అక్షరాలు అలలై..ఎగసిపడింది కృష్ణమ్మ!

పరిచయాలు అక్కర్లేని మన వాడు...అక్కడెక్కడి నించో...!



చిత్రంగా మనం గదులు కట్టుకున్నట్టే
నదులకూ తాళాలు వేస్తాం కదా,
అన్నాడు అఫ్సర్ అప్పుడెప్పుడో పదిహేనేళ్ళ క్రితం తెనాలి ప్రయాణంలో....కృష్ణా నదిలో విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే బకింగ్ హామ్ ప్రధాన కాల్వపై దుగ్గిరాల దగ్గిర లాకులను చూసి.
“ఆ తాళాల సందుల్లోంచి
నురగలు కక్కుతున్న నీళ్ళలో “ కన్నీళ్లను కూడా చూశాడు తను.

అందుకే, గదుల గోడల్ని కూల్చేసి, ఇప్పుడు ప్రపంచం సరిహద్దుల్ని చిత్రంగా చెరిపేస్తున్నాడు అఫ్సర్. అచ్చమయిన తెలుగు బిడ్డడిగా పరదేశంలో మన మాతృభాషకి సమున్నత పట్టం కట్టాడు. మన భాషా సౌరభాల్ని దశదిశలా వ్యాపింపజేస్తున్నాడు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఆచార్యునిగా తనవైన విజయ బావుటాల్ని ఎగరేస్తున్నాడు. చిన్నప్పుడు సంప్రదాయ బద్ధంగా అరబ్బీ, ఉర్దూ చదువుతూ ఆంగ్లంలో కవితలల్లుతూ తెలుగులోకి ట్రాన్స్ లేటయిన అఫ్సర్ ఇప్పుడు ఆసియన్ స్టడీస్ అధ్యాపకునిగా తెలుగు పలుకుబడికి అమెరికాలో పీఠం వెయ్యడం ఎంత గర్వకారణం!
సీనియర్ జర్నలిస్టుగా ఎప్పుడూ చెరో పక్క ఇద్దరు సహచరుల భుజాల మీద చెయ్యేసి, బెజవాడ వీధుల్లో నవ్వుతూ అలపురాని కబుర్లెన్నో చెప్పిన అఫ్సర్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ సప్తసముద్రాలూ దాటేశాడు. కవిగా మనకెంత దగ్గిరవాడో దూరమెళ్లినా స్నేహితుడిగా అంత ఆత్మీయుడు. సున్నిత మనస్కుడు. చలించే, చెమ్మగిలే గుణాలే అఫ్సర్ ని తాజాతాజాగా రీఛార్జ్ చేసే సాధనాలు. అల్లకల్లోల అంతర్లోకాలను చుట్టేసి ప్రతిభావంతంగా అనుభూతులను అక్షరబద్ధం చేసే అఫ్సర్ నిజానికి పరిచయం అక్కర్లేని కవి, సాహితీ విమర్శకుడు. ఇప్పుడేం చేస్తున్నారో తెలియని ఏ నలుగురి కోసమో ఈ కాస్తా...

నిరంతర అధ్యయనశీలిగా, అంతర్జాతీయస్థాయి పరిశోధకునిగా, భాషావేత్తగా, వచన రచననూ కవితామయం చేసి అందంగా మనతో చదివించే అఫ్సర్ ఏకంగా టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఆప్షనల్ గా అవకాశమివ్వని ద్వితీయ భాషగా తెలుగుని కంపల్సరీ బోధనకు ప్రవేశపెట్టి వినుతికెక్కాడు. విస్తృత సాహితీ సేద్యం చేసే అఫ్సర్ ఏ అనుభవాన్నయినా కవిత్వంగా మలచుకునే పదసంపన్నుడు. ఎక్కడున్నా అస్తిత్వ అన్వేషణే వస్తువుగా ఆయన కవిత అలా అలా సాగిపోతూనే .....మనకి మరో “విశ్వకవి”ని చూపుతుందేమో వేచి చూద్దాం. బెజవాడ బుక్ ఫెస్టివల్ గుర్తుకు రాగానే ఏదో కోల్పోతున్న వెలితి భావనతో ఆంధ్ర భూమి “మెరుపు” కోసం ప్రత్యేకంగా తన అనుభూతుల్ని అక్షరీకరించాడు మన అఫ్సర్!
- పాషా, ఆంధ్ర భూమి "మెరుపు", జనవరి 1, 2012.


అక్షరాలు అలలై..ఎగసిపడింది కృష్ణమ్మ!




బెజవాడ అంటే బ్లేజ్ లాంటి ఎండలూ కాదు, లీలా మహల్ సినిమా కాదు, బీసెంట్ రోడ్డు షాపింగూ కాదు. చివరికి కృష్ణవేణి నడుమ్మీద వడ్డాణం లాంటి ప్రకాశం బ్యారేజి కూడా కాదు ఆ మాటకొస్తే!

బెజవాడ అంటే పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాలు. అంతే!

అటు అలంకార్ సెంటరు నుంచి ఇటు ఏలూరు రోడ్డు దాకా విస్తరించిన పుస్తకాల రోడ్డు. ఏం వున్నా, లేకపోయినా కానీ, ఆ పుస్తకాలూ, ఆ పుస్తకాల రోడ్డు లేని బెజవాడని అస్సలు వూహించలేను.

ఆ బీసెంటు రోడ్డుకీ, ఏలూరు రోడ్డుకీ, మోడర్న్ కేఫ్ కీ, ఇంకా కొన్ని అడుగులు వేస్తే, ఆకాశవాణికీ, ఆంధ్రజ్యోతి ఆఫీసుకీ మధ్య వొక లాంగ్ వాక్ కి వెళ్తే, వొకరిద్దరు గొప్ప రచయితలయినా వెతక్కపోయినా తామే గంధర్వుల్లా ఎదురు కావచ్చు. కొన్ని అపురూపమయిన క్షణాలు మీ గుండె జేబుల్లోకి అనుకోకుండా రాలిపడ వచ్చు.
కానీ, ఇప్పుడు ఈ దృశ్యం మారిపోయింది, ఈ ఇరవయ్ మూడేళ్లుగా -

ప్రతి జనవరి నెలా వొక సాయంకాలం అలా స్టేడియం గ్రౌండ్స్ దాకా నడిచి వెళ్తే, ఆ అందమయిన దృశ్యాలన్నీ ఇప్పుడు వొకే దృశ్యం – అదే, పుస్తకాల పండగ-లో కలగలసిపోయి అనేక దీపకాంతుల దర్శనం వొక్కసారిగా అయ్యి, కళ్ళూ మనసూ జిగేల్మంటాయ్!

ఈ ఇరవై మూడేళ్లలో అన్నీ మారిపోయాయి. మనుషులు మారినట్టే, వీధులు మారిపోయినట్టే పుస్తకాలు మారిపోయాయ్! పుస్తకాల ముఖచిత్రాలు మారాయి, ధరలు మూడింతలు అయ్యాయి. పుస్తకం నల్ల పూస కాలేదు కానీ, పుస్తకం కొనాలంటే జేబు తడుముకునే పరిస్తితి వచ్చింది. ఎంతో ఇష్టపడి చదవాల్సిన పుస్తకం ధర బరువు వల్ల భారంగా మారుతోంది...అయినా, పుస్తకాలు కొనే అలవాటు తగ్గలేదు ఇప్పటికీ! దానికి కొండ గుర్తు: వొకప్పుడు పుస్తకాల పండక్కి వెళ్తే, వొక గంటలో రెండు రౌండ్లు కొట్టి చక్కా ఇంటికొచ్చేసేవాళ్లం. ఇప్పుడో? అది వొక పూట పని, సాలోచనగా అనుకుంటే వొక రోజు పని.

రాష్ట్రంలో ఎన్నో చోట్ల పుస్తకాలు పండగలు జరుగుతున్నాయి ఇప్పుడు. అన్ని చోట్లా అదే హడావుడి. దేశ విదేశాల పుస్తకాలు.కొత్త కొత్త పుస్తకాలు షాపులు. సాయంత్రపు సాహిత్య సాంస్కృతిక కచేరీల హోరు.

కానీ, అది బెజవాడకి మరీ లోకల్ పండగ. అసలు పుస్తకం అనే పదార్థానికి వొక రూపం ఇచ్చిన అమ్మ బెజవాడ. తెలుగు సంస్కృతిని వేలు పట్టి నడిపించిన పత్రికల బుడి బుడి నడకలు చూసిన బెజవాడ. ప్రసిద్ధ అక్షరజీవుల ఆత్మల్ని కలిపిన ఆధునిక బృందావని బెజవాడ. అట్లాంటి బెజవాడలో పుస్తకాల పండగ అంటే ....అది అందరి పండగ. బుద్ధిజీవుల హృదయస్పందనల్ని కలిపే పండగ. సహృదయ పఠితల మేధో సమాగమం.


కొన్ని సంధ్యల్లో ఇక్కడ వందనం చేద్దాం,
చేతులు గుండెల్లా జోడించి, మనసులోకి రెండు కళ్ళూ తెరిచి...

అక్షరాల్లో జీవిస్తున్న అపురూపమయిన వాళ్ళకి,
చేతుల్లో పుస్తకాలుగా మాత్రమే మిగిలిపోయిన కీర్తి శేషులకి,
జీవితాలకి అక్షర రూపాన్నిచ్చిన సౌందర్య మూర్తులకి,
మనలోని నిరాకార ఆలోచనల్ని సాకారం చేసిన వాక్య శిల్పులకి,
దారి తప్పిపోతున్న మానవీయ అనుభూతులకు చిరునామాలయిన ఆ సుపథికులకి.

Category: 5 comments

ఇరవయ్యో శతాబ్ది /ఇద్దరు కవులు

ఎడోనిస్ కవితలు




ఇద్దరు కవులు

వొక ప్రతిధ్వనికీ, ధ్వనికీ మధ్య ఇద్దరు కవులు.

ముక్కలయిన చంద్రుడిలా మాట్లాడ్తాడు వొక కవి,


ఇంకొకడు
పిల్లాడిలా నిశ్శబ్దం,

వో అగ్నిపర్వతం చేతుల్లో వూయలూగుతూ
నిద్రిస్తూ.


అద్దంలో ఇరవయ్యో శతాబ్ది


శిశువు ముఖాన్ని ధరించిన
శవపేటిక
వొక కాకి గుండెల్లోంచి రాసిన
పుస్తకం



పువ్వు చేతబట్టి
ముందుకు లంఘిస్తున్న మృగం

వొక పిచ్చివాడి వూపిరిలోపల
శ్వాసిస్తున్న బండ రాయి

అంతే.
ఇదే ఇరవయ్యో శతాబ్ది.



(మొదటి కవిత : Two poets
రెండో కవిత: A mirror for the twentieth century)
Category: 1 comments

అవతలి గట్టు మీది చీకటి గురించి...

స్కైబాబా కొత్త కథా సంపుటి "అధూరే" కి ముందు మాట ఇది. "ఆంధ్రజ్యోతి" సాహిత్య అనుబంధం "వివిధ"లో కూడా ఇది అచ్చయ్యింది.




There is always the other side, always.
-Jean Rhys


సాధారణ తెలుగు కథ నించి తెలంగాణ కథని విడిగా ఎట్లా నిర్వచించుకోవాలనే సాంప్రదాయ విమర్శకుల సందిగ్థం తేలక ముందే, తెలంగాణ ముస్లిం కథకులు మరో కొత్త సవాలు మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఇక తెలంగాణ కథని మాత్రమే కాకుండా, తెలంగాణ ముస్లిం కథని కూడా ఎట్లా విడిగా నిర్వచించుకోవాలో తేల్చుకోవాల్సిన అవసరం వస్తోంది. ఇది ఇప్పుడిప్పుడే తేలే సంగతి కాకపోవచ్చు, కానీ, ఈ చర్చ మొదలు కావాల్సిన అవసరం వుందని ఇటీవలి తెలంగాణ ముస్లిం కథలు వొత్తిడి పెడ్తున్నాయన్నది నిజం. అయితే, తెలంగాణ కథని నిర్వచించడం కంటే, తెలంగాణ ముస్లిం కథని నిర్వచించడం కష్ట తరం అన్న విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి. తన లెజిటిమసీ కోసం తెలంగాణ కథకుల కంటే, తెలంగాణ ముస్లిం కథకులు ఎక్కువ సవాళ్లని ఎదుర్కోవాల్సి వుంటుందన్న సాహిత్య సామాజిక సాంస్కృతిక చేదు వాస్తవికతని కూడా మనం గుర్తించాలి.

ఈ సంపుటిలోని కథల్ని పునకథనం చేసి, వాటిని చేతులారా ఖననం చెయ్యడం కంటే - ఈ కథల రక్తమాంసాల్లోంచి, స్కై బాబా మౌలికంగా ప్రతిపాదిస్తున్న ముస్లిం సాంస్కృతిక చర్చకి తలుపు తీసే ప్రయత్నం ఈ నాలుగు మాటలు. ముఖ్యంగా, మూడు ప్రధానమయిన అంశాల చుట్టూ ఈ చర్చ జరగాల్సి వుంది. అందులో మొదటిది: మెజారిటీ సాహిత్యం అంటూ వొకటి వున్నప్పుడు అది నిర్మించి పెట్టిన మూసల్లో మైనారిటీ భావన ప్రతిఫలనాలు ఎట్లా సాహిత్యమవుతాయి? వాటి ప్రాతినిధ్యాన్ని ఎట్లా చూడాలి? ; రెండోది: వొక స్థానిక అంశంగా తెలంగాణ, అందులో ముస్లింల పాత్ర,; మూడోది: కథా వస్తువు- శిల్ప పరిధుల్లో ఆ రెండు అంశాలు ఎట్లా కలిసి పనిచేస్తాయి? కథా వస్తువులోనూ, శిల్పంలోనూ స్కైబాబా ఈ కథల్లో చేస్తున్న ప్రయత్నానికి ఈ మూడు అంశాల చుట్టరికం వుంది.

వాస్తవానికి సాహిత్య సంస్కృతిలో మెజారిటీ- మైనారిటీ అన్న భావన ఎలా పనిచేస్తుందో, దాని కదలికలు ఏమిటో ఇంకా మనకి వొక పూర్తి అవగాహన ఏర్పడలేదు. అసలు ఆ సామాజిక భావన సాహిత్యంలో నిజంగా పనిచేస్తుందా అన్న “సత్సంశయాలు” కూడా దురదృష్టవశాత్తూ కొందరిలో వున్నాయి. ఈ సత్సంశయాల మబ్బులు తొలగితే తప్ప, మెజారిటీ-మైనారిటీ అన్న భావన ఆచూకీ దొరకదు. సంవాద రూపంలో (discourse level) తెలుగు ముస్లిం రచయితలు తరవాతి దశలో మైనారిటీ అన్న “అధికారిక” భాషని వదిలించుకునే ప్రయత్నం చేసినా, సాంస్కృతిక రూపంగా మైనారిటీ అనే భావన పని చెయ్యక మానదు. సామాజికంగానే కాదు, సాంస్కృతికంగా కూడా అనేక విధాన నిర్ణయాలు ఈ చట్రంలోనే పని చేస్తాయి కనక. ఈ మైనారిటీ సాంస్కృతికత అనేది ఎట్లా నిర్మించబడుతుందో, ఎట్లా కొనసాగించబడుతుందో స్కైబాబా కథలకి ప్రధాన నేపధ్యం.

మిగిలిన అస్తిత్వాల కంటే ముస్లిం అస్తిత్వానికి కొంత అదనపు చరిత్ర వుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ అది ఇస్లామిక్ అస్తిత్వ సమస్య అయితే, ప్రాంతీయ స్థాయిలో అంటే తెలుగు రాజకీయాల పరిధిలో అది తెలంగాణ అస్తిత్వంతో , ఆ పైన తెలంగాణ ముస్లిం రాజకీయ వునికితో, కొంత గత అధికార రాజకీయాలతో ముడిపడిన అస్తిత్వ సమస్య. ఇది మూడంచెల అణచివేత కింద నలుగుతున్న అస్తిత్వం. ముస్లిం లకి సంబంధించిన ఏ చర్చ అయినా, ఇలాంటి మూడంచెల అణచివేత సవాళ్లని ఎదుర్కొక తప్పడం లేదు. సమకాలీన రాజకీయ చర్చల్లో, సాంస్కృతిక సంవాదాల్లో ముస్లింలు ఇప్పటికీ అన్ని విధాలా పరాయీ వాళ్ళే. ముఖ్యంగా, తెలుగు సాహిత్య సాంస్కృతికతలో ఇంకా వాళ్ళ వాటా వాళ్ళకి దక్కనిచ్చే స్థితి లేనే లేదు. తెలంగాణ ముస్లిం కథకులు – ఈ పుస్తకం విషయానికి వస్తే స్కైబాబా లాంటి వొక తెలంగాణా ముస్లిం రచయిత - సంప్రదాయ తెలుగు కథావిమర్శ ప్రమాణాల బెంచ్ మార్కు దృష్ట్యా చూస్తే, తనని తాను వొక మంచి వచన రచయితగానో, కథకుడిగానో నిలబెట్టుకోవడానికీ ఇప్పుడున్న పరిస్తితుల్లో నరక యాతన పడాల్సిందే- దీనికి బలమయిన కారణం మొత్తంగా తెలంగాణా కథా సాహిత్యమే అనుభవిస్తున్న రెండు రకాల పీడన: సాహిత్య సాంస్కృతిక చరిత్ర, కథా శిల్పం పేరిట కనిపించని సంకెలల అధిక బరువు. ఈ రెండు రకాల బరువుల కింద నలిగిపోతూ తెలంగాణ ముస్లిం కథ ఇంకా తన సాహిత్య ఉనికికి తగ్గట్టుగా విమర్శ సాధనాలు సమకూర్చుకోవాల్సి వుంది. ఈ రెండు రకాల పీడనల్ని శక్తి మేరా వుపయోగించే ప్రధాన స్రవంతి – అలాంటిది వొకటి వుందని భ్రమింపజేసే- తెలుగు కథా సాంస్కృతికత స్కైబాబా కథలకి అంత తేలికగా రాజముద్ర వెయ్యదన్నది నిజం. బహుశా, ఇది స్కై బాబా వొక్కడి సమస్య కాదు, ఎక్కువగా తెలంగాణ కథకులకు, అంత కంటే మరీ ఎక్కువగా తెలంగాణా ముస్లిం కథకులకు వర్తించే విషయం.

ఈ నేపధ్యంలో స్కై బాబా కథా సంకలనం “అధూరే” వొక సాంస్కృతిక అస్తిత్వ ఘోష. సొంత గొంతు కోసం గొంతు చించుకునే ప్రయత్నం. ప్రధాన స్రవంతి రాజకీయ శిబిరాల పద్మవ్యూహంలోంచి సజీవంగా/ సశరీరంగా బయట పడాలన్న తీవ్ర వాంఛతో పెగలివస్తున్న కేక. ఆ కేక చరిత్రని వెతుక్కుంటూ, స్కైబాబా కథల్ని దగ్గిర పెట్టుకున్నప్పుడు, తెలంగాణా ముస్లిం కథ గురించి- కొంత దూరంగా -భవిష్యత్తులోకి ఆలోచించే ప్రయత్నం కూడా అవసరమే.
*
దృక్పథం వున్న ప్రతి రచయితా తన రచనలో కాలాన్ని పునర్నిర్మించుకుంటాడు. గతంలోకి వెళ్ళే ముందు ఆ గతం తన వర్తమానంలో, తన భవిష్యత్తులో ఎట్లా రూపాంతరం చెందుతుందో తరచి చూసుకుంటాడు. ఈ ధోరణి మైనారిటీ సాహిత్యంలో బలంగా కనిపిస్తుంది. మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే కాదు, ప్రధాన స్రవంతి-కేంద్రిత సాహిత్యంలో వోదగని ప్రతి ధోరణీ – ముఖ్యంగా స్త్రీ, దళిత, స్థానిక – సాహిత్యం కూడా. ఈ ధోరణి రచయితలు కాలాన్ని దర్శించే తీరు వాళ్ళు ఆధునికతని ఎట్లా నిర్వచించుకుంటారన్న పునాది మీద ఆధారపడి వుంటుంది. ఆధునికత చర్చలో కాలం పాత్రని తిరిగి నిర్వచిస్తూ, రచయితకి అది చరిత్రని సొంతం చేసుకునే (historical reclamation) ప్రక్రి య అంటాడు వాల్టర్ బెంజమిన్ “Thesis on the Philosophy of History” అనే ప్రసిద్ధ వ్యాసంలో(1968).

వర్తమానంలో నిలబడి గతాన్ని, అది సృష్టించే మిధ్యావాస్తవికతని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు ఈ చారిత్రక స్పృహ వున్న రచయిత. తన కాలంలో వున్న అన్ని గత వ్యక్తీకరణల్ని/ వాటి వర్తమాన వక్రీకరణల్ని విమర్శించడం ద్వారా మైనారిటీ రచయిత ఇంకో వర్తమానం నిర్మిస్తాడు. స్థానిక అస్తిత్వ పునర్నిర్మాణంలో ఇది చాలా అవసరమయిన సైద్ధాంతిక సాధనం. స్థానికతని సాహిత్యంలో బలమయిన భావనగా నిలబెడ్తున్న ఇప్పటి తెలంగాణ రచయితలు ముఖ్యంగా చేస్తున్న పని కూడా ఇదే. అయితే చరిత్ర మీద వున్నంత దృష్టి మనకి ఆ చరిత్రలో అంతర్భాగంగా పని చేసే ఈ కొత్త వాస్తవికత మీద కూడా వుంటే తెలంగాణ సాహిత్యం తొవ్వలే మారిపోతాయి.

చాలా మంది తెలంగాణ కథకుల మాదిరిగానే, స్కైబాబా కథా గతం , వర్తమానం కేవలం గత, వర్తమాన సమస్య కాదు, కేవలం సాహిత్య సమస్యా కాదు. ఈ సమస్య లోతుల్లోకి వెళ్లడానికి కొంత గతంలోకి వెళ్ళక తప్పదు. కొన్ని అసాహిత్య/ సాహిత్యేతర విషయాలూ చర్చించక తప్పదు. ఆ గతంలో తెలంగాణ కథ ఏమిటో, అందులో తెలంగాణ ముస్లిం ఎవరో కొంత వెతుక్కోవాలి.

పుట్టిన వెంటనే వలస వాద ఆధునికత చేత అపహరించబడిన శిశువు తెలుగు కథ. తెలుగు కథ పుట్టుకా పెరుగుదలా అంతా ఆ తరవాత వలస వాద పెంపుడు వారసత్వాల నించి మాత్రమే చూస్తూ వచ్చాం. ఆధునిక కథకి జన్మస్థలం కోస్తా తీరం వెంట చూపిస్తూ, ఆ స్థానికతలోని వలసవాద, లేదా ఆంగ్ల –కేంద్రిత మూలాల్లో తెలుగు కథని చరిత్రీకరించడంలోనే ఈ వారసత్వం దారి మళ్ళింది. తెల్ల వాళ్ళ పాద ధూళితో పావనం అయితే కానీ, మనకి సాంస్కృతిక చరిత్రా లేదు, సాహిత్య చరిత్రా లేకపోయింది. తెలుగు కథ ఇంగ్లీషు మూలాల్లోంచి పుట్టలేదనీ, దాని అసలు మూలం మన ఆదిమ సాహిత్య చరిత్రలో వుందని ఇప్పటికీ గుర్తించలేని స్థితిలోనే వున్నాం. దానికి ప్రధాన కారణం: బ్రిటిష్ ఆంధ్రా కథ వలసవాద ఆలోచనల్లోంచి, శిల్పంలోంచి నేరుగా దిగుమతి అయిన సరుకు.

అలాంటి దిగుమతిని సరుకుని ధిక్కరించడంతో మొదలయ్యింది తెలంగాణ కథా చరిత్ర . ఇటీవలి కాలంలో ముస్లిం రచయితలు తిరిగి ఆ చరిత్రలోకి ప్రయాణిస్తూ, ఆ సాంస్కృతిక వాస్తవికతని ఆవిష్కరిస్తూ వుండడంతో ఈ ధిక్కారానికి శక్తి తొడయ్యింది. ఉర్దూ అనేది రాజభాష కాదనీ, అది ప్రజల భాష అన్న గుర్తింపు కలిగించడం ద్వారా మాత్రమే ఈ సాంస్కృతిక చరిత్రకి న్యాయం జరుగుతుంది. ఈ చరిత్ర పునర్నిర్మాణం ప్రక్రియలో భాగంగానే స్కైబాబా గాని, ఇతర తెలంగాణ ముస్లిం రచయితలు గాని ఉర్దూ పదాల ద్వారా ఇప్పటి దాకా అస్పృశ్యంగా మిగిలిపోయిన ముస్లిం సాంస్కృతిక భావనలని తిరిగి వెతుక్కుంటున్నారు. తమ జీవితాల్లోని ఈ ముస్లింతనాన్ని ఆవిష్కరించే ముందు దానిని కప్పేస్తున్న/ లేదా ఇతరేతర సాధనాలతో దానిని అవాస్తవీకరిస్తున్న చరిత్రని reclaim చేసుకోవాల్సిన అవసరం ముస్లిం రచయితలకు వుంది. స్కైబాబా కథల్లో ఈ అవసరం భాషతో మొదలై, సామాజిక ఉద్యమాల పునర్ నిర్వచనం దాకా కొనసాగుతుంది. తెలుగు కథల్ని ఉర్దూ పదాల మాలిన్యం నించి కాపాడాలనుకునే వృధా ప్రయత్నంలో సంస్కృత దాస్యానికయినా వెనకాడని నవీన సాంప్రదాయ వాదులకి ఈ కథలు చదివీ చదవక ముందే వొక పెద్ద సవాల్ అవుతాయి; ఈ “తెలుగుర్దూ” భాష లేదంటే తురకం వినినంతనే మన conditioned చెవులకి అపచారమనిపిస్తుంది. అధికారిక భాష అనేది మన ఆలోచనల్ని ఎట్లాంటి చట్రాల్లో బంధించి పెడుతుందో, అట్లాంటి చట్రాల్ని పగలగొట్టే పనితో ఈ కథకుడి యాత్ర మొదలవుతుంది.
*
ఈ కథల సంపుటికి స్కై పెట్టుకున్న పేరు “అధూరే” అంటే “పూర్తి కానివి” అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే, ఈ సంపుటిలో చాలా మటుకు కథలు జీవితాన్ని అంటిపెట్టుకుని వుండే వొక పూర్తికాని తనాన్ని చెప్పుకుంటూ వెళ్తాయి. ఈ కథల్లోని కొన్ని జీవితానుభవాలు నిజంగా పూర్తయ్యాయా అన్న సందేహంలో ‘ముగుస్తాయి.’ ఒక ముగింపు రాహిత్యం ప్రతి కథనీ, ఆ కథలోని పాత్రల్నీ, వాటి అనుభవాల్నీ వెంటాడుతుంది. కథలన్నీ చదివాక రచయిత ఈ కథలు చెప్పడానికి వాడిన రెండు భాషలు కూడా ఆ అనుభవాల భాషని విప్పలేకపోయాయన్న క్షోభ మనకి మిగుల్తుంది. కథ మళ్ళీ మొదటికి – అంటే భాషకి- వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. ఈ కథలు తెలుగు కథ స్థాయి నించి తెలంగాణ కథకీ, అటు తరవాత తెలంగాణ ముస్లిం కథకీ పరిణతి చెండానికి వెనక ఈ రెండు అంశాలు – సాధారణ భాష, అనుభవ వాహిక- బలమయిన పునాదులు. ఈ పునాదులు రెండూ అసంపూర్ణంగా మిగిలి వున్నాయన్న అస్తిత్వ క్షోభని శీర్షికే చెబ్తుంది.

తెలంగాణ ముస్లిం అనుభవాన్ని తర్జుమా చేయగలిగే శక్తి ఈ సాధారణ భాషకి వుందా? అన్న శంకతో ఈ కథా రచయిత బయలుదేరుతాడు. ఇప్పటికే ఏర్పడి వున్న తెలుగు సాహిత్య భాష ఎంత వరకూ తెలంగాణ భాష అన్న సందేహమూ ఇందులో కలిసి వుంది. ఆ సాహిత్య భాష వైఫల్యాన్ని చెప్పాలన్న తపన శీర్షికలో వుంది, తరవాతి కథల్లో వర్ణనల్లోనూ, పాత్రల సంభాషణల్లోనూ అది కొనసాగి, పఠితని కాసేపు సందిగ్ధంలో పడవేస్తుంది. ఆ సందిగ్ధత అలవాటు పడిన కొద్ది సేపటికి ఇందులోని ముస్లిం జీవితం సందిగ్ధత రెండో దశకి తీసుకు వెళ్తుంది. మొత్తంగా తెలుగు ముస్లిం సాహిత్యం ముందు వున్న పెద్ద సాంస్కృతిక సమస్య – ఈ సందిగ్ధతతో సహా తన పాఠక వర్గాన్ని ఎట్లా సృష్టించుకోవాలా అన్నది. తెలుగు కథలకు ఇప్పటికే ఏర్పడి వున్న పాఠక వర్గం కాక, అదనంగా కొత్త పాఠకులని అందుకోవడానికి ఈ కథలు వుపయోగపడతాయి.

కానీ, స్కై బాబా ఈ కథల్లో కొన్ని సాంస్కృతిక సంక్లిష్టతల్ని ఒక శిల్ప విధానంతో తేలికగానే నెగ్గుకొచ్చాడు. కథల్లోని ఒక వర్ణనా సారళ్యం, ఒక విధమయిన understatement వ్యూహం, సూటిగా అనుభవంలోకి తీసుకు వెళ్ళే నిర్మాణ సౌందర్యం, అన్నిటికీ మించి ఇంతకు ముందు ఎక్కడా చెప్పబడని తాజా తనం.... వుస్మానియా బిస్కట్ తో ఇరానీ చాయి తాగినట్టుగా అనిపిస్తాయి. మొదటి కథ నించి చివరి కథ దాకా వెళ్లడానికి పఠితకి కొంత వ్యవధి పట్టినా సరే, ముస్లిం అనుభవంలోని సాధారణ అంశాలు, వర్తమాన అంశాలుగా నిలిచే వాటిని కథావస్తువుగా తీసుకోవడం ద్వారా, ఆ అంశాలు ఎంతో కొంత ముస్లిమేతర సమూహాలకి కూడా సమస్యలే అయి వుండడం వల్ల ఇందులోని పాత్రలు మనకి పూర్తి అపరిచితంగా మిగిలిపోయే స్థితి నించి తప్పించుకున్నాయి. అందుకే, ఈ కథల్లోని వర్తమానం పఠితకి వొక తక్షణ వాస్తవికత. పైకి, నిర్దిష్ట ముస్లిం సమస్యలుగా కనిపించేవి – ముఖ్యంగా ముహబ్బత్ కథలో సౌందర్య భావన, “చోటి బహెన్” లో బుర్ఖా, ‘మజ్బూర్” కథలోని గరీబీ, కబూతర్ కథలో ఆడపిల్ల తల్లి వేదన - లాంటివి సాధారణ వర్తమాన అంశాలు. వాటితో మమేకం కావడానికి పఠితకి “ముస్లిం” అనుభవం గాని, ఆ భాష గాని ఆటంకం కావు. ఇక, “దస్తర్” “వతన్” లాంటి కథలు నిర్దిష్టంగా ముస్లిం అనుభవాలు. ఈ రెండు రకాల అనుభవాల మధ్య పఠితని నడిపించడంలో స్కైబాబా సఫలమయ్యాడు. ఆ నడకలోనే ఈ కథల్ని తెలంగాణ ముస్లిం కథగా మలిచిన నేర్పు కూడా వుంది. ఇక ‘జీవం” లాంటి కథలు కొంత ప్రయోగాత్మకత కూడా తోడయి, రచయితలోని అస్తిత్వ వేదనకి సంబంధించిన స్పష్టతని చెప్తాయి.

ఈ కథల్లోని పాత్రలు మన మధ్యనే వుండి, మనకి తెలియకుండా మిగిలిపోతున్న వాళ్ళు. అనేక కారణాల వల్ల మన స్మృతిలోంచి జారిపోతున్న వాళ్ళు. “ముస్లిం’ అనే వర్గీకరణ కింద నలిగిపోతున్న వాళ్ళు. మతపరమయిన ఉనికీ, గుర్తింపూ ముస్లింలకి మాత్రమే పరిమితం కాకపోయినా, మన పక్కన ముస్లిం వున్నాడంటే “అమ్మో” కాస్త భయపడాలనో, జాగ్రత్తగా వుండాలనో అన్నట్టుగా అధికార రాజకీయ వ్యవస్థ వొక అసహజమయిన భయాన్ని నిర్మించింది. మిగిలిన ఈ కుల, మత అస్తిత్వాల్లోనూ లేని సమస్య ముస్లిం అనే వర్గీకరణ కింద సృష్టించబడింది. “దావా’ కథలో స్కైబాబా రాజ్యం సాధారణ స్థాయిలో ఎట్లా ప్రవర్తిస్తుందో చెప్పాడు కానీ, అది ముస్లిం పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో అన్న దాకా వెళ్ళలేదు. ఈ కథలో అట్లాంటి రాజకీయ కోణాలు అస్పృశ్యంగా వుండి పోయాయి. తనకి తెలియకుండానే, స్కైబాబా ఈ కథల్లో ముస్లిం సాంస్కృతికత మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. రోజు వారీ ముస్లిం బతుకు, అందులోని ‘దలిందరాగి’, ముస్లిం తల్లులూ, కొడుకులూ, కూతుళ్లూ, కొడళ్ళూ, మాయామయిపోతున్న ముస్లిం బహిరంగ సంస్కృతి, అనివార్యమవుతున్న వలసలూ వీటన్నిటి వెనకా వొక ముస్లిం అనుదిన సాంస్కృతిక వేదన వుంది. వొక విధంగా ముస్లిం ఫెమినిస్టు కోణాన్ని స్కై బాగా ప్రతిబింబించాడు. ఈ కథల్లో మిగతా వేరే కోణాలు వున్నప్పటికీ ఆ స్త్రీ స్వరంలోని తీవ్రతలో అవి కప్పడిపోయాయి. వొక పురుష రచయిత స్త్రీస్వరంతో అంత బలంగా మాట్లాడ్డం విశేషమే!

కానీ, మొత్తంగా ఈ కొత్త తరం ముస్లిం వేదనల పునాది ఇటీవలి మత రాజకీయాలలో వుందన్నది నా అభిప్రాయం. ఆ కోణం లోపించడం వల్ల ఈ కథలు ముస్లిం అనుభవపు అర్థ వలయాన్ని మాత్రమే చూపించినట్టయింది, ఆ రకంగా చూస్తే ఇందులో వున్న ముస్లిం అనుభవం ‘అధూరా”గా మిగిలిపోయిందనీ అనిపిస్తుంది. ఆ కోణం వైపు కూడా దృష్టి పెట్టి, ముస్లిం రాజకీయ కథలు కూడా రాసి, ఆ వలయాన్ని పూర్తి చెయ్యాల్సిన బాధ్యత స్కైబాబా వొక్కడి మీదే కాదు, తెలుగు-తెలంగాణ ముస్లిం రచయితలందరి మీదా వుంది.
*
Category: 2 comments

మరో ఎడోనిస్ కవిత: ఆమె అతను




- ఎవర్నువ్వు?
- ఇల్లూ వాకిలి లేని వో పిచ్చి మార్మికుడిని
ఆకాశం నించి రాలి పడిన రాయిని, దెయ్యం రాయిని.

- ఎవర్నువ్వు?
నువ్వు నా శరీరంలోకి ప్రయాణించావా?
-అనేక సార్లు

- అక్కడ నువ్వేం చూశావ్?
-నా మృత్యువుని.

-అప్పుడు నా ముఖం తొడుక్కున్నావా?
నా సూర్యుడిని నీడగా చూశావా
నా నీడని సూర్యుడిగా చూశావా
నా పక్క కిందకి తొంగి చూసి, నన్ను కనుక్కున్నావా?

- నువ్వు నన్ను కనుక్కున్నావా?

-అవును ఇద్దరం వొకరి కొకళ్లం ప్రతిబించుకున్నామా?
వొక నిశ్చల నిశ్చితాన్ని వెతుక్కునామా?
-లేదు

-నీ గాయాలన్నీ నయం చేశానా, లేదంటే
నువ్వింకా ఆ భయంతోనే వుండిపోయావా?
-లేదు

- పోనీ, నీకు నేను తెలుసా ఇప్పుడు?
-నీకు నేను తెలుసా?
Category: 8 comments

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

ఇవాళ "నమస్తే తెలంగాణ" దిన పత్రిక సాహిత్య అనుబంధం "చెలిమె"లో ప్రముఖ కవి, నాన్-ఫిక్షన్ రచయిత, మిత్రుడు కందుకూరి రమేశ్ బాబు నాతో చేసిన "ఈ-ముఖాముఖీ" అచ్చయింది. అక్షరం మిత్రుల కోసం ఈ బ్లాగులో పెడుతున్నాను.




అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న అధ్యాపకుడు. మన పల్లె బిడ్డే...కానీ ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో సాహిత్యం, సంస్కృతులను బోధిస్తున్న ఆసియన్ స్టడీస్ టీచర్. ‘అడవి, అగ్గి’ వంటి కథలు, ‘రక్తస్పర్శ’, ‘ఇవాళ’, ‘వలస’, ‘వూరి చివర’ వంటి కవితా సంపుటులు, ‘ఆదునికత-అత్యాధునికత’, ‘కథ-స్థానికత’ వంటి సిద్ధాంత వ్యాసాలు, ‘దక్షిణాసియాలో హిందూ ముస్లిం సాహిత్య కథనాలు’ వంటి పరిశోధనా పత్రాలు- ఇవన్నీ అఫ్సర్ అంటే ఏమిటో తెలియజెప్పే కొన్ని అక్షరశస్త్రాలు. చిత్రమేమిటంటే, ఆయన మనవాడే, మొదటి ప్రపంచంలోకి వెళ్లినా స్థానికుడే. నవ్వేకళ్ల ఆ మహమ్మద్ మన ఖమ్మం బిడ్డ, ‘కౌముది’ కొడుకు. చిన్ననాడు చందోబద్ధంగా పద్యాలు రాస్తుంటే, ‘‘నువ్వు తెలుగులో రాయడం ఏంట్రా తురకోడా?’’ అన్న స్నేహితుడి వెటకారం తొలి చురక.

తర్వాత విద్యార్థిగా ఉన్నప్పటి క్రియాశీల రాజకీయాల పదును, అటు తర్వాత మిర్రర్, ఇల్లవూస్టేటెడ్ వీక్లీల్లో ఇంగ్లీషులో కవిత్వం రాసేంత ప్రీతి, అటు తర్వాత పాత్రికేయం, విమర్శ, సాహిత్య అనుబంధాల అనుబంధం, ఇప్పుడు అధ్యాపకత్వం. అది ఏ అనుభవమైనా గానీ దాన్ని కవిత్వంగా మలచుకునే లక్షణం- అదే అఫ్సర్-ఏ పని చేసినా జీవన మూలాల్లో వెలుతురు ప్రసరింపజేయడం...చీకటి కరేల్మని కదిలినట్టు వెలుతురు గుప్పిట విప్పడం...ఎక్కడైనా...అక్కడెక్కడున్నా...టెక్సాస్‌లో ఉన్నా... అస్తిత్వ అన్వేషణ...ఊరి చివరి నుంచైనా సరే గొంతు విప్పే తత్వం...ఎక్కడున్నా అడ్డా మీద నిలబడ్డమే అనగలగడం...వూరునూ, తల్లినీ మర్చిపోని ఆర్తి- అదే అఫ్సరసం. ఆయన వృత్తీ, ప్రవృత్తీ, దృక్పథాల అస్తిత్వ ఛాయల్ని పంచుకోవడానికి ఇ-మెయిల్ ఉత్తరాలతో జరిపిన ఆత్మీయ సంభాషణ ‘చెలిమి’కి ప్రత్యేకం.

అక్కడున్నపుడు ‘మీ ఊరేమిటి’ అంటే ఏం చెప్తారు?
పెంచీ చదువు చెప్పించిన వూరు చింతకాని, ఖమ్మం జిల్లా. కని పెంచిన వూరు ఎప్పటికీ మారదు. మనమే బదిలీ అవుతూ వుంటాం, కొత్త బతుకుల్లోకి. వలస అనేది మనిషి జీవితానికి ఇరుసు. వలస అనేది ఎంత బలమయిన వాస్తవికతో ‘వలస’ (2000) కవిత్వంలో తెలుస్తుంది. వలస పోవడం అన్నది అనివార్య వాస్తవికత. వలస పోకపోతే కూడు లేదు. రెక్కల మీద బతికే వాళ్లకి మరీ- పట్టెడన్నం కోసం హైదరాబాద్ వలస వచ్చి, అడ్డాలో నిలబడ్డ కూలీలమే అందరం. నేను ఇంకాస్త ముందుకు వెళ్లి పెద్ద అడ్డాలో కడుపు పట్టుకుని నిలబడ్డా. అంతే! మారింది అడ్డా మాత్రమే. వూరూ మారదు. తల్లీ మారదు. అడ్డా మారినప్పుడల్లా బతుకు మారిందేమో చూసుకోవాలి.

కవిగా, విమర్శకుడిగా అఫ్సర్ అమెరికాలో.. ఏం పని
చేస్తున్నాడు?
కవికి స్థల కాల పరిమితులు లేవు. ఏ స్థలాన్నయినా, కాలాన్ని అయినా తనదిగా మలుచుకోగలిగితేనే కవిత్వం. కానీ విమర్శకుడి పరిస్థితి వేరు. నిరంతర అధ్యయనం ప్లస్ ఆలోచన- అది జీవితమైనా, పుస్తకమైనా- విమర్శకు పదును పెడుతుంది. మనం వేరే సంస్కృతుల్ని చూసే అవకాశం వున్నప్పుడు ఈ ఆలోచన భిన్నంగా ఎదుగుతుంది. టెక్సాస్ యూనివర్సిటీ భిన్న సంస్కృతుల వేదిక. అలాంటి టెక్సాస్ యూనివర్సిటీలో పని చెయ్యడం గొప్ప అవకాశం. ఇది అనేక సంస్కృతుల కేంద్రం. ఎన్ని వాదాలున్నప్పటికీ, అభ్యుదయ భావాలని అంటి పెట్టుకుని వుండే వ్యక్తిత్వం ఈ యూనివర్సిటీది. అదొక కారణం నా లోపలి కవి ఇప్పటికీ బతికే వుండడానికి.

అకడమిక్ గోరీలో పడిపోయాక కొన్నిసార్లు కేవలం అస్థిపంజరంగా మాత్రమే మిగిలిపోతాం. ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను. ఏ అనుభవాన్ని అయినా కవిత్వంగా మలచుకునే లక్షణం నా లోపల వుందనుకుంటా. ఇక్కడ విమర్శకుడిగా నేను చేస్తున్న పని నాకు తృప్తిగా ఉంది. నేను చెప్పే కోర్సులు కూడా నా హృదయానికి దగ్గరగా వుండేవే కనుక వృత్తి రీత్యా ఇతర సంఘర్షణ లేమీ లేవు. కానీ, ఇది అనుక్షణిక సవాలు లాంటి వ్యవస్థ. వొక పట్టాన ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇంకా ఇంకా నిన్ను నువ్వు వెతుక్కోమని, తవ్వుకోమని కొత్త కొత్త పనిముట్లను మన ముందు పెడ్తుంది. అమెరికన్ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఇక్కడి పరిశోధనా తీవ్రత. విమర్శనాత్మక ఆలోచన. స్కాలర్షిప్ పట్ల గౌరవం. టీచింగ్ అంటే విపరీతమైన తపన. ఇవి అన్నీ కవిగా, విమర్శకుడిగా, బుద్ధిజీవిగా నన్ను పదును పెట్టాయని గట్టిగా చెప్పగలను.

ఒక కవిగా మీ తాజా కవిత్వం, మీ కవితా పిపాస ఎట్లా వ్యక్తం అవుతున్నది? ఎటువంటి అంశాల చుట్టూ మీ హృదయం గింగిరాలు కొడుతున్నది?
అస్తిత్వ అన్వేషణ ఇప్పటికీ నా కవిత్వ వస్తువు. అందులో భాగమే స్థానికత అనే భావన గురించి ఇటీవలి కాలంలో నేను చేస్తున్న ప్రతిపాదనలు. శరీరానికి, మనసుకీ, ఆలోచనలకీ ఇప్పటికే అలవాటు అయిన వొక స్థితికి దూరంగా వున్నప్పుడు ఆ స్థితిని కొంత విమర్శనాత్మకంగా, లోతుగా చూస్తాం. వూరు అదే. కానీ, మీరు హైదరాబాద్ వచ్చిన తరువాత ఆ వూరు అలాగే వుంటుందని నేను అనుకోను. కాకపోతే, నేను హైదరాబాద్ కన్నా కాస్త పెద్ద వూరికి వచ్చా. అప్పుడు ఆ వూరి గురించి మన ఆలోచనలు మారతాయి. ఉద్వేగాలు మారతాయి. ఈ కొత్త స్థితిని చెప్పడానికే నేను ‘ఊరి చివర’(2010) కవిత్వంలో ప్రయత్నించాను. అంతర్జాతీయ అస్తిత్వం అనేది ఎంత సాహసమో ఇప్పుడు రోజురోజుకి అర్థమవుతోంది. వొక్కోసారి అది దుస్సాహసం అని కూడా అనిపిస్తుంది. కానీ, తెగింపు లేకుండా జీవితం లేదు. తెగింపు నా బతుకు తత్వం కూడా. బరితెగింపు అంటే మళ్లీ నాకు నచ్చదు. పొట్ట పట్టుకుని వొక్కసారి వూరు విడిచి వచ్చిన వాడికి ఈ తెగింపు ఒక లెక్కకాదు. ఆకలి, దారిద్య్రం అనేది దానికదే వొక దేశం. ఆ దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు రాస్తున్న కవిత్వం అంతా ఈ ఆకలి దేశంలో సంచరిస్తున్న వొక స్థానికుడి ఘోష మాత్రమే.

ప్రధానంగా మీ అధ్యయన అంశాలేమిటి? గతానికీ, ఇప్పటికీ వచ్చిన మార్పు ఏమైనా వున్నదా? ఈ మాట ఎందుకంటే, సుదూరాల నించి మళ్లీ మనకి మాతృకగా వున్న అంశాలను బేరీజు వేసుకుంటూ ఎదగడం; ప్రపంచ పౌరుడిగా ఉంటూ స్వీయ అస్తిత్వాన్ని నొక్కి చెప్పగలిగే అవకాశం రావడం అరుదైనది కదా! అటువంటి అదృష్టవంతుల్లో మీరొకరని అడగడం.....?
నేను ప్రధానంగా మైనారిటీ అస్తిత్వ సాహిత్యం-సంస్కృతి మీద దృష్టి పెడ్తున్నాను. మైనారిటీ అంటే ముస్లిం అని కాదు. ప్రపంచ సాహిత్య దృష్టి నించి చూసినప్పుడు మార్జిన్స్(అంచుల) నుంచి వస్తున్న సాహిత్యం అంతా మైనారిటీ సాహిత్యమే. దళితులు, ముస్లింలు అణచివేతకి గురవుతున్న అందరి సాహిత్యం. కానీ, స్థూలంగా మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలు నాకు కేంద్ర బిందువు. గతంలోనూ, ఇప్పుడూ వచ్చిన మార్పు ప్రధానంగా కొత్త విమర్శ సాధనాలు సమకూర్చుకోవడం. తెలుగు స్థానికతని, ప్రపంచ స్థానికతతో పోల్చుకొని చూసుకోగలగడం- సరిహద్దులు చెరిగిపోతున్న కాలంలో స్థానికత- అంతర్జాతీయతల మధ్య సంభాషణ అత్యవసరం అనుకుంటున్నాను. అయితే మీరన్నట్టు ఇదంతా తిరిగి స్వీయ అస్తిత్వ వ్యక్తీకరణ కోసమే.

ఎనభై, తొంభై దశకాల్లో సీరియస్ సాహిత్య విమర్శకుడిగా వుంటూ మీరు అధ్యయనం చేసి, అనుభవించిన పలవరించిన అంశాలు- విమర్శకూ, వాదనకూ పెట్టిన అంశాలు-ఆ క్రమంలో వ్యక్తమైన ఆలోచనలూ-అక్కడి నించి వెనుదిరిగి చూస్తే ఆ మార్పు ఎట్లా అనిపిస్తుంది?
1992లో ‘ఆధునికత- అత్యాధునికత’ విమర్శ వ్యాసాల్లో మొదటిసారిగా అస్తిత్వవాదాల్ని సిద్దాంతీకరించినప్పుడు అది చర్చనీయాంశమయ్యింది. అప్పటికే స్థిరపడి వున్న ప్రధాన స్రవంతి ధోరణుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. ఇప్పుడు ఆ అస్తిత్వ వాదాలే ప్రధాన స్రవంతి అయ్యాయి. అప్పుడు ప్రతిఘటించిన చాలామందే ఇప్పుడు వాటిని తలకెత్తుకునే స్థితి ఏర్పడింది. అప్పుడూ ఇప్పుడూ నాకు అర్థమయ్యింది వొక్కటే. రాజకీయ ఎత్తుగడలు వేరు, రాజకీయ దృక్పథం వేరు. సాహిత్యంలో రాజకీయ కోణం ఇంకా బలంగా వ్యక్తం కావాలన్నది నా స్థిరమైన అభివూపాయం. నేను మొదటి నించీ చేస్తున్న వాదం అదే. ఇప్పటికీ అదే అంటాను. సాహిత్యం నా దృష్టిలో అత్యంత బలమైన రాజకీయ ప్రకటన. ఎనభై, తొంభైల తెలుగు సాహిత్యం మనకి నేర్పిన పాఠం ఇదే.

ఇక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలు-ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వ పోరు పతాక స్థాయికి వెళ్లిన తరుణంలో మొదటి ప్రపంచంలో వుంటూ మూడో ప్రపంచంలో ఈ మలి తెలంగాణ వర్తమాన ఉద్యమ స్రవంతిని ఎట్లా పరిశీలిస్తున్నరు?
ముందు ఆ మొదటి ప్రపంచం, మూడో ప్రపంచం అనే భావనకి ఇప్పుడు అర్థం లేదనుకుంటా. ఇంకెక్కడి మొదటి ప్రపంచం? వర్తమాన రాజకీయార్థిక కోణం నుంచి చూస్తే, అది అస్తవ్యస్తమయ్యింది. ఇక తెలంగాణ అస్తిత్వ పోరు కేవలం తెలంగాణ సరిహద్దులకే పరిమితం కాదు. ప్రపంచంలో తెలంగాణ వాళ్లు ఏ మూల వున్నా అక్కడ తెలంగాణ ఉద్యమం వుండి తీరుతుంది. అమెరికాలో దాదాపు అన్ని పెద్ద నగరాల్లో తెలంగాణ ఉద్యమ సంఘీభావం జోరుగా వుంది. అక్కడ జరుగుతున్న నిరసనలన్నీ ఇక్కడా జరుగుతున్నవి. ఇక్కడా రచయితలు సంఘటితమవుతున్నారు. కాబట్టి, ఒక రచయితగా నేను కేవలం పరిశీలకుడిని కాను. ఈ ఉద్యమంలో భాగస్వామిని. ఆనాటి తెలంగాణ పోరాటం కంటే ఈనాటి తెలంగాణ పోరాటానికి అంతర్జాతీయత ఎక్కువ ఉంది. ప్రపంచ సంఘీభావం కూడా ఎక్కువ వున్నది.

మీరు అమెరికాలో చేపట్టిన పనులు, వాటి విజయాలు చెప్పండి?
ఇక్కడ నా పని మూడు రకాలుగా సాగుతుంది. వృత్తి, ప్రవృత్తి, దృక్పథం మూడింటిని కలిపే అధ్యాపకత్వం. ఆస్టిన్ టెక్సాస్ యూనివర్సిటీలో నేను చెప్పే వివిధ సాహిత్య సాంస్కృతిక కోర్సులు ఇదెలా సాధ్యమో చెప్తాయి. దళిత సాహిత్యం- సంస్కృతి మీద నేను మొదటిసారి కోర్సు రూపొందించి, పాఠాలు చెప్పాను. అట్లాగే, దక్షిణాసియా సాహిత్యం-సినిమాలు, ముస్లిం సాహిత్యం, ఆధునిక భారతీయ సాహిత్యం అస్తిత్వాలు, ఇవి నేను రూపొందించిన కోర్సులు. ఇవి బాగా విజయం సాధించిన కోర్సులు కూడా. మొదపూట్టి అయిదేళ్లు అయినా ఈ కోర్సులకు విద్యార్థులు ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్‌లో వుండడం విశేషం. ఈ కోర్సుల స్ఫూర్తితో కొంతమంది విద్యార్థులు తెలుగు సాహిత్య పరిశోధన వైపు మళ్లుతున్నారు. ఇక భాషా పరంగా, ఇక్కడి తెలుగు భాష కోర్సు అమెరికాలోనే పెద్దది. ఏటా నలభైమంది ఈ కోర్సుల నించి గ్రాడ్యుయేట్ అవుతున్నారు.

పరిశోధన, విమర్శ పరంగా సాహిత్య అనువాదాలు, వాటిమీద విమర్శ ప్రధానమయిన పని. ఈ రంగంలో తెలుగు సాహిత్యానికి వీలయినంత ప్రాధాన్యం ఇస్తాను. తెలుగు నించి తగినన్ని అనువాదాలు లేనప్పుడు నేనే సొంతంగా అనువాదాలు చేసుకొని, ఈ విమర్శ వైపు దృష్టి పెడతున్నాను. అయితే, సాహిత్య పరిధులని దాటి సాంస్కృతిక అధ్యయనం వైపు మళ్లడం చాలా అవసరం అని నాకు అనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయం మీద నేను రాసిన రచనలు వివిధ అంతర్జాతీయ పత్రికలలో, సంపుటాలలో అచ్చయ్యాయి. ప్రస్తుతం దళిత, ముస్లిం కవిత్వాల అనువాదాల పనిలో వున్నాను. అమెరికాలోని వివిధ భాషా సాహిత్య సంఘాలలో వున్నాను. కవిత్వ పఠనాలలో పాల్గొంటున్నాను. కవిగా- ఇక్కడికి వచ్చాక ఒక కవిత్వ సంపుటి వేశాను. వొక కవిత్వ సంకలనం ‘అనేక’ సంపాదకత్వం వహించాను. తెలుగు ముస్లిం సాహిత్యం అంతా కొన్ని సంకలనాలుగా తీసుకురావాలన్న ఆలోచన వుంది.

ఆస్టిన్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఆసియన్ స్టడీస్‌కి వున్న ప్రాధాన్యం? అక్కడి మీ పాత్ర గురించి చెప్పండి?
అమెరికాలోని అతి పెద్ద ఆసియన్ స్టడీస్ విభాగం టెక్సాస్ యూనివర్సిటీది. ఇది ఇప్పటికే హిందీ-ఉర్దూకి పెద్ద కేంద్రం. ఇప్పుడు ఇదే తెలుగుకు పెద్ద కేంద్రంగా మారుతోంది. ఈ శాఖలో ఆసియా సాహిత్యం, మతం, సంస్కృతికి సంబంధించిన కోర్సులు, పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో కూడా ఇండియా, చైనా, జపాన్‌లది పెద్ద పీట. నేను చెప్పే కోర్సులు మొత్తంగా ఆసియా సాహిత్య సాంస్కృతిక అంశాలకే సంబంధించినవి. నాకు ఇష్టమైన అంశాలు స్థూలంగా- మైనారిటీ మతాల ఉనికి, సాహిత్యం, సంస్కృతి. ఈ పరిధిలో నవల, కథ, కవిత్వం- ఇవి నేను ప్రధానంగా పాఠాలు చెప్పే రంగాలు. ఏమరీ, యేల్, విస్కాన్సిన్, డ్యూక్ తదితర పెద్ద విశ్వవిద్యాలయా లో ఈ అంశాల మీద ప్రసంగాలు కూడా చేశాను. ముస్లిం మౌఖిక కథనాల మీద నా మౌలిక పరిశోధనకి అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫెల్లోగా ప్రకటించింది. ఈ కథనాలు ఇపుడు పుస్తక రూపంలో రాబోతున్నాయి. అరబ్-కేంవూదిత కోణాలని స్థానిక ఇస్లాం, ముస్లిం సాంస్కృతిక ఉనికి ఏ విధంగా సవాల్ చేస్తుందో చెప్పడం నా అధ్యయనంలో ప్రధాన అంశం. వివిధ కోణాల నుంచి అంటే - మత కథనాలు, సాహిత్య కథనాల ఆధారంగా నేను ఈ అంశం చుట్టూ నా వాదన పెడుతున్నాను. నేను చెప్పే కోర్సులు కూడా అంతిమంగా ఆ చర్చ వైపు వెళ్తాయి.

అన్నట్టూ అక్కడి మీ పరిచయాలూ, నెట్‌వర్క్స్?
ఆంవూధాలో వుండగా, గుగీ, వోలె సోయింకా, గేరీ సై్నదర్ లాంటి రచయితల్ని కలవగలమా అన్న కల ఉండేది. ఆ కల కొంతలో కొంత అయినా ఇక్కడ నిజమవుతుంది. వివిధ యూనివర్సిటీలకీ, సదస్సులకీ వెళ్లినప్పుడు అట్లాంటి వారితో గడిపే అవకాశాలు బాగా దొరుకుతున్నాయి. సరే, నా నెట్‌వర్క్ అంటారా? నేను అనేక రకాల చర్చా గ్రూపులలో భాగస్వామిని. కానీ టీచింగ్, రచనా వ్యాసంగం వల్ల వీటికి పెద్ద సమయం పెట్టలేకపోతున్నా. చివరికి మిగిలేది కాగితం మీది అక్షరమే అన్న భావం కూడా లోపల బలంగా వుందనుకోండి.

సంస్కృతి, భాషల ఆధ్యయనంలో సినిమా కూడా బలమైన సాధనం అని మీరు భావిస్తున్నట్టుగా మీ యాక్టివీటిస్‌ను బట్టి తెలుస్తోంది?
అవును, సంస్కృతిలో బలమైన భాగం సినిమా, థియేటర్, ప్రజా సంస్కృతి. నేను చెప్పే కోర్సులలో ఇవి మూడూ ముఖ్యమయిన భాగం. సినిమాలుగా మారిన నవలల మీద రెగ్యులర్‌గా వొక కోర్సు చెప్తున్నా. ఆ మూడు వాహికలు మూడు భిన్న భాషలు, వాటి మధ్య సంబంధాన్ని చూసినపుడు ఆధునికత ఎట్లా మారిందో తెలుస్తుంది.

గ్లోబలైజేషన్ మిమ్మల్ని జీవన మూలాలకు అంటి పెట్టుకునేలా చేసింది. అదే రీతిలో అంతర్జాతీయ సమాజంలో ఆత్మీయమైన అంశాలను భోదించే అధ్యాపకుడినీ చేసిందీ అంటే మీరు ఒప్పుకుంటారా?
జీవన మూలాల అన్వేషణే గ్లోబలైజేషన్ నెగెటివ్ ప్రభావాల నుంచి మనల్ని కాపాడుతుంది. గ్లోబలైజేషన్‌కి సమాధానం భిన్న స్థానికతల అన్వేషణలో వుందని నాకు గట్టి నమ్మకం. ‘కథ-స్థానికత’(2010) వ్యాసాలలో నేను చెప్పాలనుకుంది అదే. రచయితగా నా వ్యక్తిత్వానికి కొనసాగింపే నా అధ్యాపకత్వం, నా పరిశోధనా. అది మీరు, చాలామంది మిత్రులు- అక్కడా-ఇక్కడా స్పష్టంగా గుర్తించడం నాకు సంతోషం.
ఒకనాడు ఇంగ్లీష్ కవిత్వం రాసిన మీరు మళ్లీ ఇప్పుడు ఇంగ్లీషులో రచనా వ్యాసంగం వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ మార్పు మీకెలా అనిపిస్తోంది?

అవును, నా రచనా వ్యాసంగం ఇంగ్లీష్ కవిత్వంతో మొదలయ్యింది. తెలుగులోకి నేను ఆలస్యంగా అడుగు పెట్టాను. వొక రకంగా తెలుగులో రాయడం అనుకోకుండా జరిగింది. నిస్సిమ్ ఏజెకీల్, కమలాదాస్, రామనుజన్ లాంటివారి ఇంగ్లీష్ రచనల్నీ తెలుగులోకి అనువదించాలన్న ఆలోచనల్తో తెలుగులోకి మళ్లాను. అప్పటికే నా ఇంగ్లీష్ కవిత్వం అచ్చయింది. డిగ్రీలో నా మేజర్ ఇంగ్లీష్ సాహిత్యం. కాలేజీలో మంచి అధ్యాపకుల వల్ల, మంచి స్నేహితుల వల్ల ఇంగ్లీష్ అంటే బలమైన ఇష్టం ఏర్పడింది. శివాడ్డి గారు ఇప్పటికీ అంటారు. అట్లా ఇంగ్లీష్‌లో కొనసాగి వుంటే అద్భుతంగా ఉండేది అని! ఇంగ్లీష్‌లో అయినా, తెలుగులో అయినా నాకు మొదట్లో ఛందోబద్ద పద్యాలు రాసే అలవాటు ఉండేది. ఒకసారి తెలుగులో పద్యం రాస్తే ‘‘నువ్వు తెలుగులో రాయడం ఏంట్రా తురకోడా?’’ అని వొక చిన్ననాటి స్నేహితుడి వెటకారం తెలుగులోకి గట్టిగా తోసింది. ఆ మిత్రుడి వెటకారం నా తెలుగు కవిత్వానికి బలాన్నిచ్చింది, వొక పొగరు నిచ్చింది. ఆ మిత్రుడి వెటకారమే లేకపోతే ఇవాళ నా కవిత్వమూ లేదు. విమర్శా లేదు. ఇక ఇప్పుడు తిరిగి ఇంగ్లీషులోకి రావడం అవసరం అయ్యింది. అంతే! ఇక్కడి నా కోర్సులలో ఎంతో కొంత తెలుగు సాహిత్యం ఉపయోగించాలన్న తపనతో కొన్ని అనువాదాలు చెయ్యడం మొదలుపెట్టాను.

పాఠకుడితో సంభాషించడం అలవడిన మీకు విద్యార్థులకు కమ్యూనికేట్ చెయ్యడం ఎట్లా ఉంది?
అది కొంచెం కష్టమైన మార్పు. కానీ, మనం అంతా మౌఖిక సంప్రదాయం నించి వచ్చిన వాళ్లం, పల్లెల నించి వచ్చిన వాళ్లం. పాటలూ, కథల నుంచి వచ్చి వాళ్లం. మనకి పాఠకుల కంటే ముందు తెలిసేది శ్రోతలే. పాఠకుడు మనకు రెండో దశ. కాబట్టి ముందు దేన్నయినా ‘మాట’లో ఎట్లా పెట్టాలన్నది మనకు కొంత అనుభవం ఉంటుంది. తరువాతి కాలంలో నేను విద్యార్థి రాజకీయాలలో క్రియశీలంగా పనిచేశాను.

పొట్టకూటి కోసం ట్యూషన్లు చెప్పుకున్నాను. ఇవన్నీ గొప్ప అనుభవాలు. ఆ అనుభవాలలో ‘పా లేడు కదా! ఒక పల్లె నుంచి వచ్చిన విద్యార్థిగా విద్యార్థుల సంఘర్షణ ఏమిటో నాకు అర్థమవుతుంది. వాళ్ల బాషా సాంస్కృతిక సమస్యలు సహానుభూతితో వినగలను, అర్థం చేసుకోగలను. లెక్చరు దంచడం కంటే ఇది కష్టమైన ప్రక్రియ అని నా నమ్మకం. ఇక్కడి విద్యార్థులు నాకు రాసే కామెంట్లలో ఎక్కువగా వాళ్లు నా వ్యక్తిత్వం గురించి రాస్తారు. కమ్యూనికేషన్ అనేది మన వ్యక్తిత్వానికి కొనసాగింపు మాత్రమే అనుకుంటాను.
.ఇది మొదటి ప్రపంచానికి.... మూడో ప్రపంచపు కొన్ని పార్శాలను అందజేయ గలగడమా... కొంచెం వివరించండి!

‘నేనే వొక మూడో ప్రపంచాన్ని...’ అనే కవిత నా ‘వలస’ పుస్తకంలో వుంటుంది. మొదటి ప్రపంచమే కాదు. ఏ ప్రపంచమైనా బాగా అర్థం కావాలంటే, మూడో ప్రపంచ కోణమే ఉపయోగపడుతుంది. ఇండియా నుంచో, లాటిన్ అమెరికానించో, ఆఫ్రికా నించో, మధ్య ఆసియా నించో వచ్చిన వాళ్లు అమెరికాని, యూరప్‌ని బాగా అర్థం చేసుకోగలరు. అందుకే, ఇక్కడ బాగా పేరున్న అధ్యాపకులు ముఖ్యంగా ఆ దేశాల నించి వచ్చిన వాళ్లు లేదా ఆ అంశాలని బోధించేవాళ్లు పరిశోధించే వాళ్లు అందుకే స్థానికత కంటే గొప్ప కొలమానం ఇంకోటి లేదని వాదిస్తాను. స్థానికతని చూసే నిశిత దృష్టి వున్నపుడు గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ.
-అమెరికాలో ఉన్న అఫ్సర్‌తో.. కందుకూరి రమేష్ బాబు
Category: 16 comments

తూరుపు చెట్టు




నేనొక అద్దానయ్యాను
అన్నీ నాలో ప్రతిబింబిస్తున్నాయి

నీ జ్వాలలో నేను
ఆ నీటినీ, ఆ మొక్కనే మార్చేశాను.

శబ్దం రూపునీ
పిలుపునీ మార్చేశాను

నిన్ను రెండు గా చూడడం మొదలెట్టా
నిన్ను నిన్నుగా
నా ఈ కంటిలో ఈదుతున్న ముత్యంగా

ఆ నీరూ నేనూ ప్రేమలో పడ్డాం

అటు తరవాత
నీరు నా లోపలి నించే పుట్టింది.


ఎంచక్కా మేం కవలలమయ్యాం

మూలం: ఎడోనిస్ (ఆరబిక్ కవి)

ఇప్పుడు ఎనిమిది పదుల వయసు దాటిన ఎడోనిస్ మొన్న నోబెల్ సాహిత్య ప్రైజ్ కి చివరి దాకా వచ్చాడు; అది కొద్దిలో తప్పిపోయింది. అప్పుడు చాలా మంది కవిత్వాభిమానులు నోబెల్ వొక మంచి గౌరవాన్ని కోల్పోయిందని అన్నారు. ఎడోనిస్ అసలు పేరు అలీ అహ్మద్ సయ్యద్ అస్బర్. ఆ పేరుతో కవిత్వం పంపితే అన్ని పత్రికలూ తిప్పికొట్టడంతో అతను ఎడోనిస్ అనే కలం పేరుతో రాయడం మొదలెట్టాడు. ఆధునిక అరబిక్ కవిత్వంలో వొక నవీన సూఫీ యుగానికి నాంది పలికిన వాడు ఎడోనిస్.

చలి రాత్రి వొక వీడుకోలు




వచ్చే సెమిస్టరు నేను ఆసియా భక్తి కవిత్వం మీద వొక కొత్త సెమినార్ కోర్సు చెప్పబోతున్నాను. అందులో భాగంగా చైనా, జపాన్ బౌద్ధ కవిత్వం చదువుతున్నా ఈ మధ్య.

కవిత్వం ఏం చెయ్యాలి? కవిత్వం చేసే పని ఎట్లా వుండాలి? అనేవి రెండు పెద్ద ప్రశ్నలు. వాటికి ఎవరి దగ్గిర వున్న సమాధానాలయినా అవి పూర్తి సమాధానాలు అయి వుంటాయని నేను అనుకొను. కానీ, ఏదో వొక సమాధానం రాబట్టుకొని తీరాలన్న మొండితనం కవికి వుండాలి, పఠితకీ వుండాలి. లేకపోతే, ఇద్దరి అన్వేషణా అధ్వాన్నపుటడవుల్లోకి జారిపోతుంది.

నా మటుకు నాకు ఈ బౌద్ధ కవిత్వ యాత్ర వొక కొత్త అనుభూతి. కొత్త దారి.
తెలియదు, ఈ దారిలో నేను ఎటు మళ్లుతానో?

ఈ కవితలో ఈ చైనా కవి అనేక శతాబ్దాల కిందట వీడుకోలు చెప్పింది నాకేనా?


చలి రాత్రి వొక వీడుకోలు

ఆ మొదటి మలుపు దీపం చూడూ,
అటుగా ఆ వూరి వంతెన మీంచి నేరుగా వెళ్ళు.


ఏటి మీద మొగ్గలు ముద్దలుగా
రాలిపడుతుంటాయి, కరగని మంచు.


ఇంత చలిలో - మరీ కురచని ఈ పగళ్లలో-
నువ్వు వెళ్లిపోవడం దిగులుగా వుంది.


ఈ కొండలేమో అంతులేనివి,
మరి, నువ్వు అందుకోవాల్సిన బాట మరీ దూరం!


(మూలం: chia tao 779-843)

ఎప్పటిలాగే ఆ ఎప్పుడూ!

1
ఆ ఎప్పుడు ఎప్పటిదో తెలిస్తే ఇంకేం లే?

....లాగే...లాగే.. లాగా అన్నది సరేలే!

2

రోజులు అంకెల మొహాలు వేలాడదీసుకొని

అప్పుడప్పుడూ నిన్నమొన్నటి చొక్కాలా గోడకి

వే
లా
డు
తూ.



3
చెప్పేందుకు కొత్తదేమీ లేదు ఖాయంగా

రొటీన్ కోరుకుతూనే వుంది గాయంగా.

4

వైణికుడు వొకే దుక్ఖంలో దూకి

మరేదో రాగంలో తేలిపోతూ.


ఎప్పటికప్పుడు ఏమీ తెలియకుండానే!

5
అలా వున్నామో ఎప్పటిలాగా

ఎలా వున్నామో అప్పటిలాగా

అలా ఎలా వున్నామో అప్పటి ఎప్పటిలాగా.

6

గది మూల వొదిగిపోయాయి అన్నీ

పుస్తకాలూ సంగీతం పెట్టెలూ ఇష్టాలూ

కాసిని ప్రేమలూ కొన్ని మోహాలూ ఇంకా కొన్ని అహాలూ!

7

ఈ పొద్దయినా
వొక్క
దులుపు దులపరా!
Category: 11 comments

నీ పన్నెండో గంట...



నిద్రలో
కల తెగిపోతూ వుండొచ్చు

కలలో
నిద్ర తేలిపోతూ వుండొచ్చు

కలత నిద్ర
అక్కడయినా, ఇక్కడయినా!

అటు నువ్వు చంద్రుణ్ణి కప్పుకుంటావు
ఇటు నేను సూర్యుడి కంటి కింద నలిగిపోతూ వుంటాను

ఎంత కవిత్వమయినా
పగలెప్పుడూ వెన్నెల కాదు,

రాత్రి ఎప్పుడూ సూర్యుడిది కాదు.


కలలు కనే వేళలు మారిపోయాయి మనకి,
అంతే!
Category: 8 comments

దిల్ హూ హూ కరే…




వణుకుతూ ప్రవహించే గొంతు నీది; జ్వరపడిన పిల్లాడిలాగా
దుప్పట్లో మునగదీసుకునే కలత నది.

కడుపుతో వున్న వొక మబ్బు తునకని నేల మీదికి దింపి,
చిట్లిపోతున్న దాని నరం మీద కమానుతో

తటిల్లున మెరిసే మెరుపు నువ్వు; దిగులు పడిన గోదారయి,
మౌనంలోకి ముడుచుకుపోయే ఆమెలాగా.

చిదిమిపోతూ నీటి బుగ్గ గొంతులో చివరి సారి
తడబడిన జీవన జ్వర వాంఛ నీ పదాల రాపిడిలో.

2
వొక మేఘ ఘర్జననీ
ఇంకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెను వాన

కురుస్తూ వుంది రాత్రి వెలుగుని తోడు పెట్టుకొని
పగలు చీకటిని కడుపులో దాచుకొని,

బండ రాళ్ళ నగరం వొంటి మీద.

3
రాయడానికేమీ లేదు,గుండె కూని రాగం ఆగేంత వరకూ.
భయమో ఏమో తెలియని రైలు దూసుకుపోతున్నట్టే, సొరంగంలోంచి.

4
ప్రాణం వుగ్గబట్టుకున్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకున్నానా,
పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేంత దాకా, నా జహాపనా!
Category: 15 comments

నాలుగు మాటలు ఇంకో సారి...

(చిత్రం: మహిమాన్విత)

వొకే వొక్క బుడగలో బుడుంగుమని మునగా లేం, తేలా లేం
అయితే కానివ్వు
బుడగలో పుట్టుకా
బుడగలో చావూ
అన్నీటినీ లోపలికి లాక్కు వెళ్ళే అక్షయ సముద్రం అదే!

వొక్కో సారి ఆశ్చర్యమూ లేదు విడ్డూరమూ కాదు
మాయా కాదు మంత్రమూ కాదు.
అంతా సచ్ ముచ్ సచ్...

2

ఇవాళ వొక బుడగలోంచి కళ్ళు తెరిచి చూశాను
చిన్న చిన్న నదులు చిట్టి కప్పల్లా ఎగిరెగిరి పడ్తున్నాయి.

ఇవాళ కళ్ళలోంచి వొక నీటి దీపం వెలిగించి చూశాను
కొన్ని వందల చీకటి గోళాలు గోలీ కాయల్లా దొర్లి పోతున్నాయి

ఏమీ తేడా కానలేను, మిత్రుడా!
నువ్వు ముడుచుకుపో నీ నీడలోనే!

3

గది దాటి వచ్చి చూస్తే ఆ నాలుగు దారులూ
నాలుగు ఖండాలుగా ఎటో ఎగిరిపోయాయి

గోడ పగలగొట్టి నడిచోస్తే ఆ పది మందీ
పాతిక దారుల్లో తప్పిపోయారు

ఏమీ కారణం చెప్పలేను, మిత్రుడా!
గదికీ లోకానికీ కటీఫ్!

4

ఎన్ని సార్లు గీసినా ఏకాంత చిత్రం
నువ్వు
గీసి చెరిపెయ్యలేని పసితనపు బొమ్మే నయం!

బొమ్మ ఇప్పటికీ దృశ్యమే.

పసితనమే అదృశ్యమయ్యింది.
Category: 2 comments

'చదువు అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు'




(ఇది హైదరబాద్ నించి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లొ చదువుకోవడానికి వచ్చిన ఒక అండర్ గ్రాడుయేట్ విద్యార్థి...నా తెలుగు క్లాస్ కోసం అసైన్మెంటులొ భాగంగా అమ్మానాన్నలకి రాసిన ఒక ఉత్తరం...ఈ విద్యార్థి నేను చెప్పే "దక్షిణాసియా సాహిత్యం-సినిమా" "భారతీయ సాహిత్యం-ఆధునికత" కోర్సులలో కూడా వున్నాడు.ఇందులొ ఆలోచించాల్సిన విషయాలు వున్నాయని నాకు అనిపించింది...చదివి చూడండి)

"నేను చూసిన అన్ని కాలెజీల కన్నా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ బాగుంతుంది. ఇక్కడ చేరడం, ఇక్కడ తెలుగు కోర్సులు, భారతీయ సాహిత్యం, సినిమా కోర్సులు కూడా వుండడం నిజంగా నా అద్రుష్టం...మీకు ఉత్తరం రాయటానికి ఒక బలమయిన కారణం వుంది. మీకు చెప్పినట్టు నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదవడం లేదు. ఫిల్మ్ స్టడీస్ చేస్తున్నాను. నాకు కళలంటే ప్రాణం. ఇంజనీర్ అయితే, జీవితాన్ని తిరగేసి చూస్తే బాధ తప్ప ఏమీ మిగలదు అనుకుంటున్నా. అందుకే నా మేజర్లు మార్చాను. నేను మంచి సాహిత్యం చదువుతున్నాను. మంచి సినిమాలు ఎలా తీయాలో, వాటికి స్క్రిప్టు ఎలా రాయాలో నేర్చుకుంటున్నాను...నన్ను మీరు అర్థం చేసుకుంటారని నా ఆశ. కాని, ఏ రంగంలో వున్నా నేను మీకు మంచి పేరు తెచ్చి పెట్టగలనన్న నమ్మకం నాకు వుంది. ఆ నమ్మకం నాకు ఇక్కడి అధ్యాపకులు ఇస్తున్నారు...ఇక్కడి నా తోటి విద్యార్థులు ఇస్తున్నారు...చదువు అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు అని గట్టిగా నమ్ముతున్నా..."
Category: 8 comments

వెలి వాడలో...




చూస్తూ వుండు

ఏదో వొక ఎదురు చూపు
కళ్ళలో వరద గూడెయ్యనీ.


దిగులు
పడీ పడీ అలసిపోయాను ఇంక.

రాలిపోలేదులే,
దిక్కుల అంచు మీద నెల వంక.


చూస్తూనే
వుండు
ఎదురుగా
ఆకాశం ఎదురుపడే దాక.


అంతు లేని సంధ్యలో అయినా,
చంద్రుడిని వెలి వేసే చీకట్లోనయినా.

*
Category: 5 comments

ఆస్టిన్ లో ఇక శాశ్వత కోర్సుగా తెలుగు

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో తెలుగు ఇక శాశ్వత కోర్సుగా రూపు దిద్దుకుంటున్నది.
వివరాలకు చూడండి: ఈనాడు
Category: 9 comments

అతని పాట వెనక వొక తూనీగనై...!




భాషని వాయిద్యాల సమాధిలో కప్పెయ్యకుండా
అక్షరాల్ని అక్షరాలుగా
పదాల్ని పదాలుగా
పదాల్ని భావాలుగా
భావాన్ని అనుభూతిగా
చెవుల్లోకీ, గుండెల్లోకి వొంపిన వాడా
గజల్ నిదానపు నడకల్ని
మృదువయిన దాని పరిమళాన్ని
అందంగా మా దాకా తెచ్చిన వాడా...
నీ పాట నా లోపలే వుంది,
మృత్యువుకి చిక్కకుండా...


వెంటనే ఈ నాలుగు ముక్కలూ రాశాను కానీ, జగజిత్ మరణం వల్ల నాలోపలి ముసురుని నేను సరిగ్గా భాషలోకి బట్వాడా చెయ్యలేకపోయానన్నది నిజం.

విపరీతమయిన కోర్సు పని,బాకీ పడిన అనేక రచనల కంచెలో, కాన్ఫెరెన్సుల తిరుగుళ్లలో కొన్ని రోజులుగా ముఖ పుస్తకానికీ, బ్లాగ్లోకానికీ దూరంగా వున్నా. ఏదో వొక స్వయం నిర్మిత ద్వీపంలో వొంటరిగా బతుకుతున్న భావన.

ఇవాళ పొద్దున జగజిత్ మరణం ఆ నిశ్శబ్దం మీద నిప్పు కణిక అయ్యింది. ఏకాకి ద్వీపంలో వొక సెగ. వొంటి మీది నించి వొక జ్వర ప్రకంపన.

అతని వెంట నా కొన్ని జ్నాపకాల తూనీగలు దిగులు దిగులుగా నడిచి వెళ్లిపోయాయి. నిజానికి నన్ను ఈ సుతి మెత్తని స్వరంలోకి, అనిర్వచనీయమయిన దుఖ్ఖపు తీగలోకి నెమ్మదిగా ప్రవహించేట్టు చేసిన కవి నిదా ఫాజ్లి.

కవికీ గాయకుడికీ వొక ఆత్మ బంధుత్వమే వుంటుంది. ఫాజ్లి జగజిత్ కోసం రాశాడో, జగజిత్ ఫాజ్లి కోసం పాడాడో నాకు ఇప్పటికీ తెలియదు. ఫాజ్లి కవిత్వంలోని దిగులు జీర కోసమే జగజిత్ గొంతు పుట్టిందని అనిపిస్తుంది చాలా సార్లు.

అసలే ఘజల్ వొక మాయామోహం!

వొక్క సారి ఆ మాయామోహంలోకి అడుగు పెట్టాక వెనకడుగు లేదు. ఇక ఆ ప్రపంచంలో నిదా ఫాజ్లి అనే కవిని కలిశాక ఆ స్నేహ మోహం వూపిరాడనివ్వదు.నిద్రలోనూ అతని పంక్తులు, వాటిని స్వరానువాదం చేసిన జగజిత్ ఆలాపన వెంటాడతాయి.

విషాదాన్ని ఎంత అందంగా చెక్కుతాడో ఈ కవి, ఆ విషాదంలోని శిల్పాన్ని అంత అందంగా, అంత స్వాంతనగా మనసు చెవిలోకి వొంపుతాడు జగజిత్.

ఇవాళ జగజిత్ నిష్క్రమణతో నా లోపలి ఆ వొక్క జీవన రాగమూ తెగిపోయినట్టనిపించింది.

నిదా ఫాజ్లి మాటల్లోనే జగజిత్ కి నా అల్విదా...

వొకే విషాదం

సమాధి ఎవరిదయితేనేం?
చేతులు మోడ్చి
ఎవరి కోసం ఫతేహా చదివితేనేం?!

విడివిడిగా ఇక్కడ ఫతేహాలు చదువుతున్నాం కానీ,
ఏ సమాధిలో అయినా
వొక విషాదమే కదా, అలా కునుకు తీస్తోంది!
- ఏ తల్లి కన్నబిడ్డో,
ఏ అన్న ముద్దుల చెల్లెలో,
ఏ ప్రేయసి సగం దేహమో.

ఏదో వొక సమాధి మీద
ఫాతెహా చదివి వెళ్ళి పో..ఈ పూటకి!
*
Category: 4 comments

ఒక ‘పూర్వ నావికుడి’ ఆధునిక ప్రయాణం!




“నేనొక ancient mariner ని”
అన్నారు నండూరి వొక రోజు రాత్రి పురాణం గారి ఇంటి మేడ మీద ‘సాక్షి’ క్లబ్ సమావేశం తరవాత ఇద్దరం బెజవాడ బందరు రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు.
తనకి ఎంతో ఇష్టమయిన ఆంగ్ల కవి కొల్రీడ్జ్ పద్యం Ancient Mariner లోని కొన్ని పాదాల్ని ఆయన ఆ రాత్రి అలా అప్పజెప్పేయడం ఈ పూటకీ వొక తాజా పరిమళం లాంటి జ్నాపకం.
With throats unslaked, with black lips baked,
We could nor laugh nor wail;
Through utter drought all dumb we stood!
ఆ పద్య పాదాలు ఆయన వొణికే స్వరంలో కొత్త మెరుపు తీగలవ్వడం గుర్తుకొస్తోంది. ఆ పద్యాన్ని అంతా తెలుగు చెయ్యమని ఆయన చాలా సార్లు అడిగేవారు, నాకు కూడా కొల్రీడ్జ్ అంటే వెర్రి ప్రేమ అని తెలిసినప్పుడు- కానీ, ఈ పద్యం చదివినప్పుడల్లా నాకు నండూరి నిండు జీవన యాత్ర భిన్న సందర్భాల్లోంచి భిన్న స్వరాలతో వినిపిస్తుంది. నండూరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన కొన్ని తలుపులు ఈ పద్యంలోంచి తెరుచుకుంటాయి. ఆయన ఈ పద్యాన్ని వూరికే ఇష్టపడలేదని, ఇందులో ఆయనలోని కవీ, తాత్వికుడూ, రచయితా ముప్పేటగా కలిసి వున్నారని ఆయన ఎనిమిది పదుల నిర్విరామ జీవన యాత్రని తలచుకుంటే అర్ధమవుతుంది. కొల్రీడ్జ్ రాసిన ఈ పద్యం ఆధునికతకి మొదటి సంకేతమని ఆంగ్ల సాహిత్య విమర్శకులు అంటారు, కానీ- అంత కంటే ఎక్కువగా అది కొల్రీడ్జ్ కవిలోని ఉద్వేగ పూరితమయిన వ్యక్తిత్వం, దాన్ని నిరంతరం నియంత్రిస్తూ వుండే అతని పురా- ఆధునిక తాత్వికతల అంతస్సంఘర్షణల ఆత్మకథనం.
ఈ పద్యం నాకు వినిపించినప్పుడు కూడా నండూరి ఆ అంతస్సంఘర్షణల ఆత్మకథనాన్ని చెప్తున్నారని అనిపించింది. నండూరికి ఎలియట్ చెప్పే objective correlative అంటే చాలా ఇష్టం. అంటే, వొక విషయాన్ని చెప్పడానికి బయటి సాధనాల్ని వాడుకోవడం! నండూరికి ఇది సాహిత్యంలోంచి వ్యక్తిత్వంలోకి ప్రవహించింది. చాలా సందర్భాల్లో నండూరి తన వ్యక్తిత్వంలోని లోపలి వొత్తిడిని చెప్పడానికి కొన్ని సాహిత్య/ సంగీత సాధనాలని వెతుక్కోవడం నాకు ప్రత్యక్ష అనుభవం. ఈ సందర్భంలో పైన చెప్పిన కొల్రిడ్జ్ కవిత దీనికి వొక ఉదాహరణ మాత్రమే. పందొమిదేళ్ళ వయసులో నేను ఆయన దగ్గిర ఉపసంపాదకుడిగా చేరాను. అంటే, వొక వ్యక్తిగా నాదయిన దారిని వెతుక్కునే వయసులో నేను ఆయన నీడలోకి వచ్చానని అనుకోవాలి.
తొలినాటి నించే రోజు వారీ వార్తా పత్రిక పనులతో పాటు నాకు అదనంగా సాహిత్య రచనల బాధ్యతలు అప్పజెప్పారు. ఇద్దరికీ సాహిత్యం ప్రధానమయిన మనోవ్యాపారం కాబట్టి, దీంతో ఆయనతో నా అనుబంధం మరింత బలపడింది. అప్పుడు సాహిత్య పేజీ అంటే ఆదివారం అనుబంధంలో పావు పేజీ మాత్రమే. ఆదివారం అనుబంధం మార్చాలన్న ఆలోచన అప్పుడే ఆయనకు మొదలయ్యింది. అదే అదనుగా తీసుకొని నేను కాస్త ధైర్యం కూడదీసుకొని సాహిత్యం పూర్తి పేజీ చేద్దాం అని మెత్తగా మొరాయించడం మొదలెట్టాను. “వారానికి వొక నిండు పేజీ సాహిత్యమా? అబ్బే...అంత మ్యాటర్ దొరకదు” అన్నారు ఆయన. “నేను తీసుకు రాగలను” అని చెప్పి, కొత్త శీర్షికల చిట్టా విప్పాను. “కానీ, నీకు రోజూ వుండే పనిలో ఆ పేజీకి అంత సమయం పెట్టలేవు” అన్నారు. “అది నా పని. ఒక ప్రయత్నం చేస్తాను” అనేశాను, కానీ – తీరా మొదలు పెట్టాక కానీ తెలియలేదు అది ఎంత పనో! ప్రతి శుక్రవారం నేను ఆ పేజీ కోసం సేకరించిన రచనలు ఆయన చూసే వారు. చూసిన ప్రతి సారీ ఆయనకి కొన్ని బలమయిన ఇష్టాలూ, అయిష్టాలూ వుండేవి.ఆయన స్వతహాగా చాలా మొహమాటస్తుడు. కానీ, రచనల ఎంపిక విషయం వచ్చేసరికి ఆ మొహమాటం వుండేది కాదు. ప్రతి రచనా ఇద్దరం కలిసి మళ్ళీ చదివే వాళ్ళం. ప్రతి వాక్యం పట్టి పట్టి చదివే వాళ్ళం. ఆ చదివే క్రమంలో ఆయన్ని చాలా దగ్గిరగా అర్థం చేసుకునే వీలు దొరికేది. శనివారం నేను పేజీ పెట్టి ఆయన దగ్గిరకి తీసుకువెళ్ళాక, ఆయన ముఖం వొక కొత్త కాంతితో వెలిగిపోయేది. దినపత్రిక సంపాదకత్వం అనేక బాధ్యతల భారమయిన సంకెల. కానీ, ఆ సాహిత్య పేజీ ఆ భారమయిన సంకెళ్ళనుంచి ఆయనకి బోలెడంత స్వేచ్ఛని ఇచ్చేదని ఇప్పటికీ అనిపిస్తుంది. ఆయన లోపలి మనిషి ప్రాణం ఆ సాహిత్య చిలకలో వుందని అనిపించేది. ఆయన ప్రధానంగా సాహిత్య జీవి. అంతకంటే మించి, ఆ జీవి వొక స్వేచ్చా జీవి!
ఆయన ఆలోచనలకూ, ఆయన వ్యక్తిత్వానికీ మధ్య ఎడం నాకు ఎప్పుడూ కనిపించలేదు. నా పట్ల ఆయన తొలినాళ్లలో తీసుకున్న శ్రద్ధని మరచిపోతే జీవితం నన్ను క్షమించదు. వొక రచయితగా కేవలం ప్రాచీన తెలుగు సాహిత్యం, ఇంగ్లీషు సాహిత్యం, కొద్దిపాటి మార్క్సిస్టు తత్వ శాస్త్ర పరిచయానికే పరిమితమయిపోయిన కాలంలో నాకు ఆయన సార్త్రని, ఇతర తత్వవేత్తలనీ పరిచయం చేశారు. ఆ తత్వశాస్త్ర పుస్తకాలు ఇచ్చి వారానికి ‘ఇంత చదువు’ అని షెడ్యూల్ పెట్టే వారు. చదివాక, వాటి గురించి ప్రశ్నలు అడిగే వారు. ఆఫీస్ కి వస్తే క్షణం తీరిక వుండేది కాదు ఆయనకి- కానీ, ఎన్ని పనుల్లో వున్నా రోజులో ఏదో వొక సారి నన్ను పిలిచి, నేను చదివే పుస్తకాల గురించి తప్పక అడిగే వారు. సగం ఇంటి అద్దెకీ, ఇంకో సగం భోజనానికి మాత్రమే బొటాబోటీగా సరిపోయే జీతం వచ్చే కాలంలో, కనీసం వొకట్రెండు ఇంగ్లీషు పుస్తకాలు కొనుక్కోవడానికి వీలుగా నాకు అదనపు డబ్బు వచ్చే ఏర్పాటు చేసే వారు.
అవి ఆయన ఆంధ్రజ్యోతి వారపత్రికలో “విశ్వ దర్శనం” రాస్తున్న రోజులు. మార్క్సు తరవాత ఇంకా వేరే సామాజిక/ జీవన వ్యాఖ్యానాలు చదవాలా అన్న సందిగ్ధం నన్ను పీడిస్తున్న కాలం అది. ఆయన చెప్తూ వుంటే, విశ్వదర్శనం శీర్షిక వ్యాసాలు కొన్ని సార్లు నేను రాసేవాణ్ణి. ఆ సందర్భాలలో మధ్యలో ఆయన కాసేపు విరామం తీసుకుంటూ, ఆ తత్వవేత్తల గురించి చెప్పే వారు. ముఖ్యంగా వాటి సాహిత్య మూలాలు చెప్పే వారు. ఆయన చెప్పిన వొక మాట ఎప్పుడూ నాకు గుర్తుంతుంది: “సాహిత్యం, ఫిలాసఫీ రెండూ వొక దానికి ఇంకోటి సంపూర్ణత్వాన్ని ఇస్తాయి. వొకటి లేకుండా ఇంకోటి అసంపూర్ణం. అందుకే, ఫిలాసఫీ చదువుకున్న రచయితలు, కవులు రాసే రచనలు చాలా భిన్నంగా, కొత్తగా కళకళలాడుతూ వుంటాయి.”
విశ్వదర్శనం ద్వారా ఆయన చేస్తున్న పని ఏమిటో నాకు చాలా ఆలస్యంగా బోధ పడింది. ఆయనకి బాగా నచ్చిన తాత్వికుడు సార్త్ర. ఇప్పటికీ “విశ్వ దర్శనం” వ్యాసాలన్నీ ముందు పెట్టుకుని చదివితే, సార్త్ర పట్ల ఆయన ప్రేమ తెలిసిపోతూ వుంటుంది. గ్రీక్ తత్వవేత్తలతో మొదలయిన విశ్వ దర్శనం సార్త్రతో ముగుస్తుంది. నిజానికి ఈ ముగింపు యాదృచ్ఛికం కానే కాదు. అది ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చిన ముగింపు. అదే వ్యాసంలో నండూరి సాహిత్య వ్యక్తిత్వం కూడా కనిపిస్తుంది. బహుశా, ఈ వ్యాసంలో ఇచ్చినన్ని సాహిత్య ఉదాహరణలు ఆయన ఇంకే వ్యాసంలోనూ ఇవ్వలేదు. అస్తిత్వ వాదం అర్థమయితే తత్వ శాస్త్రం చాలా మటుకు అర్థమయినట్టేనని ఆయన ఆ వ్యాసం రాసిన తరవాత నాతో వొక సారి అన్నారు. ఈ వ్యాసం కంటే ముందే, ఆయన ఈ వ్యాసంలో పేర్కొన్న రచయితలూ, రచనల గురించి ముఖ్యంగా , హామ్లేట్, ఎలియట్, రాబర్ట్ బర్న్స్, దాస్తావస్కీ, చెకోవ్, గోర్కీ ల గురించి విడివిడిగా నాతో వ్యాసాలు రాయించడం నాకు అద్భుతమయిన శిక్షణ. ఆ వ్యాసాల కోసం నేను ఆయా రచనలు చదవడం వొక ఎత్తు. చదివాక వాటి గురించి ఆయనతో మాట్లాడడం ఇంకో ఎత్తు. మరీ ముఖ్యంగా ఆంటన్ చెకోవ్ మీద ఆయన సూచన మీద నేను రాసిన వ్యాసం “ఆశా వైణికుడు ఆంటన్ చెకొవ్” మా మధ్య సాహిత్య బంధుత్వాన్ని మరింత పెంచింది. ఆ వ్యాసం చదివాక “ చెకోవ్ ఆశావాది అంటావా?” అంటూ వొక ప్రశ్న లేవనెత్తారు. “నిరాశ గురించి చెప్పడం అంటే ఆశని పునర్నిర్మించుకోవడం, నిరాశని వినిర్మించుకోవడం కాదా?!” అని అనగానే ఆ రోజుకి మంచి తాయిలం దొరికిన పసిపిల్లాడిలా ఆయన ఎంత సంబరపడ్డారో చెప్పలేను. ఆ రోజు నేను ఆయనకి గుర్తు చేసిన చెకోవ్ అన్న వాక్యం “And yet, always, every movement of the day and night my soul has been filled with such marvelous hopes and visions, I can see happiness, Amia, I can see it coming…” అంత బలమయిన వాక్యం రాసిన చెకోవ్ ని నిరాశావాది అని ఎలా అనగలం? (ఈ వాక్యం తరవాత ఆయన సార్త్ర వ్యాసంలో సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు కూడా)
సాహిత్యాన్ని భిన్నంగా చదవడం నండూరికి చాలా ఇష్టమయిన ప్రక్రియ. ఒక పుస్తకమో, కవితో చదివాక ఆయన అడిగే ప్రశ్నలు చాలా ఆసక్తిగా వుండేవి. కొన్ని ప్రశ్నలు చాలా అమాయకంగా, చిలిపిగా కూడా వుండేవి. కానీ, ఆయనలోని పఠిత నాకు ఎప్పుడూ విస్మయం కలిగించే వాడు. ఆ భిన్నమయిన పఠన పద్ధతి తత్వశాస్త్ర అధ్యయనం వల్లనే సాధ్యమయిందని ఆయనే చాలా సార్లు చెప్పే వారు. వాచకాన్ని ప్రశ్నించడం, అందులోని భిన్న స్వరాల వెతుకులాట అనేది మనకి 1990 తరవాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ధోరణి. కానీ, ఆ రోజుల్లో నండూరి ఎలియట్ కవిత్వవిమర్శ వ్యాసాలని బాగా ఇష్టపడే వారు. ఎలియట్ సాహిత్య విమర్శలో ఈ రెండు ధోరణులు బలంగా కనిపించడం వొక కారణం. అసలు ఎలియట్ కవిత్వం అంతా భిన్న స్వరాల కోరస్ అని ఆయన వొక సారి మాటల సందర్భంలో అనడం నాకు బాగా గుర్తు. పుస్తకం చదివేటప్పుడు ఆ చదవడంలో వుండే ఉద్వేగాన్ని కాపాడుకుంటూనే, ఆ పుస్తకంలోని విషయాల్ని విబేధించాలని ఆయన అనే వారు. అదే సహృదయత అనీ అనేవారు. ఆయన దగ్గిర వున్న కాలంలో చదువు వొక వ్యసనం అయ్యింది నాకు, ఎందుకంటే – కలిసిన వెంటనే ఆయన అడిగే ప్రశ్న” ఏం చదువుతున్నావ్?” అని- ఆ ప్రశ్నకి సరయిన సమాధానం ఇవ్వలేకపోతే, మా సంభాషణ అక్కడితో ఆగిపోయేది. ఆ సంబాషణ కొనసాగించాలన్న ఉత్సాహంతో నేను ఏదో వొకటి చదువుతూ వుండే వాణ్ని. కానీ, ఆయనతో వచ్చిన చిక్కేమిటంటే, “నేను టాగోర్ కవిత్వం చదువుతున్నాను,” అంటే వెంటనే ఆయన రూటు మార్చి, ‘అబ్బే, టాగోర్ వ్యాసాలు చదువు!’ అనేసేవారు. మరో సారి నేను టాగోర్ వ్యాసాలు చదువుతున్నాను అంటే,”అబ్బే, ఆయన కథలు చదువు!” అనే వారు. ఈ రకమయిన పరీక్షా విధానం వల్ల నేను పనికట్టుకుని కొన్ని పుస్తకాలు చదవాల్సి వచ్చింది.
పఠనంలో భిన్నత్వం అనేది అసలు రచనల ఎంపికతో మొదలవ్వాలన్నది ఆయన ఉద్దేశం. కృష్ణశాస్త్రి అనగానే అందరూ పోలోమని ఆయన కవిత్వం చదువుతారు, కానీ, అసలు కృష్ణ శాస్త్రి వ్యాసాల్లో వున్నాడు అనే వారు. అలాగే, వొక్కో రచయిత వొక్కో రకమయిన భిన్నమయిన ప్రక్రియలో రహస్యంగా దాక్కుంటాడు అనే వారు. శ్రీశ్రీని వచనంలో చదవాలనీ, ఎలియట్ ని విమర్శ వ్యాసాల్లో చదవాలనీ, కీట్స్ ని ఉత్తరాల్లో చదవాలనీ అలా ఆయన భిన్నమయిన దారుల్ని చూపించే వారు. ఆఫీసుకి రాగానే, రోజు వారీ రాజకీయ వ్యాసాల, వార్తల మధ్య కప్పడిపోయే ఆయన ఆత్మ ఇంత శుభ్రంగా ఎలా వుందా అని రోజూ ఆశ్చర్యపోయేవాణ్ని. ఆయన చేతుల్లో ఆ రోజు ఏ పుస్తకం వుందా అని పరీక్షగా చూసే వాణ్ని.
కవిత్వం , పాటలు అంటే ఆయనకి ప్రత్యేకమయిన ఇష్టం. ఆయన ఎక్కువగా ఫిక్షన్/ నాన్ ఫిక్షన్ చదివే వారు. కానీ, కబుర్లలో కవిత్వం, పాటల గురించి చాలా ఇష్టంగా మాట్లాడే వారు. “ఎందుకంటే నేను విఫలమయిన కవిని కనుక!’ అనే వారు. నిత్య సంభాషణల్లో, తన వ్యాసాల్లో కూడా కవిత్వ పాదాల్ని చక్కగా ఉపయోగించుకునే వారు. ఒక్కో సారి, కొన్ని పద్య పదాలు వినిపించి, అసలు దాని అర్థం ఏమిటి అని అడిగే వారు. అసలు అర్థం ఆయనకు తెలుసు, భిన్నమయిన అర్థాలు వినాలని ఆయన తపన, సరదా. సైగల్ పాటలలోని సాహిత్యం మా ఇద్దరి మధ్యా మరో వంతెన. (ఆయన సైగల్ పాటలు బాగా పాడేవారు ) ఒక సారి ఆఫీసుకి రాగానే నన్ను పిలిచి, వొక పాటలో ‘కాహె కొ రార్ మచాయీ ” అనే పాటలో , అది “కాహెకొ ” అని ఎందుకు, “క్యోం?” ఎందుకు అనలేదు అంటూ ఆయన ఆ పాట మొత్తం వినిపించారు. నిజానికి, ఆ పాట మొత్తం శిష్ట వ్యావహారికంలో వుంటుంది, ఆ వొక్క పదం మాత్రం జానపదం. ఆ వొక్క పదం సైగల్ గొంతులో మరీ అద్భుతంగా వుంటుంది. నండూరి పాడినప్పుడు అది ఆయన ‘సన్నిధాన దివ్య స్థలాన’ మరింత మధురంగా వినిపించింది నాకు.
కవిత్వం, పాటల మీద ఆ ప్రేమే ఆయన చేత మహాసంకల్పం సంకలనం వెయ్యడానికి దారి తీసిందనుకుంటా. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారితో కలిసి 1940 -1975 మధ్య వచ్చిన వచన కవిత్వం సంకలనంగా 1975 చివరలో వచ్చింది. ఈ సంకలనం కృష్ణ శాస్త్రి తో మొదలై, చెరబండ రాజు కవితతో ముగుస్తుంది. ఈ సంకలనంలోని కవితలు చదువుతున్నప్పుడూ, దీనికి నండూరి రాసిన ముందు మాట చదువుతున్నప్పుడూ అస్తిత్వ వాదం, సార్త్ర ఆలోచనా విధానం ఆయన పైన ఎంత బలమయిన ముద్ర వేసాయో ఇంకో సారి అర్థమవుతుంది. ‘సమకాలిక జీవితం పట్ల ఆధునిక దృక్పథాల సంకీర్ణతని ప్రతిబింబించడం” ఈ సంకలనం ఉద్దేశం అని ఆయన రాసిన వాక్యాలు మొత్తంగా ఆయన దృష్టి ఎక్కడ నిలిచి వుందో చెప్తాయి. నిజానికి ఈ ముందు మాటలో సార్త్ర అడుగడుగునా తారస పడ్తాడు. మొత్తంగా సార్త్ర దృష్టి ఎంతసేపటికీ మనిషి అస్తిత్వ స్థితి మీద! ఈ సంకలనంలో ఏ కవిత చదివినా ఆ ఆధునిక మానవుడి స్థితే అద్దంలో చూపించినట్టుగా కనిపిస్తుంది. కానీ, అంత కంటే ముఖ్యంగా, ఆయన 1975 ల సంక్లిష్ట సాహిత్య యుగంలో ఇంకో సంగతి కూడా గుర్తు చేస్తున్నారు. సాహిత్యాన్ని నిజంగా “సాహిత్యం చేసే” నిర్దిష్ట గుణాల మీదకి మన దృష్టి మళ్ళించడం!
“కవి ఏ రాజకీయ, తదితర సిద్ధాంతాలకు కమిట్ కారాదని, నిర్లిప్తంగా వుండాలని, కవిత్వం అన్ని రాజకీయ, తదితర విశ్వాసాలకు అతీతంగా వుండాలనే వారి వాదంతో నేను ఏకీభవించలేను. కానీ, కవితా గుణం మాత్రం తప్పకుండా రాజకీయ, తదితర సిద్ధాంతాలకు, విశ్వాసాలకు అతీతమని నా అభిప్రాయం. కవిత్వం (poetry) వేరు, కవితా గుణం (poetryness?) వేరు.” అన్నది ఆయన ప్రతిపాదన. సాహిత్యం గురించి ఆయన చివరంటా అంటిపెట్టుకున్న ప్రతిపాదన ఇదే. అంతే కాదు, సార్త్ర చెప్పినట్టు ఎంపిక స్వేచ్చ లేని అస్తిత్వానికి అర్థం లేదనీ ఆయన విశ్వసించారు. ఆ మాటకొస్తే, ఆధునికత కి అసలు అర్థం అలాంటి స్వేచ్ఛలోనే వుందనీ ఆయన నమ్మారు. అలాంటి స్వేచ్ఛ లేని ఆధునికతకి కదలిక లేదనీ ఆయన అనే వారు. ఆయనకే నచ్చిన కొల్రిడ్జ్ కవిత ఆ కదలిక లేనితనాన్ని ఇలా చెప్తుంది – ఆ రాత్రి ఆయన వినిపించిందే -
Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.

సమాజం నిత్య చలన శీలం అనుకుంటాం, కానీ కొన్ని సమయాలు స్తబ్దంగా కూడా వుంటాయి, స్టిల్ పెయింటింగ్ లో ఆ నౌకాలాగా, ఆ సముద్రంలాగా! ఒక నావికుడు వస్తాడు, ఆ స్తబ్దతని తొలగించి, దిశ మార్చడానికి!
అలాంటి వొక స్తబ్దతని తొలగించి, వొక ఆధునిక మెలకువని తెలుగు వచనంలోకి ప్రవేశపెట్టిన నవ్య తాత్వికుడు నండూరి. అది సాహిత్యంలో కావచ్చు, మానవ పరిణామక్రమాన్ని శాస్త్రీయ వెలుగులో పూసగుచ్చినట్టు అందంగా చెప్పే రచనల్లో కావచ్చు. ఆధునిక మానవ మేధ వెయ్యి పూవులుగా వికసించిన అంతర్గతయాత్రని అక్షరాల్లోకి అనువదించిన తాత్విక రచనలు కావచ్చు. నవ్య సాహిత్య ప్రపంచ వీధుల్లో చిటికెన వేలు పట్టుకుని ప్రేమగా తిప్పిన సృజనాత్మక అనుసృజన కారుడు కావచ్చు. విపరీతమయిన దినపత్రికా పనుల వొత్తిడిలో కాసింత హాయిగా వూపిరి పీల్చుకోడానికా అన్నట్టు ఆయన రాసిన సాహిత్య, సంగీత రచనల్లో కావచ్చు. అవన్నీ ఆధునిక చేతనని ఒక బలమయిన సంప్రదాయంగా నిలబెట్టే ప్రయత్నాలే. అదే ఆయన అక్షరయాత్ర అంతస్సూత్రం.
ఆయనలాంటి సంపాదకుడు మరొకరు పుట్టవచ్చు. ఆయన కంటే గొప్ప సంపాదకీయాలు రాసే వారూ పుట్టవచ్చు. కానీ, ఆయనలాంటి ఆధునిక వచన రచయిత మరొకరు పుడతారా అన్నది సందేహమే! తనని తాను వొక ancient mariner అని ఆయన పిలుచుకోవడం కేవలం వొక అస్తిత్వ అన్వేషణలో భాగమే! తెలుగులో బహుముఖీన ఆధునికతని ఆవిష్కరించిన అపూర్వ నావికుడు నండూరి.

(ఆంధ్రజ్యోతి వివిధ నుంచి - సెప్టెంబరు 11)
Category: 7 comments

నా తొలి కవిత "వయొలిన్లోకం"


మెత్తటి వేళ్ళు
తలుపు తట్టినట్టు

వయొలిన్తీగల్ని నొక్కినట్టు
నరాల్లో మౌనంగా
పారే రక్తంలో
వొక మృదువయిన కదలిక

ఆలోచన గాలిపటం
తెగిపోయిన ఆకాశంలో
కనిపించీ కనిపించనట్టు
మెలికలు తిరుగుతూ
నేలరాలే అనుభూతి

చీకట్లో ముడుచుకు పడుకున్నప్పుడు
రాత్రి గోడపై తెరుచుకునే నేత్రం
బిగుసుకుపోయిన గాల్లోంచి
కరుగుతూ వచ్చి
నిశ్శబ్దాన్ని తడుముకుంటూ
వెళ్లిపోయే సంగీతం వేళ్ళు

యుద్ధభూమిగా మారిన అరచేతులు
ఆకాశాలను పొదివిపట్టుకోవాలనుకునే
చివరి ప్రయత్నంలో
నిర్జీవంగా వేలాడి
అలసిపోయిన హృదయంపై
వాలిపోతాయి

వెక్కి వెక్కి ఏడ్వలేక

ఏ ముఖంలోనూ దాక్కో లేక...!

(ఈ కవిత మొదటి కవితా సంపుటి "రక్తస్పర్శ" లో 1986లో అచ్చయింది. కానీ, ఈ కవిత నాకు గుర్తున్నంత వరకూ నేను రాసిన మొదటి కవిత 1980లో! )
Category: 8 comments

కొందరు స్త్రీలు




కొన్ని దానిమ్మ గింజలు అటూ ఇటూ విసిరాను,
వొక్కో గింజలోంచి వొక్కో స్త్రీ.


ఆవలి కొండ మీద బతుకు దుప్పటి
నిండా కప్పుకొని వొకామె

రాత్రనకా పగలనకా కిటికీ పక్కన కూర్చొని-


ఏదో వొక తోటలోకి జారుకొని
చెదిరిన ముంగురులతో
వెనక్కి మళ్లుతూంది మరొకామె -


నేనేమో
నా దారిన వాళ్ళని వెతుక్కుంటూ -

నేనూ ఇంకో గింజనే
కాకపోతే, కాస్త ఎడంగా.

అంతే!


(మూలం: ఇంతియాజ్ ధార్కర్)




ఇంతియాజ్ ధార్కర్ బొమ్మలన్నా, కవిత్వమన్నా నాకు చాలా ఇష్టం.
ఆమె బొమ్మల్లోనూ, కవిత్వంలోనూ ఎక్కువగా కనిపించేది స్త్రీలే!
పాకిస్తాన్ లోని లాహోర్ లో పుట్టిన ఇంతియాజ్ తరవాత ముంబై వచ్చేసింది తన ప్రియుడితో.
ఇప్పుడు ముంబై, లండన్, వేల్స్ మధ్య పరిభ్రమణం ఆమె జీవనం.
బొమ్మలూ, కవిత్వమే జీవితం.
Category: 7 comments

అమ్మయ్య, నా మొదటి తెలుగు గండం గట్టెక్కింది!




"వీడికి ఇంక పొట్ట కొస్తే తెలుగక్షరమ్ముక్క రాదు!" అనుకున్నారు నా తురకంతో విసిగిపోయి మా అమ్మా నాన్న.
బట్టలు ఉతకడం అనాల్సింది బట్టలు "కడగడం" అనీ, అంట్లు కడగాల్సింది పోయి " అంట్లు ఉతకడం" అనీ అనేవాణ్ణి నా నాలుగో తరగతి దాకా! చింతకానిలో నా ఉర్దూ మీడియం చదువూ, దానికి తోడు నా వీధి బడి పంతులు వీర బాదుడూ నన్ను ఆ రోజుల్లో తెలుగు భాషకి దూరం చేశాయి. తెలుగు రాకపోతే ఎలా అని అమ్మా నాన్న దిగులు పడడం మొదలుపెట్టారు. తెలుగు వల్ల నా నాలుగో తరగతి చదువు నరకమయి పోయింది నాకు! తెలుగు రాకపోతే పర్లేదులే ఆ ఉర్దూ అరబ్బీ సరిగ్గా ఏడిస్తే చాలు అంది అమ్మమ్మ. ఇంగ్లీషు బాగా చదువుతున్నాడు, "ఇనఫ్..ఇనఫ్" అని సంబరపడిపోయాడు పెద మామయ్య. "అమ్మో, తెలుగు రాకపోతే ఎలా? నా పరువు గంగలో కలిసిపోతుంది" అనుకున్నారు నాన్న, పైకి చెప్పకపోయినా!

అప్పుడు మా అమ్మానాన్నకి వొక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది, వీడి తెలుగు ఇంటి చదువుకి ఎలాగూ బాగుపడదు అనుకున్నారు. వొక సాయంత్రం ఇద్దరూ నన్ను తీసుకువెళ్లి, శుభలక్ష్మి టీచరు ఇంట్లో పడేశారు. అప్పటికే ఆ ఇంటి వసారాలో పది పదిహేను మంది నా ఈడు పిల్లలు అమ్మ, ఆవు, ఇల్లూ, ఈగా అంటూ నానా యాగీ చేస్తున్నారు. వాళ్ళంతా నిజానికి నా ఈడు పిల్లలు కాదనీ, నేను వాళ్ళ కంటే పెద్దవాడినని, వాళ్ళు వొకటో క్లాసో, రెండో వెలగబెడ్తున్నారనీ నాకు తరవాత అర్థమయ్యింది.

శుభలక్శ్మి టీచరు నన్ను ఎగదిగా చూసి, "చూడడానికి టమాటా పండులా వున్నావ్! ఎందుకు రాదు, తెలుగు నీకు చక్కా వస్తుంది లే!" అనేసింది ఇంకేం ఆలోచించకుండా! "వీడి సంగతి నేను చూసుకుంటాలే సారూ!" అని అమ్మా నాన్నని పంపించేసింది శుభలక్ష్మి టీచరు. అంతే, నేను "ఆ అంటే అమ్మ" అని దిద్దుతూ వుంటే, నా కంటే వయసులోనూ, సైజులోనూ అన్ని విధాలా చిన్న వాళ్లయిన అరుణా, అజయ్, నాగి, అహ్మదూ, ప్రసాదూ, పద్మా కిస్సుక్కు కిస్సుక్కున నవ్వుకోవడం నాకు వినిపిస్తూనే వుంది.

కాసేపు శుభలక్ష్మి టీచరు వాళ్ళని గమనించి, వాళ్ళ పలకలు లాక్కుని 'అలీఫ్ బే తే" అని మూడక్షరాలు రాసి దిద్దమంది. (టీచరుకు ఆ మూడక్షరాలే వచ్చని నాకు తరవాత తెలిసిన సీక్రెటు!) అంతే, ఆ కిస్సుక్కు గాళ్ళంతా తలకిందులయి పోయారు. "ఇప్పుడు నువ్వు రాయరా?" అని నన్ను బోర్డు దగ్గిరకు లాక్కెళ్లింది. ఇదే అదను రచించెదను....అనుకొనేసి, బోర్డు మీద ఎడమ వైపు నించి సర్రున నాలుగు వాక్యాలు ఉర్దూలో రాసే సరికి, కిస్సుక్కు గాళ్ల మైండు బ్లాకయి, బ్లాంకయి పోయింది. కాకపోతే, వొక సమస్య ఏమిటంటే, వొక వారం రోజుల పాటు నేను తెలుగు అక్షరాలు కూడా ఎడమ వైపు నించే రాసే వాణ్ని. కుడివైపుకి రావడానికి నానా యాతనా పడాల్సి వచ్చింది.

ఈ పూట నా మూడు మొహాల చదువుని తలుచుకుంటూ వుంటే, ఆ శుభలక్ష్మి పంతులమ్మే గుర్తొస్తోంది.

"నేను కుడివైపుకి అలవాటు పడి, తెలుగు రాయగలను" అన్న ఆత్మవిశ్వాసం నాలో వెలిగించిన శుభలక్ష్మి పంతులమ్మగారిని ఈ పూట తలచుకోకపోతే, అది నన్ను నేనే మరచిపోవడం!

ఆ పంతులమ్మ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు! కానీ, ఇప్పటికీ గుండ్రంగా అందంగా వొక తెలుగక్షరం రాసినప్పుడల్లా, పోనీ టైపు కొట్టినప్పుడల్లా, ఆ అక్షరాల అందంలోంచి ఆమె అందమయిన చిరునవ్వే కనిపిస్తుంది.


అప్పుడు ఆ కిసుక్కు గ్రూపు మీద నాకు ఎంత కసి పుట్టిందంటే, ఆరోతరగతికి వచ్చే సరికి నేను మా శుభలక్ష్మిపంతులమ్మ గారికి వొక కథ రాసేసి - అవును తెలుగులోనే- చూపించాను. ఆ రోజు ఆమె కళ్ళలోని మెరుపు ఇప్పటికీ నాకు కనిపిస్తూనే వుంది.

అమ్మయ్య, నా మొదటి తెలుగు గండం గట్టెక్కింది!

ఆ తరవాత నా రెండో తెలుగు పర్వం మొదలయ్యింది ఖమ్మంలో జ్యోతి బాల మందిర్ లో!

ఆ విషయం తరవాత మాట్లాడతాను!

(ఇవాళ టీచర్స్ డే సందర్భంగా...)
Category: 10 comments

ఓ పొద్దుటి రైలు




1
వూరు మసక చీకటిలోకి
సగం కన్ను తెరచి
మూత పెట్టుకుంది ఇంకోసారి.

దూరంగా రైలు కూత
నిశ్శబ్దంలోకి గిరికీలు కొట్టింది.

2
పట్టాల పక్కన వూరు
ఎక్కడయినా ఎప్పుడయినా వొక్కటే.
దాని ప్రతి మాటా
రైలు కూతల్లో వొదిగొదిగి పోతుంది.

3
వూరు వెనక్కో ముందుకో
ముందుకో వెనక్కో
వొక పరుగులాంటి నడకతో-
ఎవరంటారులే , వూరిది నత్త నడక అని!
అది ఎప్పుడూ ఉరుకుల పరుగుల సెలయేరే నాకు.

4

అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు
అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని
రైలు పాడుకుంటూ వెళ్లిపోయింది
కూతవేటు దూరంలో.
Category: 10 comments

సగం కలలోంచి...అజంతా!

".....బెంజిమన్ మాస్టరు మాదిరిగానే అజంతా గారు కూడా తన యంత్ర నగరి (మంత్ర నగరి కూడా!) రహస్యాలు నా కళ్ల ముందు అలా పరిచేసే వారు. బెంజిమన్ గారు తన స్టేషనులో యంత్రాలు చూపించినట్టే, అజంతా గారు కలిసినప్పుడల్లా విదేశీ కవిత్వ పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. “ఒరేయ్ అబ్బాయ్! ఇదిగో మిలాన్ కుందేరా! ఈ పుస్తకం నీదేరా!” అనే వారు. నేను ఆ పుస్తకం మైకంలో పడిపోయి కళ్ళు తేలవేసినప్పుడు, వొకటికి పది సార్లు ఆ రచయిత గురించి, అతని/ఆమె వాక్య విన్యాసం గురించి చెబ్తూ వుండిపోయినప్పుడు, అంతా విని, నిశ్శబ్దంగా నవ్వి, నోటికి నిలువుగా చూపుడు వేలు ఆడిస్తూ, “ ఒరేయ్ అబ్బాయ్! నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత మంది కవుల్నీ మహాకవుల్నీ కలిసినా, నీ పుస్తకం నీదేరా! నీ కవిత్వం నువ్వే రానిగూఢమయిన కవిత్వ గుహల్ని నా చేతి వేళ్ళతోనే తెరిపించిన వ్యక్తిత్వం – అజంతా...."

(మిగిలిన కథ ఆవకాయ లో...)
Category: 0 comments

రాజన్ తెలుపూ నలుపు కవిత్వం!


అసలు ఫోటో ఎప్పుడయినా కవిత్వం అవుతుందా? ఒక కవిత కలిగించే గాఢమయిన అనుభూతి ప్రభావాన్ని వొక ఫోటో కలిగించగలదా?

- ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు రాజన్ బాబు నలుపూ తెలుపూ ఫోటోలు చూసి తీరాలి. కెమెరా నిజంగా మూడో కన్నే అని రుజువు చేసి, ఆ మూడో కన్నుని తెలుగు పల్లెల మూల మూలలా తిప్పి, అద్భుతమయిన ఫొటోల్లో తెలుగు బతుకు వర్ణాల్ని అనువదించిన రాజన్ బాబు ఇక లేరంటే బాధగా వుంది, వొక అందమయిన ఆల్బంలోంచి కొన్ని అరుదయిన ఫోటోలు వున్నట్టుండి ఎటో మాయమయిపోయినట్టుగా వుంది. జీవితంలోని కాసింత అందాన్ని వొడిసిపట్టుకుంటున్న వ్యక్తిని పట్టుకెళ్లిపోయిన మృత్యువు మీద చెడ్డ కసిగా వుంది.

ప్రపంచం అనేది కేవలం నలుపూ తెలుపుగా వుండదని, అది అనేక వర్ణాల మయం అని సిద్ధాంత స్థాయిలో విశ్వసించే నాకు, తెలుపు నలుపు అంటే అపరిమితమయిన ప్రేమ పుట్టించిన ఛాయాచిత్రకారుడు రాజన్ బాబు. ఖమ్మంలో నేను హైస్కూల్ లో వున్న రోజుల్లో రాజన్ బాబు తెలుపు నలుపు ఫోటోలు ప్రతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోనూ కనిపించేవి. రాజన్ బాబు తీసిన ఫోటో పత్రికలో పడిన ఆదివారం పూట ఆ రోజంతా నేనూ, నా మనోనేత్రం ఆ చిత్రం చుట్టూ ఈగలా తిరిగేవి. వొక వారం పాటు ఆ ఫోటో నా మనోనేత్రం లో నిలిచిపోయేది.

అదే సమయంలో నేను వచన కవిత్వంలోకి అనువాదమయ్యే ప్రయత్నంలో వున్నా. నా తొలినాళ్ళ కవిత్వం నిండా కొత్త రకం పదచిత్రాలు, పల్లె ప్రతీకలూ కనిపిస్తున్నాయని తరవాత తీరిగ్గా ఆలోచిస్తున్నప్పుడు అర్ధమయ్యేది. నా పల్లె బతుకు నాదే. అందులో అనుమానం అణువంత కూడా లేదు. కానీ, వొక అనుభవాన్ని తట్టిలేపడానికి ఏదో వొక తక్షణ ప్రేరకం పనిచేస్తుంది. అది ఆ కాలంలో నాకు సినిమా రూపంలో సత్యజిత్ రే "పథేర్ పాంచాలి", చిత్రాల రూపంలో దామెర్ల రామారావు, ఛాయాచిత్రాల రూపంలో రాజన్ బాబు! ఇప్పుడు ఆ ముగ్గురూ లేరు! కానీ, ఆ ముగ్గురూ నాలోపల ఎప్పటికీ వుంటారు! నా అక్షరాల నీడల కింద వాళ్ళ వెలుగులు ఎప్పుడూ వుంటాయి.

ఇప్పుడే నేను నా ముఖపుస్తకంలో రాసుకున్నాను -

Rajan Babu, one of the great photographers from Andhra is no more! Rajan's black and white pictures haunt me forever. He taught me to see many colors in a black and white photo. He taught me to see any ordinary aspect of life from an extraordinary angle. His camera is a real third eye and his vision has no death! We all miss you Rajan Babu..


రాజన్ బాబు గురించి నా కంటే బాగా ఆత్మీయంగా, వివరంగా చెప్పగలిగిన వ్యక్తి కవీ, రచయిత ఫణికుమార్ గారు. ఫణి కుమార్ గారి క్లాసిక్ 'గోదావరి గాథలు' ముఖచిత్రం వొక సారి చూడండి. అది ఫణి కుమార్ గారు తీసిన ఫోటో కానీ, ఆ ఫోటో మీద రాజన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

ఫణి కుమార్ గారు రాసిన నివాళి, మా మిత్రుల కోసం ఇదిగో ఇక్కడ...



ఆప్తుడూ, గురువూ
- ఫణికుమార్

రాజన్‌బాబు పోయారంటే నమ్మలేకపోవడానికేముంది? డెబ్భై మూడేళ్ల మనిషి, అనారోగ్యంతో కొన్నేళ్లుగా బాధపడుతున్న మనిషి ఆసుపత్రిలో రెండు వారాలుగా వెంటిలేటరు గొట్టాల పాశాలపై బంధింపబడిన మనిషి వెళ్లిపోయారంటే నమ్మకుండా పోవటానికేముంది? ఆయనలాంటి కళాకారుడూ, ఆప్తుడూ, గురువూ మళ్లీ పుడతాడంటే నమ్మలేం గానీ, ఆయన పోవడంలో నమ్మశక్యం కాని విషయమేముంది!

కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎక్కడ? హైదరాబాద్‌లో నిజాం నవాబు నీరాజనాలందుకున్న ఛాయాచిత్రకారుడు రాజాత్రయంబక రాజ్‌బహదూర్‌గారి సాహచర్యమెక్కడ? పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన వాడు హఠాత్తుగా ఫోటోగ్రాఫర్ కావాలనుకోవడమేమిటి, ఆ కళలో ప్రపంచఖ్యాతి పొందడమేమిటి? ఆల్‌ఫ్రిడ్ స్టీగ్లిడ్జ్‌లాగా చిత్రకళపై యుద్ధాన్ని ప్రకటించి ఫోటోగ్రఫీ వేర్పాటువాదాన్ని ప్రతిపాదించడమేమిటి? ఈ విచిత్రాలన్నీ రాజన్‌బాబు గారి జీవితంలో జరిగినవే.

గీతలు పడ్డ చెత్తనెగిటివ్ నుంచీ పురస్కారాలందుకునీ కళాఖండాల్ని సృష్టించాలనే రాజా సాబ్ ఆదేశాన్ని శిరసావహించి, అలాంటి నెగెటివుల నుంచీ ఫెలో ఆఫ్ రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ, అఊఐఅ్క ఫెలో (ఫ్రాన్స్)గా ఎన్నికయ్యాడు కాలేజీ గుమ్మం కూడా ఎక్కని రాజన్‌బాబు. కాలేజీ డిగ్రీ వుంటే ఒూఖ్ఖీ ఫోటోగ్రఫీ శాఖకు అధిపతి అయ్యేవాడు, ప్రిన్సిపాల్ అయ్యేవాడు. బహుశ వైస్‌ఛాన్స్‌లర్ అయ్యేవాడు. కానీ యింత మంచి ఛాయాచిత్రాలు యిన్ని తీసివుండేవాడు కాదు. రాష్ట్రమంతటా యింత మంది శిష్యులను తీర్చిదిద్ది వుండేవాడు కాదు.

ఏమీ చదవని రాజన్‌బాబుకు తెలిసినంత కెమిస్ట్రీ మరెవరికీ తెలియదు. ముందు కాంతి లక్షణాన్ని అర్ధం చేసుకో అని చెప్పాడొకసారి నాకు. ఫిల్ము డెవలప్ చేయడానికి నేను కొడాక్‌వారి మైక్రోడాల్-ఎక్స్ వాడడాన్ని తప్పుపట్టాడు. ఎవరి డెవలపర్ వారే తయారు చేసుకోవాలి. నలుపు తెలుపుల తేడాను మరీ కొట్టొచ్చినట్టు చూపించే హ్రైడోక్వినాన్ అనే రసాయనం డెవలపర్‌లో వుంటుంది. సూర్యరశ్మిలేని పాశ్చాత్యదేశాల వారికది అవసరం కానీ మనక్కాదు, మనకు కేవలం మెటాల్ చాలు అనేవాడు. హైడ్రోక్వినాన్ ముట్టుకోకుండా రాజన్‌బాబు, ఆయన శిష్యులూ అద్భుత కళా ఖండాలను సృష్టించారు. మరి ఆయన చదువుకోలేదు అనుకోవాలా? "చదువులలో సారమెల్ల'' ఆయనకు తెలుసు ఫోటోగ్రఫీకి సంబంధించినంతవరకూ.

రెండు దశాబ్దాల క్రింద కలర్ ఫిలింను కడిగి గంటలో ప్రింట్లు యిచ్చే లేబోరేటరీలు, 'హాడ్‌షాడ్' కెమెరాలు బహుళంగా వుపయోగంలోకి వచ్చినప్పుడు వీణ, సితార్ లాంటి ఘనవాయిద్యాలపై సింథసైజ్‌ర్ దాడిచేసినట్టు బాధపడ్డాడు. స్కాప్‌షాడోకీ ఫోటోకి తేడా తెలియని రసికులు ఫోటోగ్రఫీ కళనే నిర్మూలిస్తారని భయపడ్డాడు. ఇంతలో డిజిటల్ యుగం వచ్చింది.

ఏ కెమెరాతో ఏ దృశ్యాన్నైనా తీసి 'ఫోటోషాప్'లో లేని హంగులు కల్పించి అందరూ రఘురామ్‌లూ, రాజన్‌బాబులూ అవ్వొచ్చు. కళలలో దారిద్య్రరేఖ దిగువన వున్న వాళ్లని పథకాల ద్వారా పైకి తేవడం కుదరదు. ఆ పని ఫోటోషాప్ కూడా చేయలేదు. కళలలో రాచరికముంటుంది. ఒక సింహాసనం వుంటుంది. కిరీటాన్ని తన ఖడ్గంతో తీసుకుని శిరస్సుపై వుంచుకునే పొగరుమోత్తనం వుంటుంది. ఆ లక్షణాలు ఉన్నవారు డిజిటల్ యుగం కల్పించే సమానత్వ భ్రమను సహించరు. అలాంటి యుగంలో జీవించడం కంటే తప్పుకోవడమే నయమను కుంటారు, మా గురువు గారు రాజన్‌బాబు గారిలాగా.

- ఫణికుమార్


(ఆంధ్రజ్యోతి నుంచి)
Category: 8 comments

నా పంద్రాగస్టులన్నీ...




జీవచ్చవానికి ఆత్మ వుంటుందో లేదో తెలీదు
ఎప్పుడూ వొక స్మశాన వాటిక
నన్నంటి పెట్టుకునే యెందుకుంటుందో తెలీదు
భుజాలు మారుతున్న కాల పేటికలో
మృతశరీరంలో కదులుతున్న కొస ప్రాణం
నా చరిత్రంతా.

నా పాఠాల వెనక
రేపటికి తవ్విన సమాధుల్ని
నిన్నటి నా పసికళ్లెపుడూ మరచిపోవు
బట్టీయం పడ్తున్న పద్యాల పంక్తుల మధ్యలో
పంతులు గారి బెత్తం విరుగుతూనే వుంటుంది
సంస్కృత శబ్ద మంజరి ఖంగున మోగుతున్నంత సేపూ
నాలోని భాష నిశ్శబ్దమయి రోదిస్తూనే వుంటుంది.
ఎప్పుడూ లెక్కతప్పే నాకు
చరిత్రలో మాత్రం నిరంతర జయకేతనం
ఎంత విషాదం!
ఏ చరిత్రా లేని నాకు
చరిత్ర పాఠం ఒక్కటే భలే ఇష్టం!
నాకు మతం లేదు
కులం లేదు
జాతి లేదు
జాతీయం అంతకన్నా లేదు
గతం లేదు
వర్తమానం లేదు
భవిష్యత్తు అంతకన్నా లేదు
అయినా
నా చరిత్ర పాఠాలు
నేను మరచిపోలేని పాత పద్యాలు...
2
బడి వెనక ఖబరస్తాన్
సమాధి వొళ్ళో ఆకుపచ్చ జెండా
జెండా చివర్లలో జరీ మెరుపు
ఓ వెంటాడే కల....ఎప్పుడూ!

సమాధుల మధ్య నిశ్శబ్దంలో
మొలిచిన తంగేడు పూల పరిమళ రాహిత్యం
తెంపిన తులసి ఆకులూ
రేగు ముల్లూ నాలిక ఎరుపెరుపు
విరిగిన కిటికీ రెక్క టపటప బాదుకుంటున్నప్పుడల్లా
లోపలి చెవి మీద సమాధులు నడిచొచ్చేవి
చరిత్ర వొక్కటేనా? కాదు, కాదు....
ఆ సమాధి కూడా
చెక్కుచెదరని పద్య జ్నాపకమే నాకు....
3
కాళ్ళ కింద నేల వుందో లేదో తెలీదు
ఎప్పుడూ వొక గాలి కెరటం
నన్ను చుట్టుముట్టే ఎందుకుంటుందో తెలీదు
నేనొఠ్టి శరీరాన్నయి ఇక్కడ సంచరిస్తున్నానని
అందరికీ అనుమానం...
తెగి ఎటో పడిపోయిన
ఖండిత దేహాన్నని అందరికీ గట్టి నమ్మకం.
4
గొంతులోనే విరిగిపోయిన పద్యపాదాల మీద
ఎప్పుడూ
మోగే బెత్తానికి నా చరిత్ర తెలుసు.
నా కాలం తెలుసు
నేను తెలుసు
ఈ పద్యంలో
చివరి పాదం వొట్టి కొయ్య కాలేననీ తెలుసు.
వందేమాతరంలో నా తరం లేదు
జనగణమణలో నా జనం లేరు
కంఠ నాళాలు తెగిపోయాయి
నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు.
నా పంద్రాగస్టులన్నీ
స్మశాన వాటికలోనే...!

25 ఆగస్టు 1998. (“వలస” నుంచి)
Category: 3 comments

నీ అడుగులు తలుపు దగ్గిర




మూతపడిన ఆ తలుపు దగ్గిరకే వెళ్తున్నాను మళ్ళీ మళ్ళీ.

ఆ అగాధమయిన నిద్రలోంచి నువ్వు వొస్తావనీ,

తలుపు తీసి నవ్వుతావనీ పోనీ కోపంగా తిట్టిపోస్తావనీ.


వొక్క సారి దుఖంలోకి వొరిగిపోయానా అంతే
నేను వొక దిగులు దిగుడుబావిలోకి
జారుకుంటూ వెళ్లిపోతాను,

తలుపు దగ్గిర చెవులూ కళ్ళూ కాపలా పెట్టి.

2

ఊహూ...ఎవరూ రారు
అసలేవరూ అలా రాలేదు
ఎవరూ లేరు
అసలీ నిశ్శబ్దపు అంతిమ వీధిలో ఇంకెవరూ మలుపు తిరగరు

నువ్వు నేనూ పిచ్చి మొహాలేసుకుని,
అలసిపోయిన వడలిపోయిన దేహాలేసుకుని,
రాలిపోని ఎదురు చూపుల మాలలు గుచ్చుకుంటూ

రికామీ గాలికి శూన్యపు ముద్దులు ఇచ్చుకుంటూ

ఎలాగోలా వస్తూనే వుంటాం ఈ వీధి చివరకి.

ఈ చివరి వీధికి.

3

వస్తావయ్యా రామయ్యా
అంటూ ఆ వెర్రిబాగుల పాటగాడు అప్పటి నించీ
ఆ పాటని అట్లా మోసుకు తిరుగుతూనే వున్నాడు.


రామయ్య రాలేదు రాడు

4

అన్నీ అన్నీ మూతపడిన తలుపులే ఎదురవుతున్నాయి

వొక్క పెదవీ విచ్చుకోని అసుర సంధ్యలో.

5

ఈ పూట కూడా నువ్వలాగే

పెదిమ కింద తొక్కిపెట్టిన పకపక నవ్వుల ఉప్పెనలా

వెళ్లిపో నిశ్శబ్దంలోకి
వీధి చివరి కొండంత మౌనంలోకి.

Category: 14 comments

ఒక 0% లవ్ స్టోరీ

(ఈ వ్యాసం ఈ నెల "పాలపిట్ట'లో నా శీర్షిక 'కాలి బాట" నుంచి)





కొన్ని సార్లు కవిత్వమూ, కథా, నవలా లేదా వొక గొప్ప తాత్విక గ్రంథమూ చేయలేని పని వొక సినిమా చేస్తుందని అనిపిస్తుంది. అయితే, పాఠకుడికీ, వీక్షకుడికీ అవగాహనలో, అనుభూతిలో తప్పక కొన్ని తేడాలున్నాయి. పఠిత ఆగి ఆగి చదవచ్చు, చూస్తున్న సినిమాని కూడా రెవైండ్ చెయ్యవచ్చు కానీ, ఆగి ఆగి చదవడంలో వున్న సౌలభ్యం రెవైండ్ చెయ్యడంలో లేదనుకుంటా. వీక్షక పాత్రలో వున్నప్పుడు మనం వొక నిరంతరాయమయిన కొనసాగింపు (కాంటిన్యూటీ)ని కోరుకుంటాం. పుస్తకం చదివేటప్పుడు ఆగి ఆగి చదవడం వల్ల ఆ కొనసాగింపు పెద్దగా కుంటుపడదు.కానీ, సినిమాకీ, సాహిత్యానికీ వొకే రకమయిన విమర్శ సాధనాలు వాడే కాలంలో ఇప్పుడు వున్నాం. ఆ దృష్టి కోణం నించే నేను ఈ మధ్య సినిమాలు చూస్తున్నాను.
ఈ నెల మాడిసన్ లో జరుగుతున్న సినిమా పండగలో భాగంగా వొక గ్రీస్ సినిమా “ఆటెన్బెర్గ్” చూశాను. ఈ సినిమా చూడడంలో వొక “స్థానిక” ఆనందం కూడా వుంది. ఈ సినిమా తీసిన రేచల్ సంగారి కొన్నాళ్లు మా టెక్సాస్ విశ్వవిద్యాలయంలో సినిమా పాఠాలు చెప్పింది. నా సాహిత్య కోర్సులలో అప్పుడప్పుడూ నేను సినిమా పాఠాలు (పథేర్ పాంచాలి, సంస్కార, ఏక్ చారాసీ కీ మా లాంటి సినిమాలు చూపించినందుకు ఇప్పటికీ మా విద్యార్థులు కలిసినప్పుడల్లా థాంక్స్ చెప్తారు) కూడా కలిపేస్తూ వుంటాను కాబట్టి, క్యాంపస్ లో జరిగే కొన్ని పండగల్లో, గోష్టి సమావేశాల్లో ఆవిడని కలిసే అదృష్టమూ దొరికింది. అసలు ఎంత పాత ఫ్రేమ్ ని అయినా మరీ కొత్తగా ఎలా చూడవచ్చో ఆమె ప్రతి వ్యాఖ్యలోనూ కనిపించేది. ఆవిడ మాటలు వింటునప్పుడు ఊహాశక్తి ఇంత దూరం వెళ్తుందా అని ఆశ్చర్యపోయే వాణ్ని. ఈ సినిమా చూశాక, “అవును, ఊహా శక్తి ఎంత దూరమయినా వెళ్తుంది!’ అని ఖాయంగా అనిపించింది. లేకపోతే, ఎక్కడో గ్రీసులో వొక పారిశ్రామిక వాడలో తీసిన/ జరిగిన ఈ సినిమా కథ తెర మీద చూస్తున్నంత సేపూ నేను ఏ గోదావరిఖనిలోనో, కొత్తగూడెం పారిశ్రామిక వాడలోనో వున్నట్టు అనుభూతి కలిగించింది సంగారి దర్శక ప్రతిభ! అన్నిటికీ మించి, ఈ సినిమా అంతా వొక పోస్ట్ మాడ్రన్ కొల్లజ్ చూస్తున్నట్టు కూడా అనిపించింది. వొక వాస్తవికతని ఇంత బాగా వ్యాఖ్యానించవచ్చా అన్న ఆశ్చర్యం ఈ సినిమా చూసిన వెంటనే కలుగుతుంది.

ప్రేమా, సెక్సూ, పొగ గొట్టాలూ, చావు

ఈ సినిమా వొక ఇరవై మూడేళ్ళ అమ్మాయి కథ. ప్రేమ అంటే ఏమిటో, సెక్స్ అంటే ఏమిటో అని వెతుక్కుంటూ వుండే అమాయకమయిన పిల్ల మరీనా. వొక పారిశ్రామిక వాడలో డ్రైవర్ గా పని చేసే ఆ అమ్మాయికి వొక తండ్రి, వొక చిన్ననాటి స్నేహితురాలు తప్ప ఇంకో లోకం తెలియదు. ఆ చిన్ననాటి స్నేహితురాలు, మరీనా మాటల్లో చెప్పాలంటే, కనిపించిన ప్రతి మగవాడితోనూ వెళ్లిపోతూ వుంటుంది. తండ్రికి ఆధునిక నాగరికత నచ్చదు. కానీ, తప్పని సరయి, ఆ పారిశ్రామిక వాడలో బతుకు! “ఈ పరిశ్రమాలూ, ఈ ఆధునికత ఇదా విప్లవం? ఏం చేశాం మనం? మన గొర్రెల్ని చంపి ఈ పొగ గొట్టాలు నిలబెట్టాం!’ అని ఎప్పుడూ కోపిస్తూ వుంటాడు. సినిమాకి నిజానికి ఆ పొగ గొట్టాలే పెద్ద సెట్టింగ్. అనారోగ్యం వల్ల తండ్రి చావుకి దగ్గిర పడడం వల్ల మరీనా వొక విధమయిన వొంటరి తనంలోకి వెళ్లిపోతుంది. స్నేహితురాలి విశృంఖల శృంగారం, తండ్రి ఆధునికతా నిరసనల మధ్య మానసికంగా నలిగిపోతుంది. ఆ దశలో ఆమెకి డేవిడ్ అటెంబరో జంతువుల మీద తీసిన టీవీ డాక్యుమెంటరీలూ, పాప్ మ్యూజిక్ కొండంత ఆసరా అవుతాయి. ఆ సంగీతాన్ని, ఆ జంతువుల్ని అనుకరించడంలో ఆమెకి వొక మానసిక ఆనందమూ, కాలక్షేపమూ దొరుకుతాయి.

ఈ లోపు వొక ఇంజనీరుతో పరిచయం అవుతుంది. ప్రేమా, సెక్సు కి సంబంధించి ఆమె తనకి వున్న అన్ని సందేహాలూ తీర్చుకోడానికి, ప్రయోగాలు చెయ్యడానికి అతనొక లాబ్ లాగా ఉపయోగ పడతాడు ఆమెకి! అదెలా సాధ్యమయ్యింది అన్నదే ఈ సినిమాలో కథ! స్త్రీ పురుషుల సంబంధాల గురించి తలెత్తుతున్న కొత్త ప్రశ్నలకి సమాధానం వెతుక్కునే ఈ తరం అమ్మాయి మరీనా. ఆధునిక జీవితం అంటే ప్రేమా సెక్సూ, నాగరికతా, పరిశ్రమలూ, కొత్త ఆర్ధిక సంబంధాలూ ఇవే అనుకుంటే, వాటి విశ్వ రూపం, వాటి అంతిమ రూపం కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి.

వొక అమ్మాయి, వొక నాన్న, వొక దేశమూ!

వొక అమ్మాయి మానసిక, శారీరక ప్రపంచాన్ని తెర మీద ఆవిష్కరించడంలో సంగారి చాలా కష్టపడిందని ఈ సినిమాలో ప్రతి ఫ్రేములోనూ అనిపిస్తుంది. ఈ సినిమా వొక అమ్మాయి కథ కాదనీ, ఇప్పుడిప్పుడే ఆర్థిక రంగంలో కొత్త విప్లవాలకి నాంది పలుకుతున్న గ్రీసు దేశపు ఆత్మ కథ అని విమర్శకులు దీన్ని వ్యాఖ్యానించారు. నిజమే, తండ్రి పాత్రతో పలికించిన సంభాషణలన్నీ వొక దేశం వొక స్థితిలోంచి ఇంకో స్తితిలోకి ప్రయాణిస్తూ తనని తాను వెతుక్కునే ప్రయత్నమే.
చివరి రోజు తనని ఆస్పత్రికి తీసుకువెళ్తున్న మరీనతో అంటాడు తండ్రి – “ ఈ ఇరవయ్యో శతాబ్దాన్ని నేను బాయ్ కాట్ చేస్తున్నా. కొత్త శతాబ్దంలోకి వెళ్తున్న నీకు యేమీ ఇవ్వలేకపోతున్నా, యెమీ నేర్పలేకపోతున్నా. “
కానీ, అన్నిటికీ మించి ప్రేమ, సెక్సు గురించి తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే సంభాషణలు ఈ చిత్రంలో చాలా విశేషంగా అనిపిస్తాయి.
“నాన్నా, నువ్వు నన్ను ఎప్పుడయినా నగ్నంగా వూహించుకున్నావా’’ అని అడుగుతుంది మరీనా తండ్రిని వొక సారి.
తండ్రి అదోలా చూస్తాడు.
“నేను వూహించుకున్నాను లే! నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఆ శిశ్నమ్ అనేది లేకపోతే నువ్వు ఇంకా బాగుండే వాడివి!”
“అలా వూహించకూడదు నువ్వు!”
“ఏం? టాబూనా?”
“అవును, కొన్ని అలా టాబూ కావడం మంచిది!”
“ఏమో, నేను అలా ఆలోచించకుండా వుండలేకపోతున్నా”
స్నేహితురాలు వొక పెద్ద ప్రశ్నార్థకం మరీనాకి. ఆ స్నేహితురాలు శిస్నాలని అనేక భంగిమల్లో వర్ణించు చెబుతూ వుంటుంది మరీనకి.
వొక రోజు మరీనా అంటుంది ఆమెతో – “నువ్వు శిస్నాలని అలా అనేక రకాలుగా వూహించుకుంటూ వుంటావ్. కానీ, నాకు వక్షోజాలంటేనే ఇష్టం. స్విమ్మింగ్ చేశాక, ఆ గదిలోకి వెళ్తే, అద్దాల ముందు నిలబడ్డ ఆడవాళ్ళవి చూడు. ఎన్ని రకాల వక్షోజాలో!”
సెక్సుకి సంబంధించి ఈ ఇద్దరి మధ్యనే కాకుండా, తండ్రితోనూ, తన ప్రియుడితోనూ మరీనా చెప్పే మాటలు వినడానికి కొంత కొత్తగా వుంటాయి. కానీ, వాస్తవంగానే ఈ తరం ఆడపిల్లలు అలా మాట్లాడున్నారేమో అనీ అనిపిస్తుంది. అది ఎంత వరకు వాస్తవం అన్నది పక్కన పెడితే, కొన్ని అసహజమయిన ప్రశ్నలు అని కూడా అనుకుంటే, ఆ సహజ/ అసహజాల మధ్య చర్చ పెట్టడమే ఈ సినిమాలో వొక కథ. జంతువుల డాక్యుమెంటరీలు చూస్తూ, ప్రతి సారీ మరీనా అవి చాలా సహజంగా బతుకుతున్నాయనీ, ఆధునిక పొగ గొట్టాల మధ్య వుక్కిరిబిక్కరవుతున్న మనిషి చివరికి తన చావు తానే రాసి పెట్టుకుంటున్నాడని వొక వ్యాఖ్యానం ఈ సినిమాలో వుంది. వొక అమ్మాయి వొంటరి ప్రేమరాహిత్యపు ప్రేలాపనల్లోంచి వినిపించడం వల్ల ఈ సినిమా చాలా మటుకు ఆ వ్యాఖ్యానానికి బలమయిన దృశ్య రూపం ఇచ్చింది. అలాగే, మనం వ్యక్తిగతం అనుకునే కథలు వొక జాతి చరిత్రనే చెబుతాయన్న అత్యాదునిక శిల్ప రహస్యమూ వుంది ఈ సినిమాలో!
*
Category: 6 comments

కాదే'మో'!


1

తలుపు తట్టి ఇగో నేనొచ్చేశాన్లే మళ్ళీ
అని గదిలోపల నవ్వుతూ కూర్చుంటుంది మరణం
ఈ పూటకి చావు వాసన లేకుండా దాటేద్దామని అనుకున్నప్పుడు -


2
ముసుగు తన్ని దుప్పటి పై మీదికి కప్పేసి
వొక ప్రశాంతతని కూడా వొంటి మీదికి లాక్కుని
నిద్రలోపలి గుహలోకి పారిపోతూ వుంటాను
చాల్చాల్లే అని విదిలించుకుని కసురుకొని నన్ను నేను,

లేదులేదులేదు
రానే రావద్దే నువ్వు నా లోపలికి అనుకుంటూ పైకే అంటూ

3

రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!

4

పగలగొట్టేయ్యాలన్నంత కోపమొచ్చేసే గడియారపు
బుడి బుడి నడక వొంటి మీద మెత్తగా
గీసుకుపోయే కత్తి

5
రాని నిద్దురని దుప్పటిలా
విసుగ్గా అవతలకి విసిరేసి
పుస్తకంలోకో సినిమాలోకో అనిద్రని ఖననం చెయ్యాలని కూర్చున్నాను.

ఊహూ,

ఆ అన్నీ లోకాలూ నన్ను విఫలం చేశాయి.


6

కాళ్ళ కింద నేల జారుతున్న అసహనంతో
గది నిండా తిరుగుతున్నప్పుడు
దూరం నించి మిత్రుడి మరణ వార్త.

7
ఆ తరవాత నేనూ చీకటీ
చీకటీ నేనూ వొకరి ముఖంలోకి
ఇంకొకరు చూస్తూ...
Category: 7 comments

ఆరుద్ర రైలు కాస్త లేటుగా అందుకున్నా...!



"చాలా ఆశ్చర్యంగా వుంటుంది. జీవితం ఎప్పుడూ వొక ప్లాట్ ఫారం లాగానో, రైలు ప్రయాణమో అనుకుంటే, కొన్ని సార్లు మనం ఎక్కాల్సిన రైళ్లు మనం చూస్తూండగానే వెళ్లిపోతాయి. వొక్కో సారి అదృష్టం బాగుంటే, మనం ఎక్కిన కోచ్ లోనే మనకి బాగా ఇష్టమయి ఎన్నాళ్లుగానో కలవాలని ఎదురుచూస్తున్న వ్యక్తిని కలవవచ్చు. కాస్త మాట్లాడుకునే అవకాశమూ దక్కవచ్చు.


ఆ రెండు రోజుల ప్రయాణాల తరవాత ఆరుద్ర అనే రైలు నేను కాస్త లేటుగా ఎక్కానని అనిపించింది. కానీ, అది జీవిత కాలం లేటు కానందుకు ఇప్పటికీ సంతోషంగా వుంటుంది."

మహాకవి ఆరుద్రతో జ్నాపకాలు చదవండి ఆవకాయలో....
Category: 0 comments

మెటమార్ఫసిస్

(సాక్షి ఇవాళ సాహిత్య పేజీలో 'మన కవిత్వం- దశ, దిశ" అనే అంశం మీద కొందరి అభిప్రాయాలు ప్రచురించింది. అందులో నా అభిప్రాయం ఇది. మిగిలిన అభిప్రాయాల కోసం చూడండి, సాక్షి

తెలుగు సమాజం అనూహ్యమైన మార్పుల ఉద్రిక్తతలో ఉన్న ఈ సమ యంలోనే వచన కవిత్వం కొత్త రూపంలోకి వలసపోతోంది. ఈ రూపాన్ని ఎట్లా నిర్వచించగలమో ఇంకా తెలియదు. వచనం అనే పూర్వపు పదం ఇప్పుడు అవసరమే లేదు. ఇది అచ్చంగా కవిత్వమే. కొన్ని కొత్త రూప లక్షణాల గురించి మాట్లాడాల్పి వస్తే, ఈ కొత్త రూపం మాటల బరువు తగ్గించుకుంటోంది. సంభాషణల్లోని సజీవమయిన భాషని దగ్గరకు తీసుకుంటోంది. కథనాత్మక నడకని అనుసరిస్తోంది. పదచిత్రాలని పదాల్లో కాకుండా ఆలోచనల్లోకి అనువదిస్తోంది. కవిత్వం ఆవేశాత్మక రూపమని అనుకుంటాం. కాదూ, అది ఆలోచనాత్మక రూప మని కొత్త కవిత్వం చెబుతోంది. తెలంగాణ నించే వచ్చే కొత్త కవిత్వం ముఖ్యంగా ఈ దిశగా వెళుతోంది.

- అఫ్సర్
Category: 0 comments

అమెరికన్ కవిత్వంలో ఒక దక్కన్ కెరటం!




“దక్కన్” అన్న మూడక్షరాలు వినగానే కాజిం అలి హృదయం పసిపిల్లాడిలా కేరింతలు కొట్టింది, అతని హైదరాబాదీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి.

వొక ఆదివారం మధ్యాన్నం ఆస్టిన్ లోని “బార్న్స్ అండ్ నోబల్స్” పుస్తకాల షాపులో నాకు ఎంతో ఇష్టమయిన కొబ్బరి ముక్కలు తురిమిన కాఫీ తాగుతూ మొదటి సారి కాజిం అలి కవిత్వం చదివాను. ఆ కాఫీ రుచికీ, కాజిం అలి కవిత్వానికి కాస్త చుట్టరికం వుంది. కొబ్బరి ముక్కా, కాఫీ రెండూ భిన్నమయిన రుచులు. కొబ్బరి ముక్క అనగానె నాకు మా ఖమ్మంలో పెద్ద కొండ మీద కొలువైన నరసిం హ స్వామి , ఆ గుడికి కొబ్బరి ముక్కల ప్రసాదం కోసం వెళ్తూండే నా బాల్యం గుర్తొస్తాయి, కాఫీ అంటే నాకు అమెరికా. ఇక్కడికి రాక ముందు నాకు కాఫీ అలవాటు లేదు. ఈ భిన్నమయిన రుచుల కలయిక నాలుక మీద ఆడుతూండగా , కాజిం అలి కవిత్వం చదివాను.



2007 అమెరికన్ కవిత్వ సంపుటంలో మొదటి పుటలో కాజిం అలి కవిత్వం కనిపించింది. ఆ కవిత హిందూ-ముస్లిం ప్రతీకల సమాహారం. దక్కన్ ఇండియా- అమెరికన్ అనుభవాల మేలు కలయిక, అచ్చం నేను తాగే కొబ్బరి కాఫి లాగా.

కాజిం అలి హిందూ ధర్మ గ్రంధాలు శ్రద్ధగా చదువుకున్నాడు, పుట్టి పెరిగిన దక్కను ఇస్లాం వాతావరణం అతని జీవితంలో విడదీయలేని భాగం. రోజూ యోగాతో మొదలయ్యే ఇతని దినచర్య కవిత్వ పాఠాలతో కొనసాగి, కవిత్వ రచనతో ముగుస్తుంది. సూఫీ తాత్వికత తన జీవితాన్ని నడిపించే సూత్రం అని నమ్ముతాడు కాజిం. అతని కుటుంబ చరిత్ర వొక విధంగా దక్షిణ భారత ఇస్లాం చరిత్ర. వెల్లూరు నించి అతని కుటుంబ ప్రస్థానం మొదలయ్యింది. కాజిం బాల్యం హైదరబాద్ పాత బస్తీలో గడిచింది. తన కవిత్వంలో కనిపించే మత ప్రతీకల్లో ఆ హైదరాబాదీ బాల్యపు పునాదులు వుంటాయంటాడు కాజిం. కాజిం ఇప్పటి దాకా రెండు కవిత్వ పుస్తకాలు అచ్చులో చూసుకున్నాడు: వొకటి, “ఫార్ మాస్క్” (దూరపు మసీదు), రెండు: “ఫార్టియత్ డె” (నలభయ్యొ రోజు).

అమెరికాలోని వొక ప్రసిద్ధ కాలేజిలో కవిత్వ పాఠాలు చెప్పే కాజిం అలికి కొంచెం తెలుగు వచ్చు. “తెలుగులో కవిత్వం బాగుందని విన్నాను. యేనాడయినా ఆ కవిత్వం చదవాలని అనుకుంటున్నా” అంటాడు కాజిం.

గ్యాలరి

వొక ఎడారి దాకా వచ్చావు నువ్వు
వొక్క అక్షరమ్ముక్కా లేకుండా
దెయ్యం పట్టినట్టు
ఆకలితొ మాడిపోడానికేగా?

వయొలిన్ మీద సూర్యుడి చెయ్యి
అనంతమయిన దిగంతాన్ని చెక్కుతూ వుంది.

కౌపీన వస్త్రాలు ఎకరాల కొద్దీ
నీలి ధూళీ దూసరితమయిన ఆకాశం నెత్తిన
యెవరో వొక అపరిచిత యువకుడు నీ పక్కన.

విలియం బ్లేక్ కి కలల చిత్రాలు గియ్యడం
నేర్పిన మనిషిలోకి తొంగి చూస్తూ.

బహుశా నువ్వు అనుకుంటూ వుంటావు:
ఆ స్పర్శకి నేను సిద్ధమే.
అతనికి దొరికిపోవడానికీ సిద్ధమే”

బహుశా అతనూ అనుకుంటూ వుంటాడు:
ఇంత మిట్ట మధ్యాన్నం
ఇలా తప్పిపోయానేమిటి?
మరీ అంతూ పంతూ లేకుండా?!”

నీకెప్పుడు తెలుస్తుందో?
ఈ రాత్రి: ఈ చప్పుళ్ళు

వూదా వెతుకులాటలు
వయొలిన్ ఆకలి కడుపు మార్మోగి పోతుంది.

నాలుగు తీగలతొ
బట్ట బయలయ్యే గాయం – సంగీతం.

వొక ఆకలి సైన్యం
రాగాలుగా వణికి పోతుంది.

ఆకలితో
మాడిపోడానికేగా కదా
వచ్చావు, ఈ ఎడారికి!
Category: 1 comments

బచ్ పనా...




ఇన్నిన్ని దుఖాల మధ్య

వొక్క సంతోషపు తునకా

లేదు, లేదనేనా ?



రాత్రి చుట్టపు చూపు కలల్లోనూ

ద్రోహాల వంచనల మోసాల కథల క్లిప్పింగ్స్.

వొక్క స్నేహరాహిత్యం మాత్రమేనా వేల వర్ణాల మాయ?!


కాసింత ప్రేమ ఎప్పుడూ తెలుపు నలుపుల నిర్మోహ చిత్రమేనా?

అప్పుడప్పుడూ
ఆ చిన్నప్పటి తలుపు తీసి
పద,
వెళ్దాం బచ్ పన్..ఆ ప్రాచీన దేశంలోకి!పూర్వ దేహంలోకి!


బచ్ పనా...ఎవరూ ఎల్ల కాలమూ అక్కడే ఆగిపోరు, నిజమే.
వెళ్లిపోవాలి ముందుకే ...అదీ నిజమే.


అట్లా అని ఎంతదూరమో వెళ్లరులే,

వొక మోహం నించి ఇంకో నిర్మోహంలోకి,

వొక లిప్త ఉత్సాహంలోంచి ఇంకో నిర్లిప్తతలోకి.


అయినా సరే, వెళ్ళి రావాలి ఆ మంత్ర నగరికి
ఇన్ని వాస్తవ స్వప్నాల నడుమ

వొక లేత గులాబీ కల - బచ్ పనాలోకి.


మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుందా,

అక్కడే ఆగిపోదామనీ, కాసేపు గడ్డకట్టిపోదామని.



ఇంకో నిజం కూడా ఇంతలోనే చెప్పనీ,

ఇంతకూ- ఆ వొక్క కల మాత్రం ఎవరి సొంతం?!
అందులో లేతదనం ఎంత కల?!
Category: 5 comments
Web Statistics