"ఊరి చివరి" సూఫీ పాట!



(ఈ ప్రస్తావన avkf.org నించి. ప్రచురణకు అనుమతించిన అప్పాజోశ్యుల సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు)
http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=1696

ఒక వీరశైవ, ధీర సూఫీ అర్ధనారీ"స్వరం" : నీలం మాయ

అయిల సైదాచారి మనకు కొత్త కాదు. అతని కవిత్వం ఇంతకు ముందే మనకు తెలుసు. అందరికీ తెలిసిన అందరూ మరచి పోవాలనుకునే వొక అనుదిన నేపథ్యం నించి సైదా చారి కవిత్వ అనుభవ మంటపంలోకి ప్రవేశించాడు. అతని కవిత్వం మొదటి సారి చదివినప్పుడు ఇది వొక భిన్నమయిన భాష అని మనకి వెంటనే అనుభవమవుతుంది. కాని, ఆ అనుభవం మనల్ని అంత తేలికగా వూపిరదనివ్వాడు. మనలోని నిబ్బరత్వాన్ని కాసేపు కల్లోలితం చేసి, అసహనానికి లిపి వెతుక్కున్నేలా చేస్తాడు. ఎంత దూరం, ఎంత లోతుల్లోకి వచ్చామనుకున్నా, తెలుగు కవిత్వం ఇంకా అనుభవాన్ని నిఖార్సుగా చెప్పుకునే స్థాయికి అయితే రాలేదు. కవిత్వాన్ని గురించి ఇంకా చాలా స్థిర నిశ్చితాలు వున్నాయి మనకి. కవిత్వం లలిత పద పల్లవ కోమలంగా వుండాలన్న అదృశ్య సంకెల ఇంకా తెగిపోలేదు. అంత లలితంగా నేను మాట్లాడలేను అని వెర్రి కేక అయినా వేసే కవులు లేకుండా పోతున్నారన్న నిరాశలో పడ్డప్పుడు సైదా చారి 'డూ డూ బసవన్న' లా కాకుండా సై సై రా రా బసవన్న అంటూ కొత్త రంకె వేస్తున్నాడు. ఇతని గొంతులో దూరం నించి ఎక్కడో ఆ వీర శైవ బసవన్న నాకు కనిపిస్తూనే వున్నాడు. ఆ పద చిత్రాలలోంచి అందుకే కన్నడ వచన కవుల అనుభవ మంటపంలోకి మనల్నితోసుకు తీసుకు పోతున్నాడు సైదా.

సైదా చారి అంటే వొక నెమ్మదయిన జ్ఞాపకం. నేను యూనివర్సిటీ మెట్లు ఎక్కి ఎమ్మే చదవాలి అని జ్వర తీవ్రతలాంటి వేదనతో కాలిపోతూ, ఆర్ధిక కారణాల వలన చదవలేక పత్రికా వుద్యోగంలోకి కలల్ని కుదించుకుని, మిత్రుల్ని కలిసే మిష మీద వుస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, అమెరికన్ లైబ్రరీ చుట్టూ పుస్తకాల కోసం తెగ వెతుక్కునే కాలంలో గుడిపాటి పుణ్యమా అని దొరికాడు ఈ సైదా నాకు. ఆ యూనివర్సిటీల మెత్తని గడ్డి మీదా, అక్కడి చెట్ల కిందటి గరం చాయ్ లూ , వుస్మానియా బిస్కట్ల చప్పరింతల మధ్య కవిత్వం అందరినీ కలిపే బంధం అయినప్పుడు, రామదాసు లాంటి మిత్రులు వాళ్ళ అనుదిన చర్య్లల్లోనూ మా 'రక్త స్పర్శ ' వాక్యాల్ని అలవోకగా కోట్ చేసే సమయాల్లో - వొక బక్క పలచటి దేహం లోంచి అందమయిన ముఖం లోంచి కాస్త సందేహిస్తూ, సంశయిస్తూ ఈ సైదా నెమ్మదిగా వొక వాక్యాన్ని సంధించే వాడు. "నువ్వు ఇలా ఎందుకు రాసావు? అలా ఎందుకు రాయలేదు?" అనే అతని అనేక ప్రశ్నల సారాంశం. ఇతనికి పదాల పట్టింపు ఎక్కువ అనుకునే వాళ్ళం చాలా సార్లు. నిత్యం ఏదో పోగొట్టుక్కున్న వాక్యాన్ని, ఆలోచనని వెతుక్కునే వాడిలాగా ఎప్పుడయినా మెత్తగా నవ్వుతూ, ఎక్కువగా ప్రశ్నార్ధకాలు రువ్వుతూ వుండే సైదా ఆ కాలంలో రహస్యంగా కవిత్వం రాస్తూ వుండే వాడని నా అనుమానం.

సైదా చాలా కాలం చ డీ చప్పుడూ లేకుండా రాసాడు. రాసి, వాటిని ఏ దిండు కిందనో దాచేసుకొని, వొక అర్ధ రాత్రి లేచి కూర్చొని, చీకటికి తన వాక్యాలన్నీ తనివి తీరా వినిపించుకొని వుంటాడు, తనకి తనే శ్రోత అయి - రాసిన వెంటనే కవిత్వం అచ్చు అయ్యి, తెల్లారే లేచి, వొక అవార్డు క్యూలోనో , విమర్శకుడి ముంగిటనో ముగ్గులా నిలబడే
కాలంలో, సైదా చారి వొక వింత జీవి. అమామూలు కవి. కవిత్వం వల్ల వచ్చే అదనపు లాభాల మీద అతనికి మోజు లేదు. ఆ మాట కొస్తే కవుల మీద అతనికి కాసిన్ని అనుమానాలూ వుండి వుండ వచ్చు. ప్రేమిస్తూనే ప్రశ్నించే గట్టి వ్యక్తిత్వ బలం అతని పదాల్లోకీ ప్రవహిస్తుంది. ఎందుకు అన్న నిలవనీని ప్రశ్న అతని కవిత్వాన్ని కన్నడ వచన కవుల వరసలోకి లాక్కెళ్తుంది. అతను కవిత్వంలో పదాల్నీ, వాక్యాలనీ అనురాగంతో శంకిస్తాడు. . మనసులోని మాటని ఓవర్ రైట్ చేసే భాష పెత్తనాన్ని సహించడు.

అక్క మహాదేవి పూనినట్టు, అల్లామా ప్రభు లోపలి నించి గొంతు సవరించు కున్నట్టు సైదా ఎందుకు మాట్లాడుతున్నాడు? అ త ని వాక్యాల మధ్యకి ఆ విశ్వ బ్రాహ్మల పని ముట్లు, ఆ జాన్ పాడు సైదులు నమ్మకాల తాయెత్తులు, ఆ ఆడ వాళ్ళ రూపంలో అనేక భావాల సంచారీ తనం ఎక్కడి నించి వస్తున్నాయి? కవి , ఆ మాటకొస్తే మనిషి ఆ పాత అస్తిత్వపు జంఝాటాల నించి ఎలాంటి స్మృతిని తీసుకు వస్తాడు? అది అతనికి కొత్త ఉనికి ఇస్తుందా? గతంలోకి విసిరేస్తుందా? అంత తేలిక కాదు సమాధానం. కాని, అది సైదా కవిత్వాన్ని చిక్కన చేస్తుంది. సైదా కవిత్వంలోని ఆడ వాళ్ళు నిజంగా ఆడ వాళ్ళు కాదు, వాళ్ళు మనలోని ఆదిమ భావనల మెటఫర్లు. మన లోపల మనం సిగ్గుపడి చిదిమేసిన సహజాతాల ఆనవాళ్ళు. అందుకే, ఈ కవిత్వంలో ఎక్కడ ఆడతనం అంతమవుతుందో, ఎక్కడ భావం పుడ్తుందో తేలికగా తేలదు. చదివే వాళ్ళు ఇతనికి 'ఆడదన్నా/ కొండలన్నా అబ్సెషన్ ' అనుకునేంతగా ఆడదీ/భావనా పెనవేసుకు పోయాయి ఈ కవిత్వంలో.

సైదా చారి ఈ 'నీలం బొమ్మ'ని చదివి అర్ధం చేసుకోవడానికి మనకి చాలా సందర్భాల్లో మన లోపలి మనల్ని వొక సారి అతిధిగా అయినా చూసి వచ్చే సహనం వుండాలి. ఎక్కడో లతా మంగేష్కర్ గొప్ప మాట చెప్పింది " నాతొ నేను కాసేపు అప్పాయింట్మెంట్ తీసుకోవాలి' అని. అది ఆమె తన జీవితంలో నిజంగా చెయ్య గలిగిందో లేదో మనకి తెలియదు. కాని, ఇక్కడ వొక తెలుగు కవి వొక నగరం మూల నించి, వొక గది మూల నించి అక్షరమ్ తడి చెయ్యి చాచి, "అవును ఇది మనలోపలి ఆడతనపు సహజాతంతో సంభాషణ చేసే వేళాయెరా " అని అలలితంగా అపల్లవి గా, అకోమలంగా అంటున్నాడు. మీ కాళ్ళని కాస్త ఏ చెరువు నీళ్ళలోనో స్నానం చేయించి, ఈ గడ్డి ఆకుపచ్చత్వం తగిలేలా నేల మట్టిదనం మిమ్మల్ని కడిగేలా నడవండి మీ అహం మీంచి.

-

ఆ తడిలో వుంది కూర్మనాథ్ కథన శిల్పం!









జ్ఞాపకాలు వేధిస్తాయే గానిఆప్యాయంగా పలకరించవు -

అని ఎప్పుడో రాసుకున్న వాక్యాన్ని మళ్ళీ 'పూల గుర్తుల ' (ప్రాణహిత, ఆగస్టు 2007) తో గుర్తు చేశాడు కూర్మనాథ్ ఈ మధ్య.

1

ఈ కథ నన్ను వొక మిత్రుడి మరణ జ్ఞాపకంలోకి తీసుకెళ్ళింది.

యాసీన్ - వొక అందమయిన చిరునవ్వు, నిదానమయిన మాట, ఖమ్మం గోడల్ని యెరుపెక్కించిన అతని చేతుల కరచాలనం నాకు ఎప్పటికీ గుర్తు. మా ఇద్దరికీ అయిదారేళ్ళ తేడా. నేను పదో క్లాసులో వున్నప్పుడు అతను ప్రతి సాయంత్రం ఖమ్మంలోని కాప్రి హోటల్ బయట కాసేపూ, ఆ పక్కనే వున్న రికాబ్ బజారు స్కూలు విశాలమయిన ఆవరణలో కాసేపూ కూర్చొని- గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం.

నా ఆలోచనలు అప్పుడప్పుడే ఎరుపెక్కుతున్న కాలం అది. యాసీన్ చాలా మామూలు విషయాలే మాట్లాడే వాడు. కాని, అతని మాటల్లో ఆ విషయాలన్నీ కొత్త వెలుగులో మెరిసేవి. అతని మాట తీరులోని ఉద్వేగం ఏదో నా ఆలోచనలకి పదును పెట్టేది. ఒక రోజు నేను అతనితో మాట్లాడ్డం చూసిన మా దగ్గిర బందువు వొకాయన పనికట్టుకుని మా ఇంటికి వచ్చి "వీణ్ణి సాయంత్రాలు ఇంట్లోంచి కదలనివ్వకుండా చెయ్యండి" అని తీవ్రంగా హెచ్చరించి వెళ్ళిపోయాడు. అయితే, ఆ హెచ్చరిక మా ఇంట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు గాని, నేను రోజూ వొక నిషిద్ధ మనిషితో కలుస్తున్నానన్న విషయం నాకు అర్ధమై, కాస్త పొగరుగా అనిపించింది. ఆ తరవాత నాకు తెలియకుండానే అతనికి నేను దగ్గిర య్యాను.

చాలా కాలం దాకా యాసీన్ ఏమయ్యాడో నాకు తెలియలేదు.
నేను బెజవాడ ఆంధ్ర జ్యోతిలో చేరాక, అతన్ని మళ్ళీ చూశాను, కాని ఆ చిరునవ్వుల యాసీన్ ని కాదు, వొళ్ళంతా తూటాల జల్లెడయి, నేలకొరిగిన యాసీన్ ని ఫోటోలో!
అప్పుడు అతనికి నా చివ్వరి చూపు అదే!
ఒక పత్రికా రచయితగా అతని ఫోటోనీ, వార్తనీ విశేషంగా అచ్చు వేయించడం మాత్రమే ... అప్పుడు నేను చెయ్యగలిగింది!

2


నిబద్ధత/నిమగ్నత గురించి చాలా కాలం చర్చలు జరిగాయి సాహిత్య లోకంలో!
నిజమే! ఆ రెండిటీకి మాటకీ, చేతకీ వున్నంత దూరం వుంది. అనుకున్న ప్రతి మాటలోకీ నిమగ్నమయి, దాని కోసం జీవితాన్ని పూచిక పుల్లలా విసిరేసే సాహసం అంత తేలిక కాదు. ఆ రెండీటికీ మధ్య చాలా రకాల దూరాలున్నాయి. యాసీన్ అలా పోయినప్పుడు, అతను ఏ ఆశయం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టాడో, అది ఆ క్షణానికి నాకు గుర్తు రాలేదు. నాకు వెంటనే గుర్తొచ్చింది, అతని రాక కోసం ఎదురుచూపులు చూస్తున్న తల్లి, నాలాగానే ఆ రికాబ్ బజారు స్కూలు బయట అతని మాటల కోసం ఎదురుచూస్తున్న స్నేహితులు. నా పిచ్చి గాని...యాసీన్ అంతకు మించిన ప్రపంచం చూస్తున్నాడని నాకు గుర్తు రావాలి కదా?!

3


ఒక మరణం మిగిల్చి వెళ్ళే ఎలాంటి నిశ్శబ్దాన్ని అయినా భరించగలిగే ధైర్యం ఈ గుండెకి ఇంకా చిక్కబట్ట లేదు. ఆ మాట కొస్తే, ఏ మరణం అయినా వెంటనే ఏడ్పిస్తుంది, గుండె ఖాళీ అయ్యేట్టుగా.

కాని, అసలు బాధ /నరక యాతన కొంత వ్యవధి తరవాత వెంటాడడం మొదలెడ్తుంది. వొక నిశ్శబ్దంలోకి జారిపోతాం. " ఆ స్నేహితుడికి జీవితం ఇంకో అవకాశం ఇచ్చి వుంటే, ఎంత బాగుండేది" అనిపిస్తుంది, అది అయ్యే పని కాదు అని తెలిసి, తెలిసే!


4

కూర్మనాథ్ నన్ను ఎంత దూరం లాక్కు వెళ్ళాడో ఈపాటికి మీకు అర్ధమయి వుండాలి. కథకి ఇంత బలం ఎక్కడి నించి వస్తుంది? రచయిత కథనంలోంచా? ఆ కథలోని ఏదో వొక గుర్తు వెంటాడి వుక్కిరి బిక్కిరి అయ్యే అనుభవం యెందుకు కలుగుతుంది? నా లోపలి వొక ఉద్వేగాన్ని మరింత వేగవంతం చెయ్యడంలో రచయిత పాత్ర ఎంత? లేక, నేనే సున్నితమయి పోయి, ఆ కథని వొక సాకుగా తీసుకొని మాట్లాడుతున్నానా?

నాలో కొంత సున్నితత్వం వుందే అనుకుందాం. అది కూర్మనాథ్ కథ చదివాకే ఎందుకు కంట తడి పెట్టుకోవాలి? రోజూ, ఎన్ని మరణాలు వార్తల్లో, కబుర్లలో! కాని, అన్ని మరణాలూ వొకేలా అనిపించవు. ఇప్పుడే వొక ఈమైల్ చదివాను. నా కలీగ్ అయిదారేళ్ళ కొడుకు స్విమ్మింగ్ పూల్ లో గాలి ఆడక చనిపోయాడట ఆస్టిన్ లో! వొక్క సారిగా వొంట్లో నెత్తురంతా తోడేసినట్టయ్యింది. మళ్ళీ గుర్తొచ్చింది కూర్మనాథ్ కథ.

5

కథ చేసే పని చాలా చిత్రమయ్యింది. ఒక కథ యెప్పుడో చదివి వుంటాం. వెంటనే 'ఇది మంచి కథ ‘ అనుకోవచ్చు. కాని, నిజంగా అది మన అనుభవం అయినప్పుడు అది మన యాదిని వెలిగించే కథ అవుతుంది. కథనం ద్వారా తన అనుభవాన్ని మన అనుభవం చేస్తాడు రచయిత. పూల గుర్తులు కథలొ అలాంటి కథనం వుంది. మామూలు కూర్మనాథ్ కథలకి భిన్నమయిన కథ ఇది. ఇతర కథల్లో కొన్ని సంఘటనలనో, అనుభవాలనో 'కథ 'గా మలచడానికి కూర్మనాథ్ తన శైలితో తన ప్రమేయాన్ని కొంత బాహాటంగానే ప్రకటించుకుంటాడు. అక్కడ కూర్మనాథ్ కనిపిస్తాడు, వ్యంగంలోనో! కొరడా దెబ్బల చురుకులోనో!

'పూల గుర్తులు ' కథలో అలాంటి కూర్మనాథ్ కనిపించలేదు.

ఆ తాతయ్య మాత్రమే కనిపించాడు నాకు.

కథ చివరిలో అతని కళ్ళూ, నా కళ్ళూ వొకేసారి తడి పెట్టుకున్నాయి.

ఆ తడిలో వుంది కూర్మనాథ్ కథన శిల్పం!

కవి మిత్రులకు కనువిప్పు “ఊరి చివర”




-కొండముది సాయికిరణ్ కుమార్


అడపాదడపా అంతర్జాలంలో చదవటమే అఫ్సర్ గారి కవిత్వాన్ని. అక్కడక్కడ, ఆయనని మాటల్లో దించి సందేహాలకు సమాధానాలు వెతుక్కునేవాడిని ఆయన వ్యాసాల్లో. అంతకు మించి ఆయనతో ఎటువంటి పరిచయం లేదు. అంతర్జాలంలో సాహితీ సహవాసానికి, ఆ మాత్రం పరిచయం సరిపోతుందేమో కదా! “ఊరి చివర” ఉప్పెనలా పొంగిన అఫ్సర్ గారి కవిత్వంపై నా అభిప్రాయమే ఈ వ్యాసం.

ఇప్పటి రోజుల్లో, ఊరు చివర అనగానే నిజంగా నిస్తేజమై స్ఫురించే ఒకానొక చిత్రమే ఈ “ఊరు చివర” కూడా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాదు, మనను చుట్టుముట్టిన ప్రపంచాన్ని నిజాయితీగా ఆవిష్కరింపచేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో. సామాన్యంగా కవిత్వంలో సామాజికతను చొరబెట్టాలని కొందరు చేసే ప్రయత్నంలో, పడికట్టు పదాల విన్యాసమే కనిపిస్తుంది. ఆ విన్యాసాల సంరంభంలో ఊళ్ళు తగలబడతాయి, ఆకాశాలు విరిగిపడతాయి, చేతులు నరకబడతాయి, అలానే కవిత్వమూ కూలబడుతుంది. ఈ విన్యాసాలకు దాదాపు అతీతంగా, ఊరు చివర నిలువెత్తు “నిశ్శబ్దంలో” నిలుస్తుంది అఫ్సర్ గారి కవిత్వం.


ఈ పుస్తకం చదవాలంటే, ఊరి చివర నుంచి ఊళ్ళోకి ప్రవేశించాలి. వరుసబెట్టి, మూడు సార్లు చదివిన తర్వాత నేను తీర్మానించిన విషయం ఇది ) మీకు అర్ధమైన విషయం కరెక్టే… ఈ పుస్తకం చివరి నుంచి ఓసారి, మొదటి నుంచి ఓసారి చదివి చూడండి.

జండాలో జాతీయ గీతాలో

పార్టీలో రాజ్యాంగాలో రాజ్యాలో

వోటు హక్కులో ఎన్నయినా వుండనీ

గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు

గుక్కెడు నీళ్ళే జాతీయ గీతం మాకు

ఈ సంకలనంలో కవి ఆవిష్కరింపబోయే విషయం ఇక్కడే చూచాయగా తెలుస్తుంది. అందమైన నిశ్శబ్దంలో అలరించే పాలపిట్టల పకపకల కోసం
“ఊరి చివర”కు వెళ్ళొద్దు. ఎవరు వెళతారో “చివరికి” కవి మాటల్లోనే చూస్తే బాగుంటుంది :

ఎవరొస్తారో

ఈ వూరి చివరకి!

ఆకాశం కూడా వేలు విడిచిన

దిక్కులేని దేహం కొసకి.

మాటలన్నీ రాలిపోయి

మోడై నిలిచిన చెట్టు కొసకి.

వొళ్ళంతా పిడచకట్టి

పగిలిపోయిన చెరువు వొడ్డుకి

వొక్క దేహమే వెయ్యి ముక్కలయిన

శకలాల ఎముకల కలలతోపుకి.

ఎవ్వరొస్తారో ఈ వూరి చివరకి?


చివరికి వచ్చింది “ఎవరికైనా, ప్రేమతోనే” కవి చెబుతున్న విషయం, ముఖ్యంగా మన అంతర్జాల కవి మిత్రులకు కనువిప్పు కావాల్సిందే :

నడుస్తొందే, వొక సంతలో!

అన్నీ తెగనమ్ముకున్న

అన్నీ ఎక్కడికక్కడ దిగవిడిచిన

మార్కెట్ సరుకుల సమూహం.

నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే,

పద్యాల మధ్య

రాజకీయ నినాదాల హోరెందుకులే,

అన్నీ మర్చిపోయిన జాతికి

నీతివాక్యాల ముక్తాయింపులెందుకులే

…..

…..

నువ్వేమిటో

నీ పద్యమే చెబుతుంది!

తెగిన నీ పద్య పాదానికి

కట్టు కట్టలేను, క్షమించు,

…..
…..
మళ్ళీ రాయ్

పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో

అప్పటికీ నీకు నువ్వు దొరక్కపోతే

ఓ పిల్లాడి చేతిలో

బొమ్మవై పో!

వాడి ఆటలో కాసింత ఆనందపు తుంకవై పో!

అప్పుడింక కొత్త మాట రాయ్!


హిందిలో “ఓ ఆ రహా హై, ఖానా ఖానే కే లియే” అనేది శుద్ధ వచనం. అదే వాక్యాన్ని, నేను విన్న కొందరు హిందీ కవులు “ఆ రహా హై ఓ, ఖానే కే లియే ఖానా” అంటారు అదేదో విరగదీసే కవిత్వం చెబుతున్నట్లు. అలా ఉన్నాయి ఓ రెండు వాక్యాలు ఈ కవితలో (నడుస్తోందే, వొక సంతలో!….పరిగెత్తుతోంది వొక సంతలో!…). అవి సిల్లీ విషయాలైనా, నా అభిప్రాయం చెప్పాలనిపించేసింది, చెబుతున్నాను.

ఇలా అనుకున్నానో లేదో, ఆశ్చర్యం గొలిపుతూ “ఇఖ్ రా!”

లోకం

నాకు వంకరగా కనిపిస్తుందనే కదా

నువ్వెప్పుడూ అంటావ్

లోకం కాదు

నేనే వంకరగా వున్నానని కదా, నీ అర్ధం!

…..
…..
ఇంతకీ

ప్రశ్నని మించిన వక్రరేఖ

ఏదీ ఇంకోటి చూపించు.

అంటూ… మొహంలో మొహం పెట్టి అఫ్సర్ గారు ప్రశ్నిస్తూ వ్రాసిన ఈ కవిత, నా వరకూ శివారెడ్డి మార్కు అద్భుతమైన కవిత! అఫ్సర్ గారి బెంచ్ మార్క్ ప్రకారం ఓ సాథారణ కవిత. అన్నట్లు, ఏ సందర్భంలో ఈ కవిత పెల్లుబికిందో చెప్పనవసరంలేదు అనిపించింది. ఎందుకంటే, ఇప్పటి కాలమాన పరిస్థితుల మధ్య ఎప్పటికీ అన్వయించుకోగల కవిత ఇది. ఇటువంటి, అఫ్సర్ మార్కు సాథారణ కవితలు అక్కడక్కడ కనిపించాయనే చెప్పక తప్పదు.

కరెక్టుగా చివరి నుంచి నాలుగో కవిత “నాలుగు మెతుకులు”

బయట విరగ్గాస్తున్న ఎండకి

లోపటి చీకటి తెలుస్తుందో లేదో!

కాసేపు

గొంతుక

వ్యాహ్యాళికెళ్తుంది మౌనంలోకి

గాలి కోసం

కాసింత వూపిరి కోసం

…..
…..
ఒక్కోసారి నువ్వూ నేనూ

రెండు అలల కేకలం

మరోసారి

నిద్ర పొరల కింద వొత్తిగిలిన కలలం.

…..
…..
ఈ నాలుగు మెతుకులూ

దాచి వుంచు

ఏ దూరాల నించో వచ్చే

ఆ దిగులు బావి

ఖాళీ కడుపు కోసం!

ఈ “నాలుగు మెతుకులతో” చిక్కటి కవిత్వం కోసం అలమటించేవారికి పంచభక్ష్య పరమాన్నం వండి వడ్డించారు అఫ్సర్ గారు. చాలా అద్భుతమైన కవిత్వం. ఇలా తేరుకునే లోపే…”థియేటర్ స్క్వేర్” లోకి ఆహ్వానిస్తారు కవి.


ఒక నిశ్శబ్దంలోకి అందరూ

మౌనంగా
తెరమీద

ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా…

…..
…..
ఎవరి జీవితం వాళ్ళకి చేదు

అవతలి బతుకు

కాసేపు అద్దం

తెలియని అర్ధానికి

…..
…..
చెప్పుకుంటూ పోతే, చాలా కవితలున్నాయి. ఇవన్నీ ఒకరు చెబితే వినటం కన్నా, చదివి తీరాల్సిన అనుభూతులు ఒక్కో కవిత. కంట తడిపెట్టించేవి కొన్నైతే, కలకలం రేపేవి కొన్ని.జి.వి.ఎన్ మూర్తిగారు “ఈనాడు”లో చెప్పినట్లు, మన లోతులని మనమే తడుముకునేట్లు చేసే కవిత్వం ఇది.

అనుమానితుడి ఆత్మకథనం (నాకెందుకో మా అన్నాజీ ఇక్బాల్ చంద్ గారి “ఆరో వర్ణం” కవిత గుర్తుకొచ్చింది. “ఆరో వర్ణం”లోని క్లుప్తత మాత్రం ఈ కవితలో లేదు. అయినా బాగుంది, అది వేరే విషయం.)

జటిలమైన కొన్ని అనుభూతులుంటాయి. అందులోనూ పరభాషా కవిత్వంలో, అక్కడి మహాకవులు వ్రాసినవి. సామాన్య భాషకు, సామాన్య కవులకు ఆ అనుభూతులు అందవు. అటువంటి అనుభూతులు కూడా అలవోకగా, తనదైన శైలిలో కవిత్వమై పారిస్తారు అఫ్సర్ గారు “సరిగంగ స్నానం” అనే కవితలో. అది అనువాదమని ఆయన చెబితే గానీ, బహుశా మనం తెలుసుకోలేమేమో!

అద్భుతమైన ఉద్వేగాన్ని మిగిల్చినా, శివారెడ్డిని మించిన పద ప్రయోగాలు చేసారు అఫ్సర్ గారు. అంతకు మించి అభిప్రాయాన్ని చెబితే, “ఊరి చివర”కు ద్రోహం చేసినట్లౌతుంది కాబట్టి, ఇక్కడితో విరమిస్తా.

అన్నట్లు, అఫ్సర్ గారికి నాదో మనవి. కవిత్వం గురించి అంతర్జాలంలో చాలానే భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు తొలగించాలంటే, “ఊరి చివర” లోని కవిత్వం అందుబాటులో ఉండాలి. వీలువెంట, ఈ కవితలని అంతర్జాలంలో కూడా ఆవిష్కరిస్తే బాగుంటుంది.

మరో చివరి మాట. ఈ పుస్తకాన్ని చివరిని నుంచి చదవమని చెప్పటానికి ఉన్న మరో ముఖ్యమైన కారణం – గుడిపాటి గారు, ఎన్. వేణుగోపాల్ గారు వ్రాసిన ఆప్త వాక్యాలు. ముందుగా అవి చదివితే, వారి మాటలు దురభిమానంగా పాఠకులు అనుమానించే అవకాశం ఉంటుంది. మొత్తం కవితలు చదివాక, వారి ఆప్తవాక్యాలు ఎంత నిజమనేది తెలుస్తుంది.

http://amtaryaanam.blogspot.com/

కొన్ని నిమిషాలు





ఇప్పుడింక
అన్ని చావుల్నీ
రెండు నిమిషాలతోనే కొలుస్తున్నా

రెండు వందల మరణాలు రెండు నిమిషాల మౌనాలు


*

రెండు వందల తల్లుల పేగులు
పెనవేసుకుంటున్న మానవహారాల రాస్తాలు
ఎవరికెవరు క్షమాపణ చెప్పాలి?
ఈ రెండువందల ఖూన్లకి మాఫీ ఏది?
*
ఎప్పటికప్పుడు చావు కొత్త అద్దం తొడుక్కుంటోంది
చొక్కా మార్చినంత తేలిగ్గా
మాటల్ని విడిచేస్తోంది సర్కార్.
ఎవరి మాట ఎక్కడ కొలువు కుదురుతుందో
ఎక్కడ కొలువు తీరుతుందో
ఏ కొలువు మమ్మల్ని నిలువున్నా ముంచేస్తుందో
తెలియనే తెలియదు
అ..యి...నా...
రెండు నిమిషాల్లోకి
నీ/నా చావులన్నీ మడత పెట్టేస్తున్నా.

*
ఎవరి కంటి నెత్తురు
ఎవరి ఇంటి వెల్తురు
రోజూ వచ్చి పలకరించే చావు
ఎవరి అంపకాల రాయబారం?

అమ్మా,
ఈ నేల చీలిపోక తప్పదింక.
వొళ్ళు కూడా చిమిడిపోయిన అన్నం వాసనేస్తుంది.
దీని నెర్రెల నిండా ఆకలి గుహలు మొలుస్తున్నాయి.
ఎప్పటికప్పుడు చావు కొత్త అర్ధంతొడుక్కుంటోంది


*

కొన్ని నిమిషాలు నన్ను వెలివేస్తాయి
కొన్ని నిమిషాలు నన్ను శిలువేస్తాయి
కొన్ని నిమిషాలు నన్ను నీలోకి వొంపి
నీ శరీరపు వేడిని తాకి వస్తాయి.

బతుకు వొక వాంచ చావులానే.

చావు వొక గడ్డిపోచ బతుకులానే.

రెండీటి మధ్య
బహుశా రెండు క్షణాల దూరం

ఆ దూరాన్ని చెరిపి
నువ్వు జ్ఞాపకంలోకి జారిపోయావు చెప్పా పెట్టకుండా.

*

రెండు నిమిషాలు నీ జ్ఞాపకం.
ఆ తరవాత నువ్వు ప్రవహించే రాస్తా.
ఎప్పుడూ పేగులో సలిపే గాయం.

ఇప్పుడింక
ప్రతి చావునీ
రెండు నిమిషాలతోనే...
కొలుస్తున్నా.



(ఆస్టిన్ - టెక్సస్ లో తెలంగాణా సదస్సు తరవాత)*

అమెరికా పంట పొలాల నించి ఒక కవిత్వ లేఖ....!
















" ఆ వూరు మీకు బాగా నచ్చుతుంది, కవిత్వం మాటెలా వున్నా?!" అన్నాడు మిత్రుడు స్టీవ్ పెడ్రో -మాడిసన్ లో కారు స్టార్టు చేశాక. స్టీవ్ పెడ్రో మంచి కవిత్వం రాస్తాడు. అంతకంటే ముఖ్యంగా అతని ఆలోచనలు చాలా బలంగా వుంటాయి.ఎంత మెత్తగా మాట్లాడతాడో అంత బలమయిన వాక్యాలు సంధిస్తాడు. మాడిసన్ కి నలభై అయిదు నిమిషాల దూరంలో వున్న ఎరీనా అనే వూళ్ళో డానియల్ స్మిత్ అనే కవి ఇంట్లో, వాళ్ళ విశాలమయిన పంట పొలాల మధ్య జరుగుతున్న విస్కాన్సిన్ కవిత్వ పండగ మా గమ్యం. 2002లో నేను మాడిసన్ వచ్చాక వరసగా నాకు రెండు సార్లు విస్కాన్సిన్ కవిత్వ పండగల్లో పాల్గొనమని ఆహ్వానం వచ్చింది. కాని, వేరే అకడమిక్ సదస్సులకు వెళ్ళాల్సి రావడంతో ఆ రెండు సార్లు నేను వెళ్ళలేకపోయాను. ఈ సారి వచ్చి తీరాలి అని పట్టుబట్టడమే కాకుండా, దగ్గిరుండి తీసుకు రమ్మని మరో మాడిసన్ కవి స్టీవ్ కు పురమాయించారు డానియల్ స్మిత్.

మొక్కజొన్న తోటల మధ్య, ముసురుకుంటున్న చీకట్ల మధ్య, అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇండ్ల మధ్య ఎరీన ఒక ఆకుపచ్చ లోయలో వున్నట్టుగా వుంది. స్టీవ్ అమెరికా వ్యవసాయం, చదువుల కబుర్లు చెబుతున్నాడు దారి పొడవునా. మధ్యలో వుండీ వుండీ తన మిల్వాకీ బాల్యాన్ని గురించి చెబుతున్నాడు. ఆ కబుర్ల మధ్య ఎరీన ఇట్టే వచ్చేసింది. మేము డానియల్ స్మిత్ ఇంటికి చేరేసరికి కవిత్వ పండగ అప్పటికే మొదలయ్యింది. డెబ్బయేళ్ళ జె.డి. వైట్ కవిత్వం చదువుతున్నారు. ఆయన కవిత్వం హైకూల మాదిరిగా వుంటుంది. కానీ, చాలా లోతయిన భావాలు.

జేడీ అని అందరూ ఆప్యాయంగా పిలుస్తారు ఆయన్ని. "అమ్మమ్మ అంటుంది కదా?!" అనే శీర్షికతో ఆయన వొక తరం వెనక సంగతుల్ని, వర్తమానానికి మెలేసి చెప్పిన కవితలు కొంత వ్యంగ్యం, కొంత నేటివ్ ఇండియన్ విషాదమూ కలిసి వుంటాయి. ఆయన కవిత్వంలో మామూలు మనుషుల్లో వుండే కవితాత్మని వెతికి పట్టుకోవాలన్న తపన కనిపిస్తుంది.

ఆయన చదవడం అవ్వగానే స్టీవ్ తో వచ్చిన నన్ను గుర్తు పట్టి, డానియల్, ఆయన భార్య చెరిల్ మా దగ్గిరకి వచ్చి "ముందు భోంచెయ్యండి. ఈ కవిత్వంతో అర్ధ రాత్రి దాటిపోతుంది" అంటూ మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లారు. భోం చేసుకుని, వచ్చేసరికి మేగన్ జాన్సన్ అనే కొత్త తరం కవయిత్రి కవిత్వం చదువుతోంది. జేడీ కవిత్వం రెండు తరాల కిందటి అమెరికన్ కవిత్వానికి ప్రతినిధి అయితే, మేగన్ కవిత్వం ఈ తరానికి ప్రతినిధి అనుకోవచ్చు. పాప్యులర్ కల్చర్ కి సంబంధించిన ప్రతీకలూ, పదచిత్రాలు వాడుతూ, వాటి విరోధాభాసని చెప్పడంలో మేగన్ దిట్ట. కవిత్వ వాక్యాలతో, మీడియాలోని ప్రకటనల వాక్యాలతో ఆడుకోవడం ఆమెకి సరదా.

దాదాపు ముప్పయి మంది వివిధ వయస్కుల అమెరికా కవులు ఈ పండగ (జూలై 9,10)లో కవిత్వం చదివారు. ఒక విధంగా అమెరికాలోని మూడు తరాల కవుల్ని ఇక్కడ కలుసుకునీ, రెండు రోజుల పాటు వాళ్ళతో దగ్గిరగా గడిపి, ఒకరి మీద ఒకరు చలోక్తులు విసురుకునే దాకా వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన పండగ ఇది. ఈ ముప్పయి మంది లో కనీసం సగం మందికి నేను వివిధ కవిత్వ సమ్మేళనాల ద్వారా కొంచెం తెలుసు. నేను రెండు తెలుగు అనువాద కవితలూ, రెండు ఇంగ్లీషు కవితలూ వినిపించాను. ఇంకా రెండు కవితలయినా చదవాలని పట్టుబట్టారు కాని, నేను ఆ నాలుగు కవితలే తెచ్చాను. మరునాడు నాతో కొద్దిసేపు సంభాషణ కార్యక్రమం పెట్టారు. తెలుగు భాష నించి తెలుగులో వస్తున్న దళిత, ముస్లిం, ప్రాంతీయ కవిత్వాల దాకా క్లుప్తంగా చెప్పాను. ఆ తరవాత కొన్ని ప్రశ్నలూ, సమాధానాలు! చూస్తూండగానే మధ్యాన్నం అయిపోయింది.

పొలాల మధ్య కలకలం!
సాధారణంగా అమెరికాలో కవిత్వ పండగలయినా, కవిత్వ పఠనాలయినా ఏ పుస్తకాల షాపుల్లోనో, యూనివర్సిటీలలోనో, లైబ్రరీలలోనో, పెద్ద పెద్ద హోటళ్ళలోనో పెట్టడం ఆనవాయితీ. అమెరికా వచ్చిన తరవాత ప్రతీ ఏటా ఎక్కడో ఒక చోట ఇతర అమెరికన్ కవులతో పాటు కవిత్వం చదవడానికి రమ్మని నాకు ఆహ్వానాలు అందూతూనే వున్నాయి. మాడిసన్ లో వుండగా - బార్డర్స్ పుస్తకాల షాపులో ఒక సారి,విస్కాన్సిన్ యూనివర్సిటీలో మూడు సార్లు, మాడిసన్ లైబ్రరీలో వొక సారి, అతి ప్రాచీనమయిన కఫే మాంట్ మాత్రే అనే హోటల్లో రెండు సార్లు కవిత్వం చదివాను. మాడిసన్ లో కాపిటల్ భవనం బయట ఆరు బయలులో జరిగిన "యుద్ధ వ్యతిరేక కవి సమ్మేళనం" మరచిపోలేని అనుభూతి.

కాని,ఈ సారి విస్కాన్సిన్ పంట పొలాల మధ్య జరిగిన ఈ కవిత్వ పండగ కేవలం కవిత్వానికి సంబంధించిన విషయమే కాదు. "ప్రధాన స్రవంతి సంస్కృతి " పేరిట అమెరికాలో పెచ్చు మీరుతున్న నగర కేంద్రిత ధోరణుల మీద ఒక నిరసన ప్రకటన. పెద్ద హోటళ్ళలోనో, యూనివర్సిటీ హాళ్ళలోనో, పెద్ద పెద్ద పుస్తకాల షాపులలోనో కాకుండా రైతు జీవితానికి కేంద్రమైన ఒక "బారన్" లో, పంట పొలాల మధ్య ఈ కవిత్వ పండగ చేశారు. రైతుల సంప్రదాయ పనిముట్లు, గడ్డి మోపులు, పాతకాలపు ట్రాక్టరు నేపధ్యంగా వున్న వేదిక మీద కవులు కవిత్వం చదివారు. చాలా మంది కవితలకి అమెరికా పల్లె బతుకు వొక అంతస్సూత్రంగా వినిపించింది. పాప్యులర్ కల్చర్ మీద ఆగ్రహం, మూలన పడి పోతున్న అనుబంధాల మీద ప్రేమా, అల్ప సంఖ్యాకుల్ని అణచివేస్తున్న రాజకీయ వ్యవస్థ మీద నిరసనా చాలా కవితల్లో కనిపించాయి. ఆశ్చర్యంగా ఈ పండగలో చదివే కవిత్వం ఇలాగే వుండాలి అని నిర్వాహకులు ఎవరికీ చెప్పలేదు. ఒక అప్రకటిత భావస్వామ్యం అందరి కవుల్లోనూ కనిపించడం విశేషమే!

"నిజానికి ఇది ఆశ్చర్యమేమీ కాదు. చాలా మంది ఈ తరం కవులు ఏదో ఒక రూపంలో ఇలాంటి బాధనే వ్యక్తం చేస్తున్నారు. పోస్టు మోడ్రనిజం పేరిట నిజ జీవితాన్ని మరుగు పరిచే భ్రమల్ని ఈ కవులు బద్దలు కొడుతున్నారు. అసలు జీవితంలోకి వెళ్ళి, నిజ ప్రతీకల్ని, పద చిత్రాల్ని వెతుక్కుంటున్నారు." అని ఈ పండగ నిర్వాహకులు మైకేల్ థియూన్, ఆస్టిన్ స్మిత్ అంటారు. "పట్టణాలూ, నగరాల కవులు కవిత్వ వాక్యాల్ని అమ్మేశారు. వాళ్ళే దారుణంగా అమ్ముడు పోయారు. వాళ్ళ కవిత్వాలు ప్లాస్టిక్ సరుకులు మాత్రమే." అంటారు వాళ్ళు. అట్లా అని ఇక్కడ చదివిన వాళ్ళెవరూ కేవలం "నినాద" కవిత్వం చదవలేదు. (ఆ మాటకొస్తే, నినాద కవిత్వం అనేది వొకటి వుందని నేను అనుకోవడం లేదు. వుందల్లా కవిత్వం/అకవిత్వం మాత్రమే). ఒక వ్యక్తిగా కవికీ, అతని చుట్టూ వున్న లోకానికి ఎలాంటి బంధం వుండాలో, అలాంటి బంధం తెగిపోతున్నందుకు పడే ఆక్రోశం నినాదం అయితే, దాన్ని కవిత్వంగా ఒప్పుకోడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ పండగలో చదివిన ముప్పయి మంది కవులూ ముప్పయి భిన్న వ్యక్తిగత కోణాల నించి తమ చుట్టూ వున్న లోకాన్ని వ్యాఖ్యానించారు. ఇందులో కొంత మంది కవులు స్వయంగా రైతులు. కొంత మంది యూనివర్సిటీలలో పాఠాలు చెప్పే వాళ్ళు. కొంత మంది వ్యవసాయ ఫారంలలో పనిచేసే వాళ్ళు. కొంత మంది యువకులు, కొంత మంది నడి వయస్కులు, కొంత మంది ముసలి తనం ముసురుకొస్తున్న వాళ్ళు. కాని, వీళ్ళ గుండెలు చాలా తడిగా వున్నాయి, గొంతుల్లో నిప్పుల సెగలున్నాయి. వీళ్ళ గొంతులు వింటున్నప్పుడు వీళ్ళు కవిత్వం వూరికినే రాయడం లేదని వెంటనే తెలిసిపోతుంది.

విస్కాన్సిన్ 'పోతన ' డానియల్

రాగానే పిలిచి అన్నం పెట్టాడని కాదు కానీ, వీళ్ళందరిలోకీ నాకు బాగా నచ్చిన కవి డానియల్ స్మిత్. చాలా నెమ్మదస్తుడు. ఎక్కువ మాట్లాడడు. కాని, మాట్లాడినప్పుడు మన సింగమనేని నారాయణతో మాట్లాడినట్టే వుంటుంది.తేడా వొక్కటే...నారాయణ గారి మాటలు అప్పుడప్పుడూ కొంచెం వామపక్షమై బరువెక్కుతాయి. కాని, డానియల్ మాట్లాడుతుంటే, ఇప్పుడే పొలం పని ముగించుకొచ్చి, కాసేపు దగ్గిర వాళ్ళ కబుర్లతో సేదతీర్చుకుందాం అన్నట్టుగా వుంటుంది. డానియల్ మంచి చదువరి. ఈ వారమే వేడి వేడిగా మార్కెట్ లోకి వచ్చిన సాహిత్య పుస్తకమయినా, పత్రికయినా అతని ఇల్లు చేరాల్సిందే. కాని, చదివాను కదా అని అన్నీ ఏకరువు పెట్టే మాటకారి కాదు అతను. బతుకంతా పొలం పనిలోనే అయిపోయింది డానియల్ కి. ఎప్పుడొ కానీ వొక చిన్న కవిత రాసుకునే వ్యవధి లేదు. రాసిన కొద్ది కవితలు కూడా వాళ్ళ నాన్న గురించీ, తన పొలం పని గురించీ, తన సంసారం గురించీ! అదే డానియల్ సొంత సంతకం అయ్యింది. "ఫాదర్ లాండ్" అనే పేరుతో ఈ పండగలో వొక రోజు రాత్రి ఆయన కవిత్వం చదివినప్పుడు అది వొక రైతు ఆత్మ చరిత్రలోంచి చింపుకొచ్చిన పేజీలా అనిపించింది. అది ఏ దేశం రైతు కథ అయినా కావచ్చు కదా అనుకున్నాం. ఒక రోజు సాయంత్రం ఆయన తన యాభయేళ్ళ రైతు జీవితం చిన్న చిన్న మాటల్లో చెబుతూంటే ముచ్చటేసింది. అసలు ఏ సాహిత్య నేపధ్యమూ లేని వొక రైతు బిడ్డ కవిత్వంలోకి వచ్చిన ఆ కథ ఈ కాలానికి అమెరికాలో మాత్రం వొక విశేషంగానే అనిపిస్తుంది.

"భాష దొరకాలి, వొక్క సారి భాష దొరికాక కవిత్వం దారి తేలిక అవుతుంది. నేను ఇంకా కొంత గతంలోనే బతుకుతున్నాను కాబట్టి నా భాషలో ఇంకా చాలా గతమే వుంది. ఆ గతం ఇప్పుడు చాలా అవసరం అనిపిస్తోంది. ఇప్పుడు అమెరికాలో ఆఘ మేఘాల మీద రాస్తున్న వాళ్ళు కొద్ది సేపు ఆ గతంలోకి వెళ్ళి రాక తప్పదు అనిపిస్తోంది. కొద్ది సేపు ఆగి ఆలోచించుకొని ముందుకు అడుగు వెయ్యాల్సిన స్థితి ఇప్పుడు కవిత్వంలోనే కాదు, అన్నిటా వుంది" అన్నారాయన. మా ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే డానియల్ భార్య చెరిల్ మా కోసం మంచి కాఫీ తీసుకు వచ్చారు. "నిన్న మీరు కవిత్వం చదివిన తీరు బాగుంది. ఇంకా మీ దేశంలో కవులకి మౌఖిక బంధం వుందనుకుంటా. ఆ మౌఖికతలోని బలం మీ గొంతులో వినిపించింది." అంటూ మళ్ళీ మరో సారి అంతకు ముందు రాత్రి నేను చదివిన నాలుగు కవితలని మళ్ళీ చదివించుకున్నారు. "మౌఖికత" మీద ఈ కవుల మధ్య చాలా చర్చ జరగడం విన్నాను. అందరిలోకీ పెద్ద కవి జేడీ కూడా తన మాటల్లో "మౌఖిక " లక్షణాలే కవిత్వాన్ని బతికిస్తాయని అంటూ తన తరం నించి ఈ తరానికి వచ్చే సరికి మౌఖికత అరుదయిన దినుసు ఎలా అయ్యిందో చెప్పారు. చెరిల్ ఒక బడిలో టీచర్ గా పనిచేస్తారు. కవిత్వం రాయరు కాని బాగా చదువుతారు. 1930 ల అమెరికన్ కవయిత్రి లోరీన్ నైడెక్కర్ గురించి నేను కొంత పని చేస్తున్నానని తెలిసి ఆ ముగ్గురు పెద్ద వాళ్ళూ చాలా సంతోషించారు. "ఆమె వొక విస్మృత కవయిత్రి. మీరు ఏ కొంచెం ఆమె గురించి రాసినా అది అమెరికన్ కవిత్వానికి గొప్ప సేవ” అని డానియల్ అన్నారు. "ఈ జీవిత కాలంలో పూర్తి చేస్తానో లేదో చెప్పలేను గాని, అది ఇప్పుడు వొక ఆలోచన మాత్రమే" అని నేను అనగానే, " అయితే, మీరు ఆ పని పూర్తి చేసేంత దాకా మీ ఆయుష్షు పెరగాలి" అన్నారు జేడీ.

కవిత్వం అంతా వొక ఎత్తు, కవిత్వం చదివాక రాత్రి కొండ కొమ్మున చలి నెగడు చుట్టూ చేరి అంత మందిమీ రాత్రి మూడు గంటల దాకా కబుర్లూ, కథలూ చెప్పుకోవడం ఇంకో గొప్ప అనుభూతి. వ్యక్తిగత జీవితాలూ, స్థానిక సంగతులూ, సాహిత్యం కబుర్లూ అన్నీ జమిలిగా అక్కడ కలిసిపోయాయి. అసలు నిజంగా పండగ హడావుడీ అంతా అక్కడే! కావలసినంత తిండీ, అనేక రకాల మద్యం, కావలసినన్ని కబుర్లూ!

వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఎరీనా వైపు చూస్తే, కొంచెం దిగులుగా అనిపించింది.

"ఎరీనా మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంది. ఒక్క సారి ఇక్కడి గింజ నోట్లో పడ్డాక మీరూ/ మేమూ దాన్ని మరచిపోలేం" అన్నారు డానియల్ ఇతర ఎరీనా వాసులు మాకు వీడుకోలిస్తూ.

విస్కాన్సిన్ నుంచి *
జులై 19, 2010 ఆంధ్ర జ్యోతి "వివిధ" నించి

పదేళ్ళ కవిత్వ సంకలనం గురించి....!




పదేళ్ళ కవిత్వం ఒక సంకలనంగా తీసుకురావాలన్న మా సంకల్పం ఇప్పుడిప్పుడే తుది రూపం దిద్దుకుంటోంది. సారంగ బుక్స్ తరఫున అచ్చు కాబోతున్న ఈ సంకలనం ముఖచిత్రం ఈ వారమే ఖాయం అయింది. అంతర్జాతీయ ప్రచురణలకి కవర్ డిజైన్లు రూపొందించే ఒక విశ్వ విఖ్యాత చిత్రకారిణి ఈ పుస్తకానికి కవర్ డిజైన్ చేశారు. తెలుగులోనూ, తరవాత ఇంగ్లీషులోనూ ఉత్తమ సాహిత్యాన్ని అందించే సత్సంకల్పంతో మీ ముందుకు వస్తున్న సారంగ బుక్స్ కి మంచి కలలున్నాయి. వాటిని నిజం చేయ్యగలమన్న ఆశాజీవుల బృందం కూడా వుంది.

పదేళ్ళ కవిత్వం "సారంగ బుక్స్ " తొలి కల...అది పుస్తక రూపంలో సెప్టెంబరు నెలలో మీ ముందు వుంటుంది.


ఈ సంకలనానికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈమెయిల్ చెయ్యవచ్చు. afsartelugu@gmail.com

ఈమెయిల్ ద్వారా కాకుండా సాధారణ పోస్టు ద్వారా అయితే, ఈ దిగువ తెలిపిన వంశీ కృష్ణ చిరునామా కి రాయండి.
Vamseekrishna
c/o lakshmi gadapati printers
mandala office complex
gampalagudem –
krishnajilla
Category: 1 comments

నల్ల నినాదం అతని కవిత్వం!


















చాలా కాలంగా వెంటాడుతున్న కవి లాంగ్స్టన్ హ్యూ!

ఎప్పుడో 1902లో పుట్టి, ఏ 1967లోనో కన్నుమూసిన ఈ కవి ఇప్పుడు నా లోకంలో ఎలా కన్ను తెరుచుకున్నాడు?! అతని కవిత్వ పాదాల్లోని ఏ శక్తి నన్ను అటు వైపు జర జరా ఈడ్చుకెళ్ళింది? ఇటీవల హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో హెన్రీ గేట్స్ అనే వొక నల్ల ప్రొఫెసర్ మీద పోలీసు దాడికి నిరసనగా "తోలు మందం" అనే శీర్షికతో (ఈ కవిత నా కొత్త సంపుటి "వూరి చివర" లో వుంది) కవిత రాసినప్పటి నించీ లాంగ్స్టన్ హ్యూ కవిత్వం రోజూ కొంత కొంత చదువుతున్నా. వొకే సారి అతన్ని అంతా చదవడం కష్టం. వొక్కో సారి వొక కవితలోని వొకే వొక్క పంక్తి చదివి పుస్తకం పక్కన పెట్టి, ఆలోచనల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు అనేకం. ఇలా చదువుతూ చదువుతూ కొన్ని నెలలు గడిచి, ఈ పొద్దు చూస్తే ఫిబ్రవరి వొకటి: అతని పుట్టిన రోజు.

ఎవరికి కావాలి కవి పుట్టిన రోజు?!

ఒక తెల్ల దేశంలో నల్ల పుటక పుట్టిన వాడి పుట్టిన రోజు అసలే అక్కరలేదు. నల్ల నేత నాయకుడయినా సరే, ఆ కవి ఈ తెల్ల దేశానికి పరాయీ వాడే!

కాని, కొన్ని పుట్టిన రోజులు చరిత్రకి కావాలి. కొన్ని పుట్టిన రోజులు చరిత్ర వేగాన్ని పెంచుతాయి. హ్యూ అలా నల్ల చరిత్ర గతిని మార్చాడు. అతను కవి మాత్రమే కాదు, నల్ల జనం మౌఖిక కథల్ని వెలుగులోకి తెచ్చాడు. కవిత్వమే రాసినా, అన్ని పనులూ కవిత్వం వల్ల కావు అనుకున్నప్పుడు గొప్ప వచనం రాశాడు.

హ్యూ గురించి చాలా రాయాలి. ముఖ్యంగా ఇవాళ్టి దళిత చైతన్య స్రవంతిలో అతని స్మరణ చాలా అవసరం.

హ్యూ కవితల నించి కొన్ని మెరుపులు:


నీగ్రో భాషలో నది


నదులు ఎప్పటినించో తెలుసు నాకు:
అవి
ఈ లోకం కన్నా అతి పురాతనం
ఈ లోకపు మానవ నదులలో పారిన
మనిషి నెత్తుటి ప్రవాహం కన్నా పురాతనం

ఆ నదుల కన్నా లోతెక్కిన ఆత్మ నాది.



ఇంకా తెల్లారని పొద్దుట
యూఫ్రేటస్ లో స్నానమాడా
కాంగో దగ్గిర
వొక చిన్ని గూడు కట్టుకున్నా
సాయంత్రానికి అది నాకు జోల పాడింది.
నైలు వైపు దృష్టి సారించా
పిరమిడ్ల ఎత్తు ఆకాసమంత అయ్యింది.
న్యూ ఆర్లీన్స్కి లింకన్ వెళ్ళిన వేళ
మిస్సిసిపితొ కలిసి వో పాట అందుకున్నా.
ఆ సాయంత్రం దాని మురికి వొడి నిండా
బంగారపు రాసులు చూశా.



ఎప్పటివో ఆ చీకటి
నదులన్నీ తెలుసు
నాకు.

వాటి మల్లెనే
లోతెక్కింది నా ఆత్మ.



నా వాళ్ళు


భలే అందంగా వుంది రాత్రి
నా వాళ్ళ ముఖాల్లాగా.


భలే అందంగా వున్నాయి చుక్కలు
నా వాళ్ళ కళ్ళలాగా.

వారెవ్వా, సూర్యుడు కూడా
భలే బావున్నాడు
నా వాళ్ళ ఆత్మల్లాగా.


ఆత్మ హత్య చీటీ


ప్రశాంతమయిన
అతి చల్లని నదీ వదనం
అడిగింది
వొక ముద్దు కోసం!


కలల కాపరి


ఆ కలలన్నీ ఇలా పట్రా,
నా స్వాప్నికుడా!

నీ గుండె సంగీతాలన్నీ
ఇలా పట్రా కాస్త.

వాటన్నీటినీ
వొక నీలి మేఘ వస్త్రంలో చుట్టెస్తా,

ఈ లోకపు కర్కశ హస్తాలకి చిక్కకుండా. *

అంతిమ క్రియలు కొన్ని...


















వెళ్లిపోతూ మలుపు దగ్గిర కాసేపు నిలబడి చూడు.
రాయాలనుకున్నదేదో నీ చూపు చివర కనలిపోయింది.


ఆది యందు మాట వుండెనో లేకపోయెనో...
ఆదియందే చివరి మాట స్వప్నించనీ నన్ను.


దుఖాలు పగలబడి నవ్వుల గోళాలు తిరగబడి
శోకాలు తగలబడి వొక చల్లని మంచు నిప్పు సెగని నేను.


అంతమందు మాట వుండునో వుండకపోవునో
నిన్న రాత్రి నీ కలకి అంటుకున్న కార్చిచ్చుని నేను.


కాలానికి తెలియదులే, రాలిపడిన క్షణాల చప్పుడు
ఒకే ఒక్క కేకలో కరిగిపోయిన ఇరుదేహాల నగ్న ఘోష..


చింతల చిగురాకులో, సుఖాల నిప్పు కణికలో
దాటి వెళ్ళాక కానీ స్పృహ రాదు, వొళ్ళే అగ్ని గుండమయినప్పుడు.


వెళ్లిపోతూ మలుపు దగ్గిర కాసేపు నిలబడి చూడు.
రాయలేనిదేదో వొకటి దగ్ధమయ్యింది., రెప్పల తెల్లనవ్వు కింద.


*

ఏమీ చెప్పదు!




















1

మరణ వాంగ్మూలం ఏమీ చెప్పదు.

వొక అందమయిన దృశ్యాన్ని చూసినట్టు, మరణాన్నీ, ఆత్మహత్యని అందంగా స్వప్నించాలా? నువ్వు ఏ భాషలో ఎవరితో మాట్లాడుతున్నావు, ఆత్మహత్యాగ్రహ తీవ్రవాదీ! నీ రంగు నీ కోపానికి కొత్త ముసుగు వేస్తుందిలే!

విమానాలు నీకు ఆటబొమ్మలు

సరదాగా కాసేపు క్షుద్రంగా విహరించి, అవతల పడేస్తావ్. మేడలు వొట్టి పేకమేడలు. సాయంత్రానికి అసహనమో, విసుగో పుట్టుకొచ్చి, పరాకుగా కూల్చేస్తావ్.

ఇంకా ఎన్ని క్షుద్ర సరదాలు కనిపెడ్తావో కదా, నీ అంతులేని క్రీడా వినోద మోహం తీరక!

2

మరణాలు కొత్త కాదులే నాకు,
కానీ, మరణం వినోద క్రీడ అయితే అది విడ్డూరమే నాకు! నీకు చావు సరదా అవునో కాదో నాకు ఇంకా తెలీదు కాని, ఎగసెగసిపడే నీ తెల్ల చర్మపు తగరపు అలల కింద నువ్వు వినోద క్రీడనే కలగన్నావని శంకించగలను నిశ్శంకగా!

ఎందుకో తెలీదు గాని, నీ ఆత్మహత్యాగ్రహ ప్రకటనలో
మేలుకున్న ధనవిలాస కేళీ మానసమే చూస్తున్నా.

3

చావులూ,ఆకలి చావులూ తెలుసు నాకు.

కన్నీళ్ళూ, వాటి చివర జీవన్మరణాల అనుక్షణికాల తాడుకి వేళ్ళాడే బతుకు దప్పికలు తెలుసు నాకు. కణ కణ మండే ఉద్యమ రక్త కాసారాల్లోకి దేహాల్ని చితుకల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు.

అడవుల గుండెల్లో కొలువై, అణగిపోయిన గొంతుల్లో కాసింత నీటి చుక్క పోయడానికి, కాలిపోయిన దేహాలూ తెలుసు నాకు.
4

తెలియనిదల్లా
నువ్వూ, నీ ఈ కొత్త చావు బొమ్మ!

*

పల్లె కథ రంకె వేస్తోంది!



వూరో వాడో తేల్చుకోవాలని
మీరంతా శపథాలు చేస్తున్నారు గాని
వున్న వూరూ కన్న వాడా
తల్లి పేగూ నెర్రెల నేలా తెంపుకొని
దేహాన్ని దాచలేని పైమీది బట్టతో
దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న
ఆకలి విగ్రహాల వూరేగింపు చూడు
రక్త మాంసాలు వెలి వేసిన
మనిషి నీడ ఇక్కడే చూడు
- అఫ్సర్, ఊరిచివర

1

తెలుగు సాహిత్యం ఇప్పుడు వొక కొత్త కాల్పనికత వైపు ప్రయాణిస్తోంది. గత పదేళ్ళ కవిత్వాన్నీ, కథల్నీ దగ్గిరగా గమనిస్తున్న పాఠకులకు ఈ సంగతి బోధపడ్తుంది. ముఖ్యంగా కథకులు ఇంతకు ముందు కన్నా భిన్నమయిన కాల్పనికత దిశగా కథనీ, కథా సంస్కృతిని తీసుకు వెళ్తున్నారు. కాని, ఇక్కడొక వైరుద్ధ్యాన్ని గురించి చెప్పుకోక తప్పదు: అది నగర కేంద్రిత సాహిత్య సంసృతికీ, పల్లె-కేంద్రిత సాహిత్య సంస్కృతికీ వ్యత్యాసం. నగర కథకులు వొక విధమయిన కాల్పనికత నీ, పల్లె నించి వస్తున్న కథకులు దానికి భిన్నమయిన కాల్పనికత ని చిత్రిస్తున్నారు. అది ఏ విధంగా భిన్నమయ్యిందో నిరూపించడానికి సీమ కథలు, అందునా అనంతపురం కథలు- మరీ ముఖ్యంగా బండి నారాయణ స్వామి కథలు దాఖలా.

"పరుగు" నారాయణస్వామి మొదటి కథ అని నాకు తెలియదు. ఆ కథ అచ్చయినప్పుడు నారాయణ స్వామి పేరు పెద్దగా వినిపించలేదు, నేను విన్నంత మటుకూ. స్వామి అంటే "చంకీ దండ" జ్ఞాపకమే! ఆ కథ వచ్చినప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో వుండడం, ఈ కథకి బహుమతి ఇచ్చే ముందు స్మైల్ గారు ఈ కథని తనే చదివి, వినిపించడమూ మరచిపోలేని అనుభవం. కథ చదవడంలో స్మైల్ ప్రత్యేకమయిన పద్ధతి వల్లనే కాకుండా, వొక కొత్త రకం కథ చదువుతున్నామన్న తృప్తిని మిగిల్చిన కథ ఇది. కథ చెప్పే తీరులో స్వామి వొక కొత్త కాల్పనికుడిగా ఇప్పుడు కనబరుస్తున్న పరిణతికి సాక్ష్యాలు ఆ కథలోనే కనిపిస్తాయి. కాని, కథ చదివాక స్మైల్ గారి వొక మాట నాకు గుర్తుండి పోయింది ఇప్పటికీ- "ఇతనెక్కడో అనంతపురం నించి రాస్తున్నాడయ్యా ఈ కథని!"- అని.

అప్పుడు - ఆ 80'ల లో - అనంతపురం గురించి నాకు పెద్దగా తెలీదు. అక్కడి కథకుల పేర్లు కూడా తక్కువ తెలుసు. ఒక పదేళ్ళ తరవాత చూస్తే తెలుగు కథాపటం మీద కొత్త కేంద్రంలా మెరుస్తూ నిలబడింది అనంతపురం. ఇంకో పదేళ్ళ తరవాత ఆ కథాకేంద్రంలో నిలబడి వ్యక్తిగతంగా ఆ కథకులు చెబ్తున్న అనుభవాల్ని అర్ధం చేసుకునే అవకాశమూ దొరికింది నాకు. అప్పుడే కథల్లో చదువుతూ వచ్చిన నిజ జీవన దృశ్యాన్ని కళ్ళారా చూశాను. నిజానికి ఈ కాలపు ఏ కవి కయినా,కథకుడికయినా కనీసం కొంత కాలం అనంతపురం జనంలో బతికి, అక్కడి నాలుగు మెతుకులు తిని, ఆ నీళ్ళు తాగితే తప్ప బతుకు పూర్తి రూపం తెలీదు. దప్పిక ఎలా వుంటుందో, దప్పిక వేస్తున్నప్పుడు గుక్కెడు నీళ్ళు దొరక్కపోతే ఎలా వుంటుందో తెలుస్తుంది. అప్పుడు నెత్తురు మండవచ్చు, చచ్చిపోవచ్చు కూడా. ఆ రెండు స్థితులూ ఏక కాలంలోనే కలగ వచ్చు.

ఒక స్థలం, వొక కాలం, వొక జీవన స్థితి కథకుడి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పడానికి ఇప్పటి కథల్లో అనేక వుదాహరణలు దొరుకుతాయి. తెలుగు కథకుడికి కాల్పనికతకి బదులు స్థానికత బలమయిన శిల్ప సాధనం అని నేను గత కొంత కాలంగా వాదిస్తూ వున్నాను. ("కథ-స్థానికత" లో స్థానికతకి సంబంధించిన భిన్న కోణాల్ని వెతికే ప్రయత్నం చూడ వచ్చు). గతంలో మాదిరిగా స్థానికత కేవలం వస్తువులో ఒక భాగం కాదు ఈ దశాబ్దంలో- వస్తువు వస్తు నిర్దేశమే కాకుండా, శిల్ప నిర్దేశం కూడా చేస్తోంది ఇప్పుడు. రచయిత పుట్టి పెరిగిన భాష రచయిత దృక్కోణాన్ని నిర్మిస్తుంది. అందుకే, రచయిత స్థానికత- తెలంగాణా, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర ఏదయినా కావచ్చు- అది ఇప్పుడు కథనశిల్పంలో ముఖ్యమయిన పాత్ర అవుతోంది. ఇటీవల అత్యాధునిక/ మాంత్రిక వాస్తవికతల నేపధ్యంలో కాల్పనిక వాస్తవికత వొక ప్రధానమయిన అంశంగా చర్చలోకి రావడం చూస్తున్నాం. (ఉదాహరణకి: బి. తిరుపతి రావు ఇటీవలి వ్యాసం).తెలుగు కథకుడి కాల్పనికత స్థానికీకరించబడుతున్న సాహిత్య పరిణామాన్ని తిరుపతి రావు లాంటి విమర్శకులు గమనించకపోవడం కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తోంది నాకు. తెలుగు కథకుడి కొత్త కాల్పనికతని రుజువు చెయ్యడానికి స్వామి కథ "రంకె"ని ఉదాహరణగా చూపిస్తూ, స్థానికత - కాల్పనికతల కొత్త బాంధవ్యాన్ని చర్చించవచ్చు. ఇదే సందర్భంలో నగర కేంద్రిత/ పల్లె కేంద్రిత కథకుల వూహలు భిన్నంగా ఎలా వుండవచ్చో కూడా మనం గమనించవచ్చు.


2

తెలుగు కథకుడి కాల్పనికత యాంత్రికం కాదని చెప్పడానికి స్వామి కథ బలమయిన వుదాహరణ. మొదటి విషయం: "రంకె"లో కథ కొత్త కథ కాదు. కాని, కథకుడి కాల్పనిక బలం వల్ల ఇలాంటి కథ కొత్తగా, ఇప్పుడే మొదటి సారి చదువుతున్నామన్న స్పృహ కలుగుతుంది. స్వామి ఈ కథ రాసే సమయానికి సీమ/అనంతపురం రైతుల ఆత్మ హత్యలు కథల్లో, కవిత్వంలో “అరిగిపోయిన” ఇతివృత్తాలు అవుతున్నాయి. “రంకె” ఇతివృత్త పరిధిలో స్వామి చెబ్తున్న కొత్త సంగతులు వున్నప్పటికీ,ఆ పాత కథని కొత్తగా వూహించుకుంటే తప్ప స్వామి లోని సృజనాత్మకతకి తృప్తి లేదు. ఎక్కడో వొక చోట తృప్తి పడి, కథ నడిపించి వుంటే, ఈ కథ కొత్త పాఠకుడిని చేరుకొని వుండేది కాదు. ఈ కథ వెనక పాలపిట్ట వారు ముగ్గురు పాఠకుల ప్రతిస్పందనల్ని అచ్చేశారు. ఈ మూడు ప్రతిస్పందనలూ మూడు భిన్నమయిన పఠనాలు మాత్రమే కాదు, మూడు భిన్నమయిన స్థానికతలు కూడా. కొత్త పాఠకులు అనే పదం వాడుతున్నప్పుడు నేను ఈ ముగ్గురిని కూడా లెక్కలోకి తీసుకుంటున్నా. అనంతపురం పల్లె బతుకుని దగ్గిరగా చూసిన వ్యక్తిగా, నాలుగో పాఠక కోణాన్ని వెతుక్కోడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నా.

"పట్టణ మధ్య తరగతి పశ్చాత్తాప" దృష్టిని వదిలించుకొని, స్వామి ఈ కథలోకి అడుగు పెడ్తాడు. అందుకే, కథ చివరి సంఘటనతో మొదటికొస్తుంది. ఒక వూహాత్మక సన్నివేశంతో మొదలవుతుంది. ఈ విధమయిన కాల్పనికత యాంత్రికతని సవాల్ చెయ్యడమే అని విడిగా చెప్పక్కరలేదు.

గుత్తి రామక్రిష్ణ గారి నించి స్వామి దాకా తర తరాలుగా 'అనంత ' రచయిత కరవు కథ చెబ్తూనే వున్నాడు. అనంత రైతు నిస్సహాయతనీ, రాజకీయార్ధిక వ్యవస్థ రైతుని ఆత్మహత్యల వైపు తోసుకు వెళ్తున్న స్థితినీ చెబ్తూనే వున్నాడు. అదే కథని స్వామి ఇప్పుడు ఎలా చెప్పబోతున్నాడో,ఆ వాస్తవిక దృశ్యాన్ని కథలోని "కాల్పనిక"లోకంలోకి ఎలా పునసృష్టిస్తున్నాడో, దానికి ఎలాంటి శిల్ప సాధనాల్ని సమకూర్చుకుంటున్నాడో గమనిస్తే, కథకుడి యాత్ర అర్ధమవుతుంది.

ఒక కథ పరిధిలో సమగ్రతని ఆశించడం అసాధ్యం. కథ వొక ఆనుభవిక పార్శ్వాన్ని ప్రభావాత్మకంగా చెప్పగలిగితే చాలు. "రంకె " కథలో వొక సమగ్ర జీవన దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కనిపిస్తుంది. అనంత రైతు జీవితం చుట్టూరా అనేక అంశాలు పీటముడి వేసుకొని వున్నాయి. ప్రాకృతికమయిన ఎగుడు దిగుళ్ళు, వ్యవస్థ సృష్టించిన సమస్యలు కలగలసి వున్నాయి.

కథలోకి ఇంత సంక్లిష్టమయిన వాస్తవికతని ఎలా ప్రవేశ పెట్టాలన్నది రచయిత శక్తి మీద ఆధార పడి వుంటుంది. ఉదాహరణకి కరవు చుట్టూ నడిచే రాజకీయాలని స్వామి ఈ కథలోకి తీసుకు వచ్చిన శిల్ప పద్దతి. రాజకీయలు, వాటి ఎత్తుగడలూ తెలుగు కథల్లో వొక మూసలోకి దిగజారిపోయినప్పుడు వాటి వ్యక్తీకరణ తప్పనిసరిగా యాంత్రికమే అవుతుంది. స్వామి దీన్ని ఎలా అధిగమించి కథలోపలి కాల్పనిక వాస్తవికతలోకి తీసుకు వచ్చాడో సునిశితంగా గమనించాలి. రాజకీయాల్ని యథాతథంగా కథనం చెయ్యడం కాకుండా, అవి ఈ కథలోని జీవితాలతో పెనవేసుకుపోయిన తీరుని కూడా రచయిత వ్యాఖ్యానించాడు. గుత్తి రామకృష్ణ కథ "గంజి కరవు" నించి "రంకె " వరకూ ఇలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. కాని, స్వామి వ్యాఖ్యానంలో వినిపించే " ఐరనీ" స్వరంలో అనంత కథకులు ఈ 90ల లో సాధించిన శిల్ప విజయం వుంది.


3

ఈ కథలో శిల్ప పరంగా కాల్పనికత పోషించిన పాత్ర ఏమిటో నేను ఇక్కడ ప్రత్యేకించి చెప్పక్కరలేదు. కథ ఆది నించి అంతం దాకా కాల్పనికత ఆవహించి వుంటుంది. కాని,ఈ కాల్పనిక ఆవాహన వాస్తవికతకి అందమయిన/ సహేతుకమయిన కొనసాగింపు మాత్రమే. నగర కథకుల్లో మాదిరి ఈ వాస్తవికత విడిచి గాలిలో సాము చేసే కాల్పనికత కాదు. ఈ మధ్య నగర కాల్పనిక మాంత్రిక కథకులని ఉద్దేశించి నేను రాసిన ఈ నాలుగు ముక్కలతో ఇక ముగిస్తాను.


నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి, చెయ్యి కాల్తుందన్న భయం లేకుండా.
“ఎక్కడున్నాయి ఈ కాసిని కట్టెలయినా? పోనీ, ఈ నాలుగు చేతులయినా?” వొక ముసలి చెయ్యి నిట్టూరుస్తోంది, సగం ఖాళీ అయిన వూరు వైపు బలహీనంగా చూపు చాపి.
“వూరు సగం ఇళ్ళు, సగం వల్లకాడు. బతికి వున్న వాళ్ళు సగం శవాలు” ఇంకో గొంతు పిడచకట్టిన స్వరంతో మూల్గింది.
ఆ మూలుగు వినపడ్డదా, నగర కథకుడా! అద్భుత మాంత్రికుడా!
* *
ఆ మూలుగుని రంకె గా మార్చి వినిపిస్తున్న కథకుడు బండి నారాయణ స్వామి. ఈ రంకె నగర కథకులకి//విమర్శకులకి వినిపిస్తోందా అన్నది నా ప్రశ్న.

**
( పాల పిట్ట సాహిత్య మాస పత్రికలో కాలిబాట శీర్షికన వస్తున్న కాలమ్ నుంచి)
Web Statistics