Showing posts with label ఇంటర్వ్యూ. Show all posts
Showing posts with label ఇంటర్వ్యూ. Show all posts

Saturday, December 7, 2024

నిష్పాక్షికత- అనేది ఎంతవరకు సాధ్యమో!


ఇంటర్వ్యూ: పలమనేరు బాలాజి

చనలో మమేకత్వం,ఒక సహజత్వం, ఒక అసాధారణత అఫ్సర్ సాహిత్య లక్షణం.
కథ రాసినా కవిత్వం రాసినా విమర్శ చేసినా ,అనువాదం చేసినా ,పరిశోధన చేసినా, ఏదైనా సరే ఎవరు వెళ్ళని దారిలో వెళ్లడం మనసుపెట్టి పనిచేయటం అఫ్సర్ వ్యక్తిత్వం. గుడిపాటి గారు అన్నట్టు నిజంగా నిరంతరం సాహిత్యజీవిగా ఉండటం అంటే ఏమిటో ఎలానో మనం అఫ్సర్ నుండి నేర్చుకోవాలి.

కవి కథకుడు విమర్శకుడు అనువాదకుడు పరిశోధకుడు సంపాదకుడు సాహిత్య పత్రిక నిర్వాహకుడుగా నిరంతరం సాహిత్య సృజన కొనసాగిస్తూ తన పని చేసుకుంటూ నిశ్శబ్దంగా తన సాహిత్య ప్రయాణాన్ని తనదైన మార్గంలో కొనసాగిస్తున్న నిగర్వి, స్నేహశీలి అఫ్సర్ కవిసంగమం - కవితావరణం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఈవారం...

*
1.మీ కవిత్వం చదువుతూ ఉంటే సాహిత్యాన్ని మాత్రమే కాదు జీవితాన్ని కూడా మీరు చాలా సీరియస్ గా అధ్యయనం చేస్తున్నట్టు కనబడుతోంది. నిష్పాక్షికంగా జీవితాన్ని చూసే పద్ధతి మీకు ఎలా అలవడింది?
*అధ్యయనం మొదటి నించీ జీవితంలో భాగంగా ఇంకిపోయింది. పుస్తకంతో పాటు అనుభవాల అధ్యయనం కూడా కొంత ఆలస్యంగా అలవాటైంది. నిష్పాక్షికత- అనేది ఎంతవరకు సాధ్యమో నాకు ఇంకా తెలీదు. కానీ, వీలైనంత విశాలంగానో, ఓపెన్ గానో వుండడానికి ప్రయత్నించడం అవసరం. అలా ఓపెన్ గా వుంటే, ఎక్కువ నేర్చుకుంటాం. జర్నలిజంలో వున్న కాలం నుంచీ అదే దృక్పథం నన్ను నడిపించిందేమో. అదృష్టం బాగుండి, స్కూలు రోజుల నుంచీ మంచి స్నేహితులు చుట్టూ వుండడం, వాళ్ళకీ నాకూ ఒకే రకమైన అభిరుచులు వుండడం కూడా కలిసివచ్చింది. అమెరికాలో అధ్యాపనం వల్ల ఈ ధోరణి మరింత బలపడింది. ఇక్కడ ప్రతి రోజూ కొత్త తరం విద్యార్థులతో చర్చలూ, సమావేశాలూ నాకు కొత్త పాఠాలు నేర్పాయి.

2. సమకాలీన కవుల సాహిత్యం పట్ల మీరు చాలా సహృదయంతో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. కొత్త కవులను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల వారితో అన్ని వయసుల వారితో మీరు మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రత్యేక సాహిత్య వ్యక్తిత్వం సాహిత్యకారులలో మిమ్మలను ప్రత్యేకంగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఈ సంస్కారం, స్నేహ స్వభావం మీకు ఎలా అలవడింది?
*ఇది నా గురించి నా అన్వేషణలో భాగమే. సమకాలంలో సమానంగా వుండాలన్న తపన. రచనల ప్రమాణాలు ఎప్పుడూ మారుతూ వుంటాయి. ఆ మార్పుని తెలుసుకోవాలంటే మనలో కొత్త చూపు ఎప్పుడూ వుండాల్సిందే. అది కేవలం మానకాలం రచయితల్ని చదవడం వల్లనే సాధ్యం. Learning process నిరంతరం. ఇవాళ ఒక కొత్త వాక్యం చదివినప్పుడు అది మరింత అర్థవంతమవుతుంది, అర్థమవుతుంది. కొత్తగా రాస్తున్న కవులకి ఈ కొత్త వాక్యాల ఆచూకీ తెలుసు.

3. మీరు అనుకున్నట్టుగా మీ సాహిత్య ప్రస్థానం కొనసాగుతూ ఉన్నదా? ఏవైనా ఆటంకాలను అధిగమించారా? ఎప్పటికప్పుడు పునరుత్తేజం పొందటంలో, నూతన ఉత్సాహాన్ని పొందటంలో మీ కుటుంబ సభ్యుల మిత్రుల స్ఫూర్తి గురించి కొంచెం చెబుతారా?
*సాహిత్య ప్రస్థానం ఫలానా విధంగా వుండాలని నేనేమీ అనుకోలేదు. ఏమైనా అవకాశాలూ, మలుపులూ వచ్చి వుంటే, అవి కేవలం అనుకోకుండా వచ్చినవే. కాకపోతే, ప్రచురించిన ప్రతి పుస్తకం ఎంతో కొంత గుర్తింపు సాధించుకుంది. “రక్తస్పర్శ” కి మంచి సమీక్షలు దక్కాయి, “ఇవాళ” కి ఫ్రీ వర్స్ ఫ్రంట్ తో పాటు ఆ ఏడాది కనీసం పది అవార్డులు వచ్చాయి. “వలస” “ఊరి చివర” “ఇంటివైపు” కూడా మంచి పురస్కారాలు అందుకున్నాయి. సాహిత్య విమర్శలో “ఆధునికత- అత్యాధునికత” తో పాటు “కథ-స్థానికత” కి గౌరవాలు దక్కాయి.

4. కొంతమంది కవిత్వం కొంతమంది కవులు కొంతమంది విమర్శకులు కొంతమంది సంపాదకులు కవులుగా మారాల్సిన పాఠకులను భయపెడుతూ ఉన్నారు. ఈ భయాలతో కొంతమంది తెరచాటునే ఉండిపోతున్నారు. రాసింది పత్రికలకు పంపలేక , పత్రికలలో అంతర్జాలంలో ప్రచురితమైన కవితలను పుస్తకంగా తీసుకు రాలేక ఎంతో మంది నలిగిపోతున్నారు. ఈ స్థితి నుంచి ఈ భయాలనుంచి వారు బయటపడి కవిత్వం రాయటానికి కవిత పుస్తకాలను అచ్చు వేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు?
*ఈ పరిస్తితి తెలుగు సాహిత్యంలో కొత్తేమీ కాదు. “రక్తస్పర్శ” కవిత్వం పుస్తకం వచ్చేనాటికి కూడా మా కవిత్వాలు సరిగా అచ్చుకి నోచుకోలేదు. అప్పటి పత్రికలు “ఇది తెలుగు కవిత్వం కాదు,” అని తిప్పి పంపిన ఉదాహరణలు చాలా వున్నాయి. అలాగే, కవిత్వం ఒకే విధంగా చదివే అలవాటున్న విమర్శకులు వాటిని ఒప్పుకోకపోవడమూ వుంది. అప్పటి స్థితితో పోల్చితే, ఇప్పుడు చాలా నయం. కొత్త కవిత్వాన్ని ఇష్టంగా అక్కున చేర్చుకునే వేదికలున్నాయి, కొన్ని అంతర్జాల పత్రికలున్నాయి, కవిసంగమం లాంటివి వున్నాయి. పుస్తకాలు అచ్చు వేసుకోడం కూడా అప్పటికంటే ఇప్పుడు చవక. డిజిటల్ ప్రచురణ చాలా మంచి సాహిత్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. అదేవిధంగా, కొన్ని ప్రచురణ సంస్థలు కేవలం కవిత్వ ప్రచురణకి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇది కొండంత ధైర్యం. అయితే, ఎన్ని భయాలున్నా, పరిమితులున్నా, నిజమైన కవులు రాయకుండా వుండలేరు. అలా వుండేట్టు అయితే, ఇవాళ ఇంత కవిత్వ సంపద మన ముందు వుండేది కాదు. నా మటుకు నాకు మంచి కవిత్వమైనా, మంచి సాహిత్యమైనా వేగంగా విస్తరించడానికి మంచి సంపాదకులు అవసరం. వీళ్ళు మాత్రం అరుదైపోతున్నారన్నది వాస్తవం.

5. అనుకరణకు లొంగని శైలి మీ సొంతం. మీది బలమైన సొంత గొంతుక. కథ రాసినా కవిత్వం రాసినా వ్యాసం రాసినా చాలా నిక్కచ్చిగా చిక్కగా వాస్తవికంగా ఉంటుంది.. మీ ధోరణి. రాయడంలో ప్రతి కవికి ఎదురయ్యే అనేకానేక మొహమాటలను ఎట్లా అధిగమించారు?
*మీ ప్రశంసకి చాలా థాంక్స్. రాయడంలో మొహమాటలేమీ వుండవు. అది కవిత్వమైనా, విమర్శ అయినా- రాయాల్సిందే రాస్తాను. అలా నిక్కచ్చిగా వుండడం వల్లనే “ఆధునికత- అత్యాధునికత” (1992) “కథ-స్థానికత (2010) విమర్శ పుస్తకాల మీద విస్తారమైన చర్చ జరిగింది. ఇప్పటికీ వాటి గురించి చాలా మంది అడుగుతూనే వున్నారు, మాట్లాడుతూనే వున్నారు. నా విషయంలో సృజన, విమర్శ రెండూ ఒకే సమయంలో జరిగాయి కాబట్టి, నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడం కొంత తేలిక అయింది. మొదట్లో నా కవిత్వం మీద వచ్చిన విమర్శలని తలచుకుంటూ అప్పుడప్పుడూ శివారెడ్డి గారు అంటారు “ నువ్వు కాబట్టి ధైర్యంగా నిలబడ్డావయా?” అని- అందులో ధైర్యం నాలోపలి విమర్శకుడు ఇచ్చిన ధైర్యమే! ఇప్పుడు ఆ ప్రయాణం అంతా సాఫీగా అనిపిస్తుంది కానీ, నిజానికి ఏ సాహిత్య ప్రయాణమూ సాఫీగా వుండదు. శివారెడ్డి గారి కవిత్వం మొదటి రోజుల్లో కూడా విమర్శలకు తక్కువేమీ లేదు. అవి కొన్ని సార్లు రచనలో మొహమాటాలకు దారితీయడం సహజం. కొన్ని భయాలూ ఏర్పడతాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. ఇప్పటికీ లోపల ఆ యుద్ధం నడుస్తూనే వుంటుంది. ఈ యుద్ధానికి కొత్త కవీ, పాత కవీ అనే మొహమాటమేమీ లేదు.

6. కొత్త కవులు కొత్త రచయితలు కొత్త విమర్శకులకు సంబంధించి, యువ సాహితీ వేత్తలకు సంబంధించి అంతర్జాల పత్రిక నిర్వాహకుడిగా మీరు గమనించిన ప్రత్యేకమైన అంశాలను గురించి కొంచెం చెబుతారా?
*సారంగ నిర్వహణ కంటే ముందే నేను అక్కడ వున్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమిలో సాహిత్య పేజీలు నిర్వహించాను. అసలు సాహిత్యానికి నిండు పేజీ వుండాలన్న ఆలోచన ఆంధ్రజ్యోతిలో వున్న కాలంలో పెద్ద ప్రయోగం. అప్పటి నుంచీ ఇప్పటి సారంగ దాకా నా దృష్టి ప్రధానంగా కొత్త తరానికి ఏం చేయగలం అన్నదే! అయితే, ఇదేమీ అనుకున్నంత సులువు కాదు. ఇప్పటికీ రాయగానే వెంటనే వాయువేగంతో పత్రికకి పంపించేసే అలవాటు చాలా మందికి వుంది. అలాగే, తమ రచనలే ఎక్కువగా కనిపించాలనే తాపత్రయం కూడా కొంతమందిలో వుంది. పత్రికలో ఇది సాధ్యపడదు. వీలైనంత ఎక్కువ మందికి పత్రిక చోటు ఇవ్వాలి. పత్రిక స్పేస్ కూడా పరిమితంగా వుంటుంది. సారంగ కి ఇప్పుడు ప్రతిరోజూ కనీసం పాతిక మంచి రచనలు వస్తాయి. (ఇక ప్రచురణకి ఏమాత్రం పనికిరానివి పెద్ద సంఖ్యలోనే వుంటాయి). కానీ, సారంగ పది మహా అయితే పన్నెండు రచనలు మాత్రమే ప్రచురిస్తుంది. అలాంటప్పుడు రచన నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అందువల్లనే, ఆ పది రచనలు గట్టిగా వుంటాయి. వాటికి వచ్చే స్పందనలు కూడా గట్టిగా వుంటాయి. రచన చేయడం ఎంత పెద్ద బాధ్యతో, రచనని అచ్చు వేయడం కూడా అంతే పెద్ద బాధ్యత. రచయితలు కూడా పత్రిక పరిమితులు అర్థం చేసుకొని మెలగాలి. ఒక రచన అచ్చు వేసినప్పుడు ఎడిటర్ ని మెచ్చుకొని, ఇంకో రచన అచ్చు కానప్పుడు అదే ఎడిటర్ కి శాపనార్ధాలు పెట్టడం ఆరోగ్యకరమైన ధోరణి కాదు. ఈ ధోరణి పెరుగుతున్నందువల్ల చాలా మంది ఎడిటర్లలో ఒక విధమైన నిరసన భావమూ పెరుగుతుంది. మంచి ఎడిటర్ ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే!

7. ప్రతి కవితలో మీ భాష మీ శైలి భావప్రకటన మెరుగుపడుతూనే ఉంది. అత్యంత మెరుగ్గా కవిత్వ ప్రక్రియ కొనసాగటానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు లేదా మీరు పాటించే సూత్రాలు లేదా మీ కవిత్వరచనా ప్రక్రియ విధానం గురించి..
*రచన పట్ల గౌరవం వుండాలి ముఖ్యంగా- మనం రాసే వాక్యం పట్ల ప్రేమా వుండాలి. చాలా మంది నిరంతర అధ్యయనం గురించి చెప్తూనే వున్నారు. కానీ, దాని కంటే ముఖ్యంగా ఇతరుల రచనలు చదివే సహనం వుండాలి. ఆహ్వానించే మనసూ వుండాలి. కవిత్వ రచనలో నేనేమీ ప్రత్యేక సూత్రాలు పాటించడం లేదు. మొదట రాయాలనుకున్నది రాస్తాను. తరవాత ఎడిటింగ్ చేస్తాను. ఈ ఎడిటింగ్ దశలో వచ్చే ప్రతి మార్పునీ ఆహ్వానిస్తాను. అలాగే రాసిందల్లా అచ్చుకి పంపించాలన్న ఉత్సాహాన్ని అణచుకుంటాను. రాసింది కొన్నాళ్లు నా దగ్గిరే పెట్టుకొని, పదేపదే చదువుకుంటాను. ఇది కవిత్వమైనా, వచనమైనా సరే. అందుకే, నేను ఎక్కువగా రాయలేను. అదీ మంచిదే.

8. కవి సంగమం గురించి..
*కవిసంగమం ఒక మలుపు. సోషల్ మీడియాలో పెడధోరణులు పెరిగిపోతున్న కాలంలో కవిసంగమం వాటిని సవాలు చేస్తూ నడుస్తోంది. కొత్త తరానికి వేదిక. నేర్చుకోడానికి అవకాశం కలిపిస్తున్న పాఠశాల..

Monday, January 15, 2018

ఒకే ఒక్క ఆసరా- కవిత్వం!

'ఇంటివైపు' ఓ సంజ్ఞ, సంకేతం, ఓ సంతకం. ప్రవాసి హృదయపు బెంగటిల్లిన అక్షరం. కాలూనిన ప్రతి మట్టిరేణువులో తన పుట్టినూరుని తలుచుకునే ఓ సగటు మనిషి పలవరింత. కవిత్వంలో ఎప్పుడూ నూతనత్వాన్ని నిలుపుకుంటూ ఐదు కవిత్వసంపుటుల మేరా విస్తరించిన కవి. మామూలు విషయాలనే భిన్నమైన ఆనుభవిక స్పర్శతో చూడాలన్న తపన ఇటీవలి 'ఇంటివైపు'కవితాసంపుటి. సూఫీ భావనల ఆవరింపులోంచి వైవిధ్యంగా పలికిన కవిత్వమిది. కవి పరిశోధకుడు అఫ్సర్ తో కవియాకూబ్ ఇటీవలి సంభాషణ నమస్తే తెలంగాణాలో...


1.       “ఊరిచివర” వెలువడిన ఎనిమిదేళ్ళ తరవాత మీరు “ఇంటివైపు” అనే శీర్షికతో మళ్ళీ కవిగా ముందుకు వచ్చారు. రెండు కవిత్వ సంపుటాల మధ్య ఇంత దీర్ఘ కాలం యెందుకు పట్టింది?

అఫ్సర్: అవున్నిజమే. నేను వొక్కో సంపుటి మధ్యా చాలా వ్యవధి తీసుకుంటున్నా. మొదటి నించీ అంతే! అనుకొకుండానే ప్రతి సంపుటికీ మధ్యా ఆ ఆలస్యం జరుగుతూ వస్తోంది. బహుశా, సీతారాం, ప్రసేన్ లతో కలిసి ప్రచురించిన “రక్తస్పర్శ” (1986) కూడా కలుపుకొని, మధ్యలో వచ్చిన నాలుగు కవిత్వ సంపుటాల కన్నా ఎక్కువ పేజీలున్న కవిత్వ సంపుటి ఇప్పటి ఈ “ఇంటి వైపు.” 
ఈసారి ఆలస్యానికి సరయిన కారణాలున్నాయని అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ  ఎనిమిదేళ్ళు నా సాహిత్య ప్రయాణంలో కీలకమైనవని అనుకుంటున్నా. ఇంతకుముందు యెన్నడూ అనుభవించి ఎరుగని సంఘర్షణ ఈ  దశలో ఎదుర్కొన్నాను. ప్రత్యేక తెలంగాణా, సూఫీయిజం, గృహోన్ముఖీనత మొదలైనవి పూర్తిగా కొత్త లక్షణాలు కాకపోయినా వాటి తీవ్రతని అనుభవించీ పలవరించిన దశ ఇది. “ఊరిచివర” (2009)లో ఈ ధోరణులు చాయామాత్రంగా కనిపిస్తే, “ఇంటివైపు”లో వాటి తీవ్ర రూపం కనిపిస్తుంది. ఒక్కో కవితని రాసిన తరవాత ఒకటికి పదిసార్లు సరిదిద్దుకుని, పునరాలోచించుకొనీ ప్రచురణకిచ్చాను. అయితే, వాటి తాజాదనం చెదిరిపోకుండా సరిదిద్దుకున్నా.

2.       కవిత్వం మీకేమిటి? మీరు కవిత్వాన్ని ఎట్లా చూస్తారు?

కవిత్వం నాకు ఒక ఆంతరంగిక  నిత్యావసరం  అనవచ్చు. సాహిత్య ఊహ తెలిసిన తరవాత నన్ను నిర్మొహమాటంగా  వ్యక్తం చేసిన రూపం కవిత్వమే. అనేకవిధాలుగా చెప్పాలంటే, మిగిలిన సాహిత్య ప్రక్రియల మీద కూడా నాకు ఆసక్తి వున్నప్పటికీ నేను నేనుగా కనిపించే స్పష్టమైన అద్దం కవిత్వమే! మిగిలిన సాహిత్య రూపాలు అంటే- కథా, సాహిత్య విమర్శా, అనువాదాలు- మొదలైనవాటిలో నా వైపు నుంచి  కొనసాగింపు అంతగా కనిపించదు. కవిత్వం ఒక్కటే నాలో నిరంతరంగా కనిపిస్తుంది. నేను ఎక్కువగా చదివేదీ కవిత్వమే. ఉద్యోగపరంగా ఎక్కువగా పాఠాలు చెప్పేదీ కవిత్వమే. అనుదిన జీవన వ్యాపకాల్లో నా తక్షణ ప్రతిఫలనం కవిత్వమే. ప్రతి జీవితంలోనూ, జీవికలోనూ ఒక ఖాళీ వుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ఆ ఖాళీని నింపుకుంటారు. నాకు అది కవిత్వం ద్వారా మాత్రమే సాధ్యమైంది.

3.       మీ కవిసమయాలూ సందర్భాలూ ఏమిటి?

ప్రత్యేకంగా అట్లాంటి సమయాలూ సందర్భాలూ లేవు. కవిత్వ సృజన పరంగా నాది సరళమైన ప్రపంచం. కొత్త స్థల కాలాలతో పాటు కొత్త సందర్భాలకు కూడా తేలికగా ఒదిగి వుంటాను. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళలో  వృత్తిపరంగానూ, డానికి సంబంధించిన పనుల ఒత్తిడి వల్లా ఎక్కువ సంఘర్షణకి లోనయ్యాను. ఉద్యోగరీత్యా అంతకుముందు అనుభవంలో లేని కొత్త కోర్సులు చెప్పాల్సి వచ్చింది, కొత్త బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వచ్చింది. కాబట్టి, చాలా ఒత్తిళ్ళ మధ్య కవిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. కవిత్వం ఒక instinct అని చాలా సార్లు అనుకుంటాం కాని, నిజానికి కాదు. కొన్ని సార్లు మనం మనంగా మిగలడానికి కూడా చాలా ప్రయత్నం చేయాల్సి వుంటుంది. కొన్ని క్షణాలు మరీ పరాయీ అయిపోతాం, మనలో మనం మిగలం. అలా మిగుల్చుకునే సందర్భాలే కవిత్వం రాస్తాం. ఆ కారణంగా ఈ ఎనిమిదేళ్ళలో నేను చాలా తక్కువ రాశాను, గతంతో పోలిస్తే!

4.       మీ కవిత్వ పుస్తకాల శీర్షికలు – “ఇవాళ” “వలస” ఊరిచివర” కొత్తగా “ఇంటి వైపు” – చాలా భిన్నంగా, నిర్దిష్టంగా వుంటాయి. మీరు ఉద్దేశ పూర్వకంగా ఈ భిన్నత్వాన్ని, నిర్దిష్టతని లక్ష్యంగా పెట్టుకొని శీర్షికలు ఇచ్చారా?

చాలా మటుకు యాదృచ్చికంగా పెట్టిన శీర్షికలే అవి. అయితే, గమ్మత్తుగా అవి నా జీవన సందర్భాలకు సరిపోయాయి. “ఇవాళ” శీర్షిక మొదటి సారి నేను మిత్రులతో చెప్పినప్పుడు “అందులో నీ కవిత్వ గాఢత లేనేలేదు” అని కొట్టి పడేసిన వాళ్ళు ఎక్కువే. “వలస” “ఊరి చివర” ఇప్పుడు “ఇంటివైపు” కూడా అంతే. ముందే చెప్పినట్టు, నాది సరళమైన ప్రపంచం. నా కవిత్వ ప్రయాణం కూడా అంతే. “రక్తస్పర్శ” నుంచి “ఇంటివైపు” దాకా గమనిస్తే, నేను సంక్లిష్టత నుంచి సరళత్వం వైపు ప్రయాణించాను. సరళంగా మాట్లాడడం, కవిత్వం చెప్పడం చాలా కష్టమని అర్థమైంది. ఆ కోణంలోంచే నా కవిత్వ పుస్తకాల శీర్షికలు కూడా-

5.       సమకాలీన కవులకు అఫ్సర్ కవిత్వం భిన్నంగా వుంటుందన్నది  సాధారణంగా ఏర్పడిపోయిన భావన. ఆ భిన్నత్వాన్ని మీరెలా చూస్తారు?

ప్రతి కవీ తనదైన వ్యక్తిత్వంతోనే వస్తాడు. అనుభవంతో మొదలుకొని భాషా, దృక్పథం దాకా ఆ భిన్నత్వం కనిపిస్తుంది. అనుభవంలోని మెరుపు పెరిగే కొద్దీ కవిత్వంలోనూ ఆ మెరుపులు కనిపిస్తాయి. వెంటనే భాషలో ఆ కాంతి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కవికి భాష చాలా అవసరమైన సాధనం. కవి వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే తొలి గుర్తు.  అనుభవంలోని వైవిధ్యం లేదా మామూలు విషయాలనే భిన్నమైన ఆనుభవిక స్పర్శతో చూడాలన్న తపన మన వ్యక్తీకరణని కాస్త కొత్తగా వెలిగిస్తుంది. బహుశా, ప్రతి వొక్కరూ ఆ వెలుగు కోసం వెతుక్కుంటూ వుంటారు. సాహిత్యం ఆసరా దొరికిన వాళ్ళు ఇంకాస్త ఉద్వేగంగా వెతుక్కుంటారు. నేనూ అంతే!

6.       మీరు మైనారిటీ స్వరాన్ని వినిపిస్తూనే ఒక విశ్వజనీన దృక్పథాన్ని కవిత్వంలో వ్యక్తం చేస్తారు. ఈ సమన్వయం యెలా సాధ్యపడింది?

నేను మైనారిటీని కాదు. అట్లాగని మెజారిటీని కాదు. నేను నేనుగానే వుంటాను, అన్ని  సామాజిక కొలమానాలు విఫలమయ్యేలా! నిర్దిష్టతనీ, స్థానికతనీ ఒక సైద్ధాంతిక భూమికగా బలంగా నమ్మే వ్యక్తిని నేను.  ఆ రెండీటిలో వుండే రంగూ రుచీ వాసనా నన్ను నిర్వచిస్తాయి. కొన్ని సార్లు కవి తను ఫలానా అని చెప్పుకున్నా, అతని కవిత్వం ఆ ఫలానాలో ఇమడదు. అలాంటి “ఫలానా” ముద్రల్ని ధ్వంసం చేసుకునే శక్తి కవిత్వంలోని మాజిక్. పాల్కురికి సోమన  నుంచి ఇప్పటి కొత్త కవి  దాకా మనకి తెలిసిన ప్రతి కవీ ఈ మాజిక్ కి ఒక ఉదాహరణే.

7.       దాదాపు మూడున్నర దశాబ్దాల మీ కవిత్వంలో ముఖ్యంగా ప్రాంతంగా చూస్తే నాలుగు దశలు కనిపిస్తాయి నాకు- ఖమ్మం/ విజయవాడ/ అనంతపురం/ అమెరికా. ఇది కేవలం ప్రాంతానికి సంబంధించిన మార్పు కాదనీ, అంతకుమించిన మార్పు ఏదో మీ కవిత్వంలో కనిపిస్తుంది. మీకూ అలాగే అనిపిస్తోందా?

మంచి పరిశీలన! ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఖమ్మం మునేరులో మునిగాను, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తేలాను. మధ్యలో బెజవాడ, హైదరాబాద్, అనంతపురం లాంటి మజిలీలు వున్నాయి. ప్రాంతం కవి ఆనవాలు. నా కవిత్వ సంపుటాల్లో – “రక్తస్పర్శ” ఖమ్మం, “ఇవాళ” బెజవాడ, “వలస” అనంతపురం, “ఊరి చివర” అమెరికాలోని టెక్సాస్, “ఇంటి వైపు” ఫిలడెల్ఫియాలో వుండగా రాసినవి. ఆయా ప్రాంతాలకూ, ఆ కవిత్వ సంపుటాలకూ తప్పనిసరిగా చుట్టరికం వుంది. ఆయా ప్రాంతాల సాంస్కృతిక అంతస్సు వాటిల్లో యెంతో కొంత మౌలికంగా కనిపిస్తూ వుంటుంది. అయితే, నేను పెరిగిన, చదువుకున్న, నా తొలి అనవాళ్ళన్నీ తెలంగాణాలో వున్నాయి. మా కుటుంబ చరిత్ర తెలంగాణా సాయుధ పోరాటంతో ముడిపడి వుంది. వామపక్ష రాజకీయాలతో కలగలిసి వుంది. ఎక్కడున్నా యెలా వున్నా, వాటిని నేను నా వ్యక్తిత్వంలోంచి దూరంగా పెట్టలేను.  ప్రాంతానికి మించిన మార్పు అని మీరంటున్నది ఏదైతే వుందో, అది నా నేపధ్యం, నన్ను పెంచి పెద్ద చేసిన చరిత్ర. అందులోనే నేనున్నాను.

8.       ఒక ముస్లింగా మీరు కవిత్వంలో బలంగా వ్యక్తమవ్వాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చింది?

భారతదేశంలోని  యే ముస్లిం కవికైనా అది డిసెంబర్ ఆరు 1992 అనే అనుకుంటాను. అయితే, అంతకంటే ముందే నేను మా ఖమ్మం గోడల మీద “విప్లవం వర్ధిల్లాలి” అనే నినాదాలు మసకబారి, డానికి భిన్నంగా ఎబీవిపి, మజ్లిస్  నినాదాలు కనిపించడం మొదలెట్టాయి. ఈ సందర్భాన్ని కవిత్వంలో కంటే ముందు  ఒక  కథలో వర్ణించాను. అది కవిత్వంలో యెందుకు చెప్పలేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. మొదటి నించీ కవిత్వం నాకు ఒక మాజికల్ మిర్రర్. నాలోపల సామాజికుడి ఘోష ఎంత వున్నా, నా కోసమే అన్నట్టు కవిత్వాన్ని  అట్టిపెట్టుకున్నాను. మరీ ఒత్తిడి కలిగించిన బయటి సందర్భాలు కవిత్వం అయిన ఉదాహరణలు వున్నా, వాటిల్లో కూడా నాలోని పర్సనల్ కోణం స్ఫుటంగా  వ్యక్తమవుతుంది. అంతర్గతంగా ఎంతో నలిగితే తప్ప బయటి సందర్భాలూ సంఘటనలూ కవిత్వం కాలేదు నాకు.

9.       తెలంగాణా- మీ కవిత్వంలోనూ, పరిశోధనలోనూ ప్రధానమైన భూమికగా ఎప్పుడు మారింది?

మొదటి నించీ తెలంగాణా ప్రధానమైన భూమికే. చింతకానిలో తెలంగాణా జానపద పాటలూ, కథలూ, పోరాట గాధలూ చిన్నప్పటి నించే విన్నాను. మా కుటుంబానికి వున్న తెలంగాణా సాయుధ పోరాట వారసత్వం వల్ల ఇంట్లో ఆ పోరాట జ్ఞాపకాలూ అనుభవాలూ తరచూ వినిపించేవి. ఇక నా ఉస్మానియా యూనివర్సిటీ పీ ఎచ్ డీ ఆధునిక కవిత్వ వస్తు రూపాల మీద. అయితే, తెలంగాణా సాయుధ పోరాటం ఆధునిక వచన కవిత్వానికి మౌలికతని ఇచ్చిందని అందులో వాదించాను. పీర్ల పండగ మీద ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన పుస్తకం పునాది తెలంగాణాలోని పీర్ల పండగే. అట్లాగే, ఇప్పుడు కొత్తగా రాస్తున్న పుస్తకం పోలీస్ చర్యకి సంబంధించిన సాహిత్య సాంస్కృతిక కథనాల గురించి ప్రధానంగా తెలంగాణాలో ఆధునిక సాహిత్య రూపాలు యెట్లా వికసించాయో చెప్పే ప్రయత్నం.

1   మిమ్మల్ని మీరు తెలంగాణా కవిగా చూసుకుంటారా?

రెండు తెలంగాణా పోరాటాల అట్టల మధ్య ఒదిగిన పుస్తకాన్ని నేను. ఒక పోరాటం నా కుటుంబ స్మృతి, రెండోది నా సొంత అనుభవం. నిజానికి తెలంగాణా కవి అనిపించుకోడానికి అవి సరిపోక పోవచ్చు. ఆ ప్రాంతంలోని ఉద్విగ్నత నిండేలా ఇంకా పోరాట శీలత కావాలి. నేను ప్రధానంగా రచయితని కాబట్టి పోరాటానికి నా నిర్వచనం భిన్నంగానే వుంటుంది. ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వుంటారు. వాళ్ళ నిబద్ధత ముందు రచయిత నిబద్ధత సరిపోదు. రచయితది సాంస్కృతిక నిబద్ధత. నన్ను నేను ఆ పరిధిలో మాత్రమే చూసుకుంటాను.

1   ఇప్పుడు తెలంగాణా సాహిత్యం తిరిగిన మలుపుల్ని మీరెలా అర్థం చేసుకుంటున్నారు?

తెలంగాణా సాయుధ పోరాటం సాహిత్య చరిత్రలో పెద్ద మలుపు అనే తాత్విక భూమిక నుంచి నేను వచ్చాను. అప్పటి కోస్తా ఆంధ్ర కవులకీ, రచయితలకీ, ఉద్యమకారులకి కూడా తెలంగాణా ఒక దిక్సూచి. తెలంగాణా పాత్ర యెప్పటికీ అట్లాగే వుంటుంది. తెలంగాణా అప్పటి వజ్రాయుధం. ఇప్పుడు కూడా వజ్రాయుధమే. కాని ఇటీవలి ఉద్యమ తీవ్రతలో వున్నప్పుడు పెంచి పోషించుకున్న ద్వేషాలు పక్కన పెట్టి, తెలంగాణా అసలు సిసలు పాత్రని అందరూ గుర్తించి తీరాలి. మన చరిత్రలో అంతకంటే గొప్ప ఉద్యమాల్ని ఇప్పటిదాకా మనం చూడలేదు. అందుకు తెలంగాణా మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలూ గర్వించాలి. ఇదే విషయం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఈ ఇరవయ్యేళ్ళలో తెలంగాణా నుంచి వచ్చిన మౌఖిక, లిఖిత సాహిత్యాలూ రెండూ బలమైనవే. ఆ వారసత్వం మున్ముందు కొనసాగాలి. ఇందులో దళిత, ముస్లిం స్త్రీ స్వరాలకి వాటికి తగిన స్థానం కూడా దక్కాలి.

   భారతీయ కవిత్వాన్ని దగ్గిరగా చదివిన అతికొద్ది మంది కవుల్లో మీరూ ఒకరు. భారతీయతా, కవిత్వం, ప్రాంతీయత- యీ మూడు అంశాల మధ్య పొంతన యెలా సాధ్యం?

భిన్నత్వం లేకుండా భారతీయత లేదు.  స్థానికతలోని బలమే భారతీయత బలం కూడా. ఇదే మాట భారతీయ కవిత్వం గురించి కూడా చెప్పుకోవాలి. స్థానికతలోని బహుళత్వం (pluralism) మన కవిత్వ సంస్కృతికి పునాది. మన దేశంలో యెన్ని భాషలున్నాయో, అన్ని భాషల కవిత్వాలూ మనకి ముఖ్యమే. వివిధ భాషల్లో వస్తున్న కొత్త తరం కవులు అట్లాంటి భారతీయతనే వెతుక్కుంటున్నారు.

   అట్లాగే, అంతర్జాతీయ కవిత్వం చదువుతూ, విశ్వవిద్యాలయ స్థాయిలో బోధిస్తున్నారు. ఆ కోణాలు మీ కవిత్వ వ్యక్తిత్వంపై యెలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి?

టీచింగ్ నా రోజువారీ జీవితంలో పెద్ద భాగం. పాఠం చెప్పే సమయం తక్కువే అయినప్పటికీ ఎక్కువ సమయం పాఠం చుట్టూ ఆలోచనలతో గడుస్తుంది. పైగా, ప్రతి సెమిస్టర్ కొత్త కోర్సులు చెప్పాల్సి రావడం వల్ల ఆలోచనలకి పెద్ద వ్యాయామం. ఈ సెమిస్టర్ “ప్రతిఘటన ఉద్యమాలూ- సాహిత్యం” అనే కొత్త కోర్సు చెప్తున్నా. ఈ కోర్సు ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష ఉద్యమాలతో మొదలై, ఇప్పటి అస్తిత్వ చైతన్య ఉద్యమాల దాకా వస్తుంది. ఇలాంటి కోర్సులు చెప్తున్నప్పుడు అది కేవలం తరగతి గదికే పరిమితం కావు. మన ఆలోచనల పరిధిని విస్తరిస్తాయి. కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అవి కవిత్వ రచనలో కూడా కొత్తదనం కోసం వెతుక్కుంటాయి. నా దృష్టిలో ఇదంతా మన సొంత అన్వేషణలో భాగమే!

   ప్రభావాల మాటకి వస్తే, ఇటు భారతీయ కవిత్వంలోనూ అటు అంతర్జాతీయ కవిత్వంలోనూ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వారు వున్నారా?

పేర్లు చెప్పడం కష్టం! ప్రభావాలు తప్పనిసరి. భారతీయ కవిత్వంలో దళిత కవిత్వం నన్ను బాగా ప్రభావితం చేసింది. అంతర్జాతీయ కవిత్వంలో బ్లాక్ పోయెట్స్ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు.

1   వర్తమాన కవిత్వం ప్రింట్ నుంచి సోషల్ మీడియాకి మళ్ళుతున్న దశని మీరెలా అర్థం చేసుకుంటున్నారు?

సోషల్ మీడియాని సమర్ధంగా వుపయోగించుకుంటే కవిత్వానికి అది కొత్త శక్తి. ప్రింట్ మీడియాలో వుండే పరిమితుల్ని అది దాటి వెళ్తుంది. ఎంత కాదన్నా, ప్రింట్ మీడియా కొంత సాంప్రదాయిక చట్రంలో వుంటుంది. కొత్తదనాన్ని అంత తేలికగా ఆహ్వానించదు. ఫేస్ బుక్ లో అట్లాంటి చట్రాలు పనిచేయవు. కాబట్టి, కొత్త స్వరాలకి మంచి అవకాశం. కొత్త ప్రయోగాలకి కూడా మంచి వేదిక. 

   అమెరికాలో కొత్త తరం కవిత్వం యెలా ఉంటోంది?

వస్తు వైవిధ్యం, అనుభవ విస్తృతి, విషయాన్ని తేలిక భాషలో చెప్పడం కొత్త అమెరికన్ కవిత్వంలో కనిపిస్తున్నాయి. ఇవి మన వర్తమాన తెలుగు కవిత్వంలోనూ వున్నాయి. కాని, భాషకి సంబంధించి ఇంకా మనకి కొన్ని సాంప్రదాయికమైన ఆలోచనలు వున్నాయి.అ వి తొలగిపోవాలి. అమెరికన్ కవిత్వంలో ప్రోజ్ పోయెమ్ కొన్ని సాంప్రదాయికమైన చట్రాల్ని బద్దలు కొట్టింది. ఆ ధోరణి మనకి కూడా అవసరమే.

1  మన దగ్గిర “కవిసంగమం” లాగా అమెరికాలో ఇంటర్నెట్/  సోషల్ మీడియా భూమికగాధోరణులు యేమైనా ఉన్నాయా?

“కవిసంగమం లాంటి ప్రయోగం అమెరికన్ సాంస్కృతిక నేపధ్యంలో అంతగా ఫలించదు. ఎంతకాదన్నా, అమెరికన్ కవిత్వంలో ఒక హైరార్కీ వుంది. కొన్ని బలమైన శక్తుల పెత్తనం ఇంకా వుంది. అందువల్ల అమెరికన్ కవి సమూహల్ల్లో వెసులుబాటు తక్కువ. కవిసంగమం ప్రధానంగా సాధించిన విజయం హైరార్కీని సవాలు చేయడం, కొత్త తరాన్ని అందుకోవడం. ఇవి రెండూ అమెరికన్ సమాజంలో అంత తేలిక కాదు. అట్లాగే, ఇంటర్నెట్ సాహిత్యానికి కూడా ఇంకా రావల్సినంత ప్రాముఖ్యం రాలేదు.

1   కొత్త తరం కవులు చాలా మంది వస్తున్నారు. ముందు తరం కవిగా మీరు వాళ్లకి యేమైనా చెప్పదలచుకున్నారా?

సందేశాలివ్వడం నాకు నచ్చదు. నిత్య సంశయం వెంటాడుతున్న తరం మనది. కవి ఏ తరం వాడైనా మన సహప్రయాణీకుడే! ఇప్పుడు మరీ ముఖ్యంగా అందరూ కలిసి ప్రయాణం చేయాల్సిన సందర్భం. చాలా సామాజిక వొత్తిళ్ళ మధ్య నడుస్తూ వెళ్తున్నాం. వ్యక్తిగత  అస్తిత్వం కూడా ప్రమాదంలో వుంది. మనకి వున్న ఒకే ఒక్క ఆసరా- కవిత్వం! అదృష్టం బాగుండి, ఇప్పుడు కవులకి మంచి వేదికలున్నాయి. మంచి కవిత్వాన్ని అక్కున చేర్చుకునే చదువరుల సంఖ్య కూడా పెరిగింది. జీవితాన్ని వంచించుకోకుండా రాసే ప్రతి వాక్యం నిలుస్తుంది.  ఆ నమ్మకం నా మటుకు నాకు గతంలో కన్నా ఇప్పుడే ఎక్కువగా వుంది. మనం వచనం ఎక్కువ చదవాలి. విమర్శని తట్టుకోవాలి. ఒక అడుగు ముందుకే వేయాలి, కాని నిన్నటి రెండు అడుగుల్ని కూడా  గుండెకి హత్తుకోవాలి.
*



Wednesday, September 29, 2010

అఫ్సర్ ఇంటర్వ్యూ "పొద్దు"లో...!

చింతకాని బడిలో మా నాన్న గారు విద్యార్ధుల కోసం “మధుర వాణి” అనే పేరుతో దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడపత్రిక ప్రతి నెలా రాయించి పెట్టే వారు. ఈ గోడపత్రిక బడికే పరిమితమయినా, విద్యార్ధుల రచనల మీద ఆయన చాలా నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా అభిప్రాయాలు చెప్పడమే కాకుండా, విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకొని మార్పులూ చేర్పులూ చేయించేవారు. అవన్నీ నేను గమనిస్తూ వుండేవాణ్ని. వొక రచనని ఎడిట్ చేసుకోగలగడం గొప్ప కళ అని నమ్ముతాను నేను, నా రచనా జీవితం వొక విధంగా ఆ ఎడిటింగ్ పాఠాల నించే మొదలయ్యింది. కానీ, ఆయన అక్కడ వున్నంత కాలం నా కవిత్వం కానీ, చిట్టి కథలు గానీ వొక్కటి కూడా వేయలేదు. ఆ గోడపత్రికలో రచన చూసుకోవాలని విద్యార్ధులందరికీ తహతహగా వుండేది. నేను రచన ఇచ్చినప్పుడల్లా, చదివి, నవ్వి “నువ్వు బాగా రాయాలంటే బాగా చదవాలి” అని నా రచనని పక్కన పెట్టేసే వారు. అప్పుడు నేను నాటకాల వైపు మొగ్గాను. నేనే పది మందిని కూడదీసి, కొన్ని సీన్లు రాసి, మా ఇంటి పక్కన కిలారు గోవిందరావు గారి గొడ్లపాకలో అయిదు పైసల టిక్కెటు మీద వాటిని వేసే వాళ్ళం. అయిదు పైసలు లేని వాళ్ళు అయిదు చీట్ల పేకలు ఇవ్వాలని రూల్. ఆ వచ్చిన పేకలతో బెచ్చాలు ఆడేవాళ్లం.

(మిగతా భాగం "పొద్దు" లో...)

పూర్తి కాని వాక్యాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-   1           మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!   ...