Monday, July 14, 2025

పూర్తి కాని వాక్యాలు



ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-  

1

         రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!

         సాయంత్రం అయిదు గంటలకు స్కూలు నుంచి వస్తుంది. అప్పటికి అమ్మీ రెడీ చేసి పెట్టిన  చాయ్  తాగుతూ అమ్మీతో కాసేపు కూర్చుంటుంది. ఏమీ వుండదు మాట్లాడుకోడానికి! చాలా వరకు నిశ్శబ్దమే. కానీ, కలిసి చాయ్ తాగితే వంద కబుర్లు చెప్పుకున్నట్టే. కాసేపు టీవీ చూస్తారు. ఆ తరవాత భోజనం, సబీనా స్కూలు పిల్లల హోం వర్కులు దిద్దుకుంటూ వుంటుంది. లేదా  ఏదో పుస్తకం పట్టుక్కూర్చుంటుంది.  ఏం చదువుతుందో కూడా తెలీదు చాలా సార్లు. వాక్యాలు తెగిపోతూ కనిపిస్తాయి, ఏ అర్థాన్నీ చేరుకోకుండా.

            అమ్మీ రాత్రి నమాజ్ ముగించుకుంటే ఆ రోజు ఇక ముగిసినట్టే. ఆ తరవాత ఇద్దరూ ఒకే మంచమ్మీద పడుకుంటారు. సబీనాకి ఊరికే నిద్రపట్టదు. రెండు మాత్రలు తప్పనిసరి. అమ్మీకి ఆ వెలితి ఖురాన్ లో ఒక అధ్యాయం చదువుకోవడంతో తీరిపోతుంది. నిద్ర వస్తుందో రాదో తెలియదు గాని, మంచమ్మీదకి వొరిగిపోయి, కళ్ళు మాత్రం మూసుకుంటుంది.

            అయిదేళ్లుగా  ఇదే. అవే ఉదయాలూ, సాయంత్రాలూ. ఇందులో ఏది తప్పినా బతుకు గాడితప్పిందని ఇట్టే తెలిసిపోతుంది. ఈ సాయంత్రం అదే జరిగింది.

            సబీనా ఇంటికొచ్చింది. అమ్మీ ఎదురురాలేదు. తలుపు తోసుకొని, తిన్నగా వంటింట్లోకి వెళ్లింది. అమ్మీ లేదు. పడగ్గదిలోకి వెళ్లింది. అక్కడా లేదు.

            నిస్సత్తువగా అనిపించి, ముందు గదిలోకి పరిగెత్తుకువచ్చింది.  వున్నట్టుండి సోఫాలో కూలబడిపోయింది సబీనా. ఇంకేవేవో ఆలోచనలు కూడా చుట్టుముట్టి, వుక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, ధనత్తకి ఫోన్ చేసింది.

             పోయినేడాది ఒక శుక్రవారం సాయంత్రం తను స్కూలు నించి వచ్చేటప్పటికి ఇంట్లో ఓ కొత్త మనిషి కనిపించింది. అలా ధనత్త అమ్మీకి కొత్త పరిచయమే.  ఇద్దరబ్బాయిలూ అమెరికాలో మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో వున్నారు. ధనత్తకి కావాల్సినవన్నీ సమకూర్చి ఎప్పుడో ఒకసారి వచ్చివెళ్తుంటారు. ధనత్త కూడా ఒక్కటే కాబట్టి, అమ్మీకి కాస్త కబుర్ల తోడు. అటూ ఇటూగా అమ్మీ వయసే- కానీ, మనిషి ఇంకాస్త చలాకీగా వుంది. కొడుకులు స్థిరపడి, అన్నీ చూసుకుంటున్నారన్న నిశ్చింత ఆమెలో కనిపిస్తుంది.

             ఆ మాటకొస్తే,  అమ్మీ కూడా తక్కువ చలాకీ ఏమీ కాదు. ఇప్పటికీ తెల్లారి మూడున్నర కాగానే ఠంచనుగా లేచి, పొద్దుటి నమాజుకి రెడీ అవుతుంది. ఇన్నేళ్ల జీవితంలో ఏనాడూ ఒక్క నమాజు అమ్మీ తప్పలేదు. ఆ తరవాత కనీసం రెండు అధ్యాయాలు ఖురాన్ చదివి, కూతురు  ఎప్పుడు నిద్ర లేస్తుందా అని చూస్తూ వుంటుంది. ఆ కొద్దిసేపట్లో ముందు గదికొచ్చి కాసేపు సర్దడమో, బయట పెంచుకుంటున్న నాలుగైదు మొక్కలకు నీళ్ళు పోస్తూనో, వాటి లేత చిగుర్ల వైపు పరీక్షగా చూస్తూనో గడిపేస్తుంది.

            “అమ్మీ! అంత పరీక్షగా ఏం చూస్తావు ఆ మొక్కల వైపు? అవి నిన్నటికీ ఇవాళ్టికీ పెద్దేమీ పెరగవు కదా?” అంటే, “నీకు తెలీదు. నాకు తెలుస్తుంది. కొంచెం పెరిగినా సరే!” అంటుంది. నలుగురు కొడుకుల్నీ, ఇద్దరు కూతుళ్లనీ కనీ పెంచిన తల్లికి ఏం చెప్తుంది సబీనా?! తనకి పెంచడం అంటే ఏమిటో తెలీదు కదా! తెలిసే అవకాశం ఆ దేవుడు ఇవ్వలేదు. ఆ అవకాశమే వుండివుంటే, వాహిద్ తో కాపురం నిలబడేదేమో! ఏమో, తెలీదు. వాహిద్ కి రెండేళ్ళు పట్టింది, వాళిద్దరికీ పొసగదని  తెలుసుకోడానికి.

            ఎందుకో సబీనాకి ఇప్పటికీ అర్థం కాలేదు. “పిల్లలు పుట్టకపోవడమే కారణమా?” అని పదిసార్లు వాహిద్ నే అడిగింది. వాహిద్ వెళ్లిపోయాక అమ్మీని కూడా అడిగింది. అదీ మొదట్లోనే కానీ ఆ తరవాత అడగడం మానేసింది. తను చేసిన పెద్ద తప్పు దగ్గిర వాళ్ళు కదా అని అతనికిచ్చి పెళ్లి చేయడం అని అమ్మీ బయటికే చెప్పేది. చివరికి “ఈ కాలం పిల్లలు నాకు అర్థం కావడం లేదమ్మా!” అనేది.

             “నేను అర్థమవుతున్నానా మరి?!” అని సబీనా అడిగితే, మౌనంగా తలదించుకునేది. ఆ తరవాత వాళ్ళిద్దరి మధ్యా ఆ చర్చ లేదు. ఒకసారి మాత్రం కొడుకుల ప్రస్తావన వచ్చినప్పుడు “నేనెవ్వరికీ అర్థం కావడం లేదేమో!” అని మళ్ళీ  అంది. వాళ్ళ నిర్లక్ష్యమూ, తనని పట్టించుకోని వాళ్ళ స్వార్థమూ లోలోపలే తలచుకొని, “అయినా వాళ్ళని అనుకొని  ఏం ఫాయిదా?! నా కడుపే అలాంటిది. కనడం, పెంచడం వరకే!” అని ఢీలా పడ్డప్పుడు సబీనా  అమ్మ కడుపులో తలదాచుకొని వుండిపోయేది. “నేనున్నాలే!” అంటూ-

            ధనత్తకి ఫోన్ చేసింది. ఎత్తడం లేదు. “ఫోన్ ఎత్తనే ఎత్తదు ఈ ధన! ఆ మాత్రం దానికి అది చేతుల్లో పట్టుకొని తిరగడం ఎందుకూ!” అని ఒకటి రెండు సార్లు అమ్మీ కూడా విసుక్కుంది.

            “అయినా, మధ్యలో నీకు ఫోన్ చేసే తీరిక వుందా, అమ్మీ!”

            “వుంటుంది. ఒక్కోసారి మధ్యాన్నం ఏమీ చేయాలనిపించదు. ఎంతసేపని నమాజులూ, ఖురాన్లూ – కాసేపు ఎవరితోనైనా మాట్లాడాలని వుంటుంది.”

            సబీనాలో ఈ “ఎవరితోనైనా మాట్లాడాలని వుంటుంది” అన్న కోరిక చచ్చిపోయి అయిదేళ్లయింది. అప్పటికి వాహిద్ వెళ్ళిపోయి రెండేళ్ళు. ఆ మనిషి ఆమె జీవితంలోకి ఎందుకొచ్చాడో, ఎందుకు వెళ్లిపోయాడో తెలీదు. అన్నలతో పాటు లోకం కూడా రకరకాలుగా అనుకొని, చివరికి నింద ఆమె  మీదనే  మోపి, తృప్తిపడింది.  ఎలాంటి మగవాడన్నది ప్రశ్న కాదు, కానీ, ఏదో ఒక మగవాడి నీడ లేని ఆడది అంటరానిదే అని అర్థం కావడానికి ఎక్కువకాలమేమీ పట్టలేదు. అందరితోనూ కావల్సినంత దూరం పెరిగిపోయింది. అన్నలు కనీసం తలెత్తి చూడడం లేదు. ఆ విడాకులు కేవలం సబీనా తప్పే అని వాళ్ళు ఖాయం చేసేసుకున్నారు. వదినలు సరే! ఇక స్కూల్లో స్నేహితులు అంటూ ఎవరూ లేరు.  అనేక రకాలుగా ఆమె బతుకు వాళ్ళకి గుసగుస కబుర్ల సరుకు. అప్పుడప్పుడూ ఆమె పేరూ, ఆమెకి సంబంధం లేని వేరే వేరే వ్యవహారాలు ఈ మధ్య బాగానే తోడయ్యాయి. “వాళ్ళు అంతేలే! అలాగే వుంటారు” అని చివర్లో తీర్పులు.

            పాఠాలు చెప్పుకోవడం, ఇంటికి రావడం మధ్యలో ఇంకో లోకం వుందనీ, ఇచ్చిపుచ్చుకోడాలు వుంటాయని దాదాపూ మరచిపోయింది సబీనా.

            “మాట్లాడాలని నీకు వుండదా? కనీసం ఎవరో ఒకరితో!” అని ఒక సందర్భంలో అమ్మీ అడిగింది కూడా. “నువ్వున్నావ్ కదా, చాలు!”

            అది చాలదు అని అమ్మీకి తెలుసు, సబీనాకి కూడా తెలుసు. కానీ, ఈ లోకాన్ని తట్టుకునే శక్తి ఇక లేదు అనుకున్న తరవాత అందరినీ తెంపేసుకుంటూ వచ్చింది. ఆ తరవాత వాళ్ళు కూడా తెగిపోయి, ఎటో వెళ్ళిపోయారు.

            మరోసారి ధనత్తకి ఫోన్.

            అమ్మయ్య! దొరికింది!

            అవతల ధనత్త “ఏమ్మా?” అని పలకరించింది. అమ్మీ అక్కడే వుండి వుండాలని గట్టి నమ్మకం.

            “అమ్మ  రాలేదమ్మా! సందు చివరకి వెళ్ళి ఒకసారి చూసి రా. వూరికే వాక్ లాగా వెళ్ళిందేమో?! అయినా నేనూ వస్తా వుండు” అని పెద్ద దూరమేమీ కాదు కాబట్టి పావుగంటలో వచ్చేసింది ధనత్త.

            ఇద్దరూ కలిసి రోడ్డు ఎక్కారో లేదో, ఎవరో అమ్మీతో ఎదురొచ్చారు. చూడగానే అమ్మీని గట్టిగా కావిలించుకుంది సబీనా. లోపల ఏడుపు కూడా వచ్చేస్తోంది కానీ, అన్ని వుద్వేగాలనీ అణచిపెట్టుకోవడం అప్పటికి బాగానే అలవాటైంది. ధనత్త కూడా అమ్మీ రెండు చేతులూ పట్టుకొని, “బాగా కంగారు పడుతున్నాం బీబీ” అంది.

            అమ్మీ కళ్ళల్లో ఏ భావమూ లేదు,  పిచ్చి చూపులు తప్ప-  ఏదో చెప్పబోతోంది, చెప్పలేకపోతోంది, ఈ లోపే ఆ నడివయసు వ్యక్తి చెప్తున్నాడు:

            “దారి తప్పినట్టున్నారండీ. అడ్రస్ చెప్పలేకపోతున్నారు. నలుగురినీ అడుగుతూ ఈ దారిన తీసుకొచ్చా.” అమ్మీ దారి తప్పడం ఏమిటో నమ్మలేకపోతోంది సబీనా. చిన్న చిన్న విషయాలు మరచిపోవడం కొంతకాలంగా తెలుసు కానీ, మరీ ఇల్లు మరచిపోయేంతగా తెలీదు.

“చాలా థాంక్స్ అండీ” అంది సబీనా.

“కొంచెం జాగ్రత్తండీ” అని చెప్పి వెళ్లిపోయాడా వ్యక్తి. ఆ తరవాత ధనత్త ఇంటి దాకా తోడొచ్చి, కాసేపు కూర్చుంది. అప్పటికీ అమ్మీ ఏమీ మాట్లాడలేదు.

“అమ్మీ చెప్పు. ఎక్కడికెళ్లావు?!” అని ఒకటి రెండు సార్లు అడిగి, ఊరుకుంది సబీనా. లోపలికి తీసుకెళ్లి, మంచమ్మీద పడుకోబెట్టింది. ఏ చలనమూ లేని బొమ్మలా వుంది అమ్మీ. వెళ్తూ, వెళ్తూ  ధనత్త అంది:

“బేటా, నువ్వు నా కూతురులాంటిదానివే. ఇవాళ కాదు కానీ, రేపు నీతో కాస్త మాట్లాడాలి.”

ధనత్తకి అమ్మీ విషయమో, తన విషయమో ఏదో కాస్త ఎక్కువ తెలుసు అని ఆ క్షణంలో అనిపించింది. కానీ, నోరు విప్పి అడగలేదు సబీనా.  సరే అని మాత్రం అనగలిగింది.

ధనత్త వెళ్ళిపోయిన తరవాత, సోఫాలో కూలబడి, ఏమీ తోచక,  టీవీ ఆన్ చేసింది.  దృష్టి నిలవక, కట్టిపడేసింది.

రేపు ధనత్త ఏం మాట్లాడుతుందో– అన్న ఆలోచన సబీనా మనసులో నలుగుతూనే వుంది. ఈలోపు అమ్మీ విషయం ఏమిటో అన్న దిగులు అంతకంటే ఎక్కువగా సలుపుతోంది. వూళ్ళో ఎక్కడ దిగబెట్టినా  హాయిగా తిన్నగా ఇంటికొచ్చేస్తుంది అమ్మీ. అలాంటిది- ఇవాళ ఏమైంది?

 పడగ్గదిలోంచి ఏవో మాటలు వినిపించి, ఆలోచిస్తూనే ఆ గదిలోకి  అడుగుపెట్టింది సబీనా.

2

“పిల్లలు లేరు, దిక్కూ మొక్కూ  లేదు. కనీసం పలకరింతకు! ఈ చిన్నమ్మాయి ఎలాగో ఈడ్చుకొస్తోంది- పెళ్లీ, పిల్లల్లేకుండా -  దానికి నేనూ, నాకు అదీ- ఎంతకాలం!?”

పక్కకి తిరిగి పడుకునే వుంది అమ్మీ, ఎవరినో గుచ్చిగుచ్చి అడుగుతోంది. ఎవరిని?! ఎదురుగా లేని వ్యక్తితో ఎంతసేపటి నుంచి, ఎంత కాలం నుంచి ఇలా మాట్లాడుకుంటోంది?! అలా చీకట్లో కూర్చొని అమ్మీని చూస్తున్నప్పుడు దిగాలుగా అనిపించడం ఒకటి. అమ్మీకి తనకీ మధ్య పెరిగిన దూరంలోని బాధ ఇంకొకటి. ఈ కొద్దికాలంగా అమ్మీని దగ్గిరగా గమనించే సమయమే తీసుకోలేదు. అలా తీసుకోలేదు అనడం కంటే అలా ఆలోచించేకొద్దీ పెరుగుతూ పోయే ఒంటరితనంలోని లోటు ఆమెని భయపెడుతోంది. ఇప్పుడీ స్థితిలో అమ్మీని చూస్తూంటే, నానీమా గుర్తొస్తోంది.

నిద్రలోనే ఇంకా ఏదో అంటోంది అమ్మీ. “నా కడుపు బంజరైపోయింది. దాని బతుకూ బంజరు నేల చేశాను”

లేదమ్మీ. నేను పర్లేదు. నాకే దిగులూ లేదు,” అని నిద్రలేపి గట్టిగా చెప్పాలనిపించింది. మామూలుగా మెలకువగా వున్నప్పుడు అమ్మీ నోట ఇలాంటి ఓటమి మాటలే రావు. అమ్మీ కూడా తనలాంటిదే. లేని ధైర్యాన్నీ, భరోసానీ చూపిస్తూ వుంటుంది.

 సబీనా మొబైల్ తీసి, ఫోటో ఆల్బమ్ లోకి తొంగిచూసింది. అలా ఆల్బమ్ తీసి, గతాన్ని వెతుక్కోవడం మానేసి చాలా కాలమే అయింది. ఒకే ఒక్క ఫోటో దగ్గిర సబీనా చూపు నిలిచిపోయింది. తెలుపూ నలుపూ ఫోటోలో కనీసం ఇరవై మంది కిక్కిరిసి వున్న ఫోటో. మధ్యలో నానీమా, నానాజాన్  చుట్టూ మామయ్యలూ, అత్తయ్యలూవెనక వరసలో అమ్మీ. తన చేతుల్లో పెద్ద కొడుకు. అప్పటికి సబీనా గానీ, మిగిలిన అన్నయ్యలూ, అక్కయ్య కానీ పుట్టలేదు. ఎంత ముద్దుగా వున్నాడో పెద్దన్న అన్వర్! అటు నానీమా నుంచి దాదీమా దాకా వాణ్ని అలవికాని ముద్దూ మురిపెంతో  పెంచారు.

            సబీనా బీ యిడి అయ్యాక ఇంటికొచ్చినప్పుడు నానీమా వీపు మీద కాలితో తంతున్నాడు అన్వర్. ఏమీ అనలేక అసలేం జరుగుతుందో తెలీక, తల వెంట్రుకల చిక్కులు విడదీసుకుంటూ ఒక మూల కూర్చొని వుంది నానీమా. రాగానే అతని చెయ్యి గట్టిగా పట్టుకొని, “భాయీ, ఏమిటిది?!” అని కేకేసింది సబీనా.

“నీకు తెలీదు. దారితప్పి ఎటేటో పోతోంది. వెతుక్కు రాలేక చస్తున్నాం ఈ ముసల్దానితో! ఇంటిపట్టున వుండి, రెండు మెతుకులు తిని ఒక మూలన పడివుండచ్చుగా!” అని తన చెయ్యి విదిలించుకొని, నానీమా వీపు మీద కాలితో బలంగా తన్నాడు. నొప్పికి కాస్త మూలిగి, మళ్ళీ తల వెంట్రుకల చిక్కులు తీసుకుంటూ వుండిపోయింది నానీమా.

ఏమీ అనలేక అమ్మీ వైపు చూసింది సబీనా. అప్పుడే చాయ్ చేసిందేమో, అందరికీ కప్పులు రెడీ చేస్తోంది అమ్మీ. “ఏంటమ్మీ ఇది!?”

“ఇది రోజూ వుండే రామాయణమే. నానీమాకి ఏమీ గుర్తుండడం లేదు. వీళ్ళేమో విసుక్కుంటున్నారు.”

“అదేమిటి, అమ్మీ?!”

            నానీమా అంటే మొదటి నించీ సబీనాకి ప్రాణం. ఎన్నో అనుభవాల విలువైన పుస్తకం నానీమా జీవితం. ఇప్పటికీ ఇంట్లో బాగా నెమరేసుకునే తెలంగాణ పోరాట కథల్లో నానీమా అనామకంగా మిగిలిపోయిన వీరనారి. ఆ కాలంలో నానాజాన్  పార్టీ కొరియర్. పెద్ద మామయ్య ప్రజానాట్యమండలి గాయకుడు. పెద్దమ్మ దాదాపూ మిలటరీకి చిక్కి, తప్పించుకొచ్చింది. ఇంట్లో నిరంతరం పార్టీ వాళ్ళు. సమావేశాలూ. వీళ్ళందరికీ వండీ వార్చి, ఎప్పుడూ ఏ లోటూ లేకుండా చూసుకుంది నానీమా. అటు పార్టీ, ఇటు ఈ పెద్ద కుటుంబం.

            అమ్మీ ఇచ్చిన చాయ్ కప్పు తీసుకొని, నానీమా దగ్గిరకెళ్లి కూర్చుంది. చాయ్ కప్పు చేతుల్లో పెడితే, ఎవరూ అన్నట్టు చూసింది నానీమా.

“నానీమా, నేను సబీనా!”

            తన పేరు వింటే ఎక్కడ వున్నా గంతులేసే ప్రేమ నానీమాది. అలాంటిది ఇప్పుడు రెండు మూడు సార్లు పేరు చెప్పినా, పిచ్చి చూపులు తప్ప సమాధానం లేదు.

“ముసలిదానికి ఏమీ గుర్తులేదే! నువ్వేం చేసినా ఫాయిదా లేదు. ఎవరో లాపతా బిచ్చగత్తే ని ఇంట్లో వుంచుకున్నట్టే!” అన్నయ్య అంటున్నాడు.

ఇంత అన్యాయంగా మాట్లాడడం సహించలేకపోతోంది. లోపల్నించి కోపం తన్నుకొస్తోంది. “భాయీ, ప్లీజ్. ఏమీ అనొద్దు. నువ్వు కాసేపు బయట కూర్చో!” అనడం తప్ప ఏమీ అనలేకపోయింది.

            ఇది జరిగిన పదిహేను రోజులకు నానీమా రోడ్డు పక్కన ఎక్కడో నిజంగానే బిచ్చగత్తలాగానే చనిపోయింది. అదీ చనిపోయిన గంట తరవాత తెలిసింది, వెతుక్కుంటూ వెళ్తే.

            అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఒకే ప్రశ్న అమ్మీని అడుగుతూనే వుంది. “అమ్మీ, నానీమా కథ అలా ముగియడం ఎందుకు?”

            మనసు ఎంతగా  మూలిగిందో, కొన్నాళ్ళకు అమ్మీ అంది. “అంతే! రేపు నా కథ, నీ  కథ కూడా  అలాగే ముగుస్తుంది. మనం పెద్ద పెద్ద కుటుంబాల్ని పోషిస్తాం.  కుటుంబం కోసం ఎన్నీటినో నెగ్గుకొస్తాం. ఇలాంటి స్థితి ఒకటి దాపురించినప్పుడు అందరూ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నశవాన్ని పెట్టుకున్నట్టు చూస్తారు. శవాన్ని ఎలాగోలా వదిలించుకోవాలి,” అంది అమ్మీ.

            ఇప్పుడు నిద్రపోతున్న అమ్మీ ప్రశాంతమైన కళ్లలోకి చూస్తున్నప్పుడు, మధ్యమధ్యలో ఆమె నిద్రని తెంపేస్తూ వుబికొస్తున్న అసంపూర్తి వాక్యాల్ని వింటున్నప్పుడు- అమ్మీ మాటలే గుర్తొస్తున్నాయి. ఫోటోలో ఆమె మూడు పదుల వయసున్న ముఖంలోని చిరునవ్వే గుర్తొస్తోంది. ఆ చిరునవ్వుకి తెలుసా తన చివరి క్షణం!? ఏమో!

            రేపు మాట్లాడుకుందాం అని ఈ సాయంత్రం  వెళ్లిపోయింది కదా ధనత్త- రేపు ఏం మాట్లాడుతుందో అనుకుంటూ  ఎప్పటికో నిద్రలోకి జారుకుంది, ఎప్పట్లానే రెండు మాత్రల తరవాత.

3

            ఎందుకో మెలకువ వచ్చి, చూసేసరికి పక్కన అమ్మీ లేదు. ఫోన్ లోకి చూసుకుంటూ, దిగ్గున లేచి కూర్చుంది సబీనా. మూడు గంటలయింది. పరుగున బాత్ రూమ్ లోకి వెళ్తే, తలుపు తీసే వుంది. బాత్ రూమ్ లో అమ్మీ. టాయిలెట్ లో కాకుండా స్నానం చేసే చోట కూర్చొని మూత్రం పోసుకుంటోంది. తనని చూసి, ఉలిక్కిపడి చూసింది.

“అమ్మీ! నన్ను లేపచ్చు కదా!” అంది కొంచెం విసుగ్గా.

            అమ్మీని తీసుకొచ్చి, మళ్ళీ మంచమ్మీద పడుకోబెట్టింది. ఇప్పటిదాకా అందరినీ నానీమా పసిపిల్లల్లా చూసుకుంది. ఇప్పుడు మనమే నానీమాని పసిపిల్లలా చూసుకోవాలి,” అని ఒకసారి అమ్మీ అన్నమాటలు ఇవాళ అమ్మీ దగ్గిరే తను పైకే అనుకుంది.

            మంచమ్మీద పడుకోబెట్టగానే పసిపిల్లలా ముసుగు కప్పుకొని పడుకుంది అమ్మీ. నిద్రపట్టక, ముందుగదిలోకి వచ్చి, కూర్చుంది సబీనా.  ఎప్పుడూ అలవాటు లేనిది- చాలా యాంత్రికంగా లేచి, ముఖం కడుక్కొని, వజూ అయిందనిపించి, ఫజర్ నమాజ్ కి నిలబడింది. తన దినచర్య మారిపోతోందా తనకి తెలియకుండానే?! ఏమో!

            నమాజ్ అయ్యాక కూర్చొని రెండు చేతుల్ని దగ్గిరకి తీసుకొని, ఫాతెహా చదువుతున్నప్పుడు కడుపులోంచి ఏడుపు తన్నుకొస్తోంది. తన ఏడుపు తనకే వినిపించి చాలా కాలమే అయింది అనుకుంది సబీనా. నానీమా అనేది “ఫాతెహా చదివేటప్పుడు వెక్కివెక్కి ఏడుపు వచ్చిందంటే నీ మొర ఆలకించడానికి అల్లా సిద్ధంగా వున్నాడని అర్థం.” ఆ వెక్కి వెక్కి ఏడవడం నానీమా భాషలో ఉర్దూలో గిడ్ గిడాకే రోనా- అదే ఇప్పుడు. ఫాతెహాలో చివరి వాక్యాలు పెద్దగానే అని, మళ్ళీ ఏడుస్తూ వుండిపోయింది. కూర్చున్న చోటే వుండిపోయి, ఖురాన్ తెరిచింది, ఏ అధ్యాయం వస్తే అది చదవడానికి-

            కాసేపు చదువుకొని, మళ్ళీ పడగ్గదిలోకి వచ్చింది. అమ్మీ ఇంకా లేవలేదు. ఫజర్ నమాజ్ వేళకి ముందే లేచి తన పద్ధతిలో తన దినచర్యలోకి వెళ్లిపోతుంది. పక్కన పడుకోబోతూ, అమ్మీని లేపాలా వద్దా అని సంశయిస్తూ, నెమ్మదిగా అమ్మీ భుజమ్మీద చేయి వేసింది సబీనా. చెయ్యి దగ్గిరకి తీసుకుంది అమ్మీ. అదీ కొంచెం పట్టించుకోమనే పసిపిల్లలానే- సబీనాకి నిద్రరాలేదు కానీ, అమ్మీ వైపే చూస్తూ కూర్చుంది.ఆ చూపుల్లో ఎప్పటికీ తోడు వుంటానన్న గాఢమైన నమ్మకం. దిగులేమీ లేదన్న కొండంత భరోసా అమ్మీ పడుకున్న భంగిమలో-

            పొద్దున్న లేవగానే తానే అమ్మీకి చాయ్ చేసిపెట్టాలి అని తనకి తాను గట్టిగా చెప్పుకుంది సబీనా. మరునాడు పొద్దున లేచీ లేవకుండానే ఫోన్ మోగింది. తెలియని నంబర్. టైమ్ చూస్తే ఎనిమిది దాటింది. అమ్మీ ఇంకా లేవలేదు. లేపడం ఇష్టం లేదు.

మేడమ్! నమస్తే. నేను ధనత్త గారి నైబర్ ని. ధనత్త గారు పోయారండీ.”

అమెరికాలో వాళ్ళ ఇద్దరబ్బాయిలకూ చెప్పారా?!” అతనిచ్చిన సమాధానం సబీనాని చెప్పలేనంత దిగుల్లోకి నెట్టింది. ఇద్దరబ్బాయిలూ రాలేదు. రాలేకపోవచ్చు.

            ఆ సాయంత్రం ధనత్త దేహాన్ని మెషీన్ కి అప్పజెప్పారు. యంత్రం తన పని తాను చేసుకుని వెళ్లిపోయింది యాంత్రికంగా. కానీదాని చప్పుడూదాంట్లోకి వెళ్తున్న ధనత్త దేహమూ –సబీనాని వెంటాడుతూనే వున్నాయి. ఇద్దరు కొడుకులు కదా అని ఎంత భరోసాగా  వుండేది ధనత్త!

            అలా చితి యంత్రంలోకి వెళ్లిపోతున్న ధనత్త ముఖం చూస్తున్నంత సేపూ  “బేటాఅమ్మీ జాగ్రత్త! నువ్వే దానికి పెద్ద కొడుకువి!” అని తనకి మాత్రమే అర్థమయ్యేట్టు చెప్తున్నట్టే వుంది. ఇన్ని  చూశాక కూడా “పెద్ద కొడుకు” అన్నదా నిజంగా-

            ధనత్త చెప్పాలనుకున్నది ఏమిటా అనే ఆలోచన మాత్రం ఎప్పుడూ మిగిలే వుంది. తన గురించా? అమ్మీ గురించా? అదేమీ కాకుండా ఆమె సొంత విషయాలా?! ఈ సాయంత్రం తరవాత ధనత్త లేదు. రాదు. కనిపించదు. సగంలో మాట తెంపేసి వెళ్ళిపోయినట్టే అనిపించింది. కొడుకులు పదోరోజైనా వచ్చివుంటారా?! తెలీదు.

4

            ఒక పొద్దున చాయ్ కలిపి అమ్మీ చేతుల్లో వుంచుతూ, ముడతలు పడ్డ ఆ చేతుల్ని కాస్త మెత్తగా నొక్కుతూ వుండిపోయింది సబీనా.

            అప్పుడు అమ్మీ ముఖంలో నానీమానో, ధనత్తనో చూడడం ఆమెకిష్టం లేదు. కడుపులో  తన్ని వెళ్లిపోతున్న కొడుకుల కాళ్ళు, వాళ్ళ మొండి చేతులూ కనిపిస్తున్నాయి కలల్లో కూడా-

            వీటన్నీటి మధ్యా అమ్మీ యాది కొంచెం కొంచెం మేలుకుంటోంది.

            “బేటా, నీకు నానీమా నుంచి ఏమొచ్చినా రాకపోయినా, ఆ చాయ్ రుచి మాత్రం వచ్చింది” అంటోంది అమ్మీ కాస్త నవ్వుతూ. 

            అమ్మీ అలా అన్నప్పుడు సబీనా రెండు కళ్ల నిండా రెండు గర్వపతాకలు ఎగురుతాయి. “ఈ గర్వ పతాక మీద ఏ మగాడి సంతకమూ అక్కర్లేదు,” అని రాసుకుంది ఆ రాత్రి డైరీలో.  

*

Wednesday, July 2, 2025

నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం

అఫ్సర్ కవితాసంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’



 ఈమాట నుంచి--


 

‘‘సమయం లేదు.
యెవరిదగ్గిరా కనీసం అరక్షణం లేనే లేదు.

సహనం లేదు.
యింకాసేపట్లో తెల్లారే బతుకులో యెవరి వాకిళ్ళు వాళ్లు తెరచుకొని, పగటిలోకి దూసుకెళ్లే తొందర్లోనే వున్నారు.

సాంత్వన లేదు.
వినే చెవి వొక్కటీ లేక తన మీద తానే నిశ్శబ్దపు యినప తెరలు వాల్చేసుకుంటుంది.’’

అత్యాధునిక కాలచక్రాన్ని కాళ్లకు తగిలించుకొని మనిషి పరుగులు తీస్తూనే ఉన్నాడు. పొద్దున్నే లేచి కార్పొరేట్ బ్లేజర్‌ను భుజాలకు అతికించుకొని అద్దాల మేడల్లోకి బట్వాడా అవుతూనే ఉన్నాడు. ప్యాకేజీల వేలంపాటల వెంట నీడలా పాక్కుంటూ నిలబడి ఆకాశాన్ని అందుకోటానికి కసరత్తు చేస్తూనే ఉన్నాడు.

అదొక నిరంతర పోరాటం. అనుదిన ఆరాటం. అనివార్య యుద్ధం. ఆ యుద్ధం మధ్యలో మనిషి మహదానందంగా ఇరుక్కుపోయి, ఊపిరాడనితనాన్ని వేడుకగా మార్చుకుంటున్నాడు. ఈ వర్తమాన జీవన విషాదాన్ని కనిపెట్టడం అంత తేలిగ్గాదు. అనుభవజ్ఞుడైన కవి మాత్రమే ఆ పని చెయ్యగలడు.

ప్రముఖ కవి, రచయిత, సంపాదకులు అఫ్సర్ చేశారు.

తనను తాను పుటం పెట్టుకొని, మానవావతారాన్ని ఆక్రమిస్తున్న అవాంఛనీయ ఆచ్ఛాదనలను ఏ రోజుకారోజు అక్షరాల మధ్య బంధించారు. కనిపెట్టడమూ కవిత కట్టడమూ దినచర్యగా మార్చుకున్నారు. ‘ఇవాళ’ ఏం జరుగుతోందో 1991లోనే లోకానికి చాటింపు వేసిన దార్శనిక కవి అఫ్సర్. నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఆయన చూపు మరింత విశాలమైంది. ఊహ పదునెక్కింది. కంఠం కరకుదేలింది. ఆ అనుభవం ఆలంబనగా గత నాలుగైదేళ్లలో రాసిన కవిత్వం ‘‘యుద్ధం మధ్యలో నువ్వు’’.

అంతకుముందు కవిగా అఫ్సర్ గొంతులో పలకని వినూత్న శబ్దగాంభీర్యమేదో ఈ కవితల్లో వినిపిస్తుంది. ఫార్మాట్ ఏదో చెదిరిపోయినట్లు కనిపించినా, ప్రక్రియలోని పదును రాటుదేలి దర్శనమిస్తుంది. పైగా, తనను తాను మరిన్ని పొరలుగా విప్పుకొంటూ, లోలోపలి నిర్మాణవిధ్వంసాల రహస్యాలను బట్టబయలు చేసిన విద్య అబ్బురపరుస్తుంది.

కాలాన్ని సముదాయించి, జోకొట్టి, దాన్ని నిద్ర పుచ్చటానికి తాను పడిన గుంజాటన నిజానికి ప్రతి ఒక్కరిదీ. కాబట్టే చదివే ప్రతి ఒక్కరూ ఆ యుద్ధం మధ్యలో అనివార్యంగా చిక్కుకుంటారు. అడుగడుగునా భుజాలు తడుముకుంటూ, ‘రంగ’వైకల్యాన్ని తల్చుకుంటూ అన్యమనస్కంగానే ఆసాంతం ముందుకు సాగుతారు. నిరపరాధాన్ని నిరూపించుకోవాలన్న కాంక్ష పేజీలవెంట పరుగులు తీయలేక చతికిల పడుతుంది.

‘‘పారిపోయే/జారిపోయే చీకటి క్షణాలు
నిన్ను నిజంగా పట్టిచ్చే యుద్ధాలు!’’ (చెట్టంత కావడం గురించి)

‘‘విడిపోడానికి నిరాకరించే
రెండు బిగి పెదవుల్లా
నింగీ నేలా’’ (మబ్బులోంచి చినుకులోకి)

అఫ్సర్ రాసిన మొత్తం 73 కవితల పవర్ ప్యాక్డ్ పొయిట్రీ ‘‘యుద్ధం మధ్యలో నువ్వు’’. ‘కత్తి అంచు మీద నిలబడి’ కొన్ని పద్యాలు, ‘ఆరుకాలాలూ మాయమైన చోట’ మరికొన్ని ఖండికలు, ‘పంజరాల్ని వోడించినప్పుడు’ ఇంకొన్ని కవితలు. మూడు విభాగాలుగా సంపుటిలో కొలువుదీరాయి. విభజన శీర్షికలతోనే ఈ సంపుటి తాలూకు వైవిధ్యాన్ని ప్రకటించారు.

మత్తులో తూగుతున్నట్లుగా సాగిపోతున్న మానవ జీవనమోహనంపై ఠపీమని ఓ మొట్టికాయ వేసింది కోవిడ్. అప్రత్యక్షంగా మనిషిని కమ్మేసి, కరోనా నామధేయంతో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మనిషికీ మనిషికీ మధ్య అగాథాలు తవ్వేసింది. నోరు కట్టేసింది. ముక్కు మూసేసింది. చేతులు నరికేసింది. ఇళ్లను జైళ్లుగా మార్చేసింది. సంకెళ్లతో పనిలేకుండానే కాళ్లను బంధించేసింది. ‘‘యిప్పటిదాకా నువ్వు వెలివేసినవన్నీ/ తొలిచేసే ‌ఋతువిది’’.

ఒక రకంగా మనిషికి మంచే జరిగింది. అదో భారీ కుదుపు. మనిషి ఊహించని మలుపు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆక్సిజన్ కోసం ఆస్పత్రులకు పరుగులు తీశాడు. ‘గాలి బరు’వెంతో జ్ఞానోదయమైన ఆ క్షణాన తనను తాను తవ్వుకోవటం మొదలు పెట్టాడు. పొరలు విప్పుకోవటం ప్రారంభించాడు. అదో భేరీలు మోగని యుద్ధం. ఆ యుద్ధం మధ్య అఫ్సర్ కూడా చిక్కుబడిపోయాడు. ఆ సంక్షోభాన్ని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశాడు. మనసంతా చేదు నింపుకొని అనుభవించాడు.

ఆ అనుభవాలను రికార్డు చేయటం మొదలు పెట్టాడు. దినచర్యనే కవిత్వంతో అంటుగట్టాడు. అట్లా పెరిగి పెద్దయిన మొక్కలన్నిటినీ ఈ సంపుటి నిండా అలంకరించాడు.

‘‘మరణం రాసుకునే అనుక్షణిక డైరీ/ యిప్పుడు నీ నా బతుకు’’ అని ప్రకటించారు.

‘‘భయం ఎక్కడో పుట్టేది కాదు. పుట్టినప్పటినుంచీ నువ్వూ నేనూ ప్రియంగా పెంచుకుంటున్న విషప్పురుగు అది. డైనోసార్ కంటే పురాతనం. ఆదిమత్వం కంటే సనాతనం యీ భయం.’’

దయ, జాలి, కరుణ, ప్రేమ, సానుభూతి, సహానుభూతి… ఇవన్నీ లివింగ్ రూముని అలంకరించే విగ్రహాలుగా మారిన కాలమిది. ప్రేమించటం కష్టమో, ద్వేషించటం కష్టమో లెక్కలు తేల్చుకునే కాలం కాదిది. నూతిలోని చీకట్లో దేన్ని కావలించుకోవాలో తెలియని సందిగ్ధ సమయమిది.

కొన్ని అనుక్షణికాలు భళ్లున బద్దలై నిద్రని గాయపరిచే కలల్లా వెంటాడుతుంటాయి. నిద్ర నటించక తప్పని రాత్రుల్లో యుద్ధాలు సిద్ధమవుతుంటాయి.

‘‘అసలు యుద్ధాలన్నీ యిక్కడే మొదలై
యిక్కడే ముగుస్తూ వుంటాయి-
లేదూ,
ముగిశాయని అనుకుంటూ వుంటాం
మరో క్షణమేదో దారికొచ్చేదాకా’’ (యిష్టం లేనివి).

మనిషికి అత్యంత సౌఖ్యాన్నందించే సాధనం: నిద్ర. అది సాఫీగా సాగితే స్వర్గం. కలతలు మిళితమైతే నరకం. భూమ్మీద ఉచితంగా లభించే ఆ స్వర్గానికి నిచ్చెనలు వేసే అవకాశం లేని దురదృష్టవంతుల దీనగాథల్ని ఈ కవి శ్రుతిలయలకు అతీతంగా గానం చేస్తాడు.

‘‘యింకోసారి చాలని దుప్పటి పైకి లాక్కుని ఆమె సూర్యుణ్ణించి ముఖాన్ని దాచేసుకుంది. సూర్యుడి నీడకీ, దుప్పటి చిరుగుకీ మధ్య ఆమె ముఖాన్ని ఇంకోసారి చూసినప్పుడు ఆ కళ్ల మీద ప్రపంచం పట్టనంత అలసట’’ (కాసిని హోంలెస్ పద్యాలు).

పద్యం ఇట్లాగే మొదలవ్వాలన్న నిబంధనను ఇష్టపూర్వకంగా అతిక్రమించటంలో అఫ్సర్ సిద్ధహస్తుడు. లోలోపల సుడులు తిరిగే ఒక భావధార ఎట్లా ఉబికివస్తే అట్లా ఆ వాక్యపు చిటికెన వేలు పుచ్చుకొని పిల్లాడిలా హాయిగా నడక ప్రారంభిస్తాడు. మనం కూడా ఆ హాయితనంలో బుడుంగున మునిగిపోయి, కవిత పొడవునా పరుగులు తీస్తాం.

‘‘చిట్టచివ్వరి నిద్ర శకలాన్ని పట్టుకునే వూగిసలాటే కావచ్చు. తెగిపోయే ఆఖరాఖరి ముడిని కాస్త సుతారంగా పొదివిపట్టుకునే తాపత్రయమే కావచ్చు’’ (ఆ నిద్దురలో మిగిలినవి కొన్ని).

కవితంటే, పొట్టి పొట్టి వాక్యాలు పేజీల్లో నిలువునా సాగాలన్న అలవాటును కూడా ధిక్కరిస్తాడు. ఆగటమూ అడ్డుకోవటమూ ఇష్టం లేనట్లుగా ప్రేరణాత్మక పేరాలను సృజించి, వాటికి మళ్లీ పొదుపైన వాక్యాలను అంటుగట్టి సరికొత్త సౌందర్యంలోకి మనల్ని ప్రవేశపెడతాడు.

ఇంతకీ అఫ్సర్ పద్యం ఏం చేస్తుంది!

నీ లోపలి గాయాలను మాన్పుతుందా? నిద్రిత మైదానాల్ని తట్టి లేపుతుందా? యుద్ధాల మధ్య శాంతివనాల్ని మొలిపిస్తుందా? పోనీ, వీటన్నిటి జాడ తెలియజెప్పి, కొత్త బాట నిర్మాణానికి శ్రీకారం చుడుతుందా?

‘‘యిప్పుడే కాదు – యెప్పుడూ యే పద్యమూ నీలోపలి లోయల్ని పూడ్చదు. ఆ లోయ మొదట్నించీ అలాగే వుందని, నువ్వు తలకిందులుగా దాని లోతుల్లోకి అవరోహణ చేస్తూ వున్నావని ప్రతి పద్యం చివరా అర్థమవుతుంది’’ (యుద్ధం మధ్యలో నువ్వు – 1).

నీకు నిలబడి నిద్ర పోయేంత సమయం కూడా ఉండకపోవచ్చు. నీ కాళ్ల కింద పెనుమంటలు విస్తరిస్తూ ఉండొచ్చు. నువ్వు వాక్యం కాలేకపోవడానికి వంద కారణాలుండొచ్చు.

‘‘నీ అరిపాదాల కింద స్వర్గమేమీ లేదు
అదీ
యింకా నోరు తెరుచుకోని నరకద్వారమే’’ (యుద్ధం మధ్యలో నువ్వు – 2).

మరి ఈ మంటలు చల్లారేదెట్లా? లోయలు చదునయ్యేదెట్లా?

స్వర్గనరక భయాభయాలనుంచి బయటపడేదెట్లా?

ఎదగాలి. చెట్టులా ఎదగాలి. ఎదగాలంటే కలలు కనాలి. కలలు కనాలంటే నీలోని చీకటి క్షణాలను మట్టుబెట్టాలి. లేకుంటే ‘గుంపుల మధ్య తెగిపోయిన ఆకులా వణికే నువ్వు చెట్టంత కల కనలేవు’.

‘‘చెట్టంత కావడం అంటే
ప్రతి చినుకూ
యుద్ధ శంఖారావం కావడం!’’ (చెట్టంత కావడం గురించి).

అఫ్సర్ కవిత్వం ‘తడిగా ఆమె చెయ్యిలా తాకుతుంది. వెచ్చగా అతని నవ్వులా తడిమేస్తుంది. అతనామెలా నిలేస్తుంది’. జీవితాన్ని అడ్డంగానో నిలువుగానో కొలిచే సాధనాలుండవు. జీవితాన్ని కిందికీ మీదికీ వరదలెత్తే సంకేతాలుండవు. ‘యిప్పుడీ క్షణపు ముక్కలో కనిపించే ఆకాశమే నీది’.

మనమంటే ఇసుక లోపలి దూదుంపుల్లలమైన చోట, అప్పటిదాకా గడ్డ కట్టిన చీకటిఖండాలమైన చోట, అఫ్సర్ కవిత్వం ‘అడివిని చుట్టుకు తిరిగే హోరుగాలి’లా మనల్ని చుట్టుముడుతుంది. మనలో గుట్టలా పేరుకుపోయిన నిస్పృహకు కళాత్మకంగా నిప్పు పెడుతుంది. మన ‘లోపలి వీధులన్నీ వొక్కసారిగా కాంతిద్వీపా’లవుతాయి. అప్పుడు మనలో ఉద్భవించే శక్తి అపారం.

‘‘నీకు ధ్వంసం చేయడమే తెలుసేమో కానీ
నాకు ప్రతి మట్టిబెడ్డా కూడదీసుకొని
నాకంటూ యింకో నీలాకాశం
యింకో ఆకుపచ్చని నేలా
అల్లుకోవడమెలాగో తెలుసు!’’ (వినిర్మాణంలోంచి)

మనిషికి ప్రకృతే పెద్ద గురువు. చెట్టూ పుట్టా కొండా కోనా నీరూ నిప్పూ గాలీ వానా… సృష్టిలోని ప్రతి వనరూ పాఠ్యాంశాల సమాహారమే. కవి తిరుచ్చిలోని అతి ఎత్తయిన కొండ దాదాపహాడ్ ఎక్కినప్పటి అనుభవాన్ని అక్షరాల మెట్లతో అలంకరించాడు.

‘‘కొండెక్కినప్పుడల్లా వొక కొత్త పాఠం
కొండెక్కని దీప రహస్యం

కొండెక్కి దిగిన తరవాత
నీ దేహం వొక కొత్త వాసనేస్తుంది
ఇప్పుడే నీకు నువ్వు దొరికినట్టు’’ (కొండ కొమ్మున)

ఏ కవితలో మునకలేసినా ఇట్లాంటి అద్భుతమైన పదచిత్రాలు మన కళ్లను నిర్మాల్యం చేస్తాయి. అవన్నీ అఫ్సర్ కవితాసృజనకు కమనీయ నిదర్శనాలు.

ఇలాంటివే రుచికరమైన మరికొన్ని చిరు ఖండికలు:

‘‘అందరికీ అన్నిటికీ ముఖం తిప్పుకుని వుంటావే,
అదిగో అదీ మరణం,
నెమ్మదిగా నీ వేపు అడుగులో అడుగు వేస్తూ వస్తుంది పిల్లిలాగా’’ (విముఖ).

‘‘నది మాత్రం
అశాంతి దుప్పటి కింద
వొణికిపోతోంది చలిజ్వరమొచ్చిన పిల్లాడిలా-’’ (వెళ్లిపోతున్న పడవల కోసం).

‘‘నువ్వేమీ పల్లె కడుపులో పుట్టక్కర్లేదు
బియ్యం నేల కింద పుడుతుందో
చెట్టు సిగన మెరుస్తుందో కూడా తెలియక్కర్లేదు
నువ్వు తినే మెతుకులో
యిప్పుడు నీ అహంకారం మూలుగులు వినిపించే తీరాలి’’ (నువ్వు తినే మెతుకు మెతుకులో).

‘‘మాటల్లేక
మనం ఎడారి దిబ్బలం
చిర్నవ్వుల్లేక
మనం కురవని మబ్బులం’’ (అనేక యుద్ధ కాలాల తరవాత).

బడుగుజీవి అట్టడుగునే మిగిలిపోతున్న బట్టల్లేని నిజానికి మూడు వేల ఏళ్ల చరిత్ర సాక్షీభూతం. శతాబ్దాలుగా రాలుతున్న నుసిని కాలగర్భంలో కలిపేస్తున్న కాంక్షాసర్పం. ఆ బక్కజీవికి కవి భరోసా ఇస్తాడు. అతని తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడతాడు. అతన్ని పీల్చి పిప్పి చేస్తున్న చట్టబద్ధమైన ఘోరాల గురించి దండోరా వేస్తాడు. నిజం బహిరంగ జీవచ్ఛవంగా ఊరేగుతున్న నగ్న వాస్తవాల్ని నిలువెల్లా ప్రదర్శనకు పెడతాడు.

‘‘రాజ్యాలు యెన్ని చూశావో అన్ని మరణ శాసనాలూ నువ్వు చూసే వుంటావ్. చరిత్రని చేతివేళ్ల నరాల్లో బిగబట్టుకున్న వాడివి కదా. వుద్వేగాలు చచ్చిపోయిన మొండిమాను కాలంలో కూడా నువ్వు నెత్తుటి చుక్కని చూసి, మూర్ఛపోతూనే వుంటావ్.’’

ఆదివాసీల ఆర్తనాదాలు గూడేల మధ్యనే ప్రతిధ్వనించి, ప్రకృతిలో లీనమైపోతున్న విషాదవీచికలు అఫ్సర్ కవితల్లో చాలాచోట్ల గుప్పున వీస్తాయి.

అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ గొంతుపై తెల్లపోలీసు కాలేసి తొక్కి చంపిన ఘటనపై చాలా కవితలు వచ్చాయి. కానీ అఫ్సర్ చూపు వేరు. అతని తల్లినీ, అతని పిల్లల తల్లినీ తలచుకుంటూ ఆ దుఃఖాన్ని అక్షరాలనిండా ప్రవాహం కట్టించాడు. ఫ్లాయిడ్ తల్లి దగ్గర మొదలై, తన బాల్యపు రోజుల్లోంచి ప్రయాణిస్తూ ఒక అద్భుత వేదిక నిర్మించి, అక్కడి ఆ దురాగతం తాలూకు నిర్వర్ణాలను లోకానికి చూపించాడు.

‘‘యిక్కడ కొన్ని యిళ్లకి తండ్రి ముఖమే తెలీదు
ఆ యింటిని మోసే భుజాలెప్పుడో కూలిపోయాయ్
రోజూ
కనిపించని వందల తెల్ల మోకాళ్లు ఆ గొంతుల్ని నొక్కీ నొక్కీ!’’ (నల్లమ్మ అనే వొక Volcano గురించి).

సుదీర్ఘ కవిత్వ ప్రస్థానంలో అఫ్సర్ తనకంటూ ఒక భాషను రూపొందించుకున్నారు. ఒక నిర్లయాత్మక శైలిని బలంగా తయారు చేసుకున్నారు. వ్యక్తీకరణలో లోతుల్ని సాధించటానికి సహజ సంభాషణల సుగంధాన్ని వాడుకున్నారు. ఈ కృషిలో భాగంగానే ప్రయోగాల బాటలోనూ ప్రయాణించారు. ‘అవయవ వ్యూహం, శబ్దవస్త్రాలు, అక్వేరియమ్ శ్మశానం, భ్రమల చేపపిల్లలు, బంధాల గాజుముక్కలు, అనామక పావురం, పంజరాల కానుకలు, కౌగిలి పంజా, పలకరింపుల వాన’ వంటి పదబంధాలు అందులో భాగమే.

ఇంతకీ ఈ కవి ఏం చెబుతాడు?

సుదీర్ఘ సంక్షోభాల సంకెళ్ల నుంచి విముక్తమయ్యాకనైనా నువ్వు నువ్వుగా నికరంగా నిలబడకపోతే రక్తమాంసాల పరమార్థం నిష్ఫలమైనట్లేనంటాడు.

పగళ్లను పండగల్లా మార్చుకోమంటాడు. సాయంత్రాల్ని యెలాగోలా వెలిగించుకోమంటాడు. మల్లెల్ని మనసులో మాలలల్లుకోమంటాడు. గాలి తరగై ప్రవహిస్తూండి పోవాలని, జలపాతమై దూకేస్తూ మంచువానల్లో తడిసిపోవాలని, పసితనపు మాయచర్మాన్ని వదలకూడదని చెబుతాడు.

తనకు తాను గడి బిగించుకొని, లోపల బందీ అయిపోతున్న పరిస్థితిని బద్దలుగొట్టి స్వేచ్ఛా విహంగాల తయారీకి నడుం బిగించమంటాడు.

‘‘యెక్కడ ఆగిపోయావని కాదు
మళ్లీ యెలా మొదలెట్టావన్నది కావాలి నాకు
చెప్పానా,
మొదటి వాక్యం యెప్పుడూ కష్టమే’’ (Back on the Track).

‘‘యీ సాయంత్రమైనా వొక దీపం నువ్వే వెలిగించుకో
అలవికాని కౌగిట్లో నిన్ను నువ్వే తెరుచుకో’’.

‘వొకే వొక్క జీవితంరా నీది, దాన్ని గానుగెద్దు చేయద్దురా’ అని మొత్తుకుంటాడు. రహస్యాంగాలు నగర సంచారం చేయాలంటాడు.

వొడ్డుకు కొట్టుకువచ్చిన చేపపిల్ల కళ్లల్లోకొచ్చిన ప్రాణం కొసల్లో తనను తాను చూసుకునే సున్నిత మనస్కుడు అఫ్సర్. ‘పూలని వెలివేసే కాలాల్నీ లోకాల్నీ వూహించలేని’ పరిమళభరిత హృదయుడు అఫ్సర్.

క్లుప్తంగా చెప్పాలంటే, ఈ కవిత్వమంతా అఫ్సర్ తనతో తాను జరిపిన సుదీర్ఘ సంభాషణ. తన స్మృతుల్లో ఇంద్రధనుస్సుల్నీ, భూకంపాల్నీ వెతుక్కున్న ఆనందవిషాద విభ్రమ.

అఫ్సర్ భాషలోనే చెప్పాలంటే: ఆయన ‘పద్యాలన్నీ వొట్టి వాక్యాల పోగులు కావు’. విలువైన స్వర్ణసుమాలు. ఆ కవితాసుమాల పరిమళపు ఔన్నత్యాన్ని ఒక్క పేజీలో ఆవిష్కరించారు వరవరరావు, శ్వేత యర్రం గార్లు. అర్థగాంభీర్యం ఉట్టిపడే ముఖపత్రంతో అజు పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించింది.

తన ఊహను మనం ఊహించని దిక్కుల్లోకి విసిరి, మనల్ని పతంగుల్లా ఎగరేసి, సరికొత్త ఆకాశాల హద్దుల్ని మనకు పరిచయం చేసే అఫ్సర్ కవిత్వాన్ని అంతే సీరియస్‌గా అధ్యయనం చేస్తే, సర్వస్వాన్నీ కోల్పోవటమనేది ఎప్పటికీ ఉండదని అర్థమవుతుంది.

నమ్మకం లేదా? ఇదిగో రుజువు:

‘‘తల మీద కాస్త ఆకాశం వుంది
కాళ్ల కింద ఇంకొంచెం నేల మిగిలే వుంది
గుండెలో తడిని యింకా యే యెడారో కావిలించుకోలేదు
పెదవి మీది మాటని యింకెవరూ తుంచుకెళ్లలేదు.’’

    

Saturday, December 7, 2024

నిష్పాక్షికత- అనేది ఎంతవరకు సాధ్యమో!


ఇంటర్వ్యూ: పలమనేరు బాలాజి

చనలో మమేకత్వం,ఒక సహజత్వం, ఒక అసాధారణత అఫ్సర్ సాహిత్య లక్షణం.
కథ రాసినా కవిత్వం రాసినా విమర్శ చేసినా ,అనువాదం చేసినా ,పరిశోధన చేసినా, ఏదైనా సరే ఎవరు వెళ్ళని దారిలో వెళ్లడం మనసుపెట్టి పనిచేయటం అఫ్సర్ వ్యక్తిత్వం. గుడిపాటి గారు అన్నట్టు నిజంగా నిరంతరం సాహిత్యజీవిగా ఉండటం అంటే ఏమిటో ఎలానో మనం అఫ్సర్ నుండి నేర్చుకోవాలి.

కవి కథకుడు విమర్శకుడు అనువాదకుడు పరిశోధకుడు సంపాదకుడు సాహిత్య పత్రిక నిర్వాహకుడుగా నిరంతరం సాహిత్య సృజన కొనసాగిస్తూ తన పని చేసుకుంటూ నిశ్శబ్దంగా తన సాహిత్య ప్రయాణాన్ని తనదైన మార్గంలో కొనసాగిస్తున్న నిగర్వి, స్నేహశీలి అఫ్సర్ కవిసంగమం - కవితావరణం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఈవారం...

*
1.మీ కవిత్వం చదువుతూ ఉంటే సాహిత్యాన్ని మాత్రమే కాదు జీవితాన్ని కూడా మీరు చాలా సీరియస్ గా అధ్యయనం చేస్తున్నట్టు కనబడుతోంది. నిష్పాక్షికంగా జీవితాన్ని చూసే పద్ధతి మీకు ఎలా అలవడింది?
*అధ్యయనం మొదటి నించీ జీవితంలో భాగంగా ఇంకిపోయింది. పుస్తకంతో పాటు అనుభవాల అధ్యయనం కూడా కొంత ఆలస్యంగా అలవాటైంది. నిష్పాక్షికత- అనేది ఎంతవరకు సాధ్యమో నాకు ఇంకా తెలీదు. కానీ, వీలైనంత విశాలంగానో, ఓపెన్ గానో వుండడానికి ప్రయత్నించడం అవసరం. అలా ఓపెన్ గా వుంటే, ఎక్కువ నేర్చుకుంటాం. జర్నలిజంలో వున్న కాలం నుంచీ అదే దృక్పథం నన్ను నడిపించిందేమో. అదృష్టం బాగుండి, స్కూలు రోజుల నుంచీ మంచి స్నేహితులు చుట్టూ వుండడం, వాళ్ళకీ నాకూ ఒకే రకమైన అభిరుచులు వుండడం కూడా కలిసివచ్చింది. అమెరికాలో అధ్యాపనం వల్ల ఈ ధోరణి మరింత బలపడింది. ఇక్కడ ప్రతి రోజూ కొత్త తరం విద్యార్థులతో చర్చలూ, సమావేశాలూ నాకు కొత్త పాఠాలు నేర్పాయి.

2. సమకాలీన కవుల సాహిత్యం పట్ల మీరు చాలా సహృదయంతో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. కొత్త కవులను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల వారితో అన్ని వయసుల వారితో మీరు మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రత్యేక సాహిత్య వ్యక్తిత్వం సాహిత్యకారులలో మిమ్మలను ప్రత్యేకంగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఈ సంస్కారం, స్నేహ స్వభావం మీకు ఎలా అలవడింది?
*ఇది నా గురించి నా అన్వేషణలో భాగమే. సమకాలంలో సమానంగా వుండాలన్న తపన. రచనల ప్రమాణాలు ఎప్పుడూ మారుతూ వుంటాయి. ఆ మార్పుని తెలుసుకోవాలంటే మనలో కొత్త చూపు ఎప్పుడూ వుండాల్సిందే. అది కేవలం మానకాలం రచయితల్ని చదవడం వల్లనే సాధ్యం. Learning process నిరంతరం. ఇవాళ ఒక కొత్త వాక్యం చదివినప్పుడు అది మరింత అర్థవంతమవుతుంది, అర్థమవుతుంది. కొత్తగా రాస్తున్న కవులకి ఈ కొత్త వాక్యాల ఆచూకీ తెలుసు.

3. మీరు అనుకున్నట్టుగా మీ సాహిత్య ప్రస్థానం కొనసాగుతూ ఉన్నదా? ఏవైనా ఆటంకాలను అధిగమించారా? ఎప్పటికప్పుడు పునరుత్తేజం పొందటంలో, నూతన ఉత్సాహాన్ని పొందటంలో మీ కుటుంబ సభ్యుల మిత్రుల స్ఫూర్తి గురించి కొంచెం చెబుతారా?
*సాహిత్య ప్రస్థానం ఫలానా విధంగా వుండాలని నేనేమీ అనుకోలేదు. ఏమైనా అవకాశాలూ, మలుపులూ వచ్చి వుంటే, అవి కేవలం అనుకోకుండా వచ్చినవే. కాకపోతే, ప్రచురించిన ప్రతి పుస్తకం ఎంతో కొంత గుర్తింపు సాధించుకుంది. “రక్తస్పర్శ” కి మంచి సమీక్షలు దక్కాయి, “ఇవాళ” కి ఫ్రీ వర్స్ ఫ్రంట్ తో పాటు ఆ ఏడాది కనీసం పది అవార్డులు వచ్చాయి. “వలస” “ఊరి చివర” “ఇంటివైపు” కూడా మంచి పురస్కారాలు అందుకున్నాయి. సాహిత్య విమర్శలో “ఆధునికత- అత్యాధునికత” తో పాటు “కథ-స్థానికత” కి గౌరవాలు దక్కాయి.

4. కొంతమంది కవిత్వం కొంతమంది కవులు కొంతమంది విమర్శకులు కొంతమంది సంపాదకులు కవులుగా మారాల్సిన పాఠకులను భయపెడుతూ ఉన్నారు. ఈ భయాలతో కొంతమంది తెరచాటునే ఉండిపోతున్నారు. రాసింది పత్రికలకు పంపలేక , పత్రికలలో అంతర్జాలంలో ప్రచురితమైన కవితలను పుస్తకంగా తీసుకు రాలేక ఎంతో మంది నలిగిపోతున్నారు. ఈ స్థితి నుంచి ఈ భయాలనుంచి వారు బయటపడి కవిత్వం రాయటానికి కవిత పుస్తకాలను అచ్చు వేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు?
*ఈ పరిస్తితి తెలుగు సాహిత్యంలో కొత్తేమీ కాదు. “రక్తస్పర్శ” కవిత్వం పుస్తకం వచ్చేనాటికి కూడా మా కవిత్వాలు సరిగా అచ్చుకి నోచుకోలేదు. అప్పటి పత్రికలు “ఇది తెలుగు కవిత్వం కాదు,” అని తిప్పి పంపిన ఉదాహరణలు చాలా వున్నాయి. అలాగే, కవిత్వం ఒకే విధంగా చదివే అలవాటున్న విమర్శకులు వాటిని ఒప్పుకోకపోవడమూ వుంది. అప్పటి స్థితితో పోల్చితే, ఇప్పుడు చాలా నయం. కొత్త కవిత్వాన్ని ఇష్టంగా అక్కున చేర్చుకునే వేదికలున్నాయి, కొన్ని అంతర్జాల పత్రికలున్నాయి, కవిసంగమం లాంటివి వున్నాయి. పుస్తకాలు అచ్చు వేసుకోడం కూడా అప్పటికంటే ఇప్పుడు చవక. డిజిటల్ ప్రచురణ చాలా మంచి సాహిత్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. అదేవిధంగా, కొన్ని ప్రచురణ సంస్థలు కేవలం కవిత్వ ప్రచురణకి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇది కొండంత ధైర్యం. అయితే, ఎన్ని భయాలున్నా, పరిమితులున్నా, నిజమైన కవులు రాయకుండా వుండలేరు. అలా వుండేట్టు అయితే, ఇవాళ ఇంత కవిత్వ సంపద మన ముందు వుండేది కాదు. నా మటుకు నాకు మంచి కవిత్వమైనా, మంచి సాహిత్యమైనా వేగంగా విస్తరించడానికి మంచి సంపాదకులు అవసరం. వీళ్ళు మాత్రం అరుదైపోతున్నారన్నది వాస్తవం.

5. అనుకరణకు లొంగని శైలి మీ సొంతం. మీది బలమైన సొంత గొంతుక. కథ రాసినా కవిత్వం రాసినా వ్యాసం రాసినా చాలా నిక్కచ్చిగా చిక్కగా వాస్తవికంగా ఉంటుంది.. మీ ధోరణి. రాయడంలో ప్రతి కవికి ఎదురయ్యే అనేకానేక మొహమాటలను ఎట్లా అధిగమించారు?
*మీ ప్రశంసకి చాలా థాంక్స్. రాయడంలో మొహమాటలేమీ వుండవు. అది కవిత్వమైనా, విమర్శ అయినా- రాయాల్సిందే రాస్తాను. అలా నిక్కచ్చిగా వుండడం వల్లనే “ఆధునికత- అత్యాధునికత” (1992) “కథ-స్థానికత (2010) విమర్శ పుస్తకాల మీద విస్తారమైన చర్చ జరిగింది. ఇప్పటికీ వాటి గురించి చాలా మంది అడుగుతూనే వున్నారు, మాట్లాడుతూనే వున్నారు. నా విషయంలో సృజన, విమర్శ రెండూ ఒకే సమయంలో జరిగాయి కాబట్టి, నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడం కొంత తేలిక అయింది. మొదట్లో నా కవిత్వం మీద వచ్చిన విమర్శలని తలచుకుంటూ అప్పుడప్పుడూ శివారెడ్డి గారు అంటారు “ నువ్వు కాబట్టి ధైర్యంగా నిలబడ్డావయా?” అని- అందులో ధైర్యం నాలోపలి విమర్శకుడు ఇచ్చిన ధైర్యమే! ఇప్పుడు ఆ ప్రయాణం అంతా సాఫీగా అనిపిస్తుంది కానీ, నిజానికి ఏ సాహిత్య ప్రయాణమూ సాఫీగా వుండదు. శివారెడ్డి గారి కవిత్వం మొదటి రోజుల్లో కూడా విమర్శలకు తక్కువేమీ లేదు. అవి కొన్ని సార్లు రచనలో మొహమాటాలకు దారితీయడం సహజం. కొన్ని భయాలూ ఏర్పడతాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. ఇప్పటికీ లోపల ఆ యుద్ధం నడుస్తూనే వుంటుంది. ఈ యుద్ధానికి కొత్త కవీ, పాత కవీ అనే మొహమాటమేమీ లేదు.

6. కొత్త కవులు కొత్త రచయితలు కొత్త విమర్శకులకు సంబంధించి, యువ సాహితీ వేత్తలకు సంబంధించి అంతర్జాల పత్రిక నిర్వాహకుడిగా మీరు గమనించిన ప్రత్యేకమైన అంశాలను గురించి కొంచెం చెబుతారా?
*సారంగ నిర్వహణ కంటే ముందే నేను అక్కడ వున్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమిలో సాహిత్య పేజీలు నిర్వహించాను. అసలు సాహిత్యానికి నిండు పేజీ వుండాలన్న ఆలోచన ఆంధ్రజ్యోతిలో వున్న కాలంలో పెద్ద ప్రయోగం. అప్పటి నుంచీ ఇప్పటి సారంగ దాకా నా దృష్టి ప్రధానంగా కొత్త తరానికి ఏం చేయగలం అన్నదే! అయితే, ఇదేమీ అనుకున్నంత సులువు కాదు. ఇప్పటికీ రాయగానే వెంటనే వాయువేగంతో పత్రికకి పంపించేసే అలవాటు చాలా మందికి వుంది. అలాగే, తమ రచనలే ఎక్కువగా కనిపించాలనే తాపత్రయం కూడా కొంతమందిలో వుంది. పత్రికలో ఇది సాధ్యపడదు. వీలైనంత ఎక్కువ మందికి పత్రిక చోటు ఇవ్వాలి. పత్రిక స్పేస్ కూడా పరిమితంగా వుంటుంది. సారంగ కి ఇప్పుడు ప్రతిరోజూ కనీసం పాతిక మంచి రచనలు వస్తాయి. (ఇక ప్రచురణకి ఏమాత్రం పనికిరానివి పెద్ద సంఖ్యలోనే వుంటాయి). కానీ, సారంగ పది మహా అయితే పన్నెండు రచనలు మాత్రమే ప్రచురిస్తుంది. అలాంటప్పుడు రచన నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అందువల్లనే, ఆ పది రచనలు గట్టిగా వుంటాయి. వాటికి వచ్చే స్పందనలు కూడా గట్టిగా వుంటాయి. రచన చేయడం ఎంత పెద్ద బాధ్యతో, రచనని అచ్చు వేయడం కూడా అంతే పెద్ద బాధ్యత. రచయితలు కూడా పత్రిక పరిమితులు అర్థం చేసుకొని మెలగాలి. ఒక రచన అచ్చు వేసినప్పుడు ఎడిటర్ ని మెచ్చుకొని, ఇంకో రచన అచ్చు కానప్పుడు అదే ఎడిటర్ కి శాపనార్ధాలు పెట్టడం ఆరోగ్యకరమైన ధోరణి కాదు. ఈ ధోరణి పెరుగుతున్నందువల్ల చాలా మంది ఎడిటర్లలో ఒక విధమైన నిరసన భావమూ పెరుగుతుంది. మంచి ఎడిటర్ ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే!

7. ప్రతి కవితలో మీ భాష మీ శైలి భావప్రకటన మెరుగుపడుతూనే ఉంది. అత్యంత మెరుగ్గా కవిత్వ ప్రక్రియ కొనసాగటానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు లేదా మీరు పాటించే సూత్రాలు లేదా మీ కవిత్వరచనా ప్రక్రియ విధానం గురించి..
*రచన పట్ల గౌరవం వుండాలి ముఖ్యంగా- మనం రాసే వాక్యం పట్ల ప్రేమా వుండాలి. చాలా మంది నిరంతర అధ్యయనం గురించి చెప్తూనే వున్నారు. కానీ, దాని కంటే ముఖ్యంగా ఇతరుల రచనలు చదివే సహనం వుండాలి. ఆహ్వానించే మనసూ వుండాలి. కవిత్వ రచనలో నేనేమీ ప్రత్యేక సూత్రాలు పాటించడం లేదు. మొదట రాయాలనుకున్నది రాస్తాను. తరవాత ఎడిటింగ్ చేస్తాను. ఈ ఎడిటింగ్ దశలో వచ్చే ప్రతి మార్పునీ ఆహ్వానిస్తాను. అలాగే రాసిందల్లా అచ్చుకి పంపించాలన్న ఉత్సాహాన్ని అణచుకుంటాను. రాసింది కొన్నాళ్లు నా దగ్గిరే పెట్టుకొని, పదేపదే చదువుకుంటాను. ఇది కవిత్వమైనా, వచనమైనా సరే. అందుకే, నేను ఎక్కువగా రాయలేను. అదీ మంచిదే.

8. కవి సంగమం గురించి..
*కవిసంగమం ఒక మలుపు. సోషల్ మీడియాలో పెడధోరణులు పెరిగిపోతున్న కాలంలో కవిసంగమం వాటిని సవాలు చేస్తూ నడుస్తోంది. కొత్త తరానికి వేదిక. నేర్చుకోడానికి అవకాశం కలిపిస్తున్న పాఠశాల..

Sunday, July 28, 2024

డియర్ మేరీ

 


రిగిన కథంతా నిజానికి శ్రీకర్ మాత్రమే చెప్పాలి. యీ మొత్తం కథలో నేను యిప్పటికీ బయటి మనిషినే. 

యింకా చెప్పాలంటే- ప్రాణమే  అనుకున్న స్నేహితుడి దిగులులో వొక కథకుణ్ణి మాత్రమే!  

యిది నా దాకా వచ్చేసరికి కథ అయిపోయిందేమో కానీ, శ్రీకర్ కి  యిదేదో వూహల్లో అల్లుకున్న  లోకం  కాదు.  పట్నం వచ్చినప్పటినుంచీ యిద్దరమూ వొకే  చోట కలిసి చదువుకున్నాం.

సెయింట్ మేరీస్ చర్చి అంటే కాలేజీకి వెళ్ళే దారిలో మా అడ్డా. అతిపురాతనం అనిపించే ఆ చెట్ల కింద యెన్నో కబుర్లూ రేపటి ప్రణాళికలూ చెప్పుకున్నాం. మేం కలిసి ఆడుకున్నచోటు. 

యిక్కడి   ప్రతి చోటూ యిద్దరికీ వొకేరకమైన అనుభవమై వుండాలని అనలేను.  కానీ, ప్రదేశాల మట్టి మా శరీరాల మీద కొంతైనా పడివుండాలి. మా గుండెల్లో దాని పరిమళమే యెంతో కొంత నిండి  వుండాలి. వాటిల్లోంచి మా గుండె చప్పుళ్ళు కొన్నయినా వొకే లయలో వుండి వుండాలి. 

నిజానికి యీ సంగతులన్నీ చెప్పకుండా వుండలేనితనమే నాలోనూ వుంది. అది వాడి మాదిరిగా నాలోపల యెప్పటికీ ఆరని కార్చిచ్చులాంటిది కాదు. వొక అనుభవాన్ని చెప్పడమన్నది -అందులో నిండా మునిగి వున్న వాళ్ళ కంటే, కొంచెం యెడంగా వున్న వాళ్ళకి  తేలిక అనుకుంటా. అలాంటి వెసులుబాటేదో దొరకడం వల్లనే యివన్నీ చెప్తున్నా గానీ,  వాడి అనుభవంలోని తీవ్రత యేదీ నా యీ మాటల్లో రవంత లేకపోవచ్చు.

చాలాసార్లు యే విషయమైనా యెంతో కొంత మాటల్లో చెప్పగలిగితే, జీవితం కాసింత తెరపినిస్తుందేమో!  అది శ్రీకర్ విషయంలో నాకు గట్టిగా రుజువైంది. ఆ మాటకొస్తే, వాడు మేరీ అంటే తనకున్న ప్రేమని యెప్పుడైనా ఆమెతో చెప్పాడా లేదా అన్నది నాకు యెప్పటికీ అనుమానమే.

చివరికి అర్థమైందేమిటంటే - యెంత జిగిరీ దోస్తులైనా యెవరి కథ వాళ్ళదే. యెవరి జీవితం వాళ్ళదే. యెంత దగ్గిరగా వెళ్ళినా, వాళ్ళ కథలోకి చొరబడి, మనమేమీ చేయలేం. కనీసం వాళ్ళ కొద్దిపాటి దుఃఖాన్ని కూడా సొంతం చేసుకోలేం. అదీ ఐరనీ! అందుకే, యీ అనుభవాల తలపోతలో కూడా నా భాగమేమీ లేదు. యెటు విన్నా వాడి గొంతుకే వినిపిస్తుంది, వాడే కథ చెప్పినా చెప్పకపోయినా.

***

దివారం పొద్దున్న శ్రీకర్  కాళ్లకి తెలీదు, అవి ఎందుకు చర్చి వైపు పరిగెడతాయో! అప్పుడప్పుడూ అనుకుంటాడు- చర్చి ముందు తెలుసా, మేరీ ముందు తెలుసా?! అని.  సమాధానం కష్టమే. చిన్నప్పటి మేరీ అతన్ని  చర్చికి వెళ్ళమనీ  చెప్పలేదు. చర్చివాళ్లెవరో  యింటికొచ్చి రారమ్మనీ అడగలేదు.

 ఆ చర్చి చుట్టూ తిరిగే బదులు వెళ్ళేదేదో గుడికెళ్లి, వొక దండం పెట్టుకు రా! కాస్త పుణ్యమైనా దక్కుతుందేమో!” అని యిప్పటికీ తల్లి  గొంతు పెద్దగానే వినిపిస్తుంది. అతని పుణ్యాల కోటా తగ్గిపోతూ పోతూ వుందని ఆమె  హెచ్చరిక అన్న మాట.

అయితే మేరీ, కాకపోతే వొకటీ అరా స్నేహితులు తప్ప యెవరూ  లేని అతని చిన్ని ప్రపంచంలో చర్చి వొక్కటే ఆత్మీయంగా పలకరించే చోటు. అలాంటిదే మరో చోటు వాళ్ళింటి డాబా-

అతనికి మాత్రమే కనిపించే లోకంలో కాలేజీ  రోజుల నుంచీ యీ  డాబా యేమీ మారలేదు. అట్లా అని అదేమీ పెద్ద డాబా కాదు. కింద వున్న రెండు  గదుల ఇంటిని కాపాడే గొడుగు అంతే. డాబా వెనక వేపచెట్టు యీ  డాబా మీదికి కూడా నీడలు చాస్తుంది. వేపచెట్టు కింద పడుకోవద్దని అమ్మ వందసార్లు మందలించి వుంటుంది. అయినా, మెత్తని గాలి అలల వ్యామోహంలో ఆ నీడని వదిలివెళ్ళడం నచ్చదు.  అందుకే, పనిమాలా తెచ్చుకున్న చింకి చాపనీ, చిన్ని దుప్పటినీ, దిండుని ఆ చెట్టు గాలి ముమ్మరంగా ప్రసరించే చోటుకి లాక్కొని మరీ పడుకుంటాడు. అట్లా పడుకొని ఆకాశంపైన నెమ్మదిగా తెరచుకునే నక్షత్రాల దారుల్ని వెతుక్కుంటూ వుంటాడు.  

 యింటి ముందు కూడా  యింకో అపరిచితమైన చెట్టుంది. దాని పేరు అమ్మానాన్నలకూ  తెలియదు. యింకాస్త పెద్ద వాళ్ళని అడిగినా తెలీలేదు. చివరికి మేరీకి కూడా తెలీదు. అదీ అతని ఆశ్చర్యం. మేరీకి తెలియని చెట్టూ, మొక్కా, పువ్వూ లేదని అతని మూఢ నమ్మకం,  మేరీ పట్ల వున్న అనేక నమ్మకాల మాదిరిగానే- యెంతకీ తెలియని మనుషులున్నట్టే, మనసులో యెంతకీ తెరచుకోని తలుపులూ వున్నట్టే- ప్రకృతిలో కూడా అట్లా అపరిచితమైనవి యెన్నున్నాయో! అలాంటి యెన్ని పరిచిత, అపరిచిత లోకాల్ని చూశాడో మేరీ సమక్షంలో శ్రీకర్!

 మేరీ తన  కంటే ఏడాది చిన్నదో, పెద్దదో యెప్పుడూ పట్టించుకోలేదు. కానీ, కాలేజీలో ఏడాది సీనియర్ కాబట్టి పెద్దదే కావచ్చు. కాకపోవచ్చు కూడా. కలిసి వచ్చిన దూరాలూ, నడిచివచ్చిన దారులూ చెట్టాపట్టాల్ వేసుకున్నట్టే వుంటాయి. కాబట్టి, యెప్పుడూ వయసు పెద్ద అడ్డంకి కాలేదు, వొక రోజు వాళ్ళమ్మ  మేరీ వయసు గురించి తండ్రితో గొడవ పడేదాకా.

 

సలు వయసు కంటే పెద్ద సమస్యలు వేరే వున్నాయ్. అవి కూడా మీరు పట్టించుకోవడం లేదు,” అని వొక రోజు తల్లి గట్టిగా తగవుకి దిగింది తండ్రితో- సాయంత్రం కాబట్టి వాళ్ళు  వెనక వున్న మెట్ల దగ్గిర  కూర్చొని మాట్లాడుకుంటున్నారు. డాబా మీద వున్న అతనికి ఆ మాటలు వినిపిస్తున్నాయో లేదో అన్న స్పృహ వాళ్ళకి లేదు.

“వేరే వాళ్ళని యింట్లోకి కూడా రానివ్వం మనం! అట్లాంటిది, ఆ అమ్మాయి చీటికిమాటికి రావడం  అసలు భరించ లేను. అన్నీశుభ్రం చేసుకోలేక చస్తున్నా,” అంటున్నప్పుడు తల్లి గొంతు సహజంగానే పెద్దదయింది. శ్రీకర్ నెమ్మదిగా జంధ్యం కూడా తీసేస్తాడనీ, విధిగా చేసే అనుదిన అభిషేకమూ మానేస్తాడనీ, శనివారాలు గుడి చాయల్లోకి కూడా వెళ్లడనీ అప్పటికి ఆ తల్లి వూహకి అందలేదు. వయసు వేడి తగ్గితే అన్నీ పోతాయని సర్దుకుపోయిందేమో తెలీదు. కానీ, అతని  ప్రవర్తన ప్రభావం చెల్లి చదువు మీద పడింది. కాన్వెంటు బడికి పంపితే చదువుల కంటే సంధ్యలే యెక్కువైపోతాయన్న భయంతో చెల్లిని యింట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు యిద్దరూ. “నాకు ఫ్రెండ్స్ యెవరూ లేరు,” అని మొత్తుకున్నా.

 

యీ  డాబా లేకపోతే అతని ప్రపంచం మరీ ఇరుగ్గా వుండేది. అట్లాగే, మేరీ లేకపోతే అసలు ఆ చిన్న ప్రపంచం కూడా వుండేది కాదేమో. అతను పుట్టి పెరిగిన చిన్న వూళ్ళో రైల్వే స్టేషన్ తప్ప పెద్ద ఆకర్షణ యింకేమీ లేదు. అట్లాంటిది, అయిదో క్లాసు మొదట్లో వొకమ్మాయి చాలా అమాయకంగా క్లాసులోకి అడుగుపెట్టింది. కానీ, ఆ అమాయకత్వం వొట్టొట్టిదే అని వారంలోనే అందరికీ అర్థమైపోయింది. అప్పుడు ఇంగ్లీషు క్లాసు అంటేనే హడలిచచ్చిపోయే అతనికి మేరీ అంటే ప్రాణమే అయిపోయింది. ఇంగ్లీషులో రెండు వాక్యాలు హాయిగా మాట్లాడేసే యెవరికైనా ప్రాణాలన్నీ యిచ్చేసే దశలోనే వున్నాడు మరి.

 మేరీ రెండు వాక్యాలేం ఖర్మ. టక్కున నిలబడి వొక  కథే చెప్పేసింది. ఆ కథ కూడా యెలాంటి కథ?! “గివింగ్ ట్రీ” అంట. అంటే కల్పవృక్షమే కదా!  ఆ కథలో - He would climb up her trunk and swing from her branches and eat apples- దగ్గిర అతని గుండె చిక్కుకుంది. ఈ యాపిల్ యేమిటో అతనికి అప్పట్లో తెలీదు. ఆ పల్లెటూరి గబ్బిలాయి లోకంలో  రేగ్గాయలు, జామకాయలే యెక్కువ. గుడికెళ్తే, యెప్పుడైనా ఓ అరటిపండు దొరికితే మహాప్రసాదమే!

ఆ సాయంత్రం  వాళ్ళ రైల్వే క్వార్టర్స్ కి తీసుకెళ్లి, వొక యాపిల్ పండు కోసి, అతనికిచ్చింది.  అట్లా చేసే ముందు వాళ్ళ అమ్మని గానీ, నాన్ననిగానీ వొక్క ముక్క అడగలేదు. నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గిరకి వెళ్ళిపోయి, వొక పండు తీసుకొని, కోయడం మొదలెట్టేసింది. అట్లాంటి సరికొత్త స్వేచ్చ అతనికి వూపిరాడనివ్వలేదు. మరీ చిన్నప్పటి విషయాల్లోని యీ చిన్న చిన్న వివరాలు కూడా అతని మనసులో చాలా కచ్చితంగా రికార్డయి వున్నాయి.

కల్పవృక్షమూ, యాపిల్ పండు మొదలు మాత్రమే. యింగ్లీషు, చర్చి, క్రిస్మస్, బైబిల్—అతని జీవితంలోకి తాజాగా ప్రవేశించాయి.  కానీ, ఆ ముచ్చట మూడేళ్లతో ఆగిపోయింది. వొక ఎండాకాలం చివర తండ్రి రెవెన్యూ వుద్యోగంలో బదిలీ వచ్చి, అందరూ పట్నం చేరారు. అతని ప్రపంచం కుదేలైపోయింది. వూరు మార్పుకి బలమైన కారణం అతని చదువు బాగుపడుతుందని తల్లిదండ్రుల ఆశ. ఆ ఆశ యెంతోకాలం నిలబడలేదు. యెందుకంటే ఇంటర్ చదువుల కోసమో, బదిలీ మీదనో మేరీ కుటుంబం కూడా పట్నం వచ్చేసింది.

 

ర్చ్ రోడ్డులో తప్ప ఇల్లు దొరకలేదా రా నీకు! ముందే చెప్తే, మన వీధిలో చూసి పెట్టేవాళ్లం కదా! యేదీ పద్ధతి ప్రకారం చెయ్యవు.  పిల్లలకు మన యిరుగూ పొరుగూ చాలా ముఖ్యం- మరీ యీ  కాలంలో! అన్నాడు తండ్రి స్నేహితుడు నరేంద్ర మామయ్య మొదటి రోజే. వాళ్ళతో రెండు వైపులా చుట్టరికం. కానీ, యెందుకో తండ్రి అతనికి కొంత దూరంగా మసలుకుంటాడు.

“యిది చవకగా దొరికిందిరా! నెమ్మదిగా మారుతాం లే! అయినా చర్చికి వెళ్ళే రోడ్డు తప్ప చర్చి వీధి కాదుగా!” అని తండ్రి  అన్నాడు  గానీ, ఆ నెమ్మది అనేది యేళ్ల తరబడి అయిపోయింది. ఆ వీధి పేరే సెయింట్ మేరీస్ రోడ్డు. వీధి చౌరస్తాలో పెద్ద చర్చి. వేరే వేరే వాళ్ళున్నా గానీ యెక్కువగా అక్కడ కిరస్తానీలే.

“యిల్లు ఇక్కడ కాబట్టి కాస్త పెద్దది దొరికిందిలే ,” అని తండ్రి వొకటికి పదిసార్లు చెప్పడంతో తల్లి కూడా నెమ్మదించింది. కాకపోతే, వీధి వీధంతా నీచు వాసన అని ముక్కు మూసుకుంటూ తిరగడం మాత్రం మానెయ్యలేదు. తన పూజగది తనకి వుంది కదా అన్న ప్రశాంతత కూడా ఆమెకి వచ్చేసింది. అప్పుడప్పుడూ మేరీ వచ్చి, వెళ్లడమే ఆమెకి నచ్చలేదు. పైకి యేమీ అనలేకపోయింది,  ఆ ముందు చిన్న వసారాలోనే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, వెంటవెంటనే  పంపించేందుకు శ్రమపడ్డం తప్ప. అది అర్థం కావడానికి మేరీకి యెక్కువ సమయమేమీ పట్టలేదు. తిన్నగా డాబా మీదికొచ్చి, అక్కడే కాసేపు మాట్లాడి, వెళ్లిపోవడం మేలు అనుకుంది. అదీ వారానికోసారి!

 

“వొరే, వూళ్ళో చాలా జరుగుతున్నాయ్. నువ్వు గమనిస్తున్నావో లేదో!” అన్నాడు నరేంద్ర  మామయ్య.  వొక రోజు తండ్రి తో మాట్లాడడానికి వచ్చి,  చర్చి సంఘటనలన్నీ ఆయన పూసగుచ్చినట్టు చెప్తున్నాడు.

ఆ రోజు ఆయనతోపాటు వాళ్ళబ్బాయి కిరణ్  కూడా వచ్చాడు. కాలేజీలో యిద్దరూ వొకే క్లాసు. రోజూ వొకళ్ళ మొహాలు వొకళ్లు చూసుకుంటారు  గాని, మాటల్లేవు. “ఆ మేరీతో యేంట్రా కబుర్లు?” అన్న వాక్యంతో మొదలైన గొడవ వాళ్ళిద్దరి మధ్యా పెద్ద గోడ.  అలాంటిది ఆ రోజు యిద్దరూ కలిసి రావడం ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళిద్దరి మాటల సారాంశం విన్నాక అదేమీ ఆశ్చర్యంగా మిగల్లేదు.

“యిప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. లేకపోతే, మన వీధుల నిండా ఆ చర్చ్ లూ, ఆ మసీదులే వుంటాయి!” అని ఆ రోజు కిరణ్ అన్న మాట మరచిపోలేదు శ్రీకర్ . అవకాశం వచ్చినప్పుడల్లా అదే వాక్యాన్ని మేరీకి అనేక రకాలుగా అన్వయిస్తూ హెచ్చరికలు పంపిస్తూనే వున్నాడు కిరణ్.

యిది జరిగిన వారం రోజులకే- సెయింట్ మేరీ చర్చి మీద దాడి జరిగింది. వొక ఆదివారం తెల్లారేసరికి చర్చి ముందు భాగం అంతా కుప్పకూలింది. అప్పటినించీ శ్రీకర్ పగలు వొక కునుకు తీస్తున్నా సరే, రెండు మూడు బుల్డోజర్లు వేగంగా చర్చిలోకి దూసుకువెళ్లడమే కనిపిస్తోంది. నిజానికి మొదట యాభై మంది కూడి, చర్చిని కూలుస్తున్నప్పుడు బుల్డోజర్లు యేవీ లేవు. మామూలు గునపాలతోనే వొక్కో గోడా పగలగొట్టుకుంటూ వెళ్లారని తరవాత నరేంద్ర మామయ్య చెప్పాడు. ఆ తరవాత అదే రోజు సాయంత్రం యేడుగంటల ప్రాంతంలో రెండు వందల మంది జమయ్యేసరికి, అది రాజకీయ రంగు పులుముకుంది. బుల్డోజర్ రంగంలోకి దిగి, చర్చి మెట్లదాకా దూసుకెళ్లింది.

మరునాడు సాయంత్రం మేరీ తండ్రి బెంజమిన్ గారు యింకో నలుగురు స్నేహితులతో మెట్ల మీద మాట్లాడుకుంటూ కూర్చొని వున్నారు. యెటు నుంచి వచ్చిన వొక గుంపు ఆ నలుగురి మీదా దాడి చేసి, కొట్టడం మొదలు పెట్టింది.

ఇది జరిగాక మూడు రోజుల దాకా మేరీ కనిపించలేదు. యెవరింటికైనా వెళ్ళి, కనీసం యెలా వున్నారో చూసే పరిస్థితి కూడా పట్నంలో లేదు.  బెంజమిన్ గారికి ఆ రోజు దాడిలో గాయాలు తగిలాయని, ప్రమాదకరమైన స్థితిలో ఆయన్ని హైదరబాద్ తీసుకువెళ్లారని తెలిసింది.

అప్పటికే అక్కడి క్రైస్తవులెవరూ నలుగురికీ కనిపించేట్టు తిరగడం లేదు. జాన్సన్, విలియం, డేవిడ్, మరియదాసు  లాంటి పేర్లున్న వాళ్ళు పేర్లు పైకి చెప్పుకోడానికి కూడా వణికి పోతున్నారు. దాడి తరవాత యింకేమన్నా జరగవచ్చన్న అనుమానాలు అలముకున్నాయి.

కానీ, అతని   వెతుకులాట మేరీ గురించి- కొన్ని సార్లు బుల్డోజర్ మేరీ మీదికి దూసుకుపోతున్నట్టే కలల్లో కనిపించి, వులిక్కిపడి లేవడం మొదలెట్టాడు. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వొక్కరూ మరణాయుధాలతో చర్చి వైపు పరిగెత్తినట్టు అనిపించి, మంచమ్మీంచి దబ్బున నేలమీదికి పడిపోతున్నాడు.

 

దాడి జరిగిన వారం రోజుల తరవాత తెలిసింది- మరునాడు జరిగిన సంఘటనలో గాయపడిన పదిమందిలో ఇద్దరు చనిపోయారని! ఆ ఇద్దరిలో బెంజమిన్ గారున్నారని తెలిసినప్పుడు మేరీ కోసం వాళ్ళ యింటి  వైపు  వెళ్ళాడు శ్రీకర్.

“బెంజమిన్ గారు పోయాక వారానికే వాళ్ళు వెళ్ళిపోయారు. యెక్కడికో నాకూ తెలియదు,” అన్నాడు యింటి  యజమాని. అది అతన్ని మరీ గిల్టీ ఫీలింగ్ లోకి తోసేసింది. దాడి జరిగిన వెంటనే యెందుకు కలవలేదన్న దిగులు కమ్ముకుంటూ వెళ్లింది.

              అసలు దేన్నయినా ధ్వంసం చేయాలనే ఆలోచన యెలా పుడుతుంది?! మరీ ముఖ్యంగా, అది నలుగురు మనుషులు ప్రేమగా కలుసుకునే చోటు అయినప్పుడు , ఆ ప్రదేశం ప్రేమకీ, కరుణకీ సంకేతమైనప్పుడూ అక్కడ అంత విద్వేషం యెందుకు చిమ్ముకుంటున్నాం మనం? యిలా యెన్నో ప్రశ్నలు మేరీ కలిస్తే అడగాలి. కానీ, మేరీని కలవడం యెలా?!

              అదే సమయంలో కొంచెం మనసుని సర్దిపెట్టుకోడానికి బైబిల్ చదువుకోవడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు గట్టిగా పైకే చదవడం అలవాటైంది. అందులో వొక శాంతి. కొంత ఉపశమనం.  ఆ వాక్యాలు అతని మనసు చీకటి లోతుల్లోకి కొంత వరకు తీసుకెళ్ళేవి. కానీ, యిలాంటి సందర్భాల్లో మతం అనేది యెంతవరకు సేదతీర్చుతుందో అతని అనుమానాలు అతనికున్నాయి. తన  మనసుకి యేది యిష్టమో, యేది కష్టమో తేల్చుకొని, దానికొక పరిష్కారం వెతకడంలో తానెంత మాత్రమూ  పనికిరాడన్న బాధ అతన్ని  యెప్పటికీ వెంటాడుతూనే వుండిపోయింది. బైబిల్లోని యీ వాక్యం వొక్కటే అతని గది గోడ మీద మిగిలిపోయింది.

యేమైనా చెప్పగలవా రేపటి గురించి- యేం జరుగుతుందో యేమో తెలియని రేపటి గురించి! యింతకీ, యీ నువ్వూ, నీ జీవితం యేమిటి? కాసేపు కనిపించి, మాయమయ్యే పొగమంచు తప్ప! (జేమ్స్ 4.14)”

3

మొదట్లోనే చెప్పాను కదా, యీ మొత్తం కథలోనూ  అనుభవంలోనూ  నేను బయటి మనిషిని మాత్రమే. శ్రీకర్ తో నాకున్న  స్నేహంలోని యిసుమంత కూడా వాణ్ణి సేదతీర్చలేకపోయింది. తలచుకున్నప్పుడల్లా కొన్ని సూదులు గుండెల్లోకి గుచ్చుకున్నట్టు అనిపించిన సందర్భాలు లేకపోలేదు. కానీ, వాడి అనుభవంలో నేనెప్పుడూ పరాయీవాణ్ణి. నేనొట్టి  కథకుడిగా మాత్రమే మిగిలిపోయానని మళ్ళీ మళ్ళీ రుజువవుతూనే వచ్చింది.

కచ్చితంగా పోయిన వారం క్రిస్మస్ రోజు పొద్దున శాంతితో కాఫీ కబుర్లు చెప్తూ, అన్నాను. “వొక సారి వూరెళ్లి రావాలి!”

“యేముంది నీకు ఆ వూళ్ళో?” అంది శాంతి వెంటనే.

నిజమే, అమ్మానాన్న యిద్దరూ పోయాక వూరికి వెళ్లాలనే ఆలోచన కూడా పోయింది. బతికినంత కాలం వాళ్ళు అద్దె యింట్లోనే వున్నారు. కాబట్టి, సొంత వూరు అన్న సెంటిమెంటు కూడా పనిచేయడం లేదు. కానీ, క్రిస్మస్ రోజు- బహుశా మా తీరికలేని బతుకుల్లో సెలవు దొరకడమే కష్టం కాబట్టి- నాకు ఆ ఆలోచన వచ్చి వుంటుంది.

అయిదేళ్లయింది.  మేమిద్దరం హైదరాబాద్ వచ్చేశాం యిద్దరికీ వుద్యోగాలు వొకే కంపెనీలో దొరకడంతో- మా యిద్దరు పిల్లల చదువుకి కూడా హైదరబాద్ బాగుంటుందనుకున్నాం.

యెలాగో వీలు చిక్కించుకొని,   వారం రోజుల తరవాత వెళ్ళాను. కారులో తిన్నగా శ్రీకర్ యింటికే వెళ్ళాను. యిప్పుడు అది యిల్లు కాదు. ఆ పాత యిల్లు కూల్చేసి, వొక అపార్ట్మెంట్ కట్టేశారు బిల్డర్లు. మా అమ్మానాన్న పోయిన ఏడాదే వాడి అమ్మానాన్న కూడా పోయారు. అప్పటికే ఆ యిల్లు బిల్డర్ల చేతుల్లో పడింది. వాడికి  యిల్లు మారడం యిష్టం లేక, అక్కడే సింగల్ బెడ్ రూమ్ తీసుకున్నాడు.

వెళ్ళేసరికి వాడే తలుపు తీశాడు. చూడగానే గట్టిగా కావిలించుకున్నాడు. ఆ కావిలింతలో అయిదేళ్ళ చెమ్మ  నన్ను తాకింది.

కాసేపటి తరవాత వాడి మాటల తీరు మారిపోయింది. వాడి ముఖంలోకి తీక్షణంగా చూడలేకపోయాను గాని, వాడి మాటలు నాలోకి జలపాతంలా దూకుతున్నాయి.

“చూడు యీ  డాబా మీద యిలా కూర్చుంటేనే మేరీ వచ్చేస్తుంది. చాలా సేపు కబుర్లు చెప్పుకుంటాం. ఆ తరవాత మేరీ వెళ్లిపోతుంది. యెక్కడికెళ్లి పోతుందో తెలీదు.”

అది డాబా కాదనీ, నువ్వొక అగ్గిపెట్టెలాంటి అపార్ట్మెంట్ లో వుంటున్నావని చెప్పాలనుకున్నాను.

“ఈ వేపచెట్టు గాలి తాకినప్పుడల్లా మనసులోకి వొక నెమ్మదితనం వచ్చేస్తుంది,” అన్నాడు కాసేపయ్యాక-

అక్కడ యెక్కడా వేపచెట్టు లేదని, వాడి కాంప్లెక్స్ కి ఆనుకునే మరో అపార్ట్మెంట్ వుందనీ చెప్పేయాలనుకున్నాను.

“తెలుసా!? యిప్పటికీ యింటి ముందు యీ పూల చెట్టు పేరు మాత్రం యెవరూ చెప్పనే లేదు!” అన్నాడు ఇంకాసేపటి తరవాత.

యింటిముందు యే చెట్టూ లేదని కూడా చెప్పేదామని గట్టిగా అనిపించింది. వొక్క మాటా అనకుండా, వాణ్ని పైనించి కిందిదాకా చూశాను పరీక్షగా!

మనిషి ఆరోగ్యంగా లేకపోవచ్చు. కానీ, అనారోగ్యం జాడలైతే యెక్కడా లేవు. నేనొచ్చే ముందే చక్కగా స్నానం చేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకున్నట్టే వున్నాడు. వాడే వంట గదిలోకి వెళ్ళి, టీ చేసుకొచ్చాడు.  నలగని బట్టల్లో దాక్కున్న నలిగిన మనసు మాత్రం నాకు కనిపిస్తూనే వుంది.

యెక్కువేమీ మాట్లాడలేకపోయాను. మాట్లాడడానికి నేనేమిటి అన్న బాధ నన్ను నలిపేస్తోంది. వాడి లోకంలో మేరీ యింకా అలానే వుంది నిలకడగా!

యీ అయిదారేళ్లలో వాడికి నేనేమీ యివ్వలేకపోయాను. అతని లోపలి  గాయాన్ని కనీసం  పైపైన అయినా తాకలేకపోయాను. కాసేపటి తరవాత యిక నేను వెళ్లిపోవాలి. వాడు కింది దాకా వస్తానని చెప్పులు వేసుకోబోయాడు.

“వద్దు, వద్దు!” అని నేనే ఆపేశాను. వీడ్కోలుని తట్టుకునే శక్తి నాలో లేదు.

వాడు యింకోసారి నన్ను ఘాట్టిగా హత్తుకున్నాడు. మెట్లు దిగి గబగబా బయటికొచ్చేశాను. పొగమంచు చుట్టూరా. కారు అద్దాల్లోంచి, కళ్ళద్దాల్లోంచి అంతా మసగ్గా అనిపిస్తోంది.

అది నిజంగా పొగమంచా?! లేకపోతే, నాలోపలిదా?!

తెలియదు.

వాణ్ని మళ్ళీ చూస్తానో లేదో కూడా తెలియదు. నాకు తెలియకుండానే కారు అతివేగంగా దూసుకుపోతోంది, వాడికి దూరంగా-

 *

  

పూర్తి కాని వాక్యాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-   1           మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!   ...