Monday, November 24, 2025

నల్లకొండ నీడలో అనువాదాల పండగ



         అమెరికాలో ఎక్కడికైనా వెళ్ళడం వేరు, అరిజోనాలోని టూసన్ అనే నగరానికి వెళ్ళడం వేరు. మరీ తెలియని భాషలో అసలేమీ తెలియని రచయిత రాసిన పుస్తకం ఏదో చదువుతున్నట్టే అనిపించింది. ఎయిర్ పోర్టులో దిగగానే ఎంతో ఎత్తయిన బలిష్టమైన కొండ బ్రహ్మజెముడు  వృక్షాలు చూపుని కట్టిపడేస్తాయి. చుట్టూ వున్న ఎడారిని ధిక్కరించి నిలబడే ఈ వృక్షాలు వాటికవే శిల్పాల్లా కనిపించాయి. ఎయిర్ పోర్టు నుంచి అరిజోనా యూనివర్సిటీకి తీసుకెళ్లిన డ్రైవర్ అహ్మద్ కి ఈ వూరంటే మహా ఇష్టం. ఎప్పుడో ముప్ఫయేళ్ల  కిందట ఆఫ్గన్ దేశం నుంచి తిన్నగా ఇక్కడికే చేరుకున్నాడు అహ్మద్. “అప్పుడు ఇదంతా ఇంకా కొంత ఎడారిలానే వుండేది,” అని అతను వచ్చీ రాని ఉర్దూలో అఫ్గానీ యాసలో చెప్తున్నాడు. అప్పటికే ఈ వూరు గురించి కొంత చదివాను కాబట్టి, నాకు వెంటనే అరిజోనా కవి డాన్ హిగిన్స్ రాసిన కవిత గుర్తొచ్చింది. టూసన్ అంటే నల్ల కొండ పాదాల కింది ఊరు అనే అర్థం వుందట. చుట్టూ నల్లగా ఎత్తయిన కోటగోడల్లా నిలబడి వున్న కొండల్ని చూస్తే అలాగే అనిపించింది.

దిగంతంలోకి సూర్యాస్తమయం

కొంత నెత్తురోడుతుంది.

టూసన్, నువ్వు ఎడారి కలల కాన్వాస్ కదా,

బ్రహ్మజెముడు వృక్షాలు నిటారుగా నిలబడే వుంటాయి

పురాతన కాలాల సైనికుల్లా-

వాటి ముళ్ళ దేహాలు

గాలితో ఏదో గుసగుసలాడుతూ వుంటాయి ఎప్పుడూ-

         నేను కవిత్వాన్ని తలచుకుంటున్నప్పుడు రోజువారీ జీవితంలోని సంఘర్షణ ఏదో చెప్పుకొస్తున్నాడు డ్రైవర్ అహ్మద్. “నేను వచ్చినప్పటి నుంచీ ఇప్పటిదాకా చాలా మారిపోయాయి. తప్పదు కానీ, వ్యత్యాసాలు బాగా పెరిగాయి” అంటున్నాడు. పేదరికం ఎక్కువగా వుండే ఫిలాడేల్ఫియా నగరం నుంచి వచ్చిన వాణ్ని కాబట్టి అదేమీ విశేషంగా అనిపించలేదు. చూస్తూ వుండగానే మాకు బస ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కాంపస్ లోని హోటల్ వచ్చేసింది.

         అప్పటికే అక్కడొక మేళా జరుగుతున్నంత సందడి వుంది. హోటల్లోకి అడుగు పెట్టగానే పొడుగాటి క్యూలు, అటూ ఇటూ హడావుడిగా నడుస్తున్న వాళ్ళు. మధ్యలో పుస్తకాల షాపు. మాకు స్వాగతం చెప్పడానికి ఇద్దరు ముగ్గురు వలంటీర్లు. పండగ వాతావరణమే అంతా- నిజానికి అక్కడ వున్న మూడు రోజులూ, ఆ తరవాత అనువాద సభల రెండో భాగం జరిగిన చికాగో యూనివర్సిటీ కాంపస్ లో వున్న మూడు రోజులూ అదే పండగ వాతావరణం.  దేశాదేశాల రచయితలు ఈ అమెరికా అనువాద ఉత్సవాలకి వచ్చారని వాళ్ళ వాళ్ళ ముఖాలు చూస్తేనో, భాషలు వింటేనో తెలుస్తూనే వుంది. ఇన్ని దేశాలూ, భాషల మధ్య “తెలుగు” అంటే ఏమిటన్న ప్రశ్న ఎప్పటిలానే నన్ను నిలదీస్తోంది.

2



         దాదాపు యాభై యేళ్లుగా ఎక్కడా ఆగకుండా  అనువాదాల మీద పనిచేస్తున్న సంస్థ – అమెరికన్ లిటరరీ ట్రాన్స్ లెటర్స్ అసోసియేషన్ (ఆల్టా). ఏడాది కిందట ఆ సంస్థ నిర్వాహకుల నుంచి నాకు ఈమెయిల్ వచ్చినప్పుడు వాళ్ళెవరూ నాకు తెలీదు. ఈ సంస్థలో కనీసం నాకు సభ్యత్వమూ లేదు. ఈ ఏడాది  మొట్టమొదటిసారి వాళ్ళు వాళ్ళ భాషల జాబితాలో తెలుగుని కలిపారు. అప్పటిదాకా హిందీ, ఉర్దూ, అప్పుడప్పుడూ కన్నడ మాత్రమే వాళ్ళ జాబితాలో వున్నాయి. అనువాదకులు మాత్రమే కాకుండా, యూనివర్సిటీ స్థాయిలో అనువాదాల చుట్టూ కోర్సులు చెప్తున్న వాళ్ళని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ రెండీటిలోనూ నా పాత్ర పరిమితమే. ఆ విషయమే నిర్వాహకులకు చెప్పాను. మా దృష్టిలో మీరే వున్నారు. రావాల్సిందే” అని వెంటవెంటనే వాళ్ళు ఏర్పాట్లు చేశారు.

         టూసన్ లో జరిగిన సదస్సుల్లో ఎక్కువ భాగం యూరోపియన్ భాషలే. ఆ భాషల్లో అనువాదాలు చేస్తున్న అమెరికన్ రచయితలూ,అధ్యాపకులు. దక్షిణాసియా నుంచో, ఇండియా నుంచో వచ్చిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టాల్సిందే. ఆ కొద్ది మంది కూడా బంగ్లా దేశ్ లేదా పాకిస్తాన్. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలో కన్నడ నుంచి వివేక్ షాన్ బాగ్ అనువాదాలు చేసిన శ్రీనాథ్ పేరూర్, కాశ్మీరీ రచయిత అజర్ వాని, తెలుగు నుంచి నేను మాత్రమే వున్నాం. ఒకరు బంగ్లా నుంచి, మరొకరు పాకిస్తాన్ నుంచి, హిందీ భాష కోసం ప్రసిద్ధ అనువాదకురాలు డైసీ రాక్ వెల్ వున్నారు. అందువల్ల, మూడు రోజుల పాటు జరిగిన ప్రతి సెషన్ లోనూ ఎంతో కొంత మాట్లాడక తప్పలేదు. తెలుగు మాత్రమే కాకుండా, దక్షిణాసియా సాహిత్య పాఠాలు చెప్పే అధ్యాపకుడిగా హింది, ఉర్దూ భాషల అనువాదాల ప్రాముఖ్యాన్ని కూడా చెప్పాలని నిర్వాహకులు ముందే చెప్పారు. ఇది అంత తేలిక కాదు కానీ, చాలా మటుకు తెలుగు కేంద్రంగానే ఎక్కువ మాట్లాడాను.

3

         ఈ వారం రోజుల సభల్లో నా మొదటి ప్రతిపాదన: లిఖిత సాహిత్యాల మీద వున్న శ్రద్ధ మౌఖిక సాహిత్యాల మీద లేనే లేదని! ఇదేమీ కొత్తది కాదు కానీ, అక్కడ వున్న ఎక్కువ మందికి ఆ విషయం అంత బలంగా చేపప్దమ్ నచ్చినట్టుంది. కీలకోపన్యాసాలిచ్చిన ఇద్దరు ముగ్గురు ప్రసిద్ధులు వాళ్ళ వాళ్ళ ప్రసంగాల్లో నా ప్రతిపాదనని హాయిగా ప్రస్తావించడమే కాకుండా, ఈ మూడు రోజులూ నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ చాలా సేపు మాటల్లోకి దింపారు. నా అభిప్రాయాల్లోంచి   చాలా శ్రద్ధగా తీసుకున్న నోట్సులు చూపిస్తూ, ఒక్కో విషయం ఆరాతీశారు. తెలుగుకి సంబంధించినంత వరకూ తెలంగాణ సాయుధ పోరాటం తరవాత మౌఖిక సాహిత్యాల మీద పెరిగిన ఆసక్తి గురించి వివరంగా చెప్పాల్సి వచ్చింది. అలాగే, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో వివిధ స్థానిక ఉద్యమాల చరిత్రలో ఈ మౌఖిక సాహిత్యం ఎలా భాగమైందో కూడా చెప్పుకొచ్చాను.

         సాహిత్య సృజనలో వుండే అనేక భాషల జమిలి (హైబ్రిడ్) తత్వాన్ని అనువాదాల్లోకి తీసుకురావాల్సిన అవసరం వుందన్నది నా రెండో ప్రతిపాదన. ఇది కూడా మంచి చర్చకి తావిచ్చింది. శ్రోతలు దీనికొక ఉదాహరణ అడిగినప్పుడు తెలుగు- దఖనీ ఉర్దూతో పాటు, రాయలసీమలో తెలుగూ, కన్నడ భాషల హైబ్రిడ్ సృజనలోంచి కొంత వివరించాను.

         ఇక మూడో ముఖ్యమైన ప్రతిపాదన: ప్రపంచ భాషల పటంలో తెలుగు కానీ, దఖనీ కానీ ఎక్కడ నిలుస్తాయో, కలుస్తాయో చెప్పడం! మొదటి నించీ ఈ రెండు భాషలకూ ఒక అంతర్జాతీయ నెట్ వర్క్ వుందని నా వాదన. సంస్కృతం నుంచి విడివడ్డాక తెలుగులో ,  అలాగే, పర్షియన్ నుంచి విడివడ్డాక దక్షిణాది ఉర్దూలో ఇది బలంగా కనిపిస్తుంది. సాహిత్య సంస్కృతికి ప్రపంచం అనే ఇరుసు కాకుండా, స్థానికత అనే కేంద్రం నుంచి చూసినప్పుడే ఈ ప్రాపంచికత అర్థమవుతుంది. ఆ దృష్టి నుంచి చూస్తే ప్రపంచ భాషల నుంచి అనువాదాలు ఎంత అవసరమో, మరీ స్థానిక భాషల నుంచి ఇంగ్లీషులోకి, ఇతర పెద్ద యూరోపియన్ భాషల్లోకి కూడా అనువాదాలు వెళ్ళాల్సిందే.

         ఈ అనువాదాల్లోంచి టూసన్ లాంటి కొత్త ప్రదేశమైనా, ఆఫ్ఘన్ లాంటి ఇతర భాష అయినా చిరపరిచితమయ్యే కొత్త పుస్తకాలే అవుతాయి. ముఖ్యంగా చికాగో యూనివర్సిటీ కాంపస్ లో జరిగిన సదస్సుకి ముగింపు మాటలు చెప్పే అవకాశం నాకు దొరికింది. “సాహిత్యంలో సృజన ఎంత ముఖ్యమో, అనువాద సృజన అంతే ముఖ్యం. అప్పుడు సరిహద్దుల మధ్య గోడలు కూలిపోతాయి. భాషల మధ్య వంతెనలు గట్టిగా నిలబడతాయి.”

*

          

Thursday, October 2, 2025

నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం

 


- బొల్లోజు బాబా 


(ఈ వ్యాసంలోని కొంతభాగం కవిసంధ్య పత్రికలో ప్రచురణ అయినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. వ్యాసం పెద్దది. రెండుభాగాలుగా పోస్ట్ చేద్దామనిపించింది, థాట్ కంటిన్యూటీ ఉండాలని… ఇలా)

అఫ్సర్ తాను నలభై ఏళ్ళుగా వెలువరించిన కవిత్వాన్ని “అప్పటినుంచి ఇప్పటి దాకా” పేరుతో ఇటీవల పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు. దీనికి రాసుకొన్న ముందుమాటలో “వొక కవి రాస్తున్న కవిత్వమంతా, వొకే గాటన కట్టేయడం కుదురుతుందా?” అని ప్రశ్నిస్తాడు. 660 పేజీల ఈ సంపుటిని చదివినతరువాత కూడా పై ప్రశ్నకు అవుననో కాదనో సమాధానం దొరకదు. అందునా శిల్పరీత్యా, వస్తురీత్యా, అభివ్యక్తిరీత్యా నిత్యచలనశీలత కలిగిన అత్యాధునికుడైన అఫ్సర్ లాంటి కవి గురించి చెప్పటం మరీ కష్టం. ఈ మొత్తం బృహత్ గ్రంధాన్ని చదివినపుడు మాత్రం ఆ కవితలన్నింటినీ కలుపుతున్న కనిపించని దారాలేవో లీలగా తారాడుతాయి.

ఆధునిక కవిత్వం వైయక్తికంగా ఉంటూనే వేదనను పలికించటం ప్రధానలక్షణంగా కలిగి ఉంది. స్వీయానుభవాలను ఇంటలెక్చువల్ గా కవిత్వీకరించే కవులను Confessional Poets అని విమర్శకులు విభజించారు. ఈ తరహా కవిత్వంలో కవి తన వ్యక్తిగత జీవితానుభవాలలోంచి కొన్ని రాజకీయ, సామాజిక సత్యాలను ఆవిష్కరిస్తాడు. అంటే ఆ కవిత్వం ఏకకాలంలో వైయక్తికము, సామాజికమూ అవుతుంది. కన్ఫెషన్ అంటే పూర్తిగా కవికిమాత్రమే సంబంధించిన ఒక అనుభవాన్ని సమాజపరం చేయటం. ఈ చేసే క్రమంలో ఈ సమాజం ఎలా ఉండాలని ఆశించాడో, ఎలా ఉందో అనే భిన్న అంశాల మధ్య వైరుధ్యాలను వెలికి తీస్తాడు.

అఫ్సర్ తనజీవితంలో ఎదుర్కొంటున్న సంఘర్షణలను, వేదనలను నిజాయితీగా కవిత్వీకరించాడు. ఆ కోణం లోంచి చూసినపుడు అఫ్సర్ Confessional Poet గా కనిపిస్తాడు.

ఏది వ్యక్తిగతమూ, ఏది సామాజికము అని సరిహద్దులు చెరిపేస్తుందీ నాలుగు దశాబ్దాల కవిత్వం. చారిత్రిక, రాజకీయ, సామాజిక వాస్తవాలు వ్యక్తిగత సర్కిల్ ను దాటి ఆధునిక మానవ జీవితాన్ని పోతపోసాయి.

అస్తిత్వం కోసం చేసిన అన్వేషణలో ఈ కవిత్వం స్థానీయత పరిధులను దాటిన మానవ అస్తిత్వవేదనను బలంగా ప్రతిబింబించింది. ఇది లోపలనించి మొదలై వెలుపలి సామాజిక వాస్తవికతతో తలపడుతుంది. వ్యాకులత, దుఃఖం, నిస్సహాయత, ధిక్కారం, పరాధీనత, శాంతికాముకత లాంటి ఉద్వేగాలు అంతర్లీనంగా వాక్యాల వెనుక ప్రవహిస్తూంటాయి.

1. మెటొనిమీ అఫ్సర్ కవిత్వ బలం

నలభై ఏళ్ళలో అఫ్సర్ కవిత్వం పొందిన పరిణామం - శిల్పరీత్యా సాంద్రపడటం, వస్తురీత్యా సార్వజనీనతను పొందటం, మానవానుభవం సహజత్వాన్ని సంతరించుకోవటం.

అతనే వినిపించకపోయినా

అతని పాట వినిపిస్తుంది

మెల్లిగా కదిలి తుఫానై చుట్టుముడుతుంది జ్ఞాపకమై

నడుస్తున్న నిన్ను వెంటాడి వేదిస్తుంది

రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా (సైగల్ – 1985)

వొక మేఘఘర్జననీ

యింకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెనువాన//

ప్రాణం ఉగ్గబెట్టుకొన్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకొన్నానా,

పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేదాకా, నా జహాపనా (భూపేన్ హజారికా కొరకు -2018)

సుమారు ముప్పై అయిదు సంవత్సరాల వ్యవధితో ఇద్దరు గాయకుల గురించి రాసిన కవితా వాక్యాలివి. సైగల్ కవితలో “తిలక్ తనం” కనిపిస్తుంది. అందం, ఆనందం పరమావధిగా ఉంది. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా పై ఇటీవల వ్రాసిన వ్రాసిన ఆ రెండో కవితలో శిల్పం సాంద్రపడింది. పాటను మేఘఘర్జన, గుండెపగులుల సమ్మేళనం, లోపలి వాన అంటూ మెటఫరైజ్ చేయటం టాప్ క్లాస్ వ్యక్తీకరణలు. ఎడతెగని దుఃఖం, వ్యాకులత నిండిన కవి మనఃస్థితినిపెనువాన”, “చీకటిపరుగు” లాంటి పదాలు సూచిస్తున్నాయి. ఇదంతా అఫ్సర్ నలభై ఏళ్ళలో “తిలక్ తనం” నుంచి “అఫ్సర్ తనం” వరకూ చేసిన ప్రయాణం.

***

అఫ్సర్ డిక్షన్ లో సిమిలీ కన్నా ఇమేజెరీ, మెటాఫర్ కన్నా మెటొనిమీ ప్రముఖంగా కనిపిస్తుంది.ఏకాంతం” అనే కవితలో ఏకాంతపు స్థితికి “గది” ని మెటొనిమీ (ప్రతీకాత్మకత) చేస్తాడు.

//లోనికి రమ్మని

చేతులు చాస్తుంది గది//

ఎంతకీ చేతులు వెనక్కు లాక్కోదు గది

గదిగోడల మీద అక్కడక్కడా నెత్తుటి మరకలు/

గది నాకంటే వొంటరిదనుకోను

నాకోసమే చేతులు చాచాల్సిన

అవసరమూ లేదు// (ఏకాంతం – 1985)

పై కవితలో గది అన్న పదం చోటులో ఏకాంతం అన్నపదం ఉంచుకొని చదువుకొన్నప్పుడు ఈ కవిత సౌందర్యం అర్ధమౌతుంది. ఇక్కడ కవి, ఏకాంతగది అనో గదిఏకాంతమనో మెటఫరైజ్ చెయ్యడు. ఏకాంతం అనే కవితా వస్తువును గదితో మెటొనిమీ చేసాడు. కవితను విప్పే తాళం చెవి టైటిల్ లో ఉంచాడు.

మెటొనిమీ అనేది అత్యున్నతమైన ఒక కవిత్వీకరణ పనిముట్టు. అందుకనే కవిత్వం “మెటఫర్ నుండి మెటొనిమీకి ప్రయాణించాలి” అంటాడు మో. ఈ మొత్తం కవితలను చదివాకా అఫ్సర్ కవిత్వబలం మెటొనిమీ లోనే ఉందనిపిస్తూంటుంది. ఈ మెటొనిమిలో ఉన్న ప్రమాదం ఏమిటంటే కవి ఉద్దేశించిన ప్రతీకను పాఠకుడు గుర్తించలేకపోయినట్లయితే అది అయోమయానికి దారితీస్తుంది. అఫ్సర్ కవిత్వంపై ఈ తరహా విమర్శ లేకపోలేదు.

2. అంతర్ బహిర్ ప్రపంచాల యుద్ధారావం

ప్రతీ కవికి కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి. అజంతా కవిత్వంలో మృత్యుఊహలు, ఇస్మాయిల్ కవిత్వంలో పిట్ట, చెట్టు ప్రస్తావనలు వంటివి. అఫ్సర్ కవిత్వంలో కూడా “మాట-మాట్లాడు కోవటం, వాన-వర్షించటం” లాంటి విషయాలు పదే పదే వస్తూంటాయి. వచ్చిన ప్రతీ సారీ కొత్త అర్ధంలో, కొత్త కోణంలో, కొత్త మెటానొమికాభివ్యక్తితో దర్శింపచేయటం కవి ప్రతిభ. చాలా చోట్ల “మాటను” ను లోపలిప్రపంచానికి; “వాన” ను బయటిప్రపంచానికి ప్రతీకలుగా చేయటం గమనించవచ్చు.

మాటలకేం,

ఇసుకవేసినా రాలనన్ని మాటలు//

ఎటుచూసినా మాటల వర్షమే

కుంభవృష్టి కురుస్తున్నా

నా మీద ఒక్కచినుకూ తడవదే/

ఈ మాటల ఊరేగింపులో

నా మాటెవరికీ వినిపించదే!/

నా గొంతులో మాటుకాసి

మాటని ఎవరో నులిమేస్తున్నారు/

నా లోపలి మాట మూడంకె వేసింది (నాకు మాటివ్వండి – 1991).

చుట్టూ కుండపోతగా కురిసే మాటల వర్షంలో తడుస్తున్న కవికి సొంత మాటలు మూగపోయాయి అంటున్నాడు. చలం చెప్పిన అంతర్ బహిర్ ప్రపంచాల యుద్ధారావం ఇది. ఊహకు వాస్తవానికి మధ్య దూరాన్ని ఈ కవిత పట్టుకొంటుంది. కవిత చివర్లో “గుండెకు సిజేరియన్ చేసైనా సరే ఒక స్వచ్ఛమైన శిశువులాంటి మాట” ఒకటి కావాలంటాడు కవి.

మాటకి

అక్షరానికి

చెమట చేతుల మోటుదనం కావాలిక!// (యానాం వేమన ఏమనె-1992).

కవిత్వం మట్టివాసనను, కన్నీటి జాడలను ప్రతిబింబించాలని అంటున్నాడు. తెలుగు దళితకవిత్వాన్ని చిక్కబరచిన “చిక్కనవుతున్న పాట” రావటానికి మూడేళ్ల ముందు రాసిన వాక్యాలివి. అఫ్సర్ తన కాలానికి చాలా ముందే ఉన్నాడనటానికి “యానాం వేమన ఏమనె” కవిత చక్కని సాక్షిగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ కవితానంతర కాలంలో మహోత్తుంగ తరంగాల్లా ఎగసిన దళిత, బహుజన, మైనారిటీ కవిత్వాలలో ఈ కవితాత్మే శత సహస్ర రూపాలతో సంచరించటం ఒక చారిత్రక పరిణామం.

మాట రాలిపోయినపుడే

కవిత్వమంతా శిథిలమయిపోయింది (వొకానొక అసందర్భం 2009). ఇక్కడ మాటను వాస్తవం చెప్పటం అనే అర్ధంలో వాడతాడు కవి. వాస్తవాన్ని కప్పిపుచ్చే కవిత్వం మృతప్రాయం అని చెపుతున్నాడు.

అనేక కవితల్లో స్వీయ అస్తిత్వానికి, వ్యక్తీకరణకు, ఆలోచనలకు, అంతర్మధనానికి మాటను పర్యాయపదం చేయటాన్ని గమనించవచ్చు. కొన్ని ఉదాహరణలు…

*/లోగొంతుకల్ని/తోడిపోసే చేదలేదుగా చేతుల్లో/వొక తెగిపడిన మాటనో/వొక రాలిపడిన కేకనో/ తెగనరక్కు దేన్నీ (తెగిపడేవి మాటలే -2009)

*/మాటలొ ఏముందనుకుంటాం కానీ/మాటలోనే అంతా వుంది/అన్నిట్నీ కప్పడం నేర్పుతుంది/దుఃఖం సంతోషంలాగ/సంతోషం దుఃఖంలాగ/అసహనం సహనంలాగ/ ద్వేషం ప్రేమలాగా పలుకుతుంది. (పసి కాళ్ళు నీవీ నావీ)

*/నిండు చీకట్లో/నిలువెత్తు మల్లెలా/నడుచుకుంటూ వస్తావు నువ్వు. పడవనిండా కొన్ని మాటలూ/ఇంకా కొన్ని అరవిరిసిన నవ్వులూ నింపుకొని (గట్లు తెగినాక -2013)

*/నిజానికి మాటలసంచీ ఖాళీ అవ్వనే అవ్వదు/అయినా సరే/వెళ్ళిపోవాలి కదా/తలోదారి తలోదిక్కూ తలో రెక్కా అయిపోయి (వుండనా, మరి – 2015)

కవిగా అఫ్సర్ వ్యక్తీకరణలో కనిపించే మరొక అబ్సెషన్వాన’. తనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలకు వానను ప్రతీకాత్మకంగా వాడుతున్నాడని అర్ధమౌతుంది.

వాన వెలిసిన చీకట్లో

అతని చివరిస్నానం గురించి ఆలోచిస్తో వస్తున్నాను

కడిగిన ముత్యంలాంటి

అతని వొంటిమీద ఎండిన నెత్తుటి చారికలగురించి

మానని గాయాల తెరుచుకున్న నిజాలగురించి

వొళ్లంతా కళ్లయిన ఎదురుచూసిన తల్లిగురించి

పదహారేళ్ళ కాళ్ళకింద హఠాత్తుగా చీలిపోయిన భూమిగురించీ// (చివరి స్నానం -1997).

మత కలహాలలో చంపబడ్డ యువకుని గురించిన కవిత అది. గంభీర విషాదంగా సాగుతుంది. కవిత “వాన వెలిసిన చీకట్లో” అంటూ మొదలౌతుంది. ఇక్కడ వానను లోకం సాగించిన మారణకాండకు ప్రతీకచేయటాన్ని గమనించవచ్చు.

భిన్నకాలాలలో, భిన్న సందర్భాలకు వ్రాసిన అనేక కవితల్లో వాన ప్రస్తావన చేసినచోటల్లా ఖాళీల్లోకి పాదరసం బిందువులు కుదురుకున్నట్లుగా ఒదిగిపోవటం గమనిస్తాం. ప్రతీచోటా బయటజరుగుతున్న విషయాన్ని చెప్పటానికి వానను ప్రతీకగా వాడుకొంటున్నట్లు అర్ధమౌతుంది. కొన్ని ఉదాహరణలు…

*/ఎన్ని వానలు చూళ్ళేదనీ?/ప్రతీవానా/మళ్ళీ అదేదో కొత్తవాసనేస్తుంది (సగమే గుర్తు – 2006)

*/చడీ చప్పుడూ లేకుండా/అలా కురుస్తూనే వుంది వాన/ఎప్పుడు ఎలా కురిసినా వొకేలా వుండటమే తెలుసు వానకి (నీరెండలో వూరు – 2008)

*/యీ వానా యీ జీవితం/నన్ను యెంతలా తడుపుతున్నాయో కూడా చూసుకోను/ వానకు కురవటం వొక్కటే తెలిసినట్టు/నాకు పరిగెత్తడం మాత్రమే తెలిసినట్టు (నీదికాని వాన -2013)

*/అక్కడ నువ్వు యింకా కురుస్తున్నావో లేదో కాని/యిక్కడ నేనింకా తడుస్తూనే వున్నాను (అక్కడి వానలో నేను -2015)

*/తొలకరివాన/కొండల్ని తలబాదుకునీ బాదుకునీ/ఏడుస్తుంది/వితంతువులు/ చేతులారా గాజులు పగలగొట్టుకొంటున్నట్టు ( శ్రీనగర్ లో మొహర్రం )

ఒక కవి నలభైఏళ్ళపాటు వ్రాసిన సుమారు 600 పేజీల కవిత్వంలో పదే పదే వచ్చిన ఒక పదాన్నో, పదబంధాన్నో వెలికితీసి చూపటం మర్యాదకాకపోవచ్చు. కానీ చెప్పిన ప్రతీచోటా కవి కొత్తగా చెప్పాడని, ఆయా సందర్భాలకు అద్భుతంగా సింక్ చేసాడని, అక్కడ ఆ పదాలు తప్ప వేరే పదాలు పొసగవనే సంగతి చెప్పటానికే ఇదంతా.

3. నలభై ఏళ్ళ వర్తమానం

అనన్యత కొరకు చేసిన అనంతమైన పెనుగులాటే అఫ్సర్ కవిత్వం మొత్తం. తాను ఈ సమాజానికి అన్యుడనని అంగీకరించలేకపోవటం ఒక వైపు, తనను ఎందుకు అన్యుడిగా ఈ సమాజం భావిస్తున్నదో అంటో అన్వేషించుకొనే ప్రక్రియ మరో వైపు. ఈ రెండు దృవాల మధ్యా నలిగే హృదయఘర్షణ సంక్లిష్టంగా ఉంటుంది. అఫ్సర్ కవిత్వం పట్ల ప్రధానంగా వినిపించే విమర్శ సంక్లిష్టత.

ఈ నేపథ్యంలోంచి తన పరాధీనతను గానం చేస్తాడు అఫ్సర్. ఒక మైనారిటీ కవి అవటం వలన అతనిపై అదనపు భారం ఉంటుంది. అందరికీ చక్కగా కుదురుకొన్న వ్యవస్థలో అఫ్సర్ ను ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది. మనచుట్టూ రక్తమాంసాలతో సంచరించే ఇండియన్ కు, సమకాలీన రాజకీయాలు నిర్మిస్తోన్న ఆదర్శ భారతీయునికి మధ్య పెరిగిపోతున్న అగాధం గురించి అఫ్సర్ కవిత్వం మాట్లాడుతుంది. ఒక అరాచక కట్టుకథ వాస్తవ రూపం దాల్చటం పట్ల సగటు మనిషి పొందే భీతిని పట్టుకొంటుంది. ఈ కవి ఈ నేల యొక్క శతాబ్దాల సామరస్యానికి ప్రతినిధి. తను పుట్టిన నేలపై “లవ్ హేట్” బంధాన్ని కలిగి ఉన్నాడు.

*/ఉన్నచోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని/ఎక్కడెక్కడో అంటీముట్టని బట్టలా/ విసిరేయొద్దంటాను/నా నవ్వులు నా ఏడ్పులూ/నా అవమానాలు నా అనుమానాలు/నా మానభంగాలు హత్యలూ/అన్నీ మీవి కూడా అంటాను (నాకే జన్మభూమీ లేదు)

*/ఒకే ఆకాశం గొడుగు కింద/మనిద్దరం/నీకో సగం నాకో సగం కాదు/అంతా మనకోసమే//ఇక్కడే/ ఈ ఆకాశం కిందనే నన్నుండనివ్వు (ఆకాశం వొడిలో) -- అనే వాక్యాలలో ఈ కవి నేను ఈ దేశానికి చెందినవాడినే, నేను అన్యుడను కాను నేనూ మీలోని వాడినే నన్నువేరుగా చూడకండి అన్న వేడికోలు స్పష్టంగా వినిపిస్తుంది.

*సరిహద్దులు లేవు లేవు నాకు అని/రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని/భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని/నడుస్తూ పరిగెత్తుతూ వుంటా// నమ్మరా నన్ను నమ్మరా/ నా పేరుచివర మహమ్మదో అహమ్మదో షేకో/సయ్యదో/ ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా// అనే వాక్యాలలో పలికే విషాదం తన అనన్యతను నిరూపించుకోవటం కొరకు కవి పడుతున్నవ్యధను వ్యక్తీకరిస్తాయి.

*/పచ్చపచ్చని నా వొంటిమీద/రాజకీయాలు చేస్తున్నప్పుడు/యా అల్లాహ్/కనీసం నన్ను బతికించలేకపోయావు/కనీసం నీ కళ్ళయినా చమర్చాయా? (ఒక ఖడ్గం స్వగతం -1996) అంటూ దేవుడినే ప్రశ్నిస్తాడు ఒక నిస్సహాయ స్వరంతో.

ఇలాంటి కవితలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమూహపు Psyche ను నిక్షిప్తం చేస్తాడు. ఇవి ఆయా స్థలకాలాదులకు సంబంధించిన ఆ సమూహపు రాజకీయ అభిప్రాయాలుగా భావించవచ్చు.

4. హిస్టారికల్ నేరేటివ్

అఫ్సర్ ఇంతవరకూ వెలువరించిన రక్త స్పర్శ, ఇవాళ, వలస, ఊరి చివర, ఇంటివైపు అనే అయిదు కవితాసంపుటులలోని కవితలను ఈ సమగ్ర సంపుటిలో పొందుపరిచారు. కవితలను అన్నింటిని ఏకబిగిని చదివినపుడు ఒక Historical narrative అంతర్లీనంగా కనిపిస్తుంది. ఈ నేరేటివ్ లో నాలుగు దశాబ్దాల అభిరుచులు, పఠనాసక్తులు, రాజకీయ, సామాజిక నేపథ్యాలు పరిస్థితులు ఉంటాయి. ఒక పరిణామ క్రమం లీలగా గోఛరిస్తుంది.

1985 లో వచ్చిన “రక్తస్పర్శ” కవితలలో ముస్లిం అస్తిత్వవాద కవితలు కనిపించవు. అలాగని అప్పట్లో మతవాదం లేదని చెప్పలేం కానీ ఆ తరువాత కాలమంతటి కల్లోలంగా లేదనవచ్చు; కనీసం కవిత్వానికి సంబంధించి.

1992 బాబ్రి మసీదు విధ్వంసానికి ముందు జరిగిన హిందువుల పోలరైజేషన్ ప్రక్రియను “ఇవాళ” కవితా సంపుటిలోని కర్ఫ్యూ, సంక్షోభగీతం, ఇదే నా జాతీయగీతం, గాంధీగారి రెండో చెంప, దూరం, నాకు మాటివ్వంటి వంటి కవితలు వ్యక్తీకరిస్తాయి.

మనసారా అందర్నీ ప్రేమిస్తానని మాటివ్వబోతాను/నా కళ్ళమీద ఒక పంజాబ్ మరో మీరట్/తీతువుల్లా వాలిపోతాయి// అనే వాక్యాలద్వారా ఒక శాంతికాముక ముస్లిం కోరుకొనేదేమిటో, పొందుతున్నదేమిటో; విస్పష్టంగా చెపుతాడు అఫ్సర్.

మతరాజకీయాలు పెచ్చరిల్లుతున్న సందర్భంలో వాటిని ఎదుర్కోవటంలో విఫలమైన కమ్యూనిష్టుపార్టీలపై చేసిన విమర్శను “దేవుడు మరణించలేదు” అనే కవితలో గమనించవచ్చు.

ఇవాళ” సంపుటిలోని- చిన్నప్పటి సంగీతం, చిన్నప్పటి చెరువు లాంటి కవితల్లో కవి నాస్టాల్జియాలోకి జారిపోతాడు నిస్సహాయుడై.

ఆ తరువాత 1999 లో “వలస” సంపుటి వచ్చినకాలం కల్లోలభరితం. అస్తిత్వవాద ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. అగర్ జిందో మె హై, ఇఫ్తార్ సైరన్, ఉష్ మాన్, నాకే జన్మభూమీ లేదు, రెండో విభజన, అజా, నహి మాలూమ్ లాంటి కవితలలో తన మైనారిటీ అస్తిత్వాన్ని నిర్ధ్వంద్వంగా చెప్పుకొన్నాడు. అలాగని అఫ్సర్ కవిత్వంలో రక్తం వచ్చేలా ముక్కుబద్దలు కొట్టేలాంటి మైనారిటీ కవిత్వవాక్యాలు కనిపించవు. షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వటంద్వారానే ఒక వాదాన్ని పలికించాలనుకోవటం ఇతని విధానం కాదు. చెప్పిందంతా ఒక ఆత్మనివేదనగానే చెప్పాడు. మతం పేరుచెప్పి మనిషి చేసే తప్పించుకోలేని తప్పిదాలను ఒక అండర్ స్టేట్ మెంట్ లా సటిల్ గా ఆవిష్కరిస్తాడు. ఇది అఫ్సర్ ను ఇతర మైనారిటీ కవులనుండి వేరుచేస్తుంది.

మనువాదపోకడలను ఎదుర్కోవటానికి దళిత, ముస్లిమ్ ల ఐఖ్యతను నేడు చాలామంది కోరుకొంటున్నారు. కారం చేడు దాడులపై వ్రాసిన “ఊరవతలి దుఃఖం”, దళితుల శిరోముండనం పై వ్రాసిన “శిరోముండనం” లాంటి కవితలద్వారా దళిత, ముస్లిం ల ఐఖ్యతను తొంభైలలోనే ప్రతిపాదించాడు అఫ్సర్.

2009 లో వచ్చిన “ఊరిచివర” సంపుటి నాటికి సమాజం ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధికవిధానాలు, చిక్కబడిన మతరాజకీయాలతో సంక్షుభితమై ఉంది. పొట్టచేతపట్టుకొని చేసే వలసలు అనివార్యమయ్యాయి చాలామందికి. అందుకే ఇలా అంటాడు “కడుపే దేశం/ఎంగిలి మెతుకే కల//వెళ్ళిపోవాల్సిందే ఎక్కడికైనా/ఎడారి దేహంలోకి రాకుండా!/దేహం/ఇసుక దిబ్బ కాకుండా// అని.

ఇదే కాలంలో ఉవ్వెత్తున లేచిన తెలంగాణా ఉద్యమంతో అఫ్సర్ ఆ ప్రాంత కవిగా మమేకమయ్యాడు. తెలంగాణ 2002, తెలంగాణా 2009 కవితల్లో తెలంగాణా ఆత్మను పలికించాడు.

మెరుగైన ఉపాధికొరకు అమెరికా వెళ్ళాకా అక్కడినుంచి అంతర్జాతీయంగా వివక్షకు గురౌతున్న ముస్లిం అస్తిత్వాన్ని దర్శించాడు. తానొక దేశద్రిమ్మరి గా అభివర్ణించుకొన్నాడు “జంగమం” అనే కవితలో.

నల్లా నల్లాని నవ్వు, “డౌన్ టౌన్-కొన్ని స్వగతాలు” “తోలుమందం” లాంటి కవితలలో అమెరికాలో వర్ణవివక్షను అనుభవించే నల్లజాతీయుల వేదనతో సహానుభూతి చెందాడు.

2018 లో వచ్చిన “ఇంటి వైపు” సంపుటిలో చిత్రంగా ఏదో వ్యాకులత, ఇంటివైపు బెంగ నిండిన కవితలు కనిపిస్తాయి. నాస్టాల్జియా పొంగిపొర్లుతుంది. ఎక్కువ కవితలు గుండెలు పిండే నేరేటివ్ పద్దతిలో నడుస్తాయి. కొన్నింటిని ప్రేమకవితలుగా పోల్చుకోవచ్చు. కవిగా మరింత మార్మికతలోకి జారిపోయాడు. సందర్భాలకు రాసిన కవితలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలామట్టుకు కన్ఫెషనల్ పొయెమ్స్. ఇది పరిణితా లేక అలసిపోవటమా అనే సందిగ్ధం కలుగుతుంది.

మొత్తంమీద ఆరువందల పేజీల కవిత్వంలో కనిపించే హిస్టారికల్ నేరేటివ్- కవి జీవించిన సమాజాన్ని, జీవితాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

ముగింపు

నాలుగు దశాబ్దాలుగా కవిత, వ్యాసం, కాలమ్, ఎడిటర్, విమర్శ ఏదో రూపంలో అక్షరమై మనకు అనేక దారుల్లో అఫ్సర్ ఎదురవుతూనే ఉన్నాడు.

ఆధునికజీవనంలో అనివార్యమౌతున్న వలసలు, విచ్చిన్నమౌతున్న మానవసంబంధాలు, వివిధ జీవనో ఉద్వేగాలను ఒక కవిగా పలికిస్తూనే, ఒక ముస్లిం కవిగా తన అస్తిత్వాన్ని, సమకాలీన రాజకీయ యవనికపై తనసమూహానికి జరుగుతున్న అన్యాయాలను పదునుగానే పలికించాడు.

Exile లో ఉంటూ కూడా తన మూలాల్ని, సంస్కృతిని, వ్యక్తుల్ని చెరిపేసుకోలేదు. నిజానికి ప్రవాసంలోనే మూలాల విలువ అర్ధమౌతుంది. ఇతనికి జ్ఞపకాలే ఏకకాలంలో వర్తనమానము భవిష్యత్తూ కూడా.

ఈ ప్రపంచాన్ని మెదడు పాయింటాఫ్ వ్యూ లోంచి, హృదయం పాయింటాఫ్ వ్యూ లోంచి దర్శించటం అఫ్సర్ కవిత్వ ప్రయాణం. సత్యాన్ని ఆవరించి ఉన్న నివురుపొరలను ఒక్కొక్కటి వొలుచుకొంటూ నిప్పులపై నడుస్తాడు. ఒక్కోసారి కాంక్రీట్ వ్యక్తీకరణలతో జ్వలించటం, ఒక్కోసారి ఆబ్ స్ట్రాట్ ఊహలతో సోలిపోవటం అఫ్సర్ కవిత్వ శైలి. కాంక్రిట్, ఆబ్ స్ట్రాక్ట్ లు పక్కపక్కనే నిలబెట్టి ఇంతే కదా జీవితం అని మెటఫరైజ్ చేస్తాడు.

కవి అన్నవాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సత్యాన్ని జేబులో దాచుకొని రావాలి. ఒక కొత్త పదం, ఒక కొత్త వాక్యం, ఒక కొత్త పదచిత్రంగా బద్దలవ్వాలన్న రహస్యం తెలిసిన వాడు అఫ్సర్ అందుకనే నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఒక కంటిన్యూటీ, దృక్కోణం, స్వరం, తీవ్రతా స్పష్టంగా తెలుస్తూంటాయి.

అఫ్సర్ జీవనానుభవాల కవి. కళ, జీవితము పెనవేసుకుపోయిన జీవనానుభవాలు. ఇతని కవిత్వం ఎంత ఆర్థ్రంగా ఉంటుందో, ఇతరులపై వ్రాసిన ఎలిజీలు, భిన్న సందర్భాలకు వ్రాసిన సంఘటనాత్మక కవితలు కూడా అంతే తడితడిగా తగుల్తాయి.

afsar@40 కావొచ్చు గాక ఇప్పటికీ పసితనం, యవ్వనం పచ్చిపచ్చిగానే నిలుపుకొని అనుభవాలను కళ్లతో, చెవులతో, చర్మంతో, హృదయంతో లోలోపలకి పీల్చుకొని అక్షరాలుగా, వాక్యాలుగా పలవరించే మనకున్న మనసున్న మంచి కవి.

అప్పటినుంచి ఇప్పటి దాకా” అఫ్సర్ కవిత్వం తప్పక చదవాల్సిన పుస్తకం. దాచుకొని మరలా మరలా చదువుకోవాల్సిన పుస్తకం.

బొల్లోజు బాబా

 

నల్లకొండ నీడలో అనువాదాల పండగ

         అమెరికాలో ఎక్కడికైనా వెళ్ళడం వేరు , అరిజోనాలోని టూసన్ అనే నగరానికి వెళ్ళడం వేరు. మరీ తెలియని భాషలో అసలేమీ తెలియని రచయిత రాసిన పు...