Showing posts with label కవిత్వ కాలం. Show all posts
Showing posts with label కవిత్వ కాలం. Show all posts

Sunday, May 14, 2017

పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

చిత్రం: రాజశేఖర్ చంద్రం 



1 


కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి
దాన్ని కప్పేశాం, గుర్తుందా?
మరీ చిన్నప్పటి సరదా కదా,
గుర్తుండి వుండదులే!


*
 పద్యం కూడా అంతేనా ?

2

రాయడానికేమీ లేని తనం
నీకూ, నాకూ , బహుశా అందరికీ.
కచ్చితంగా ఇప్పుడే ఇష్టపడలేని హోంవర్కులాగా.
ఎంతకీ ప్రేమించలేని సిలబస్ లాగా.
బాధ లేదని కాదులే!
కాకపోతే, ఎవరి బాధో తప్ప
రాయలేని తనం
అరువు కళ్లతో ఏడుపు,
కొయ్య కాళ్ళతో పరుగు!  
*
ఏదో వొక కొయ్య కాలు చాలదేమో,  లోపలి పద్యానికి!


3

సొంతమూ, పరాయీ అని కాదు కాని
నువ్వు నీ దేహంలో సంచరించడం మానేసి
ఎంత కాలం అయ్యింది, చెప్పకూడదూ, కాస్త!
చర్మం కూడా  పరాయీ చొక్కాలాగే అనిపిస్తోందీ మధ్య.
  
*
మాటలో తేలిపోతుంది, నిజమేదో, కానిదేదో!

 4

తవ్వోడ దొరికింది సరే,
అదే పద్యం అనుకుంటున్నాం
నువ్వూ, నేనూ, అందరం!
లోపలా, బయటా చాలా చాలా తవ్వి పోశాం కానీ,
 లేని చోట తవ్వుకొని, వెతుక్కుంటే – దొరుకుతుందా, పద్యం?

  *
పద్యం పుట్టుక  అసలేమైనా గుర్తుందా?
వుండి వుండదులే,
మరీ చిన్నప్పటి సరదా కదా?!
 

Sunday, January 25, 2015

లోపలి ప్రయాణాలూ సాహసయాత్రలే!



17-మే-2013

Flash upon that inward eye
Which is the bliss of solitude.
టీనేజీ ఉరుకుల పరుగులలో ఈ వాక్యం మొదటి సారి విన్నప్పుడు ఆ solitude గానీ, ఆ inward eye గురించి గాని నాకు పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ, ఆ వాక్యం విన్నాక Wordsworth గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. బాహ్యజీవితం అంత హుషారుగా అనిపించని ఆ కాలంలో నేను Wordsworth చేతివేలు పట్టుకొని ఏవేవో వూహారణ్యాల్లో దారి తప్పే వాణ్ని, అతనే చెప్పిన ఆ inward eye మెరుపులు చూపుల్ని వెలిగిస్తూ వుండగా!
నిజమే, జీవితం ఎవరికీ సాఫీగా వుండదు. పోనీ అని, సూఫీగానూ వుండలేం! కుదుపులు వుంటాయి, వొళ్లు కదుము కట్టే దిగుళ్లూ వుంటాయి. కానీ, వాటిని కూడా ఉత్సాహంగా తీసుకునే శక్తి సంపాదించుకుంటే…అప్పుడేం చేస్తుందీ పాడు బతుకు?!
అలా ఉత్సాహంగా తీసుకునే శక్తి వూరికే రాదు, inward eye తో మన లోపలి లోకాల్లోకి ప్రయాణాలు చేస్తున్నప్పుడే అది సాధ్యం! ఈ లోప్రయాణం ఎలా వుంటుంది? నిజంగా ఈ ప్రయాణానికి మనం ఎప్పుడేనా సిద్ధంగా వుండగలమా? వున్నా, ఆ ప్రయాణం తుదకంటా వెళ్లగలమా? వెళ్ళినా తిరిగి రాగలమా? రాగలగినా అంతకు ముందులాంటి జీవితాన్ని జీవించగలమా? ఇవి తేలికగా అనిపించే గట్టి ప్రశ్నలు. సమాధానాలు ఎవరిదగ్గిరా సిద్ధంగా వుండవు, సిద్ధంగా వున్న సమాధానాలు ఎవరినీ సమాధాన పరచలేవు. ఎందుకంటే, ఎవరి ప్రయాణం వాళ్ళదే! ఎవరి అనుభవం వాళ్ళదే! కానీ, అనుభవమున్న ఇంకో పూర్వయాత్రికుడు కొన్ని వెలుగురేఖలు చూపించవచ్చు. వేలు పట్టి నడిపించకపోయినా, ముందుకు నడిపించే వొక సంకేతాన్ని అందించవచ్చు. ఇలాంటి వొక సంకేతశిల్పి సాయికిరణ్! గత నెల రోజులుగా ఈ శిల్పి చెక్కిన వొక ‘అంతర్యాన’ చిత్రపటం చేతుల్లో పెట్టుకొని నేను గడిచివచ్చిన కొన్ని దారుల్ని చూపించాలని ఇక్కడ నా ప్రయత్నం. ఇది కేవలం నా దారి, నా ప్రయత్నం. మీ మీ ప్రయాణాలకు వాటి దిగుళ్ళకీ నేను ఏ రకంగానూ పూచీపడడం లేదు.
2
ఎక్కడయినా వొంటరిగా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు వొకట్రెండు పుస్తకాలూ, కొన్ని ఆలోచనల్ని తోడు తీసుకెళ్ళడం నాకు అలవాటు. పోయిన నెల Raleigh-Durham వెళ్తూ, సాయికిరణ్ కవిత్వం ‘అంతర్యానం’ తోడు దొరికింది. ఇక ఆలోచనలు బోలెడు!
ప్రయాణం మొదలయిన కొద్ది సేపటికి ఆకాశ మార్గంలో విమానం కొన్ని మబ్బుల్లో చిక్కుకుంది. తలెత్తి చూస్తే మబ్బులు హడావుడిగా పరుగులు తీస్తున్నాయి. మబ్బుల మెట్ల మీంచి కిందికి దిగే ప్రయత్నంలో వుంది విమానం. అప్పుడు వొక్క కుదుపు ఇచ్చింది విమానం, వొక్కసారిగా రెండు మూడు మెట్లు దూకేసే అల్లరమ్మాయిలాగా! “ఎందుకింత తొందరా?!” అనుకుంటూ నేను అప్పటిదాకా నా లాప్ టాప్ లో చదువుతూ వున్న సాయికిరణ్ కవిత్వ పుస్తకాన్ని పక్కన పెట్టాను. కాసేపు నిబ్బరంగా వున్నాను కానీ, విమానంలోని అనౌన్సర్ ప్రకటనలూ, నా ఇరువేపులా ప్రయాణికుల కంగారూ చూసి నేనూ కాస్త కంగారు నటించక తప్పలేదు. అవును, నటనే! “ఏం ఈ మాత్రం కుదుపులు భరించలేమా?” అన్నది నా లోపలి పొగరుమోతు మోటు సమాధానం! ఆ సమాధానానికి లోపల్నించి సాయికిరణ్ వత్తాసు!
మబ్బుల రాపిళ్లకు
ఆకాశం
రంగు మార్చే లోపు
నీడ పొడవు
నిర్ధారించుకోవాలి.
అంటున్నాడు సాయికిరణ్. వూరికే అనడం లేదు, జీవితంతో చాలా పెద్ద లెక్క తేల్చుకోడానికి సిద్ధపడే ఇంత మాటా అంటున్నాడు. ఇలా అనడానికి సాఫీగా సాగే జీవితాన్నే కాదు, తట్టుకోలేని కుదుపుల్ని కూడా ఎన్నో చూసి వుండాలి సాయి. ఎంతో తట్టుకొని నిలబడితే తప్ప ఈ నిబ్బరపు పాఠం మనకి చెప్పలేడు కదా మరి! ఈ కాలపు కవిత్వంలో ఇదే సాయిమార్గం!
మీరు ఇప్పటికే ఈ పుస్తకం చూసి వుండకపోతే – వొక విషయం మీకు ముందే చెప్పాలి. ఈ పుస్తకాన్ని నేను వెనక నించి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పిన కవిత ఈ పుస్తకానికి ‘ముగింపు.’ నాకూ సాయికి (?) కొన్ని సాధారణ అసాధారణ లక్షణాలున్నాయి. అందులో వొకటి: కవిత్వ పుస్తకాన్ని వెనక నించి చదవాలన్న తిక్క. అయితే, నేను వొకే పుస్తకాన్ని అనేక సార్లు చదివే అలవాటు వున్న వాడిని కాబట్టి, మొదటి సారి చదివినప్పుడు తిక్కగా వెనక నించి చదివి, రెండో సారి చదివేటప్పుడు చక్కగా ముందు పేజీ నించి చదువుతాను. ఈ అలవాటుకి కారణమేమిటంటే: నా మటుకు నాకు సస్పెన్సు తట్టుకునే శక్తి లేకపోవడమే! చివరికేమిటీ గొడవ అన్నది మొదలే తేలిపోయిందనుకోండి – సినిమా కవిగారెవరో చెప్పినట్టు- ‘మనసు కాస్త కుదుటపడతది.’ ఇలాంటి అసాధారణ లక్షణాన్ని సాయికిరణ్ చాలా అందంగా కవిత్వం చేశాడు ఇక్కడ –
పుస్తకంలా
విచ్చుకున్న ఆకాశం
ఎగురుతున్న కాగితంలా
సముద్రం
పాతుకుపోయిన కాళ్ళు
పెరుక్కోలేని చెట్టులా
నేను
ఎటు నుంచి చదవాల్సిన
పుస్తకం ఇది?
ఈ కవితలో మొదటి రెండు – ఆకాశమూ, సముద్రమూ(అంటే – పుస్తకమూ, కాగితమూ) చలనశీలమైనవి కవి దృశ్యీకరించిన ప్రకారం చెట్టు (అంటే, ‘నేను’) చలనరహితం. మామూలుగా చెట్టు చలనరహితం కాదు. కాళ్ళు పెరుక్కోలేని తనం వున్నప్పటికీ చెట్టు నిలువునా కదులుతుంది. అయితే, ఈ కవితని కేవలం ఈ వాచ్యార్ధాలలో తేల్చుకోలేం. ఈ కవిత ప్రకృతిలో మన ఉనికి కంటే కూడా ఎక్కువగా మొత్తంగా కవిత్వ అనుభవంలో లేదా జీవిత అనుభవంలో మన ఉనికికి సంబంధించింది. కవిత్వం అనే అనుభవ మంటపంలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కునే కవిత ఇది.
ఆ కవిత చదువుతున్నప్పుడు అందులోని వాక్య సముదాయాలు రేపే సంచలనం ముందు మనం కాసేపు నిశ్చలనంగానే వుండిపోవాలి. తప్పదు. తను ఆ అనుభవాన్ని ఎటు నించి చూడాలన్నది కూడా సందిగ్ధమే. అదీ తప్పదు. కవిత్వంలోని రహస్యం ఏమిటంటే అది అనేకర్ధాల తలుపులు తెరుచుకోడానికి సిద్ధంగా వుంటుంది. వాటిని మనస్ఫూర్తిగా వొప్పుకోవడంతో సాయి ‘అంతర్యానం’లోని వొక చిక్కుముడి ఇట్టే విడిపోతుంది మనకి! ఈ పుస్తకంలోని ఏ కవితనయినా మీరు వొకసారి చదివి పక్కన పెట్టలేరు. ఆ వొకసారి చదివిన అనుభవాన్ని అలా జాగ్రత్తచేసుకుంటున్నప్పుడే సాయి ఇంకోసారి చదివింపజేసుకొని ఇంకో అనుభవద్వారాన్ని తెరుస్తాడు. అందుకే, నేను ఈ కవిత్వాన్ని ఆగి ఆగి చదివాను. ముందుకీ వెనక్కీ వెళ్తూ చదివాను. కానీ, ప్రతిసారీ ‘ఎటు నించి చదవాల్సిన పుస్తకం ఇది?” అన్న ప్రశ్న నాకు మిగిలిపోయింది. తమ్ముడు ఇక్బాల్ చంద్ ఈ కవిత్వాన్ని ‘ప్యూర్ పొయెట్రీ’ అంటున్నాడు. అలా అంటున్నప్పుడు ఆ purity ని తమ్ముడు ఎలా అర్థం చేసుకున్నాడో తెలీదు కానీ, నాకు మాత్రం ఈ పఠనం వల్ల కలిగే వొక స్వచ్చమయిన మెరుపు -పొద్దుటి కొద్దిపాటి వానలో తడిసిన ఆకు – మాదిరిగా అనిపిస్తుంది.
3
సాయి కవిత్వంలో ఇంకో అందం ఏమిటంటే: అది మన అనుభవ క్షేత్రంలోనే సంచరిస్తుంది. ఈ నలభై పైగా కవితల్లో ప్రతీదీ మన అనుభవమే; వొక వేళ మన అనుభవంలో లేని విషయం ఏదన్నా చెబితే, దాన్ని వెంటనే మన అనుభవంలోకి తీసుకు వచ్చే సరళమయిన మనసూ, నిండయిన భాషా సాయి దగ్గిర వున్నాయి. ఉదాహరణకి: ‘వలయాలు’ లాంటి కవితలు.
చినుకు పోట్లకి
ఛిద్రమయిన సెలయేరులా
నా వలయంలో
నేను తిరుగుతూనే వుంటాను
చీకటి తెలియని
రాత్రి కోసం.
చదవడానికి తేలికగా అనిపించే కవిత ఇది. కానీ, ఇందులో శబ్ద/ అర్థ వలయాలు చుట్టుకుంటూ వెళ్తే, భారతీయ తత్వశాస్త్ర చరిత్ర అంతా కనిపిస్తుంది. చదువరి మనసు/ ఆలోచన రెండూ ఎంత దూరం వెళ్తే అంత దూరం లాక్కు వెళ్ళడం మంచి కవిత్వ లక్షణాల్లో వొకటని నా నమ్మకం. సాయి కవిత్వంలో అలాంటి ఉదాహరణలు చాలా దొరుకుతాయి. వూరికే వొక్క సారి చదివినప్పుడు సాయి మంచి అనుభూతి శకలం పట్టుకున్నాడే అనిపిస్తుంది. కానీ, ఆ శకలాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే, పెద్ద డొంక ఏదో కదులుతుంది. అయితే, ఇది ముళ్ళ డొంక కాదు. జీవితాన్ని కంటి ముందు దృశ్యంలా పరచి అర్థాలు వెతుక్కోమనే పూలూ ముళ్లూ రాళ్లూ కలిసిన దారి. ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియాలంటే మీరు సాయి రాసిన ‘అంతర్యానం’ కవిత రెండు మూడు సార్లు చదవాలి. ఇందులో నాకు బాగా నచ్చిన పంక్తి ఇది:
సందేహ సముద్రంలో
చంద్రుడినై
అలల రాపిడి మధ్య
కాసేపు అస్తిత్వం కోల్పోతా.
ఈ వాక్యం నేను నాలోని భిన్న మానసిక/ భౌతిక స్థితులకు అన్వయించుకుంటూ కనీసం అరడజను సార్లు చదువుకున్నాను. గాయమ్మీద లేపనం రాసే వేళ్ళల్లో వుండే శక్తి ఏదో ఈ వాక్యాల్లో వుంది.
కవిత్వ వాక్యం మీద సాయికి చాలా పట్టింపు. వొక్క అనవసరమయిన పదమూ పడకుండా రాసింది కన్నా చెరిపింది ఎక్కువ అన్న భావం గట్టిగా కలుగుతుంది మొత్తం కవిత్వం చదివాక! ఇలాంటప్పుడు కూడా పునరుక్తి/ recurring images దొరక్కపోలేదు. పుస్తకం, జ్నాపకం, మబ్బు…ఇవి లేకుండా సాయి కవిత్వం రాయలేడా అనిపించింది కొన్ని సార్లు! ప్రతి రచయితకీ కొన్ని hanging words వుంటాయని బుచ్చిబాబు ఎక్కడో రాశాడు; అంటే, రచయిత ఉద్దేశపూర్వకంగానో, నిరుద్దేశపూర్వకంగానో కొన్ని పదాలలో repeat అవుతాడు. సాయి ‘అంతర్యానం’లో కూడా అలాంటి పదాలు దొరుకుతాయి. కానీ, అవి పంటి కింద రాయిలా తగలకుండా చూసుకోవడం సాయికి తెలుసు. అయినా సరే, అలాంటి పునరుక్తి లేని పునర్యానం కోసం ఎదురుచూస్తున్నా.

Friday, July 30, 2010

ఒక వీరశైవ, ధీర సూఫీ అర్ధనారీ"స్వరం" : నీలం మాయ

అయిల సైదాచారి మనకు కొత్త కాదు. అతని కవిత్వం ఇంతకు ముందే మనకు తెలుసు. అందరికీ తెలిసిన అందరూ మరచి పోవాలనుకునే వొక అనుదిన నేపథ్యం నించి సైదా చారి కవిత్వ అనుభవ మంటపంలోకి ప్రవేశించాడు. అతని కవిత్వం మొదటి సారి చదివినప్పుడు ఇది వొక భిన్నమయిన భాష అని మనకి వెంటనే అనుభవమవుతుంది. కాని, ఆ అనుభవం మనల్ని అంత తేలికగా వూపిరదనివ్వాడు. మనలోని నిబ్బరత్వాన్ని కాసేపు కల్లోలితం చేసి, అసహనానికి లిపి వెతుక్కున్నేలా చేస్తాడు. ఎంత దూరం, ఎంత లోతుల్లోకి వచ్చామనుకున్నా, తెలుగు కవిత్వం ఇంకా అనుభవాన్ని నిఖార్సుగా చెప్పుకునే స్థాయికి అయితే రాలేదు. కవిత్వాన్ని గురించి ఇంకా చాలా స్థిర నిశ్చితాలు వున్నాయి మనకి. కవిత్వం లలిత పద పల్లవ కోమలంగా వుండాలన్న అదృశ్య సంకెల ఇంకా తెగిపోలేదు. అంత లలితంగా నేను మాట్లాడలేను అని వెర్రి కేక అయినా వేసే కవులు లేకుండా పోతున్నారన్న నిరాశలో పడ్డప్పుడు సైదా చారి 'డూ డూ బసవన్న' లా కాకుండా సై సై రా రా బసవన్న అంటూ కొత్త రంకె వేస్తున్నాడు. ఇతని గొంతులో దూరం నించి ఎక్కడో ఆ వీర శైవ బసవన్న నాకు కనిపిస్తూనే వున్నాడు. ఆ పద చిత్రాలలోంచి అందుకే కన్నడ వచన కవుల అనుభవ మంటపంలోకి మనల్నితోసుకు తీసుకు పోతున్నాడు సైదా.

సైదా చారి అంటే వొక నెమ్మదయిన జ్ఞాపకం. నేను యూనివర్సిటీ మెట్లు ఎక్కి ఎమ్మే చదవాలి అని జ్వర తీవ్రతలాంటి వేదనతో కాలిపోతూ, ఆర్ధిక కారణాల వలన చదవలేక పత్రికా వుద్యోగంలోకి కలల్ని కుదించుకుని, మిత్రుల్ని కలిసే మిష మీద వుస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, అమెరికన్ లైబ్రరీ చుట్టూ పుస్తకాల కోసం తెగ వెతుక్కునే కాలంలో గుడిపాటి పుణ్యమా అని దొరికాడు ఈ సైదా నాకు. ఆ యూనివర్సిటీల మెత్తని గడ్డి మీదా, అక్కడి చెట్ల కిందటి గరం చాయ్ లూ , వుస్మానియా బిస్కట్ల చప్పరింతల మధ్య కవిత్వం అందరినీ కలిపే బంధం అయినప్పుడు, రామదాసు లాంటి మిత్రులు వాళ్ళ అనుదిన చర్య్లల్లోనూ మా 'రక్త స్పర్శ ' వాక్యాల్ని అలవోకగా కోట్ చేసే సమయాల్లో - వొక బక్క పలచటి దేహం లోంచి అందమయిన ముఖం లోంచి కాస్త సందేహిస్తూ, సంశయిస్తూ ఈ సైదా నెమ్మదిగా వొక వాక్యాన్ని సంధించే వాడు. "నువ్వు ఇలా ఎందుకు రాసావు? అలా ఎందుకు రాయలేదు?" అనే అతని అనేక ప్రశ్నల సారాంశం. ఇతనికి పదాల పట్టింపు ఎక్కువ అనుకునే వాళ్ళం చాలా సార్లు. నిత్యం ఏదో పోగొట్టుక్కున్న వాక్యాన్ని, ఆలోచనని వెతుక్కునే వాడిలాగా ఎప్పుడయినా మెత్తగా నవ్వుతూ, ఎక్కువగా ప్రశ్నార్ధకాలు రువ్వుతూ వుండే సైదా ఆ కాలంలో రహస్యంగా కవిత్వం రాస్తూ వుండే వాడని నా అనుమానం.

సైదా చాలా కాలం చ డీ చప్పుడూ లేకుండా రాసాడు. రాసి, వాటిని ఏ దిండు కిందనో దాచేసుకొని, వొక అర్ధ రాత్రి లేచి కూర్చొని, చీకటికి తన వాక్యాలన్నీ తనివి తీరా వినిపించుకొని వుంటాడు, తనకి తనే శ్రోత అయి - రాసిన వెంటనే కవిత్వం అచ్చు అయ్యి, తెల్లారే లేచి, వొక అవార్డు క్యూలోనో , విమర్శకుడి ముంగిటనో ముగ్గులా నిలబడే
కాలంలో, సైదా చారి వొక వింత జీవి. అమామూలు కవి. కవిత్వం వల్ల వచ్చే అదనపు లాభాల మీద అతనికి మోజు లేదు. ఆ మాట కొస్తే కవుల మీద అతనికి కాసిన్ని అనుమానాలూ వుండి వుండ వచ్చు. ప్రేమిస్తూనే ప్రశ్నించే గట్టి వ్యక్తిత్వ బలం అతని పదాల్లోకీ ప్రవహిస్తుంది. ఎందుకు అన్న నిలవనీని ప్రశ్న అతని కవిత్వాన్ని కన్నడ వచన కవుల వరసలోకి లాక్కెళ్తుంది. అతను కవిత్వంలో పదాల్నీ, వాక్యాలనీ అనురాగంతో శంకిస్తాడు. . మనసులోని మాటని ఓవర్ రైట్ చేసే భాష పెత్తనాన్ని సహించడు.

అక్క మహాదేవి పూనినట్టు, అల్లామా ప్రభు లోపలి నించి గొంతు సవరించు కున్నట్టు సైదా ఎందుకు మాట్లాడుతున్నాడు? అ త ని వాక్యాల మధ్యకి ఆ విశ్వ బ్రాహ్మల పని ముట్లు, ఆ జాన్ పాడు సైదులు నమ్మకాల తాయెత్తులు, ఆ ఆడ వాళ్ళ రూపంలో అనేక భావాల సంచారీ తనం ఎక్కడి నించి వస్తున్నాయి? కవి , ఆ మాటకొస్తే మనిషి ఆ పాత అస్తిత్వపు జంఝాటాల నించి ఎలాంటి స్మృతిని తీసుకు వస్తాడు? అది అతనికి కొత్త ఉనికి ఇస్తుందా? గతంలోకి విసిరేస్తుందా? అంత తేలిక కాదు సమాధానం. కాని, అది సైదా కవిత్వాన్ని చిక్కన చేస్తుంది. సైదా కవిత్వంలోని ఆడ వాళ్ళు నిజంగా ఆడ వాళ్ళు కాదు, వాళ్ళు మనలోని ఆదిమ భావనల మెటఫర్లు. మన లోపల మనం సిగ్గుపడి చిదిమేసిన సహజాతాల ఆనవాళ్ళు. అందుకే, ఈ కవిత్వంలో ఎక్కడ ఆడతనం అంతమవుతుందో, ఎక్కడ భావం పుడ్తుందో తేలికగా తేలదు. చదివే వాళ్ళు ఇతనికి 'ఆడదన్నా/ కొండలన్నా అబ్సెషన్ ' అనుకునేంతగా ఆడదీ/భావనా పెనవేసుకు పోయాయి ఈ కవిత్వంలో.

సైదా చారి ఈ 'నీలం బొమ్మ'ని చదివి అర్ధం చేసుకోవడానికి మనకి చాలా సందర్భాల్లో మన లోపలి మనల్ని వొక సారి అతిధిగా అయినా చూసి వచ్చే సహనం వుండాలి. ఎక్కడో లతా మంగేష్కర్ గొప్ప మాట చెప్పింది " నాతొ నేను కాసేపు అప్పాయింట్మెంట్ తీసుకోవాలి' అని. అది ఆమె తన జీవితంలో నిజంగా చెయ్య గలిగిందో లేదో మనకి తెలియదు. కాని, ఇక్కడ వొక తెలుగు కవి వొక నగరం మూల నించి, వొక గది మూల నించి అక్షరమ్ తడి చెయ్యి చాచి, "అవును ఇది మనలోపలి ఆడతనపు సహజాతంతో సంభాషణ చేసే వేళాయెరా " అని అలలితంగా అపల్లవి గా, అకోమలంగా అంటున్నాడు. మీ కాళ్ళని కాస్త ఏ చెరువు నీళ్ళలోనో స్నానం చేయించి, ఈ గడ్డి ఆకుపచ్చత్వం తగిలేలా నేల మట్టిదనం మిమ్మల్ని కడిగేలా నడవండి మీ అహం మీంచి.

-

పూర్తి కాని వాక్యాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-   1           మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!   ...