అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో మ‌న‌ 'సహన ప్రతీకలు'..

ఇంటర్వ్యూ: కందుకూరి రమేష్ బాబు 


ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్- పాపులర్ ఇస్లాం అండ్ షేర్డ్ డివోషన్ ఇన్ సౌత్ ఇండియా పుస్తకం వచ్చి దాదాపు ఏడాదైంది. ఇది తప్పక చదవ వలసిన గ్రంథం. ఎందుకంటే.. మన సంస్కృతి ఎంత వైవిధ్యమైందో మనకు తెలుపుతుంది కనుక. మన ప్రత్యేకతలు మనకే తోచవు. స్థానికుడికి విహంగ వీక్షణానికి అవకాశం వుండ దు. కాస్త దూరం జరిగి చూడటానికీ వెసులుబాటూ ఉండదు. ఆ పనే ఒక పరిశోధకుడు బాగా చేయగలుగుతాడు. ఆ పరిశోధకుడు సామాజిక బాధ్యతను నిర్వచించుకున్నవాడు, ఆధ్యాత్మికశక్తిని దర్శించగలవాడూ అయితే అది దివ్యంగా మారుతుంది. అతడు మన దేశీయతలోని విశిష్టతను, భిన్నత్వాన్ని, లౌకికత్వాన్ని లోతు గా తరచి చూడగలవాడు అయితే ఒకేసారి ప్రపంచానికి భిన్నాంశాలను బలంగా చెప్పగలడు.
అదే సమయంలో తన ప్రపంచానికి కూడా చెప్పిఔను గదాఅని మెప్పించగలడు. ఇదంతా ఒక అద్భుతమైన కార్యాచరణ. ఇందులో నిమగ్నమైన వ్యక్తి పరిశోధన అంటే అది కేవలం విజ్ఞానమే కాదు, వికాసం. మరింత విశాలంగా మన మనోగవాక్షాలను తెరిచే పెద్దబడి. ఒక సహన ప్రయత్నం. అఫ్సర్ మహ్మద్ రచించిన ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ గ్రంథం అదే చేసింది.
అఫ్సర్ పాఠకులకు బాగా తెలిసినవారే. పాత్రికేయుడిగా, కవి గా, విమర్శకుడిగా మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర ఆయనది. తన నిశితమైన కలం కల్పనా సాహిత్యంలోనూ అడుగుపెట్టి వర్తమాన సమస్యలను కథలుగా మలిచి చర్చ కు పెడుతోంది. తాను తెలంగాణను వదిలి అధ్యాపకుడిగా టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్లాక ఇక్కడ తెలంగాణ ఉద్యమం జోరందుకున్న ది. సాంస్కృతిక పునరుజ్జీవనంలో పెద్ద ముందడుగు పడింది. ప్రత్యేక రాష్ట్రమూ సాకారం అయింది. ఇక్కడ మనం ఇలా ఉండ గా, అక్కడ ఆయన ప్రపంచ పౌరుడిగా మూడో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యాన్ని బలంగా వినిపించే సబాల్ట్రన్ ఐకన్ అయ్యారు. కల్లోల సంక్షోభాన్ని శక్తివంతంగా చాటే విమర్శకుడిగానూ మారా రు.
తెలుగు భాషా వికాసానికి అమెరికాలో కేంద్రం అయ్యారు. అంతర్జాతీయ మేధావుల సరసన చేరి పరిశోధకుడిగా మరింత లోతైన అధ్యయనశీలిగానూ మారారు. టెక్సాస్ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేస్తున్న అఫ్సర్ దక్షిణాసియా సాహి త్య, సంస్కృతులను బోధిస్తున్నారు. తెలుగు విభాగం అధిపతిగా నూ విశేషమైన సేవలందిస్తున్నారు. మరో పక్క గ్రంథ రచయితగా తెలంగాణ సంస్కృతిలో కీలకమైన పీరీలను ఆయన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాంశంగా మలిచారు. ఈ సందర్భంగా ఆ గ్రంథం గురించి అఫ్సర్‌తో.. కందుకూరి రమేష్ బాబు ఆత్మీయ సంభాషణ...
1. అసలు పీర్ల పండగపై పుస్తకం ఎందుకు రాయాలనిపించింది?
- నేను మొదట దళిత - ముస్లిం సాహిత్యాల మీద లోతైన విశ్లేషణతో, వర్తమాన పరిశోధనా అంశాలు కలిపి ఏదైనా రాయాలని అనుకున్నా. ముఖ్యంగా, ముస్లిం సాహిత్యం మీద దృష్టి పెట్టాలని ఆలోచన వుండేది. కానీ, తెలుగులోనే కాకుండా, వివిధ ప్రపంచ భాషల్లో వస్తున్న ముస్లిం సాహిత్యం చదువుతున్నప్పుడు కేవలం ఉపరితలం నుంచి కాకుండా సమాజం పునాదీ, అంతర్గత నిర్మాణాల్లోకి వెళ్లి ముస్లిం అస్తిత్వ చర్చ చేయాల్సిన అవసరం వుందనిఅనిపించింది. ముస్లిం ఉనికిని బాహాటంగా ఎక్కడ గమనించవచ్చు అన్న ప్రశ్నకు పీర్ల పండగలో సమాధానం దొరికింది నాకు. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరాన ఉన్న ఇరాక్‌లో కర్బలా అనే చోట జరిగిన యుద్ధగాథ మనకు ఎందుకు అంత ముఖ్యమైందో తెలుసుకోవాలన్న మౌలికమైన ఆసక్తి ఈ పుస్తక రచనకు ప్రధాన కారణం.
2. రాస్తున్నప్పుడు ఈ గ్రంథం ఇంత ముఖ్యమైంది అవుతుందని అనుకున్నారా?
-నిజానికి ఈ పుస్తకం రాసేటప్పుడు నాకు పెద్ద ఆశలేమీ లేవు. రాయాలీ అనుకుని రాశాను. అంతే! అయితే.. ఆసక్తితో మొదలైన రచన నాకే కాదు, చాలామంది ఆసక్తికి, అధ్యయనానికి ఊతమిస్తుందని తర్వాత అర్థమైంది.
3.పుస్తకానికి ఎటువంటి గుర్తింపు వచ్చిందంటారు?
-ఈ పుస్తకం రాశాక ఇది తక్షణం అచ్చులో రావాలని అమెరికాలోని నా మిత్రుల నుంచి, స్కాలర్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లాంటి ఆంతర్జాతీయ సంస్థకు ఆ రాతప్రతిని పంపినప్పుడు నాకేమాత్రం నమ్మకం లేదు. అంత పెద్ద సంస్థకు ఇంత చిన్న అంశం ఏం పడుతుందిలే అనుకున్నా. కానీ, రాత ప్రతి పంపిన నెలరోజుల్లో అక్కడి ఎడిటర్ థియో ఈ మెయిలు చేసి అభినందించారు. అంతేకాదు, ఆశ్చర్యంగా కేవలం ఆరు నెలల వ్యవధిలో వారు ఈ పుస్తకం బయటికి తీసుకువచ్చారు. అప్పుడర్థమైంది, ఎంత ముఖ్యమైన పుస్తకం పూర్తి చేశానో అని!ప్రస్తుతం ఈ పుస్తకం పాఠ్యగ్రంథంగా మారిందని విన్నాం!అవును. ఈ పుస్తకానికి దక్కిన గుర్తింపు చాలా కీలకమైంది. దాదాపు పదిహేను అమెరికన్ /యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో ఇది పాఠ్య పుస్తకమయ్యింది. ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో పీరి వేదికనెక్కిందని సగర్వంగా చెప్పవచ్చు.
4.సిద్ధాంతపరంగా మీరు ఈ గ్రంథంలో ఏం చర్చించారు?
-నేను రెండు మౌలిక భావనలు ఆశ్రయించి ఈ రచన చేశాను. local Islam/ localized Islam లేదా స్థానిక ఇస్లాం, స్థానికీకరించబడిన ఇస్లాం అనవచ్చు. వీటి మధ్య చర్చ మొదలయింది, ఆ చర్చ ఇప్పటికీ సాగుతోంది. ఆ మేరకు నాకు తృప్తిగా వుంది.ఆ గ్రంథం ఒక ముఖ్యమైన రిఫరెన్స్ బుక్‌గానూ మారిందంటున్నారు!నిజమే. పాపులర్ ఇస్లాం, షియా సంప్రదాయాలు, దక్షిణాసియ ఇస్లాం -అనే విభాగాల్లో వచ్చిన రచనల్లో ఈ పుస్తకాన్ని ప్రముఖంగా పేర్కొంటున్నారు. మరో విశేషం, ఇప్పటికీ ఈ అం శం మీద నన్ను ప్రసంగించమని అమెరికా, యూరప్ దేశాల నుం చి ఆహ్వానాలు అందుతున్నాయి.సరే, మన దగ్గరకు వస్తే.. పీర్ల పండగ తెలంగాణకు ముఖ్యమైన ప్రతీక.
5.అయితే, మీ పరిశోధనల్లో మీరు సూఫీయిజం గురించి బాగా చర్చించారంటారు? అసలు మీరు వ్యక్తం చేసిన అవగాహన ఏమిటి?
-పీర్ల పండగ తెలంగాణలో మాత్రమే కాదు, వేర్వేరు పేర్లతో ఇస్లాం చరిత్రతో సంబంధం వున్న ప్రతి చోటా వుంది. అయితే, తెలంగాణలో మనం పీర్ల పండగ అంటాం. ఇక్కడ ఇది సూఫీ సంప్రదాయాలతో కలగలిసిపోయి, ఆ సంప్రదాయ ప్రతీకలైన పీర్ల వల్ల వీటికి మరింత స్థానిక చరిత్ర తోడయింది. మరోమాటలో చెప్పాలంటే-ఇది అందరి పండగగా మారడం వెనక సూఫీ ప్రభా వం బలంగా వుంది. నా పుస్తకంలో ప్రధానమైన వాదన కూడా అదే. మొదట అది షియా సంప్రదాయంగా షురూ అయినా, తరువాత అది నడిచిన చరిత్ర సూఫీలతో కొత్త వెలుగు ప్రసరించింది. ఈ మధ్య మిత్రుడు సుమనస్పతి రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే పీర్ల పండగ గురించి చిత్రాలు షేర్ చేసుకున్నారు. అంటే, మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సంప్రదా యం ఎంత బలంగా ప్రయాణించిందో మనకు అర్థమవుతుంది.
6.తెలంగాణ సంస్కృతిలో పీర్ల పండుగ కలసిపోవడం, దాని ఆధ్యాత్మిక విశిష్టత గురించి వివరిస్తారా?
-నిజమే. తెలంగాణ సంస్కృతిలో పీర్ల పండగ కలగలిసి పోయిన విధానం గురించి ముఖ్యంగానే చెప్పుకోవాలి. కుతుబ్ షాహీల సామరస్య దృక్పథంలోంచి మన పల్లెల్లోకి ఈ పండగ ప్రవేశించినా, స్థానికంగా వున్న సాంస్కృతిక అంశాలను కలుపుకొని, పల్లెల స్వరూపాన్ని మార్చిన పండుగ ఇది. ముఖ్యంగా మన జానపద సంస్కృతికి ఒక కుదుపు ఇచ్చింది. తెలంగాణ పల్లెల్లో వున్న దీర్ఘ కథనాల సంప్రదాయం దీనికి బాగా సరిపోయింది. అలాగే, అగ్రవర్ణాల ఆసరా అక్కర్లేని ఆధ్యాత్మికతకు ఇది దారి తీసింది. పీరు సంప్రదాయం ఆ విధంగా హిందూ మతంలో వున్న కులాధిపత్యాన్ని కూడా ప్రశ్నించింది. మతం అనేది పడగ విప్పడానికి కాదని, ప్రేమని పంచడానికని రుజువు చేసింది.
7.అసలు పీర్ల పండగ దేనికి ప్రతీక?
-ప్రధానంగా ఇది హిందూ- ముస్లిం సంస్కృతుల కలయికకు ప్రతీక. అయితే, ఆధునిక సమాజానికి మూలసూత్రాలైన సమిష్టి వాదం, సామాజిక న్యాయం, సమానత్వ కాంక్షకు కూడా ఈ పీర్ల కథనాలు, సంప్రదాయాలు ప్రతీకలు. సంక్షిప్తంగా చెప్పాలంటే.. అవి మన సామాజిక సహన ప్రతీకలు.
8.సహన ప్రతీకలు అన్నారు.. వివరిస్తారా?
-ఇప్పుడున్న వాతావరణంలో ఈ మాట నొక్కి చెప్పవలసిందే. నిజంగానే పీర్లు మన సహన ప్రతీకలు. ముఖ్యంగా, తెలంగాణ, రాయలసీమ పల్లెల్లో పీర్ల కథనాల మీద ఇంకా సమగ్రమైన శోధన జరగాల్సి వుంది. ఆ కథనాల్లో జనం చెప్పుకునే భావనల అన్వేషణ కూడా విస్తారంగా జరగాలి. అయితే, దురదృష్టవశాత్తూ, ఇప్పుడు పెరిగిపోతున్న మత అసహనాల వల్ల, ముఖ్యంగా ముస్లింల పట్ల పెరుగుతున్న వివక్ష వల్ల.. ఈ పండగ ప్రాముఖ్యం తగ్గిపోతోంది. ఈ అసహనం ఎంత తీవ్రంగా వుందంటే..బహుశా ఇంకో అయిదేళ్ళ తరవాత ఈ పండగ ఎక్కడా కనిపించకపోవచ్చు కూడా! అంటే, మన సహన ప్రతీకలన్నిటినీ మనం చంపుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నామన్న మాట!
9.ఇప్పుడు మీ అన్వేషణ ఎటువైపు?
-పీర్ల పండగ పరిశోధనకు కొనసాగింపుగా అసలు పీరు సంప్రదాయానికి పునాది వేసిన సూఫీ సాహిత్యం వైపు దృష్టి పెట్టాను. లిఖిత సాహిత్యాన్నీ పరిశీలిస్తున్నాను.
10.కవి, విమర్శకుడు ఇప్పుడు సంపద్వంతమైన చింతనాపరుడిగా మారుతున్నాడని అనవచ్చునా?
-ఇదంతా స్థానికత మహత్యం. సంస్కృతి, సంప్రదాయాల ఘనత. పునరుజ్జీవనం. ప్రపంచ పౌరుడిగా వీటన్నిటీనీ ఇముడ్చుకున్న ఫలితం అంటాను నేను. అయితే ఇక్కడో మాట చెప్పాలి. అసలు తెలుగులో సూఫీ సాహిత్యం ఉందా? అని చాలామంది నన్ను ఎదురు ప్రశ్నించారు. వుందన్నదే నా వాదన. ది ఫెస్టివల్ అఫ్ పీర్స్‌లో నేను మౌఖిక కథనాలు మాత్రమే డాక్యుమెంట్ చేశాను. ఇప్పుడు లిఖిత సాహిత్యంలోకి కూడా వస్తున్నా. ఇప్పటికే కొన్ని అనువాదాలు పూర్తయ్యాయి. కథలూ, కవితల అనువాదాలు ఒక భాగం, విశ్లేషణ ఇంకో భాగం.. రెండు పుస్తకాలుగా ఇవి త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ వస్తే ఈ గ్రంథం రచించాలన్న నా మౌలికమైన ఆసక్తిలో నాకే తెలియకుండా బీజ రూపంలో ఇమిడివున్న తాత్విక చింతన నన్ను నిజంగానే సంపద్వంతమైన వ్యక్తిగా, పరిశోధకుడిగా మార్చినట్టే. అది నిజంగా చెప్పలేని తృప్తీ. ఆనందం.
Interview published in Chelime page,
Namasthe telangana.08.11.2015

1 comments:

Padmapv said...

Shukriya.Afsarji.

Web Statistics