‘సాహిల్ వస్తాడు’ మనం చర్చించాల్సిన సందర్భం


                                   

                                                                   
  -  డా।। ఎ. రవీంద్రబాబు

                                                         

అఫ్సర్ కవి, కథకుడు. సమకాలీన సమూహంలో తనను తాను ఆవిష్కరించుకుంటూ సొంత డిక్షన్ తో బలమైన అస్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్న సృజనశీలుడు. కాలం పోకడల మధ్య అదృశ్య పొరలను గమనించి, గుర్తించి సాహిత్యాన్ని పదునెక్కిస్తున్న మార్మిక కళాతాత్వికుడు. గతానికి, వర్తమానికి మధ్య వారధిని నిర్మించే క్రమంలో మర్చిపోయిన మూలాలను పట్టుకొని ఆయువుపట్టులా పొదుగుతున్న సాహసికుడు. చరిత్ర వదిలేసిన వాటిలో, సొంత ముద్రలతో నిర్మించుకున్న చరిత్రలో దాగిన సత్యావిష్కరణల మీదుగా మాట్లాడతున్నాడు. సమకాలీనతల నుంచి గతం వైపు, గతం నుంచి భవిష్యత్తువైపు చూపు సారిస్తున్నాడు. సాహిత్య వ్యక్తిగా వ్యవస్తీకృతమైన సత్యాల్లోని నీడల్నీ ప్రశ్నిస్తున్నాడు. సాహిత్యం చేయాల్సిన పనిని నిబద్ధతగా, నిష్కర్షగా చేశాడు. చేస్తునే ఉన్నాడు.

అఫ్సర్ గత ఏడాది జనవరిలో తన కథల్లోంచి కొన్నింటిని సాహిల్ వస్తాడు మరికొన్ని కథలు పేరుతో వెలువరించాడు. సాహిల్ వస్తాడు కథా శీర్షికనే సంపుటికీ పెట్టాడు. అంటే ఈ కథ ఎంత ప్రాధాన్యత గలిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ కథా లోతుల్లోకి తొంగిచూస్తే.. మైనరిటీల అభద్రత, అస్తిత్వం, సమూహంలో ఏకాకితనం, రెండు మానసిక ప్రంపంచాల మధ్య ముస్లీంల మానసిక వేదన, కౌటుంబిక బంధాల్లోని ఆత్మీయత, వైయక్తిక సమ్మతమై, సమాజం సమ్మతం కానీ బాహ్య మానసిక జీవన నడవడిక, ఇస్లాంలోని స్వచ్ఛత... ఎన్నో అంశాలు రంగురంగుల రెక్కల్లా, బాధామయ శోకంలా దృశ్యాల్లా కదలాడతాయి. తనను తాను అపసవ్యదిశలోకి మార్చుకోని జీవన సౌందర్య స్వేచ్ఛాగానానికి, తితలీ(సీతాకోక చిలుక)లో దాగిన అమాయకత్వపు లేలేత నిజాయితీకి ఈ కథలోని సాహిల్ ఓ నిర్వచనంలా నిలుస్తాడు.   

   1980ల తర్వాత తెలుగు సమాజం తన సాహిత్య గతిని మార్చుకుంది. అస్తిత్వాలకు పురుడుపోసింది. తెలుగునేలపై చోటుచేసుకున్న అనేక సామాజిక సంఘటనలు, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు దారితీశాయి. ముఖ్యంగా 20వ శతాబ్ది చివరి దశాబ్దం.. సామూహికత్వంలోంచి చలనశీలమైన స్వీయ వ్యక్తీకరణలకు తావిచ్చింది. ప్రతి మనిషికి సంబంధించిన భావ, బౌద్ధిక సంఘర్షణలు, సంవేదనలు, సంలీనతలు.. అన్నీ చారిత్రక, సామాజిక, సాంఘిక, ఆర్థిక నేపథ్యంతో ముడిపినవేనని రుజువుచేశాయి. ఏకరూపత నుంచి భిన్నత్వ భావనాలోకాల్లోకి సమాజం వెళ్లిపోయింది.

అగ్రరాజ్య ఆధిపత్యం, చమరుకై పోటీలు, ఉగ్రవాద ముద్రలు.. జీవన పార్శ్వాలకు, సున్నితమైన అంశాలకు సైతం మతం పులమటం, మైనరిటీ అంటూ అభద్రతలోకి నెట్టివేయటం, బాబ్రీ మసీదు విధ్వంసం, తర్వాత చెలరేగిన అల్లర్లు, గుజరాత్ సంఘటన, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి, దాని పర్యవసానాలు...  ఈ క్రమంలో ముస్లింల జీవితాల్లో చోటుచేసుకున్న అభద్రత, అస్తిత్వం, బతుకులు, సడలుతున్న ఆత్మవిశ్వాసం, వీటి నుంచి ఉద్భవించే ప్రశ్నలు.. ఎన్నింటినో సాక్ష్యాలుగా మైనారిటీ వాదం చూపిస్తుంది. సంఘర్షణ, దాని తాలూకూ రాజీ, మింగుడుపడని వాస్తవాలు, ధ్వంసం మవుతున్న బాహ్య, అంతర్ మైనరీటీ జీవితాలను కవిత్వం, కథ, నవలలుగా తీసుకొచ్చింది ఈ వాదం. తమదైన టోన్ ను వినిపించే ప్రయత్నం చేశారు ఎందరో ముస్లిం సృజనకారులు. ఆత్మన్యూనత నుంచి అస్తిత్వ పెనుగులాట వరకు, కన్నీళ్ల నుంచి పోరాటం వరకు సాగిన, సాగుతున్న మైనారిటీవాద సాహిత్యంలో ఎన్నో మలుపులు, మెరుపులు ఉన్నాయి. ఈ క్రమంలో అఫ్సర్ రాసిన సాహిల్ వస్తాడు కథా స్థానాన్ని, నేపథ్యాన్ని, వస్తువును, పాత్రల అభూతులను, ఆవేదనలను, సామాజిక సందర్భాన్ని, కథా రీతిని గమనిస్తే...

సాహిల్ వస్తాడుకథా శీర్షికలోనే సాహిల్ కనిపించడంలేదన్న భావన వ్యక్తమవుతుంది. మరి సాహిల్ ఎక్కడకు వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? అసలు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? సాహిల్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరు? వాళ్లు సాహిల్ కోసం ఎలా ఎదురు చూశారు? సాహిల్ ను వెతకడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు? సాహిల్ కనిపించకుంటే అతడికి సంబంధించిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంది?... కథా శీర్షికే ఇలాంటి ఎన్నో ప్రశ్నలను సంధిస్తుంది. ప్రతి ప్రశ్న వెనుక దాగిన జవాబుకోసం మనల్ని కథలోకి లాక్కుపోతుంది.

రాము దృష్టికోణంతో నడిచే ఈ కథ కలతో, కలత నిద్రతో మొదలవుతుంది. చార్మినార్ చుట్టూ జరిగిన అల్లర్ల అలికిడి, తెగినకలలో సీతాకోక చిలుక గుంపుల శవాలు.. వాటి అలికిడితో మొదలవుతుంది. ఆ స్థలంతో అతడి ఇద్దరు స్నేహితులు ఫణి, సాహిల్ కు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ముందుకు సాగుతుంది. వాళ్ల ముగ్గురు అక్కడ టీలు తాగుతారు. కబుర్లు చెప్పుకుంటారు. చాయ్ బిస్కెట్ తోపాటు, సాహిల్ గజళ్లు వాళ్ల మధ్య తితల్లా ఎగురుతూ మనసులకు రంగులు అద్దుతుంది.

ప్రేమంటే ఏమిటో తెలుసుగాని అందాల నా చెలికి నా ఇల్లే తెలియదు.

దేవుడి పేరు వింటే విన్నదేమో కాని ఆమెకి అతని జాడే తెలియదు.

మరీ పరధ్యానంగా వున్నానేమో, యవ్వనపువనం ఎప్పుడొచ్చి ఎటు వెళ్లిందో తెలియదు.

వసంతం వాకిట నిల్చుందని తెలుసుకానీ, ఆకురాలుకాలమని తెలియదు.ఇలాంటి పాటలు సాహిల్ సమక్షంలో సంగీత సాహిత్యాల పోటీలా ఉంటాయి. సాహిల్ అద్భుతమైన పాటగాడు. స్వచ్ఛమైన పదాలతో అతనే పాటగా మారిన వ్యక్తి.

రాము కూతురుకు తితలీ అని పేరుపెట్టింది కూడా అతనే. ఈ చిన్నీకి రెక్కలు లేవనే కాని, సీతాకోక పాపలా పుడితే అది ఇలాగే ఉంటుందిరా అని ఎనిమిదేళ్ల పాపను ముద్దుచేయగల అమాయకుడు. తితలీ మామూ అంటూ అతనితో ఆత్మీయంగా ఆడుకుంటుంది. కబుర్లు చెప్తుంది. తితలీ దగ్గరకు వస్తే తప్ప అతనికి ఆత్మశాంతి ఉండదు”.     

రాముకు సాహిల్ తో పరిచయం చదువుకునే రోజుల నుంచి ఉంది. అతడి ఆత్మాభిమానం, మంచితనం, నిజాయితీ.. అన్నీ తెలుసు. తను హసీనాను ప్రేమిస్తూ, కలలో నిద్రలో చేస్తున్న పనులు బాగాలేవు అని స్నేహితుడితో చెప్పిన వ్యక్తి. ఏదయినా వొక విషయం దాస్తే రాత్రంతా నిద్రపట్టని మనిషి. తప్పు చేస్తున్నానన్న భావం ఇస్లాం దృష్టిలో అలాగే వుండనివ్వదు అని నమ్మి, ప్రేమించిన హసీనాను పెళ్లి చేసుకున్న నిజమైన ఇస్లాం. అంతేకాదు, ధర్మ బద్ధం కానిపని ఏదీ నేను చేయలేను. అది కేవలం నాశరీరానికి మాత్రమే పరిమితమయ్యే విషయం అయినప్పటికీ అన్న ఫిలాసఫర్. భార్య హసీనా, కొడుకు ఫైజ్, స్నేహితులు ఫణి, రాము మాత్రమే అతడికి తెలిసిన ఆత్మీయ ప్రపంచం. అలాంటి సాహిల్ హటాత్తుగా కనిపించకుండా పోతాడు.     

     దాని వెనుక మత మౌఢ్యంతో చార్మినార్ చుట్టూ జరిగిన అల్లర్లు, శవాల చప్పుళ్లు. ముస్లింలపై జరిగిన దాడులు.. అనేకం. ముస్లింలను అనుమానించడం, అవమానించడం, అరెస్టులు చేయడం, తద్వారా వాళ్ల కుటుంబాలను అభద్రతాభావంలోకి, సంఘర్షణలోకి నెట్టివేయడం లాంటివి ఎన్నో.. అలాంటి నేపథ్యంలోంచే సాహిల్ కనిపించకుండా పోవడాన్ని చూడాలి. ఆ సామాజిక, రాజకీయ, మత పరిస్థితుల నుంచి సమాజం అతడిని చూసే దృష్టికోణాన్ని చెప్పాడు అఫ్సర్. అతడి గురించి అన్నీ తెలిసిన ఆత్మీయ స్నేహితుడు నోరు విప్పలేని నిస్సహాయత, అతడి కుటుంబానికి భరోసా ఇవ్వలేని బాధ, కూతురుతో ఆ విషయాన్ని ఎలా షేర్ చేసుకోవాలో తెలియని మౌనం... ఇవన్నీ కథలో కనిపిస్తాయి. సాహిల్ ను రెండు ప్రపంచాలుగా చూసే సర్కిల్ కు, తన భార్యకు ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్తే పర్యవసానం ఏంటి అనే బాధ రామును భయపెడుతుంది. పోలీస్ స్టేషన్ లో జరిగే సంఘటనలో...

సాహిల్ కనిపించడం లేదని అతని భార్య, రాము, ఫణి వెళ్తే.. ముస్లింతో స్నేహం చట్ట విరుద్దమైనట్లు చూస్తాడు సర్కిల్. వొక్క విషయం చెప్పాలి. అతను ముస్లిం, మీరు హిందువులు. అతనిది ముస్లిం మైండ్! ముస్లింమైండ్ అంటే వయిలెంట్. అంత తేలిక కాదు అర్థం చేసుకోవడం – అది వొక మిస్టరీ! మీకు తెలియని లైఫ్ అతనికి చాలా వుండి వుంటుంది. ఇన్ని బాంబు బ్లాస్టులు, బస్సులు తగలబెట్టడాలూ, చావులూ, హత్యల తర్వాత కూడా మీకీ విషయం అర్థంకాకపోతే మీరు వొట్టి అమాయకులైనా అయి వుండాలి. లేకపోతే, తెలియని మాయలో ఇరుక్కొని వుండాలి.అంటాడు. అది రామును బరించలేనింతగా బాధపెడుతుంది. వాళ్ల స్నేహంమీద నమ్మకాన్నే ప్రశ్నిస్తుంది. రెండుకుంటంబాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న తెగని బంధాన్ని, ఆత్మీయతని ప్రశ్నిస్తుంది. నమ్మకంతో అర్థరాత్రి తన ఇంటికి వచ్చిన సాహిల్ భార్య హసీనా నమ్మకాన్నీ ప్రశ్నిస్తుంది.

ముస్లిం వ్యక్తులను అలాంటి సందర్భంలో సమాజం చూసే విధానం, వాళ్లను అంచనా వేసే ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో చెప్పే సంఘటన అది. వ్యక్తిని మతం కోణంలో, అప్పటి వరకు జరిగన అల్లర్లతో ముడిపెట్టి మంచితనాన్ని, హృదయసౌకుమార్యాన్ని కర్కశంగా.. వాళ్లకై వాళ్లు తమదైన దృష్టితో చూడడం ఎంత దుర్మార్గమో చెప్తుంది. మతం అనేది మనిషిని, వ్యక్తిత్వాన్ని, చర్యలను అర్థం చేసుకునే దిక్సూచిలా మారిన వైనానికి నిదర్శనం ఈ సంఘటన. అంతేకాదు సాహిల్ గురించి, అతని వ్యక్తిత్వం, నిజాయితీ, దృక్పథం, మంచితనం, ఆదర్శాల గురించి తెలిసిన రాము ఏమీ చెప్పలేక పోవడం, చెప్పలేని పరిస్థితి దాపురించడం ఎంత దయనీయమో చెప్పే సఘంటన. ముస్లిం వ్యక్తైన సాహిల్ కే కాదు, రాములోని మూలాలని, మానవీయమైన వాళ్ల స్నేహబంధాల్ని, నోరు విప్పలేని నిస్సహాయ స్థితిని ప్రశ్నించే సంఘటన.  

హిందువైన రాముకే రక్తం ఉడికిపోతా ఉంటే.. సాహిల్ భార్య హసీనాకు- హసీనాకు ఎప్పుడూ గుర్తుంటుంది కదా? అంటే. ఆ ముస్లిం అన్న లేబుల్ కింద పడాల్సిన అవమానాలు, అనుమానాలూ అన్నీ ఈ పాటికి అనుభవించే వుంటుంది! కాదంటావా? అని ఫణి ప్రశ్నిస్తాడు. దానికి రాము దగ్గర సమాధానం ఉండదు. అంటే నిజమనే అర్థమన్నమాట.

          పొద్దున ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి సాయంత్రం సజావుగా వస్తాడో రాడో తెలియని ఈ నగరపు బతుకులో- మతం అనేది చివరికి కలహకారణంగానే మిలిగిపోయిన ఈ రోజువారీ హింసలో.. ఆందోళన తట్టుకోలేక తప్పనిసరిగా పోలీస్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.  

మతం మనుషుల మధ్య ఎలాంటి చిచ్చు రేపుతుందో, హింసతో ప్రాణాలు ఎలా తీస్తుందో తెలిపే వాక్యాలివి.

పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటననే రాము పిడుగు పడినట్లు భావిస్తుంటే.. నమ్మకమైన స్నేహంలోని పొరలు ఒక్కొక్కటి విప్పుతూ ఆత్మీయ మిత్రుడి స్వచ్ఛమైన హృదయాన్ని, వయిలెంట్ మైండ్ గా చూస్తుంటే.. తట్టుకోలేకుంటే ... భార్య-

మీరేమీ అనుకోనంటే వొక మాట అడగనా? ఆ పోలీసు స్టేషన్లో మీరు విన్నది నిజమేనేమో! మనకు తెలియని యాంగిల్ సాహిల్ లో ఇంకోటి ఉందేమో అంటుంది. ఆ మాటలు అతడిని మరింత బాధపెడతాయి. ఆ మాటలు సాహిల్ లోని మరో కోణాన్ని కాదు, అది వారి స్నేహాన్ని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది. సాహిల్ ది అలాంటి వ్యక్తిత్వం కాదని బల్లగుద్ది చెప్పగల మనసును నిలదీస్తుంది. అప్పటి వరకు సాహిల్ ను ఒక మంచి మిత్రుడిలా చూసిన తన భార్య నీరు అతడిని ముస్లింలా చూడటాన్ని, మతంతో ముడిపెట్టి అతడి వ్యక్తిత్వాన్ని. చర్యలను అంచనా వేయడాన్ని తట్టుకోలేదు.

నువ్వెవరికీ ఏమీ సమాధానం చెప్పలేవు. ఇప్పుడంతా సాహిల్ ని ముస్లిం అనే చూస్తారు. కాని మనిషి మిస్ అయ్యాడని అనుకోరు అలా వుంది ఇప్పుడు పరిస్థితి అన్న మూడో మిత్రుడు ఫణి మాటలు గుర్తొస్తాయి. రచయిత కూతురు తితలీ సాహిల్ మామూ వస్తాడు. తనతో ఆడుకుంటాడు అన్న ఆశతో కథ ముగుస్తుంది.

కథలో సాహిల్ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చెప్పి, కేవలం ముస్లిం మతస్తుడైనందున అతడిని సమాజం చూస్తున్న కోణాన్ని చిత్రించాడు అఫ్సర్. సాహిల్ ను అనుమానించడానికి పాతబస్తీ అల్లర్లు, వాటి వల్ల హైదరాబాద్ లో నెలకొన్ని పరిస్థితిని నేపథ్యంగా ఎంచుకున్నాడు. ముస్లింలలో ఉన్న మంచితనాన్ని కూడా మతంతో ముడిపెట్టి, ముస్లింల అందర్నీ వయిలెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్లలా చూసే వాళ్ల మైండ్ సెట్టే వయిలెంట్ అని తెలియజేశాడు. ఒక మనిషికి మరో రంగు పులిమి, వాళ్ల కోణంలో చూసే విధానం ఎలా ఉంటుందో, అందుకు మతం కారణమైతే ఎలా ఉంటుందో కూడా కథలో చూపాడు. అప్పటివరకు మనతో కలిసి, మనతో ఉన్న వ్యక్తిని సైతం నమ్మలేని దయనీయ పరిస్థితిని నీరు మాటల ద్వారా వ్యక్తీకరింపజేశాడు అఫ్సర్.

సాహిల్ వస్తాడా, రాడా, ఎక్కడికి వెళ్లాడు? రాకపోతే భార్య హసీనా, కొడుకు ఫైజ్ పరిస్థితి ఏంటి? సాహిల్ ను ఉగ్రవాదిగా చూస్తున్న సమాజం వాళ్లను ఎలా ట్రీట్ చేస్తుంది? సమాజం ముస్లింలను మంచిగా చూడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? వ్యక్తికి, మతానికి ఉన్న సంబంధం వ్యక్తిత్వాన్ని ఎందుకు నిర్ణయిస్తుంది? మనిషిని మనిషిగా చూడలేని దుస్థితి వెనకున్న కారణాలేంటి? సాహిల్ గురించి బల్లగుద్ది చెప్పగల రాము నోరు విప్పితే పరిస్థితి ఏ విధంగా ఉండేది? నీరు ఆలోచన మారడం వెనుక ఎవరి ప్రభావం ఉంది? పసిపాప తితలీకి రాము సాహిల్ మామ గురించి అర్థమయ్యేలా ఏం చెప్పగలడు? వంటి ఎన్నో ప్రశ్నలు కథ ముగిసినా పాఠకుల మదిలో అలానే నిలిచిపోతాయి. వెంటాడతాయి. వేటాడతాయి. ఒక నిజాయితీగల ముస్లిం వ్యక్తిని, పైగా కనిపించకుండా పోయిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని.. మతంతో ముడిపెట్టి సమాజం చూసే దృక్కోణం, బాధ్యతగల పోలీసుల ఆలోచనాతీరు... దానివల్ల వాళ్లు ఎదుర్కొనే కష్టాలు, కన్నీళ్లే ఈ కథ.



                                  ---------------------    














0 comments:

Web Statistics