Friday, May 27, 2011

వొకానొక తాళం చెవి




కవిత్వాన్ని అకవిత్వీకరించే మరో సాధనం - సంభాషణ. మామూలు సంభాషణలోని తేలిక మాటలనే తీసుకొని, వాటికి అసాధారణమయిన శక్తినివ్వడం. డెబోరా కీనాన్ కవిత్వం చదువుతున్నప్పుడు ఇదెలా సాధ్యమో అర్ధమవుతుంది. ఆమె కొత్త కవిత్వ సంపుటి "గుడ్ హార్ట్" నించి వొక కవిత ఇది.





వొకానొక తాళం చెవి

ఏకాంతమా, అమ్మా! నా జీవితాన్ని మళ్ళీ చెప్పమ్మా!
- డీ మీలోజ్



ఇల్లు విడిచి
ఏ పొద్దో వాలకముందే
ఆ వొడ్డు దాకా వొక్క నిమిషం నడిచి వెళ్లాలని.


లేదా,
అప్పుడప్పుడే పొద్దు వాలినప్పుడయినా సరే.


వెండి అలల్ని దాటి
నల్ల డాల్ఫిన్లు బారులు తీరడానికి
ఎగబడుతున్నప్పుడు.


తాళంలో చెవి తిప్పి
నా అడుగుల చప్పుడు వింటూ

తెల తెల్లని ఇసక దారి
సంద్రంలోకి లాగుతున్నప్పుడు.


మూసుకు పోయిన దారంటా
వీధి చివరంటా నడిచెళ్లే ఆ పిల్లలా.

అందరూ మంచి వాళ్ళే అనే
అందరూ పొరపాట్లు చేసిన వాళ్ళే అనే
కుటుంబ బాదరబందీ నించి

వొకానొక ఏకాంతపు కౌగిలిలోకి
నిదానంగా నడక.


వుండి పోవాలని వెళ్లిపోవాలని
తాళం చెవి బాగు చేయించాలని దాన్ని మళ్ళీ పోగొట్టుకోవాలని
ఇసక మీదనో రాళ్ళ మీదనో నడవాలని
అలల మీద స్వారీ చేయాలని తేలిపోవాలని
దారి చివరంటా పోవాలని

తాళం చెవి సరిగ్గా వేయాలని
దాని అర్థం తేల్చుకోవాలని.

ఇవాళ

వొకానొక గాలి తరగ దాని వొంటరి క్షణంలో
నా దక్షిణం వైపు కిటికీని తట్టి వెళ్తోంది

అది మోసుకు వెళ్లే తాళం చెవి నాకు తెలుసు
అది మందలింపు కాదు, పొడుపు కథ కాదు,
వాగ్దానమూ కాదు.

Friday, May 20, 2011

కాన్సర్ గుండెచప్పుడు ...కార్లా కవిత్వం!



టెక్సాస్ కవయిత్రి కార్లా మోర్టాన్ వొక వైపు కాన్సర్ ని సవాలు చేస్తోంది. మరో వైపు కవిత్వంలోని అలంకారాలనీ సవాలు చేస్తోంది. ఆమె కవిత్వం నిరలంకారంగా, నిరాడంబరంగా కేవలం జీవితాన్నే పాడే పదం. గత ఏడాది టెక్సాస్ పొయెట్ లారెట్ గా గౌరవం పొందిన కార్లా కొత్త పుస్తకం "రీడిఫైనింగ్ బ్యూటీ" నించి వొక కవిత ఇది.




గాలికి చేతులున్నాయని నాకు తెలీదు,
నా తల అంతా శుభ్రంగా గొరికించుకునేంత దాకా
దాని చేతులు ప్రేమగా నన్ను నిమిరేంత దాకా .

నా వొళ్ళు ఇంత అందంగా వుంటుందనీ తెలీదు
దాన్ని ఎవరో తెరిచి, కత్తెర వేసి, ఏదో విషంతో నింపెంత దాకా.

ఆత్మకీ కళ్ళు వుంటాయని తెలీనే తెలీదు
నా గుండె చివరంటా నన్ను వొలుచుకొని
నా అస్తిత్వాన్నంతా రాల్చుకొని నీ దాకా వచ్చే దాకా

నీ నిశ్శబ్దపు చూపు కింద
నగ్నంగా
వికలంగా నిల్చునే దాకా.

మూలం: కార్లా కె. మోర్టాన్.

Saturday, May 14, 2011

మూడో తరం నుంచి ఓ ఆణిముత్యం..."ఊరి చివర"


ఇండియా టుడే నుంచి..."ఊరి చివర" గురించి అంపశయ్య నవీన్ గారి సమీక్ష

Sunday, April 10, 2011

ఈ కవిత్వం మొహమాటాలు లేని రాజకీయ భావ ప్రకటన

"పాలపిట్ట" తాజా సంచికలో వెలువడిన ఇంటర్వ్యూ ఇది...



అఫ్సర్ గారూ, మీ కొత్త కవితా సంపుటి “ఊరి చివర” విడుదల సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు! దీన్ని పురస్కరించుకుని మీతో కొంచెం సేపు ముచ్చటిద్దామనుకున్నాం. ముందుగా “ఊరి చివర” నేపథ్యం, వచ్చిన పరిస్థితీ వివరిస్తారా?

- "ఊరి చివర" అనే శీర్షికలోనే ఆ కవిత్వ నేపధ్యమూ, పరిస్థితీ స్పష్టంగా అర్ధం అవుతున్నాయి. "కవిత్వ" ఇసకలో మాత్రమే తలదూర్చి వున్న ఉష్ట్ర పక్షులకి ఈ కవిత్వం అర్ధం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. కేవలం కవిత్వ అభిమానుల కోసమే కవిత్వం రాయడం నా వల్ల కాని స్థితిలో ఈ కవిత్వం వచ్చింది. ఈ కవిత్వం రాస్తున్న సమయంలో నేను మూడు ప్రపంచాల మధ్య - ఒకటి: తెలంగాణా, రాయలసీమ మారుమూల పల్లెల్లో వున్నాను, రెండు: ప్రపంచానికి కేంద్రం అని భ్రమిసే అమెరికాలోనూ వున్నాను, మూడు: పాప్ కల్చరూ, ధనిక సంస్కృతినీ అనుకరిస్తూన్న "లిటిల్ అమెరికా" లాంటి నయా హైదరబాదులోనూ వున్నాను. ఈ మూడు ప్రపంచాల మధ్య రాపిడికి గురవుతున్న ఒక తెలంగాణ ఊరి అస్తిత్వం, ఉనికి రాజకీయాల తిరణాలలో అనాధ ముస్లిం అస్తిత్వమూ ఈ కవిత్వం రాయించాయి. "శుద్ధ" కవిత్వం ఇక రాయలేనన్న స్థిరత్వం, చుట్టుముడ్తున్న మూడు భిన్న ప్రపంచాల అస్థిరత్వం "ఊరి చివర" లో కనిపిస్తుంది. కాని, ఈ పుస్తకం మీద విమర్శలు గుప్పిస్తున్న వాళ్ళు ఈ రెండు విషయాలు తప్ప అన్నీ మాట్లాడుతున్నారు.

మీరు గతంలో వెలువరించిన కవితా సంపుటులకూ “ఊరి చివర” కూ ప్రధానమైన తేడాలూ, మార్పులూ (గుణాత్మకమైనవి) ఏమిటి?
- ఆ కవితా సంపుటాలకూ, "ఊరి చివర" కీ మధ్య పెద్ద తేడా: వస్తు విస్తీర్ణం. అందులో వున్న నలభై ఎనిమిది కవితలూ నలభై ఎనిమిది కొత్త వస్తువులు. భిన్నత్వాన్ని గౌరవించాలన్న తపన ఇందులో అన్ని కవితల్నీ నడిపించే సూత్రం. ఇది చూసి కవిత్వ సరళ రేఖల మీద బతికే వాళ్ళు గొల్లుమంటున్నారు. అయ్యో, కవిత్వమూ, శుభ్రతా అంటూ చేతుల్ని అతిసున్నిత పుష్ప ద్రవాలతో కడుక్కుంటున్నారు. కవిత్వ వస్తువు, రూపం మీద మళ్ళీ చర్చలకి దిగుతున్నారు.
- ఈ విమర్శలూ, వ్యాఖ్యానాలూ చదువుతూంటే, 1985 "రక్త స్పర్శ" రోజులు గుర్తొస్తున్నాయి. అయితే, వొక్కటే తేడా. అప్పుడు మనకి మంచి విమర్శకులు వున్నారు. ఈ కవిత్వ సంపుటిని సమీక్షిస్తూ కేవీయార్ "1985 కవిత్వానికి కొండ గుర్తు" అని రాశారు, ఆయనకి నా కవిత్వ రూపం మీద అభ్యంతరాలు వున్నప్పటికీ- కవిత్వ రూపం కొత్తగా వుండాలనుకున్న ఆ తపనలో నేను అమాయకంగా ఇస్మాయిల్ కవిత్వాన్ని ఆరాధించే వాణ్ని. ఇస్మాయిల్ గారిది "టింబర్ డిపో" (అంటే కట్టెలు పేర్చినట్టుగా వుండేదని) కవిత్వం అని ఆ రోజుల్లో అజంతా గారు అనే వారు. ఇస్మాయిల్ కవిత్వం విడిగా చదివేటప్పుడు బాగానే అనిపించినా, చదివాక తీరని అసంతృప్తి కలిగించేది. ఆ దశలో నేను కొత్త హిందీ కవిత్వంలోనూ, ఉర్దూలోనూ సేదదీరాను. ఆ తరవాత, "ఇవాళ" లొ నేను రాయలనుకున్న కవిత్వ రూపానికి కొంత దగ్గిరగా వచ్చాననుకున్నా.
- "వలస" లో కొన్ని అసంతృప్తులు వున్నాయి, కాని, చాలా మందికి "వలస" నచ్చింది. "ఊరి చివర" లో నేను రూప వైవిధ్యం వైపు నడిచాను. బిస్మిల్లా ఖాన్ మీద రాసిన కవిత కానీ, "తోలు మందం" అనే కవిత గానీ, "నెత్తుటి నెమలీక" కానీ వస్తు, రూప ప్రయోగాలు. వ్యాఖ్యలు చేసే అమెరికన్ తెలుగులు నెత్తురు అనే పదం చూడగానే, పసి పిల్లల్లా భయపడుతున్నారు కాని, "నెత్తురు" అనే పదచిత్రం, పదం ఎన్ని సందర్భాల్లో ఎంత భిన్నంగా వాడానో చూడలేకపోతున్నారు.నెత్తురు అనగానే ముఖం మాడ్చుకొని కవిత్వం పక్కన పడేస్తే జాలేస్తోంది వీళ్ల మీద. "ఊరి చివర" మొహమాటాలు లేని రాజకీయ భావ ప్రకటన. అందులో రాజకీయ భావాలతో పేచీ వున్న వాళ్ళు ఇంకేమీ అనలేక కవిత్వమూ/అకవిత్వమూ/ అయోమయమూ/ లాంటి పదాల కింద దాక్కుంటున్నారు. ఇందులో గుణాత్మకమయిన మార్పు అదే. అది అర్ధం అయ్యింది కాబట్టే, కొంత మందికి ఈ మార్పుని చూడడం ఇష్టం లేదు, కనీసం కవిత్వ పాతివ్రత్యాన్ని అయినా కాపాడుకోవాలన్న పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నన్ను "అకవి" అన్నా నాకు పరవాలేదు, కాని, ఈ భావ ప్రకటనల నిజాన్ని ఎవరికి వాళ్ళు సొంత కళ్ళతో చూడగలిగితే చాలు. కవిత్వం కన్నా, అలాంటి "ప్రకటన" ఇప్పటి అవసరం అని నాకు రాను రానూ అర్ధం అవుతోంది. దానికి వ్యాసాలు రాసుకోవచ్చు కదా అని అతితెలివి పరులు కొంత మంది అనవచ్చు. కాని, కవిత్వం అనేది శుద్ధ వాదుల సొంత ఆస్తి కాదు కదా! ఇప్పుడు నేను చదివే ప్రపంచ కవిత్వం అంతా నాకు రాజకీయ కవిత్వంగానే కనిపిస్తోంది. "ప్రాణ హిత" లో తెరిచిన దర్వాజా ఆ రకం కవిత్వంలోకే.

(రెండో భాగం తరవాత...)
- ఇంటర్వ్యూ: నారాయణ స్వామి (ప్రాణహిత)

Sunday, March 20, 2011

ఆస్టిన్ లో రమణీయం!




ఆస్టిన్ లో ఈ శనివారం రోజంతా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిన టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సులో ఈ సారి ప్రత్యేక ఆకర్షణ ప్రసిద్ధ సాహిత్య బంధువు , అనేక మందికి ఆత్మబంధువు ముళ్ళపూడి వెంకట రమణ గారికి నివాళిగా అర పూట కేటాయించడం! బహుశా, రమణ గారికి ఇంత మంచి నివాళి ఆంధ్ర దేశంలో కూడా దక్కి వుండదు అని నేను సభలోనే అన్నాను, ఇక్కడా రాతలో కమిట్ అవుతున్నాను. ఈ ఆలోచన వచ్చినందుకు బలరామ పురం (ఫ్లూగర్ విల్లి కి ‘సత్య’ నామం) నివాసి, ప్రముఖ రచయిత మందపాటి సత్యం గారిని ముందుగా అభినందించాలి.

మంచి అనుభవాల తలపోత




ముళ్ళపూడి వెంకట రమణ గారిని తలచుకుంటూ టెక్సాస్ రచయితలు తమ అనుభవాలని చెప్పడమే కాదు, రమణ గారి కొన్ని రచనలను వీనుల విందుగా పాఠకులతో పంచుకున్నారు. సత్యం గారు రమణగారితో తనకి వున్న పరిచయానుబంధంతో అందరికీ స్వాగతం చెప్పారు. ‘గుడివాడ” (టెంపుల్) ప్రముఖులు వైవీ రావు గారు రమణ గారి “ఆత్మస్తుతి” నించి కొన్ని భాగాలు వినిపించారు. శేషగిరి రావు గారు మద్రాస్ అనుభవాలని తలచుకున్నారు. గిరిజా శంకరం గారు స్కిట్ వెయ్యాలనుకొని హీరోయిన్ గైర్హాజరీ వల్ల ఏకపాత్రాభినయానికి పరిమితమయ్యారు. వంగూరి చిట్టెన్ రాజు గారు రమణ గారితో వున్న ఆత్మీయానుబంధం గురించి చెప్పడమే కాకుండా, సినారె ని కూడా వీడియో ద్వారా ఆస్టిన్ కి లాక్కు వచ్చారు. రామ్ డొక్కా, ఫణి డొక్కా రమణ గారితో అనుభవాలని చక్కని కథనంగా వినిపించారు. ఈ వ్యాసకర్త కోతి కొమ్మచ్చి గురించి చెప్పాడు. పప్పు సత్యభామ గారు ముళ్ళపూడి కథ “కానుక” ని చక్కగా చదివి వినిపించారు. అలాగే, రమణ గారి పాటని “ఆహా” అనిపించేట్టు తీయగా పాడి వినిపించారు. నిజానికి సత్యభామ గారి గొంతులో రమణ గారి కథల ఆడియో పుస్తకం తీసుకురావచ్చు!

శ్యామ్ యానా/ అనేక
సదస్సు రెండో సెషన్ మెడికో శ్యామ్ కథల సంపుటి “శ్యామ్ యానా” ఆవిష్కరణతో మొదలయ్యింది. ఈ సదస్సుకి చిట్టెన్ రాజు గారు అధ్యక్షత వహించారు. శ్యామ్ కథల గురించి ఆయన మిత్రులు రాచకొండ సాయి గారు మాట్లాడారు. శ్యామ్ మరో మిత్రులు నాగేశ్వర రావు గారు పలికిన ఆత్మీయ వచనాలు సరదాగా ఆర్ద్రంగా వున్నాయి. ఇక శ్యామ్ ఒక సాహిత్య డిటెక్టివు కథ అంటూ తన గురించీ, తన లోపలి కథకుడి గురించీ చెప్పిన ముచ్చట్లు ఆద్యంతం బాగా నవ్వించాయి. ఆయన ప్రసంగం అంతా హాయిగా రీడబిలిటీ వున్న హాస్య కతలాగా సాగింది. చాలా బరువయిన సంగతులు కూడా తేలికయిన మాటల్లో చెప్పుకొచ్చారు శ్యామ్.




అఫ్సర్, వంశీ కృష్ణ సంపాదకత్వం వహించిన పదేళ్ళ కవిత్వ సంకలనం “అనేక” గురించి మద్దుకూరి చంద్రహాస్ వివరంగా ఆలోచనాత్మకమయిన ప్రసంగం చేశారు. అనేకని పరిచయం చేస్తూ “ వస్తుపరంగా చూస్తే - మైనారిటీ వాదం (ఇస్లాం, క్రైస్తవం), దళితవాదం, స్త్రీవాదం, ప్రాంతీయవాదం (తెలంగాణ), ఇప్పటికీ శక్తివంతంగానే ఉన్న వామపక్షవాదం – అవేకాక స్త్రీలు, పురుషులు, మానవసంబంధాల మీద – ఇవేవీ లేకుండా సమకాలీన పరిస్థితుల మీద, ఆధునిక జీవితంమీద – ఇంకా తాత్వికధోరణులలో - ఇలా విభిన్నమైన గొంతుకలు ఇందులో వినిపిస్తాయి. కానీ ఇన్ని భిన్నమైన విషయాల లోనూ ఒక అంతర్లీన ప్రాతిపదిక (inherent idea) ఉన్నది. ఈపదేళ్ళ కాలంలో తెలుగునాట ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల ప్రభావం, ఈ ఆర్థిక విషయాల ప్రతిధ్వనులు ముందు చెప్పుకున్న అనేక అస్తిత్వవాదాలమీద వేసిన ముద్ర, - అది ఈ పుస్తకానికి ముఖ్యమైన ప్రాతిపదిక.” అన్నారు చంద్రహాస్.
ఇక మూడవ విభాగంలో టెక్సాస్ రచయితలూ కవులు స్వీయ రచనలు వినిపించారు. రమణి విష్ణుభొట్ల, యెలేటి వెంకట రావు, రాయుడు, ప్రసాద్ విష్ణుభొట్ల, ప్రసాద్ తుర్లపాటి తదితరులు తమ రచనలు చదివారు.
ఈ సారి టెక్సాస్ సాహిత్య సదస్సులో డాలస్ దండు (చంద్ర కన్నెగంటి, సురేశ్ కాజా, కేసీ చేకూరి, నసీమ్, అనంత్ మల్లవరపు లాంటి వారు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది.

పోయిన సారి గుడివాడ (టెంపుల్)లో అడుగడుగునా నవ్వుల పూలు రువ్విన సుదేశ్, అరుణ్ లేకపోవడంతో ఈ సారి పెద్దగా నవ్వులు పూయలేదు. ఇర్షాద్ వచ్చినట్టే వచ్చి మెరుపులా మాయమయిపోవడం అన్యాయం అనిపించింది.
జపాన్ లో జరిగిన ప్రకృతి వైపరీత్యం గురించి భావన డొక్కా చక్కని తెలుగులో మాట్లాడడం బాగుంది. సభకి ముందే కడుపు నిండా భోజనాలు పెట్టడం బాగుంది. ముఖ్యంగా మైసూరు పాకులు వక్తల ప్రసంగాల కంటే బాగున్నాయి. సభలో మాట్లాడిన వక్తల ముఖ చిత్రాలను అక్కడికక్కడ గీసివ్వడం బాగుంది.


మిత్రులకు మనవిఈ సదస్సు ఫోటోలు మీ దగ్గిర వుంటే పంపండి. ఇక్కడ ప్రచురించ వచ్చు.

Saturday, March 12, 2011

సరిహద్దులు లేని సాహిత్య సంచారి!




వొక వడలిపోని జ్నాపకం –

90లలో అనుమాండ్ల భూమయ్య గారి కొత్త పద్యాలు చదివి ముచ్చటేసి, “ఫ్రెంచ్ మద్యంలాంటి తెలుగు పద్యం” అనే శీర్షికతో నా వ్యాసం అచ్చయిన వొక సాయంకాలం వో పెద్దాయన నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. ఆయనకి అప్పటికే వయసు బాగా మళ్ళింది. కానీ, ఆయన మాట తీరు చూశాక ఆయన ఆలోచనలకి పెద్దగా వయసు మళ్లలేదని అర్ధమయ్యింది. ఆలోచనల నిండా వొక స్వచ్ఛత, ఇప్పుడే కవిత్వ విమర్శలోకి అడుగు పెట్టి, ఆ రూప రహస్యాలు శోధిస్తున్న కంటిలో వుండే తీక్షణత – ఆయనలో కనిపించాయి. అదే మొదటి సారి వడలి మందేశ్వర రావు గారిని చూడడం! మొన్న చనిపోయినప్పుడు వడలి మందేశ్వర రావు గారికి దగ్గిర దగ్గిర తొమ్మిది పదుల వయసు. కానీ, ఆయన విమర్శ పుస్తకాలు వొకొక్కటిగా ఇప్పుడు తిరిగి చదువుతున్నప్పుడు నిజానికి ఆ వయసులోని వార్ధక్యం వొకింత కూడా కనిపించదు. విమర్శకీ వయసుకీ సంబంధం వుంటుందా అన్న ప్రశ్న రావచ్చు. వుంటుందని నాకు అనిపిస్తోంది. వయసు మీద పడే కొద్దీ లోకం మీద ఫిర్యాదులు పెరిగిపోతాయి. విమర్శలో పటుత్వం తగ్గే అవకాశమూ లేకపోలేదు. మినహాయింపులు వుంటాయి. అలాంటి మినహాయింపులు అరుదు. ఆ అరుదయిన మినహాయింపు మందేశ్వర రావు గారు.
మూడు ముఖ్యమయిన విమర్శ పుస్తకాలు మందేశ్వర రావు గారిని ఎప్పటికీ మన ముందు వుంచుతాయి. అందులో మొదటిది ఆయన విశ్వనాథ మీద రాసిన “ఇదీ కల్పవృక్షం”. నాకు తెలిసీ కల్పవృక్షం లోని నిర్మాణ రహస్యాలని శోధించి, వాటి మీదకి దృష్టి మళ్లించే మొదటి ప్రయత్నం ఇదే అనిపిస్తోంది. విశ్వనాథని చదవక్కరలేదు అనుకునే కాలంలో ఎందుకు చదవాలో కొత్త సాహిత్య ప్రమాణాలతో వొప్పించే విధంగా రాశారు మందేశ్వర రావు గారు. వ్యక్తిగతంగా విశ్వనాథకి చాలా కాలం చాలా దూరంగా వున్న నేను “ఇదీ కల్పవృక్షం” చదివాక తిరిగి ఆయన రచనలు ఆసాంతం చదవడం మొదలు పెట్టాను. రచయిత దృక్పథాన్ని కాసేపు పక్కన పెట్టి, రచన ఇంకా ఏం చెప్తుందన్న ఆలోచన మొదలయితే విశ్వనాథ మొత్తం సాహిత్యాన్ని ఇంకో కోణం నించి తప్పక అర్ధం చేసుకోవచ్చని నా అనుభవం. మందేశ్వర రావు గారు విశ్వనాథ కవిత్వ శిల్పం మీద మొదలు పెట్టిన చర్చ ఇంకా కొనసాగాల్సిన అవసరం వుంది.
దీనికి పూర్తి భిన్నంగా రాసిన రెండు పుస్తకాలు: 1) పాశ్చాత్య సాహిత్య విమర్శ- చరిత్ర, సిద్ధాంతాలు, 2) Modern Poetry in Telugu. 1990 ల తరవాత తెలుగు సాహిత్య రంగంలో పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల మీద వొక కొత్త ఆసక్తి మొదలయ్యింది. మార్క్సిస్టు అనంతర అస్తిత్వ వాదాలు చర్చలోకి వచ్చిన తరవాత మార్క్సిస్టు సాహిత్య విమర్శ ధోరణి మాత్రమే సరిపోదని, ఇతర ధోరణులు కూడా అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందని కొత్త తరం గుర్తించడం మొదలయింది. ఆధునికతకి పరిమితమయిన విమర్శ సాధనాలు కొత్త ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేని స్థితిలో అత్యాధునిక సాధనాల అన్వేషణ కూడా ప్రారంభమయింది. ఆ నేపథ్యంలో వెలువడిన విమర్శ పుస్తకం “పాశ్చాత్య సాహిత్య విమర్శ- చరిత్ర, సిద్ధాంతాలు.”(1994). తెలుగులో మౌలిక సాహిత్య విమర్శ, సిద్ధాంత భావనల గురించి పరిచయమూ, పరిశోధనా తక్కువే. చాలా భావనల్ని మనం వాటి తాత్విక చరిత్రతో సంబంధం లేకుండా మనకి తోచినట్టుగా వాడుతూ వుంటాం. దీని వల్ల సాహిత్య చర్చలు చాలా సందర్భాల్లో అభిరుచి, వైయక్తిక పరిధులని దాటి వెళ్లవు. ఆ రెండు పరిధులని దాటుకుని, వొక దృక్కోణం నించి సాహిత్య విమర్శ జరగాలంటే, మౌలిక భావనల ఆనుపానులు తెలిసి తీరాలి. 1990 తరవాత తెలుగులో అత్యాధునికత చర్చ దారి మళ్లడానికి కారణం ఇదే. అది క్రమంగా పడమటి సాహిత్య సిద్ధాంతాలని ఎలాంటి నిర్దిష్టతా, విమర్శా లేకుండా స్వీకరించే స్థితికి తీసుకు వెళ్లింది. పడమటి సిద్ధాంతాలని శిరోధార్యంగా భావించే వలసాధునికత లోకి తీసుకు వెళ్లింది. “పాశ్చాత్య సాహిత్య విమర్శ- చరిత్ర, సిద్ధాంతాలు.” పుస్తకం రాస్తున్నప్పుడు గాని, ఆ పుస్తకం వెలువడినప్పుడు గాని మందేశ్వర రావు గారికి ఆ కొత్త పరిణామాల గురించి ఆట్టే అవగాహన లేకపోవచ్చు. కానీ, ఈ పుస్తకం ఆ పరిణామాలతో నిమిత్తం లేకుండానే, కొన్ని సమస్యల్ని పరిష్కరించింది. అసలు పాశ్చాత్య విమర్శని ఎంత వరకు మనం గ్రహించవచ్చన్నది అందులో మొదటి సమస్య. మందేశ్వర రావు గారు గుర్తించినట్టు, ఇప్పటికీ పడమటి సాహిత్య విమర్శలో వినవచ్చే చాలా అంశాలు భారతీయాలంకారికులకి “నూత్నమయినవి” కావు. కానీ, మనలో వున్న పడమటి వలస వాద మొగ్గు వల్ల అవి అన్నీ నవనవలాడుతూ కనిపిస్తాయి. మందేశ్వర రావు గారి ఈ పుస్తకం వెలువడి పదహారేళ్లు దాటింది. రెండు కారణాల వల్ల ఈ పుస్తకం నాకు నచ్చింది: వొకటి, పడమటి విమర్శ సిద్ధాంతాలని విమర్శనాత్మకంగా చూడడం; రెండు, అత్యాధునిక భావనల్ని సైతం చాలా స్పష్టమయిన తెలుగు భాషలో చర్చించడం. ఈ రెండు లక్షణాలూ క్రమంగా దూరమయిపోతున్నాయని వేరే చెప్పక్కరలేదు కదా!
ఇక మందేశ్వర రావు గారి మూడో పుస్తకం – Modern Poetry in Telugu. ఇంగ్లీషులో వుండడం వల్ల ఈ పుస్తకం మీద తగినంత చర్చ జరగలేదేమో అనిపిస్తోంది వొక్కో సారి. ఇది కవుల గురించి పుస్తకం కాబట్టి చాలా మటుకు దీన్ని కవిపరిచయ విమర్శగానే చూసినట్టూ అనిపిస్తుంది. కానీ, మందేశ్వర రావు గారు చాలా మౌలికం అనిపించే కొత్త వాదనలు, ప్రతిపాదనలు ఇందులో చేశారు. ఈ పుస్తకం రెండు భాగాలు – ధోరణులూ, కవిపరిచయాలు. నాకు అమితంగా నచ్చిన భాగం మొదటిదే, ధోరణుల గురించి. శ్రీశ్రీలూ, కృష్ణశాస్త్రులూ, విశ్వనాథల కాలానికీ, ఈ కాలానికి కవిత్వంలో చాలా తేడా వుందన్న విషయం అందరూ ఇట్టే వొప్పుకుంటారు. కానీ, ఆ తేడా ఎక్కడ వచ్చిందో నిర్దిష్టంగా చెప్పడం అంత తేలిక కాకపోవచ్చు. ముఖ్యంగా కవిత్వరంగంలో ఈ విషయం తేలికగా తేలేదీ కాదు. కవి స్థాయీ, విమర్శకుడి అభిరుచీ అక్కడ సంకెల అవుతుంది. నిజానికి “ఇదీ కల్పవృక్షం” లో చేసిన పనే మందేశ్వర రావు గారు ఇక్కడా చేశారు. ఆయన కవిత్వ నిర్మాణంలోకి వెళ్లారు. ఆ నిర్మాణంలోంచి ధోరణుల్ని వీక్షించారు. అలా చెయ్యడం వల్ల ఆయన చూపు అభిరుచి పరిధిని దాటి, కవిత్వాన్ని లోనారసి చూసింది. ప్రతి కవిత్వ ధోరణీ గతాన్ని ఛేదిస్తుందని తెలుసు. కానీ, ఆ ఛేదన స్వరూపం తెలియాలంటే కవిత్వ నిర్మాణంలోకి వెళ్ళాల్సిందే. ఇది ఇప్పటి అస్తిత్వ వాద ధోరణులకి ఇంకా ముఖ్యమయిన విషయం. కానీ, అస్తిత్వవాద సాహిత్య విమర్శ ఇంకా నిర్మాణం జోలికి వెళ్లడానికి సందేహిస్తూనే వుంది. అలాంటి సందేహాలు అక్కరలేదనే మందేశ్వర రావు గారి విమర్శ నేర్పే పాఠం.
దురదృష్టవశాత్తూ మన లోకంలో ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు శత్రు శిబిరాలుగా మారిపోయాయి. గతాన్ని వర్తమాన దర్పణం నించి చూసి, ప్రాచీన సాహిత్యాన్ని అవతల పెట్టే ధోరణి పెరుగుతోంది. ఆధునిక సాహిత్యం చదివే చాలా మంది ఇవాళ దృక్పథం పేరు చెప్పి ప్రాచీన సాహిత్యం జోలికి కూడా వెళ్ళడం లేదు. ఇంకో వైపు నించి ప్రాచీన సాహిత్య పాఠకులలోనూ ఇదే ధోరణి వుంది. సాహిత్య అనుభవానికి కాలం అడ్డు రావడం కొంత విచిత్రమే, సాహిత్య అనుభవానికి కాలంతో నిమిత్తం లేని రచన ముందు కేంద్రం కావాలి. ఆ రచన ప్రబంధం కావచ్చు, శతకం కావచ్చు, పద్యం కావచ్చు, వచనం కావచ్చు. అన్నిటికీ మించి ఇవాళ మనం విస్మరిస్తున్న మౌఖిక కథనం కావచ్చు.
ఈ రకమయిన ప్రాచీన/ ఆధునిక వైషమ్యం. వైమనస్యం వల్ల మన ఆలోచనల పరిధే కుంచించుకు పోతుందన్న ఆత్మ శోధన కూడా ఇప్పుడు లోపిస్తోంది. కానీ, అప్పుడప్పుడూ మనకి ఆ రెండీటీ మధ్యా వారధి కట్టే వాళ్ళు వస్తున్నారు. చూస్తూండగానే వాళ్ళూ వెళ్లిపోతున్నారు. మొన్న సంపత్కుమార గారు, ఇవాళ మందేశ్వర రావు గారు. వాళ్ళ నించి నేర్చుకోవాల్సిన పాఠాలు అయినా మనం మిగుల్చుకోగలిగితే బాగుంటుందని అనిపిస్తోంది. ఈ ఇద్దరి కృషిలో వొక సామ్యం వుంది. ఇద్దరూ సాహిత్య విమర్శని వొక ప్రత్యేక రంగంగా భావించి, ఆ రంగంలో చివరి దాకా పనిచేసిన వాళ్ళే. తక్షణ ప్రయోజనం అనేది తప్పనిసరి కాంక్ష అయిన ఈ కాలంలో సాహిత్య విమర్శ క్రమంగా వొక thankless job గానే మిగిలిపోతున్న మాట నిజం. ఆ రంగంలో నిలకడగా వుండాలని అనుకుంటున్న వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద కూడా లేదు. కానీ, దానిని వొక రంగంగా భావించి, గౌరవించి, గౌరవించబడిన వాళ్ళు కూడా వొక్కొక్కరే వెళ్లిపోవడం విషాదం.
(ఆంధ్ర జ్యోతి నుంచి)

Sunday, February 13, 2011

రోజ్ రోటీ

(ఓ పాత కవిత...కొత్త సందర్భంలో...)
1



వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.
ఆకలి మెతుకు

వొక తల్వార్ లాగా మెరిసి వొక నెత్తుటి చార కసిగా ఆక్రోశిస్తుంది.

నీకు అసందర్భంగా కనిపిస్తుందా, కవీ?!

2



నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి, చెయ్యి కాల్తుందన్న భయం లేకుండా.

“ఎక్కడున్నాయి ఈ కాసిని కట్టెలయినా? పోనీ, ఈ నాలుగు చేతులయినా?” వొక ముసలి చెయ్యి నిట్టూరుస్తోంది, సగం ఖాళీ అయిన వూరు వైపు బలహీనంగా చూపు చాపి.

“వూరు సగం ఇళ్ళు, సగం వల్లకాడు. బతికి వున్న వాళ్ళు సగం శవాలు” ఇంకో గొంతు పిడచకట్టిన స్వరంతో మూల్గింది.

ఆ మూలుగు వినపడ్డదా, నగర కథకుడా! అద్భుత మాంత్రికుడా!

3



నా అక్షరాలు ఇసుకలో దూదుం పుల్లలు. చొక్కాలు రాల్చుకున్న పిల్లలు. నిద్రలో ఆకలి కేకలు. వొక వూరి నించి ఇంకో వూరికి పారుతున్న ఎండు కడుపులు. వొట్టిపోయిన నదులు. పక్క నించే బల్లెంలా దూసుకుపోయే పరాయి నీటి ధారలు. ఇంకేం లెక్కలు తీస్తావ్, నా ఎండు డొక్కల స్కేళ్ళ మీద.

చడ్డీ నించీ చుక్కల లెక్క నాది. ఇంకేం చెప్పమంటావ్, అధునాతన లెక్కల బుర్ర కథకుడా?!

4



నువ్వు చెప్పు, నేను వింటా, నీ బాంచ! వినీ వినీ నా చెవుల్లో పుట్టలు మొలిచినయిలే! నువ్వు గొంతు సవరించుకునే లోగా నా వొళ్ళు వొంగి దండమయిపోయిందిలే! ఇన్నాళ్ళూ. నిన్ను పీరీలాగా మోశానా, ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే!

చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.

కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!

5

రోజ్ రోటీ నా అద్దం. దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర.

*

(డల్లస్-టెక్సస్ తెలంగాణా సదస్సులో కొన్ని పల్లె బతుకు కథనాలు విన్నాక)

Wednesday, February 9, 2011

వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలు!

వంశీక్రిష్ణ లేఖా సాహిత్యం "విదేహ"కి రాసిన ముందు మాట ఇది.

ఎప్పుడో వొక కవితలో రాసినట్టు గుర్తు – వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలు – అని!

ఇవాళ వొకే వొక్క సారిగా నీ వుత్తరాలన్నీ చదివాక అనిపించింది, వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలే కాదు, తరాల్ని కలిపే, అంతరాల్ని చెరిపే సఖ్యరాగాలు అని!
అవును, సఖ్యత, సహనం ఇవీ ఇవాళ మనకి అత్య్గవసరంగా కావలసిన నిత్యావసర వస్తువులు. నిజానికి ఇక్కడ నేను వస్తువులకి బదులు ‘భావనలు’ అనే పదం వాడాలి. కాని, వుద్దేశపూర్వకంగానే వస్తువు అనే పదం వాడాను. ఎందుకంటే, చూస్తూ చూస్తూ వుండగానే మనం భావనలకి దూరమయి, వస్తువులకి దగ్గిరయ్యాం. ఏదయినా వస్తువుకున్న గౌరవం, విలువా భావనకి లేదు. ఇంట్లో ఫ్రిజ్ కి వున్న విలువ చల్లని మనసుకి లేదు. ప్లాస్మా టివీకి వున్న విలువ మన మధ్య కబుర్లకి లేదు. అందమయిన ఫర్నీచర్ కి వున్న విలువ ఆతిధ్యంలోని ఆత్మీయతకి లేదు.

మనసులు ఇరుకు అయినా పర్లేదు, కాని, ఇల్లు రాజసౌధంలా వుండాలి. మరేమీ ముఖ్యం కాదు, ఇంట్లో వస్తువులు తప్ప. అలాంటి వస్తువుల్ని వుత్పత్తి చేసే శక్తి మాత్రమే గొప్ప శక్తి. ఇతర శక్తులు అసమర్ధుల భావనలు. డబ్బు సంపాదించలేని వాళ్ల సాకులు. చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మన ఇల్లు విలాస వస్తువులతో నింపుకుంటే చాలు. వీధులు రక్తసిక్తమవుతుంటాయి. ఈ పూటకి కడుపు ఎలా నింపుకోవాలా అని సగానికి సగం జనం పొట్ట పట్టుకుని, చౌరస్తాల్లో శరీరాలే పనిముట్లుగా అడ్డాలలో నిలబడి వుంటారు. అయిననూ, మన గది భద్రంగా వుంటే చాలు. మన లాభాలు ఎడతెగక పారితే చాలు. మన పాచికలు విజయవిహారాలు చేస్తే చాలు.

ఇలాంటి వస్తు భావనలు మస్తుగా వున్న ఈ కాలంలో – వంశీ, నీ ఆలోచనలు, నీ అనుభూతులు వొకింత విచిత్రంగా వుండక మానవు. ఈ వుత్తరాలు చదువుతున్నప్పుడు చాలా మందికి ఇవి ఎదో చిత్రమయిన లిపిలో కనిపించి, కాసేపు వుక్కిరిబిక్కిరి అవ్వక మానరు. చాలా కాలం క్రితం నా లోపల కవిత్వమనే వొక పురుగు మసిలి సతమతం చేస్తున్న తొలి రోజుల్లో బెజవాడలో మోహన రాం ప్రసాద్ అనే మిత్రుడు – వాక్యం అంటే disturb చెయ్యాలి. వాక్యం అంటే పునాదిమట్టంగా destruct చెయ్యాలి- అని రాసి చూపించాడు వొక చిత్తు కాగితమ్మీద. ఇది తన కవిత్వ motto అని ప్రకటించుకున్నాడు. నిజానికి అది గొప్ప కవిత్వ వాక్యం అని నేనేమీ చెప్పను కాని… ఆ సమయంలో అది వొక మాని ఫెస్టొ లాంటి వాక్యం లాగా అనిపించింది. ఇవాళ వంశీ వుత్తరాలు చదువుతున్నప్పుడు అలాంటి ఆవేశమే కాసేపు పట్టి కుదిపింది. ఈ వుత్తరాల్లోని చాలా వాక్యాలకు వొక కవిత్వ వాక్యానికి వుండాల్సినంత పొగరూ, విగరూ, వగరూ వున్నాయి.

వంశీ మంచి కవి/ కథకుడు/విమర్శకుడు. అతని మనహ్ కార్మికశాల అనేక భావనల కొలిమి. నిజమయిన వూపిరితో, స్వచ్చమయిన మనసుతో వూదీ, వూదీ నిప్పు కణికల్ని మన కళ్ల ముందు మెరిపించే వచనశిల్పి వంశీ. మనకి మంచి వచనం రాసే వాళ్ళు లేరన్నది వాస్తవం. చాలా మంది వచనం పేరుతో మన కళ్ల ముందు పేర్చేది తడి కట్టెలు. అవి చితి పేర్చుకోడానికి కూడా పనికి రావు. వచనం పే రుతో వొట్టి దగా. పోనీ అది కవిత్వమూ కాదు. కవిత్వం పేరుతో ఆత్మ/ పర వంచన. ఎక్కడో ఇంగ్లీషులో చదివిన వాక్యాల్ని తెలుగులో కక్కి మన మనసుల్ని మురికి చేసే ప్రక్రియ. అలాంటి వచన వంచనలకూ, కవిత్వ నేరాలకూ వంశీ మొదటినించీ దూరం. గత రెండు పదులుగా వంశీ రాస్తూ వస్తున్న కవిత్వ, కథా, విమర్శ రచనల్లో ఇది కనిపిస్తున్న సత్యమే. ఇవాళ నేను ప్రత్యేకించి చెప్పక్కరలేదు.



ఈ వుత్తరాల్లో వంశీ ఇంకాస్త బాగా అర్ధం అవుతాడు. ఇన్నాళ్లుగా అతని రచనల అంతరంగంలోని మాటని ఈ వుత్తరాలు ఎలాంటి దాపరికమూ లేకుండా విప్పి చెబుతాయి, రెండు కారణాల వల్ల – వొకటి, వంశీ తనలోకి తాను తొంగి చూసుకునే ఆంతరంగిక వేళ ఇవి రాశాడు. తనలోకి తాను తొంగి చూసుకున్నప్పుడు తనని తానుగా అన్ని బలహీనతలతో, అశక్తులతో, సంశయాలతో , సంకోచాలతో అందుకునే వ్యక్తి కోసం రాశాడు. చాలా సందర్భాలలో ఈ వుత్తరాలు చదువుతున్నప్పుడు నాకు బుచ్చిబాబు ‘అంతరంగ కధనం’ గుర్తుకి వచ్చింది. వంశీ చాలా సార్లు ఈ వుత్తరాల మధ్య చలాన్ని ప్రస్తావిస్తాడు కాని, నిజానికి బుచ్చిబాబులోని ఆ ప్రచండమయిన అంతరంగ తీవ్రతే వంశీలో వుంది. చలం వుప్పెన లాంటి వాడు. వొక్క క్షణం ఆలోచించే వ్యవధి ఇవ్వడు. బుచ్చిబాబు సెలయే రు, తెలియని ఆ వేగంలో, తీవ్రతలో ఆలోచించుకునే నిబ్బరం కాస్త వుంది. వంశీలోనూ ఈ గుణం వుంది, వ్యక్తిగా, రచయితగా.

వంశీ, నేనూ ఇరుగుపొరుగు వూళ్లలో పెరిగాం. ఇరుగుపొరుగు వీధుల్లో చదువుకున్నాం. వొకే చోట కలిసి పని చేశాం. అన్నిటికీ మించి చాలా పుస్తకాలు కలిసి చదివాం, చాలా ఆలోచనలు కలిసి చేశాం. అలా కలిసి పెరగడంలో కొన్ని సంతోషాలూ, కొన్ని దుఖ్ఖాలూ వున్నాయి. ఎవరినించి ఏం తీసుకున్నామో తెలియదు. అలా తీసుకుంటొ, తీసుకుంటొ వొక దశలో అహాలు పెరిగి, వొకళ్లనొకళ్లం క్షమించుకోవడం మానేస్తాం. చుట్టు వున్న వ్యాపార సూత్రాలు అవతలి వ్యక్తి లోని గొప్పతనాన్ని వొప్పుకోనివ్వవు. ఇంతా చేస్తే, మనం వున్నది వస్తుగతమయిన వ్యాపార లోకమే! మిత్రులు శత్రువులవుతారు. లేదా, మిత్రత్వపు ముఖం కింద శత్రుపార్శాన్ని దాచుకుని, నటించడం మొధలు పెడతారు. అలాంటి వ్యాపార వస్తు వంచనత్వం వంశీకి పట్టుబడలేదు.

అంతటా వ్యాపార వ్యామోహమే జీవన శాసనం అయ్యినప్పుడు….అప్పుడేం చెయ్యాలి? ఎవరికయినా మనసు విప్పి వొక వుత్తరం రాయాలి, ఈ మెయిల్స్ , సెల్ ఫోన్స్ , ఫోన్స్ పక్కన పడేసి, పొస్టాఫిస్ కి వెళ్లి, వొక నీలి కవరు కొనుక్కొచ్చి, ఎగశ్వాస, దిగశ్వాస వినపడేట్టు- కొన్ని అక్షరాలు సిరాలోంచి కాగితమ్మీదికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రాలాలి.

అలాంటి అనుభూతి కలగలేదనుకోండి.

అప్పుడు – ఈ వంశీ వుత్తరాలు చదవండి. వాటిల్లో మనసుని తేలిక చేసే చిక్కని ఇరానీ చాయ్ గమ్మత్తు వుంది. చదివాక – ఎంత కాదన్నా కాస్త మనసు తడుస్తుంది.

అప్పటికీ మనసు రాలేదనుకొండి.

అప్పుడు -

ఈ నానా వస్తువ్యాపార పట్టణ మహమ్మారిని వదిలించుకొని – వొక ఆకుపచ్చని దారి గుండా వొక చిన్న వూరికి కాలి నడకన వెళ్ళండి.

ఖమ్మం నించి మధిరకి పాసింజరు బండిలో ఎక్కి, పందిళ్లపల్లి అనే చిన్న వూరి దగ్గిర దిగండి. ఆ వూళ్లో చెట్లకి , ఆ వూరి మధ్య నాటకాల ఆరుబయలుకి ముప్పయ్యేళ్ళ కింద సత్యం అనే పిల్లగాడు తెలుసు. అతని తండ్రికి బడి పిల్లలన్నా, నాటకాలన్నా ప్ర్రాణం కాబట్టీ , ఆ పంతులు గారి అబ్బాయి అని చెప్పండి వివరం కోసం.

ఆ వూరికి నాటకాల కోసం నేను చింతకాని నించి నడుచుకుంటూ వెళ్లిన చిన్నతనంలో ఆ పంతులు గారి అబ్బాయిని మిస్సయ్యాను. చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ‘మనం ఇద్దరం వొక వూరి గాలి కలిసి పీల్చాం, వొక వూరి నీళ్లు కలిసి తాగాం. వొక వూరి ఆరుబయలులొ కలిసే ఆ నాటకాలు చూసి వుంటాం,’ అన్నాను. అది అంటున్నప్పుడు కూడా వంశీ ఎవరో నాకు పెద్దగా తెలియదు, ఈ వుత్తరాలు చదివాక తెలిసినంతయినా.

కాని, అది వూహ తెలియని లోకం. బహుశా ఇంకా మనకి వూహ తెలియలేదనే అనుకుంటాను. అప్పుడప్పుడూ ఇలాంటి వుత్తరాలు చదువుతున్నప్పుడు కొన్ని వూహలు తెలుస్తాయి. ఆ పల్లెటూరి ఆకుపచ్చ దారి లా అవి తెరుచుకొంటాయి. కాసేపు పసితనంలోకి వెళ్లి , వూహల స్కేలు మీద వాటి తీవ్రతల్ని ఆనవాలు పడతాం.

అలాంటి వుత్తరాల వూహల ఆనవాళ్లని కానుక చేస్తున్న వంశీకి

…… ప్రేమతో …………….. సరిహద్దుల ఆవలి నించి………………………………..



అఫ్సర్

Friday, February 4, 2011

తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక ‘అపరిచితుడు’

1944తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. నిలువ నీడలేదు. అతికష్టంమీద కోఠీలో ఒక ఇరుకుగది దొరికింది. ఆ ఇరుకుగది అతని ప్రపంచమయ్యింది. కాదు, ప్రపంచమే అతని ఇరుకుగదిలో ఇమిడిపోయింది. ఎందరో తెలం గాణ యువరచయితలకు అది కేంద్రమయ్యింది.

అక్కడ తన కలల్ని నిజం చేసే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ని అతను స్థాపించాడు. ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఒక బుక్‌స్టాల్ ప్రారంభించి, టాల్‌స్టాయ్,దాస్తవస్కీ లాంటి రష్యన్ రచయితలతో పాటు గొప్ప ఉర్దూ పుస్తకాలు తెప్పించాడు. అవి అమ్మగా వచ్చిన కాసినిడబ్బులతో ఏపూటకి ఆ పూట గడిచిపోయేది. అంతటి దుర్భర దారిద్య్రంలోనూ అతని కవితాత్మ రాజీపడలేదు. ఈ ఇరుకుగదిలో ఉండగానే అతనొక మంచి నవల రాశాడు. అదీ దక్కనీ ఉర్దూలో! ఆ రచయిత పూర్తిపేరు సర్వదేవభట్ల నరసింహమూర్తి. అతని కలంపేరు ‘కవిరాజమూర్తి’. అతను ఉర్దూలో రాసిన నవలపేరు ‘మై గరీబ్ హూఁ’. కవిగా మాత్రమే అందరికీ తెలిసిన సర్వదేవభట్ల నరసింహమూర్తి 1926 అక్టోబర్ నెలలో ఖమ్మంలో జన్మించారు. ఖమ్మంలో నూరేళ్ళ పైబడి చరిత్ర ఉన్న ఆంధ్ర బాలాభివర్థనీ గ్రంథాలయం, విజ్ఞాన నికేతనం ఆయన చదువుకున్న బళ్ళు. ఇప్పుడు ఖమ్మంజిల్లాలో ఉన్న పిండిప్రోలు ఆయన స్వగ్రామం.

తండ్రి వీరభద్రయ్య న్యాయవాది. బాబాయి సర్వదేవభట్ల రామనాథం పెద్ద కమ్యూనిస్టు నాయకుడు. తమ్ముడు విశ్వనాథం ఖమ్మంలో తరువాత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన న్యాయవాది, గాంధేయవాది. రెండో కొడుకు నరసింహమూర్తిని కూడా న్యాయవాదిగా చూడాలన్నది తండ్రి కల. కాని, నరసింహమూర్తి లోకమే వేరు. ఇంకా ఇరవయ్యేళ్ళు నిండకుండానే అతనిపైన కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం పడింది. ముఖ్యంగా బాబా యి రామనాథం గొప్ప స్ఫూర్తి. తరువాత ఉర్దూ అభ్యుదయకవులు నరసింహమూర్తి దారినే మార్చివేశారు. బాబాయి మాదిరిగా ప్రత్యక్ష కమ్యూనిస్టు రాజకీయాల్లోకి రాలేదు నరసింహమూర్తి. ఉర్దూ కవిత్వం మీద మమకారం పెంచుకుని, ఉర్దూలో కవి త్వం చెప్పడం మొదలుపెట్టాడు.

ఉర్దూలో అతని కవిత్వ పటిమకి మెచ్చి నైజాం సర్కారు ‘ప్రజా కవిరాజు’ బిరుదునిచ్చింది. ఆ బిరుదు అందుకునే నాటికి అతనికి పందొమ్మిదేళ్ళు. నైజాం ఇచ్చిన బిరుదు తరువాత ‘కవిరాజమూర్తి’గామారి స్థిరపడిపోయింది. కమ్యూనిస్టుల ఏరివేత ప్రారంభమయిన తరువాత ఈ పల్లెటూరి యువకుడు హైదరాబాద్ చేరుకున్నాడు. అంతకుముందు, అంటే 1944 ప్రాంతాల్లో కవిరాజమూర్తి ఉర్దూ, తెలుగు భాషలలో విస్త­ృతంగా రచనలు చేసినట్టు తెలుస్తోంది. కాని అవి ఏవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అతికష్టం మీద ఈ వ్యాసరచయితకి అందుబాటులోకి వచ్చిన ‘మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం (రెండో ముద్రణ -1950) వెనుక అట్టమీద వివరాల ప్రకారం ఆయన ఉర్దూలో రెండు నవలలు, ఒక నాటిక, ఒక జముకుల కథ, గేయాలు ప్రచురించినట్టు ఉంది.

ఉర్దూలో ఆయన రాసిన నవలలు ‘లహూకీ లకీర్’ (రక్తరేఖలు), కవితాసంపుటి ‘అంగారే’ (నిప్పురవ్వలు) కూ డా ఇప్పుడు ఎక్కడా లభ్యమవ్వడం లేదు. ‘మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం మాత్రం ఖమ్మం సాహిత్యచరిత్రపై పరిశోధన చేస్తున్న నరసింహారావుగారి ద్వారా లభించింది. (ఉర్దూమూలం కోసం పరిశోధకుడు వెతుకుతూనే ఉన్నారు). “మై గరీబ్ హూఁ నవల మీరు తెలుగులో చదివితే మీకు ఆ జోష్ (ఊపు)రాదు. అది ఉర్దూలో చదవాలి,అందునా మూర్తిగారు చదువుతుంటే నాకు కళ్ళనీళ్ళు ఆగేవి కావు” అన్నారు కవిరాజమూర్తిగారి భార్య వరలక్ష్మి. డెబ్బయ్ ఆరే ళ్ళ వరలక్ష్మిగారు ఈ నవల పేరు ప్రస్తావించగానే ఒక గొప్ప ఉత్సాహంతో అప్పటి సాహిత్య విశేషాలు చాలా చెప్పారు. నవలలోని కొన్ని సంభాషణల్ని అలవోకగా వినిపించారు. అంతేకాదు, 1946-1950 మధ్య హైదరాబాద్ తెలుగు- ఉర్దూ రచయితల ఉమ్మడి సాంస్క­ృతిక జీవన విధానాన్ని గురించి ఆమె చెప్పిన ప్రతి అంశం తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణానికి ఒక సాధనమే! అంత వృద్ధాప్యంలో కూడా అప్పటి ఉమ్మడి జీవనశైలి ఎలా ఉండిందో ఆమె అనేక జ్ఞాపకాల మధ్యచెప్పుకుంటూ వచ్చారు.

ఊరు వదిలి భాగ్యనగరానికి…!
’1942, 1946,1949, 1950… ఇవి నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరాలు. 1942లో (అంటే అప్పటికి మూర్తిగారికి పదహారేళ్ళు) మూర్తిగారితో నా పెళ్ళయింది. పెళ్ళయిన మూ డేళ్ళు మాత్రమే మా జీవితంలో సంతోషంగా సాగిన రోజులు. 1946లో ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆంధ్రమహాసభ జరిగింది. సుందరయ్యగారు వచ్చారు. చుట్టుపక్కల ఊళ్ళనుంచి వేలకొద్దీ జనం బండ్లు కట్టుకుని వచ్చారు. గొప్ప సభ జరిగింది. కాని మూర్తిగారి జీవితం ప్రమాదంలో పడింది. ఆయన్ని కమ్యూనిస్టు అన్న కసితో ఒక హత్యకేసులో ఇరికించారు. ఇల్లూవాకిలీ ఊరూ వదిలి పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ చేరాం. హైదరాబాద్‌లో ఎట్లాబతికామో మాకే తెలీదు. ఈ పూట రొట్టి దొరుకుతుందా,దొరకదా అని ప్రతిపూటా నరకం. కాని మూర్తిగారికి సాహిత్యమే పెద్ద జీవితం. ఆయన ఉర్దూ సాహిత్య జిజ్ఞాస ఎందరినో స్నేహితుల్ని సంపాదించిపెట్టింది.

ఉర్దూ కవులూ,రచయితలతోపాటు బెల్లంకొండ రామదాసు, రెంటాల, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, దేవులపల్లి రామానుజరావులాంటి వాళ్ళంతా ఆ ఇరుకుగదికి వచ్చిపోతుండేవాళ్ళు. నేనూ ఒక మూల కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటూండేదాన్ని. కొద్దికాలానికి- అంటే 1949లో గిడుతూరి సూర్యంగారు హైదరాబాద్ కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అప్పుడే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ కూడా ఏర్పడింది. తరువాత మూర్తిగారికి నృపతుంగ హైస్కూల్లో తెలుగుపండితుడి ఉద్యోగం అయ్యింది. ఆ సమయంలోనే సుల్తాన్‌బజార్‌లో ‘మూర్తీస్ బుక్‌హౌస్’ పేరుతో బుక్‌స్టాల్‌పెట్టారు. కేవలం ఇంగ్లీషు పుస్తకా లు మాత్రమే బొంబాయినుంచి తెప్పించి అమ్మేది. అలా తెప్పించిన పుస్తకాలలో కొన్నాయన నాకు చదివి వినిపించేవారు. ‘అన్నా కెరెనీనా’ ఆయన చదువుతూండగా విన్నవాటిల్లో నాకు నచ్చిన గొప్ప పుస్తకం.

రచన ఒక జ్వరవేదన!
అదే సమయంలో మూర్తిగారు ఉర్దూలో ఏదో రాయడం మొదలుపెట్టారు. ‘ఇది పెద్ద నవల. దక్కనీలో రాస్తున్నా’ అంటూ రోజుకి కొన్ని పేజీలు చదివి వినిపించేవారు. అది రాస్తున్నంత కాలం ఆయన మూర్తీభవించిన అశాంతిలా ఉండిపోయారు; ఏదో జ్వరం వచ్చినట్టే! ఈ నవల ఎప్పుడు పూర్తవుతుందా అని బెంగపెట్టుకునే దాన్ని. కాని ఆయన ఉర్దూలో అది చదువుతున్నంతసేపూ విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యేదాన్ని. ఏదో మంత్రించినట్టుగా కళ్ళప్పగించి వింటూ వుండిపోయేదాన్ని. ఆ భాష, ఆ ప్రవాహం, ఆ వేగం… ‘వినడం కాదు, మాట్లాడు….’ అనేవారాయన. మూర్తిగారు కవిత్వం చాలా రాసినా అది ఎప్పుడూ నాకు వినిపించేవాళ్ళు కాదు. కాని, నవల ప్రతి పేజీ రాసింది రాసినట్టుగా ఏ రోజుకి ఆరోజు వినిపించేవారు.

అలా వినిపించకపోతే ఆయనకి కలం ముందుకి సాగేది కాదు. పైగా ప్రతిపేజీ మీదా ఇద్దరం చాలా సేపు మాట్లాడుకొనేవాళ్ళం”. ఆశ్చర్యంగా నవలలోని ప్రతిభాగం ఇప్పటికీ ఆమెకి కళ్ళకి కట్టినట్టుగా గుర్తుంది. ముఖ్యంగా ‘మై గరీబ్ హూఁ’ అనే వాక్యం పునరుక్తి అయిన ప్రతిసారీ ఆ వాక్యం చుట్టూ మూర్తిగారు అల్లిన సన్నివేశాల్ని ఆమె బాగా గుర్తుంచుకొని చెప్పారు. కాని, ఆమె దగ్గర ఈ నవల తెలుగు అనువాదం లేదు. ‘ఒక్క ఊళ్ళోనూ స్థిరంగా ఉండకపోవడం వల్ల ఎక్కడి పుస్తకాలు అక్కడే పోయాయి. చివరికి ఆయన రచన ఒక్కటీ మా దగ్గర మిగల్లేదు’ అన్నారామె. నా చేతుల్లో ఉన్న ‘మై గరీబ్ హూఁ’ జిరాక్సు ప్రతిని చేతుల్లోకి తీసుకుని, ఆమె కొద్దిసేపు ఆ పుస్తకా న్ని అప్యాయంగా తాకుతూ ఉండిపోయారు.

చాలాసేపు మా ట్లాడిన తరువాత ‘నా దగ్గర మూర్తిగారి ఒకే ఒక పుస్తకం మిగిలింది. అది మీకు ఇస్తాను. తీసుకెళ్ళండి’ అంటూ లోపలకి వెళ్ళి, అతి శిథిలావస్థలో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆ పుస్తకం పేరు ‘మార్పు’. అది 1949లో మూర్తిగారు రాసిన నాటిక. తెలంగాణలోని గ్రామాల్లో ఈ నాటిక ప్రదర్శించేవారనీ, జనం బాగా వచ్చేవారనీ ఆమెచెప్పారు. ‘మై గరీబ్ హూఁ జిరాక్సు నాకు ఇవ్వండి దయచేసి. మా వద్దలేదు’ అన్నారామె. సంభాషణలో చాలాసేపు ఆమె ఈ నవల గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపించారు. ‘అది ఉర్దూలో సంపాదించి, చదవండి’ అని పదేపదే చెబుతున్నప్పుడు ఉర్దూ మూలరచన ఆమెపై ఎంత ప్రభావం కనబరిచిందో తెలుస్తూనే ఉంది. ‘మూర్తిగారు తెలుగులో బాగా రాయగలిగి ఉండీ,ఈ నవలని ఉర్దూలోనే ఎందుకు రాశారు?’ అడిగాన్నేను. ‘ఆయన ఏం రాసినా ముందు ఉర్దూలో రాసేవారు. కవిత్వం, కథ, వ్యాసం ఏదైనా కానివ్వండి.తన భాష ఉర్దూ అని స్పష్టంగా చెప్పేవారు.

ఆయన తెలుగులో రాయడం మొదలుపెట్టింది చాలా కాలం తరువాత. తెలుగులో రాసినా, అదీ ఉర్దూ ప్రభావం తోనే. ఉర్దూ కవుల గురించీ, లేకపోతే వాళ్ళ అనువాదాలే. వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన ఉర్దూలో రాస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉండేవారని అనిపించేది. ఆయన వ్యక్తిగా ఎంతో ఉద్వేగశీలి. లోపల చాలా అశాంతి ఉండేది. దానికి అనువైన తీవ్రతా, పదునూ ఉర్దూలో ఉండివుండవచ్చు. పైగా, ఇంటికి ఎవరొచ్చినా ఉర్దూలో వ్యవహా రం నడిచేది. తెలుగులో మొదలైనా, కాసేపట్లో ఉర్దూ దానికదే వచ్చేసేది. ఆయన ఉర్దూలోనే ఆలోచించేవారు. అందుకే, ఆయన తెలుగు రచనల్లోని వాక్యనిర్మాణం కూడా ఉర్దూ ప్రతీకలూ పదచిత్రాలతో నిండి ఉండేదనుకుంటా’. ‘ఈ నవల తెలుగు అనువాదం ఎప్పుడొచ్చింది?’ ‘కనీసం ఏడాది తరువాత, 1950లో నవల అచ్చయింది.

నా అంచనా ప్రకారం ఈ నవల 1948 ప్రాంతాల్లో రాసి ఉంటారు. గిడుతూరి సూర్యంగారు ‘పద్మశాలి ప్రింటింగ్‌ప్రెస్’ పెట్టిన తరువాత తెలుగులోకి అనువదించాలన్న ఆలోచన వచ్చింది.’ ‘ఈ నవల ఆయన మిత్రులు చదవడం,చర్చించడం చేశారా?’ ‘లేదు. ఉర్దూ కవిత్వంగురించి చాలాసేపు చర్చలు జరిగేవి. ఈ నవల ఆయన ఒక స్వగతంలాగా రాసుకున్నారు. తన జీవితం, తన సమాజం, తనకి ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహం… బహుశా… ఈనవల గురించి ఆయన నాతోనే ఎక్కువగా మాట్లాడి ఉంటారు. తెలుగులో ఈనవల అచ్చులోకి వచ్చిన తరువాత, అంటే 1950లలో మళ్ళీ ఆయన మీద నిర్బంధం పెరిగింది. మళ్ళీ ఊరు మారాం.తాండూరు వెళ్ళిపోయాం. ఏడాది తరువాత పటాన్‌చెర్వులో వ్యవసాయశాఖలో ఉద్యోగం దొరికింది.అప్పటిదాకా ప్రాణభయంతోనే బతికారు.

1949 ప్రాంతాల్లోనే ఉర్దూలో ‘తెలంగాణ’ అనే ఒక పక్షపత్రిక నడిపారు. అది పోలీసుచర్య తరువాత ఆరునెలలపాటువచ్చింది’. ‘శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన మూర్తిగారు ‘గరీబు’పక్షం ఎందుకు చేరారు?’ ‘కమ్యూనిస్టు పార్టీప్రభావమే! బాబాయి రామనాథం అంటే ఆయనకు ప్రాణం. శ్రీమంతుల కుటుంబంలోపుట్టారన్న మాటేగానీ, ఏనాడూ భోగభాగ్యాలు అనుభవిం చింది లేదు. మేం పిండిప్రోలు నుంచి హైదరాబాద్ పోయేటప్పటికి ఆయనకి ఇరవయ్యేళ్ళలోపే! 1954 వరకూ మళ్ళీ ఖమ్మం మొగమే చూళ్ళేదు. ఇంక ఆ సంపద ఉందో పోయిందో చూసుకున్నదీలేదు. తరువాత ఆయన పార్టీని వదిలివేశారు.కాని,పార్టీభావాల్ని మాత్రం వదల్లేదు. ‘మై గరీబ్ హూఁ’ నవలలో మీకు ఈ విషయం అతి తేలి గ్గా అర్థమైపోతుంది.అందులో పేదవాడు పడ్డకష్టాలేవీ ఊహల్లోంచి పుట్టినవి కావు. ఆయన అనుభవంలోనివే! ఆకథలోని ప్రధానపాత్రధారి’అపరిచితుడు’ ఆయనే.

‘ఈ నవల తరువాత, మళ్ళీ ఖమ్మంవచ్చాక ఆయన ఎక్కువగా ఏమీరాయలేదా?’ ‘రాశారు.కాని తెలంగాణ ఉద్యమం ముందూ వెనకా ఉన్న రచనల్లోని తీవ్రతవాటిల్లోలేదు. ఆయన రచయితగా ఒక సైనికుడిలాంటివారు. యుద్ధసమయం అయిపోయాక, ఆయన ప్రధానంగా అనువాదాల్లోకి వెళ్ళిపోయారు. మనిషిలో నిదానం వచ్చింది.నిబ్బరంగా కవిత్వం రాసుకున్నారు’ వరలక్ష్మిగారితో మాట్లాడాక, కవిరాజమూర్తి నవలని మరోసారి చదివాను. ఒక నవల సమకాలీన సమాజాన్నిగురించి ఎన్ని విధాలుగా, ఎన్ని స్వరాలలో మాట్లాడుతుందో అర్థమైంది. సమాజం చీలుదారుల్లో నిలబడిన రచయిత ఎన్ని విషయాలు చూడగలడో, వాటికి ఎంత లోతయిన భాష్యం ఇవ్వగలడో అర్థమైంది. ఒక నవల సాంఘిక చరిత్రగా మారి, అప్పటి అనేక భౌతిక,మానసిక స్థితిగతులకు ప్రతిఫలనం ఎలా అవుతుందో తెలిసివచ్చింది. అన్నింటికీ మించి- ఈ నవల ప్రధానంగా చర్చకిపెట్టిన అంశం:-మతం. ఇప్పుడు ముస్లిం భాషగా ముద్రపడిపోయిన ఉర్దూలో ఒక ముస్లిమేతరుడైన రచయిత ఇస్లాంనీ, నైజాం పాలనలోని ‘ఇస్లామీకరణ’నీ ఎట్లా అర్థం చేసుకున్నాడని వేరే చర్చ.

(ఆంధ్ర జ్యోతి సాహిత్య వేదిక, 2007)

గమనిక: ఈ రచయితకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నేను చూస్తున్నాను. ఎవరి దగ్గిర అయినా ఈ రచయిత ఇతర రచనలు గాని, ఏ చిన్నపాటి వివరం గానీ వుంటే అందించి సహకరించగలరు)

Thursday, January 27, 2011

ఉషా మాధవం...శాన్ అంటోనియో సంక్రాంతి సంబరం!








పోయిన వారం శాన్ ఆంటోనియో సంక్రాంతి సంబరాలకి వెళ్ళాం. మూడు గంటలకు పైగా జరిగిన ఈ సంబరాల్లో తెలుగు వాళ్ళు పాటలు పాడారు, నృత్యాలు చేశారు, తెలుగు దేశంలో సంక్రాంతి నిజంగా అంత బాగా చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ, శాన్ ఆంటోనియోలో వున్న ఆ మూడు గంటలూ తెలుగు దేశపు సంక్రాంతి శోభని తలచుకునేలా చేశారు. అన్నిటికి కంటే నాకు బాగా నచ్చింది – గోవిందరాజు మాధవ రావు గారిని శాన్ ఆంటోనియో తెలుగు వాళ్ళు సత్కరించడం! ఇది కూడా మాధవరావు గారికి తెలియకుండా ఒక “సర్ ప్రైజ్” లాగా చేశారు మూర్తి గారు. ఈ “సర్ ప్రైజ్” కోసం రెండు నెలలు ముందు మమ్మల్ని సిద్ధం చేశారు. మామూలుగా శాన్ ఆంటోనియో ఎప్పుడు వెళ్ళినా మాధవరావు గారి ఇంట్లో దిగే మేం, ఈ ‘సర్ ప్రైజ్’ లో భాగంగా మాగంటి ఉష (ప్రముఖ రచయిత మాగంటి కోటేశ్వర రావు గారి అమ్మాయి) ఇంట్లో దిగాం.

టెక్సాస్ లో తెలుగు వాళ్ళకి శాన్ ఆంటోనియో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు గోవింద రాజు మాధవరావు! టెక్సస్ లో ఎక్కడయినా ఏ తెలుగు వేడుకయినా, తెలుగు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమమయినా జరిగితే అక్కడ గోవిందరాజు మాధవ రావు గారి కుటుంబం వుండి తీరుతుంది. మాధవరావు గారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఉష గారు! వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరి పేరు మినహాయించినా అది అసంపూర్ణంగా వుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి చేసే సేవల్లో ఎవరికెంత వాటా దక్కాలి అన్నది అంత తేలికగా తేలే విషయం కాదు. కానీ, ఉష గారికి సింహ భాగం దక్కాలని నా వాదన అనుకోండి. (మేము శాన్ ఆంటోనియో వెళ్ళినప్పుడల్లా ఉష గారు మా కోసం దోసకాయ పచ్చడి వొక సీసాడు ఇస్తారన్న రహస్యం కూడా ఇందులో వుందనుకోండి. ఆ దోసకాయ పచ్చడి వేసుకుని తిన్నప్పుడల్లా మేము ఉష గారిని తప్పక తలచుకుంటాం కాబట్టి మాకు కొంచెం ఉష గారి పక్షపాతం. ఇక వాళ్ళిద్దరి కనుపాపలు సంజాత, స్వపంతి ఎక్కువ అమెరికాలోనే పెరిగినా అచ్చ తెలుగు ఆడపిల్లలు)

అమెరికాలో పేరుకి చాలా మంది తెలుగు సమాజ సేవకులు వున్నారు. కొంత మంది స్వయం ప్రకటిత కాగితప్పులులూ వున్నారు. వాళ్ళ సేవలు కాగితాలకే పరిమితం. అమెరికా తెలుగు సమాజం అంటూ పెద్ద కబుర్లు చెప్తారు, రాస్తారు, ఆంధ్రా వెళ్ళి వూదర కొట్టుకుంటారు. కానీ, చిన్న సాయం అందించడానికి చేయి ముందుకి రాదు. (అది ఎప్పుడూ ప్యాంటు జేబుల్లోనో, కోటు జేబుల్లోనో కూరుకు పోయి వుంటుంది). వీళ్ళు మహా అయితే, పదవుల కోసం పోటీ పడ్తారు. తెలుగు సంస్కృతికి తామే పదహారణాల ప్రతినిధులమని బోర్డులు పెట్టుకుంటారు. అలాంటి హంగూ ఆర్భాటం ఏమీ లేకుండా, ఒక చేత్తో చేసిన సాయం ఇంకో చేతికి కూడా తెలియకుండా సాయపడే వ్యక్తులు తక్కువ.

నిశ్శబ్దంగా తమ కృషి తాము చేసుకుంటూ వెళ్ళే మాధవరావు గారి కుటుంబం పెద్ద కబుర్లు చెప్పే కుటుంబం కాదు. తెల్లారి లేచి పేపర్ లో పేరు పడిందా లేదా అని వెతుక్కునే రకం కాదు. ఏ సంఘంలో తమకి ఎంత హోదా ఇచ్చారని లెక్కలు వేసుకునే వాళ్ళు కాదు. అక్కర వున్న వారికి వెంటనే నిస్సంకోచంగా సాయం అందించడం వొక్కటే వాళ్ళకి తెలుసు. మేం టెక్సాస్ వచ్చి మూడేళ్లే అయ్యింది. కానీ, ముప్పయ్యేళ్లుగా టెక్సాస్ లో వున్న తెలుగు వాళ్ళు ఈ విషయం ఇంకా బాగా చెప్పగలరు.

వరంగల్ దగ్గిర హనమ కొండ మాధవరావు గారి సొంతూరు. అక్కడ ఆర్. ఈ. సి. లో ఆయన చదువుకున్నారు, తరవాత విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటరులో పనిచేశారు. 1991 లో అమెరికాలో అడుగుపెట్టారు. ప్రవాస తెలుగు సంఘాలతో ఆయన అనుబంధం త్రివేండ్రం నించి మొదలయ్యింది. 1979 లో ఆయన త్రివేండ్రం సాంస్కృతిక సంఘానికి కార్యదర్శిగా వుండే వారు. శాన్ ఆంటోనియో వచ్చాక ఆయన టెక్సాస్ సాహిత్య సదస్సులలో పాల్గొనడం మొదలు పెట్టారు. మొదటి నించీ సాహిత్యం పట్ల వున్న అభిరుచి వల్ల సాహిత్య సదస్సులలో ఆయనకి క్రియాశీలక పాత్ర దక్కింది. టెక్సాస్ వచ్చిన తెలుగు రచయితలని ఎవరినయినా ఆయన మొదట శాన్ ఆంటోనియో తెలుగు వారికి పరిచయం చెయ్యడం మొదలు పెట్టారు. ఆ విధంగా స్థానికంగా సాహిత్య, భాషాభిమానాన్ని పెంచే కృషి శాన్ ఆంటోనియోలో మొదలయ్యింది. టెక్సాస్ యూనివర్సిటీ తెలుగు కమిటీలో ఆయన టాస్క్ ఫోర్స్ సభ్యుడు. అంతే కాదు, తెలుగు భాషలో బాగా ప్రతిభ కనబరచిన ఇద్దరు విద్యార్ధులకి టాసా (శాన్ ఆంటోనియో తెలుగు సంఘం) తరఫున ఏటా రెండు స్కాలర్షిప్పులు ఇప్పిస్తున్నారు. మొట్ట మొదటి సారి 2007 లో పెద్ద ఎత్తున తెలుగు నాటకోత్సవాలు కూడా నిర్వహించారు. ఒక తెలుగు వ్యక్తి గానే కాక, ఒక శాస్త్రవేత్తగా టెక్సాస్ లో ఆయన వివిధ శాస్త్ర సంఘాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

ఉష గారు మొదటి సరిగా శాన్ ఆంటోనియో లో తెలుగు బడి మొదలు పెట్టారు. మొదట కొద్ది మంది పిల్లలతో మొదలయిన తెలుగు బడిలో ఇప్పటి దాకా కొన్ని వందల మంది పిల్లలకి తెలుగు నేర్పారు. మొన్న సంక్రాంతి వేడుకలలో తెలుగు బడి పిల్లలు మంచి జోకులు చెప్పి, అందరినీ కడుపుబ్బ నవ్వించారు. తెలుగు పాటలు పాడి, తెలుగు నృత్యాలు చేసి కనువిందు/ వీనుల విందు చేశారు. (అసలు విందు కూడా చాలా బాగుందండోయ్! పూర్ణాలూ, చక్ర పొంగలి, పులిహోర, పెరుగు మిరపకాయలూ వగైరా నా ఫావరైట్)

శాన్ ఆంటోనియోలో గోవిందరాజు కుటుంబం నాటిన తెలుగు మొక్క ఇప్పుడు పెరిగి పెద్దదయింది. ఆ తరం నించి ఈ తరానికి ఈ స్ఫూర్తిని అందించడానికి ఉత్సాహం ఉరకలేసే పాటమళ్ళ మూర్తి గారు, నిత్యయవ్వనోత్సాహి అడివి వెంకటేష్ లాంటి వారు ముందుకు వస్తున్నారు. స్నేహం, సౌజన్యం, సమానవత్వం ముప్పేటగా కలిసి పోయిన మాధవిజాన్ని, మాధవ మానవ ధ్వజాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి ఈ తరం ముందుకు వస్తోంది. వారికి స్వాగతం. నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందంటారు, నోరే కాదు చెయ్యి, మనసు కూడా మంచిది కావాలి. అది నిరూపించుకున్నారు శాన్ ఆంటోనియో తెలుగు వాళ్ళు!

Thursday, January 20, 2011

నా టీనేజర్లు!




వున్నట్టుండి ఓ రోజున వాళ్ళు
వాళ్ళ గదుల్లోకి మాయమయి పోతారు.

తలుపులూ పెదాలూ మూతపడతాయి
ఇక ఇంట్లోనే
వొకరికొకళ్ళం అపరిచితులవుతాం.

బయట గదిలో పచార్లు చేస్తుంటా
వాళ్ళ గుసగుసలే వినిపిస్తాయి
ఆ రహస్య భాషేదో నాకు తెలుసు
కానీ ఇప్పుడేమీ గుర్తు లేదు

అదీ నేను నేర్పిన భాషే కదా!


కొన్నేళ్ల తరవాత తలుపు తెరుచుకుంటుంది
మళ్ళీ చూస్తాను ఆ ముఖాలని,
వొకప్పుడు నా అరచేతుల్లో దాచుకున్న ముఖాల్ని,
నా చేతుల్లో పొద్దు తిరుగుడు పూలయి విచ్చుకున్న ముఖాల్ని.


అవి నాకు పరిచితమయిన చర్మాలే!

కానీ
ఇప్పుడు నిటారుగా నిలబడిన దేహాలు
ముత్యాల్లా మెరుస్తూ
నన్ను దాటుకుంటూ వెళ్లిపోయే దేహాలు!





(మూలం: పాట్ మొరా - టెక్సాస్ ఎల్ ఫాసో లో పుట్టిన కవయిత్రి. కవిత్వం, స్మృతులుగా మెక్సికన్ అమెరికన్ స్త్రీల జీవితాన్ని రికార్డు చెయ్యడానికి మొరా ప్రయత్నిస్తోంది. పిల్లల కోసం ఎక్కువగా రాసింది. ఆమె జీవితం కేవలం కవిత్వానికి పరిమితం కాదు,కవిత్వం ఆమెకి వొక సాధనం మాత్రమే.)

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...