Showing posts with label "ప్రముఖా"ముఖి. Show all posts
Showing posts with label "ప్రముఖా"ముఖి. Show all posts

Saturday, November 14, 2015

అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో మ‌న‌ 'సహన ప్రతీకలు'..

ఇంటర్వ్యూ: కందుకూరి రమేష్ బాబు 


ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్- పాపులర్ ఇస్లాం అండ్ షేర్డ్ డివోషన్ ఇన్ సౌత్ ఇండియా పుస్తకం వచ్చి దాదాపు ఏడాదైంది. ఇది తప్పక చదవ వలసిన గ్రంథం. ఎందుకంటే.. మన సంస్కృతి ఎంత వైవిధ్యమైందో మనకు తెలుపుతుంది కనుక. మన ప్రత్యేకతలు మనకే తోచవు. స్థానికుడికి విహంగ వీక్షణానికి అవకాశం వుండ దు. కాస్త దూరం జరిగి చూడటానికీ వెసులుబాటూ ఉండదు. ఆ పనే ఒక పరిశోధకుడు బాగా చేయగలుగుతాడు. ఆ పరిశోధకుడు సామాజిక బాధ్యతను నిర్వచించుకున్నవాడు, ఆధ్యాత్మికశక్తిని దర్శించగలవాడూ అయితే అది దివ్యంగా మారుతుంది. అతడు మన దేశీయతలోని విశిష్టతను, భిన్నత్వాన్ని, లౌకికత్వాన్ని లోతు గా తరచి చూడగలవాడు అయితే ఒకేసారి ప్రపంచానికి భిన్నాంశాలను బలంగా చెప్పగలడు.
అదే సమయంలో తన ప్రపంచానికి కూడా చెప్పిఔను గదాఅని మెప్పించగలడు. ఇదంతా ఒక అద్భుతమైన కార్యాచరణ. ఇందులో నిమగ్నమైన వ్యక్తి పరిశోధన అంటే అది కేవలం విజ్ఞానమే కాదు, వికాసం. మరింత విశాలంగా మన మనోగవాక్షాలను తెరిచే పెద్దబడి. ఒక సహన ప్రయత్నం. అఫ్సర్ మహ్మద్ రచించిన ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ గ్రంథం అదే చేసింది.
అఫ్సర్ పాఠకులకు బాగా తెలిసినవారే. పాత్రికేయుడిగా, కవి గా, విమర్శకుడిగా మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర ఆయనది. తన నిశితమైన కలం కల్పనా సాహిత్యంలోనూ అడుగుపెట్టి వర్తమాన సమస్యలను కథలుగా మలిచి చర్చ కు పెడుతోంది. తాను తెలంగాణను వదిలి అధ్యాపకుడిగా టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్లాక ఇక్కడ తెలంగాణ ఉద్యమం జోరందుకున్న ది. సాంస్కృతిక పునరుజ్జీవనంలో పెద్ద ముందడుగు పడింది. ప్రత్యేక రాష్ట్రమూ సాకారం అయింది. ఇక్కడ మనం ఇలా ఉండ గా, అక్కడ ఆయన ప్రపంచ పౌరుడిగా మూడో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యాన్ని బలంగా వినిపించే సబాల్ట్రన్ ఐకన్ అయ్యారు. కల్లోల సంక్షోభాన్ని శక్తివంతంగా చాటే విమర్శకుడిగానూ మారా రు.
తెలుగు భాషా వికాసానికి అమెరికాలో కేంద్రం అయ్యారు. అంతర్జాతీయ మేధావుల సరసన చేరి పరిశోధకుడిగా మరింత లోతైన అధ్యయనశీలిగానూ మారారు. టెక్సాస్ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేస్తున్న అఫ్సర్ దక్షిణాసియా సాహి త్య, సంస్కృతులను బోధిస్తున్నారు. తెలుగు విభాగం అధిపతిగా నూ విశేషమైన సేవలందిస్తున్నారు. మరో పక్క గ్రంథ రచయితగా తెలంగాణ సంస్కృతిలో కీలకమైన పీరీలను ఆయన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాంశంగా మలిచారు. ఈ సందర్భంగా ఆ గ్రంథం గురించి అఫ్సర్‌తో.. కందుకూరి రమేష్ బాబు ఆత్మీయ సంభాషణ...
1. అసలు పీర్ల పండగపై పుస్తకం ఎందుకు రాయాలనిపించింది?
- నేను మొదట దళిత - ముస్లిం సాహిత్యాల మీద లోతైన విశ్లేషణతో, వర్తమాన పరిశోధనా అంశాలు కలిపి ఏదైనా రాయాలని అనుకున్నా. ముఖ్యంగా, ముస్లిం సాహిత్యం మీద దృష్టి పెట్టాలని ఆలోచన వుండేది. కానీ, తెలుగులోనే కాకుండా, వివిధ ప్రపంచ భాషల్లో వస్తున్న ముస్లిం సాహిత్యం చదువుతున్నప్పుడు కేవలం ఉపరితలం నుంచి కాకుండా సమాజం పునాదీ, అంతర్గత నిర్మాణాల్లోకి వెళ్లి ముస్లిం అస్తిత్వ చర్చ చేయాల్సిన అవసరం వుందనిఅనిపించింది. ముస్లిం ఉనికిని బాహాటంగా ఎక్కడ గమనించవచ్చు అన్న ప్రశ్నకు పీర్ల పండగలో సమాధానం దొరికింది నాకు. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరాన ఉన్న ఇరాక్‌లో కర్బలా అనే చోట జరిగిన యుద్ధగాథ మనకు ఎందుకు అంత ముఖ్యమైందో తెలుసుకోవాలన్న మౌలికమైన ఆసక్తి ఈ పుస్తక రచనకు ప్రధాన కారణం.
2. రాస్తున్నప్పుడు ఈ గ్రంథం ఇంత ముఖ్యమైంది అవుతుందని అనుకున్నారా?
-నిజానికి ఈ పుస్తకం రాసేటప్పుడు నాకు పెద్ద ఆశలేమీ లేవు. రాయాలీ అనుకుని రాశాను. అంతే! అయితే.. ఆసక్తితో మొదలైన రచన నాకే కాదు, చాలామంది ఆసక్తికి, అధ్యయనానికి ఊతమిస్తుందని తర్వాత అర్థమైంది.
3.పుస్తకానికి ఎటువంటి గుర్తింపు వచ్చిందంటారు?
-ఈ పుస్తకం రాశాక ఇది తక్షణం అచ్చులో రావాలని అమెరికాలోని నా మిత్రుల నుంచి, స్కాలర్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లాంటి ఆంతర్జాతీయ సంస్థకు ఆ రాతప్రతిని పంపినప్పుడు నాకేమాత్రం నమ్మకం లేదు. అంత పెద్ద సంస్థకు ఇంత చిన్న అంశం ఏం పడుతుందిలే అనుకున్నా. కానీ, రాత ప్రతి పంపిన నెలరోజుల్లో అక్కడి ఎడిటర్ థియో ఈ మెయిలు చేసి అభినందించారు. అంతేకాదు, ఆశ్చర్యంగా కేవలం ఆరు నెలల వ్యవధిలో వారు ఈ పుస్తకం బయటికి తీసుకువచ్చారు. అప్పుడర్థమైంది, ఎంత ముఖ్యమైన పుస్తకం పూర్తి చేశానో అని!ప్రస్తుతం ఈ పుస్తకం పాఠ్యగ్రంథంగా మారిందని విన్నాం!అవును. ఈ పుస్తకానికి దక్కిన గుర్తింపు చాలా కీలకమైంది. దాదాపు పదిహేను అమెరికన్ /యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో ఇది పాఠ్య పుస్తకమయ్యింది. ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో పీరి వేదికనెక్కిందని సగర్వంగా చెప్పవచ్చు.
4.సిద్ధాంతపరంగా మీరు ఈ గ్రంథంలో ఏం చర్చించారు?
-నేను రెండు మౌలిక భావనలు ఆశ్రయించి ఈ రచన చేశాను. local Islam/ localized Islam లేదా స్థానిక ఇస్లాం, స్థానికీకరించబడిన ఇస్లాం అనవచ్చు. వీటి మధ్య చర్చ మొదలయింది, ఆ చర్చ ఇప్పటికీ సాగుతోంది. ఆ మేరకు నాకు తృప్తిగా వుంది.ఆ గ్రంథం ఒక ముఖ్యమైన రిఫరెన్స్ బుక్‌గానూ మారిందంటున్నారు!నిజమే. పాపులర్ ఇస్లాం, షియా సంప్రదాయాలు, దక్షిణాసియ ఇస్లాం -అనే విభాగాల్లో వచ్చిన రచనల్లో ఈ పుస్తకాన్ని ప్రముఖంగా పేర్కొంటున్నారు. మరో విశేషం, ఇప్పటికీ ఈ అం శం మీద నన్ను ప్రసంగించమని అమెరికా, యూరప్ దేశాల నుం చి ఆహ్వానాలు అందుతున్నాయి.సరే, మన దగ్గరకు వస్తే.. పీర్ల పండగ తెలంగాణకు ముఖ్యమైన ప్రతీక.
5.అయితే, మీ పరిశోధనల్లో మీరు సూఫీయిజం గురించి బాగా చర్చించారంటారు? అసలు మీరు వ్యక్తం చేసిన అవగాహన ఏమిటి?
-పీర్ల పండగ తెలంగాణలో మాత్రమే కాదు, వేర్వేరు పేర్లతో ఇస్లాం చరిత్రతో సంబంధం వున్న ప్రతి చోటా వుంది. అయితే, తెలంగాణలో మనం పీర్ల పండగ అంటాం. ఇక్కడ ఇది సూఫీ సంప్రదాయాలతో కలగలిసిపోయి, ఆ సంప్రదాయ ప్రతీకలైన పీర్ల వల్ల వీటికి మరింత స్థానిక చరిత్ర తోడయింది. మరోమాటలో చెప్పాలంటే-ఇది అందరి పండగగా మారడం వెనక సూఫీ ప్రభా వం బలంగా వుంది. నా పుస్తకంలో ప్రధానమైన వాదన కూడా అదే. మొదట అది షియా సంప్రదాయంగా షురూ అయినా, తరువాత అది నడిచిన చరిత్ర సూఫీలతో కొత్త వెలుగు ప్రసరించింది. ఈ మధ్య మిత్రుడు సుమనస్పతి రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే పీర్ల పండగ గురించి చిత్రాలు షేర్ చేసుకున్నారు. అంటే, మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సంప్రదా యం ఎంత బలంగా ప్రయాణించిందో మనకు అర్థమవుతుంది.
6.తెలంగాణ సంస్కృతిలో పీర్ల పండుగ కలసిపోవడం, దాని ఆధ్యాత్మిక విశిష్టత గురించి వివరిస్తారా?
-నిజమే. తెలంగాణ సంస్కృతిలో పీర్ల పండగ కలగలిసి పోయిన విధానం గురించి ముఖ్యంగానే చెప్పుకోవాలి. కుతుబ్ షాహీల సామరస్య దృక్పథంలోంచి మన పల్లెల్లోకి ఈ పండగ ప్రవేశించినా, స్థానికంగా వున్న సాంస్కృతిక అంశాలను కలుపుకొని, పల్లెల స్వరూపాన్ని మార్చిన పండుగ ఇది. ముఖ్యంగా మన జానపద సంస్కృతికి ఒక కుదుపు ఇచ్చింది. తెలంగాణ పల్లెల్లో వున్న దీర్ఘ కథనాల సంప్రదాయం దీనికి బాగా సరిపోయింది. అలాగే, అగ్రవర్ణాల ఆసరా అక్కర్లేని ఆధ్యాత్మికతకు ఇది దారి తీసింది. పీరు సంప్రదాయం ఆ విధంగా హిందూ మతంలో వున్న కులాధిపత్యాన్ని కూడా ప్రశ్నించింది. మతం అనేది పడగ విప్పడానికి కాదని, ప్రేమని పంచడానికని రుజువు చేసింది.
7.అసలు పీర్ల పండగ దేనికి ప్రతీక?
-ప్రధానంగా ఇది హిందూ- ముస్లిం సంస్కృతుల కలయికకు ప్రతీక. అయితే, ఆధునిక సమాజానికి మూలసూత్రాలైన సమిష్టి వాదం, సామాజిక న్యాయం, సమానత్వ కాంక్షకు కూడా ఈ పీర్ల కథనాలు, సంప్రదాయాలు ప్రతీకలు. సంక్షిప్తంగా చెప్పాలంటే.. అవి మన సామాజిక సహన ప్రతీకలు.
8.సహన ప్రతీకలు అన్నారు.. వివరిస్తారా?
-ఇప్పుడున్న వాతావరణంలో ఈ మాట నొక్కి చెప్పవలసిందే. నిజంగానే పీర్లు మన సహన ప్రతీకలు. ముఖ్యంగా, తెలంగాణ, రాయలసీమ పల్లెల్లో పీర్ల కథనాల మీద ఇంకా సమగ్రమైన శోధన జరగాల్సి వుంది. ఆ కథనాల్లో జనం చెప్పుకునే భావనల అన్వేషణ కూడా విస్తారంగా జరగాలి. అయితే, దురదృష్టవశాత్తూ, ఇప్పుడు పెరిగిపోతున్న మత అసహనాల వల్ల, ముఖ్యంగా ముస్లింల పట్ల పెరుగుతున్న వివక్ష వల్ల.. ఈ పండగ ప్రాముఖ్యం తగ్గిపోతోంది. ఈ అసహనం ఎంత తీవ్రంగా వుందంటే..బహుశా ఇంకో అయిదేళ్ళ తరవాత ఈ పండగ ఎక్కడా కనిపించకపోవచ్చు కూడా! అంటే, మన సహన ప్రతీకలన్నిటినీ మనం చంపుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నామన్న మాట!
9.ఇప్పుడు మీ అన్వేషణ ఎటువైపు?
-పీర్ల పండగ పరిశోధనకు కొనసాగింపుగా అసలు పీరు సంప్రదాయానికి పునాది వేసిన సూఫీ సాహిత్యం వైపు దృష్టి పెట్టాను. లిఖిత సాహిత్యాన్నీ పరిశీలిస్తున్నాను.
10.కవి, విమర్శకుడు ఇప్పుడు సంపద్వంతమైన చింతనాపరుడిగా మారుతున్నాడని అనవచ్చునా?
-ఇదంతా స్థానికత మహత్యం. సంస్కృతి, సంప్రదాయాల ఘనత. పునరుజ్జీవనం. ప్రపంచ పౌరుడిగా వీటన్నిటీనీ ఇముడ్చుకున్న ఫలితం అంటాను నేను. అయితే ఇక్కడో మాట చెప్పాలి. అసలు తెలుగులో సూఫీ సాహిత్యం ఉందా? అని చాలామంది నన్ను ఎదురు ప్రశ్నించారు. వుందన్నదే నా వాదన. ది ఫెస్టివల్ అఫ్ పీర్స్‌లో నేను మౌఖిక కథనాలు మాత్రమే డాక్యుమెంట్ చేశాను. ఇప్పుడు లిఖిత సాహిత్యంలోకి కూడా వస్తున్నా. ఇప్పటికే కొన్ని అనువాదాలు పూర్తయ్యాయి. కథలూ, కవితల అనువాదాలు ఒక భాగం, విశ్లేషణ ఇంకో భాగం.. రెండు పుస్తకాలుగా ఇవి త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ వస్తే ఈ గ్రంథం రచించాలన్న నా మౌలికమైన ఆసక్తిలో నాకే తెలియకుండా బీజ రూపంలో ఇమిడివున్న తాత్విక చింతన నన్ను నిజంగానే సంపద్వంతమైన వ్యక్తిగా, పరిశోధకుడిగా మార్చినట్టే. అది నిజంగా చెప్పలేని తృప్తీ. ఆనందం.
Interview published in Chelime page,
Namasthe telangana.08.11.2015

Thursday, September 30, 2010

అమెరికా జీవితం వల్ల తేడాలు తెలిశాయి : నిడదవోలు మాలతి ముఖాముఖి

నిడదవోలు మాలతి - ఓటమి ఎరుగని కలం. ఆ మాటకొస్తే కలం కాలం నించి ఇప్పటి కీబోర్డు కాలం దాకా విరామమెరుగని కలం. రాత నుంచి కంప్యూటరు దాకా ఎంతో ఓపికగా, శ్రద్ధగా రూపాంతరం పొందడమే కాకుండా, రచనా స్వభావాన్ని కూడా కాలానుగుణంగా మార్చుకున్న మాలతి గారు అటు ఆంధ్రా, ఇటు అమెరికా తెలుగు జీవితాల మధ్య సామ్యాలనూ, సామరస్యాలనూ వెతికే ప్రయత్నం చేశారు. స్వీయ రచనల్లోనూ, అనువాదాల్లోనూ వొక నిష్టతో, నియమంతో పని చేస్తున్నారు. వయసూ, బతుకు బాధలతో నిమిత్తం లేకుండా ఎత్తిన కలం...(టచ్ చేసిన కీబోర్డు అనాలా?!) వదలకుండా, అన్ని అవరోధాలనీ జయించి రచయితగా తన ఉనికిని సదా కాపాడుకుంటున్నారు. అచ్చు లోకంలోనే కాకుండా, అంతర్జాల లోకంలో కూడా సుపరిచితమయిన పేరు నిడదవోలు మాలతి.






1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
వచ్చింది. అయితే అది అమెరికా రావడంవల్ల మాత్రమే కాకపోవచ్చు. సాధారణంగా జీవితంలో జరిగే అనేకసంఘటనలలో అమెరికా రావడం ఒకటి. అమెరికా రావడంవల్ల మరొక సంస్కృతిగురించి సవిస్తరంగా ఆలోచించుకోడానికి అవకాశం కలిగింది. విదేశీ సంస్కృతి, మనస్తత్త్వాలవిషయంలో అవగాహన మెరుగు పడిందనుకుంటాను ఇక్కడికి వచ్చేక.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
ఆమార్పు నేను అమెరికా వచ్చినతరవాత రాసిన కథలన్నిటిలోనూ కనిపిస్తుంది. ప్రధానంగా, ఏ సంస్కృతిలో కానీ వారి నైతికవిలువలు వారున్న వాతావరణం, సామాజికపరిస్థితులు ప్రాతిపదికగా ఏర్పడతాయి. వారి ఆలోచనాధోరణి వారి సామాజికచరిత్రలోనుండీ ఉదయిస్తుంది కనక ఈ రెండు సంస్కృతులలోనూ గల వైవిధ్యమూ, అంతర్గతంగా గల సామ్యాలూ ఎత్తి చూపుతూ రాయడానికి ప్రయత్నించేను,

నా ఈ అవగాహనకి మంచి ఉదాహరణ - రంగుతోలు కథ. మనకి రంగు కేవలం అందానికి సంబంధించినది అయితే, అమెరికాలో తొక్కరంగు జాతికి సంబంధించినది. ఇక్కడ “నల్లవాడు” అన్నపదంలో వాళ్ళ ఆర్థిక, సామాజిక, చారిత్ర్యక ఛాయలెన్నో ఉన్నాయి. దానితోపాటు, గత 50 ఏళ్ళుగా జరుగుతున్న సివిల్ లిబర్టీస్ ఉద్యమంమూలంగా, తొక్క రంగులో గల నెగిటివ్ ఇమేజిని తొలగించే ప్రయత్నం కూడా ఉంది. ఇది ఎత్తిచూపడానికి ప్రయత్నించాను రంగుతోలు కథలో.
అలాగే, కొత్తసీసా పాతసారా కథలో ఉమ్మడికుటుంబాలలో అనూచానంగా వస్తున్న జీవనసరళి అమెరికాగడ్డమీద ఎలాటి మార్పులకి (metamorphosis) లోనవుతుందో చిత్రించాను. అంతేకాదు. మనవారి ఈ ప్రవర్తనా, పరివర్తనా కూడా అమెరికనులు ఎలా అర్థం చేసుకుంటారో కూడా చూపించడానికి ప్రయత్నించేను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనలకి ఏ విధంగా భిన్నమయినవి?
ఈప్రశ్నకి కూడా సమాధానం పైజవాబులో కొంతవరకూ ఉంది. నాకథల్లో అక్కడా, ఇక్కడా కూడా నాచుట్టూ ఉన్న సమాజంలో మనుషుల తత్త్వాలని, నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలనీ, ఆ సమస్యలని పరిష్కరించుకునే తీరులో వైవిధ్యాన్నీ పరిశీలించి ఆవిష్కరించడానికే ప్రయత్నించాను. ప్రయత్నిస్తున్నాను. ఏపరిస్థితుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఆ ప్రవర్తనకి కారణభూతమయిన పరిస్థితులు ఏమిటి అనే నేను సదా ఆలోచిస్తుంటాను. అంచేత అమెరికా వచ్చినతరవాత నా మొట్టమొదటి కార్యక్రమం అమెరికా, ఆంధ్రా - ఈ రెండుసంస్కృతులలో గల వ్యత్యాసాలూ, సామ్యాలూ, వాటికి సంబంధించిన తాత్త్విక చింతనా - ఇవి పరిశీలించి చూసుకోడమే అయింది. అది కొంతైనా అర్థమయిన తరవాతే కథలు రాయడం మొదలు పెట్టేను. అమెరికన్ సమాజంలో, సంస్కృతిలో నాకు అర్థమయినవిషయాలే నాకథల్లో కూడా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇతివృత్తం దృష్ట్యా ఇది ఒక మార్పు.

రెండో మార్పు శైలిలో. కొందరు స్నేహితులు ఎత్తి చూపినతరవాతే నేను పరిశీలించి చూచుకొన్నాను. మొదట భాష చూడండి. మనదేశంలో ఉన్నప్పుడు రాసినకథల్లో సంస్కృత సమాసాలు ఎక్కువ. ఆ పద్ధతిలో నారచన సాగిస్తే, ఇప్పుడు నాకథల్లో ఇంగ్లీషు ఎక్కువ ఉండాలి న్యాయానికి. కానీ అలా జరగలేదు. ఇక్కడికి వచ్చేక పూర్వంకంటె మంచి తెలుగులో రాయాలన్న తపన నాకు ఎక్కువయింది. నిజానికి ఇంగ్లీషు మాటలు ఇప్పటికంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు రాసినకథల్లోనే ఎక్కువ.

శైలిలో మరొక అంశం వ్యంగ్యం. ఇండియాలో ఉన్నప్పుడు నాకథల్లో హాస్యం ఉంది కానీ వ్యంగ్యం లేదు. అది ఈమధ్య ఎక్కువగానే ఉంటోంది నాకథల్లో.

మూడోది రచన పట్ల నాదృష్టి. ఇండియాలో ఉన్నప్పుడు రచయితగా నాస్థాయి ఏమిటి అన్న స్పృహ నాకు ఉండేది కాదు. రాయాలనిపించింది రాయడం, పత్రికలకి పంపడంతో నా పని అయిపోయేది. ఇప్పుడు ఎవరు నన్ను రచయితగా గుర్తించడం లేదు? ఎందుచేత? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి కారణాలు అనేకం. నా పరిస్థితులూ, జీవితంలో, సమాజంలో, సాహిత్యంలో వచ్చినమార్పులూ - అన్నీ కలిసి నాలో ఇలాటి ఆలోచనలు కలిగిస్తున్నాయేమో. వయసు కూడా ఒక కారణం కావచ్చు. జీవితంలో చరమదశకి చేరుకున్నాక, “నేను నా జీవితంలో సాధించినదేమిటి?” అన్న ప్రశ్న రావడం సహజం కదా.

4. అమెరికాలో వున్న తెలుగురచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
తెలుగురచయితగా నాకు రెండు శాఖలున్నాయి. 1. స్వీయరచనలు, 2. అనువాదాలు.
స్వీయరచనల్లో తెలుగులో నేను రాసిన తెలుగుకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. ఇంగ్లీషుఅనువాదాల్లో నారచనలతోపాటు ఇతర రచయితలకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. విశేషంగా కాకపోయినా కొన్ని కవితలు కూడా రాశాను. నాకృషి ఇంత విస్తృతంగా ఉండగా, ఈనాటి రచయితలు “మాలతి అనువాదాలు చేస్తోంది” అని నా మొత్తం వ్యాపకాలని ఒక్క వాక్యానికి కుదించేయడం నాకు అయోమయంగా ఉంది.

భవిష్యత్తుమాటకొస్తే, నాకు భవిష్యత్తు అమెరికాలోనూ లేదు, ఇండియాలోనూ కూడా ఉన్నట్టు కనిపించడంలేదు.
అంతర్జాలంలో నా వెబ్ సైట్, http://thulika.net, నా బ్లాగు http://tethulika.wordpress.com
నాకు గర్వకారణం కావాలి. మొదట, తూలిక.నెట్‌ గురించి చెప్తాను. ఈ సైటులో నాధ్యేయం ఉత్తమ తెలుగుకథలని అనువదించి తద్ద్వారా మనసంస్కృతిని విదేశీ పాఠకులకి తెలియజేడం. ఈ కారణంగానే తూలిక.నెట్ కొన్ని యూనివర్శిటీ సైటులదృష్టిని ఆకర్షించింది. ఉదా. http://www.intute.ac.uk/cgi-bin/search.pl?term1=thulika.net&submit=Search&limit=0&subject=All (Great Britain). కొన్ని ప్రముఖ సైట్స్ నా వ్యాసాలని వారి సైట్లలో మునర్ముద్రించుకున్నారు.
ఉదా. www.driftline.org. (University of Iowa, Bowling Green, Iowa),
http://www.india-forum.com/forums/
ఇలాటి గుర్తింపులవల్ల నాతరవాత తూలిక.నెట్ భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచన నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. నాకు సన్నిహితురాలు, వర్థమాన రచయిత్రి అయిన వి. బి. సౌమ్యని (పుస్తకం.నెట్), అడిగితే, తాను ఆ బాధ్యత స్వీకరించడానికి అంగీకరించింది. ఇది నాకు కొంత సాంత్వన కలిగించినవిషయం. మరి ఆమెచేతిలో తూలిక ఎలా రూపు దిద్దుకుంటుందో మీరే చూసుకోవాలి.

తూలిక.నెట్ నేను ఒక్కదాన్నీ చేపట్టిన కార్యక్రమం. అమెరికాలో తెలుగు సాహిత్యానికి విస్తృతంగా సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వివిధ సాహిత్యసంస్థలు ఈ నా ప్రయత్నానికి తగిన మద్దతు ఇచ్చి, విజయవంతం చేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు.
ఎందుకంటే, ఈనాడు సాహిత్యక్షేత్రం కూడా ఒక వ్యాపారమే. అన్ని వ్యాపారాలలోలాగే సాహిత్యంలో కూడా అవే నీతులకి ప్రాముఖ్యత. అంటే - p.r. work , people skills, పెట్టుబడిదారీ ధోరణీ (చందాలూ, రిజిస్ట్రేషను ఫీజులూ, నానా సంస్థల పెత్తందారులతో భేటీ) లాటివి. నావ్యక్తిత్వంలో ఆ పోకడలు లేవు. నాకు ఆ సామాజికస్థాయి కూడా లేదు. ఈ సాహిత్య ప్రముఖుల ఎజెండాలలో, ఇజాలజాలంలో పడి కొట్టుకుపోయే బలం కూడా లేదు.
అంతకంటే ప్రబలకారణం - కొందరు సాహిత్య ప్రముఖులకి, ముఖ్యంగా అమెరికా తెలుగు సాహితీ ప్రముఖులకి, నేను నావ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు బాధాకరం అయేయి అనుకుంటాను. అంచేత కూడా వీరిదృష్టికి కూడా నేను ఆనలేదు. అపార్థం చేసుకోకండి. నానా సంఘాలూ, సంస్థలూ నన్ను వారిసభలకి పిలిపించి దుశ్శాలువాలు కప్పాలనీ, విశిష్టసేవా పురస్కారాలు నాకు ఇవ్వాలనీ నేను కోరడం లేదు.
నేను ఏధ్యేయంతో తూలిక.నెట్ స్థాపించేనో ఆ ధ్యేయాన్ని బలపరచడానికి మన తెలుగుసంఘాలూ, సాహిత్యాధినేతలూ (నేను తెలుగుకి ఎంతో గొప్పసేవ చేస్తున్నానని నామొహంమీద పొగిడేవాళ్ళతో సహా) ఈ సైటుకి ప్రత్యేకించి ఇస్తున్న మద్దతు ఇదీ అని చెప్పడానికి నాకేమీ కనిపించడం లేదు అని అంటున్నాను. ఆ సంఘాల ప్రత్యేకసంచికలలో ప్రచురించే వ్యాసాలూ, సాహిత్య సభల్లో ఇచ్చే ఉపన్యాసాలూ చూస్తే మీకే అర్థమవుతుంది ఈమాటల్లో యథార్థం.

పోతే, తెలుగు తూలిక విషయం - నేను 2007 డిసెంబరులో మొదలు పెట్టేను. ఈ బ్లాగుద్వారా ఈనాటి యువతరం పాఠకులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వారికి నేనెవరో, నా బతుకేమిటో తెలియదు. నన్ను కేవలం మరొక బ్లాగరుగా మాత్రమే గుర్తించి, నాకథలనీ, కబుర్లనీ, వ్యాసాలనీ చదివి, నాసాహిత్యాన్ని నిష్కల్మషంగా ఆదరిస్తున్నారు. తెలుగు తూలిక చదివే పాఠకులలో బ్లాగరులు కానివారు కూడా చాలామందే ఉన్నారు. వీళ్ళంతా ఈనాటి పాఠకులు కనక వారి ఆదరణ నాకొక ప్రత్యేకగౌరవంగానే భావిస్తున్నాను.
తెలుగుతూలికద్వారా కూడా నేను ఇంతకుమించి చెయ్యగలిగింది ఏమీ లేదు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంరంభంలో నాకు రవంత నిరాశ కలిగిస్తున్నది నేను చర్చలకి పెట్టిన అంశాలలో పాల్గొనేవారు ఎక్కువమంది లేకపోవడం. ఎందుచేతో తెలీదు మరి.

చివరిమాటగా బ్లాగ్ రచనలగురించి - బ్లాగులలో ప్రచురించేరచనలకి సాహిత్యస్థానం ఉందా లేదా అన్నవిషయంలో - నా అభిప్రాయం చెప్తాను. సూక్ష్మంగా చూస్తే, బ్లాగులలో రెండు రకాల సాహిత్యం కనిపిస్తోంది. మొదటిది - నలుగురు కూడి మాటలాడుకునేవేళ తమ సహజధోరణిలో చెప్పుకునే కబుర్లలాటివి. దీన్ని సుమారుగా జానపదవాఙ్మయంతో పోల్చవచ్చు. రెండోరకంలో చేర్చదగ్గవి శిష్టజనవ్యావహారికంలో, ఎకెడమీకానికి బెత్తెడు ఎడంగా వస్తున్న కవితలూ, కథలూ, సాహిత్యచర్చలు. ఉదాహరణకి, భైరవభట్ల కామేశ్వరరావు, పి. సత్యవతి, మీరు, కల్పన - మీబ్లాగుల్లో కనిపించే రచనలు. (ఇక్కడ తెలుగు తూలిక కూడా చేర్చవచ్చుననుకుంటాను). ఈ రచనలు కేవలం బ్లాగుల్లోనే కనిపించినా వీటికి సాహిత్యవిలువ లోపం ఏమీ లేదు. అలాగే పుస్తకాలగురించి వి. బి. సౌమ్య, అనేక సాంకేతికవిషయాలు వివరిస్తున్న వీవెన్ ... ఇలా ఎందరో ఎంతో మంచి విషయాలు అందిస్తున్నారు. వీరి రచనలు ఏ పత్రికలలో రచనలకీ తీసిపోవు.

అసలు బాధ ఏమిటంటే, మనకి వ్యక్తిపూజలే కానీ వస్తునిష్ఠ లేదు. రచయితపేరుని బట్టి, అది అచ్చయిన పత్రికపేరుని బట్టీ రచనవిలువ నిర్ణయించడం మన రాచరికపుసంప్రదాయమేమో మరి. ఏమైనా, రచనని మాత్రమే రచనగా తీసుకుని విశ్లేషిస్తే, మన సాహిత్యం మెరుగు పడే అవకాశం ఉంది.

పూర్తి కాని వాక్యాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-   1           మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!   ...