'గాయాల మాల' గుడిహాళం...

పునరపి జననమేమో గానీమరణం మాత్రం ఖాయం –

ఈ వాక్యం రాసిన మూడేళ్ళకే‌ గుడిహాళం మరణ వార్త వినాల్సి వస్తుందని తెలీదు.

కానీ, తనకి ఈ వార్త ముందే తెలిసినట్టుంది. తన మరణాన్ని ముందే దర్శించాడు కనుకనే వొక తెగింపుతో, చావో రేవో అన్న కసితో విసవిసా వెళ్లిపోయాడా రఘు?!

ఇవాళ ఇద్దరు మిత్రుల నోటి వెంట ఈ మరణ వార్త విన్నాక ఏం మాట్లాడాలో తెలీక గుడిహాళం రాసిన కొన్ని కవితల్ని నెమరేసుకుంటూ వుండిపోయాను. “ఒక జననం ఒక మరణం” అనే కవిత మేం “అనేక” కోసం అతని దగ్గిర నించి తీసుకున్నాం. ఆ కవిత మరణం గురించే, అంతకంటే ఎక్కువగా జననం గురించి! అంతకంటే మరీ ఎక్కువగా అది గుడిహాళం రాసుకున్న ఆత్మ కవిత.

గుడిహాళం యుద్ధ కవి.

యుద్ధాలు లేని కాలంలో యుద్ధ కవులు వుంటారా అని తెలుగు దేశపు ఆకుపచ్చ నిర్గుణ కవి పుంగవులు/ నపుంసక విమర్శక శిఖామణులు ఎవరేనా అడగవచ్చు.

ఈ నిర్గుణ అనే మాట గుడిహాళందే! రాజకీయాలు పట్టని ఆకుపచ్చ కవిగాళ్ల గురించి గుడిహాళం ఎప్పుడూ “వాళ్ళు నిర్గుణులేవోయ్” అనే వాడు నిస్సంకోచంగా.

ఉగ్రులమై
ఆగ్రహంతో వణకాలి, వణికించాలి

అన్న గుడిహాళం వాక్యం విన్న వెంటనే ఈ నిర్గుణ కవివిమర్శకులకి జ్వరం పట్టుకుంటుంది. అందులో పదచిత్రాలూ, ప్రతీకలూ, మెటఫర్లూ లేవు లేవని పొర్లి పొర్లి ఏడుస్తారు తాయిలం చిక్కని పసి కాయల్లా.

కవులు పద సౌందర్యానికి బానిసలై పోయిన కాలం లో బాధనీ, ఆగ్రహాన్నీ, నిరసననీ, నిరాశనీ తీవ్ర వాక్యంగా మలచి సావధానమయిన తుపాకిలా గురిపెట్టిన వాడు గుడిహాళం.

మొదటి సారి గుడిహాళం పేరు ఎక్కడ విన్నానో ఎప్పుడు విన్నానో గుర్తు లేదు. ఎన్ని సార్లు అతన్ని కలిశానో కూడా సరిగా లెక్క చెప్పలేను. అజంతానీ అకాడెమీ వేదిక ఎక్కించిన వాడు గుడిహాళమే. సాహిత్య అకాడెమీ, తెలుగు అకాడెమీ కలిసి ఏర్పాటు చేసిన “కవి సంధ్య”లో అజంతాతో పాటు కవిత్వం చదవడం వొక తీయని జ్నాపకం. ఆ రెండు రోజుల్లో రెండు సార్లు నన్ను వేదిక ఎక్కించాడు గుడిహాళం. మొదటి సభ పోస్ట్ మోడ్రనిజమ్ మీద - ఆ సందర్భంగా దాదాపు వొత్తిడి పెట్టి మరీ నాతో ప్రసంగం ఇప్పించడమే కాకుండా, ఆ ప్రసంగం రాతలో పెట్టేంత వరకూ రంపాన పెట్టాడు మొండి వాడు గుడిహాళం.



గుడిహాళం ముఖ్యంగా బుద్ధిజీవి. అతని కవిత్వం అతని నిగూఢమయిన ఆలోచనలకి కప్పిన ఉద్వేగభరితమయిన దుప్పటి. అతని వాక్యాల నీడలో అనేక రకాల ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటాయి. అందుకే అతను కవిత్వం చదివాక/ లేదా అతని కవిత మనం చదివాక – ఒక ఆలోచనలో నిమగ్నం అవుతాం.

గుడిహాళం సామూహిక జీవి కూడా – అతని కవిత్వం వొంటరీతనపు లోతయిన నిట్టూర్పు లో మొలిచినట్టుగా వుంటుంది. కానీ, ఆ వొంటరి తనం కింద మన విఫలమయిన సామూహికత కనిపిస్తుంది. అందుకే అతని కవిత చదివాక 2000 తరవాత మన లోలోపలే నిమజ్జనమవుతున్న నినాదాల తుంపులు వినిపిస్తాయ్.

ఇప్పుడు – అందుకే – అతని మాటలు అతనికే వినిపిస్తూ..

ఆ బాధ లోంచి మరో బాధకు నడుస్తూండగానే
ఓ కల తరలి పోయింది
ఓ మెరుపు కరిగిపోయింది
ఎక్కడో రెక్క తెగింది
ఎప్పుడో ఏదో స్వరం బతుకు నించి తప్పుకుంది.
Category: 6 comments

డైరీలో హ్యూస్టన్ కి వొక పేజీ!





హ్యూస్టన్ లో సాహిత్య సభకి మూడు నెలల క్రితం మాట తీసుకున్నారు రాచకొండ శాయి గారు.

విపరీతమయిన రాత పనుల వొత్తిడి వల్లా, కాన్ఫరెన్సుల హడావుడి వల్లా, ఈ ఏడాది యూనివర్సిటీ లో రెండు కొత్త కోర్సులు - వొకటి భారతీయ కవిత్వం మీద - చెప్పాల్సి రావడం వల్లా ఇటీవలి కాలంలో ఏ వూరికీ, ఏ సభకీ ఎవరికీ మాట ఇవ్వడం లేదు. కానీ, టెంపుల్ సాహిత్య సదస్సులో శాయి గారు గీతాంజలి మీద చేసిన చక్కటి ప్రసంగపు మత్తులో వుండడం వల్ల, ఆ రోజు ఆయన అడగడమూ, సరే అనేయడం చాలా యాంత్రికంగా జరిగిపోయాయి.

ఆ తరవాత శాయి గారు మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నప్పుడు నిజంగానే చాలా పనుల్లో కూరుకుపోయి, ఇక హ్యూస్టన్ ప్రయాణం వల్ల కాదులే అనుకున్నాం. అలా వెళ్లకుండా వుంటే చాలా మిస్ అయ్యే వాళ్ళమని ఇప్పుడు నిస్సంకొంచంగానే అంటున్నా.
అనుకోని కారణాల వల్ల దారి తప్పి, మూడు గంటల కారు ప్రయాణానికి నాలుగు గంటలు చేసి హ్యూస్టన్ చేరే సరికి, సాయి బాబా మందిరం ఇంకా ప్రశాంతంగానే వుంది. నాలుగయిదు తెలుగు కుటుంబాలే అక్కడున్నాయి. వాళ్ళు కూడా ఏ పూజాకో, ఆరతికో వచ్చి వుంటారులే అనుకున్నాం. కానీ, చూస్తూండగానే ఆ పెద్ద హాలు నిండిపోయింది. వందకి పైగా తెలుగు కుటుంబాలు వొక్క చోట చేరాయి. "నెల నెలా వెన్నెల" మొదలయింది శాయి గారి స్వాగతంతో.




మామూలుగా కాన్ఫరెన్సులలో పవర్ పాయింట్ చేయడం నాకు అలవాటే కానీ, మొట్ట మొదటి సారిగా ఒక సాహిత్య సభలో పవర్ పాయింట్ చేశాను. అలా చెయ్యడం వల్ల ఉపన్యాసం ఆద్యంతం వొక పద్ధతిగా సాగిందని అనిపించింది. మామూలుగా నా ఇతర ప్రసంగాలు విన్న వాళ్ళు కూడా ఇది భిన్నంగా, వివరంగా పూసగుచ్చినట్టుగా, ఆసక్తిగా వుందన్నారు. "ఈ కాలంలో తెలుగు" ఎన్ని ముఖాలుగా విస్తరిస్తుందో, ప్రపంచీకరణ తరవాత తెలుగు సాహిత్యం, సంస్కృతి, భాష అనే మూడు అంశాల చుట్టూ మాట్లాడాను. అన్ని చోట్ల మాదిరిగానే ఈ సభకి వచ్చిన వాళ్ళు కూడా బ్లాగులు, అంతర్జాల పత్రికల మీద చాలా ఆసక్తి చూపించారు. పొద్దు, కౌముది, ఈమాట లాంటి వెబ్ పత్రికలూ, ఆముక్తమాల్యద, తెలుగు పద్యం, నా లోకం, సాహిత్య అభిమాని, కొత్త పాళీ లాంటి బ్లాగుల వివరాలను చాలా మంది అడిగి తీసుకున్నారు. అడిగి తెలుసుకున్నారు.

శ్రీపాద కథల్లో తెలుగుదనం గురించి కల్పన మాట్లాడింది. చానెళ్ల తెలుగు మీద జోకులు గుప్పించారు చిట్టెన్ రాజు గారు.




సభ తరవాత తెలుగు పిల్లలు పాడిన పద్యాలూ, పాటలూ, చేసిన ప్రసంగాలూ నాకు పెద్ద ఆకర్షణ. తెలుగు భాష బతికే వుంటుందన్న గొప్ప భరోసా ఆ పిల్లల తెలుగు పలుకుల్లో ప్రతిధ్వనించింది.



అన్నిటికంటే నాకు బాగా నచ్చిన సంగతి ఇంకోటి వుంది...సాధారణంగా అమెరికాలో తెలుగు సాహిత్య సభల్లో కొత్త తరం కనిపించదు, కొత్త తరం అంటే ఇక్కడ పుట్టి పెరిగిన మన తెలుగు టీనేజర్లు. హ్యూస్టన్ లో ఈ సారి వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళంతా తెలుగు టీనేజర్లు. ఆరుగంటల పాటు సాగిన కార్యక్రమంలో వాళ్ళ ఉత్సాహం ఉరకలు వేసింది.

సరే, సభానంతర సంగతులు ఇంకా అనేకం వున్నాయి. కొత్త సాహిత్య మిత్రులతో కబుర్లు, తెలుగు బడి నిర్వహిస్తున్న ఉపాధ్యాయులతో మాటా మంతీ, శాయి/లలితా/వరుణ్ / రాఘవేంద్ర గారి కుటుంబ సభ్యుల ఆతిధ్యమూ, పూర్వ విద్యార్థులతో కబుర్లు, నా చిన్ననాటి మిత్రుడు రాముతో వొక రోజంతా కబుర్లూ, ఎన్నాళ్ళకో కలిసిన కల్పన బంధువులతో వొక పూట కాలక్షేపమూ...సాహిత్యంతో పెరిగే సాన్నిహిత్యం గొప్ప అనుభూతులు!
Category: 6 comments

చలి గురించి మూడు ముక్కలు




చలిగాలుల చివర వొక ఎండ తునక
ఎదురొచ్చింది కప్పుకోనా అని!
తనివి తీరా కప్పుకున్నాను.



వొళ్ళు వణికిందీ అంటే
సూర్యుడి రెక్క
వొక పక్కకి వాలిపోయినట్టే.

శరీరం రహస్యం
తెలిసిపోయిందేమో గాలికి,
కూడా కాసిని చినుకులు ఈడూ జోడు.


నాలుగు గోడల్ని వెచ్చబెట్టుకునే రాత్రి
అతను గుర్తొస్తాడు
ముసలి చర్మాన్ని మాత్రమే కప్పుకున్న ఆ వీధి చివర.


వెచ్చని గదుల కవిత్వపు కలవరింతలు
కాసేపు కట్టిపెట్టు
తాత్వికుడు ఎప్పుడో అలసిపోయాడు!


పైవొంటిని కోసే ఈ చలి గాలిని దాటాక
అప్పుడు మాట్లాడు
కవిత్వాన్ని గురించి!

*
Category: 4 comments

కొన్ని తలపోతలు..


(తల్లి వొడిలో చిన్నారి బార్త్)


ఈ మధ్య నన్ను బాగా కదిలించిన పుస్తకం రోలాండ్ బార్త్ "మౌర్నింగ్ డైరీస్" 1977 అక్టోబరు 25 న అతని తల్లి చనిపోయింది. ఈ లోకంలో తనకి "నా" అన్న వొకే వొక్క మనిషి పోయింది. ఆ విషాదంలో బార్త్ రాసుకున్న డైరీ ఇది. అందులో వాక్యాలు కొన్ని అయినా తెలుగు చేద్దామని ఈ విఫల ప్రయత్నం.



అక్టోబర్ 27
-"నీకు స్త్రీ దేహం అంటూ తెలుసా?"
-తెలుసు. వొకే వొక్క స్త్రీ దేహం...అమ్మ దేహం...జబ్బు పడి, చనిపోతూ...


నవంబరు 4
సాయంత్రం ఆరు గంటలు
గది వెచ్చగా దీపకాంతిలో ఆహ్లాదంగా

నేనే పట్టుబట్టి
గదిని అలా మార్చాను (వొక చేదు ఆహ్లాదం)

ఓ, ఇక నించి నేనే నాకు అమ్మని!


నవంబరు 11
ఏకాకితనం అంటే
"బయటికి వెళ్తున్నాను.
ఫలానా టైమ్ కి మళ్ళీ వస్తాను.
లేకపోతే ఫోన్ చేస్తాను"

ఇంటికి వస్తూనే
"వచ్చేశాను.."

అని చెప్పడానికి
ఎవరూ లేకపోవడం!

నవంబరు 26

మరణానంతర విషాదం
మరీ దారుణం
తెగదూ
ముడిపడదూ

జనవరి 16

నా లోకం
బల్లపరుపు

యేమీ వినిపించదు
ప్రతిధ్వనించదు
గడ్డకట్టదు
కరగదు.


మార్చి 22

ఉద్వేగం తగ్గిపోతుంది
బాధ మిగిలిపోతుంది.
Category: 5 comments

సారంగ బుక్స్ తొలి కానుక!



పదేళ్ళ కవిత్వం “అనేక”సారంగ బుక్స్ తొలి కానుక త్వరలో!!


తెలుగు కవిత్వం ఈ పదేళ్ళలో తిరిగిన మలుపులు, దాటుకొచ్చిన చౌరాస్తాలూ, చేరుకున్న అనేక మజిలీలూ...అన్నీ సాక్షాత్కరించే నిలువెత్తు అద్దం “అనేక”. అఫ్సర్, వంశీ కృష్ణల సంపాదకత్వంలో...మీ ముందుకు...!

అక్షరం అనుభవంగా, అనుభవం అలజడిగా, అలజడి ఆందోళనగా మారిన నడుస్తున్న చరిత్రకి కదిలించే పదచిత్రాల డైరీ “అనేక”.

తెలుగు ప్రచురణ రంగంలో ఒకింత వేకువ, రవంత కదలిక, కాసింత స్వచ్చమయిన సాహిత్య పరిమళం లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న “సారంగ బుక్స్” తొలి కానుక “అనేక”.

తెలుగులో మంచి వచనం, మంచి కవిత్వం ఎక్కడ వున్న అది పాఠకుడి మనఃఫలకం మీద బలంగా ముద్రించాలన్న ఆశా, ఆకాంక్షలే “సారంగ”. ఆ దారిలో మొదటి అడుగు “అనేక”

మీలోని చదువరికి మేలుకొలుపు సారంగ
మీ ఆలోచనలూ అనుభవాల పొద్దు పొడుపు సారంగ.

సారంగ బుక్స్ ప్రచురణల వివరాలకు సంప్రదించండి:

www.saarangabooks.com

(ఈ వెబ్సైట్ ఇంకా తయారీలో వుంది...కొంచెం ఓపిక పట్టండి..)

400 పేజీలుదాదాపు 200 మంది కవులూ, కవితల కలయిక అనేక వెల: 199/-




అనేక ప్రతుల కోసం సంప్రదించండి:


Palapitta Books
Flat No: 3, MIG -II
Block-6, A.P.H.B.
Baghlingampally,
Hyderabad-500 044 AP India
Direct: 040-27678430
Mobile Phone: 984 878 7284

Email: palapittabooks@gmail.com
Category: 2 comments

హ్యూస్టన్ లో ఈ నెల వెన్నెల

ఇవాళ హ్యూస్టన్ లో నెల నెలా వెన్నెల!



TCA Telugu Contests 2010 &
Nela Nela Telugu Vennela
(నెల నెల తెలుగు వెన్నెల)
కార్యక్రమ వివరాలు
18-Dec-2010, 12.00 noon to 6.00 pm

Venue (విడిది): Shiridi Sai Jalaram Mandir
(13845 W Bellfort St., Sugar Land, TX 77498)

12.00 noon to 12.45 pm: Registration for various contests
1.00 pm to 2.30 pm: Contests for Reading, Writing, and Vocabulary for Levels 1, 2, and 3
1.30 pm to 3.00 pm: Nela Nela Telugu Vennela

Chief Guest: Sri Afsar

Afsar is a well accomplished poet and a great contributor to Telugu literature. His recent work includes a collection of Telugu poems called ‘వూరి చివర’. He is currently working as a lecturer for the Department of Asian Studies. He teaches courses in Telugu language, South Asian literature, and South Asian religions. Prof Afsar also writes regularly in his blog.

Other Speakers: Smt. Kalpana Rentala

Smt. Kalpana is an accomplished and well known writer. She her contributions to the literary world are far and wide. She writes regularly in her blog.

Sri Chittenraju Vanguri
Sri Chittenraju is a famous writer well known for his sensible humor. He has several books to his credit. He is a publisher and a philanthropist. His services to the world of Telugu literature are invaluable.

3.30 pm to 4.30 pm: Poem Recitation contest

4.30 pm to 5.30 pm Speech contest

5.30 pm to 6.00 pm Distribution of participant certificates and trophies
Category: 0 comments

"అన్నీ ప్రశ్నలే.." అన్న అలజడి పెరగాలి!

మిగిలిన భాషల్లో వచన సాహిత్యం బాగా వస్తోంది. మిగిలిన సాహిత్య ప్రక్రియల కన్నా, ఇప్పటికీ మన వచన కవిత్వం బలంగా వుంది. అందులో అనుమానం లేదు. కానీ, వచనం బలపడనంత కాలం మన సాహిత్యానికి వెలుగు లేదు. సాహిత్యం పరిణతి సాధించాలంటే వచన ప్రక్రియలు బాగు పడాలి. అన్నిటికీ సమాధానాలు దొరికిపోయాయన్న తృప్తీతో మనం ఆగిపోతున్నాం. “అన్నీ ప్రశ్నలే మాకు…అన్నీ ప్రశ్నలే మాకు.” అన్న అలజడి పెరగాలి. అప్పుడు వెతుకులాట మొదలవుతుంది. 50లలో , 70లలో రచయితల్లో ఆ వెతుకులాట వుండేది. ఆ కాలంలో వచ్చినంత వచనం తెలుగులో మరెప్పుడూ రాలేదు. ఇప్పుడు అంత వచనం లేదు. అనువాదాలు పెరిగితే మనం ఎక్కడున్నామో, ఎటు వెళ్ళాలో తెలుస్తుంది. అస్తిత్వ చైతన్యం గురించి మన ఆలోచనలు ఇంకా సూటిగా వుండాలి. ఇప్పటికీ శుద్ధ మానవతా వాదం, శుద్ధ కవిత్వం గురించి మాట్లాడే వాళ్ళని చూస్తే జాలేస్తోంది. ప్రపంచ సాహిత్యం ఎంతో కొంత చదివే తెలుగు వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడడం అన్యాయం.

ఇక తెలుగులో వున్నవీ, ఇతర భాషల్లో లేనివి….అంటారా? అది చెప్పడం అంత తేలిక కాదు. ఆ భాషల గురించి నాకు వున్న పరిచయం సరిపోదు. కానీ, literary activism అనేది తెలుగులో ఎక్కువ అనుకుంటాను. శతక కవులూ, గురజాడ నించీ ఇది వున్నా, ఇటీవల స్త్రీ, దళిత, ముస్లిం వాదాల వల్ల ఎక్కువ సాధ్యమయింది. సాహిత్యానికీ, బయటి జీవితానికీ, ఉద్యమాలకూ మనం ఇస్తున్న ప్రాధాన్యం మనల్ని కొంత భిన్నంగా నిలబెడుతుంది.

(మిగతా "పొద్దు" లో చదవండి)
Category: 0 comments

నిజంగా మరణం




ఆకలో
వుప్పెనో
ఆగిన గుండె చప్పుళ్ళో
కాదు మరణమంటే.


ఒక మాట నిలువునా చీలిన చోట
ఒక దృశ్యం నిర్లిప్తంగా నిష్క్రమించిన చోట
ఒక మనిషి నిశ్శబ్దంలోకి వెలివేయబడిన చోట
నిజంగా మరణం.


హత్యలో
ఆత్మహత్యలో
భ్రూణహత్యలో
కాదు మరణమంటే.

వెంట వచ్చిన విశ్వాసం నిర్దాక్షిణ్యంగా
హృదయాన్ని కొరికి పుండు చేసినప్పుడూ

ఒక గాయాన్ని గుండెకి గులాబీగా గుచ్చి
ఒక పరిచిత హస్తం
మృత్యుఖడ్గంగా రూపెత్తిన ప్పుడూ

నిజంగా మరణం.

("ఇవాళ" 1990 నించి)
Category: 7 comments

మన నలిమెల దారి...!



నలిమెల భాస్కర్ అంటే నాలుగు భాషల కలయిక. అనేక భాషా సాహిత్యాల వంతెన. తెలుగు సాహిత్యంలో అతనొక ఆశ్చర్యం. తెలుగు సాహిత్యమే సరిగా చదవలేని కాలం దాపురించినప్పుడు, కష్టపడి అనేక భాషలు నేర్చుకొని, వాటి సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసే సత్సంకల్పంతో నాలుగు దశాబ్దాలుగా భాస్కర్ చేసిన కృషి అసాధారణమయింది. ఈ వారం హైదరబాద్ లో ఆయన నాలుగు పదుల సాహిత్య కృషికి సత్కారం జరుగుతోంది. ఈ సందర్భంగా అయినా, భాస్కర్ చేసిన కృషి గురించి సరయిన చర్చ జరగాలని నా కోరిక. భాస్కర్ లాంటి అనేక భాషా సాహిత్యాల అభిరుచి వున్న వారు ఇంకా కొంత మంది తయారయితే అది తెలుగు సాహిత్యానికి బలం! నలిమెలని అభినందిద్దాం. ఆయన దారిని కొన్ని అడుగులు వేద్దాం.
Category: 3 comments

కవిత్వ భాష గురించి ....!

వంశీ:

మీ ప్రశ్నలు బాగున్నాయి, ఎప్పటిలానే చాలా హాస్యస్ఫోరకంగా వున్నాయి. మీ వాక్యం ఢమరుకం అని నేనే ఎక్కడో అన్నాను కదా. సరదాగా/ సీరియస్ గా చదువుకొని ఆనందిస్తున్న/ ఆలోచిస్తున్న సమయంలొ వర్మ గారు "వాటికి సమాధానం ఇవ్వరా? " అని నిలదీశారు.

వాటన్నిటికి సమాధానం ఇచ్చే శక్తిగాని యుక్తిగానీ నాకు వున్నాయని అనుకోను. కాని, వొక ముఖ్యమయిన విషయం మీ ప్రశ్నల్లో వుంది. కవిత్వం చదవడం కచ్చితంగా భిన్నమయిన అనుభవం. ఈ కవిత 1996లో మొదటి సారి "ఇండియా టుడే" సాహిత్య వార్షికలో అచ్చయింది. తరవాత అనేక సంకలనాల్లో చేరింది. కనీసం ఇద్దరు దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. ఒక అనువాదం ఇండియన్ లిటరేచర్ ఆంగ్ల పత్రికలొ అచ్చయింది. మరో అనువాదం నా.సి. (కొత్త పాళీ) గారి బ్లాగులో ఆయనే చేసారు. ఇక్కడ దీన్ని పవర్ఫుల్ కవిత అని వ్యాఖ్యానించిన వారు కూడా ఆయనే. ఇప్పటి వరకూ చాలా మంది విమర్శకులు ఈ కవితని ఉల్లేఖిస్తూ రాసారు.

వారెవ్వరూ ఇంత ఆసక్తి కరమయిన ప్రశ్నలు అడగలేదు. రెండు భాషలతో వ్యవహరించవలసిన అనువాదకులు కూడా మీ మాదిరి అర్ధ సంక్షోభంలో పడలేదు.

సాధారణ భాషకీ, సాహిత్య భాషకీ మధ్య ఉన్న వ్యత్యాసం మీకు చెప్పేంత వాణ్ని కాదు. కాని, సాధారణ భాషని వాడుకుంటూనే, ఆ భాషనీ అసాధారణమయిన ఎత్తులకి తీసుకు వెళ్ళడం కవిత్వం చేసే పని అనుకుంటా. ఉదాహరణకి: ఉమ్మ నీరుని ఉమ్మి చేయ్యోద్దంటాను అన్నప్పుడు ఉమ్మ నీరులో ఏమేం ఉంటాయో ఒక శాస్త్రవేత్తగా చెప్పడం వేరు. ఉమ్మ నీరుకి అమ్మతనానికీ మధ్య ఉన్న ఉద్వేగపూరితమయిన ముడిని చెప్పడానికి శాస్త్రవేత్త భాష పనికి రాదు. అందులో పుట్టుకకి సంబంధించిన వేదన కూడా వుంది. ఆ వేదన, ఉద్వేగం ఎంతో కొంత అర్ధం అయ్యింది కాబట్టే, సౌమ్య వెంటనే " ఆర్ద్రంగా వుంది, కళ్ళు చెమర్చాయి" అని రాయగలిగారు అనుకుంటా -- వడ్రంగి పిట్ట కూడా "కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి" అన్నారు. కవిత "పవర్ఫుల్" గా వుంది అని కొత్త పాళీ అనడానికి కూడా ఎంతో కొంత ఈ ఉద్వేగమే కారణం అనుకుంటా.

అంత మంది అలా అన్నప్పుడు వారి స్పందనలోని నిజాయితీని అనుమానించ లేం.. కదా! కాబట్టి ఈ కవితలో సాధారణమయిన మాటలే ఏదో ఒక అసాధారణమయిన శక్తిని చూపిస్తున్నాయి. అదే కవిత్వీకరణ అనుకుందాం. మనలో గొప్ప భాషా శాస్త్రవేత్త కాని, శాస్త్రవేత్త కాని భాషని ఒక స్థాయి దాకా అందుకోగలరు. భాషని అత్యంత తర్కబద్దంగా ఉపయోగించగలరు. కాని, కవిత్వంలో వుండే వ్యాకరణం అర్ధం కావడానికి ఆ ఇద్దరికీ వుండే తర్కం మాత్రమె సరిపోదు. ఉద్వేగాన్ని తర్కించ లేమని బుచ్చి బాబు ఎక్కడో అంటాడు. మరి కవిత్వ భాష బ్రహ్మ పదార్థమా? కాకపోవచ్చు. కొందరి విషయంలో అవునూ అవవచ్చు.

కవిత్వ భాష భిన్నమయింది మాత్రం అనగలను. ఈ భాషని ఇక్షు రసంగా మార్చే వారు కొందరు, నారికేళ పాకం చేసే వారు కొందరు, పాషాణ పాకం చేసే వారు మరికొందరు. కానీ, ఈ కవితలో పాషాణ పాకం లేదని కూడా చెప్పగలను, ఎందుకంటే, కొంత మందికి ఇది అర్ధమయి, స్పందించే అవకాశం కూడా ఇచ్చింది కాబట్టి.


మీ ప్రశ్నలకి సమాధానం ఇంకా వెతకాలి నేను. ఆ వెతుకులాటకి ప్రారంభం ఈ కవిత్వ/ శాస్త్ర వ్యాకరణ వైరుధ్యం, భిన్నత్వం వొక ప్రారంభం మాత్రమే. కాని, ఈ కవితని ఇంకా చక్కగా, అర్ధ వంతంగా వివరించగల/వ్యాఖ్యానించ గల సమర్ధులు వున్నారనే నమ్మకంతో, వారి అభిప్రాయాల్ని సైతం ఆహ్వానిద్దాం.

నాకే జన్మభూమీ లేదు!




శూన్యం తల కింద
నేనేదో వొక అవయవాన్ని.

నేనెక్కణ్ణించి పుట్టానో
ఎలా పెరిగానో
'47 దగ్గిరే ఎలా విరిగానో

మీరెవరూ చెప్పలేదుగా -


దేవుడి అంగాంగాన్ని పంచుకొని కోసుకోనీ
లేదంటే దోచుకోనీ వెళ్ళిన మీరంతా
నాకేమీ మిగల్చలేదుగా -


నేను శరీరం లేని నీడని
ఏ గోడ మీంచో రహస్యంగా
పారేయబడిన ఆత్మని -

దేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు.

ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలని
కుంకుమ చేతులు కోసుకెళ్ళిపోయాయి.

అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడ్తున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది.

రెప్పల వస్త్రాలు కళ్ళకి కప్పి
నా వొంటి మీది చల్లని మాంసాన్ని
ఎవరెవరో అపహరిస్తున్నారు.
నా వొళ్ళు వొక అల్ కబీర్!


నాకు నేనే గుర్తు తెలియని శవాన్నయి
బొంబాయీ నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను.

నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలీదు.


నిజంగా నేను శూన్యలోక వాసిని
ఎక్కడయినా ఎప్పుడయినా ప్రవాసిని.

నాలో సాగాన్ని చీకట్లో ముంచి
ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని.

నా లోపలి వలయాల్లో నేనే దూకి
కాలం ఆత్మని క్షణ క్షణం హత్య చేస్తున్న వాణ్ని.

అర్ధ రాజ్యాలూ అంగ రాజ్యాలూ కోరను
నా నాడుల్ని నాకు కోసిమ్మనడానికి
ఏ భాషా లేని వాణ్ని.

శవమయి దాక్కోడానికి వున్నా లేకపోయినా
తల దాచుకోవడానికి చారెడు నేల చాలంటాను.

ఉన్న చోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని
ఎక్కడెక్కడో ఆంటీ ముట్టని బట్టలా విసిరేయొద్దంటాను.

నలభై ఏడుతో కాదు
నాతో నన్నే భాగించ మంటాను.
నా నవ్వులూ నా ఏడ్పులూ
నా అవమానాలూ, నా అనుమానాలూ
నా మాన భంగాలూ హత్యలూ
అన్నీ మీవి కూడా అంటాను.

నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.


విభజించి పాలించే నా శత్రువులారా,

నన్నెవరూ రెండుగా చీల్చలేరు.
నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు.

1996

(ఒక డిసెంబరు ఆరు కి రాసిన కవిత...)

Dasu Krishnamoorty responds to debate on editors

I believe editing is a subjective art that shuns definition. But essentially it is gate keeping. Before a story gains admission it has to get past two gates: the editor and the publisher. When a publisher chooses an editor he sets the guidelines. The editor/publisher is only exercising his right to free expression when he accepts/rejects a story. Both of them in the end go by a gut feeling of what the reader accepts or rejects. The goal of selection is salability. The selection process is subjective as is evident from the different criteria employed by different publishing houses. Just as a newspaper reporter concedes the right of the copy editor to spike or change his copy, the writer has to respect the right of the editor/publisher because they absorb the losses from poor sales.

Editors at publishing houses have guidelines laid down by the publisher. The publisher sets them on the basis of feedback he gets from the reader. Both in newspapers and book industry it is ultimately the reader who is the king. The preferences of the reader change from time to time and from region to region. It is enough if the editor is aware of these changes and knows what the readers want. Readability is the main criterion and determining it is a subjective process. For example, even if the editor finds Lajja of Taslima Nasreen a great work, he may not recommend it for fear of hostile reaction. The editor failed to us it for reasons other than merit. I think the debate has its roots in writers’ conceit.

I will cite our experience as editors/translators of an anthology we had recently published to bolster my views.

We run a web magazine that publishes two/three short stories every month. We have a number of Telugu anthologies with us from which we, as readers, choose some stories. Over a period we published around 75 stories in the magazine. It occurred to us that publishing an anthology would be a good idea to celebrate the hundredth birthday of the Telugu short story. From the 75 stories we chose 22 and sent them to three publishers. Two of them agreed to publish. Since Rupa and Co. was the first to approve our collection we sent the manuscripts to Rupa, prepared to abide by the verdict of their editors. They approved all the stories submitted and made no changes that deserved to be called a change.
Before submitting the stories we edited them besides translating them. We deleted repetitive passages, deleted excessive schmaltz, slashed padding and removed clichéd phrases like nadaka laanti parugu. Coming to additions, we added descriptive details and setting where we thought it was necessary. In one story there was childbirth. We employed medical jargon and also described the room and the things found in such a room at delivery time. A client visits a lawyer. We described the lawyer’s office, the glass-fronted shelves containing All India Law Reporter volumes, a framed picture of Venkateswara Swami or Satya Saibaba. In many stories we found that participants in a dialogue did nothing but talk. First, they are talking on a road, or a railway station or in a house. The place has to be described and the interruptions in the dialogue. We did these things and sent the edited stories to the writers for approval.
I somehow think that the debate on criteria for editors originated in rejections. No writer has a right to insist that his story be accepted or when accepted should not be changed. One of the two short story icons of the later half of twentieth century Raymond Carver had his stories nearly rewritten by Gordon Lish at Knopf. Editors at leading publishing houses reject hundreds of works and suggest drastic changes on acceptance. Rupa has accepted our work. Now it is for the readers to accept it. We will not complain if the readers reject it. About our selection Katha Naveen had reservations. We admit he has a right to do that. Since I do not know what set off the debate on editing, I presume it is a grapes are sour story.

Dasu Krishnamoorty

రాజకీయాలూ..సాహిత్యం గురించి!

సాహిత్యం పోను పోనూ నిర్దిష్టం అయ్యి తీరాలని అనుకుంటాను. సాధారణీకరణ అన్నది ఎంత తగ్గితే అంత మంచిది. ఈ నిర్దిష్టత మానవ సంబంధాల గురించి కావచ్చు, స్థల కాలాల గురించి కూడా కావచ్చు. ఈ మౌలికమయిన పునాది మీదనే కొత్త సాహిత్యాన్ని అర్థం చేసుకోగలమని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు సాహిత్యం గురించి వున్న అనేక అపోహలూ, అపార్థాలూ కేవలం ఈ నిర్దిష్ట తాత్వికత అర్థం కాకపోవడం వల్లనే అనుకుంటున్నాను. అయితే, ఏది సాహిత్యం అవుతుంది ఏది కాదు అన్న సునిశిత అవగాహన రచయితలకి వుండి తీరాలి. ఉదాహరణకి తెలంగాణ సాహిత్యం తీసుకుంటే, రాజకీయాలలో కె సి యార్ చెప్పింది వేదం అయినా నష్టం లేదు కానీ, సృజనాత్మక రచయిత కూడా అదే వేదం అనుకుంటే ప్రమాదం. రచయితలు రాజకీయాలు మాట్లాడాలి కానీ, రాజకీయ ఎత్తుగడల వలలో చిక్కు పడకూడదు అనుకుంటా. రచయిత రాజకీయాలు మాట్లాడుతూనే తన స్వేచ్చని కూడా కాపాడుకోగలిగితేనే రచనా సమగ్రత నిలుస్తుంది. వట్టికోట , దాశరథి, కవిరాజమూర్తి లాంటి రచయితలు ఆ సమగ్రతని కాపాడుకోగలిగారు కాబట్టే వాళ్ళ రచనలు ఉద్యమాలు చల్లారినా వేడిగా వున్నాయి. ఈ విషయంలో నాకు ఉర్దూ అభ్యుదయ రచయితలూ కవులూ ఆదర్శంగా కనిపిస్తారు. తెలంగాణ తనకి వున్న ఉర్దూ బంధుత్వం నించి నేర్చుకోవాల్సింది ఇదే.


(మిగిలిన భాగం "పొద్దు"లో...http://www.poddu.net/?q=node/775)
Category: 1 comments

ఎడిటర్లకి కావాల్సిందేమిటి?: మాగంటి వంశీ

క్లుప్తం అని బంధాలేస్తే ఎలా చచ్చేది? సరే నాలుగైనా, నలభై ఐనా క్ఌప్తం నాకు లుప్తమే కాబట్టి..ఈ నలభై ముక్కలు....

ఆనాటి సంపాదకత్వం - సాహితీ సేవకొక పీఠం
ఈనాటి సంపాదకత్వం - సంపాదనకొక మార్గం

సంకలనమో, సంగ్రహమో ఏదైనా సరే - ఈనాటి సంకలన సంపాదకులకు కావలసినదేమిటి? డబ్బు పోగెయ్యటం, తల ఎగరెయ్యటం, పోట్లు పొడవటం

అందరూ ఊరుకుంటారా? - ఎవడన్నా తిరిగి పొడిస్తే రాజీకి రావటం.

పాతవారు సరే, చరిత్రలోకెక్కిపోయారు వారి ప్రతిభతో మఱి ఇటీవలి కాలం వారు? అమెరికాలోనో, యూరపులోనో ఉండటం - వారి స్వంత డబ్బులు దాచుకోవటం. పఱుల డబ్బులు దొబ్బటం, తందనాలాడటం, ఆంధ్ర దేశంలో రియల్ ఎస్టేటు కొనుక్కోవటం. మాట వినకపోతేనూ, ఎదురు చెపుతేనో మీద పడి రక్కటం, దుష్ప్రచారాలు చెయ్యటం. పాఠక హక్కుల హననం చెయ్యటం.సాహిత్యానికి సమాధి కట్టటం.? ఎలా? అలాగే!
......
.............
................................
....................................................


మరి ఈ చర్చలో పాల్గొనటానికి అర్హతలేమిటీ? డబ్బుల కోసం పీడింపబడ్డవారు, సంకలనాలు చదివి గుండెపోటు వచ్చిన వారు, సంకలన సంపాదక నటరాజ తాండవ నర్తనానికి బలి అయిపోయిన తాడిత జనాభా వారు, వారి కులకంపుకు కళ్లు బైర్లు కమ్మినవారు.....ఇలా బోల్డంతమంది అభాగ్యులు, నిర్భాగ్యులు, కండలు పీక్కుతినే అఘోరా సాధువులు - వీరందరూ అర్హతలున్నవారే!

మరి ఎడిటర్లకు కావల్సిందేమిటి ? – పరిశీలనా శక్తి, నైశిత్యం సాహిత్య పైత్యం, రస ప్రకోపం. వ్యుత్పత్తి, అభ్యాసం, తప్పులు దిద్దటంలో అపారమైన పరిణితి. నిజమైన సాహితీ సేవ చెయ్యాలన్న నిర్దిష్ట తపన. వివిధ మనస్తత్త్వాలు కల సాహితీవేత్తల మధ్య అభిప్రాయభేదాలు తొలగించగల నైపుణ్యం. తత్కాల, దీర్ఘకాల స్వప్రయోజనాల దృష్ట్యా ఒక వర్గానికి కొమ్ము కాయకపోవటం.చుట్టఱికం, దగ్గరగా కూర్చుని చుట్ట కాల్చడం వల్లే వచ్చిందన్న దాన్ని నమ్మకపోవడం. అలా చుట్టలు కాల్చేవాళ్లని దగ్గరికి రానివ్వకపోవటం.సాధికారంగా, వివరణాత్మకంగా లోపాలు ఎత్తి చూపించగలగటం. రచయిత ఒప్పుకోకపోతే ఆ రచనని ఎత్తి చెల్లికి మళ్లీ పెళ్లి కాయితాల సహవాస భాగ్యం కల్పించటం.మంచి కథలు దొరకకపోతే ఆ సంకలనం మానుకోవటం.మంచివి దొరికినప్పుడే సంకలిద్దాం అని లోపలా బయటా ఆశావాదిగా ఉండగలగటం.సంకలన ప్రచురణ వల్ల వచ్చే ఉపయోగంలో సద్వినియోగ శాతం గుర్తించగలగటం.ఆ ఉపయోగాన్నీ, సద్వినియోగాన్నీ మరు సంకలనానికి మెట్టుగా ఎలా వాడుకోవాలో తెలియటం.సంకలనానికొచ్చిన కథల్లో ఈనెలన్నీ తీసి తమలపాకే మిగలకుండ ఉండే పని చెయ్యకపోవటం.డబ్బు, పేరు, ప్రతిష్ట అనే మానసిక వ్యాధికి దూరంగా ఉండగలగటం.ప్రచురణ డబ్బుల కోసం అదేపనిగా ప్రజలని ఈమెయిళ్లతో పీడించకపోవటం.ఈమెయిళ్లకు జవాబివ్వకపోతే ఫోన్లు చేసి మరీ అడుక్కోకపోవడం.

మఱి పీడిత జనాభానో? పీడిత పాఠకులలో రెండు రకాలు - బలహీనులు, బలవంతులు.బలహీనులు ఏరకంగా ? బలవంతులు ఏ రకంగా? విద్య, సాహిత్య పరిచయం - - ఇవే బలాలు, అవి లేకపోతే బలహీనాలు.

బలహీన పాఠకుడికి మిగిలేదేమిటి? - నెత్తికి చేతులు, గుడ్లలో నీఱు, గుండెకు దడ, చేతికి చముఱు. బలవంతుడు ఈ మోత నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీడికి కొద్దిగా బుఱ్ఱ ఉన్నది కాబట్టిన్నూ, విద్యతో పాటుగా అవసరమైతే మర్మభేదం, దండోపాయం, మాటల ఈటెలు, ఎకసెక్కాలు ఉపయోగించన్నా తప్పించుకోగల నేర్పు ఉండబట్టిన్నూ. బలహీనుడికి ఆ అవకాశం మృగ్యం. చలికాలంలో అర్ధరాత్రి బట్టల్లేకుండా బయటకెళ్లి పళ్లు టకటకలాడుతున్నా శబ్దం బయటికి రాదుగా!

మఱి రచయితలూ నిరసన ప్రకటిస్తూనే ఉన్నారుగా? వాడి కథ ఆ సంకలనానికెక్కలేదని ఒహడి బాధైతే, ఇంకోడిది ఎక్కిందన్న బాధతో ఒహడు, ఆ సంకలనం చేసినవాడి కులం నాది కాదు కాబట్టి రాళ్లు విసిరి దుగ్ధ తీర్చుకుందామన్న కుతితో ఒహడు...

మఱి అప్పటిదాకా నిద్రపోతున్న సంఘాలు? కుంభకర్ణుడు ఉంటేనేం, చస్తేనేం? ఎవడికి ఉపయోగం? ఒక్క ఆ రావణాసురిడికి తప్ప - మధ్య మధ్యలో లేవటం, అరవటం, మెక్కటం, మళ్లీ పడుకోటం . తెలంగాణోళ్ల సంఘమైతేనేమి, ఆంధ్రోళ్ల సంఘమైతేనేమి? అన్నీ ఆ తీరే!

అవకాశం దొరికితే అవతలివాడిని ఎక్కుదామని చూసేవాళ్లు ఎలా పోతే మనకేంటి? మఱి నువ్వు ఇప్పుడు చేసిన పని అదేగా అంటున్నారు జనాలు! అవును! ఆ అవకాశం ఇచ్చిన అఫ్సర్ గారికి బోల్డు ధన్యవాదాలతో!

అర్థం పర్థం లేకుండా, వందల సంఘాలున్నాయి, వేలాది రచయితలున్నారు - ఊపునివ్వాలి, విరగపొడవాలి అంటూ బాకా ఊదుకుంటూ తిరక్కపోతే గత నాలుగైదు దశాబ్దాలుగా చెయ్యని, చెయ్యలేని పని - సందు దొరికింది కదాని ఊరకే మొఱిగే బదులు బుద్ధి తెచ్చుకుని కాపలా కాస్తే ఇంకో యాభై ఏళ్లకైనా తమ ప్రాంత రచయితలకు మేలు చేసినవారవుతారు, సాహితీ సేద్యాన్ని నిలబెట్టినవారవుతారు.

రాజీకి రాకుండా మాకు నచ్చినవాళ్లవే వేసుకుంటాం,మాకు నచ్చినవాడే రచయిత, వాడి రచనే రచన, వాడి కథే కథ అని ఈ ఆంధ్ర సంఘం వాళ్లు అనటానికి దమ్ములూ లేవు...చేసిన తప్పు తెలుసుగా! కుక్కిన పేనన్నా నయం! బీరాలు పోవటం, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించటం, నచ్చనివాడిని వెలివెయ్యటం మానుకుని అసలు మొదలెట్టినప్పటినుంచి అందరినీ కలుపుకుని, అన్ని ప్రాంతాల వారికి సమాన ప్రాతినిధ్యమిచ్చుంటే పోయేది. ఆ పనీ చెయ్యలా, పోనీ మా సంకలనాలు మా ప్రాంతం వాళ్లకి మటుకే అని ఓ డిస్క్లెయిమరూ పెట్టలా ! ఇప్పుడు ఆకులు పట్టుకుంటే మిగిలేది ఏమిటి? పానకం బిందె!

ఇహ ఇంతటితో ఆపుతున్నా - రాండి మీద పడండి.....రాండి...కాచుకుని కూర్చున్నా !

మాగంటి వంశీ
Category: 2 comments

సంకలనం ఎడిటర్లకి అర్హతలు వుండాలా?! : చర్చకి ఆహ్వానం

"సింగిడి" కరపత్రం ఒక ముఖ్యమయిన విషయాన్ని చర్చకి తీసుకు వచ్చింది. ఈ ప్రకటన బ్లాగులో పెట్టినప్పుడు నా వుద్దేశం కేవలం కథ చుట్టూ జరుగుతున్న రాజకీయాలని చర్చించడమే. సింగిడి తెలంగాణ రచయితల సంఘం వారు లేవనెత్తిన ప్రశ్నలు నిజానికి చాలా వివాదాస్పదమయినవి. చర్చించదగినవి. కథలో ప్రాంతీయ రాజకీయాలు ఎలా పనిచేస్తాయన్నది వొక ముఖ్య విషయం అయితే, అసలు కథల ఎంపికలో ప్రాంతీయ రాజకీయాలు ఎలా పని చేస్తాయన్నది ఇందులో ప్రధాన చర్చ. నవీన్, శివశంకర్ ల "కథ" సంకలనాలు ఒక ట్రెండ్ని సృష్టించాయి. ఇవి ఎంత బలమయిన ముద్ర వేసాయో నేను నా విమర్శ పుస్తకం "కథ-స్థానికత" లో వివరంగానే చర్చించాను.

కానీ, తరవాతి కాలంలో "కథ" సంకలనాలు వాటి గౌరవాన్ని కోల్పోయాయని చెప్పక తప్పదు. వివిధ ప్రాంతాల రచయితలే కాకుండా, అసలు ఏ ప్రాంతానికీ చెందని రచయితలు కూడా కొంత కాలంగా కథ సంకలనాల మీద ఏదో వొక రకంగా నిరసన ప్రకటిస్తూనే వున్నారు, ఆ సంపాదకుల కథల ఎంపికని ప్రశ్నిస్తూనే వున్నారు.

సింగిడి లేవనెత్తిన ప్రశ్న ముఖ్యంగా అదే.

సింగిడి కరపత్రం మీద "అక్షరం"లో జరుగుతున్న చర్చలో చాలా మంది ఇతర అభిప్రాయాలు చెబుతున్నారు. ఇక్కడ వేరే ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి.


సంకలనం సంపాదకులకు కనీస అర్హతలు కొన్ని వుండాలన్నది ఇక్కడ చాలా మంది తమ వ్యాఖ్యల్లో వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయం రావడంలో తప్పేమీ లేదు. తెలుగులో సంకలనాలకి గొప్ప సాంప్రదాయం వుంది. చరిత్ర వుంది. కథ సంకలనాలు తీసుకువచ్చిన వారంతా మౌలికంగా రచయితలు, విమర్శ రంగంలో కృషి చేసిన వారు. ఇటీవలి కాలంలో ఈ సంప్రదాయం పోతోంది. ఎవరయినా సంపాదకుడు/ ఎడిటర్ కావచ్చు అన్న అభిప్రాయం వ్యాపిస్తోంది.


ఈ విషయం మీద చర్చ మొదలెట్టాలని చాలా మంది అడుగుతున్నారు. ఇటీవలి కాలంలో సంకలనాల బెడద కూడా ఎక్కువయిపోయిందని కొందరు ఇతర బ్లాగ్మిత్రులు రుద్ర తాండవం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాగంటి వంశీ లేవనెత్తిన ప్రశ్నలు కూడా చర్చించ దగినవి. ఈ చర్చలు సాహిత్య/ సాహిత్యేతర అంశాలని కూడా ప్రస్తావిస్తున్నాయి.

ఇప్పుడు ఒకే ఒక సూటి ప్రశ్న ఏమిటంటే:

సంకలనం ఎడిటర్లకి అర్హతలు వుండాలా? వుండాలి అనుకుంటే ఆ అర్హతలు ఏమిటి?

మీ జవాబులు క్లుప్తంగా రాయండి.


ఇక, ఈ వ్యాఖ్యలలో కొందరికి నా సమాధానాలు:


@నర్సింహ మూర్తి గారు;

ఎలా వున్నారు?

మీరన్నది నిజమే. కొంచెం వేడి వుంటే నష్టం ఏమీ లేదు. కానీ, ఇప్పటి దాకా కనీసం ఇరవై వ్యాఖ్యలు - అసభ్యత, అనాగరికం - అనుకున్నవి తీసేయ్యాల్సి వచ్చింది.

చాలా మంది ఒకే ఒక వాక్యంలో జిందాబాద్, వర్ధిల్లాలి, ముర్దాబాద్ అన్నట్టు రాస్తున్నారు. తెలుగు సాహిత్యంలో ఈ ఏక వాక్య విమర్శ విధానం పోవాలని నేను కోరుకుంటున్నా.

పైగా, ఇక్కడ నేను చర్చించాలనుకున్న విషయం వేరు. ప్రతిస్పందనలు వేరుగా వున్నాయి. వీటిని ఎలా అర్ధం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. వ్యక్తుల మీద ఇంత బలమయిన ఇష్టానిష్టాలు వుంటాయా అని ఆశ్చర్యంగా వుంది.

తెలంగాణలో ఏం జరుగుతోంది?

"తెలుగు" సాహిత్యానికి సంబంధించి తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతోందన్నది చాలా అవసరమయిన ప్రశ్న. "సింగిడి" తెలంగాణ రచయితల సంఘం కరపత్రం వివాదం ఇంకా సాగుతూ వుండగానే, తెలంగాణా రచయితలు మరో అడుగు ముందుకు వేస్తున్నారు, జాయింట్ యాక్షన్ కమిటీ కింద కార్యాచరణకి సిద్ధం అవుతున్నారు.





"కథతో ఒక రోజు" కరపత్రం తరవాత ...ఏం జరిగింది?

ఆంధ్రా 'కథతో ఒకరోజు' ఆంధ్రాలో పెట్టుకోండి! -కరపత్రం విడుదలయ్యాక మరునాడు సభ అనంగా, వాసిరెడ్డి నవీన్‌ 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం బాధ్యులైన డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ లకు, తెలంగాణ రచయితల జెఎసి కన్వీనర్‌ పరవస్తు లోకేశ్వర్‌కు వేరువేరుగా ఫోన్లు చేసి తాను తెలంగాణకు మద్దతుగా ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేయడం జరిగిందని, రేపు మీటింగ్‌ సజావుగా జరగడానికి సహకరించమని, అందుకు ఇంకా ఏమి చేయాలని అడిగారు. మరి ఇప్పటివరకు తెలంగాణ రచయితలకు జరిగిన నష్టం ఎలా పూడుతుందని అడిగాము. 14మంది వక్తల్లో కేవలం ఇద్దరినే తెలంగాణవారిని పెట్టడం గురించీ అడిగాము. మీటింగ్‌ తర్వాత అన్నీ మాట్లాడుకుందామని నవీన్‌ అన్నారు. సరే, సింగిడి సభ్యులము మాట్లాడుకొని చెబుతామన్నాము. తర్వాత సంగిశెట్టి శ్రీనివాస్‌ నాలుగు విషయాలు నవీన్‌కు చెప్పడం జరిగింది. 1.సభలో తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తీర్మానం చేయాలి. 2. కరపత్రంలో 'సింగిడి' లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలి. 3. కరపత్రాలు సభా ప్రాంగణంలో పంచుకుంటాము. 4. మీటింగ్‌ తర్వాత కలిసి 20 ఏళ్లుగా తెలంగాణ రచయితలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి. -వీటన్నింటికీ వాసిరెడ్డి నవీన్‌ ఒప్పుకున్నారు.
ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో- 'సింగిడి' వారు కోరినట్లుగా తెలంగాణ ఉద్యమానికి ఎటువంటి అరమరికలు లేకుండా మద్దతు తెలియజేస్తున్నామని, కథల ఎంపికకు సంబంధించి, సంకలనాల లోటుపాట్ల గురించి సాహిత్య చర్చల ద్వారా నిర్ణయించుకోవచ్చునని -నవీన్‌ అన్నారు.
మీటింగ్‌ రోజు ఆరేడుగురు సింగిడి సభ్యులు వెళ్లి కరపత్రాలు పంచి వచ్చేశారు. సింగిడి సభ్యులు అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి దాదాపు 20 మంది పోలీసులు అక్కడికి చేరుకుని సభకు రక్షణగా నిలుచున్నారు. ముగ్గురు నలుగురు తప్ప తెలంగాణ రచయితలంతా సభను బాయ్‌కాట్‌ చేశారు. రాలేదు. ఆశించినంతమంది సభకు రాలేదని, 150కి పైగా సాహిత్యకారులు వస్తారనుకుని నిర్వాహకులు భోజనాలు చెప్పారని, కేవలం 50 మందే వచ్చిఉంటారని, చివరి సెషన్‌ మరీ వెలవెలా పోయిందని తెలిసింది.
తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అన్న విషయమే వాసిరెడ్డి నవీన్‌ మళ్లీ మళ్లీ అందరికీ చెప్పారు కానీ అదొక్క విషయమే సింగిడి లేవనెత్తలేదు, 20 ఏళ్లుగా తెలంగాణలో ఎదగాల్సిన కథకు, కథకులకు ఎనలేని నష్టం కథాసాహితి చేసిందని మేము కరపత్రంలో చెప్పాం. అట్లే ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కరపత్రంలో ఉన్న విషయం గమనించవచ్చు.
- 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం
http://skybaaba.blogspot.com/2010/11/blog-post_3591.html నుంచి
Category: 2 comments

నన్ను "నేను"గా తీర్చి దిద్దింది అమెరికా : కలశపూడి శ్రీనివాస రావు గారితో "అక్షరం"


అమెరికా తెలుగు కథకులలో సీనియారిటీకి చేరుకున్న కథకులు కలశపూడి శ్రీనివాస రావు గారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ చలాకీ గా వుండే శ్రీనివాస రావు గారు కేవలం రచయితే కాదు, నలుగురికీ సాయపడాలన్న తపన వున్న వ్యక్తి. అక్షరం ముక్క రాయకుండా కూడా మహా సాహిత్యవేత్తల్లాగా వుపన్యాసాలు దంచుతూ, పరుల కోసం ఒక్క డాలరు కూడా ఖర్చు పెట్టకుండా మహా రాజ పోషకత్వం వహించే మహన్న భావులు కొల్లలుగా వున్న గంజాయి వనంలో అచ్చంగా తులసి మొక్క కలశపూడి. ఆయన విస్తృతంగా రాయకపోవడం మన దురదృష్టమే!

శ్రీనివాస రావు గారి బ్లాగు :

http://sahityakalasam.blogspot.com/


1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
అవును చదువు, పని, బ్రతుకు ముప్పెటలా కలసి పోయి నాకు తెలియ కుండానే నన్ను ‘నేను’ గా తీర్చి దిద్దింది అమెరికా. దాని వలన జీవితం పట్ల నా దృష్టిలో మార్పు వచ్చింది.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
జీవితం పట్ల నా దృష్టిలో వచ్చిన మార్పు, ఆలొచనల్లొ విశాలత్వం ఆచరణలొకి అనువదిచడానికి సహాయం అవుతూ వచ్చింది. ఇప్పటివరకూ ప్రచురించబడ్డ నా 45 రచనలలో ( కథ, కవిత, గల్పిక, నాటకం, నవల, వ్యాసాలలో) ఈ విషయం పరిణామం చెందుతూ వచ్చింది. ‘ మీ ఆవిడని కొట్టారా ?’ కథ లో ఒక పాత్ర లో మార్పు మాత్రమే చూడగలిగిన నేను ‘మా వూరి మంత్రి శతకం ‘ లో సమాజం లో మార్పు చూడగలిగాను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
ఆంద్రా లో ఉన్నప్పుడు వ్రాసినవి కవితలు. అదంతా భావకవిత్వం. సరదాగా, రాయగలనని తెలిసి రాసి చూసుకొందామని వ్రాసినవి. అచ్చు లో చూసుకోవాలని కూడా అనిపించలేదు. కారణం నేను వ్రాసిన వాటికంటే నేను చదివినవే చాలా బాగున్నాయనిపించడం కాబోలు. అమెరికా లో వ్రాసినవే నలుగురితో పంచుకోవాలన్పించి, సారస్వత సమూహాలలో చదవడం, ఇక్కడ పత్రికలకి పంపడం, తర్వాత అక్కడ పత్రికలకి పంపడం జరిగింది.
4. అమెరికా వచ్చాక మీ మొదటి రచన ఏది? దాని నేపధ్యం కొంచెం చెప్పండి.
‘వెయ్య కిటికీలు ‘ జీవితం ఒక వెయ్య కిటికీల భవంతిలా తోచింది అమెరికా జీవితం. ఎంతోమందిని కలవడం , వారి వారి ప్రపంచలోకి తెలుపులు తెరిచి రమ్మనమని స్నేహపూర్వక ఆహ్వానం ఇవ్వడం, ఆనందాన్ని, ఆలోచనల్ని, అనుభవాలని అలవోకగా ఇవ్వడం జరుగుతున్నా నేపథ్యంలో ఈ బ్రతుకుకి వెయ్యకితికీలు ఉన్నాయ్. తెరిచి చూడడం నేను చెయ్యవలసిన పని అని తెలుసుకున్న సమయంలో వ్రాసిన రచన అది.

5. డయాస్పోరా సాహిత్యాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు డయాస్పోరా సాహిత్యం అంటూ వుందనుకుంటున్నారా?
స్పటికం లాంటి మనిషి మెదడుమీద కాంతి లాంటి ఒక ఆలోచన వచ్చి ఇంద్ర ధనస్సులాంటి ఊహల్ని సృస్తి స్తుంటే వెలువడే సాహిత్యంకి భాష, భౌగొళిక హద్దులు ఉండవు. పరిశోధకుల పరిశోధనల కోసం తగిలించి పదం డయాస్పోరా సాహిత్యం అని నా అభిప్రాయం. రాసేవాళ్ళకి రిజర్వేషన్ కోటాలో రచయత తరగతిలో సీటు ఇవ్వాలంటే డయాస్పోరా సాహిత్య విభాగం అవసరమే. అమెరికా నుండి వస్తున్నా తెలుగు సాహిత్యం లో చాలా భాగం డయాస్పోరా సాహిత్యమే.
6. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
మీరు రచయతగా నా భవిస్యత్తు అని అడుగుతున్నారని భావించి ఈ జవాబు ఇస్తున్నను. అమెరికా వాతావరరం ఎన్నోవిధాలుగా రాసేవారికి రాయడానికి అవకాశాలని ఇస్తుంది. దానిని నేను ఆవగింజంత కూడా ఉపయోగించుకోవడంలేదు. భవిష్యత్తులో బత్తాయి అంత కాకపోయినా బ్లూ బెర్రీ అంతైనా బ్లాగ్ బరిలో ఉపయోగించుకోవాలని అనుకొంటున్నాను.
Category: 3 comments

కథ చుట్టూ రాజకీయాలు..!

ఈ కరపత్రం హైదారాబాద్ లోని కొంత మంది ద్వారా నా దృష్టికి వచ్చింది. వొకే వొక్క రోజులో నాకు పాతిక మంది ఈ కరపత్రాన్ని నాకు ఈ-లేఖల ద్వారా పంపారు. ఇంత ప్రతిస్పందన ఎందుకు వచ్చిందా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ, ఇది ఇతర సాహిత్య మిత్రులకి తెలిస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది నా బ్లాగులో పెట్టాను.

సింగిడి రచయితల సంఘం ఇటీవల చాలా ఉత్సాహంగా పనిచేస్తున్న తెలంగాణా రచయితల వేదిక. తెలంగాణాలోని అనేక వర్గాల రచయితలూ, కవులూ, విమర్శకులూ పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఈ సంఘం కింద పనిచేస్తున్నారు. తెలంగాణా రచనల పట్ల కొనసాగుతున్న వివక్షని ఈ సంఘం తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఈ కరపత్రం ఇప్పుడు తెలంగాణాలో విస్తృతంగా ప్రచారంలో వుంది. "అక్షరం"లో ఈ కరపత్రాన్ని ప్రచురించాల్సిందిగా సింగిడి రచయితలు, అనేక మంది తెలంగాణ రచయితలు కోరడం వల్ల దీన్ని నా బ్లాగులో ప్రచురిస్తున్నాను.

ప్రచురించిన వెంటనే ఈ కరపత్రం మీద ఇప్పటికే నాకు ఇరవై వ్యాఖ్యలు అందాయి. అవి ఆ సంపాదకుల మీద మరీ వ్యక్తి గత వ్యాఖ్యలు కావడం వల్ల వాటిని నేను అనుమతించలేకపోయాను. అవి ప్రచురణకి అర్హం కానీ భాషలో వున్నాయి కూడా!

ఈ విషయం మీద చర్చ జరగడం అక్కరలేదని నా వుద్దేశం కాదు, లేదా, భావ ప్రకటనా స్వేచ్చ మీద కత్తెర వెయ్యడం కూడా నా వుద్దేశం కాదు. ఈ కరపత్రంలో చర్చించ దగిన విషయాలు వుంటే అవి మర్యాదకరమయిన భాషలో, సహేతుకమయిన వాదనతో చర్చించమని వినయంగా మనవి.

వ్యాఖ్యలు పంపే ముందు అవి ఏ రకంగా చర్చకి దోహదం చేస్తాయో వొక్క సారి ఆలోచించండి. అలాగే, వ్యాఖ్యలు రాసే వారు ఆ వ్యాఖ్యలకి నా నించి సమాధానాలు దయచేసి ఆశించ వద్దు. వాటికి సమాధానాలు ఇవ్వాల్సిన వ్యక్తిని నేను కాదు, సింగిడి రచయితల సంఘం వారు మాత్రమే!


Category: 18 comments

జీవితం అర్ధమయ్యింది ఇక్కడే : పూడిపెద్ది శేషు శర్మ

1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?

అమెరికా వచ్చాకే నాకు జీవితం అంటే ఏమిటో తెలిసింది. అమెరికా భాషలో "టీనేజ్ వయస్సు" దాటీ దాటగానే వచ్చి ఈదేశంలో పడ్డాను. జీవితం అంటే ఎటువంటి అవగాహన లేకుండానే పెళ్లి చేసుకుని, భర్తతో భూతల స్వర్గం కాబోలు అనుకుంటూ అమెరికా వచ్చేను. ఇండియా లో పెరిగిన జీవితం అంతా "ఊహా లోకమే"! జీవితం ఎలా ఉండాలో, ఎంత ఆదర్శంతో బతకాలో; జీవితాన్ని ఎలా మలచుకోవాలో అనే ఊహాలోకం తప్ప, అసలు సిసలు జీవితం అంటే ఏమిటో ఎప్పుడూ ఆలోచించ లేదు. ఈదేశం వచ్చిన తరువాత, చుట్టుపక్కల ఉన్న ప్రవాసాంధ్రుల జీవితాలు చూస్తూ ఉంటే, "ఓహో, ఈ దేశంలో మన జీవితాలలో ఇటువంటి సమస్యలు వస్తాయా! మరి అటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలి?" అన్న ఆలోచనలు రావడం మొదలెట్టాయి. ఆ ఆలోచనలే నాలోని ఎమేచూర్ రచయిత్రిని మేల్కొల్పేయి.
మీ ప్రశ్నకు సమాధానం: ఇండియాలో నా జీవితం " స్వప్న జీవితం"; అమెరికా వచ్చిన తరువాత...ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, అసలు జీవితం అంటే ఏమిటో తెలిసింది. రియల్ ఎవేకేనింగ్! ఇప్పటికీ కూడా రోజు రోజుకీ,....నా దృక్పధం లో మార్పు వస్తూనే వుంది.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?
నా దృష్టిలో నేను గొప్ప రచయిత్రిని కాను. కేవలం నాఆలోచనలను చిన్న కధల రూపంలో వ్యక్తీకరణం చేసే మనిషిని. నేను ఇండియా లో పెద్ద రచనలు చేయలేదు. ఈదేశం వచ్చేక మన తెలుగు వారు ఎదురుకుంటున్న సమస్యల గురించి నా భావనల్ని, నా అభిప్రాయాల్ని, నలుగురికి తెలియజేయాలని చిన్ని చిన్ని కధలు వ్రాయటం మొదలుపెట్టా! నా రచనలు, చాలామట్టుకు, అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల జీవితాలకు సంభందించినవే. ప్రవాసాంధ్రుల జీవితాల్లో మనకు గోచరిస్తున్న సమస్యలు, వాటిని మనం ఏ దృక్పధంలో చూసి, ఎలా పరిష్కరించుకోవచ్చో అనేదే నా కధల్లో ముఖ్యాంశం. నా కధలు చదివి, అటువంటి ఇరకాటంలో సతమతమవుతున్న మన తెలుగు వారికి ఊరట కలిగించడమే నా ఆశయం.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి?
ఇంతకు ముందు చెప్పినట్టు, నేను ఆంధ్రాలో ఉండగా, చేసిన రచనలు...చాలా బుల్లి బుల్లివే. చెప్పుకోదగ్గవి కావు.

4. అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి?
నేను ఎప్పుడో ఆరు నెలలకో, ఏడాదికో కధ వ్రాస్తూ ఉంటాను. నాకు, ఏదైనా క్లిష్టమైన విషయం గానీ, నా హృదయాన్ని తాకిన విషయం గానీ తారస పడితే వ్రాస్తాను; లేదా వ్రాయను. నన్నుగా నేను పెద్ద భవిష్యత్తు వున్నా రచయిత్రిగా ఎప్పుడూ ఆలోచించ లేదు. నేనువ్రాసిన కొన్ని కధలకి, దేశం నలు మూలల నుండి నాతో ఏకీభవిస్తూనో, లేదా విమర్శిస్తూనో నాతో ఫోన్ చేసి ఉద్వేగంతో మాట్లాడినప్పుడే ఒక రచయిత్రిగా నాకు ఆదరణ కలిగిందని నేను భావించేను. ఇక పోతే రచయిత్రిగా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, భవిష్యత్తులోనే తెలుస్తుంది.

కొంచెం గతం, కొంచెం స్వప్నం...కలిస్తే ఫణి!



కథలూ కబుర్ల "పల్లకీ" శ్రీనివాస ఫణి డొక్కాతో కొన్ని కబుర్లు


1. అమెరికా వచ్చాకా జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
అమెరికా వచ్చేనాటికి నాకు ఇరవై రెండేళ్ళు. అప్పటికి జీవితం అంటే ఇదీ అనే ఖచ్చితమైన అభిప్రాయం గానీ, ఆలోచన గానీ లేదు. ఏదో, గాలివాటంగా బతకడమే. చదువుకోడానికి మొదట మెంఫిస్ వెళ్ళాను ఒక సెమిస్టరు. అక్కడ విపరీతమైన బెంగ మొదలయ్యింది. నెలకి ఆరొందలు స్కాలర్షిప్పిచ్చేవారు. ఎవరినన్నా ఇంకో మూడొందలు అప్పడిగేసి,ఎయిరిండియాలో వన్ వే టిక్కెట్టు కొనేసుకుని ఇంటికెళిపోదామని వుండేది. తోటల్లో ఎగిరే రామచిలుకని పట్టుకొచ్చి పంజరంలో పెటినట్టనిపించేది. అయితే, ఒక సెమిస్టరయ్యాకా, అట్లాంటా వచ్చేసాను అన్న దగ్గరికి. అప్పట్నించీ, బానే వుండేది. ఏ లోటూ తెలియనిచ్చేవాడు కాదు అన్న. అంచేత బెంగ తగ్గింది. మెల్లగా ఉద్యోగం కూడా రావడంతో, కాస్త ఆత్మ స్థైర్యం, "పరవాలేదు, మనం కూడా దేనికో ఒకందుకు పనికొస్తాం" అనే నమ్మకం కలిగాయి. నెల నెలా జీతం బేంకులో పడుతుంటే, త్రివిక్రముడిలా విశ్వాసం పెరిగిపోయేది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇండియాకెళ్ళి మనవాళ్ళందరినీ చూసుకు రావచ్చును అనే ధైర్యం వచ్చి, బెంగ తగ్గింది.

కడుపు నిండిన బేరం కాబట్టి, వంట దగ్గిరినించీ అన్నీ అన్నే చూసుకునేవాడు కాబట్టి, కాస్త పాటలమీద, కథలూ గట్రా రాయడం మీద మనసు పోయేది. అప్పటికి జీవితం పట్ల బెరుకు పోయి, "అన్న వెళ్ళిన దారిలో ఫాలో అయిపోతే, మన పావు కూడా పంట గడి చేరుకుంటుందనే" గెట్టి నమ్మకం కలిగింది. అప్పట్నించీ జీవితం పైన, భవిష్యత్తు పైన, కాస్త ఆశ, ఆసక్తి మొదలయ్యాయి. జీవితంలో మొట్టమొదటి సారిగా "మర్నాటి"గురించీ, "మరుసటి సంవత్సరం" గురించీ ఆలోచించడం, భవిష్యత్తు గురించి చిన్న చిన్న కలలు కనడం మొదలు పెట్టాను.

2. ఆ మార్పు మీ రచనలలో ఎలా వ్యక్తమయ్యింది? వొకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా ?
మానవ జీవితం పట్ల అవగాహన పెంచుకోవాలనే తపన ఉండేది మొట్టమొదటి రచనల్లో ("సాయంకాలం" కథ). రాను రాను ఆ జనరలైజ్డ్ ఆలోచన నించి, నేను ("నేనూ - నా లేఖినీ" కథ), నా అనుభవాలు ("నేనెరిగిన రైలు ప్రయాణం" కథ), నావాళ్ళు ("కాశిపిల్లి మామ్మ" కథ), నా చుట్టూ ఉన్న జనాలు ( "తెలుగువాడూ - జీవ పరిణామమూ" కథ), అనే ఒక సబ్జెక్టివ్ ధోరణి మొదలయింది. నా జీవితం మీద నాకు కాస్త పట్టు రావటం వల్లా, అన్న ఆసరాతో నాకాళ్ళమీద నేను నిలబడ గలగటం వల్లా, నా దృక్పథంలో వచ్చిన మార్పే, ఈ రచనలకి కారణమని, ఇప్పుడాలోచిస్తే అనిపిస్తోంది.

3. ఇక్కడికి వచ్చాకా మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనలకి ఏవిధంగా భిన్నమయినవి?
నేను ఇండియాలో ఉన్నప్పుడు రాసిన కథలు చాలా తక్కువ. నా మొదటి కథ "సాయంకాలం" - తనలో జరుగుతున్న సంఘర్షణ ( ఈ సృష్టిని అర్థంచేసుకోవాలనే తపన) ని ప్రకృతిలో చూసే ఒక పరిశీలకుడూ, మానవ జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునే ఒక విద్యార్థీ, అందరికీ మంచే జరగాలని కోరుకునే ఒక స్వాప్నికుడూ - ఇలా సాగిపోతుంది. ఇతనికి తన జీవితాన్ని గురించీ, భవిష్యత్తు గురించీ ఆలోచనే లేదు అప్పటికి. అల్లాగే, "ప్రేమాయణం" అనే ఒక వ్యాసంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టటానికి గల ఐదు కారణాలని చర్చించాను ( ఇది అముద్రిత రచన ). దానిలోనూ అంతే, ఒక జడ్జిగానో, అబ్జర్వర్ గానో, కనబడతాను. అంతా జనరలైజ్డ్ గా ఉంటుంది.

అమెరికాలో, అన్న దగ్గర కాస్త కుదుటబడ్డాకా, బాల్యాన్ని గుర్తుకుతెచ్చుకోవడం, ఆనాటి అల్లర్లూ, ఆ సరదాలూ, అప్పటి వ్యక్తులూ, చిన్ననాటి అనుభూతులూ, ఈ భావాలన్నీ కథలరూపంలో వచ్చేవి. తరవాత బెంగ తీరిన పిమ్మట, మూడు, నాలుగు పాత్రలతో కథలు రాయడం మొదలుపెట్టాను ("పల్లకీ" కథ అప్పుడు రాసినదే). మధ్య మధ్య చిన్న చిన్న విషయాలమీద నా కామెంటరీ కూడా రాసేవాణ్ణి. తరువాత రెండువేల సంవత్సరానికి కాస్త అటూ, ఇటూగా, సెటైర్లు రాయడం మొదలయింది. మన అందరిలోనూ ఉన్న గుణాలని "ఇవి మంచివి, ఇవి చెడ్డవి" అని చూసే భావం పోయి, మంచి గుణాలని మెచ్చుకుంటూ, అంత మంచివి కానివాటిని చూసి కాస్త నవ్వుకుంటూ, "నథింగ్ ఈజ్ పెర్ఫెక్ట్, టేకిటీజీ" అనుకుంటూ, హాస్యం, వ్యంగ్యం కలిసిన రచనలు చేయటం కాస్త అలవాటయింది. అల్లా చాలా సెటైర్లు రాసాను, ఇంకా రాస్తున్నాను.

4. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
తెలుగు రచయిత / కవి అనేది ఒక అంతరించిపోతున్న స్పీషీసు. మనసులో కాస్త తడి, మనిషన్న వాడిమీద ప్రేమ, విశ్వాసం, తెలుగు మీద కాస్త మమకారం, మాటల్లో కాస్త చమత్కారం - ఈ లక్షణాలున్న రైటర్సు ఇప్పటికే అతితక్కువ, ప్రపంచం మొత్తం మీద. ఇహ భవిష్యత్తు గురించి చెప్పనక్కరలేదు. మన సంతృప్తి కోసం రాసుకోవడం, పుస్తకాలు అచ్చేసుకోవడం. ఎవరన్నా మెచ్చుకుంటే సంబరపడిపోవడం, అంతవరకే. దీనివల్లేదో భాష ఉద్ధరింపబడుతుందని గానీ, మరో తరం వారో, ఆ పై తరం వారో మన కథలు చదివేసి "అన్నన్నా, మనం ఫలానా వారి సమకాలీకులుగా పుట్టి వుంటే ఎంత బాగుణ్ణు" అనేసుకుంటారనే వెఱ్ఱి అపోహలు గానీ నాకు లేవు.

నామట్టుక్కు నాకు మనుషులంటే ఇష్టం. వాళ్ళ మనసుల్ని తాకడం ఇష్టం. భేషజాల తెరల్ని దాటుకుని వెళ్ళి, అందరిలోనూ ఉండే అమాయకమైన పసిపిల్లవంటి హృదయాలతో కబుర్లాడడం ఇష్టం. నాకు నచ్చినన్నాళ్ళు రాస్తాను. ఎవరన్నా మెచ్చుకున్నన్నాళ్ళు రాస్తాను. ఓపికుంటే అచ్చేయించుకుంటాను. చదువుతానంటే ఇస్తాను.

ఇది ఇంటర్నెట్టు యుగం కాబట్టి, ఓ అరవయ్యో, వందో ఏళ్ళ తరువాత, వీకీపీడియా లోనో, మరొహ సైటులోనో, "ఫణి డొక్కా" అని సెర్చ్ చేస్తే, రెండు డేట్లు, నేను రాసిన పుస్తకాల పేర్లూ ఉండచ్చు. అప్పుడెవరన్నా వెఱ్ఱి బాగులవాడు తెలుగులో పరిశోధనా గ్రంధం రాస్తూంటే, నా పేరూ జత చెయ్యొచ్చు. ఈ ఋణానుబంధం అంతవరకే.
Category: 6 comments

తెలుగు భాషకి కొత్త తలుపు...ఇంటర్నెట్!

కల్లూరి శ్యామల గారు డిల్లీలోని ఐ‌ఐ‌టి లో అధ్యాపకులు. తెలుగు నించి ఇటీవలి సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి విస్తృతంగా అనువదిస్తున్నారు. తెలుగు సాహిత్యంతో పాటు ప్రపంచ సాహిత్యాన్ని సునిశితంగా చదువుకున్నారు. ఈ అభిప్రాయాలు పంపినందుకు వారికి ధన్యవాదాలు.


మొదటిప్రశ్న: ఇంటర్నెట్ తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన బాగా కనిపిస్తున్న మార్పులు.

విదేశాంధ్రులు, ప్రవాసాంధ్రులు తెలుగుని ఏదో ఒకరకంగా చదవగలుగుతున్నారు. భాషతో అనుబంధం నిలబెట్టులోవాలనే ఆదుర్దా నిజానికి తెలుగు యువతరంలో చదువుకునేరోజులలో దాదాపు మృగ్యమయిందనే చెప్పాలి. స్పర్ధతో కాంపిటీషన్ నిండిన ప్రపంచీకరణ విస్తరించిన నేటి సమాజంలో, తల్లిదండ్రులకి తమ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలనే ఆదుర్దాతో ఎక్కువ అవటంవలన భాషా సాహిత్యాలపట్ల ఒక వయస్సులో అంటే దాదాపు పదోఏటనుంఛి ఇరవైరెండేళ్ళ వయస్సు వరకు దూరంగా వుంచుతున్నారు. స్వంత భాషని చదవాలనే కోరికగాని కుతూహలంగానీ నేటి యువతకి లేదు అందులో వాళ్ళ తప్పుకంటే విద్యావిధానపు లోపాలు కారణమని చెప్పవచ్చును. అయితే ఉద్యోగాల్లో సెటిలయినతర్వాత మళ్ళీ భాషతో అభిమానం పెంచుకుని ఎక్కడికక్కడ తమ స్వంత వెబ్సైట్ లద్వారానో బ్లోగింగ్ ద్వారానో మూసుకున్న తలుపుల్ని తెరుస్తున్నారని చెప్పవచ్చును. ముప్పై అయిదు సంవత్సరాలు దాటిన తర్వాత కొందరు భాషని తిరిగి స్వంతం చేసుకుని తమతమ అస్థిత్వాలని సుస్థిర పరుచుకుంటున్నారు.

రెండో ప్రశ్న:

నిజంచెప్పాలంటే తెలుగుభాషకి ముందునుంఛి నెట్జెన్స్ తక్కువ. గృహిణులు, పత్రికల పాఠకులు నగరాలలో కంటే మద్యంతరమైన పట్టణాలలో, గ్రామాలలో వున్నారు. సాహిత్యం సృష్టింపబడేదిగూడా నెట్ సంస్కృతికి దూరంగా వుండే రచయితల వలననే. చాలమంది తెలుగురచయితలకి ఈమెయిల్ని మించి, ఒక్కొక్కసారి అదికూడా లేదు, తెలుసుకోవాలనే జిఙాస లేదు. వాళ్ళ ప్రపంచం వాళ్ళ పాఠకులు వాళ్ళకి వున్నారు. కాని రాయాలని ఆకాంక్షవున్న ఎంతోమందికి నెట్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తోంది. పూర్తిగా వారైన పాఠకులు, చెదివేసంస్కృతి దీనివల్ల ప్రచారామవుతున్నాయి.

ఇది ఒకరకంగా మంచిదనే అనిపిస్తోంది. భాష సజీవంగా వుండటమేగాక తక్కిన ప్రపంచంతో ముందుకు నడుస్తోంది.

మూడో ప్రశ్న:

ఒక కొత్త సంస్కృతికి సాహిత్య అంశాలకి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కవితలు, కథలు. మిని కథలు మనంమర్చిపోయిన రచయితలు ఈ చర్చలద్వారా మళ్ళీ సజీవులవుతున్నారు. అయితే ఇందులోనుంచి బహుకాలంనిలచి వుండే సాహిత్యాన్ని గుర్తించి నెట్ అనే జాలంనుంచి పైకితీసి నిలబెట్టే మార్గాలని అన్వేషించాలి. ఎంతైనా చెయ్యటానికి అవకాశం వుంది. మన ఆంధ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగులో ఎంత ముందంజ వేశారంటే ఎన్నైనా ప్రాజక్ట్లని చేపట్టి పురాణ సాహిత్యాన్ని, నిలబడదగినదానిని, ఇప్పుడు అందుబాటులోలేని పుస్తకాలని మళ్ళీ ప్రచురించవచ్చు. నేట్ దీనికొక ఆసరా అవుతుంది.

ఇన్ని చెప్పాక ఒకవిషయం తప్పక చెప్పాలి. పుస్తకాన్ని పుస్తకంగా ఒళ్ళో పెట్టుకుని పడుకుని చెదవడలో వున్న ఆనందం నెట్ లో చదవడంలో లేదు.

email: s_kallury@hotmail.com s.kallury@gmail.com

syamala@hss.iitd.ac.in

కొత్త తరం వస్తేనే అమెరికా తెలుగుకి కొత్త వెలుగు...విష్ణుభొట్ల లక్ష్మన్న!




1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?

అమెరికా రావటం మాత్రమే కాకుండా "అమెరికా నా దేశం" అని విశ్వసించి ఇక్కడ జీవితం గడిపే అందరి తెలుగువారి జీవితాల్లో జీవితం పట్ల మార్పు వస్తుంది!
ప్రతి వ్యక్తికి కొత్తవి, గొప్పవి అయిన అనుభవాలు కలిగినప్పుడల్లా జీవితం పట్ల దృష్టి మారుతూనే ఉంటుంది. నా విషయంలో కూడా అంతే! అమెరికా రాక ముందు ఎనిమిదేళ్ళు ముంబాయిలో గడిపిన నా జీవితం కొన్ని మార్పులకు గురి కావటం ఒక అధ్యాయం అనుకుంటే అమెరికా జీవితం మరొక పెద్ద అధ్యాయం. అయితే మామూలుగా మనకి పరిచయమైన ఒక సమాజంలోని అనుభవాల వల్ల జీవితం పట్ల కలిగే మార్పుల కన్నా మరొక దేశం రావటం, పరిచయం లేని ఒక కొత్త సంస్కృతి పరిచయం కావటం వల్ల కలిగే అనుభవాలు తప్పకుండా జీవిత గమనాన్ని మారుస్తాయి. ఈ మార్పు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా ఉండొచ్చు.
రచయితకి తన రచనల్లో ప్రేరణకి జీవితమే ముడి సరుకు అయినప్పుడు అమెరికా జీవితం ఎంతో పెద్ద ముడి సరుకు. ఇది అమెరికా పెద్ద దేశం, ఒక సూపర్ పవర్ కావటం వల్లనే కాదు. ఇక్కడి జీవితం ఎంతో వైవిధ్యమైనది. అనేక సంస్కృతుల కలబోత ఇక్కడి జీవితం. నిశిత దృష్టితో చూడగలిగే వారికి చెప్పాలనుకునే విశేషాలు ఎన్నో! అందరికీ తేలికగా కనపడే వస్తుపరమైన ఇక్కడి సమాజం వెనుక పైపైకి బులబులాగ్గా కనపడని జీవితం - అందుకు సంబంధించిన ఎన్నో మానవతా విలువలు ఈ సంస్కృతిలో దాగి ఉన్నాయి. ఒక తెలుగువాడిగా ఇతర తెలుగు వారితో మాత్రమే పరిచయాలు పెంచుకొని చూస్తే అమెరికా జీవితాన్ని విశాలంగా చూడలేము. అటువంటి విశాలమైన జీవితాన్ని చూడటం కోసం నేను ప్రత్యేకంగా కొన్ని ప్రయత్నాలు చేసాను. ఆ ప్రయత్నాల వల్లే జీవితం పట్ల నా దృష్టి మారిందని నేను అనుకుంటాను.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?

మొదటి విషయం. నేను ఎక్కువగా రాసిన వ్యక్తిని కాదు. నా రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఐతే గత పాతికేళ్ళుగా అమెరికాలో గడిపిన జీవితం వల్ల నా అనుభవాలు అమెరికన్ తెలుగు మిత్రుల అనుభవాల్లాగే వైవిధ్యం ఉన్నవి. అందుకు తోడు అమెరికా నుంచి మూడేళ్ళ కోసం వృత్తి రీత్యా కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ బదిలీ అవటం వల్ల పాశ్చాత్య జీవితాన్ని కొంచెం లోతుగా చూసే అవకాశం వచ్చింది. అవి నా రచనల్లో ఒకటీ, రెండు చోట్ల అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేసాను.

మొదటి ఉదాహరణ: ఈ ఆలోచనలతో మిత్రులతో కలిసి పన్నెండేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ-పత్రిక "ఈమాట". ఈ ఈ-పత్రిక ఒక ధ్యేయం అమెరికాలో తెలుగు రచయితలు ఇక్కడి జీవితంపై తమ అభిప్రాయాలను సాహిత్యపరంగా ఎలా ప్రకటిస్తారో తెలుసుకోవాలన్న తపన. ఈ విషయమై నేను స్వయంగా ఎక్కువ రచనలు చెయ్యకపోవచ్చు కాని, నా మిత్రులతో పాటు నా ఉత్సాహం మాత్రం ఈ దిశలోనే ఉండేది. ఉంది. అప్పుడప్పుడు నేను రాసిన కొన్ని ఈమాటలోని నా రచనలు ఈ అంశాన్ని స్పృశించాయనే అనుకొంటున్నా.

రెండవ ఉదాహరణ: "నా ఫ్రాన్స్ అనుభవాలు" అన్న పేరుతో కొంచెం విపులంగానే నా ఒక్క అనుభవాలే కాక నా భార్యా పిల్లలు కలిపి పొందిన అనుభవాలను అమెరికాలో ఒక వెబ్ పత్రికలో ప్రచురించారు. కొన్ని మార్పులతో అవే అనుభవాలను "ఆల్ప్స్ అంచున మూడేళ్ళు" అన్న పేరుతో ఆంధ్రాలో ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించబడ్దది. ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే అంధ్రదేశంలో పుట్టి పెరిగిన నా వంటి ఒక తెలుగువాడు ఇరవై సంవత్సరాలు అమెరికాలో జీవితం గడిపి ఫ్రాన్స్ లో ఉన్న జీవితాన్ని ఎలా చూస్తాడో తెలుగులో చెప్ప ప్రయత్నించాను. చిత్రమైన విషయం ఏమిటంటే అమెరికా జీవితపు మూలాలు నాకు నా ఫ్రాన్స్ జీవితంలో అనుభవం అవటం ఎక్కువైంది. ఇవి చదువుదామనుకున్న వారు ఈ లింక్ నొక్కండి.
(http://www.eemaata.com/em/issues/200709/1142.html?allinonepage=1).

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి?

నేను ఆంధ్రాలో ఉండగా ఏమీ రచనలు చెయ్యలేదు. కాకపోతే అక్కడ విసృతంగా పుస్తకాలు చదివేవాడిని. ఇతరులతో చర్చించేవాడిని. నిజానికి అమెరికా వచ్చాకే తెలుగులో రాయాలని (వేరే భాషలు, సంస్కృతుల పరిచయాలు కలిగినప్పుడు వారు తమ తమ భాషలను, సంస్కృతులను నిలుపుకోటానికి చేసే ప్రయత్నాలు నాకు ఈ దిశగా ప్రేరకాలు) బలమైన కోరిక మొదలైంది.
23 ఏళ్ళ వయస్సులో ఆంధ్రదేశాన్ని వదలటం జరిగింది. అప్పటి దాకా చదువులు, పరీక్షలతోనే కాలం సరిపోయింది. సాహిత్యం పట్ల మక్కువ ఉన్నా రచనా వ్యాసాంగాన్ని మాత్రం మొదలెట్టలేదు. అసలు తెలుగులో రాయాలని అప్పట్లో నాకు అనిపించలేదు. తెలుగు భాష విలువ కూడా అప్పటి వరకు అందరి కుర్రకారు లాగే నాకూ తెలియ లేదు.

4. అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి?

అమెరికా జీవితాన్ని తెలుపుతూ వచ్చే రచనలు చెయ్యాలని ఒక పెద్ద తాపత్రయం. అందుకు ఒక ముఖ్య కారణం ఇప్పటి వరకూ ఈ విషయంలొ చెప్పుకో తగ్గ రచనలు రాసిలోనూ వాసిలోనూ రాలేదనే చెప్పాలి. అలా అని ఈ దిశగా పెద్ద ప్రయత్నాలు జరగలేదని కాదు. అయినా తగినంతగా అమెరికా తెలుగు సాహిత్యం పెరగలేదనే చెప్పాలి. అంతో, ఇంతో రాయగలిగిన వ్యక్తులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎక్కువగా యువ రచయితలు, రచయిత్రులు కనపట్టం లేదు. ఎప్పుడైనా సాహితీ సదస్సులకి వెడితే కనపడేవి తెలిసిన ఈ కొన్ని మొహాలు మాత్రమే!

అసలు ప్రశ్న! అమెరికా తెలుగు రచయిత ఎవరు? అమెరికాలో ఉండి ఏ విషయం మీద అయినా తెలుగులో రచనలు చేసేవారు అని అర్ధం చెప్పుకుంటే భవిష్యత్తు గురించి నా అలోచనలు ఇలా
ఉన్నాయి. అమెరికాలో తెలుగులో రచనలు చేస్తున్నవారు రెండు రకాలు. చాలా కాలం క్రితమే, అంటే
దాదాపు పదేళ్ళ క్రితమే, అమెరికా వలస వచ్చి కుటుంబంగా ఇక్కడ స్థిరపడిన తెలుగు
రచయితలు చాలా కాలంగా తెలుగులో రచనలు చేస్తున్నారు. వీరి సంఖ్య ఎక్కువ లేకపోయినా (నా
ఉద్దేశ్యంలో వీరి సంఖ్య 30, 40 కి మించదు) క్రమం తప్పకుండా వీరి రచనలు ఈ-పత్రికలు,
బ్లాగులు మాత్రమే కాక అచ్చు మాధ్యమంలో ప్రచురించబడే సావనీర్లు, అమెరికా తెలుగు
సాంస్కృతిక సంఘాల ప్రచురణల్లో కనపడతాయి. ఇక రెండో వర్గం కొత్తగా వలస వచ్చిన,
వస్తున్న యువతరం. వీరిలో కొన్ని పేర్లు నాకు పరిచయమైనా వీరి సంఖ్య ఎక్కువగా
ఉన్నట్టు తోచదు. నిజానికి అమెరికా తెలుగు రచయితల భవిష్యత్తు నిర్ణయించేది ఈ 20, 30
సంవత్సరాల వయస్సులో ఉన్న ఈ యువతరం మాత్రమే. వీరి ఆలోచనలు పాతతరం కన్న కొత్తగా
ఉండటమే కాకుండా పాతతరం అలవాటు పడ్డ ధోరణి మూసలోంచి బయటకు లాగగలిగే శక్తి
ఉన్నది ఈ యువతరానికి. వ్యక్తిగా, ఒక తెలుగు రచయితగా ఈ యువతని ప్రోత్సాహపరిస్తే భవిష్యత్తు బాగుంటుంది అని తోస్తుంది నాకు.
మరి ఇది సాధించటం ఎలా? సాహిత్య సభల వల్ల, సత్కారాల వల్ల ఇది సాధ్యం అవుతుందని నేను అనుకోను. అలాగే ఈ-పత్రికలు, బ్లాగులు మొదలైన అంతర్జాల మాధ్యమాలు ఇందుకు సాయపడచ్చేమో గాని ఈ విషయంలో దిశానిర్ధారణ చేయ్యగలవని నేను అనుకోను. ఈ విషయంలో మిత్రుల ఆలోచనలు, సూచనలు తెలుసుకోటం మంచిది.

అమెరికా తెలుగు పండగ..."ఇండియానా"నా? ఇండియానా?


(ప్రముఖ డాక్టర్ ఉమా ఇయుణ్ణి సమగ్ర రచనల ఆవిష్కరణ - ఫొటో సౌజన్యం: న.చ.కి)

కొత్త ప్రదేశాలు కొత్త పరిచయాల్లాంటివి

కొత్త పరిచయాలు కొత్త ప్రదేశాల్లాంటివి.

ఆకాశ వీధుల్లోంచి ఇండియానా పొలిస్ ని చూడగానే ఆ చెట్ల మీద అన్నేసి రంగులు చూసి భలే ముచ్చటేసింది!
అంతకు మించి గొప్ప సాహిత్య వాతావరణమేమీ వుండకపోవచ్చు లే అనుకున్నాను అక్కడి ఎయిర్పోర్టు లో దిగగానే! కానీ, రెండు రోజులపాటు చాలా ఉత్సాహంగా జరిగాయి ఈ సాహిత్య సభలు. వంగూరి ఫౌండేషన్, గ్రేట్ ఇండియానా పొలీస్ తెలుగు అసోసియేషన్ (గీత) వారు చేసిన ఏర్పాట్లు, అతిధి మర్యాదలు, సందడి ఒక కుటుంబ పండగలాగా అనిపించాయి. సాహిత్య సభలు ఇలాగే కనువిందుగా, మన్ పసందుగా, వీనుల విందుగా జరిగితే వాటికి ప్రేక్షకుల కరవు అనే సమస్యే వుండదు.


వ్యక్తిగతంగా నాకు - యార్లగడ్డ ప్రసంగం వినడం ఇదే మొదటి సారి.అక్కిరాజు సుందరరామకృష్ణ గారి తెంగ్లీషు పద్యాలు ఇంకా చెవుల్లో రింగుమంటున్నాయి. బీయెస్ రాములుని చాలా కాలం తరవాత చూడడం బాగుంది. నచకీనీ, కాలాస్త్రిని కలవడం గొప్ప అనుభవం. వాళ్ళిద్దరితోనూ సన్నిహితంగా గడపడం బాగుంది. ఇక బ్లాగులోనో, ఏమైలులోనో, ఫోనులోనో తప్ప ముఖాముఖీ చూడని "కొత్త పాళీ" నారాయణ స్వామి తో కలవడం, కబుర్లూ, జోకులూ బాగున్నాయి. సాహిత్యమే కాకుండా సామాజిక రంగంలోనూ యెమయినా చేయాలన్న తపన వున్న ఉమా ఇయున్ని, అమెరికా ఇల్లాలి ముచ్చట్లు చెప్పిన శ్యామల దశిక, క్రైస్తవ కీర్తనల గురించి సుధా నిట్టల గార్ల సాహిత్య కృషిని తెలుసుకోవడం బాగుంది. ఒక మౌనిలా వుంటూనే తన ఆహ్లాదకరమయిన వ్యక్తిత్వంతో "భలే" అనిపించిన పప్పు రామారావు గారిని కలవడం బాగుంది. శొంఠి శారదా పూర్ణ, మంధా భానుమతి గారు రామారావు గారి సతీమణి సూర్యకాంతం గారిని తలచుకోవడం బాగుంది. సూర్యకాంతం గారి కథ గుర్తొచ్చి ఇప్పటికీ నవ్వొస్తుంది.

ద్వాదశి శర్మగారు సభా నిర్వహణలో హెడ్మాస్టర్ లాగా అనిపిస్తూనే, కడుపుబ్బ నవ్వించారు.

శివప్రసాద్ కుంపట్ల గారు వెయ్యేళ్ల సాహిత్య చరిత్రని నాలుగేసి పాదాల పద్యాలలోకి కుదించారు.

దేవరాజు మోహన్ గారు రాజునీ రాణినీ కాదు కాదంటూనే నవ్వుల పూలు రువ్వారు. వంశీ రామరాజు కొన్ని కొత్త మెళకువలు నేర్పే ప్రయత్నం చేశారు.

ఇక మా టెక్సాస్ నివాసి వంగూరి చిట్టెన్ రాజు సంగతి చెప్పకరలేదు. నోరు విప్పితే జోకు! కామేశ్వర రావు, సురేఖల పాటల సంగతి చెప్పేదేముంది?

మొత్తం మీద సభల్లో జరిగిన హడావుడి చూస్తే, ప్రసంగాలు వింటే తెలుగు సాహిత్యంలో అంతర్జాల వాదం వొకటి రాబోతోందా అన్న సందేహ బాధ మొదలయ్యింది. అందరూ అంతర్జాలం గురించి, బ్లాగుల గురించి విపరీతమయిన ఆసక్తి చూపించారు. త్వరలో కొన్ని కొత్త బ్లాగులకి నాంది జరిగినా ఆశ్చర్యం లేదు. అంతర్జాలం వొక ఇంద్ర జాలం అన్నారు ఉమ గారు. కాదు మాయాజాలం అన్నారు ఇంకెవరో! సాలెగూడు అన్నారు నాసీ. కాదు, కాదు "మార్జాలమ్" అన్నారు శివప్రసాద్!

నిర్వాహకులు చింతల రాము, అజయ్ పొనుగోటి, శేఖర్ కృష్ణమనేని, వినోద్ సాధు సరదాగా అటూ ఇటూ తిరుగుతూనే చాలా పనులు చక్కదిద్దారు. కవులనీ రచయితలనీ నిజంగానే కంటికి రెప్పల్లా చూసుకున్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, అద్భుతమయిన టిఫినీలు, తెలుగు భోజనాలూ పెట్టారు.

ఈ సాహిత్య ఉత్సవాన్ని గురించి కొత్త పాళీ, కాలాస్త్రి, న.చ.కి మరిన్ని కబుర్లు రాయబోతున్నారు, కనుక వాటి కోసం నేనూ ఎదురుచూస్తున్నా.

తా.క: దేవరాజు మోహన్ గారు ఇచ్చిన వేటూరి పాటల సీడీ వింటూ ఈ కబుర్లు మీకు రాస్తున్నా.

సైన్సుకీ మనసుకీ మధ్య లోలకం లక్ష్మన్న!

ఈ గురువారం విష్ణుభొట్ల లక్ష్మన్న 'ప్రముఖా"ముఖి

పూర్తిపేరు: విష్ణుభొట్ల లక్ష్మన్న
ఇతరపేర్లు: లక్కీ విష్ణుభొట్ల
సొంత ఊరు: సరిపెల్ల గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం: 1013 Ogden Drive, ఆష్టిన్, టెక్సాస్ - 78733, USA
వృత్తి: రిసెర్చ్ సైంటిష్ట్
ఇష్టమైన రచయితలు: శ్రీపాద, కొ.కు., కాళీపట్నం, రావి. శాస్త్రి, విశ్వనాథ
హాబీలు: శాస్త్రీయ - లలిత సంగీతం, నాటకాలు వేయడం, టెన్నిస్ ఆడటం, తోటపని, పుస్తక పఠనం
E-mail: Lark_Vishnubhotla@yahoo.com


సాహిత్య, కళా విమర్శకులు సైంటిస్టుల్లా పని చేయాలని అనుకుంటాను నేను. సాహిత్య కళా విమర్శని వొక బాధ్యతగా తీసుకొని,రచనని మనః ప్రయోగశాలలో అనేక విధాలుగా పరీక్షించి, ఒక హేతుబద్ధమయిన బేరీజు వెయ్యాల్సిన అవసరం ఇప్పుడు వుంది. సరయిన సాధనాలలో నేర్పు సాధించుకొని, తగిన అవగాహన తో రచనని "లోనారసి" చూడడం వొక విద్య. ఇతర రంగాలలో - ముఖ్యంగా సైన్సు రంగాలలో- పనిచేస్తున్న వారు సాహిత్యం గురించో, సినిమాల గురించో, కళల గురించో రాస్తే అందులో ఒక నిర్దిష్టతా, కచ్చితత్వం, సూటి దనం, స్పష్టతా కనిపిస్తాయి. విష్ణు భొట్ల లక్ష్మన్న గారు అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.

వృత్తి రీత్యా ఆయన సెమీకండక్టర్స్‌ లో పరిశోధనా విభాగంలో, ఆష్టిన్‌లో ఉన్న "ఫ్రీస్కేల్ సెమీకండక్టర్స్" లో ప్రస్తుతం పని చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని "సరిపెల్ల" గ్రామంలో కవలల్లో (రామన్న – లక్ష్మన్న) ఒకరుగా జన్మించారు. ప్రాథమిక విద్య, కొంత వరకు కాలేజీ చదువు ఆంధ్రాలోనే చేసారు. తరవాత, ఐ. ఐ. టి. ముంబైలో ఇంజినీరింగ్ చదువు పూర్తి అయిన తరువాత, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో భౌతికశాస్త్రంలో పి. హెచ్. డి పూర్తి చేసారు.

రిసెర్చ్‌ లో చాలా ఇష్టం ఉన్న లక్ష్మన్నగారి అమెరికా జీవితం యేల్ విశ్వవిద్యాలయంలో రిసెర్చ్ సైంటిష్టుగా 1988 సంవత్సరంలో మొదలయ్యింది. సెమీకండక్టర్ పరిశ్రమలో పనిచేయటానికి 1994 సంవత్సరంలో డాలాస్ రావటం, అక్కడ తెలుగు సంఘంలో చేరి 1998 సంవత్సరంలో డాలాస్ వదిలి ఆష్టిన్ వెళ్ళేదాకా చురుగ్గా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

ఆష్టిన్ వెళ్ళిన తరవాత తెలుగు సాహిత్యంపై ఇష్టం, పరిచయం ఉన్న మిత్రులతో కలిసి "ఈమాట" అన్న పేరుతో ఒక వెబ్ మాగజైన్ ప్రారంభించారు. ఇప్పటికీ "ఈమాట" కోసం రచనలు చేస్తూనే ఉన్నారు. 2002 సంవత్సరంలో అప్పటి మోటొరోలా కంపెనీలో పనిచేస్తూ, అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్ తయారీకి కావలసిన పరిశోధన కోసం ఫ్రాన్స్‌ లో మూడేళ్ళు పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.

అంతో ఇంతో రాయటం వచ్చిన ప్రవాసాంధ్రులు అందరూ తప్పకుండా రాయాలని వీరి అభిప్రాయం.


విష్ణుభొట్ల లక్ష్మన్న రచనల సూచిక:

1. ఓడలో ఏడు రోజుల కార్నివల్, ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 20 - 2009, ఆదివారం అనుబంధం http://www.andhrajy othy.com/ sunday/sundaysho w.asp?qry= 2009/20-9/ travel
2. గుర్రం జాషువా పాపాయి పద్యాలు, ఈమాట, సెప్టెంబర్ 2009 http://www.eemaata.com/em/issues/200909/1464.html
3. హాయి హాయిగా ఆమని సాగే, ఈమాట, జూలై 2009
http://www.eemaata.com/em/issues/200907/1441.html

4. ‘అపు సంసార్ ‘ - సత్యజిత్ రాయ్ సినిమా మార్చి 2009 » వ్యాసాలు http://www.eemaata.com/em/issues/200903/1411.html?allinonepage=1
5. ‘అపరాజితో’ - సత్యజిత్ రాయ్ సినిమా జనవరి 2009 » వ్యాసాలు
http://www.eemaata.com/em/issues/200901/1390.html?allinonepage=1

6. రహదారి పాట - “పథేర్ పాంచాలి” సత్యజిత్ రాయ్ సినిమా "ఈమాట" నవంబర్ 2008 » వ్యాసాలు
7. ఒంటరి గృహిణి - “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా "ఈమాట" మే 2008 » వ్యాసాలు
8. ఏది నిజం? - “రషోమాన్” జాపనీస్ సినిమా "ఈమాట" మార్చి 2008 » వ్యాసాలు
9. ఎందుకు రాయాలో అందుకే చదవాలి "ఈమాట" జనవరి 2008 » వ్యాసాలు
10. రొసెట్టా రాయి కథ - వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష
"ఈమాట" నవంబర్ 2007 » వ్యాసాలు
11. మా ఫ్రాన్స్ అనుభవాలు "ఈమాట" సెప్టెంబర్ 2007 » వ్యాసాలు
12. మా ఈజిప్ట్ యాత్ర "ఈమాట" జూలై 2006 » వ్యాసాలు
13. కథాశిల్పం "ఈమాట" మార్చి 2006 » వ్యాసాలు
14. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? "ఈమాట" జూలై 2001 » వ్యాసాలు
15. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి "ఈమాట" మే 2001 » వ్యాసాలు
16. మీ ఘంటసాల "ఈమాట" మే 2001 » సమీక్షలు
17. రాగలహరి: హిందోళం "ఈమాట" మార్చి 2001 » వ్యాసాలు
18. రాగలహరి: కల్యాణి "ఈమాట" జనవరి 2001 » వ్యాసాలు
19. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు "ఈమాట" నవంబర్ 2000 » వ్యాసాలు
20. రాగలహరి: సింధుభైరవి "ఈమాట" నవంబర్ 2000 » వ్యాసాలు
21. రాగలహరి: అభేరి "ఈమాట" జూలై 2000 » వ్యాసాలు
22. రాగలహరి: మోహనం "ఈమాట" మే 2000 » వ్యాసాలు
23. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి "ఈమాట" నవంబర్ 1999 » వ్యాసాలు
24. ఘంటసాల - బాలసుబ్రహ్మణ్యం "ఈమాట" నవంబర్ 1999 » వ్యాసాలు
25. ఆల్ప్స్ అంచున మూడేళ్ళు, "ఆంధ్రజ్యోతి", ఆదివారం అనుబంధం, అక్టోబర్ 14, 2007
26. రొసెట్టారాయి - చచ్చి బతికిన ఓ రాయి కథ, "ఆంధ్రజ్యోతి", ఆదివారం అనుబంధం, డిసెంబర్ 23, 2007

తెలుగుకి వలసొచ్చిన ఓ గుజరాతీ!



దావిన్ పటేల్ మొదటి సారి తెలుగు క్లాస్ కి వచ్చినప్పుడు అది మూన్నాళ్ల ముచ్చటే అనుకున్నాను నేను.
రెండో రోజు నేను క్లాస్ లోకి అడుగుపెట్టేసరికి, అతనితో పాటు ఇంకో నలుగురు ఉత్తర భారతీయులు, వొక పాకిస్తానీ తెలుగు క్లాస్ లో కూర్చొని వున్నారు. నేను రాగానే వాళ్ళు నా దగ్గిరకి వచ్చి, "దావిన్ చెప్పాడు క్లాస్ చాలా బాగుందని! మేము తెలుగు తీసుకుంటాం. మాకు అనుమతివ్వండి" అని అడిగారు. "ఒక వారం చూద్దాం" అన్నాన్నేను. అలా వచ్చిన ఆ అయిదుగురు ఉత్తరాది వాళ్ళూ , వొక పాకిస్తానీ అబ్బాయీ ఇవాళ రెండో సంవత్సరం క్లాస్ దాకా తెలుగుని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మూడో సంవత్సరం తెలుగు పెట్టండి, మేము తీసుకుంటాం అని మా ఛైర్మన్ కి వాళ్ళే పిటిషన్ పెట్టే దాకా వెళ్లారు.

ఆస్టిన్ తెలుగు క్లాస్ లో తెల్ల వాళ్ళు వుండడం ఆశ్చర్యం కాదు. కానీ, ఉత్తరాది వాళ్ళు వచ్చి తెలుగు తీసుకుంటూ, తెలుగు భాష మీద ప్రేమ పెంచుకోవడం అన్నది ఆస్టిన్ లో దావిన్ తోనే మొదలయ్యింది. ఇంతా చేస్తే, దావిన్ కి కనీసం ఓ తెలుగు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు! కానీ, తెలుగు మీద అతను ఎంత ఇష్టం పెంచుకున్నాడంటే, ఇంట్లో అమ్మతో మాట్లాడుతున్నప్పుడు గుజరాతీ మాటల మధ్య తెలుగు మాటలు వచ్చేస్తున్నాయట!

దావిన్ ఇవాళ టెక్సాస్ యూనివర్సిటీ కాంపస్ లో చాలా మందికి వొక మోడల్ గా మారాడు. అతనూ, అతని మిత్రులు కాంపస్ లో దాదాపు వొక తెలుగు ఉద్యమమే నడుపుతున్నారు. కాంపస్ లో తెలుగు భాషా దినోత్సవం , తెలుగు సినిమా పండగ లాంటివి ఇవాళ దావిన్ అతని మిత్రులు ముందుండి చేస్తున్నారు.

ఉత్తర భారతం, అమెరికన్ విద్యార్ధులలో తెలుగు పట్ల పెరుగుతున్న ఈ ఆసక్తిని గమనించిన శాన్ ఆంటోనియో తెలుగు సమితి సభ్యులు, ముఖ్యంగా గోవింద రాజు మాధవ రావు గారు తెలుగేతర తెలుగు విద్యార్ధులకి మనం వొక అవార్డు ఇస్తే బాగుంటుందని సంకల్పించారు. 250 డాలర్ల ఈ అవార్డు, ఉత్తమ తెలుగు విద్యార్థి అవార్డు దావిన్ కే ఇవ్వాలని తెలుగు విద్యార్ధులంతా ముక్తకంఠంతో వోటేశారు.

ఉత్తమ తెలుగు విద్యార్ధి దావిన్ కి ఈ అవార్డు ఈ నెల 30 న శాన్ ఆంటోనియో లో జరిగే దసరా ఉత్సవాల్లో ప్రదానం చేస్తున్నారు.

దావిన్ పటేల్ కి అభినందనలు!

కాంపస్ లో విదేశీ విద్యార్థులకు దావిన్ పటేల్ రాసిన లేఖ ఇది!

Telugu is not just for Telugus!

Being Gujarati, I honestly didn't know the first thing about the Telugu language before coming to UT. My major requires four years proficiency of a foreign language and a friend recommended Telugu, so I decided to try it out. From the first day in class, I knew I made the right decision. Learning a new alphabet and language has been challenging, but also extremely rewarding. Professor Afsar has created a great learning environment that isn't like any other traditional, lecture-based class. I don't even feel like I'm going to class, it's more of a discussion where I've been able to create bonds with many of my classmates through conversation. We are encouraged to leave English at the door and converse in Telugu, and through various exercises, my confidence in speaking a foreign tongue has increased so much.This carries over to outside of the classroom as well. I have participated in events like Telugu Culture Day, where I've been able to apply what I've learned in class. Our class also made a trip to Madras Pavillion to experience South Indian Cuisine. Activities like these reinforce the Telugu culture that I've learned about. In just the past couple of semesters, I've seen the growth in the program at UT firsthand, and I hope to help continue its progress. Just like first year Telugu isn't just another class, Afsar gaaru isn't just another professor. In my 2+ years of college, I've never had a professor that is more attentive to his students needs or cares more about our progress. He welcomes new students and makes the class enjoyable for all. His passion about the language and culture is visible in every single class and he instills this passion in all of his students. Afsar gaaru makes me excited to learn and there is no way I could have come this far without him. I still have a long way to go in becoming fluent, and I know that Professor Afsar and the UT Telugu program will help me get there.

అమెరికా తెలుగుదనం నేర్పిన పాఠాలే నా రచనలు: "కొత్త పాళీ" నారాయణస్వామి




“అమెరికా వచ్చాకే నాకు ఇండియా అర్ధమయింది” అంటారు ఏకె రామానుజన్ వొక సందర్భంలో! చిత్రకారుడు చిత్ర రచన చేస్తున్నప్పుడు వొక దృశ్యం గీశాక, వొకడుగు వెనక్కి వేసి సాలోచనగా తన బొమ్మ వైపు పరికిస్తాడు. వొక దూరాన్ని వూహించుకొని తనని తాను “ఆబ్జెక్టివ్” గా చూసుకుంటాడు. రామానుజన్ చేబ్తోంది కూడా అదే! ఎంతో కొంత దూరం అయితే తప్ప/ దేనికీ దగ్గిర కాలేమని నేను వొక కవితలో రాసినట్టు గుర్తు. ఆ దూరం అనుభవంలోకి వచ్చి కలం పట్టిన రచయిత నారాయణ స్వామి. “రంగుటద్దాల కిటికీ” ఆయన తాజా పుస్తకమే కావచ్చు, కానీ, రచయితగా నారాయణస్వామి అనేక సంవత్సరాలుగా పాఠకులకి సుపరిచితులే. “తుపాకి” నారాయణస్వామి గా కూడా ఆయన ప్రసిద్ధుడు. రాత కన్నా ఎక్కువ చదువు, చదువు కన్నా ఎక్కువ పరిశీలనా, పరిశీలన కన్నా ఎక్కువ అవగాహనా, అవగాహన కన్నా ఎక్కువ చురుకుదనమూ ...అన్నీ వెరసి నారాయణ స్వామి! మిత్రులకి “నాసి”, బ్లాగ్మిత్రులకి “కొత్త పాళీ”, సాహిత్య మిత్రులకి నారాయణ స్వామి..ఏ పేరున పిలిచినా అది వొక్కటే రూపం! నచ్చినా నచ్చకపోయినా వెంటనే స్పందించే సహృదయం...నిరాశలో ఆశనీ, దురాశలో దుఖాన్నీ తలపించే స్నేహం...బతుకు తీపీ, కష్టాల వగరూ, ఆలోచన విగరూ ... అన్నిటికీ మధ్య వొక సమతూకాన్నీ సాధించాలన్న తపన నారాయణస్వామి! సంగీత సాహిత్య నృత్య సమలంకృత ప్రతిభ.... ఆయన సొంతం! ఇటీవల “పాలపిట్ట” మాసపత్రికలో “ఆవలి తీరం” శీర్షిక కింద అమెరికా తెలుగు అనుభవాలని రికార్డు చేస్తున్న రన్నింగ్ కామెంటేటర్ ఆయన.




1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
కచ్చితంగా. అసలు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడినదే అమెరికా వచ్చినాక అనుకుంటాను. వరంగల్లో కాలేజి చదువుమూలంగా నా ఆలోచనలకి కొంత ఎరుపు రంగు అంటుకుంది. సాహిత్యం వల్ల కేవలం వినోదమేకాక, అంతకు మించిన ప్రయోజనం కూడా ఉంటుంది అనే ఆలోచన పరిచయమయింది. కానీ విస్తృతంగా చదవడం మొదలు పెట్టింది అమెరికా వచ్చినాకనే. ఆ లెక్కన, ఆంగ్ల సాహిత్యాన్నీ, ప్రపంచ సాహిత్యాన్నీ, తెలుగు సాహిత్యాన్నీ ఒక్కమాటే చదివాను నేను. సాహిత్యంలో ప్రపంచాన్ని చూడ్డం, ప్రపంచంలో సాహిత్యపు ముద్రలు చూడ్డం అమెరికా జీవితంలోనే అలవాటయింది నాకు. అమెరికా వచ్చేదాకా అసలు నాకు జీవితంపట్ల ఒక అవగాహన కానీ ఒక దృక్పథంగానీ ఏర్పడిన గుర్తులేదు. ఈ విషయంలో అమెరికా ఏదో పెద్ద దోహదం చేసిందని కాదు నా ఉద్దేశం. కొత్త దేశంలో కొత్తతరహా జీవితం మొదలయేప్పటికి కొన్ని కొన్ని అనుభవాలు, తద్వారా నేర్చుకున్న గుణపాఠాలు తప్పనిసరి. అటుపైన, విశ్వవిద్యాలయ వాతావరణంలో, liberal intellectualsతో ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు గడించినవారితో సుదీర్ఘ స్నేహాలు నా ఆలోచనా పరిధిని చాలా విస్తృతం చేశాయి.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
తుపాకి, ఇండియన్ వేల్యూస్, వీరిగాడి వలస, లోకస్ట్వాక్ కార్నర్లో - ఈ నాలుగు కథల్లో అమెరికను ఇమిగ్రంటు జీవితాల్లోని నాలుగు విభిన్న కోణాల్ని చిత్రించగలిగానని అనుకూంటున్నాను. నా కథల్ని గురించి విడిగా మాట్లాడ్డం, రాయడం నాకు ఇష్టం ఉండదు. చెప్పాల్సిన విషయమేదో కథలోనే ఉంది అని నా ఉద్దేశం. మనల్ని మనం సాధారణంగా ఏదో ఒక పరిధిలో నిర్వచించుకుంటూ ఉంటాం. మనిషి తనని కట్టిపడేసి ఉంచే పరిధుల్ని అధిగమించాలని ఒక రచయితగా నా ఆశ. అమెరికాలో జరిగినట్టు రాసిన నా కథల్లో ఇటువంటి పురోగమనాన్ని చిత్రించడానికి ప్రయత్నించాను. వీరిగాడి వలస కథలో ప్రధానపాత్ర రాఘవరావు సుమారు అరవయ్యేళ్ళ వాడు, రిటైరైనాడు, భార్య మరణించింది, అమెరికాలో కొడుకూ కోడలు దగ్గర వచ్చి ఉన్నాడు. ఆయన ఆలోచనలు కానీ, తీరుతెన్నులు కానీ సాధారణ భారతీయ తండ్రుల్లా ఉండవు. ఈ మధ్య రాసిన నీవేనా ననుతలచినది కథలో సహాయపాత్రగా ఉన్న మాధవి - కథానాయకుడు తేజా తల్లి - ఈమెకూడా విలక్షణమైన పాత్ర. సాధారణంగా అమెరికను భారతీయకథల్లో కనిపించే భారతీయ తల్లిలా ఉండదు. ఇలా, కథల్లో పాత్రలూ ఇతివృత్తాలూ భారతీయమే అయినా, కొన్ని కోణాల్లో ఆ పరిధినిదాటిన ఒక ఔన్నత్యాన్ని చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నాను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
అమెరికా రాకముందు నేను రచనలు చెయ్యలేదు. అసలు అమెరికా రాకపోతే రాయాలి అనే ఆలోచన నాకు బలంగా తోచి ఉండకపోవచ్చు. అంటే అదేదో అమెరికా గొప్పతనం కాదు, మాతృభూమిని, సుపరిచితమైన భాషనీ సంస్కృతినీ వదిలి వచ్చిన ఒక వలస ఫీలింగ్. ఆంధ్ర వదిలి కాన్పూరులో ఉండగా మొదటిసారి ఈ రచన తృష్ణ కలిగింది. అమెరికా వచ్చాక అది కచ్చితంగా తీరనిదాహంగా పరిణమించింది.

4. అమెరికా వచ్చాక మీ మొదటి రచన ఏది? దాని నేపధ్యం కొంచెం చెప్పండి.
నేను రాసిన మొదటి కథ "ఓరి భగవంతుడా" - ఇది అమెరికా వచ్చినాక రాసినదే. కానీ ఇందులో అమెరికా నేపథ్యం ఏమీలేదు. ఈ కథ ఇండియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జరుగుతుంది. కొకు కథల మత్తులో, ముఖ్యంగా ప్రేమించిన మనిషి అనే పెద్ద కథ చదివిన మత్తులో రాశాను దీన్ని. ఒక మధ్యతరగతి యువకుడు (పదహారు పదిహేడేళ్ళ వాడు) తనని ఆకర్షించిన ఇద్దరు అమ్మాయిల పట్ల - ఒకామె తన ఆర్ధిక స్థాయికి చెందిన పొరుగింటి వారమ్మాయి, రెండో ఆమె తన ఇంట్లో పని మనిషి - విభిన్నంగా ఎట్లా ప్రవర్తిస్తాడు అనే ప్రశ్న ఈ కథకి కీలకం. పరుగుపందెంలో పాల్గొనబోయే ముందు కండరాల్ని సాగదీసుకున్నట్టు, నా రచనాశక్తిని సాగదీసుకోడానికి ఈ కథ రాశానని అనుకోవచ్చు.
నే రాసిన రెండో కథ తుపాకి. దాన్ని గురించి ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం.


5. డయాస్పోరా సాహిత్యాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు డయాస్పోరా సాహిత్యం అంటూ వుందనుకుంటున్నారా?
ఇది ఒక్క పేరాలో ఇమిడే ప్రశ్న కాదు. కానీ అడిగినందుకు నెనర్లు. దీనికి ఇంకా విపులంగా సమాధానమివ్వాలని ఉంది. రాస్తాను త్వరలో. టూకీగా కొన్ని మాటలు: తెలుగు వల్సవారు రాసినదంతా డయాస్పోరా సాహిత్యమే. కాదని ఎవరూ అనలేరు. అందులో కొన్ని విషయాలే ఎక్కువగా ఉన్నాయి, మిగతా విషయాలు లేవూ అంటే - అంతే మరి, మన వలసవారికి ఆ విషయాలే ఇప్పటికీ ఇంకా ముఖ్యమైన విషయాల్లాగా కనిపిస్తున్నాయి అన్న మాట - మాతృదేశాన్ని గురించి నాస్టాల్జియా, నివాసం ఉన్న దేశ సంస్కృతిని గురించి కొంచెం ఎగతాళి, లేదా ఇదే గొప్పది అనుకునే ఒక అభిమానం, పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, రెండు సంస్కృతుల భేదాలు - ఇంకా ఇల్లాంటివి .. ప్రస్తుతానికి ఇంకా ఇవే మనవారికి ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఇతివృత్తాలు. అందుకే అవే మన సాహిత్యాన్ని నింపుతున్నాయి. ఈ విషయాలకి పరిమితమైనందువల్ల మనవాళ్ళు రాస్తున్నది డయాస్పోరా సాహిత్యం కాదు అనే వాదనకి అర్ధం లేదు. ఈ సాహిత్యం కొత్త పుంతలు తొక్కాలి అంటే వలస సామాజిక స్పృహలో కొత్త ప్రశ్నలు ఉదయించాలి, దానికి కొత్త అనుభవాలు రావాలి - ఉదా. ఒక తెలుగు కుటుంబపు అబ్బాయి ఇరాకులోనో ఆఫ్ఘనిస్తానులోనో సైనికుడిగా పనిచేస్తే? తమాషాగా, ఈ విషయంలో నిజజీవిత అనుభవాలకంటే సాహిత్యం వెనకబడి ఉన్నదని నా అనుమానం.

6. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
అమెరికను - ఇండియను అనే లేబుల్సుని అధిగమించి ఒక విశ్వమానవుడి ప్రతీకతో రచనలు చెయ్యాలని ఆశ. దానికి ముందు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో భారతీయ వలససమాజం ఎలా మసలుతున్నదో అని విపరీతమైన ఆసక్తి. దాన్ని కొంతవరకైనా నా రచనలో పట్టుకోవాలని పట్టుదల.

సిద్ధార్థ తెలుగు ప్రయాణం!




జంపాల సిద్ధార్థ రంగా ఆస్టిన్ కి దగ్గిరలో వున్న టెంపుల్ టెక్సాస్ నివాసి. అతను టెక్సాస్ యూనివర్సిటీలో తెలుగు నేర్చుకుంటున్నాడు.అమ్మానాన్నల భాష రాకపోవడం సిగ్గుగా వుందని, తెలుగు ఎలాగయినా నేర్చుకోవాలన్న పట్టుదల వుందని క్లాస్ లో మొదటి రోజు అతను తనని తాను పరిచయం చేసుకున్నాడు. సిద్ధార్థ ఇప్పుడు తెలుగు రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అమ్మ, నాన్న, అక్క అనే పదాలు తప్ప ఇంకో తెలుగు పదం తెలియని సిద్ధార్థ ఇప్పుడు తెలుగులో చక్కగా మాట్లాడతాడు. రాస్తాడు. చదువుతాడు. క్యాంపస్ లో ఎవరయినా తెలుగు విద్యార్థి కనిపిస్తే తెలుగులో మాత్రమే మాట్లాడాలని నియమం పెట్టుకున్నాడు సిద్ధార్థ. ఇటాలియనో, మరో భాషో నేర్చుకునే వాళ్ళని కూడా "తెలుగు ఇటాలియాన్ ఆఫ్ ది ఈస్ట్. తెలుగు నేర్చుకోండి" అంటూ తెలుగు వైపు వాళ్ళకి ఆసక్తి కలిగిస్తాడు.

"నేను చాలా ఇష్టంగా వెళ్ళే క్లాస్ ఇది. ఈ గంట సేపూ చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది నాకు." అంటాడు తెలుగు క్లాస్ గురించి.
ఈ యేడాది శాన్ ఆంటోనియో తెలుగు అవార్డ్ సిద్దార్థ కి రావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఈ అవార్డు సంగతి ప్రకటించగానే, "సిద్ధార్థ ఈ అవార్డుకి అన్నీ విధాలా తగిన వాడ"ని అందరూ అతన్ని అభినందించారు.

క్యాంపస్ లోని విదేశీ విద్యార్థుల కోసం సిద్ధార్థ రాసిన ఈ నోట్ ని యధాతధంగా ఇక్కడ అందిస్తున్నాను.

సిద్ధార్థని మీరూ ఆభినందించండి!


Siddhartha's Note for Foreign Language Learners on the UT campus

When I first learned that Telugu was being offered at the University I was truly excited. I knew it would be a great opportunity for me to learn a language that I could share with my family. Growing up my parents talked to me in English and Telugu, so I could always understand the language but unfortunately could not speak, read, or write Telugu. I was hoping that by taking Telugu I could better relate to my own culture and family and feel that the course has helped me achieve that goal.

My learning of Telugu was facilitated by our literary genius of a professor in Afsar gaaru. Afsar gaaru truly enjoys every aspect of teaching and it shows through the fun-filled environment of class. It is neat to see that every time I go to class I get a little dose of culture and India. I can speak for all the students when I say that it is surprising to see how far everyone has progressed in their language skills of Telugu in such a short amount of time. Going into our first year of Telugu together, most of the students started from the very basics but now we can communicate with great speed and understanding. We can attribute our successes to our professor who is the architect of the Telugu program here at the University.

The growth of the Telugu program at the University is very exciting. The growing interest in the class is not only in reference to native speakers, but also for anyone who would like to learn a foreign language. The language of Telugu is naturally beautiful, as our professor reminds us everyday, “It is the Italian of the East.”
Category: 11 comments

ఈ వారమే ఇండియానాపొలిస్ లో అమెరికా తెలుగు సాహితీ సదస్సు!





ఈ వారం ఇండియానా పొలిస్ లో అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుగుతోంది. ఇది ఏడవ సదస్సు. వంగూరి ఫౌండేషన్ 1998 నించి రెండేళ్ల కోసారి ఈ అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సులు నిర్వహిస్తోంది. ఈ శనివారం ఉదయం 8 గంటలకు సదస్సు మొదలవుతుంది. సాయంత్రం 6:30 గంటల దాకా సాహిత్య ప్రసంగాలూ, చర్చా వేదికలూ జరుగుతాయి. ఆరున్నర నించి 8 గంటల వరకు మధుర గాయకులు ఘంటసాల ఆరాధనోత్సవాలు జరుగుతాయి. హైదరబాద్ నించి వచ్చిన శ్రీమతి దివాకర్ల సురేఖా మూర్తి, "అపర ఘంటసాల" బాల కామేశ్వర రావు ల మధుర గీతాలు వుంటాయి. ఈ ఇద్దరి గాన మాధుర్యం ఇప్పటికే టెక్సాస్ తెలుగు వారికి సుపరిచితం. అది నిజంగా వీనుల విందే! మరునాడు స్వీయ రచన పఠనంతో రెండో రోజు కార్యక్రమాలు మొదలవుతాయి.

వంగూరి చిట్టెన్ రాజు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ సదస్సుకి ఆంధ్రా నుంచి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మంధా భానుమతి, అక్కిరాజు సుందర రామకృష్ణ హాజరవుతున్నారు.

ఈ సదస్సులో నేను "అమెరికా తెలుగు సాహిత్యం - రెండు దశాబ్దాలు" అనే అంశం మీద మాట్లాడతాను. 1990 ల తరవాత అంతర్జాతీయ ఆర్ధిక రాజకీయ పరిణామాల తరవాత అమెరికా తెలుగు సాహిత్యం ఎలాంటి మార్పులకి లోనయ్యిందో, ఎలాంటి తెలుగు రచయితలు ఈ పరిణామాల నించి వెలుగులోకి వచ్చారో ప్రధాన చర్చనీయాంశం అని నా వుద్దేశం.

నా ఈ-చిరునామా ఇది:afsartelugu@gmail.com
Category: 1 comments

ఓ బెజవాడ అబ్బాయి అమెరికా కథ!



- యాళ్ళ అచ్యుత రామయ్య
అమెరికాలో స్థిరపడిన ఓ విజయవాడ అబ్బాయి ఆ రెండు సంస్కృతుల మధ్య వైరుధ్యాలను సమన్వయ పరుచుకుంటూ తను తెలుసుకున్న జీవిత సత్యాలను అందమైన కథలుగా మలచి తీసుకొచ్చిన పుస్తకమే రంగుటద్దాల కిటికీ. ఒక దశాబ్దకాలంలో ఎస్. నారాయణస్వామి రాసిన 21 కథల సంపుటి అది.

ఈ కథల్లో మంచి తెలుగు నుడికారం ఉంది. కథా వస్తువుకూ, నేపథ్యానికీ అనుగుణంగా శిల్పాన్నీ, భాషనీ, టోన్‌నీ, మూడ్‌నీ ఎన్నుకోవడం చూస్తే ప్రపంచదేశాల కథా సాహిత్యాన్ని ఈ రచయిత శ్రద్ధగా అధ్యయనం చేసి ఉంటాడనిపిస్తుంది. ఒక జనవరి శుక్రవారం లోకస్ట్‌వాక్ కార్నర్లో అనే కథ ఈ సంకలనానికి తలమానికం. దీనిలో చైతన్యస్రవంతి ధోరణిని రచయిత చాలా సమర్ధవంతంగా నిర్వహించారు. మంచి సందేశంతో కూడిన ఈ కథని చదువుతుంటే ఓ ఇరాన్ సినిమాచూసినంత భావోద్వేగానికి గురవుతాం.

వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన 1999 ఉగాది కథలపోటీలో మొదటి బహుమతి పొందిన తుపాకి కథ తుపాకితో ప్రారంభమై తుపాకితోనే ముగుస్తుంది. ఇలా ఆద్యంతాలను సమన్వయం చేయడంలోగాని కథా సందర్భానికి తగిన సీరియస్ వాతావరణాన్ని కల్పించడంలో గానీ ఈ రచయిత తీసుకున్న శ్రద్ధను వర్ధమాన రచయితలు గమనించాలి. ఈ కథ హృదయాన్నీ మెదడునీ ఏకకాలంలో కదిలిస్తుంది.

ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి అనే కథలో శీర్షిక, కథనం, సంభాషణలు, ప్రారంభం, ముగింపు, అన్నిట్లో కనిపించే వ్యంగ్యధోరణి అద్భుతంగా ఉంది. అయితే ఇంతమంచి కథల మధ్య కథా ప్రక్రియలోకి ఏమాత్రం ఒదగని గల్పిక / స్కెచ్ లాంటివి (ఉదా: నిరసన, ఆదా ..) ఉంచడం వలన జీడిపప్పు ఉప్మాలో ఇసుక తగిలినట్లనిపిస్తుంది. ఈ చిన్న లోపాన్ని పక్కన పెడితే కథా శిల్పంపై రచయిత సాధించిన పట్టును, తనదైన ప్రత్యేక దృష్టికోణంతో జీవితాన్ని దర్శించిన తీరును ఆస్వాదించడానికి ఈ కథలను శ్రద్ధగా చదవండి.


(కొత్త పాళీ గా అంతర్జాల లోకంలో ప్రసిద్ధులయిన కథకులు నారాయణ స్వామి "ప్రముఖా"ముఖి ఈ శుక్రవారం "అక్షరం" లో చదవండి)
Category: 0 comments

అమెరికా జీవితం వల్ల తేడాలు తెలిశాయి : నిడదవోలు మాలతి ముఖాముఖి

నిడదవోలు మాలతి - ఓటమి ఎరుగని కలం. ఆ మాటకొస్తే కలం కాలం నించి ఇప్పటి కీబోర్డు కాలం దాకా విరామమెరుగని కలం. రాత నుంచి కంప్యూటరు దాకా ఎంతో ఓపికగా, శ్రద్ధగా రూపాంతరం పొందడమే కాకుండా, రచనా స్వభావాన్ని కూడా కాలానుగుణంగా మార్చుకున్న మాలతి గారు అటు ఆంధ్రా, ఇటు అమెరికా తెలుగు జీవితాల మధ్య సామ్యాలనూ, సామరస్యాలనూ వెతికే ప్రయత్నం చేశారు. స్వీయ రచనల్లోనూ, అనువాదాల్లోనూ వొక నిష్టతో, నియమంతో పని చేస్తున్నారు. వయసూ, బతుకు బాధలతో నిమిత్తం లేకుండా ఎత్తిన కలం...(టచ్ చేసిన కీబోర్డు అనాలా?!) వదలకుండా, అన్ని అవరోధాలనీ జయించి రచయితగా తన ఉనికిని సదా కాపాడుకుంటున్నారు. అచ్చు లోకంలోనే కాకుండా, అంతర్జాల లోకంలో కూడా సుపరిచితమయిన పేరు నిడదవోలు మాలతి.






1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
వచ్చింది. అయితే అది అమెరికా రావడంవల్ల మాత్రమే కాకపోవచ్చు. సాధారణంగా జీవితంలో జరిగే అనేకసంఘటనలలో అమెరికా రావడం ఒకటి. అమెరికా రావడంవల్ల మరొక సంస్కృతిగురించి సవిస్తరంగా ఆలోచించుకోడానికి అవకాశం కలిగింది. విదేశీ సంస్కృతి, మనస్తత్త్వాలవిషయంలో అవగాహన మెరుగు పడిందనుకుంటాను ఇక్కడికి వచ్చేక.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
ఆమార్పు నేను అమెరికా వచ్చినతరవాత రాసిన కథలన్నిటిలోనూ కనిపిస్తుంది. ప్రధానంగా, ఏ సంస్కృతిలో కానీ వారి నైతికవిలువలు వారున్న వాతావరణం, సామాజికపరిస్థితులు ప్రాతిపదికగా ఏర్పడతాయి. వారి ఆలోచనాధోరణి వారి సామాజికచరిత్రలోనుండీ ఉదయిస్తుంది కనక ఈ రెండు సంస్కృతులలోనూ గల వైవిధ్యమూ, అంతర్గతంగా గల సామ్యాలూ ఎత్తి చూపుతూ రాయడానికి ప్రయత్నించేను,

నా ఈ అవగాహనకి మంచి ఉదాహరణ - రంగుతోలు కథ. మనకి రంగు కేవలం అందానికి సంబంధించినది అయితే, అమెరికాలో తొక్కరంగు జాతికి సంబంధించినది. ఇక్కడ “నల్లవాడు” అన్నపదంలో వాళ్ళ ఆర్థిక, సామాజిక, చారిత్ర్యక ఛాయలెన్నో ఉన్నాయి. దానితోపాటు, గత 50 ఏళ్ళుగా జరుగుతున్న సివిల్ లిబర్టీస్ ఉద్యమంమూలంగా, తొక్క రంగులో గల నెగిటివ్ ఇమేజిని తొలగించే ప్రయత్నం కూడా ఉంది. ఇది ఎత్తిచూపడానికి ప్రయత్నించాను రంగుతోలు కథలో.
అలాగే, కొత్తసీసా పాతసారా కథలో ఉమ్మడికుటుంబాలలో అనూచానంగా వస్తున్న జీవనసరళి అమెరికాగడ్డమీద ఎలాటి మార్పులకి (metamorphosis) లోనవుతుందో చిత్రించాను. అంతేకాదు. మనవారి ఈ ప్రవర్తనా, పరివర్తనా కూడా అమెరికనులు ఎలా అర్థం చేసుకుంటారో కూడా చూపించడానికి ప్రయత్నించేను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనలకి ఏ విధంగా భిన్నమయినవి?
ఈప్రశ్నకి కూడా సమాధానం పైజవాబులో కొంతవరకూ ఉంది. నాకథల్లో అక్కడా, ఇక్కడా కూడా నాచుట్టూ ఉన్న సమాజంలో మనుషుల తత్త్వాలని, నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలనీ, ఆ సమస్యలని పరిష్కరించుకునే తీరులో వైవిధ్యాన్నీ పరిశీలించి ఆవిష్కరించడానికే ప్రయత్నించాను. ప్రయత్నిస్తున్నాను. ఏపరిస్థితుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఆ ప్రవర్తనకి కారణభూతమయిన పరిస్థితులు ఏమిటి అనే నేను సదా ఆలోచిస్తుంటాను. అంచేత అమెరికా వచ్చినతరవాత నా మొట్టమొదటి కార్యక్రమం అమెరికా, ఆంధ్రా - ఈ రెండుసంస్కృతులలో గల వ్యత్యాసాలూ, సామ్యాలూ, వాటికి సంబంధించిన తాత్త్విక చింతనా - ఇవి పరిశీలించి చూసుకోడమే అయింది. అది కొంతైనా అర్థమయిన తరవాతే కథలు రాయడం మొదలు పెట్టేను. అమెరికన్ సమాజంలో, సంస్కృతిలో నాకు అర్థమయినవిషయాలే నాకథల్లో కూడా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇతివృత్తం దృష్ట్యా ఇది ఒక మార్పు.

రెండో మార్పు శైలిలో. కొందరు స్నేహితులు ఎత్తి చూపినతరవాతే నేను పరిశీలించి చూచుకొన్నాను. మొదట భాష చూడండి. మనదేశంలో ఉన్నప్పుడు రాసినకథల్లో సంస్కృత సమాసాలు ఎక్కువ. ఆ పద్ధతిలో నారచన సాగిస్తే, ఇప్పుడు నాకథల్లో ఇంగ్లీషు ఎక్కువ ఉండాలి న్యాయానికి. కానీ అలా జరగలేదు. ఇక్కడికి వచ్చేక పూర్వంకంటె మంచి తెలుగులో రాయాలన్న తపన నాకు ఎక్కువయింది. నిజానికి ఇంగ్లీషు మాటలు ఇప్పటికంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు రాసినకథల్లోనే ఎక్కువ.

శైలిలో మరొక అంశం వ్యంగ్యం. ఇండియాలో ఉన్నప్పుడు నాకథల్లో హాస్యం ఉంది కానీ వ్యంగ్యం లేదు. అది ఈమధ్య ఎక్కువగానే ఉంటోంది నాకథల్లో.

మూడోది రచన పట్ల నాదృష్టి. ఇండియాలో ఉన్నప్పుడు రచయితగా నాస్థాయి ఏమిటి అన్న స్పృహ నాకు ఉండేది కాదు. రాయాలనిపించింది రాయడం, పత్రికలకి పంపడంతో నా పని అయిపోయేది. ఇప్పుడు ఎవరు నన్ను రచయితగా గుర్తించడం లేదు? ఎందుచేత? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి కారణాలు అనేకం. నా పరిస్థితులూ, జీవితంలో, సమాజంలో, సాహిత్యంలో వచ్చినమార్పులూ - అన్నీ కలిసి నాలో ఇలాటి ఆలోచనలు కలిగిస్తున్నాయేమో. వయసు కూడా ఒక కారణం కావచ్చు. జీవితంలో చరమదశకి చేరుకున్నాక, “నేను నా జీవితంలో సాధించినదేమిటి?” అన్న ప్రశ్న రావడం సహజం కదా.

4. అమెరికాలో వున్న తెలుగురచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
తెలుగురచయితగా నాకు రెండు శాఖలున్నాయి. 1. స్వీయరచనలు, 2. అనువాదాలు.
స్వీయరచనల్లో తెలుగులో నేను రాసిన తెలుగుకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. ఇంగ్లీషుఅనువాదాల్లో నారచనలతోపాటు ఇతర రచయితలకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. విశేషంగా కాకపోయినా కొన్ని కవితలు కూడా రాశాను. నాకృషి ఇంత విస్తృతంగా ఉండగా, ఈనాటి రచయితలు “మాలతి అనువాదాలు చేస్తోంది” అని నా మొత్తం వ్యాపకాలని ఒక్క వాక్యానికి కుదించేయడం నాకు అయోమయంగా ఉంది.

భవిష్యత్తుమాటకొస్తే, నాకు భవిష్యత్తు అమెరికాలోనూ లేదు, ఇండియాలోనూ కూడా ఉన్నట్టు కనిపించడంలేదు.
అంతర్జాలంలో నా వెబ్ సైట్, http://thulika.net, నా బ్లాగు http://tethulika.wordpress.com
నాకు గర్వకారణం కావాలి. మొదట, తూలిక.నెట్‌ గురించి చెప్తాను. ఈ సైటులో నాధ్యేయం ఉత్తమ తెలుగుకథలని అనువదించి తద్ద్వారా మనసంస్కృతిని విదేశీ పాఠకులకి తెలియజేడం. ఈ కారణంగానే తూలిక.నెట్ కొన్ని యూనివర్శిటీ సైటులదృష్టిని ఆకర్షించింది. ఉదా. http://www.intute.ac.uk/cgi-bin/search.pl?term1=thulika.net&submit=Search&limit=0&subject=All (Great Britain). కొన్ని ప్రముఖ సైట్స్ నా వ్యాసాలని వారి సైట్లలో మునర్ముద్రించుకున్నారు.
ఉదా. www.driftline.org. (University of Iowa, Bowling Green, Iowa),
http://www.india-forum.com/forums/
ఇలాటి గుర్తింపులవల్ల నాతరవాత తూలిక.నెట్ భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచన నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. నాకు సన్నిహితురాలు, వర్థమాన రచయిత్రి అయిన వి. బి. సౌమ్యని (పుస్తకం.నెట్), అడిగితే, తాను ఆ బాధ్యత స్వీకరించడానికి అంగీకరించింది. ఇది నాకు కొంత సాంత్వన కలిగించినవిషయం. మరి ఆమెచేతిలో తూలిక ఎలా రూపు దిద్దుకుంటుందో మీరే చూసుకోవాలి.

తూలిక.నెట్ నేను ఒక్కదాన్నీ చేపట్టిన కార్యక్రమం. అమెరికాలో తెలుగు సాహిత్యానికి విస్తృతంగా సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వివిధ సాహిత్యసంస్థలు ఈ నా ప్రయత్నానికి తగిన మద్దతు ఇచ్చి, విజయవంతం చేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు.
ఎందుకంటే, ఈనాడు సాహిత్యక్షేత్రం కూడా ఒక వ్యాపారమే. అన్ని వ్యాపారాలలోలాగే సాహిత్యంలో కూడా అవే నీతులకి ప్రాముఖ్యత. అంటే - p.r. work , people skills, పెట్టుబడిదారీ ధోరణీ (చందాలూ, రిజిస్ట్రేషను ఫీజులూ, నానా సంస్థల పెత్తందారులతో భేటీ) లాటివి. నావ్యక్తిత్వంలో ఆ పోకడలు లేవు. నాకు ఆ సామాజికస్థాయి కూడా లేదు. ఈ సాహిత్య ప్రముఖుల ఎజెండాలలో, ఇజాలజాలంలో పడి కొట్టుకుపోయే బలం కూడా లేదు.
అంతకంటే ప్రబలకారణం - కొందరు సాహిత్య ప్రముఖులకి, ముఖ్యంగా అమెరికా తెలుగు సాహితీ ప్రముఖులకి, నేను నావ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు బాధాకరం అయేయి అనుకుంటాను. అంచేత కూడా వీరిదృష్టికి కూడా నేను ఆనలేదు. అపార్థం చేసుకోకండి. నానా సంఘాలూ, సంస్థలూ నన్ను వారిసభలకి పిలిపించి దుశ్శాలువాలు కప్పాలనీ, విశిష్టసేవా పురస్కారాలు నాకు ఇవ్వాలనీ నేను కోరడం లేదు.
నేను ఏధ్యేయంతో తూలిక.నెట్ స్థాపించేనో ఆ ధ్యేయాన్ని బలపరచడానికి మన తెలుగుసంఘాలూ, సాహిత్యాధినేతలూ (నేను తెలుగుకి ఎంతో గొప్పసేవ చేస్తున్నానని నామొహంమీద పొగిడేవాళ్ళతో సహా) ఈ సైటుకి ప్రత్యేకించి ఇస్తున్న మద్దతు ఇదీ అని చెప్పడానికి నాకేమీ కనిపించడం లేదు అని అంటున్నాను. ఆ సంఘాల ప్రత్యేకసంచికలలో ప్రచురించే వ్యాసాలూ, సాహిత్య సభల్లో ఇచ్చే ఉపన్యాసాలూ చూస్తే మీకే అర్థమవుతుంది ఈమాటల్లో యథార్థం.

పోతే, తెలుగు తూలిక విషయం - నేను 2007 డిసెంబరులో మొదలు పెట్టేను. ఈ బ్లాగుద్వారా ఈనాటి యువతరం పాఠకులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వారికి నేనెవరో, నా బతుకేమిటో తెలియదు. నన్ను కేవలం మరొక బ్లాగరుగా మాత్రమే గుర్తించి, నాకథలనీ, కబుర్లనీ, వ్యాసాలనీ చదివి, నాసాహిత్యాన్ని నిష్కల్మషంగా ఆదరిస్తున్నారు. తెలుగు తూలిక చదివే పాఠకులలో బ్లాగరులు కానివారు కూడా చాలామందే ఉన్నారు. వీళ్ళంతా ఈనాటి పాఠకులు కనక వారి ఆదరణ నాకొక ప్రత్యేకగౌరవంగానే భావిస్తున్నాను.
తెలుగుతూలికద్వారా కూడా నేను ఇంతకుమించి చెయ్యగలిగింది ఏమీ లేదు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంరంభంలో నాకు రవంత నిరాశ కలిగిస్తున్నది నేను చర్చలకి పెట్టిన అంశాలలో పాల్గొనేవారు ఎక్కువమంది లేకపోవడం. ఎందుచేతో తెలీదు మరి.

చివరిమాటగా బ్లాగ్ రచనలగురించి - బ్లాగులలో ప్రచురించేరచనలకి సాహిత్యస్థానం ఉందా లేదా అన్నవిషయంలో - నా అభిప్రాయం చెప్తాను. సూక్ష్మంగా చూస్తే, బ్లాగులలో రెండు రకాల సాహిత్యం కనిపిస్తోంది. మొదటిది - నలుగురు కూడి మాటలాడుకునేవేళ తమ సహజధోరణిలో చెప్పుకునే కబుర్లలాటివి. దీన్ని సుమారుగా జానపదవాఙ్మయంతో పోల్చవచ్చు. రెండోరకంలో చేర్చదగ్గవి శిష్టజనవ్యావహారికంలో, ఎకెడమీకానికి బెత్తెడు ఎడంగా వస్తున్న కవితలూ, కథలూ, సాహిత్యచర్చలు. ఉదాహరణకి, భైరవభట్ల కామేశ్వరరావు, పి. సత్యవతి, మీరు, కల్పన - మీబ్లాగుల్లో కనిపించే రచనలు. (ఇక్కడ తెలుగు తూలిక కూడా చేర్చవచ్చుననుకుంటాను). ఈ రచనలు కేవలం బ్లాగుల్లోనే కనిపించినా వీటికి సాహిత్యవిలువ లోపం ఏమీ లేదు. అలాగే పుస్తకాలగురించి వి. బి. సౌమ్య, అనేక సాంకేతికవిషయాలు వివరిస్తున్న వీవెన్ ... ఇలా ఎందరో ఎంతో మంచి విషయాలు అందిస్తున్నారు. వీరి రచనలు ఏ పత్రికలలో రచనలకీ తీసిపోవు.

అసలు బాధ ఏమిటంటే, మనకి వ్యక్తిపూజలే కానీ వస్తునిష్ఠ లేదు. రచయితపేరుని బట్టి, అది అచ్చయిన పత్రికపేరుని బట్టీ రచనవిలువ నిర్ణయించడం మన రాచరికపుసంప్రదాయమేమో మరి. ఏమైనా, రచనని మాత్రమే రచనగా తీసుకుని విశ్లేషిస్తే, మన సాహిత్యం మెరుగు పడే అవకాశం ఉంది.
Web Statistics