ఈ-పత్రికల చదువరులు తగ్గారా?

ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యం అనే అంశంపై చర్చలో భాగంగా ఈ-పత్రికల ధోరణుల గురించి కూడా చర్చ జరిగితే బాగుంటుందని కొందరు మిత్రులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ-పత్రికల చదువరులు తగ్గి, బ్లాగులకు ఉరవడి పెరిగిందని అంటున్నారు. ఇది ఎంత వరకు సరయింది?

ఇంతకు ముందు నేను అడిగిన మూడు ప్రశ్నలతో పాటు ఈ ప్రశ్నకి కూడా మీ సమాధానం జత చెయ్యండి.

7 comments:

Saahitya Abhimaani said...

ఇటీవలి కాలంలో ఈ-పత్రికల చదువరులు తగ్గి, బ్లాగులకు ఉరవడి పెరిగిందని అంటున్నారు. ఇది ఎంత వరకు సరయింది?

ఈ ప్రశ్నకు ముందుగా, అసలు "ఈ పత్రిక" అంటె ఏమిటి అని ఒక నిర్వచనం తీసుకు రావాలి. "ఈ పత్రిక", "బ్లాగు" కు ఏ విధంగా భిన్నమైనది? "ఈ పత్రిక" "అచ్చు పత్రిక" కు ఉన్న బేధాలేమిటి. ఒకటి ఎలెక్ట్రానిక్ తెరమీద చూడగలిగితే, మరొకటి కాయితం మీద అచ్చు చేయబడటమేనా లేక ఇంకేమైనా తేడా ఉన్నదా? నాకేతే "ఈ పత్రిక" కు "అచ్చు పత్రికకు" పెద్దగా తేడా ఏమీ లేదనే అనిపిస్తున్నది.

ఇక పై ప్రశ్నకు జవాబు చెప్పవలసివస్తే "ఈ పత్రిక" లకు పాఠకులు తగ్గి బ్లాగులనే ఎక్కువ చదువుతున్నారా? ఈ విషయం నిజమే! ఇలా జరగటానికి నా దృష్టిలో కారణాలు:

1. "ఈ పత్రికలు" ఒక మూసలో ఇమిడిపోయి వైవిధ్యం లేకపోవటం
2. బ్లాగుల్లో ఒకే బ్లాగర్ రక రకాల విషయాల మీద వ్రాయటం, అలా వ్రాసే బ్లాగర్ల సంఖ్య బాగా పెరగటం వల్ల ఎంతో వైవిధ్యం ఉండటం, బ్లాగుల ప్రాచుర్యాన్ని పెంచిందనే చెప్పాలి. ఈ కారణం వల్ల "ఈ పత్రిక" ల కన్నా బ్లాగులనే ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు.
3. బ్లాగులో ప్రచురణలకు ఒకా కాల నియమమేమీ లేదు. రాత్రి నిద్ర పట్టకపోయినా సరే ఏదో ఒకటి వ్రాసే వారున్నారు, పైగా ఆ వ్రాసినవి చదవటానికి బాగుంటున్నాయి కూడ, కాలక్షేపం బఠాణీల్లాగ. కాని ఈ సౌలబ్యం "ఈ పత్రిక" లకు లేదు. వారు నెలకొకసారో, మూణ్ణెల్లకొకసారో,ఒక కాల నియమాన్ని పాటించి సంచికలుగానే ప్రచురించటం వాటి ప్రాచుర్యాన్ని తగ్గించిందని చెప్పాలి.

"ఈ పత్రిక" లు నెలవారీగా కాకుండా ఎప్పటికప్పుడు ప్రచురణ జరుగుతూనే ఉండాలి. అంటే ఒక పాత విషయం తీసేసి, ఒక కొత్త విషయం ప్రచురణ చేస్తూపోతూ ఉండాలి. ప్రతి పేజీకి "విజిట్ మీటర్" పెట్టి అయా పుటలలో ఉన్న విషయానికి ఉన్న ప్రాచుర్యాన్ని కొలువ వచ్చు. అలా కొలుస్తూ, బాగా ప్రాచుర్యం పొందిన విషయాలు ఎక్కువ కాలం ఉంచి, తక్కువ మంది చదువుతున్న విషయాలను తొలగిస్తూ పోవచ్చు. ఈ సౌకర్యం అచ్చు పత్రికలకు లేనే లేదు.

మొత్తం మీద బ్లాగులు, ఈ పత్రికలను పక్కకు తోసేస్తున్నాయనె చెప్పాలి. మరి కొన్నాళ్ళకు అచ్చు పత్రికలకు కూడ ఈ సెగ తగలక మానదు. Just a matter of Time. ఇంటర్నెట్ మరింత ప్రాచుర్యం పొంది, బ్లాగుల్లో మరింత వ్రాసే వారు వస్తే, అచ్చు పత్రికలకు కాలం చెల్లినట్టే. ఒకరు వ్రాసినది మరొకరు చదువుకుంటూ కావలిసినంత కాలక్షేపం చెయ్యవచ్చు.

జ్యోతి said...

శివగారు చెప్పిన మాటలతో నేను కూడ ఏకీభవిస్తాను. e పత్రికలు సామాన్య (అంటే నాలాంటి) చదువరులకు అంతగా అర్ధం కావని నా అభిప్రాయం. ఈ పత్రికలకు పంపాలన్నా, అచ్చు పత్రికలకు పంపాలన్నా లేదా మన రచనలు ఈ రెండు విధములైన పత్రికలలో చూసుకోవాలన్నా అందరికీ అంత సులువు కాదు. కాని బ్లాగులు అలా కాదుగా. అది ఎవరికి వారి స్వంత పత్రిక లాంటిది. బ్లాగులను మనకిష్టమైనట్టుగా అలంకరించుకోవచ్చు. అందులో టపాల లేదా వ్యాసాల ప్రచురణకు ఎటువంటి అడ్డంకి ఉండదు. మనసులో ఒక ఆలోచన రాగానే వాటిని అక్షరాల్లో పెట్టేసి బ్లాగులో పబ్లిష్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే పత్రికల కంటే బ్లాగులే చాలా పవర్ఫుల్. ఇందులో నిర్మొహమాటమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. అందుకే రాయాలనుకునే ప్రతీవాడిని రచయితను చేస్తుంది బ్లాగు, రాసిన రచనలన్నీ ప్రచురించవు ఈ eపత్రికలు, అచ్చు పత్రికలు అది వారి తప్పు కాదు. బ్లాగుల వల్ల ఎంతో సౌలభ్యం, లాభం ఉంది. అందుకే కదా ఎంతో మంది ప్రముఖులు బ్లాగులు మొదలు పెట్టారు.. పత్రికలలో రచన చూసుకోవడం సంతోషమే కాని వాటివలన వచ్చే ఆదాయం శూన్యం లేదా అల్పం. కాని మనసుకు నచ్చినట్టుగా బ్లాగులలో రాసుకుంటే వచ్చే ఆనందం, సంతృప్తి అనల్పం.. ఇది నా స్వానుభవం మీద చెప్పిన మాట.

Anonymous said...

ఇంటర్‌నెట్‌లో తెలుగు వాడటంలో రెండు చెప్పుకోతగ్గ పరిణామాలు ఉన్నాయి. మొదటిది వెబ్ పత్రికలు. రెండవది బ్లాగులు. ఈ రెండిటి పరిణామ దశల్లో దాదాపు ఒక దశాబ్దం కాలం తేడా ఉంది. వెబ్ పత్రికలు సుమారు 90 దశాబ్దం చివరలో వచ్చాయనుకోవచ్చు. అందుకు పదేళ్ళ తరవాత వచ్చాయి బ్లాగులు. అచ్చు పత్రికల నుంచి స్వాతంత్ర్యం పొందటానికి వెబ్ పత్రికలు వచ్చాయనుకుంటే వెబ్ పత్రికల నుండి స్వాతంత్ర్యం పొందినట్టు బ్లాగులు పుట్టుక తోస్తుంది. వెబ్ పత్రికల ప్రారంభదశలో ఎదుర్కున్న కష్టాలను వివరిస్తూ కొన్ని వ్యాసాలు అంతర్‌జాలంలో ఉన్నాయి. వెబ్ పత్రికలు ఒక పరిణితి సాధించిన తరవాత వాటి సంఖ్య పెరగటం మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ పత్రికలు ప్రారంభించిన అతి కొద్ది కాలానికే మూతపడటం కూడా జరిగింది.

బ్లాగుల గురించి ముచ్చటించే ముందు వెబ్ పత్రికల విజయాలతో పాటు ఎదురు చూచిన అపజయాలు కూడా తెలుసుకోవాలి. కొత్తల్లో సరదాగా ఔత్సాహిక కుర్రకారుతో మొదలయిన కొన్ని వెబ్ పత్రికలు ప్రజాదరణ పొందాయని చెప్పక తప్పదు. కొందరు వ్యాపార దృష్టితో కొన్ని వెబ్ పత్రికలు మొదలెట్టినా చాలా పత్రికలు ఈ విషయంలో విజయం పొందలేకపోయాయి.మొత్తం మీద లాభాపేక్ష లేని పత్రికలనే జనం ఇష్టపడటం ఎక్కువైంది. కొన్ని వెబ్ పత్రికలు కొన్ని విషయాల్లో ప్రత్యేకతని చూపటానికి ప్రయత్నం చేసాయి. ఉదాహరణకి సాహిత్యం, సంగీతం, సినిమా, వంటలు మొదలైన విషయాల పై దృష్టి పెట్టి ప్రారంభించిన పత్రికలు ఎన్నో ఉన్నాయి. మరి వీటి
పెరుగుదలకు పాఠకుల ఆదరణ ముఖ్యమని వేరే చెప్పక్కరలేదు. మరి ఈ వెబ్ పత్రికలకి ఈ మధ్య జనాదరణ తగ్గుతున్న విషయం అసత్యం కాదు. అందుకు నాకు తెలిసిన కారణాలు ఇవి.

ఒక మంచి రచన పాఠకులకి ఇవ్వాలని ఒక రచయిత(త్రి)కి అచ్చు పత్రికల్లో ఎలా ప్రేరణ కలుగుతుందో అదే ప్రేరణ వెబ్ పత్రికల విషయంలో కూడా వర్తిస్తుంది. ప్రచురించబడిన రచన పారితోషకం విషయం ఇక్కడ చర్చించట్లేదు. మరి అటువంటి రచనకి ప్రేరణ ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకుల ఆదరణే కాక అతి సులభంగా అందరికీ వీలుబాటుగా దొరికే అంతర్జాలం అనే మాధ్యమం. మరి ఈ వెబ్ పత్రికలకి ఎవరు పడితే వారు రచనలు రాసి ప్రచురించుకోవచ్చా? చాలా వెబ్ పత్రికలలో ఇది సాధ్యమైనా కొన్ని పత్రికలు తమ సంపాదకత్వం నిర్వహణ పేరుతో కొందరు మంచి రచనలని పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని వెబ్ పత్రిక సంపాదకుల నిరంకుశధోరణి మంచి రచయిత(త్రు)లని పాఠకులని కూడా పోగొట్టుకున్నాయన్నది నా స్వానుభవం.

ఈ వెబ్ పత్రికల్లో బాగా కృషి చేసి ఆ పరిశ్రమ వల్ల జనించిన రచనలు తక్కువ. ఏవో పైపై అభిప్రాయాలు, లోతుగా లేని ఆలోచనలతో ఎదైనా సరే రాసి తమ పేరు ఇంటర్‌నెట్‌లో చూసుకుందాం అన్న ధోరణే ఇందుకు కారణం.

ఈ ఉపోద్ఘాతం ఇక్కడితో ముగించి అఫ్సర్ అడిగిన ప్రశ్నలకి నా జవాబులు ఇక్కడ ఇస్తున్నాను.

ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులేమిటి?

ఒక్క ముక్కలో చెప్పాలంటే భావస్వాతంత్యం. ఎవరైనా, ఏ విషయమైనా స్వేచ్చగా ప్రకటించగలిగే (కొంత వరకు) అవకాశం వచ్చింది. ఇందువల్ల గొప్ప సాహిత్య సృష్టి జరిగిందా అని ప్రశ్నిస్తే సమాధానం నిరుత్సాహాన్నే సూచిస్తుంది. కాని ఇది ఒక సంధికాలంగా మాత్రమే చూడాలి. అంటే గత 10 లేక 15 ఏళ్ళగా ఇంటర్నెట్‌లో వస్తున్న తెలుగు సాహిత్యాన్ని వందల సంవత్సరాల సాహిత్యానికి ప్రత్యామ్న్యాయంగా చూడటం కూడా ఒక తప్పే. ఆ తప్పు మనదే!

ఇదివరకు లేని ఒక కొత్త అంశం సాహిత్య రూపంగా ఇక్కడ చోటు చేసుకుంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అది ప్రవాసాంధ్రుల రచనలు. ఇందులో సాహిత్యం ఎంత ఉందో విజ్ఞులకే అనుభవం. కాని ఈ కొత్త గొంతుల రచనలను పక్కన పెట్టలేము. అలాగే, అఫ్సర్ అన్నట్టు, పాఠకుడు అంటే ఒకప్పుడు మనకున్న నిర్వచనం మారుతోంది. అంతా అంతర్‌జాలం మహిమ. రాబోయే కాలంలో ఈ మార్పులు మరింత ప్రస్ఫుటంగా మనకి కనపడే సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.

ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య బాగా పెరిగిందా?

అవును. సంఖ్యలో పెరిగింది. మరి తెలుగు సాహిత్యంలో సత్తాగల పాఠకుల సంఖ్య పెరిగిందా? బహుశా లేదనే సమాధానం చెప్పుకోవాలి. విసృతంగా తెలుగు సాహిత్యం చదివిన పాఠకుల కొరత బాగా కనపడుతోంది.40 వయస్సులోపున ఉన్న వారిలో తెలుగు సాహిత్యం, అంటే సాంప్రదాయ సాహిత్యం బాగా తెలిసిన వారు కాని, సాహిత్యాన్ని ఒక సాంప్రదాయంగా చూస్తున్నవారు కాని ఎక్కువ లేరు. అది ఇంటర్‌నెట్ రచనల్లోనూ అవి చదివినవారి అభిప్రాయ ప్రకటనల్లోనూ స్పష్టంగా తెలుస్తోంది.

ఈ-పత్రికలు, బ్లాగుల గురించి మీరేమనుకుంటున్నారు?

ఇందాకే ఈ విషయాలు కొంచెం చెప్పుకున్నాం! Public Domainలో ఉన్నవి వెబ్ పత్రికలు. ఇక్కడ అభిప్రాయాలను, అందులో తెగడ్తలు, ఎక్కువ. "నువ్వు ఏం రాస్తావో రాయి! దాన్ని చీల్చి చెండాడుతాం!" అన్న ధోరణిలో ఉన్న పాఠకులు ఇక్కడ కనపడతారు. Private Domainలో ఉన్నవి బ్లాగులు. ఇక్కడ ఎవరికి కావలసింది వారు రాసుకోవచ్చు. రచనల నాణ్యత కొంచెం తక్కువనే చెప్పాలి.

విష్ణుభొట్ల లక్ష్మన్న

మాలా కుమార్ said...

పత్రికలు చదవాలంటే కొంచము ఎక్కువ సేపు సిస్టం ముందు కూర్చోవలసి వుంటుంది . దాని బదులు పత్రిక చేత్తో పట్టుకొని , విశ్రాంతిగా చదవటము నాకు నచ్చుతుంది . అదే బ్లాగ్ లైతే , కూడలి నో , హారము నో ఓపెన్ చేసి నచ్చినవి కాసేపు చదువుకోవచ్చు . వివిధ విషయాల మీద వుంటాయి .కొత్త కొత్త విషయాలు క్లుప్తం గా తెలుసుకునే వీలు వుంటుంది . అలాగే టి. వి లో , పేపర్ లో వచ్చే వార్తలకన్న ముందే ఇక్కడ తెలిసిపోతాయి . చాలావరకు బ్లాగర్స్ కూడా బ్లాగుల ద్వారా పరిచయమై వుంటారు . వాళ్ళు ఏమిరాశారా అనే ఆశక్తి వుంటుంది . చదవగానే మన అభిప్రాయము తెలిపే అవకాశము వుంటుంది . నాలాంటి వారికి చక్కగా టైం పాస్ అవుతుంది . అలాగే నా బ్లాగ్ లో నాకు నచ్చినవి , నాకిష్టమైనట్లు రాసుకోవచ్చు . ఇలా నాకైతే బ్లాగు లే ఆసక్తిగా వుంటాయి .

Anonymous said...

ఈ-పత్రికల ధోరణులు

విష్ణుభొట్ల లక్ష్మన్న

ఇది చాలా ఆసక్తి ఐన విషయం. అంతర్‌జాలంలో తెలుగు రాయటం, చదవటం చేసే తెలుగువారికి సంబంధించిన విషయం.

నా దృష్టిలో ఇప్పిటి దాకా కొంచెం ప్రాచుర్యం పొందిన వెబ్ పత్రికలు దాదాపు ఒక 20, 25 ఉండి ఉంటాయి. వీటి మధ్య, అంటే ఈ ఈ-పత్రికల మధ్య, ఒకరిపై ఒకరికి పైకి కనపడని పోటీ ఉంది. ఈ పోటీలో ఒక భాగంగా వారి వారి ఈ-పత్రికల పాఠకుల సంఖ్యం పెంచటం, ప్రచురించబడే రచనల నాణ్యత ఎక్కువగా ఉంచటం - ఈ-పత్రికలు చేసే ప్రయత్నాలు. అది సహజమే కావచ్చు. ఒక్కో పత్రీక ఒక్కో విషయంపై దృష్టి సారించి అందుకు సంబంధించిన పాఠకులను ఆకట్టుకోటానికి చేసే ప్రయత్నాలు చదువరలకి పరిచయమే!

ఈ అంతర్యుద్ధంలో తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవ కాని, సాహిత్యంలో వస్తున్న మార్పులు కాని ఎలాంటివో పరిశీలిద్దాం!

ఈ-పత్రికల సంపాదక వర్గంలో ఎక్కువ శాతం సంపాదకత్వం అంటే ఏమిటో తెలియని వారే! అందుకు ముఖ్య కారణం వీరంతా ఔత్సాహికంగా సంపాదకత్వం బాధ్యతలని తమ నెత్తిన వేసుకున్న వారే కాని అచ్చు పత్రికల దృష్టితో చూస్తే పెద్దగా అనుభవం లేని వారే! అంతకు మించి గమనించదగ్గ విషయం ఏమిటంటే వీరికి ఇష్టమైన రంగాల్లో (సాంప్రదాయ సాహిత్యం, సంగీతం, సినిమా, కథలు, కవితలు, అనేక విషయాల పై వ్యాసాలు మొదలైనవి)ప్రత్యేక అనుభవం ఉన్నవారు కాదు. అందువల్ల అందుకు తగట్టే ఆ ఆ ఈ-పత్రికల పాఠకుల సంఖ్య, ఆ పాఠక వర్గం యొక్క విజ్ఞత ఏర్పడ్డాయి.

నిజం చెప్పాలంటే ఒక అచ్చు పత్రికని నడుపుతూ దాన్ని వృద్ధిలోకి తీసుకురావటానికి ఎంత కృషి చెయ్యాలో అలాగే ఈ-పత్రికలకి కావలసిన సేవ ఏమీ తక్కువ కాదు. ఈ సంపాదకులకి ఒక ముఖ్యమైన బాధ్యత కొత్త రచనలని, రచయితలని ప్రోత్సహించటం. ఇది అంత తేలికైన విషయం కాదు. ఎంతో సమయం, శక్తి, ఆసక్తి ఉంటేగాని ఇవి సాధ్యం కాదు. అందుకనే ఎన్నో పత్రికల్లో వారికి వచ్చిన రచనలని మార్పులు లేకుండా ప్రచురించటం జరుగుతుంది (ఒక రచన మరీ నాసి రకంగా ఉంటే తప్ప!). చాలా మంది సంపాదకుల ధోరణి ఇది - "మేం ఎక్కువ పని చెయ్యం! మీరు పంపే రచనలని బాగుంటే వేసుకుంటాం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు." ఇక ఆ ఈ-పత్రిక భవిష్యత్తు ఏమిటో ఎవరైనా తేలికగా ఊహించవచ్చు.

ఇటువంటి నేపధ్యంలో "బ్లాగులు" పుట్టుకొచ్చాయి.

మరిన్ని వివరాలతో మరోసారి.

విష్ణుభొట్ల లక్ష్మన్న

Kathi Mahesh Kumar said...

వెబ్ పత్రికలు "ప్రమాణాల" పేరుతో ప్రింట్ పత్రికల పైత్యాల్ని చూపిస్తుంటే ఖచ్చితంగా ఆదరణ తగ్గుతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. తీరు మారకపోతే ఇంతే సంగతులు :)

బ్లాగులు స్పీడ్ యుగంలో వ్యక్తిగత భావస్వేఛ్ఛకు అద్దంపట్టేవి. అవి ఎప్పటికీ ఉంటాయి. That is future.

శ్రీధర్ said...

ఈ- పత్రికలు ‘మాల్’లాంటివి అయితే, బ్లాగులు బ్రాండేడ్ దుకాణాల లాంటివి.మాల్ లలో రకరకాల ఉత్పత్తులు ఉంటాయి,కాని చాల పరిమితంగా ఉంటాయి.అదే దుకాణాలలో అయితే ఆ బ్రాండు ఉత్పత్తులు అన్నీ చినా పెద్దా కలిసి వైరైటీగా ఉంటాయి. మాల్ లలో నిర్వాహకుల ఆంక్షలు ఉంటాయి. అమ్దు వల్ల నాణ్యమైన సరకు ( కొనే వారి దృష్టిలో)లభించదు !దుకాణాలలో అలా కాదు. ఇదే కారణం వల్ల బ్లాగులు ప్రాచుర్యం లోకి వస్తున్నాయి. ఈ పత్రికలు తమ నిరంకుశ ధోరణిని సడలించుకొంటూ తమతమ విధానాలని మార్చుకుంటూ పోతే తప్ప మనుగడ సాఅగించ లేవు.

Web Statistics