ఒక నేను వెళ్లిపోయింది

వొక జీవిత కాలం తరవాత, నాన్నా
నువ్వు అర్ధం అవుతున్నావ్ నెమ్మదిగా.

అతి నెమ్మదిగా

ఆగిపోయిన వేడి నిట్టూర్పులాగా
సాయంత్రపు గూటిలో ఆరిపోవడానికో
పారిపోడానికో నిరాకరించే గుడ్డి దీపంలాగా.


వందల వుదయాలు
ఇంకా కొన్ని వందల సాయంకాలాలు
సడి సేయని కొన్ని రాత్రులూ స్నేహరాహిత్యపు నడి రాత్రులూ

ద్రవించని చీకటి పగళ్ళూ

నేర్పలేని బతుకు పాఠం ఏదో
కొత్త పేజీ తిప్పుతోంది ఈ పూట


నువ్వు పూర్తిగా నా కంటిలోంచి జారిపోయాక
ఈ ఇల్లు నీ అనంతర నిశ్శబ్దపు నదిలో
పొగిలిపోతున్న పడవ.


నువ్వు వెళ్ళాకనే
నీ తలాపు దీపపు నీడలోనే

నిన్ను నిజంగా చూస్తున్నానేమో నేను.


ప్రేమించాల్సింది బతుకునో
మరణాన్నో తెలియక
వొక నిట్టూర్పు నిట్టాడి మీద
నిటారుగా వొరిగే గుడిసె నేను.


మరణం ఎప్పుడూ వో కొత్త పాఠమే !

అదే పేజీ మీద
అదే ఈగ
అదే నెమలీక
అదే పునరుక్తి.


(నాయుడూ, ఇది మీ నాన్న కోసమే అని చెప్పలేను, నా కోసమే అనీ అనుకుంటాను, ఎప్పుడో రాయాలనుకొని రాయలేకపోయిన రామ్ కోసం అని కూడా అనుకుంటాను.)
Category: 3 comments

చార్మినార్ సూర్యుడికి ఎదురుగా...

వొక సీతాకోక చిలక
ఆత్మహత్యకి ముందు విడిచి వెళ్ళిన
కోకల రంగులు
రోడ్డు మీద మెరుస్తూ కనిపిస్తాయి


వెయ్యి మందికిపైనే
ఈ రోడ్డుని తొక్కి వెళ్ళిపోయారు
ఎవరికెవరూ కనిపించకుండా.


వొక మధ్యాన్నం
చార్మినార్ సిగ మీద సూర్యుడు
తెల్ల బంతి పువ్వై నవ్వుతున్నప్పుడు
కాసేపు అతని వొకానొక చూపులోకి
నువ్వూ ప్రయాణించు.



అంత కష్టమేమీ కాదు
కణ కణ నిప్పుల కొలిమిలోకి
వొక కన్నుని వొంపి
అనేక చూపుల ద్రవాన్ని
బయటికి లాగడం!


వొక సీతాకోక చిలక
తన రంగులన్నీ మరచిపోయి
నలుపులోకి నిష్క్రమించింది
ఈ మలుపు దగ్గిరే.



ఇక్కడి నించి
జీవితాన్ని చూడు

అదెలా కనిపిస్తూ వుందో
కాస్త చెప్పు.

ఇప్పటి దాకా నడుస్తూనో
పరిగెత్తుతూనో వెళ్ళిన ఆ వెయ్యి మంది

కనీసం


వెయ్యి అబద్ధాలు చెప్పారు
అమాయకంగానే!

సంధ్యా వందనము

( మూలం- అఫ్సర్
- అనువాదం- గన్నవరపు నరసిం హ మూర్తి )


పిలువ రాదె నిన్ను పెందలకడ వేళ
చెవిటి చెవుల లోన చేసి రొదలు
శ్వాస విడచి నీదు మూసిన కళ్లందు
చాలు నిద్ర యనుచు మేలుకొనవె

ప్రాత విడుపు గాదె ప్రత్యూష వేళందు
కాళ్ళు ముఖము కళ్ళు కడుగ జలము
సంధ్య వేళ శృతులు స్మరణ చేయగ బూన
నొక్క దిక్కు కేల మ్రొక్కు లీయ


ఒక్కటొక్క టంచు నొక్కయు దిక్కేల
ద్రవము నౌట నాదు దర్శనంబు
పాఱు నన్ని దిశల ప్రాజ్ఙత గలిగుండి
పవన రీతి నాదు ప్రార్ధనంబు

ప్రొద్దు పొడుచు వేళ ముద్దు ముందటి మాట
మాపటందు గూడు మలిన మూడె
మొము వాయి పాడ మోహన రాగమ్ము
హృదయ తమ్మి విచ్చె ఉదయ మందు


పిలువ రాదె మఱల పెందలకడ వేళ
తర్పణంబు జేసి తపము జలము
ఇంద్రియమ్ము లందు నిమ్ముగా నొలికించి
చక్షురాశి తెరుమ సంధ్య వేళ

శున్య మావరించె సుందర జగతంత
పిలువ రాదె నిన్ను వేకు వందు
చెవులు చిల్లు పడగ చేయుచు ప్రార్ధన
వింధ్య వోలె వంగి సంధ్య వేళ

(original in English: see www.afsarpoetry.blogspot.com)
Category: 0 comments

యిక్కడేదో వొక జాంచెట్టు...

1

యెవ్వరికీ చెప్పలేదు

కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట
వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా.
గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని అతి ప్రేమగా పెంచేవి యెవ్వరికీ తెలీకుండా !

2

పొద్దున్న నిద్రమొఖంతో మబ్బు కళ్ళతో
దాని ఆకుల్లోకి తీక్షణంగా చూసి
దాని కొమ్మల్లోంచి రాలిపడే కిరణాల్ని కళ్ళలోపల దాచుకొని
పొద్దుటా, మధ్యాన్నం, రాత్రి పూటా ఆ వొకే వొక్క జాంచెట్టు దాని నీడ నేనయ్యానో అది నా నీడ అయ్యిందో?!

3

దాని లేలేత వగరు ఆకుల్ని అప్పుడప్పుడూ నవుల్తూ
దాంతో మాట్లాడ్తున్నట్టొ, పోట్లాడ్తున్నట్టో
అన్ని వయసుల యేడేసి రంగుల్లో దాంతో ఆడ్తూనో,
రాయని ప్రేమ లేఖల్ని దాని జడ పాయల్లో దాస్తూనో దాపరికాలు లేవు యిక్కడికొచ్చాక.
పరాయి క్షణాల్లేవు యీ గడియారంలో.

4

యెవ్వరికీ చెప్పనయితే లేదు
కాని యిక్కడ నేను కూర్చున్న చోటే
యీ అరుగు మీద జీవితాన్ని గురించి
బేఫికర్ గా బేఖాతర్ చేస్తూ
రాత్రిని పగల్లాగా, పగటిని రాత్రిలాగా మార్చి మార్చి చూసుకొని లేనిపోని తకరార్లు పడి,
ఆరునూర్లయ్యి ఆరు కాలాల వర్ణ వివర్ణ దృశ్యాలన్నీ మారి
చివరికి యెవరికెవరు మారామో తెలీదు కానీ
యిప్పుడీ క్షణం ఆ చెట్టు వొక అజ్నబీ!


వొక జ్నాపిక : “ ఈ జాంచెట్టుని పెళ్ళగించి, ఇంకో చోట నాటగలవా?” - అని అడుగుతుంది సయీద్ అఖ్తర్ మీర్జా సినిమా ‘నసీమ్ ‘( 1995) లో వొక ప్రధాన పాత్ర. ఆ జామ చెట్టు భారతీయ ముస్లిం అస్తిత్వానికి వొక ప్రతీక.













































































































































































































యిప్పుడీ వొళ్ళు లోతైన వేళ్ళ గాయం!

యింతే! ఆ క్షణానికి గెల్చిన అప్పటి ఆటలు ఇప్పుడు వోడిపోతాం.


1

బయటి కన్ను మూసుకున్నప్పుడు లోపలి కన్ను వెలిగించుకొని
లోపలి కన్ను మసకేసినప్పుడు బయటి కన్ను దీపం పెట్టుకొని
వొళ్ళంతా తడుముకొని వెతుక్కున్నట్టు చెట్టు
నన్ను నిలువెల్లా జల్లెడ పడ్తుంది,
నన్ను యెట్లయినా నన్నుగా రాల్చాలని!

2

అననైతే అన్లేదు గాని యిన్నాళ్ళ యిన్నేళ్ళ నిశ్శబ్దం తరవాత వొక చెట్టూ వొక నిలువెత్తు మనిషీ కుప్ప కూలిపోతున్నట్టే వుంది కళ్ళ ముందర!

3

వెతుక్కుంటూ వెళ్తే యిప్పుడిక్కడ ఏమీ లేదు కాని వొక మిగుల పండిన జాంపండు వాసన వొంటికంతా అంటుకున్న నిప్పు.

4
మాగన్నుగా నిద్దరోతున్న లోపటి వొళ్ళు
దాని గడ్డ కట్టిన నిద్రా హిమవత్పర్వత లోఅరణ్యం
నిప్పు గుండం.

5

నిద్ర మీంచి నిప్పుల నడక వొకే వొక్క మెలకువ యిప్పుడీ వొళ్ళు లోతైన వేళ్ళ గాయం! 2006
*
Category: 0 comments

హైదరాబాద్: కొన్ని వానలూ కొన్ని చలి గాలులూ!





1
ఇక్కడ సాయంత్రం ఏనాడూ లేదు కాబట్టి
ప్రతి నిద్రలో
వొక సాయంత్రాన్ని కలకంటాను ఇప్పటికీ.


చెట్లకి నీడలు చెరిగిపోయాక
ఆకాశం ఎండనంతా ఆరేసుకున్నాక
ఒక చలి గాలిని కప్పుకొని


ఏదో ఒక సాయంత్రం
చీకటి పడేలోగా
గూడులోకి రెక్కలు ముడుచుకోవాలి.


2


వాన మధ్యాన్నమే మొదలయ్యిందో
పొద్దుటి నించీ పడుతూందో తెలీదు
మధ్యాన్నం మొదలయ్యే బతుక్కి
ఉదయాలూ తెలియవు.


మధ్యాన్నం లేచే సరికి
గడియారం మోగీ మూల్గీ
విసుక్కుంటూ వుంటుంది.
కాలాన్ని
తిరగేసి చూడడం అలవాటే!


3

వానలూ చలికాలాలూ

వాటి భ్రమణ కాంక్షల్ని చంపుకున్నాక

మొలిచిన అష్టావక్ర .



4

హైదరాబాద్ నా రూపాంతరం


వొక కల లేని నిద్ర
నిద్ర రాని కల

- కునుకు కప్పుకున్న మెలకువ.

తెలంగాణా కథ గురించి మళ్ళీ...!






ప్రాంతం/ ప్రాంతీయత తెలుగు కథకి ఇవాళ కొత్త అంశాలు కావు. తెలుగు కథ పుట్టినప్పటి నించీ "ప్రాంతం" ఆ కథకి పునాది. ప్రాంతం నేపధ్యం లేకుండా తెలుగు కథ ఏ నాడూ లేదు. కాని, ప్రాంతాన్ని వొక దృక్పథాంశంగా తీసుకోవడం గత మూడు దశాబ్దాలుగా తెలుగు కథా నిర్మాణంలో, కథా సాహిత్య విమర్శలో కనిపిస్తున్న మార్పు. ఈ మార్పుని మరింత నిర్దిష్టంగా నిర్వచించడానికీ, లేదా, వివరించడానికీ "ప్రాంతం" "ప్రాంతీయ వాదం" అనే రెండు భావనల్ని చర్చించి, ఈ కొత్త "ప్రాంతీయ వాద" చర్చలో తెలంగాణా కథ స్థానాన్ని అంచనా వెయ్యడం ఈ వ్యాసం వుద్దేశం. అయితే, ప్రాంతీయ వాదం అనే భావనకి ఇంతకు ముందే తెలుగు సాహిత్య, సామాజిక రంగాలలో వొక చట్రం నిర్మితమయి వుంది కాబట్టి, ఆ పదానికి బదులు "స్థానికత" అని కొంత విస్తృతార్ధంలో వుపయోగించాల్సిన అవసరం వుంది.
ఇవాళ ప్రాంతం పేరుతో తెలుగు కథకులు చర్చలోకి తీసుకు వస్తున్న అంశాలు అవి ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, కొత్తగా ప్రపంచీకరణ పేరిట వస్తున్న ఆర్ధిక, మార్కెట్, అంతర్జాతీయ రాజకీయ ప్రేరిత భావనల్ని యెదుర్కోవాలన్న ప్రతిఘటన వాంచ స్థానిక కథకులలో కనిపిస్తోంది. తెలుగు కథ ఇప్పటి దాకా సాగించిన నూరెళ్ళ ప్రయాణానికి, ఇప్పుడు రెండో వందలో సాగించబోతున్న కొత్త ప్రయాణానికి కొత్త పునాది మరీ ముఖ్యంగా ఈ పదేళ్ళ కథల్లో వుంది. ప్రాంతీయ అసమానత అనే అంశమే ఈ కొత్త శతాబ్ది ప్రయాణానికి కెంద్ర బిందువు అయినప్పటికీ, తెలుగు కథ ఆ పరిమితిని దాటి, "స్థానికత"ని బలంగా తీర్చి దిద్ది, ప్రపంచీకరణని సవాలు చేయబోతున్నదని ఈ వ్యాసంలో నా ప్రధానమయిన వాదన. అసమానత అనే భావనని కొత్త సందర్భం నించి అర్ధం చేసుకొవాల్సిన అవసరం వుంది. ప్రాంతీయ అసమానత అనేది ప్రాంతానికి మాత్రమే పరిమితంకాదు, ఆ ప్రాంతంలో వుండే ఇతర అసమనాతల్ని కూడా సమంగా చూడక తప్పదు. తెలంగాణలో దళిత స్త్రీవాదులు, ముస్లిం రచయితల కథల్లో ఈ కొత్త అసమానతల కోణాలు మనం చూడ వచ్చు.
ప్రాంతం నించి ప్రాంతీయ అసమానతల్ని ప్రతిబింబించేంత దూరం దాకా సాగిన తెలుగు కథా ప్రయాణం కూడా చిన్నదేమీ కాదు. మొదటి తెలుగు కథ ఎవరు రాశారన్న వివాదం కొంచెం పక్కన పెడితే, ఆధునిక తెలుగు కథకి వొక నిర్దిష్టమయిన ఆకృతినీ, చెలామణినీ తీసుకు వచ్చిన గురజాడ వొక ప్రాంతాన్ని ఎన్ని కోణాల నించి చూపించ వచ్చో అన్ని కోణాల్నీ కథల్లో చూపించాడు. వొక నిర్దిష్టమయిన స్థలాన్ని, కాలాన్ని, సమూహాల్ని సన్నిహితంగా అధ్యయనం చేయడం ద్వారా సమకాలీన చరిత్రనీ, సంస్కృతినీ సునిశితంగా అంచనా వేసే ఆధునిక ఆంథ్రొపాలజిస్టులకూ, ఇథ్నాగ్రాఫర్లకూ అవసరమయిన సమగ్ర సమాచారంతొ పాటు, ఆ స్థల కాలాల్లోని వివిధ సమూహాల భావోద్వేగాల చరిత్ర సమస్తం గురజాడ కథల్లో వుంటుంది. (ఉదాహరణకి: "దేవుళ్లారా! మీ పేరేమిటి?") వలస పాలనకీ, ప్రాంతీయ అధికార శక్తులకూ మధ్య స్థానిక జనం ఎంత రాపిడికి గురయ్యారో, ఆ రాపిడి లోంచి కొత్త అస్తిత్వాలు ఎలా పుట్టుకు వచ్చాయో ఆ కథల్లో చూడ వచ్చు. ప్రస్తుత తెలంగాణా కథా చర్చకి సంబంధించినంత వరకు కూడా ఈ కథలు ముఖ్యమయినవే. హైదరాబాద్ చరిత్ర, ముస్లిం సంస్కృతి, ఉర్దు ప్రభావాల గురించి ఇప్పటికింకా అపోహలు వున్నాయి.(ఉదాహరణకి: సెప్టెంబరు "ప్రాణహిత" వెబ్ పత్రికలో జాజుల గౌరి వ్యాసం చూడండి) తెలంగాణ స్థానిక చరిత్రలో ముస్లిం సంస్కృతి పాత్ర విడదీయలేనిది. దీనికి "పీర్ల పండగ" సూఫీ దర్గాలు వొక బాహ్య సంకేతం మాత్రమే. ఒక విశాల భావనగా ముస్లిం సంస్కృతి కట్టుదిట్టమయిన వొక సెక్యులర్ స్పేస్ ని నిర్మించింది. ఈ విషయం తెలంగాణ కథకుల కంటే వొక కళింగ కథకుడు గురజాడ ముందుగా సాహిత్యంలో రికార్డు చెయ్యడం మనం గమనించాలి. హిందూ జాతీయ వాదం, ముస్లిం వ్యతిరేక అంతర్జాతీయ వాదం వివిధ రూపాల్లో మన అస్తిత్వాల్ని ప్రభావితం చేస్తున్న సందర్భంలో తెలంగాణ స్థానికతలో, సామాజిక అసమానతల చర్చలో ఈ సెక్యులర్ భావనని తెలంగాణా కథకులు ఎలా అర్ధం చేసుకుంటున్నారో, తెలంగాణా బతుకులో సగ భాగమయిన ముస్లింలని కథల్లోకి ఎలా తీసుకువస్తున్నారో నిశితంగా చూడాల్సిన అవసరం గురజాడ కాలం కన్నా ఈ కాలంలోనే ఎక్కువ. ముస్లింలని సరిగా అర్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే, మనం మన చుట్టూ వున్న స్థానికతని సక్రమంగా అర్ధం చేసుకోగలం. ఈ స్థానిక జీవన విధానం అర్ధం కానంత కాలం మనకి ఇందులో వున్న అసమానతలు బోధపడవు. గత పదేళ్ళుగా తెలంగాణా కథని దగ్గిరగా పరిశీలిస్తే, మన కథకులు ఈ కొత్త అసమానతల వాస్తవికతకి సమీపంగా వస్తున్నారని ఆధారాలు దొరుకుతాయి. ముస్లిం సమూహాల స్థానిక వేదన 'వతన్ 'లో వుంది. దళిత స్త్రీల సంఘర్షణకి 'నల్లపొద్దు ' ఆ తర్వాత ఆ రచయిత్రులు రాస్తున్న కథనాల్లో వుంది. గని కార్మికుల బాధల్ని తవ్విపోసే కథలు వున్నాయి. చేతివృత్తుల వారి కడగండ్లని, వూరి జనం చెదిరిపోతున్న బతుకుల్ని రాసే కథకులు ఈ అయిదారేళ్ళలో పెరిగారు.


అలాగే, తెలంగాణాతో పాటు ప్రాంతీయ అసమానతకి గురవుతున్న ఇతర ప్రాంతాలు కూడా వున్నాయి. ముఖ్యంగా, రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు. ఆ ప్రాంతాల పట్ల ఎలాంటి వైఖరి వుండాలన్నది కీలకమయిన అంశం; అక్కడి కథకులు ఎలాంటి స్థానికత గురించి మాట్లాడుతున్నారో, ఎలాంటి అసమానతల్ని గురించి మాట్లాడుతున్నారో, వాటికీ తెలంగాణా స్థానికతకి పొంతన కుదురుతుందో లేదో బేరీజు వేసుకుంటే, తెలంగాణా స్థానికత మరింత తేట పడుతుంది. అసమానతల సారూప్యాలూ, భిన్నత్వాలూ స్థానికతని నిర్వచించడంలో, అర్ధం చేసుకోవడంలో సాధనాలు అవుతాయి. కమ్ముకు వస్తున్న ప్రపంచీకరణ, మార్కెట్ యుగంలో స్థానికత కేవలం వొక ప్రాంతానికి, వొక కులానికీ, వొక మతానికీ, వొక వర్గానికీ సంబంధించిన సమస్య కాదు, అందరి/అన్ని ప్రాంతాల ఉనికి సమస్య. మార్కెట్ వ్యూహ రచనలో మొదటి బలి పీఠాలు మన వూళ్ళు. పట్టణీకరణ కేవలం బాహ్య ప్రపంచానికి పరిమితం కాదు, పొడుగాటి గోడల షాపింగ్ మాల్ బయట వీధిలోనే కాదు, మనస్తత్వాల్నీ మార్చేస్తుంది. మీడియా మాయాజాలం కేవలం కనువిందు కాదు, మన ఆలోచనల దిశ మార్చేస్తుంది. ఈ స్తితిని ఇప్పటికే తెలంగాణా కథకులు కథల్లోకి తీసుకు వస్తున్నారు. కాని, ఈ స్థితి ఎలాంటి అసమానతల్ని కొత్తగా నిర్మిస్తుందో కథకులు ఇంకా పట్టుకోలేక పోతున్నారు. ఈ కొత్త పరిస్థితిని బట్టి ఆలోచిస్తే, 'ప్రాంతం' 'ప్రాంతీయ వాదం' అనే భావనలకు ఇప్పటికే ఏర్పడి వున్న చట్రాల వల్ల, ఆ పదాలు నిర్దేశించిన భావాన్ని బట్వాడా చెయ్యలేకపోతున్నాయి. కొండొకచో, సంకుచిత రాజకీయ పరిమితులు కూడా కొందొకచో అడ్డుపడుతున్నాయి. కాబట్టి, కొత్త కథకులు కొత్త ప్రశ్నలకు వెతుక్కుంటున్న సమాధానాలకు 'స్థానికత ' సరయిన/ ప్రత్యామ్నాయ వాడుక అనుకోవచ్చు.
("పాల పిట్ట" మాస పత్రిక నించి)
*

నిశీధిలో నిప్పు కణిక అఫ్సర్ "ఊరి చివర"




సాక్షి దినపత్రికలో పంతంగి రాంబాబు గారు రాసిన సమీక్ష.

పదహారో సదికి మళ్ళీ చలో!




కొన్ని శతాబ్దాలుగా అబద్ధంగానే
బతుకుతున్నా.
ఇప్పుడు నిజం చెబ్తున్నా
నేను పదహరణాల పదహారో శతాబ్దం బిడ్డని.
జర సంజో..అంట గాని
సంజాయిషీలు చెప్పను


నిన్న మొన్న గాలికి కొట్టుకొచ్చిన నీకు
ఈ గల్లీల గుండె చప్పుళ్ళు వినిపిస్తయా?
ఈ మసీదు గోపురాల మీద
గిరికీలు కొట్టి
ఆజాదీని నిజం చేసుకున్న వాణ్ణి
నీ డబ్బు మొహం మోహాలతో ముంచెత్తలేవు


రాజ్యానికి మతం రంగు పులిమినప్పుడల్లా
నా పేగుల్ని ఎర్ర తాయెత్తుగా కట్టుకొని
గోలకొండ గుండెల్లో కూడా నిద్రపోయిన వాణ్ణి
నీ కులం కూతలతో నిద్రపుచ్చలేవు.


జాగారాలు మస్తు చేసిన వాణ్ణి బిడ్డా,
జాగో అని ఢంకా బజాయించే వాణ్ణే కాని
నిద్ర మత్తులో జోగే వాణ్ణి కాను.

కాస్త కాస్త అంటూ
నువ్వు జరజర పాకిన వెయ్యికాళ్ళ పాము

కొంచెం కొంచెం అని బిక్క మొహంతో వచ్చి
నా వొళ్ళూ, ఇల్లూ దిగమింగిన వాడివి నువ్వు

నవ్వు మొహం చిందిస్తూ
నా నెత్తుటితో పండగ చేసుకున్న వాడివి నువ్వు

నా మాటల్లో
నా అక్షరాల్లో
నీ విషమే రంగరించిన వాడివి నువ్వు

ఇప్పుడు
నా గుండె కాయని తెంపి
ఫ్రీజోన్ నజరానా చేస్తావా?

సంజాయిషీలు చెప్పను
సముదాయించి అడగను
కొన్ని శతాబ్దాల అబద్ధాలకి ఇంక సెలవు
పదహారో సదికి మళ్ళీ చలో!

-

ఓ యుద్ధ గీతం తెగిపోయింది!



ఆగస్టు 9. ప్రసిద్ధ పాలస్తీనా కవి మహమూద్ దర్వీష్ చనిపోయిన రోజు. ఆయన మా పొరుగున వున్న హూస్టన్ లోనే కన్ను మూశారు.

ఆయన వివిధ కవితల సంకలనం గత ఏడాది అచ్చయింది. అందులో కొన్ని కొత్త కవితలూ వున్నాయి.

ఈ పంక్తులు ఈ మధ్య నన్ను బాగా వెంటాడుతున్నాయి.

I see what I want of poetry: in ancient times, we used to parade martyred
poets in sweet basil then return to their poetry safely. But in this age
of humming,movies, and magazines, we heap the sand on their poems
and laugh. And when we return we find them standing at our door steps...
Category: 1 comments

మంచితనానికి “కోవెల”!

"రక్త స్పర్శ" కవితా సంపుటి వెలువడిన 1986 ల లో ఒక సారి అనుకోకుండా సంపత్కుమార గారిని కలవడం మరచిపోలేని జ్ఞాపకం. ఒక చిన్న ఇంట్లో మేడ మీద కొన్ని పుస్తకాల బీరువాల మధ్య ఆయన్ని కలిసాను. వచన కవిత్వం మీద ఆయన చేస్తూ వస్తున్న లక్షణ చర్చకి ఆయన అప్పుడు రక్తస్పర్శ కవితల నించి కొన్ని ఆధారాలు వెతుకుతున్నారు. అప్పటికే చేకూరి రామారావు (చే.రా) ఆంధ్రజ్యోతిలో “చేరాతల” కాలం లో రక్తస్పర్శ కవిత్వాన్ని "మంచి కవిత్వం మాబాగా వస్తోంది!" అనే శీర్షిక కింద రాసిన పరిచయ వ్యాసం తెలుగు సాహిత్య లోకంలో చర్చనీయాంశంగా మారుతోంది. "ఖమ్మం కవులకు ఓ పీఠం పెట్టేసేట్టున్నాడు రామారావు" అని సంపత్కుమార గారు చలోక్తులు రువ్వే వారు.

సంపత్కుమార సంప్రదాయ వాది అని అప్పటికింకా పేరు. నేను నా వామపక్ష రచయితల శిబిరాల్లో కూడా ఆయన గురించి అదే మాట వింటూ వచ్చాను. చాలా కాలం పాటు అలాంటి మాటలు ఆయన గురించి వినీ వినీ నాకు తెలియకుండానే ఆయన్ని నా మనసు మూలల్లోకి కూడా రాకుండా అతి జాగ్రత్త పడుతూ వచ్చాను. కాని, ఆయన్ని కలుసుకున్న మొదటి సారే ఆయన్ని గురించి నేను విన్నవాటితో నిమిత్తం లేకుండా వొక సద్భావం, స్నేహానుభూతి కలిగింది. ఈయన్ని ఇంతకాలంగా కలవలేకపోయానే అని కొంత పశ్చాత్తాప పడ్డాను కూడా.

అసలు ఆయన్ని ఆ మొదటి సారి అయినా కలవాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. మిత్రుడు బన్న అయిలయ్య అసలు కారణం.
ఏదో వొక సభకో, మిత్రులతో సమావేశానికో వరంగల్ వెళ్ళినప్పుడు, మాటల సందర్భంలో "మీరు ఇంత మందిని కలుస్తున్నరు, సంపత్కుమార్ సార్ ని ఎందుకు కలవరు?" అని అయిలయ్య వొక సారి గట్టిగానే అడిగాడు.
"ఏమో, ఆయన్ని కలవడానికి నాకు అభ్యంతరం లేదు గానీ, మా మధ్య మాట్లాడుకోడానికి ఏమీ వుండదేమో!" అన్నాను.

"అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన మీ కవిత్వం చాలా ఇష్టంగా చదువుతారు. మీ కవిత్వాన్ని గురించి మా క్లాసుల్లో చెబ్తారు. బాగా విశ్లేషణ చేస్తారు. మీరు ఈసారి కలిసి తీరాలె" అంటూ దాదాపూ లాక్కు వెళ్ళాడు.
తన కవిత్వానికి వొక తీవ్రమయిన పాఠకుడు వుండడం కంటే కవికి గొప్ప ప్రలోభం ఇంకా ఏముంటుంది? కాని, నేను స్వతహాగా కొంత బిడియస్తుణ్ణి కావడం, పైగా, సంపత్కుమార గారు వొక "సాంప్రదాయికుడు" అన్న ముద్ర నా మనసులో పడిపోయి వుండడం వల్ల నేను ఆయన ముందు కొంచెం ముడుచుకు కూర్చున్నాను. ఈ లోపు మా కోసం లోపలి నించి మంచి దోసెలు వేడి వేడిగా పళ్ళేలలో తీసుకు వచ్చారు. ఎవరో మధ్యలో ఫోన్లు చేస్తే "అఫ్సర్ వచ్చాడయ్యా మా ఇంటికి. నేను తరవాత మాట్లాడతా." అని ఫోన్లు పెట్టేస్తున్నారు. నా రాక కలిగించిన సంతోషాన్ని ఆయన చెప్పకుండానే రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు.
నా బిడియాన్ని పోగొట్టుకొని నేను మామూలు స్థితికి రావడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ, మా మధ్య సంభాషణ మొదలయ్యాక అది ఎడతెగని ఏరులా సాగిపోయింది. అప్పుడు మొదలయిన ఈ సంభాషణ కనీసం పదిహేనేళ్ళపాటు నిరంతరాయంగా సాగింది. ఎక్కడ కలిసినా మాటలు కవిత్వ లక్షణ చర్చ వైపు దూసుకెళ్ళేవి.

కవిత్వాన్ని గురించీ, కవిత్వంలో పాద విభజన గురించీ నేను అప్పటికే తీవ్రంగా ఆలోచిస్తూ వుండే వాడిని కావడం వల్ల మా మధ్య సంభాషణకి వొక దారం దొరికినట్టయింది. పాద విభజనకి వొక గ్రామర్ వుందని నా వాదన. నేను కొన్ని కవితలు తీసి, వాటిని రెండు రకాలుగా చదివి వినిపించే వాణ్ని ఆయనకు- వొకటి: పాద విభజన లేని పూర్తి వచన రూపంలో, రెండు: పాద విభజన సహితంగా, మధ్య మధ్య విరామాలతో.

"నువ్వు కవిత్వం బాగా చదువుతావ్, కాబట్టి నా చెవులకు మంత్రం వేస్తున్నావ్ కానీ, నిజంగా కవులు ఇంత ఆలోచనతో, ఇంత లయ జ్ఞానంతో ఆ పాద విభజన చేస్తున్నారంటావా?" అని మధ్యలో నా వ్యాఖ్యానం కోసం చెవి అప్పగించే వారు.
ఈ అన్వేషణని ఆయన ఇంకా ముందుకు తీసుకువెళ్ళారు. రాజమండ్రిలో ఎండ్లూరి సుధాకర్ వచన కవిత్వం మీద శిక్షణా శిబిరం నిర్వహించినప్పుడు ఆయన వొక ప్రయోగం చేశారు. కొన్ని వచన కవితల్ని తీసుకొని, వాటి పాద విభజనల మీద కవుల్నీ, పాఠకులనీ పరీక్షించారు. అది ఆయన చాలా శాస్త్రబద్ధంగా, వొక శాస్త్రవేత్తలాగా చెయ్యడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఏ పని అయినా చేస్తే, దాన్ని నిజంగా వొక సైంటిస్టు కన్నుతో, బుద్ధితో చూడడం, తర్కించడం ఆయనలోని గొప్ప లక్షణం.
అయిష్టంగా మొదలయి, ఇష్టంగా పెనవేసుకుపోయిన స్నేహ బంధం ఆయనతో నాది. అతి కష్టమయిన సన్నివేశాలలో కూడా అత్యంత ఆత్మీయంగా, వయ భేదంతో సంబంధం లేకుండా, హాయిగా పలకరించే హితుడు సంపత్కుమార. పాండిత్యమూ, మంచితనమూ గూడు కట్టుకున్న మూర్తి ఆయనది.


(సాహిత్య విమర్శకులూ, కవి సంపత్కుమార గారి నిష్క్రమణ గురించి విన్న తరవాత)

భావకవిత్వం కాదు చదువుతూ మధుర ఊహలలో తేలిపోవటానికి.....



"ఊరి చివర" కవిత్వం మీద ఇంకా చర్చలు సాగుతూండగానే, పుస్తకం డాట్ నెట్ లో "దీప్తిధార" సి.బి. రావు గారు మరో సమీక్ష రాశారు.రావు గారికి ధన్యవాదాలు.

ఆయన సమీక్ష నించి కొన్ని "మెచ్చు" తునకలు:



-అఫ్సర్ కవితలు భావకవిత్వం కాదు చదువుతూ మధుర ఊహలలో తేలిపోవటానికి. అవి మనస్సుకు పదును పెట్టే చిక్కుముళ్లు. కవితను చదువుతూ చిక్కుముళ్లను విడదీస్తూ కవి ఏమి చెప్తున్నాడనే విషయం తెలుసుకోవటానికి మనస్సుకు పనిపెట్టాల్సిందే. భావ కవితలు, సులభ వచన కవితలు, ఉద్వేగ పరిచే కవితలు చదివే వారికి ఈ కవితలు ఒక పట్టాన అంతుచిక్కక అయోమయంలో పడవేసే ప్రమాదముంది. అందుకు సిద్ధం కాని వారు ఈ కవితలకు దూరంగా వుండవచ్చు.

-అఫ్సర్ కవితలలో రసాస్వాదన తక్కువే. అఫ్సర్ కవితలలో కొన్నింటిలో దాదాయిజం (Dadaism) ఛాయలు కనిపిస్తాయి. దాదా ఏమిటి? కళలు లో ఉండే రసానికి (aesthetics) దాదాయిజం వ్యతిరేకం. దాదాయిజం బూర్జువా శక్తుల రాజ్యకాంక్షకు, యుద్ధ ప్రీతికి వ్యతిరేకి. దాదా కళలలో గందరగోళం, తర్కానికి అందని ఆలొచనలు కూడా కనిపిస్తాయి.

-ఆంధ్రదేశాన ఎందరో కవుల కవితలు ఎవరూ పట్టించుకొక చీకటిలో అలమటిస్తున్న కాలంలో, అఫ్సరీకులకు (అఫ్సర్ కవితలు) పెక్కు విమర్శకులుండటం ఆ కవితా వైశిష్టమనే చెప్పాలి. చివరగా అఫ్సర్ కవిత్వం ఎందుకు చదవాలి? అఫ్సర్ కవితలకు అభిమానులు, నిరసన గళం వినిపించే విమర్శకులూ ఏక కాలంలో ఎలా వున్నారు? అఫ్సర్ కవిత్వం లో ఉంది అయోమయమేనా? అఫ్సర్ కవిత్వానికి అభిమానులు, విమర్శకులు ఇచ్చే కితాబుల్ని ఎలా నమ్మటం? ఈ ప్రశ్నలకు అఫ్సర్ బ్రాండ్ కవిత్వం చదివి పాఠకుడే ఒక నిర్ణయానికి రావల్సి ఉంది.

పూర్తి సమీక్ష కోసం www.pustakam.net చూడండి.

ఎవరీ ముసుగు నారి "రమా భరద్వాజ"?





"ఈమాట"లో తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ప్రతి రచనా సగమో అర సగమో చదివి తెగ కామెంట్ల పంట పండించింది ఈ రమా భరద్వాజ అనే ముసుగు నారి. ఆమెకి ఈమాట మీద కోపమో, ఈ లోకం మీదనో కోపమో తెలీదు గానీ, ఈమాటలోని ప్రతి రచన మీదా, చివరికి సమీక్షల మీద కూడా ఒక అట్ల కాడ విసిరితే తప్ప రోజు గడవదేమో అన్నంత తీవ్రమయిన విసురుతో ఆవిడ గారు కామెంట్ల మీద కామెంట్లు రువ్వి ఈ మధ్య ఎందుకో పాపం కాసింత శాంతించింది.
"ఊరి చివర" మీద వేలూరి రాసిన సమీక్ష మీద ఆవిడ గారు ఎందు వల్లనో చింత నిప్పుల కళ్ళతో చిందులు తొక్కింది. తీరా ఆవిడ వ్యాఖ్యలు జాగ్రత్తగా చదివితే ఆవిడ నా పుస్తకం మాట దేవుడెరుగు , అసలు వేలూరి సమీక్ష కూడా సరిగ్గా / పూర్తిగా చదవలేదని ఇట్టే అర్ధం అయిపోతోంది.
ఇంతకూ ఈ సువిఖ్యాత కామెంటరు "రమా భరద్వాజ" ఎవరు? ఆవిడ గారి ఆగ్రహం ఎవరి మీదా? ఎందుకు? ఆవిడ గారి వ్యాఖ్యలు ఎంత వరకు సబబు? సాహిత్యంలోనూ, సాహిత్య విమర్శలోనూ నీతీ, నిజాయితీ అంటూ కామెంట్ల మీద కామెంట్లు దంచే ఈవిడ గారు తను మాత్రం దొంగ పేరుతో ఎందుకు రాస్తుంది? ఈ చర్చ మీద ఆసక్తి పెంచుకోమని మీకు నేను చెప్పడం లేదు గానీ, ఇలాంటి దొంగ వేషాల గుట్టు రట్టు అయితే కాస్త బాగుంటుందని నా ఉద్దేశం.

ఈ వ్యాఖ్యల్ని బట్టి ఈ "రమా భరద్వాజ" ఆనవాలు ఎవరయినా పట్టగలరేమో కాస్త ప్రయత్నించండి చూద్దాం. అదే విధంగా "ఊరి చివర" లో కవిత్వం మీద ఆవిడ గారి వ్యాఖ్యలలో ఎంత నిజం వుందో, ఎంత అక్కసు వుందో అది కూడా కొంత బేరీజు వెయ్యండి. మీ వినోద కాలక్షేపం కోసం ఆవిడ గారి నోటి ముత్యాలు కొన్ని:

July 2, 2010 1:47 am
ముకుందరామారావు పదచిత్రాలు అనేకమ్ కొత్తగా ఉన్నాయి. అఫ్సర్ రాసిన కవిత కన్నా మెరుగైన భావాలున్నా మరెందుకనో వేలూరి వారు అక్కడ ఒక గొంతుకతో మాట్లాడి ముకుందరామారావు కవిత్వమ్ పుస్తకాన్ని సమీక్షచేసేటప్పటికి మాత్రమ్ ఒకలాంటి ఉదాశీన వైఖరిని తన సమీక్షలో చూపించారు.ఇదీ సమీక్ష చేసేవారి వైఖరి. అయినా పుస్తక సమీక్షలు తెలుగున వాస్తవంగా ఉన్నదెప్పుడు గనకా??
July 4, 2010 2:04 am

ఆధునిక తెలుగు కవిత్వాన్ని గురించిన చర్చ ఎప్పుడు జరిగినా సరిగ్గా ఇలాంటి సందర్భాలే నడుస్తూ వచ్చాయి. అది ఒక లాంటి రక్షణ అకవులకి. ఎవరి కవిత్వానికి చెల్లుబాటు కాదని భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దబాయించి బతకాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక పుస్తకం అచ్చు అయ్యాకా ఆ రచయిత తన పుస్తకాన్ని భుజానికెత్తుకుని తిరిగే కార్యక్రమానికి దిగకూడదు. తానే పూనుకుని చర్చల్లో తలదూర్చడం చేయకూడదు. అలా ఎవరు చేసినా వాళ్ళకి వాళ్ళ రచనల మీద నమ్మకం లేదనే అర్ధం.
ఇకపోతే ఇటీవల వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్న “ప్రాంతీయ - కుల -మత” చైతన్యాలు ఉత్తరోత్తరా పురోగతికి నిదర్శనమా?? తిరోగతికి నిదర్శనమా?? అన్నది సాహిత్య రంగంలో జరూరుగా చర్చ చేయాల్సిన విషయమే!! రచయితలుంటారు. కవులుంటారు. వారు ప్రభవించిన ప్రాంతాలు ఒక పార్శం మాత్రమే!! అది ఆ రచయితని గురించిన బయోగ్రఫీలో ముఖ్యమైన విషయం అవుతుందేగానీ వారి సాహిత్యానికి ఉద్దేశ్యించిన లక్ష్యాలకి.. ప్రయోజనాలకీ కాకూడదు. మంచి కవులు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కావలసిన వాళ్ళే కావాలి. రచయితలకి ప్రాంతీయ తత్వాలు ముఖ్యం కావడం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ రచయితకి ఆ ప్రాంతం వలన ఏదైనా ఆశించే ఒక ప్రయోజనం ఉంటేనే!! అలాంటి ఆశ ఉన్న ఉత్తర క్షణమే అతడిలోని మీరన్న “నిజాయితీ” చచ్చిందనే అర్ధం.
రవికిరణ్ సవాలు నన్నయ్య నాటి నించీ ఐతే ఆనాటికి ఈ స్థితి లేదు గనక మీరన్న మాటలో ఇలాంటి అర్ధాలు రావనీ…. మీరు ఇటీవలి కాలాన్ని మాత్రమే లక్ష్యంగా మాత్లాడేరనీ అతనికి తెలియనంతటి నిగూఢమైన విషయమేమీ కాదు నిజానికి. రాజకీయ పరిభాష కి వీళ్ళంతా ఎంతగా అలవాటు పడిపోయేరంటే అది వీళ్లకి ఒక ఊత కర్ర లాంటిది. ఆ పరిభాష లేనిదే వీళ్ళు నడవలేరివాళ. అదుకే వీళ్ల ఆలోచనా పరిధీ..తద్వారా వీళ్ళ సాహిత్య పరిధీ విస్తరించలేకపోవడం.
July 2, 2010 1:28 am

పాశ్చాత్యదేశాల్లో పత్రికలు ఇంకా ప్రచురణకర్తల మీదా ఒక ముద్ర ఉంది. అదేమంటే అక్కడ వాళ్ళు కావాలంటే అకవులని హడావుడి చేసి కవులుగా ప్రచారం చేయగలరు..లేదా కవులని తయారూ చేయగలరు. అలాగే ఒక మంచి పుస్తకాన్నీ ఒక మంచి రచయితనీ కావాలనుకుంటే నొక్కేయనూగలరు అని. దీనికి సంబంధించి పశ్చిమ దేశాల పత్రికల మీదా ప్రచురణకర్తల మీదా బోలెడన్ని సంఘటనలూ ..కధలూ ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ వేలూరి వేంకటేశ్వర రావు గారి సమీక్ష చదవగానే “ఈమాట” మీద కూడా అలాంటి ప్రభావం ఏమన్నా ఉందా? అన్న సందేహం వచ్చింది నాకు. అఫ్సర్ రాసిన కవిత్వం సమీక్షకుడు చెప్పిన చాలా అభిప్రాయాల్లోకి ఏకోశానా ఇమడలేదు. కవిత్వం పేరుతో ఉత్త హడావుడి తప్ప మనసుని కదిలించి చాలాకాలం పాటు వెన్నాడి గుర్తుపెట్టుకోగల ఒక్క వాక్యమైనా లేని ఈ పుస్తకాన్ని అందరూ తప్పక సేకరించుకోవలసిన పుస్తకంగా సమీక్షకుడు కితాబు ఇవ్వడం చాలా కృతకంగానూ pompus గానూ ఉంది.
July 3, 2010 2:24 am

1. ఇదేమరి విమర్శని తీసుకోలేకపోవడం అంటే . విమర్శ చేస్తే ఆ చేసిన వాళ్ళంతా భోగలాలసులు ..కష్టజీవుల కష్టాలు పట్టని వాళ్ళూ ..సమర్ధించిన వాళ్ళంతా వీర విప్లవవాదులూ అన్న బుకాయింపు. ఎన్నాళ్ళీ hipocracy?? విమర్శించిన వాళ్ళు పట్టుచీరల్లో తిరుగుతూంటే సమర్ధించినవాళ్ళూ గోచీలు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారా?? హంబక్ రాతలతో false arguments చేస్తూ ఎలా ఒప్పించగలరూ ?? ఏం రాస్తున్నారన్నదే కాదు ఎలా రాస్తున్నారన్నది ఇక్కడ విషయం. మనసుకి ఎక్కని రాతని ఓహో!! అని మెచ్చుకుందికి తెలుగుదేశాన కోకొల్లలున్నారు. విమర్శ అన్నది లేదు గనకే ఏది బాగులేదో ఎందుకు బాగులేదో ఎవరూ మాట్లాడడం లేదు గనకే పుట్టగొడుగుల్లా కవిత్వం పేర పుస్తకాలు పుట్టుకు వస్తున్నాయి. చెప్పిన వాళ్ళని తిట్టే కార్యక్రమం లేదా ఇప్పుడీ ఇస్మాయిల్ చేసిన పధ్ధతిలో ఇటువంటి కామెంట్స్ కి పూనుకోవడం వల్లనే ఆధునిక కవిత్వపు మంచిచెడ్డలు అన్నది ఎవరూ ముట్టని అంశం అయింది. ఆధునిక కవిత్వం అంటే ఒక హేళన అందువల్లనే స్థిరపడింది. తెలుగులో ఒక సామెత ఉంది “తలపాగా చుట్టుకోడం రాక తల వంకర అన్నాట్ట” అని. అలాంటిదే ఈ ఆధునిక కవితావ్యాపారంలో ఉన్నవాళ్ళవైఖరి. తమకి తోచదు. చెపితే ఆలోచన చేయరు. ఎవరన్నా ఒక కవితని పాఠకుల మనసులలోకి ఎలా బలంగా పంపించగలమా అని ఆలోచన చేయాలి అంతే గానీ బాగులేదని విమర్శించినవాళ్ళని పిల్లిశాపనార్ధాలు పెట్టడం కాదు. వెనకటికి ఒక విమర్శకుడు అంటూండే వాడు మనకి నచ్చంది మరొకరికి నచ్చవచ్చు అని. కానీ బాగున్న కవిత అది దేనిగురించిరాసినా ఎందరినో ఆకట్టుకోగలదు మరి. అలా ఆకట్టుకున్నవి నిలబడ్డాయి. ఆకట్టుకోలేనివి ఎవరెన్ని కితాబులిచ్చినా బోల్తాపడ్డాయి.


July 10, 2010 12:00 am

ఈమాటలో చాలా మంది పాఠకులు పెద్దగా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు కారు. వారికి సాహిత్యపు పూర్వాపరాలూ తెలియవు. తెలిసిన పాఠకులకి నా వ్యాఖ్యలు ఏవీ పెడసరంగా విన్పించవు. నేను అభ్యంతరకతరమైన లేదా అమర్యాదాపూరితమైన వాక్యాలు ఏమీ రాయలేమోదు. అందువలన కృష్ణ ఈమాటకోసం ఆ పత్రిక సంపాదకుల కోసం.. ఇంకా అఫ్సర్ వంటి కవుల కోసం బాధ పడితే నేను చేయగలది ఏమీ లేదు. అననుకూల అభిప్రాయాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడే వాళ్లకోసం నేను అభిప్రాయాలు రాయడం లేదు. అది పత్రికని చదివే మిగతా పాఠకుల సమస్య కాదు. నేను నా అభిప్రాయాలని చెప్పకూడదని ఈమాట సంపాదకులెవ్వరూ అనలేదు. వారు వద్దని అన్న రోజున నేను అలాగే అభిప్రాయాలు చెప్పడం మానేయగలను. నాకొచ్చిన ఇబ్బది ఏమీ లేదు.

శ్రీ శ్రీ అంటే రెండక్షరాలు మాత్రమే కాదు!






కొండ గుర్తు
ఒక జీవిత కాలంలో ఎంత మందిని చూస్తాం? అందులో ఎంత మందిని గుర్తు పెట్టుకుంటాం? కొందరు మన జ్ఞాపకాల్లో ఎక్కువ కాలం ఎందుకు నిలిచిపోతారు? ఇలాంటి చిన్న ప్రశ్నలకి సమాధానం వెతుక్కునే ప్రయత్నం ఈ "కొండ గుర్తు" శీర్షిక. ఇది కేవలం వ్యక్తులూ, వారి జ్ఞాపకాల్లోంచి వారి కృషిని గుర్తు చేసుకునే శీర్షిక. అప్పుడప్పుడూ రాయాలని నా కోరిక.





1980.

అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్రహాన్ని చల్లార్చుకోలేక పక్కనే వున్న కాప్రి హోటెల్లో ఇరాని చాయ్ పంచుకొని "మన సోషలిజం ఇంతవరకేనా? ప్చ్..." అని ఆ పూటకి చప్పరించేసుకొని, రంగు డబ్బాలు తీసుకుని ఖమ్మం గోడల్ని ఎరుపెక్కించిన రాత్రులు. "నీ రాత స్ట్రోక్స్ శ్రీ శ్రీలా వున్నాయి" అని వొకరికొకళ్ళం కితాబులు ఇచ్చి పుచ్చుకునే అమాయక కాలం. కాని, ఇంకా శ్రీ శ్రీ కవిత్వం పూర్తిగా చదవలేదు అప్పటికి.

అలాంటి వొకానొక సాయంత్రం చీకటి వైపు పరుగు తీస్తుండగా...

అది చరమ రాత్రి అయితే బాగుణ్ణు అనిపించిన రాత్రి అది. ఆ రాత్రి శ్రీ శ్రీని కలిశాను. ఆయన వొక నిజం నిషాలో, నేను మరో రకం నిషాలో వున్నాం. ఆలోచన అలలు మాటల రూపంలో కొన్ని సార్లు అందంగా పెనవేసుకుంటున్నాయి.

ఆ రాత్రి మా ఇద్దరినీ కలిపినవాడు జేంస్ జాయిస్. అది కూడా నిజమే! పిచ్చి పట్టినట్టు జాయిస్ రచనలు చదువుతూన్న ఆ సమయంలో నా దగ్గిర వొక అమూల్యమయిన పుస్తకం వుండేది. దాని పేరు " పిక్టొరియల్ గైడ్ టు యులిసిస్". పుస్తకం ఎంత అందంగా వుండేదంటే,ఇంటికి తీస్కువెళ్ళి మరీ చాలా మందికి ఆ పుస్తకం చూపించేవాణ్ణి. అది నేను హైదరాబాద్ ఆబిడ్స్ లో వొక ఆదివారం రోడ్డు పక్క ఆ రోజుల్లో నాలుగు వందలు పెట్టి కొన్న పుస్తకం.

మాటల మధ్యలో ఆ పుస్తకం సంగతి చెప్పాక, శ్రీ శ్రీ గబుక్కున లేచి,గబ గబా చొక్కా వేసేసుకొని "ఇప్పుడే ఈ క్షణమే ఆ పుస్తకం చూడాలి" అంటూ నన్ను బయటికి లాక్కు వచ్చాడు.
"మీరు ఇక్కడే వుండండి. నేను తీసుకొస్తా." అన్నాన్నేను.
"ఇక్కడ వున్నట్టే , రా!" అని హుకుం జారీ చెయ్యగానే నేను నా డొక్కు సైకిలు(చలం గారి భాషలో ముసలి గుర్రం) మీద రెక్కలు కట్టుకుని యెగిరిపోతున్నట్టుగా, రివ్వున దూసుకుపొయి, ఆ పుస్తకం తెచ్చి శ్రీ శ్రీకి చూపించడం మొదలెట్టాను. విద్యార్థి రాజకీయాల వల్ల, చదువు వెనక్కి పట్టి, ఇంట్లో అసమ్మతి పవనాల్ని యెదుర్కొంటున్న వొక ఇంటర్మీడియట్ కుర్రాడి అసంత్రుప్త బతుకులో అదొక అపూర్వ క్షణం. చాలా రోజుల శ్రమ, చాలా కన్నీళ్ళు ఆ పుస్తకం సంపాదించడం వెనక వున్నాయి. వొక్క క్షణంలో అవన్నీ యెగిరిపోయాయి.

ఆ పుస్తకంలో జాయిస్ "యులిసిస్"లో వర్ణించిన వూళ్ళూ, భవనాలూ, వాటి చరిత్రా వున్నాయి. ఆ నలుపూ తెలుపూ బొమ్మలు చాలా కాలం నా కలల్లోకి వచ్చి వెళ్ళిపొయేవి. ఒక రచయిత నిజం నించీ ఊహలోకీ, కల నించి తన ఇరుగుపొరుగులోకీ ఎలా ప్రయాణిస్తాడో బొమ్మ గీసినట్టుగా చూపించే పుస్తకం అది.

ఆ చిత్రాల్ని చూస్తూ, తన వృద్ధాప్యంముసురుకున్న వేళ్ళతో ఆప్యాయంగా తాకుతూ ఆ పుస్తకం తను చదివిన అనుభవాల్ని, అసలు తన వచనంలోకి చాలా భాషల చాలా మంది రచయితలు పరకాయ ప్రవేశం చేయడాన్ని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ రాత్రి శ్రీ శ్రీతో కలిసి వుండకపోతే, శ్రీ శ్రీ అంటే చాలా మందికి మల్లెనే నా ఆలోచన కూడా 'మహాప్రస్థానం' దాకానో, 'మరో ప్రస్థానం' దాకానో ఆగిపొయ్యేది. ఆ రెండు విస్తృతమయిన ప్రపంచాలని కాసేపు పక్కన పెట్టి, వచనంలో శ్రీ శ్రీ ఆవిష్కరించిన తనదయిన ప్రపంచాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ వ్యాసం.
*
శ్రీ శ్రీ అనే సంతకంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడూ వొక కొత్త గాలిని వెంటబెట్టుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం "ఆధునికత" అనుకున్నా, ఇంకో పేరుతో పిలిచినా, ఏదో వొక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించడం దాని తక్షణ లక్షణం. ఈ కొత్తదనం వస్తువులోనూ, రూపంలోనూ కనిపిస్తుంది. వస్తుపరంగా శ్రీ శ్రీ ఎప్పుడూ రాజీ పడలేదని ఇప్పుడు నేను విడిగా చెప్పకరలేదు, కాని, ఆ వస్తు నవీనత ఎలాంటి రూపాల్లో అతని వచనంలో వ్యక్తమయ్యిందో ఇప్పటికీ ఒక సంక్లిష్టమయిన విషయమే. ఒకే దృక్పథాన్ని అంటి పెట్టుకున్న అనేక వస్తువుల భిన్న రూపాల కలయిక శ్రీ శ్రీ వచనం.
వచనంలో శ్రీ శ్రీ - అటు సొంత రచనలూ, ఇటు అనువాదాలూ చేశాడు. అవి రెండూ వొక యెత్తు అయితే, ఉత్తరాల రూపంలోనో, వివిధ వ్యాసాల రూపంలోనో, ప్రసంగాల రూపంలోనో శ్రీ శ్రీ విస్తారమయిన/ సారవంతమయిన వచన సేద్యం చేశాడు. ఆ ప్రతి వచన రచనా విడిగా కూలంకషంగా చర్చించదగిందే. కాని, అది ఒక పెద్ద పరిశోధనా గ్రంధమే అవుతుంది. కాబట్టి, ఆయా వచన రచనలు వడపోసిన వొక సారాంశాన్ని మాత్రమే ఇక్కడ చూద్దాం.
శ్రీ శ్రీ కవిత్వం కానీ, వచనం కానీ వొకే వొక అంతస్సూత్రాన్ని అంటి పెట్టుకుని వుంటాయి. అది శ్రీ శ్రీ భవిష్యత్ వాదం: అంటే, రేపటిని ఈ క్షణాన దర్శించగలిగిన ముందు కాలపు చూపు. శ్రీ శ్రీ కవిత్వం రాస్తున్న కాలానికి అతను మార్క్సిజం చదివాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. కానీ, మార్క్సిజాన్ని ఒక పుస్తక రూపంలోనో, సిద్ధాంత రూపంలోనో చదవడానికి ముందే శ్రీ శ్రీ చుట్టూ ఒక పారిశ్రామిక వాడ వుంది. కార్మిక సమూహం అతనికి ఇరు వైపులా కాకపోయినా కనీసం వొక వైపు అయినా వుంది. ఆ స్థానిక ప్రపంచంలో శ్రీ శ్రీ లీనం అయి వున్నాడనడానికి అతని జీవన కథనాల్లో చాలా దాఖలాలు చూడ వచ్చు. అది శ్రీ శ్రీ చూస్తున్న వర్తమానం. కాని, అక్కడితోనే నిలిచిపోతే అది శ్రీ శ్రీ వ్యక్తిత్వం కాదు.
స్థానికత, వర్తమానం గీసిన బరిని దాటుకుని వెళ్ళే చూపు శ్రీ శ్రీది. ఒక వలస రాజ్యం సృష్టించిన నగరం విశాఖ. అక్కడి పరిశ్రమలూ, జన జీవనం, కళా సాంస్కృతిక రంగాల మీద ఆ వలస పాలన నీడలు కనిపిస్తాయి. శ్రీ శ్రీకి వాటి స్పృహ కూడా వుంది. కాని, వాటిని దాటి వెళ్ళే వలసానంతర వాదం శ్రీ శ్రీది. ఈ ప్రయాణం మనకి శ్రీ శ్రీ వచనంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వచనంలో శ్రీ శ్రీ స్థానికతని బయటి లోకంతో ముడి పెట్టే అంతర్జాతీయ వాది. వర్తమానాన్ని విమర్సనాత్మకంగా చూసే భవిష్య వాది.
ఈ వ్యాసాన్ని నేను జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన అభిమానంతో మొదలు పెట్టాను. జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన ఆతృతని జాగ్రత్తగా గమనిస్తే, అందులో ఒక శ్రీ శ్రీ సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన వొక అంశ వుంది. అది తన పరిసరాలకీ, తన స్థానికతకీ ఎడంగా స్పందించడం! (బహుశా, కొత్త అంశాల పట్ల తెగని ఆకర్షణ కూడా వుంది). తన కాలానికి చెందని వొక ఆలోచనని అందుకోవాలన్న వొక ఉబలాటం వుంది. శ్రీ శ్రీ వచన రచనల్లో నేను ఆ లక్షణం చూశాను. అయితే, ఆ ఆలోచనని తన కాలంతో ముడి వేసి, ప్రయోగించడం శ్రీ శ్రీ దారి. శ్రీ శ్రీ తన వచనాన్ని వూహించే ముందు ఇలాంటి కొంత మంది రచయితలు తనని ఆవహించేంతగా ఆ పఠనంలో మునిగిపోయాడు. కాని, ఆ మునక తరవాత మళ్ళీ వొడ్డుకి చేరడం ఎలాగో తెలిసిన వాడు కనుక, అతని అంతర్జాతీయ దృష్టి మళ్ళీ స్థానికతలోకి క్షేమంగా చేరుకుంది.
శ్రీ శ్రీ వచనంలో అనువాదాలు ఎక్కువే.అవి వివిధ దేశాల వివిధ రచయితలవి. కాని, ఈ అనువాదాలన్నీ ఒక్క సారిగా చదివితే, ఆ విడి విడి లోకాల్ని శ్రీశ్రీ ఒకే సూత్రంతో కట్టే ప్రయత్నం చేసాడని మనకి అర్ధం అవుతుంది, విలియం సారోయన్ మొదలుకొని ఆంటాన్ చెఖోవ్ దాకా. అదే చేత్తో, అతను చిన్న కథల్నీ, నాటికల్నీ, వ్యాసాల్నీ, సంభాషణల్నీ కలిపాడు. అనువాద వచన రచనలు శ్రీ శ్రీలో ఎదుగుతున్న/ క్రమ పరిణామం చెందుతున్న ఒక నవీన పంథాని ఆవిష్కరిస్తాయి. ఈ పనిని రెండు రకాలుగా చేశాడు శ్రీ శ్రీ. ఒకటి: అనువాదాల్ని అందించడం; రెండు: ఆ అనువాదాల వచనాన్ని తన సొంత రచనల్లోకి ప్రయోగించి చూడడం. ఇవి రెండూ విడదీయలేని కోణాలు. అనువాదంలో శ్రీ శ్రీ ఆయా రచయితల వచన రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే, తన సొంత రచనల్లో ఆ రూపాలను స్థానిక సంస్కృతికి మార్చి, పరీక్షించి చూసుకున్నాడు. ఇలా చెయ్యడం ద్వారా కొత్త రూపాలు తెలుగు సాహిత్య సాంస్కృతిక వాతావరణంలోకి ఎలా తీసుకు రావచ్చో బేరీజు వేసుకున్నాడు. "చరమ రాత్రి" దీనికి బలమయిన ఉదాహరణ. అది ఎంత బలమయిన వుదాహరణ అంటే, శ్రీ శ్రీ సాధారణ కవిత్వంతో తృప్తి పడని వాళ్ళు కూడా ఆ రచనని వొప్పుకునేంతగా!


అలాగే,ఈ వ్యాసం మొదట్లో నేను సమకాలీన సాహిత్యంతో నా అసంతృప్తిని కూడా చెప్పాను, వొక పాఠకుడిగా! శ్రీ శ్రీ వచన రచన ద్వారా ఏం చెప్పాడన్న దానికి అందులో ఒక సమాధానం వుంది.
శ్రీ శ్రీ వచన రచనలో పాఠకుడు చాలా ముఖ్యమయిన కోణం. తన పాఠక వర్గాన్ని తానే సృష్టించుకున్నాడు శ్రీ శ్రీ. అది ఎలాంటి వర్గం అన్నది అతని కవిత్వంలో కన్నా బలంగా అతని వచనంలోనే కనిపిస్తుంది. అది - పూర్వ సాహిత్య రూపాలని ప్రశ్నించి, కొత్త జవాబులు వెతుక్కునే తరం- పాత భావాలని ధిక్కరించి ఆధునికతని అక్కున చేర్చుకునే వర్గం. ఈ పాఠక వర్గానికి కావల్సిన కొత్త అలవాట్లని నేర్పే అనువాదాలూ, ప్రయోగాత్మక వచనం కొంచెం కొంచెం రుచి చూపించి, అభిరుచిని పెంచిన లాబరేటరీ ఆ వచనం అంతా!
ఈ రోజు శ్రీ శ్రీకి మనం ఇవ్వదగిన కానుక - ఆ వచన పాఠాల్ని తిరగదోడడమే!

*
Category: 10 comments

"వలస" నించి "ఊరి చివర" దాకా....!

"ఈమాట" వెబ్ పత్రికలో వేలూరి నాకవిత్వ సంపుటి "ఊరి చివర" మీద రాసిన సమీక్ష ఇది. ఈ సమీక్ష మీదా, నా కవిత్వం మీదా ఇక్కడ కూడా విస్తృతంగా చర్చ జరిగింది. కాని, "ఈమాట"లో జరిగిన ఈ చర్చ ఏకపక్షంగా జరిగిందనీ, అనేక వ్యాఖ్యల్ని సంపాదకులు "ఎడిట్" చెయ్యడమూ, కొన్నిటిని అసలు ప్రచురించకపోవడమూ జరిగాయనీ చాలా మంది ఇప్పటికీ నాకు రాస్తున్నారు. ఈ విషయం మీద సమగ్రంగా, న్యాయంగా, భిన్నాభిప్రాయాలకి చోటు దక్కే పద్ధతిలో చర్చ జరగాలని అనేక మంది రాస్తున్నారు. వారి అభిప్రాయాలని గౌరవిస్తూ, అభిప్రాయ భేదాలని కూడా మనస్పూర్తిగా ఆహ్వానిస్తూ తిరిగి ఈ చర్చని ప్రారంభించే ఉద్దేశంతో వేలూరి సమీక్షని ఇక్కడ అందిస్తున్నాను. ఈ బ్లాగులో ఎవరి అభిప్రాయాలనీ నేను ఎడిట్ చెయ్యదలచుకోవడం లేదు. కాబట్టి, మీ మాటలని మీరే గౌరవిస్తూ, ఇతరుల మాటల్ని కూడా గౌరవిస్తూ చర్చ సాగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.






కవులు వాళ్ళ తృప్తి కోసం కవిత్వం రాసుకుంటారని ఎక్కడో చదివిన గుర్తు. అదేమో కాని, మంచి కవులు అనుకోకండా చదువరికి కూడా తృప్తినిస్తారు. కారణం: జీవితంలో బోలెడు సందిగ్ధాలు. తేలిగ్గా విశదపరచలేని సందిగ్ధాలు. ఈ సందిగ్ధాలే కవిత్వానికి ప్రేరణ. కవి తన పరిభాషలో ఈ సందిగ్ధాలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే, కవి చెప్పే ఏ సమాధానమూ కవికి, చదివేవాడికీ పూర్తి తృప్తి నివ్వదు. అందుకనే ఎప్పటికప్పుడు కవి కొత్తకొత్త మాటలు, కొత్తకొత్త ప్రతీకలూ తయారుచేసుకుంటాడు, కవిత్వం కోసం. ఎన్నెన్నో ఉపమానాలు, ఉత్ప్రేక్షలూ, పెల్లుబుకి పైకొచ్చినా, కవికి అసంతృప్తే మిగులుతుంది. ఎందుచేత? తన కల్పనకీ, తను కవితలో ఉద్దేశించినదానికీ మధ్య గండి పెరిగిపోతోందనే భావన వస్తుండటంచేత. నిజం చెప్పాలంటే, నిజమైన కవి సర్వదా చీకటిలో తడుముకుంటూనే ఉంటాడు. అఫ్సర్ ఈ కోవకి చెందిన మంచి కవి.

డిసెంబర్ 2000 లో ప్రచురించిన ‘వలస’ కవితాసంకలనం చివర ‘నాస్థలకాలాల్లోకి…’ అన్న స్వగతంలో అఫ్సర్ ఇలా రాసుకున్నాడు:

“కవిత్వం వొక గమ్యం కాదు. అదెప్పుడూ ఒక మజిలీ మాత్రమే. అనివార్యమైన భావాల వుప్పెన ముంచెత్తడమే కవిత్వం. …ప్రవాహం కవిత్వ లక్షణం. గమ్యం చేరానన్న తృప్తిలో కవిత్వం లేదు. ప్రవాహ గమనమే కవిత్వం.” ఇందులో కవితలన్నీ 1990-2000లలో రాసినవి. పదేళ్ళ తరువాత ప్రచురించిన ‘ఊరి చివర’ (డిసెంబర్ 2009) కవితాసంకలనాన్ని సమీక్షించడానికి ‘వలస’ని ప్రస్తావించ వలసిన అవసరం ఉన్నదనిపించింది నాకు. ఎందుకు అన్న ప్రశ్నకి ఈ సమీక్షే సంజాయిషీ చెప్పుతుందనుకుంటాను.

పాత సంకలనం ‘వలస’ నుంచి, 9 జూలై 1993లో రాసిన నాలుగు మాటలు అన్న పద్యం చూడండి.

ఉండచుట్టి పారేసిన కాయితాల్లాంటి
చిత్తుపదాలమధ్య
వొకానొక భావావశేషం
మంచుపర్వతంలా -
ఎప్పటికీపగలని మంచులో
కూరుకుపోయిన పదసమూహాన్ని నేను.

తలుపులు
మూతపడి వున్నాయి పెదవుల్లా.
సమాధిలోకి వెళ్ళిన పదం పునర్జన్మించదు
వేళ్ళు తెగిపోయాయి
తలుపుతట్టలేను
శవపేటికకు ప్రాణం పోయాలా?

అదృష్టవంతులు కొందరు,
మాటలమీదే మళ్ళీమళ్ళీ బతుకుతుంటారు
మాటలకే రక్తాన్ని అద్దుతుంటారు
రక్తాన్ని నమ్ముకున్నవాణ్ణి
వొట్టీదేహాన్నిమాత్రం అమ్ముకోలేను. …

కొత్త సంకలనం ‘ఊరి చివర’లో రాసిన రెండంటే రెండు మాటలు (2004) అన్న కవిత చూడండి:

…వుండచుట్టి పారేసిన కాయితాలు
కొన్ని ఆలోచనల భ్రూణ హత్యల మరకలు
చిత్తుపదాల శిధిలాలమధ్య
వొకానొక భావశేషం
ఎంతలెక్కపెట్టినా
శూన్యమే శేషం.

…తలుపులు మూతపడి వున్నాయి పెదవుల్లా
పదం సమాధిలోకి వెళ్ళింది
పునర్జన్మ వుందో లేదొ?

…అదృష్టవంతులు కొందరు
వాళ్ళమాటలు
బతికి బయట పడ్దాయి
నామాట
దేహం విడిచిన వస్త్రం.
నాదో
ప్రాణాంతక జనన యుద్ధం.
వాయిదా వెయ్యలేను
ఇలాగేలే అని వుండలేను.

ఈ రెండు కవితలలో ముఖ్యంగా మొదటి చరణాలలో వాడిన మాటలే మళ్ళీ వాడినట్లుగా కనిపించినా, రెండవ కవితలో ‘భ్రూణ హత్యల మరకలు’ (blood stains from fetal killing) అన్న ప్రతీకతో భావతీవ్రత హెచ్చింది. అయినా, తను చెప్పదలచుకున్నది ఇంకా తృప్తికరంగా చెప్పలేకపోయినందుకు కవికి కసి పెరిగింది. సమాధిలోకి వెళ్ళిన పదానికి పునర్జన్మ లేదు; నైరాశ్యం. రెండవ కవితలో పదం ఆపలేని నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తుంది. రెండు కవితల్లోనూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, కవి నిర్దిష్టమైన సమాధానం కోసం చీకటిలో తడుములాడుకుంటున్నాడు. మంచికవికి ఇది అనివార్య పరిస్థితి. కొత్తగా వచనకవిత్వం రాస్తున్న వాళ్ళు ఇలాంటి ప్రతీకల త్రాణ గుర్తించడం మంచిది.

‘ఊరిచివర’లో ‘వొకానొక అసందర్భం’ (2009?) కవిత చూడండి:

చిత్రిక పట్టని
ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా
శవానికి సైతం
కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.
అలంకారాలన్నీ వొలుచుకున్న
మాటకోసం చూస్తున్నాను
నిఘంటువుల్ని కప్పుకొని
గాఢ నిద్రిస్తున్న భాషలో.

‘చిత్రికపట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం, అలంకారాలన్నీ వొలుచుకున్న మాటకోసం’ కవి అన్వేషిస్తున్నాడు. తమాషా ఏమిటంటే మాటలని అతి జాగ్రత్తగా చిత్రికపడుతూ, అలంకారాలు వాడుతూనే ‘మాటకోసం’ వెతుకుతున్నాడు. ఈ చిత్రికతోటే సంగీతానికి వేదనతో కూర్చిన రంగురంగు మాటల బొమ్మలు వేస్తాడు అఫ్సర్. ఈ పని చెయ్యి తిరిగిన కవులే చెయ్యగలరు. 1987లో సైగల్ పాట మీద కవిత ఇప్పటికీ నాకు నచ్చే కవితే.

…కిటికీతెరల కుచ్చుల్ని
పట్టుకు జీరాడుతుంది దిగులుగా నీ పాట
చిగురాకు కొనపై
మంచు బిందువు మరణ వేదన…

అతనే వినిపించక పోయినా
అతని పాట వినిపిస్తుంది
మెల్లగా కదిలి
తుఫానై చుట్టుముడుతుంది జ్ఞాపకంలా
నడుస్తున్న నిన్ను వెంటాడి వేధిస్తుంది
రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా!

సైగల్ పాటల్లో విషాదం, వేదనా వినిపిస్తాయి. సైగల్ పాట దిగులుగా కిటికీ తెరకుచ్చుల్ని పట్టుకు జీరాడుతుంది అనే మాటల బొమ్మ విషాదాన్ని చిత్రిస్తుంది. సైగల్ లేడు; అతని పాట ఉంది. అతని పాట విన్న తర్వాత, అది తుఫానులా జ్ఞాపకం వస్తుంది; రాత్రివచ్చిన కలలా వేధిస్తుంది. సైగల్ పాటలో వేదన అంతా అఫ్సర్ మాటలల్లో చూపించాడు; తెరమీద బొమ్మలాగా!


ఊరి చివర సంకలనంలో వాయులీనమవుతూ… (2004) అన్న కవితలో ఈ క్రింది భాగం చూడండి! కవిత చివర ఇచ్చిన ఫుట్‌నోట్‌లో వివరాలు విపులంగా లేకపోవడం ఈ కవితకి జరిగిన అన్యాయం. ఈ పొరపాటు జరగటానికి సంపాదకుల అశ్రద్ధే కారణం! (ఫుట్‌నోట్‌లో ఉన్న వాక్యం: రెండు సింఫనీల అనుభవం తర్వాత, వొకటి మామూలుగానే బీతోవెన్‌ది. రెండోది స్టాలిన్‌ కాలంలో వసంత మేఘాలమీదుగా తిరుగుబాటుని ఆలపించిన వయొలిన్‌). అయినప్పటికీ, స్టాలిన్‌ కాలంలో రష్యాలో జరిగిన హత్యాకాండ, అణిచివేతలూ చదివినవాళ్ళకి కవితలో ప్రతీకలు స్పష్టంగానే ప్రతిధ్వనిస్తాయి. వయొలినిస్టు ఎవరో తెలిస్తే సహృదయుడైన పాఠకుడికి సానుభూతి పెరుగుతుంది.

…ఊపిరి పీల్చడం నేరం
తన చప్పుళ్ళే మార్మోగాలి
చెట్లకి చిగుళ్ళు పుడితే నేరం
ఆకుపచ్చగా విచ్చుకుంటే శిక్ష
చివరికన్నీ ఇనపగజ్జెలే కావాలి
ఇనప మాటలే వినిపించాలి.
అప్పుడింక
వయిలిన్‌ లోపలి ధ్యానానికి
తుఫాను భాష నేర్పుతుంది
దాచేసిన నిప్పంతా
సుతిమెత్తని కమాను లోంచి
కార్చిచ్చు.

ఎంత చిత్రం! వయొలిన్‌ నినాదమవుతుంది, వసంతం గర్జిస్తుంది, అంటూ ముగుస్తుంది కవిత. ఒకరొట్టె ముక్కా, ఒక దేశమూ, వొక షెహనాయీ… ( 2009?) అన్న కవితలో,

ఆమె కడుపులో (ఫాతిమా) ఏమూలనో దాచేసుకున్న శోకాన్ని
నువ్వు షెహనాయీ లోకి వొంపినప్పుడు అనుకున్నానా,
నాచరిత్ర అంతా వొకానొక కలత కల అని!…

ఇది చిక్కని కవిత. ఈ కవితలో మహ్మద్‌ ప్రవక్త, ఫాతిమా కల, కర్బలా కథని బిస్మిల్లాఖాన్‌ షెహనాయీలోకి అనువదించడం ఫుట్ నోట్లుగా సూచించారు. కాని వీటి పూర్వకథలు, కవితలో వాడిన ప్రతీకల ప్రత్యేకత తెలిస్తే ఈ కవితని అనుభవించడం సులువు. సంకలన సంపాదకుడు ఈ పని చెయ్యకపోవడం మరొక పెద్ద లోపం!

ఇక, తెలంగాణా 2002 అన్న కవిత గురించి. ఇది ఒక విచిత్రమైన కథనం. తెలంగాణా/ఆత్మ కథనం. సంకలనంలో ఏకైక బృహత్కవిత. పదహారు ఖండికలలో అసంతృప్తుల రాజకీయం, మైనారిటీ పేదల ఆవేదన, ‘అణచబడ్డ’ వర్గాల ఆర్తనాదం, పోరాటం, తిరుగుబాటు వగైరా… అంతాకలిపి మొత్తం పదకొండు పేజీలు. ఇంతకుముందు ఈ సంకలనాన్ని సమీక్షించిన వాళ్ళు, విమర్శలు రాసిన వాళ్ళూ అంతగా ఈ కవిత ప్రస్తావన తెచ్చినట్టు లేదు. ‘ఇది రాజకీయ కవిత, మనకెందుకులే’, అన్న ధోరణిలో కప్పదాటు వేశారేమో!

ఈ కవిత గురించి నాలుగు మాటలు చెప్పకుండా నేను ఉండలేను.

…కదులుతున్న ఉరికంబం నా వూరు
సూర్యచంద్రుల్ని వెలేసిన ఆకాశం నాది
నా చుట్టూ వీచే గాలి
అధికారం విసిరిన ఉచ్చు…
మదరసాల పిట్టగోడలు
సిగ్గుపడ్డాయి నేను పుట్టినప్పుడు
యే భాషలో యేడ్వాలో నవ్వాలో తెలియక
కళ్ళకింద నవ్వుని పాతుకుంది అమ్మ.

ఇలా సాగిపోతుంది ఈ బృహత్కవిత. పోలిక సమంజసం కాకపోయినా, ఎందుకో ఖాదర్‌ మొహియుద్దీన్‌ పుట్టుమచ్చ (1991) గుర్తుకొస్తుంది. ఆ కవితలో ఇంతకన్నా సూటిగా తన పుట్టుక గురించి చెప్పుకున్నాడు: ‘ఒక కట్టుకథ నన్ను కాటేసింది… / నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైవుంది నాపేరు…’ అంటూ!

…అన్నీ నానోటిదాకా వచ్చి వెళ్ళిపోయినవే మరి!
చివరికి స్వాతంత్ర్యం కూడా!
…నా పంద్రాగస్టు
ఓ పెద్ద వెక్కిరింత కాదూ!
అందరూ మూడురంగుల జెండాలు ఎగరేస్తున్నప్పుడు
నా శరీరం ఒకేఒక్క నెత్తుటిరంగులో తలకిందులుగా
ఏ చెట్టుకొమ్మకో వేలాడుతోంది

ఆగస్టు 15ని, స్వాతంత్ర్యదినోత్సవాలని, జాతీయ జెండానీ వామపక్షీయులు - ముఖ్యంగా అతివాద వర్గం వాళ్ళు, ఒకానొకప్పుడు దిగంబర కవులూ ఇంతకన్నా ఎక్కువగా హేళన చేస్తూ రాసారు. ఇది అతివాద రాజకీయ కవులని ప్రేతంలా వెంటాడుతున్న ఒక పాత ఫేషన్‌. అఫ్సర్ లాంటి తాత్విక కవుల కలం నుంచి ఇలా రావటం చిరాకేస్తుంది. సరిగ్గా ఇదే ధోరణిలో వలస సంకలనం లో ‘అగర్‌ జిందో మె హై,’ (25 అగస్టు 1998) అన్న కవిత. నిస్సహాయధోరణిలో మొదలై, మధ్యలో అఫ్సర్ - బ్రాండ్‌ ప్రతీకలతో ఉత్తేజపరిచి, చివరికి స్వాతంత్ర్యదినం, జాతీయజెండా, జాతీయగీతాలంటూ విషాద పరిహాసంతో ముగుస్తుంది. చూడండి:

ఏ చరిత్రాలేని నాకు
చరిత్ర పాఠం ఒక్కటే భలే ఇష్టం;

…నాచరిత్ర పాఠాలు
నేను మరిచిపోలేని పాత పద్యాలు…

…గొంతులోనే విరిగిపోయిన పద్యపాదాలమీద
ఎప్పుడూ మోగే బెత్తానికి నాచరిత్ర తెలుసు
నాకాలం తెలుసు
నేను తెలుసు

ఈ పద్యంలో
చివరిపాదం వొట్టి కొయ్యకాలేనని తెలుసు
వందేమాతరంలో నాతరం లేదు
జణగణమణలో నా జనం లేరు
కంఠనాళాలు తెగిపోయాయి
నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు
నా ఆగస్టు పదిహేనులన్నీ
స్మశాన వాటికలోనే…

ఆఖరి చరణంలో మొదటి రెండు లైనులతో పద్యం అంతం అయితే ఎంత అందంగా ఉండేదో ఆలోచించండి. ‘వందేమాతరం’ లో తన తరం లేకపోవడం, ‘జనగణమణ’లో తన జనం లేకపోవడం; ఇటువంటి వాక్యాలు చదవడానికి - అమెరికన్‌ భాషలో చెప్పాలంటే - ‘క్యూట్’ గా ఉంటాయి, అంతే! పుస్తకాలమ్ముకునేవాడు వెనక అట్టమీద బ్లర్బ్ లో వేసుకోడానికి పనికి రావచ్చు.

మరొక్క విషయం. వియత్నాం యుద్ధం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారంచేసిన పాటకురాలు జోన్‌ బాయెజ్‌ (Joan Baez) అమెరికన్‌ జెండాని నిరసిస్తూ (అంటే వియత్నాం యుద్ధానికి వ్యతిరేకత స్ఫురింప జేస్తూ) ఒకసారి “ఏ జాతీయ జెండా కూడా ఆ జాతి ప్రజల ఆశయాలన్నింటికీ, అభిలాషలన్నింటికీ అద్దంపట్టదు”, అని అన్నది! How True! ఇంతకన్నా క్లుప్తంగా బల్లేల్లా పొడిచే మాటలు ఏ నిరసన వాదుల రాతల్లోనూ నాకు కనిపించలేదు.

యెప్పుడూ ఓ నల్లబూటు కాలు నా శరీరాన్ని
కసిదీరా నలుపుతూ వుంటుంది

…అణిగిపోయిన దేహాలకు
నలిగిపోయిన కంఠాలకు
పోరాటం సిద్ధాంతంకాదు, బతుకు పాఠం!

…నేనే నిషిద్ధమయ్యాను
నా అడుగులకింద గూఢచారి నేత్రాలు మొలిచాయి.

మళ్ళీ మరొకసారి ఖాదర్‌ మొహియుద్దీన్‌ రాసిన ‘పుట్టుమచ్చ’ కవిత గుర్తుకొస్తుంది. ఇదే వరసలో సాగిన ఈ కవిత చివరకి, హైటెక్‌, డాలర్లు… అణిచివేయబడటం (?) ఇంకా… ఇంకా… ఆక్రోశం. ఇంతకీ ఇక్కడ ఎవరు ఎవర్ని అణిచేసారు? ఈ అణిచివేయబడడం ఒక్క మైనారిటీలకే పరిమితమయ్యిందా? పేదరికానికి, మైనారిటీ మెజారిటీ మతాల ఊసుంటుందా? ఇలాంటి ‘అసంబద్ధపు’ ప్రశ్నలు వెయ్యటం బహుశా అమాయకత్వం కింద జమ కట్టబడవచ్చు. చివరకి కవి ఎదురుతిరిగి నిలబడి,

నువ్వు చూపిస్తున్న దృశ్యంలో
బొమ్మని కాను
నువ్వు ఆడిస్తున్న మాటల్లో
మాటని కాను
నేను మాట్లాడిస్తానింక
నేను ఆడిస్తానింక
నీ కాగితాల మీటలకింద నిక్కీ
నీలిగి కూర్చుండను…

అని హామీ/శపథం చేస్తాడు. ఎవరికి ఎదురుతిరిగి నిలబడడం? ‘ఎప్పుడో పుట్టిన ప్రశ్నకి సానబడుతున్నా, కొడవలికిలా’ అని ముగుస్తుంది కవిత.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది పెద్ద గందరగోళం కవిత. వచన కవిత్వాన్ని చదివించేవి, చదువరిని కదిలించేవి, కవితకి ప్రాణం పోసి బతికించేవీ మెటఫర్లు. మోటుబడ్డ కవితావస్తువు మంచి మంచి మెటఫర్లనన్నింటినీ అణగదొక్కేస్తుంది. ఇది నిజం. సరిగ్గా అదే జరిగింది, ఈ కవితలో!

ఒక చారిత్రక సత్యం ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉన్నది. అధికారంలో కొచ్చిన వర్గం ఏదో మిషతో వేలకువేల గొంతుల్ని మాట్లాడకముందే నొక్కేసి, నిర్దాక్షిణ్యంగా మిలియన్లకొద్దీ పౌరులని హత్యలు చేసిన ఖ్యాతి, ఘనత ఒక్క స్టాలిన్‌కి, ఒక్క మావోకీ దక్కింది. ‘అణిచివేయబడ్డ వర్గాల’ ప్రతినిధులుగా కవితలు రాస్తున్నామనుకునే కవులు, రష్యన్‌ కవయిత్రి ఆనా ఆఖ్మతోవా రాసిన ‘రెక్వీమ్‌’ (requiem) అనే కవిత కాస్త జాగ్రత్తగా చదివితే, రాజకీయ కవితలు, ఉద్యమ కవితలూ ఇంత గందరగోళంగా రాయవలసిన అవసరం ఉండదనిపించక మానదు.

వీరుడి శిరస్సు (2007) అనే కవిత: ఇది యుద్ధవ్యతిరేక కవిత. ఫుట్ నోట్‌లో అంకిత వాక్యం ఆధారంగా ఈ కవిత బహుశా ఇరాక్‌ తో అమెరికా చేస్తున్న అన్యాయపు/అధర్మపు యుద్ధానికి నిరసనగా రాసిందై ఉండాలి. ఇది కేవలం నినాద కవిత. నినాదాలకి ప్రాధాన్యం ఇచ్చే కవితల్లో మాటలు చెప్పే బొమ్మలు నినాదాలకింద మరుగునపడిపోతాయి. కేకలు మాత్రమే మిగులుతాయి. (ఈ మధ్యకాలంలో కేకలు, నినాదాలూ లేని యుద్ధవ్యతిరేక కవిత, ఒకేఒక్క కవిత - నా దృష్టిలోకి వచ్చిన వచన కవిత - జి. యస్‌. రామ్మోహన్‌ రాసిన ‘యుద్ధప్రభుస్తోత్రము’ ఈ కవిత మీద వ్యాఖ్య ఈమాట, సెప్టెంబర్‌ 2005 లో మూడు ప్రార్థన పద్యాలు అన్న వ్యాసంలో చూడవచ్చు.)

తెలిసిందికదా, ఇప్పుడు
వొక ధిక్కారం తలతెగనరకడానికి
ఎన్నెన్ని వ్యూహాలు కావాలి!
తెగిపడిన ప్రతితలా సలసల మరిగే నెత్తుటి నగరం!

…ఎన్ని వందల అబద్ధాల కట్టుకథల కళేబరాలు!
ఎన్ని అబద్ధాలు కలిస్తే వొక చరిత్ర!

…యిక యీ క్షణం
వొట్టి మొండేలు కూడా
వీరవిహారం చేస్తాయి నెత్తుటి కడవలై!

‘అయం స రశనోత్కర్షీ…’ తో మొదలై, ‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ వరకూ, ఎటువంటి పోరాటాలయితేనేం? పోరాటాల్లో ఆహుతైన వాళ్ళ చేతులు, తలలూ, కళేబరాలూ మానవ చరిత్ర కథనం చెబుతూనే ఉన్నాయి. నినాదాలు యుద్ధాలు ఆపవని చరిత్ర పదేపదే ఘోషిస్తోంది.

సరే, ఇక్కడ నా ఘోష ఆపి, అఫ్సర్ కవితల్లోకి చూద్దాం. సగమే గుర్తు (2004) అన్న కవిత చూడండి; ఈ కవిత కాస్త romanticగా మొదలై, అనుభూతి కవితగా నడిచి ఆఖరికొచ్చేసరికి ఆవేదన చురుక్కుమనిపిస్తుంది.

వానది వొక్కటే భాష ఎప్పుడయినా ఎక్కడయినా,
దేహం పిచ్చుక సందేహ స్నానాలకింద తడుస్తూ.
…ఎన్ని వానలు చూళ్ళేదని?

మళ్ళీ
ప్రతీ వానా అదేదో కొత్త వాసనేస్తుంది.

…వాన
ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు
జొన్న రొట్టె కాలుతోంది
వొంటి సెగలమీద.

పై కవితని ‘కురిసీ కురవని’ (1997) అనే పాత కవితతో పోల్చి చూడండి:

ఎప్పటిదో తెలీదు
ఎక్కడిదో తెలీదు
తడపటం వొక్కటే తెలుసు వానకి.
లోపలంతా రాత్రంతా
అలా
కురుస్తూనే వున్నా ఏకధారగా.


మధ్యాన్నపు వానా ఇలాగే
కురిసీ కురవని నీ లాగే
గాయకుడు మిగిల్చి వెళ్ళిన
నిశ్శబ్దంలా వాన
సుదీర్ఘ మౌనానికి నిరసనలా వాన
ఇవాళింక తెరిపి లేదు.

ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం. చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం అఫ్సర్ కి తెలుసు. పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇస్తాడు. ఇది అఫ్సర్ ప్రత్యేకత. ‘మూడో యామం’ (2001) కవిత ఒక మంచి ఉదాహరణ.

…చరిత్రకారుడి చేతివేళ్ళని తెగనరికి
కొత్త గతాన్ని తిరగరాస్తాయి ఫత్వాలు
ఫత్వాలకు రంగుతేడాల్లేవు
కూల్చే చేతులకు సరిహద్దులూ లేవు
అనంత కాలాల పగలకు
వొక్కక్షణికోద్రేకమే సమాధానం.

…అన్ని మరణాలూ
మట్టిలో కరిగే దేహాలు కావు
నిప్పులో లీనమయ్యే క్షణికాలు కావు
రాలిన రక్తమాంసాల్ని కలిపి కుట్టుకొని
మళ్ళీ సిద్ధమవుతాడు సూర్యుడు
కొత్తదినచర్యకి.

అలాగే, ‘శ్రీనగర్ లో మొహర్రం’ (2009?) లో,

బక్కపలచటి బ్యురాక్రాట్లా
మైదానంలోంచి ఎగురుకుంటూ వస్తాడు యముడు
వీడెప్పుడూ వన్‌ వే పాసింజెర్ కదా…
తొలకరివాన
కొండల్ని తలబాదుకుని ఏడుస్తుంది
వితంతువులు
చేతులారా గాజులు పగలగొట్టుకుంటున్నట్టు. (మూలం: ఆగా షాహిద్ ఆలీ).

మూలం చెప్పకపోయినా పరవాలేదు. ఈ ఒక్క చరణం కవిత్వం. ఎవరికైనా, ప్రేమతోనే! అన్న మరొక కవితలో,

నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే,
పద్యాల మధ్య
రాజకీయనినాదాల హోరెందుకులే,
అన్నీ మర్చిపోయిన జాతికి
నీతివాక్యాల ముక్తాయింపులెందులే,

అని అంటూనే అఫ్సర్‌ నినాద కవితలు రాసాడు. బహుశా అతని నిరంతర ప్రయాణంలో ఒక మజిలీ కావచ్చు. కవితా ప్రవాహంలో ఒక మలుపు కావచ్చు.

దుఃఖ బహిష్కృతుడికి
ఏ దిగులూ లేదు
దేహాన్ని విస్తరించుకోవడం తప్ప!
నువ్వేమిటో
నీపద్యమే చెబుతుంది!
తెగిన నీ పద్య పాదానికి
కట్టు కట్టలేను, క్షమించు,

నల్ల పలకతో వుమ్మితో కాదు
అన్నీ తుడుచుకో నెత్తుటితో!

మళ్ళీ రాయ్
పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో
అప్పటికీ నీకునువ్వు దొరక్కపోతే
ఓ పిల్లాడి చేతిలో
బొమ్మవై పో!
వాడి ఆట్లో కాసింత ఆనందపు తునకవై పో!
అప్పుడింక కొత్త మాట రాయ్!

దీనికి తోడుగా, ‘వలస’ లోంచి మరొక కవిత చెప్పకండా ఉండలేను. ఆకుపచ్చని ఆకాశం (27 అక్టోబర్ 2000) అన్న కవితలో,

ఒక రెక్క అలా తెరిచివుంచు
నీలోకీ నిశ్శబ్దంలోకీ.
ఒక దుఃఖాన్ని అలాతెరిచే వుంచు
రెప్పలకింద పచ్చగా.

… అప్పుడప్పుడు కాసింత గోరువెచ్చగా
నీ చీకటిగదిలోకి ప్రవహించే గాలిని
కాసేపు వుండివెళ్ళమని చెప్పు.

…యుద్ధసేన తరుముకొస్తున్నప్పుడు
ఏదో ఒక మూల రవంత నిశ్శబ్దాన్ని కురవనీ
అన్ని విషాదాల్ని అన్ని చీకట్లనీ తుడిచి
దూదిపింజలా ఎగుర్తున్న మబ్బు వెంట నడవనీ

రెప్పలకింద ఆకాశం ఎలా వుంటుందో
ఇప్పుడైనా తెలిసిందా?

అఫ్సర్ నిరంతర ఆశావాదా? ఉల్లాసకరమైన నిరాశావాదా? అదేమో కాని, అఫ్సర్ కవి. లేబుళ్ళు అనవసరం. ఈ సంకలనంలో అందమైన కవితలు చాలా ఉన్నాయి. వాటన్నింటి గురించీ ప్రస్తావించడానికి వీలు పడదు. వాటిలో కొన్ని: యిక్కడేదో వొక జాంచెట్టు.., అవునా మైక్?, సరిగంగ స్నానం, డెజావూ, ఒక సూఫి సాయంత్రం, వగైరా.

వలస సంకలనం చివర్న రాసుకున్న స్వగతంలో అఫ్సర్ తనగురించి ఇలా చెప్పుకున్నాడు: “…నేనొక విచ్చిన్నమైన వాస్తవికతని. నేను స్త్రీని. నేను దళితుణ్ణి. నేను మైనారిటీని. నేనొకమూడో ప్రపంచాన్ని. చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట అంతరంగాన్ని. …నేను ఏకవచనం కాదు. అనేక వచనం.”

ఆఖరిగా నా మాట. అఫ్సర్ కవితా సంకలనం ‘ఊరిచివర’, తెప్పించుకొని చదవండి. 119 పేజీల్లో 48 కవితలున్నాయి. మంచి కవిత్వాన్ని ఆస్వాదించిన అనుభూతి మిగులుతుంది. సంపాదకుడు గుడిపాటి ఒక పరిచయం, యన్‌. వేణుగోపాల్‌ మరో పరిచయం - వెరసి పదిహేను పేజీల పరిచయవ్యాసాలు రాసారు.

అఫ్సర్ కవితలని ఆస్వాదించడానికి ఈ రెండు పరిచయ వ్యాసాలూ అనవసరం.

(ఊరి చివర, అఫ్సర్ కవితా సంకలనం - డిసెంబర్ 2009. సంపాదకుడు: గుడిపాటి. పాలపిట్ట ప్రచురణలు. Rs. 60/- . $5.00.
దొరికేచోటు: Palapitta Books, #16-11-20/6/1/1, 403 Vijayasai residency, Saleemnagar, Malakpet, Hyderabad - 500 036.)

ఎరీనా




1

ఆకుపచ్చ నదిలోంచి ఒక మొక్కజొన్న కంకి
అయిదారు నెలల కడుపుతో తెల్లగా నవ్వింది
దారి పక్కన.


2
పద్యాలు ఎలా వుంటాయి?
ఒక్కటే ప్రశ్న దారి పొడవునా.

అప్పుకి పుట్టవు పదాలు.
కడుపు పండాలి రక్త మాంసాల కంకి.

3

కొన్ని పిట్టలూ కొందరు మనుషులూ కొన్ని మొక్కలూ

ఇవి లేని ఆకాశం నాకెందుకు?
అని గాలి చల్లగా గోల చేసింది.

4

నలుగురు కలిస్తే నాలుగు పద్యాలు
పద్యం ఎప్పుడూ వొంటరి కాదు.

5
కాయితమయినా ఇనప రేకు అయినా
మట్టి పొరయినా.
అన్నం పళ్ళెం పళ్ళెమే!


కడుపు నింపే కల దానికి తెలుసు!

6

పగలంతా దిక్కుల్ని ముద్దాడిన పిట్టలు
సాయంత్రం బారన్ కింద చేరాయి
కువకువలతో.

బారన్ మాటల గూడు.

7

బాధ తెలిసిన పదం పద్యం అంటే.

నొప్పి లేని చోట పై పూత దేనికి?

8

నెగడు మండుతూ నిప్పు పెదాలతో నవ్వుతూ
చీకటి అంతు చూస్తోంది


కవిత్వం వచనంతో ఆడుకుంటూ
సంభాషణల్ని ఎగదోస్తోంది.


ఈ రాత్రిని ఏ నెగడూ కరిగించలేదు.

9

పద్యం రాయడం
ఇంకా రావడం లేదని
కవి గొంతులోని పసి వాడి రోదన

ఏడ్వనీ,
ఎంత ఏడిస్తే అంత పద్యం!

10

తిరిగొస్తూ
అతను చొక్కా గాలికి ఇచ్చేశాడు

బైకు మీద తనే
దూసుకెళ్ళిపోయాడు మెత్తని చప్పుళ్ళ గాలిలా.
హోరు హోరు పద్యంలా.


అతని వైపు చూస్తూ చూస్తూ నేను
వెనక్కి.
వెనక్కి.

11

పొలానికీ ఆకాశానికీ మధ్య
మేం.

పద్యం వదిలి వెళ్ళిన నిశ్శబ్దం!
Web Statistics