలు మన కాళ్ళ కింది నేలమీదికి వచ్చేలోగా మత్తులాంటి నిద్ర నుంచి మేలుకోవాలి అని హెచ్చరిస్తున్నాడు కవి ఇక్కడ.
Tuesday, May 19, 2026
యుద్ధంలో నువ్వూ నేనూ మనం
అఫ్సర్ ఆంగ్లంలో రాసిన "ఉపవాస పద్యాలు" తెలుగులోకి శ్రీనివాస్ గౌడ్ అనువదించారు. ఆ పద్యాల్లో ఓ చోట "ఇఫ్తార్ లేదా సహార్ ఏదో ఒక విందులో పళ్ళెం చేతులోకి తీసుకుని ఓ ఖర్జురమ్ పండుని నోట్లో పెట్టుకోబోతాను. ఆ క్షణంలోనే యుద్ధ శరణార్థ శిబిరాల్లో అవయవాలు తెగి, నెత్తుటి గాయాలతో ఆర్తనాదాలు చేసే వేలమందో, వందల మందో తిన్నారో లేదో అనిపిస్తుంది. కన్నవాళ్ళను కోల్పోయి అనాథలైన ఎంత మంది చిన్నారులు ఆకలికి అలమటిస్తున్నారో అని తలపుకు వస్తే చాలు, నోట్లో పెట్టుకున్న ఖర్జురమ్ పండు చేదుగా అనిపిస్తుంది" అంటారు. పుట్టిన గడ్డ మీద కూడా పరాయితనాన్ని అంటగట్టే ఆటవిక శక్తులతో నిరంతరం పోరాడాల్సిందే అని కూడా అంటారు. ఆ ఆవేదనకు కొనసాగింపుగా ఈ "యుద్ధం మధ్యలో నువ్వు" అనే శీర్షికతో వచ్చిన కవిత్వ సంపుటిలో యుద్ధం మనుషుల మధ్యనే కాదు, ఇప్పుడు మనిషి బతికి బట్టకట్టాలంటే చాల రకాల యుద్దాలు చేయాలి, కంటికి కనిపించని అరాచక శక్తులతో కూడా పోరాటం జరపాల్సిందే అంటారు. ఈ సంపుటిలో కొన్ని కరోనా కాలంలో రాసిన కవితలు కూడా ఉన్నాయి.
మరికొన్ని కవితల్లా అనిపించని అంతఃసంఘర్షణలు, ఆవేదనలు, ఆరాటాలు, మనుగడ కోసం, శాంతి కోసం మనస్సనే యుద్ధ భూమిలో అప్పటికప్పుడు అనుభవించిన సంవేదనలకు అక్షర రూపం కల్పించి చిత్తశాంతిని పొందడానికి కొన్ని కవితలు రాశారు అనిపిస్తుంది. వచనాలు పారాగ్రాఫిక్స్ శైలిలో మనల్ని పలకరిస్తాయి. కొమ్మ, రెమ్మ కూడా కదలని ఓ నిశ్శబ్దపు వేసవి మధ్యాన్నం, రెప్పవాలని ఓ నిశిరాత్రి హృదయాన్ని మెలితిప్పిన ఏ సంఘటనకో మనసులో ఉత్పన్నం అయిన వేదనకి వచనాక్షరాలు తోడై తెల్లటి పుస్తక క్షేత్రంలో నల్లటి అక్షర విత్తనాలను చల్లుకుంటూ పోయే అక్షర కృషీవలుడు ఈ "యుద్ధం మధ్యలో నువ్వు" సంపుటిలో కనిపిస్తాడు. సమానత్వం, ప్రేమ, స్నేహం, అస్తిత్వం, ప్రార్ధన, వేదన, దురాక్రమణ దారులపై ఝుళిపించిన కత్తి మొన, యుద్దభూముల్లో పారిన రక్తం సాక్షిగా, మనో భూమిలో ప్రవహించే కన్నీటి నదుల సాక్షిగా నా కవిత్వం మానవత్వం అంటారు. అంతే కాదు. ప్రకృతిలోని ప్రతి చిన్న అంశాన్ని ప్రేమ నిండిన హృదయంతో స్పృశిస్తూ, ఆరాధనని, ఆవేదనని, మమతానుబంధాల్లోని మార్మికతని కూడా కవితాత్మకంగా మనముందు ఉంచారు కవి. ఈ సంపుటిలో మనం మూడు విభాగాల్లో కవితల్ని దర్శించవచ్చు. మొదటి విభాగానికి "కత్తి అంచు మీద నిలబడి", రెండో విభాగంలో "ఆరు కాలాలు మాయమైన చోట", మూడో విభాగంలో పంజరాల్ని ఓడించినప్పుడు" అనే శీర్షికలతో రాశారు.
"-Being a good friend means listening" ఒక్క క్షణం, తమ ఒక్క మాటని, ఆవేదనని వినేవాళ్ళు ఒక్కరు ఉన్నా, ఆ ఉన్నవాళ్ళు హృదయ సంపన్నులు అయితే, ఎంతో మంది ఆత్మీయుల బలవన్మరణాలను ఆపవచ్చు. కానీ వినేవారేరి..? అంటూ బాధగా రాసారు "తెరవెనుక" అనే కవిత వచనాత్మకమైన చోట.
"దారిలో ఎవరో ఎదురొస్తారని - నువ్వు నడక మొదలుపెట్టలేదుగా - నొప్పించే రాళ్ళ సమూహాలు - అడుగడుక్కీ నీకేం కొత్త కూడా కాదుగా!" అంటారు "అయిదు నొప్పించే పద్యాలు" కవితలో. మన ప్రయాణం ఒంటరిదైనా, గమ్యం తెలియనిదైనా, దారి నిండా ముళ్ళు , రాళ్ళూ నడక వేగాన్ని నియంత్రించినా, ప్రయాణాన్ని మాత్రం ఆపకూడదు. అగాధపు జలనిధుల్లో ఆణిముత్యాలు, పగడపు దీవులు ఎదురైనట్లు, పయనపు దారుల్లో నీ వెనుక ఇంకో నాలుగడుగులు తోడవ్వచ్చు. వెలుగు దీపాల్లాంటి ప్రేమ మూర్తులు ఎదురురావచ్చు. మొదలు పెట్టిన ప్రయాణంలో ఎన్నడూ వెనుకడుగు వేయకూడదు" అంటూ ఆశావహ దృక్ఫథంతో ముందుకు పొమ్మంటారు.
"ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయని అనుకుంటూ - ఇక్కడేదో శాంతిలాంటిదేదో ఉంది కదా అని చల్లటి స్పర్శలాగా ఉంటావు కానీ, నువ్వొక రణరంగమైన పెనుమంట అని పొరపాటున కూడా అనుకోవు కదా!". "యుద్ధం మధ్యలో నువ్వు" అనే వచన కవిత్వంలో. యుద్ధం ఎక్కడో జరగడంలేదు. దురాగతాలను, అన్యాయాలను చూసిన చోట నీ మనసే ఒక రణరంగం. నీ అంతరంగం నిండా రగులుతున్న ఆవేదనకు పోరాటపు పదును పెట్టి, బలహీనమైన పక్షం వైపు నీ అడుగులు పడితే, అప్పుడు యుద్ధం మధ్యలో నిలబడ్డ చైతన్యపు శతఘ్నివి నువ్వే అవుతావు అంటారు కవి.
"అన్నం మెతుకులకు కరువుంటుంది - గుక్కెడు నీటికీ కరువే - మనిషికీ మనిషికీ మధ్య మరఫిరంగులు మాత్రం దర్జాగానే తిరుగుతూనే ఉంటాయి - ఇంకా రాబోయే యుద్ధాలకు ఏదో ఒక Reminder అందుతూనే ఉంటుంది" మనుషుల మధ్య ప్రేమ కరువై, ఎల్లెడలా ద్వేషం రాజ్యమేలుతోంది. జాతులు, కులమతాలు, ప్రాంతాలు, రంగు, రూపురేఖలు అన్నీ మనిషిలోని మనిషిని, మానవతాన్ని హత్య చేసి, అసూయ, పగ, విద్వేషాన్ని రగిల్చి ఒకరి పొడ ఒకరు ఒప్పక యుద్ధాలకు కాలుదువ్వుతుంటే, యుద్ధం మిగిల్చిన శకలాలుగా గాయాలతో, ఆకలిదప్పులతో అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాల్లా రెపరెపలాడుతుంటే చలించని మానవ మరఫిరంగులు మాత్రం మరో యుద్దానికి సన్నద్ధమవుతూ ఉంటారు" అని ఆవేదననంతా అక్షరాల్లో పొదిగారు Reminder అనే కవితలో.
"చెప్పడానికి చాల ఉన్నప్పుడు - పెదాల్ని కుట్టేసేవాళ్ళు పుట్టుకొస్తారు" అన్యాయాలను ఎదిరించడానికి ఎత్తిన చేయిని నరికేవాళ్ళు, నాలుగు శాంతివచనాలను ప్రవచించాలని నోరుతెరిచిన వాళ్ళ నాలుకను తెగొట్టే వాళ్ళు, నవ సమాజ నిర్మాణానికి నడుంకట్టే వాళ్ళని పంజరాల్లొ బంధించేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. అయినా సమానత్వ పురోగమన బాటలో నేను వెలుతురు వైపుకే నడుస్తాను" అని తన దృఢ నిశ్చయాన్ని తెలియచేసారు కవి "పంజరంలోని పాటలు" కవితలో.
"తల మీద కాస్త ఆకాశం ఉంది - కాళ్ళ కింద ఇంకొంచం నేల మిగిలే ఉంది - గుండెలో తడిని ఇంకా ఏ ఎడారో కావిలించుకోలేదు - పెదవి మీది మాటని ఇంకెవరూ తుంచుకెళ్ళలేదు - కాబట్టి - కాసింత ప్రశాంతంగానే నిద్రమబ్బుల్ని ఈ రోజు తరిమేస్తాను - నీదైన వెలుగులోకి సరాసరి నడిచే వస్తాను" జీవితం నిండా ఆవరించుకున్న ఎన్నో ప్రేమలు, నమ్మకాలు, సంతోషాలు, సమాగమాలు, ఎందరో ఆప్తుల నిష్క్రమణలు ఎన్నింటినో చూసి ఉంటాడు కవి. అట్లే మనసుని మెలిపెట్టే విధ్వంసాలు, యుద్ధాలు, గాయాలు, రోదనలు, వేదనలు, పురిటి గడ్డ మీద ఉనికి కోసం ప్రాణాలను పణంగా పెట్టి జరిపే పోరాటాలను కూడా చూసి ఉంటాము అందరం ఏదో ఒక చోట. అన్నీ జరిగిపోయాయి, ఇంకేం మిగల్లేదు. సూన్యం తప్ప. చుట్టూ చీకటే ఆవరించి ఉంది అనుకున్న చోట కూడా ఓ వెలుగు రేఖ ఏ దిక్కు నుంచో ప్రసరించవచ్చు. మనిషి దారెప్పుడూ వెలుగు వైపే ఉండాలి అన్న ఆశాభావం వెలిబుచ్చారు "ఆఖరి పంక్తి మీద" అనే కవితలో.
సూర్యుడు, కవి ఎప్పుడూ కునుకు తీయరు. ఓ చోట నిలబడిపోరు. సూర్యుడు నిరంతరం భ్రమణం చెందుతూ విశ్వానికి వెలుగులు పంచితే, కవి మనుషుల హృదయాల నిండా జ్ఞానజ్యోతులను వెలిగిస్తూ ఉంటాడు అనుక్షణం దారిదీపమై పయనిస్తూ. కవులు అఫ్సర్ మోహమూద్ కూడా అక్షరయోధుడిలా యుద్దాలు లేని నేల కోసం, ఘర్షణ పడని మనసుల కోసం మనుషుల మధ్య నిలబడి శాంతి శతఘ్నిలా ప్రేమ కవితా పుష్పాలను జల్లులుగా నిరంతరం కురిపించాలని, తన కవితలను మానవత్వపు దూతలుగా పంపి, ప్రపంచం నలుమూలలా విశ్వశాంతిని, ప్రేమను వ్యాపింపచేయాలని కోరుకుంటూ..
- రోహిణి వంజారి
Subscribe to:
Post Comments (Atom)
యుద్ధంలో నువ్వూ నేనూ మనం
యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...
-
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ- 1 మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే! ...
-
ఈ వారం టెక్సాస్ టెంపుల్ లో తెలుగు సాహిత్య సదస్సు జరగబోతోంది. సాధారణంగా టెక్సాస్ లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా అది వొక పెద్ద పండగ, వొక ...
-
నాన్నని ఆకాశంలో సమాధి చేశాను అప్పటి నించీ, పక్షులు ఆయన తల దువ్వుతున్నాయి స్నానం చేయిస్తున్నాయి ప్రతి రాత్రీ దుప్పటిని ఆయన గడ్డం దాకా కప్పి న...
No comments:
Post a Comment