ఈ కవిత్వం మొహమాటాలు లేని రాజకీయ భావ ప్రకటన

"పాలపిట్ట" తాజా సంచికలో వెలువడిన ఇంటర్వ్యూ ఇది...



అఫ్సర్ గారూ, మీ కొత్త కవితా సంపుటి “ఊరి చివర” విడుదల సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు! దీన్ని పురస్కరించుకుని మీతో కొంచెం సేపు ముచ్చటిద్దామనుకున్నాం. ముందుగా “ఊరి చివర” నేపథ్యం, వచ్చిన పరిస్థితీ వివరిస్తారా?

- "ఊరి చివర" అనే శీర్షికలోనే ఆ కవిత్వ నేపధ్యమూ, పరిస్థితీ స్పష్టంగా అర్ధం అవుతున్నాయి. "కవిత్వ" ఇసకలో మాత్రమే తలదూర్చి వున్న ఉష్ట్ర పక్షులకి ఈ కవిత్వం అర్ధం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. కేవలం కవిత్వ అభిమానుల కోసమే కవిత్వం రాయడం నా వల్ల కాని స్థితిలో ఈ కవిత్వం వచ్చింది. ఈ కవిత్వం రాస్తున్న సమయంలో నేను మూడు ప్రపంచాల మధ్య - ఒకటి: తెలంగాణా, రాయలసీమ మారుమూల పల్లెల్లో వున్నాను, రెండు: ప్రపంచానికి కేంద్రం అని భ్రమిసే అమెరికాలోనూ వున్నాను, మూడు: పాప్ కల్చరూ, ధనిక సంస్కృతినీ అనుకరిస్తూన్న "లిటిల్ అమెరికా" లాంటి నయా హైదరబాదులోనూ వున్నాను. ఈ మూడు ప్రపంచాల మధ్య రాపిడికి గురవుతున్న ఒక తెలంగాణ ఊరి అస్తిత్వం, ఉనికి రాజకీయాల తిరణాలలో అనాధ ముస్లిం అస్తిత్వమూ ఈ కవిత్వం రాయించాయి. "శుద్ధ" కవిత్వం ఇక రాయలేనన్న స్థిరత్వం, చుట్టుముడ్తున్న మూడు భిన్న ప్రపంచాల అస్థిరత్వం "ఊరి చివర" లో కనిపిస్తుంది. కాని, ఈ పుస్తకం మీద విమర్శలు గుప్పిస్తున్న వాళ్ళు ఈ రెండు విషయాలు తప్ప అన్నీ మాట్లాడుతున్నారు.

మీరు గతంలో వెలువరించిన కవితా సంపుటులకూ “ఊరి చివర” కూ ప్రధానమైన తేడాలూ, మార్పులూ (గుణాత్మకమైనవి) ఏమిటి?
- ఆ కవితా సంపుటాలకూ, "ఊరి చివర" కీ మధ్య పెద్ద తేడా: వస్తు విస్తీర్ణం. అందులో వున్న నలభై ఎనిమిది కవితలూ నలభై ఎనిమిది కొత్త వస్తువులు. భిన్నత్వాన్ని గౌరవించాలన్న తపన ఇందులో అన్ని కవితల్నీ నడిపించే సూత్రం. ఇది చూసి కవిత్వ సరళ రేఖల మీద బతికే వాళ్ళు గొల్లుమంటున్నారు. అయ్యో, కవిత్వమూ, శుభ్రతా అంటూ చేతుల్ని అతిసున్నిత పుష్ప ద్రవాలతో కడుక్కుంటున్నారు. కవిత్వ వస్తువు, రూపం మీద మళ్ళీ చర్చలకి దిగుతున్నారు.
- ఈ విమర్శలూ, వ్యాఖ్యానాలూ చదువుతూంటే, 1985 "రక్త స్పర్శ" రోజులు గుర్తొస్తున్నాయి. అయితే, వొక్కటే తేడా. అప్పుడు మనకి మంచి విమర్శకులు వున్నారు. ఈ కవిత్వ సంపుటిని సమీక్షిస్తూ కేవీయార్ "1985 కవిత్వానికి కొండ గుర్తు" అని రాశారు, ఆయనకి నా కవిత్వ రూపం మీద అభ్యంతరాలు వున్నప్పటికీ- కవిత్వ రూపం కొత్తగా వుండాలనుకున్న ఆ తపనలో నేను అమాయకంగా ఇస్మాయిల్ కవిత్వాన్ని ఆరాధించే వాణ్ని. ఇస్మాయిల్ గారిది "టింబర్ డిపో" (అంటే కట్టెలు పేర్చినట్టుగా వుండేదని) కవిత్వం అని ఆ రోజుల్లో అజంతా గారు అనే వారు. ఇస్మాయిల్ కవిత్వం విడిగా చదివేటప్పుడు బాగానే అనిపించినా, చదివాక తీరని అసంతృప్తి కలిగించేది. ఆ దశలో నేను కొత్త హిందీ కవిత్వంలోనూ, ఉర్దూలోనూ సేదదీరాను. ఆ తరవాత, "ఇవాళ" లొ నేను రాయలనుకున్న కవిత్వ రూపానికి కొంత దగ్గిరగా వచ్చాననుకున్నా.
- "వలస" లో కొన్ని అసంతృప్తులు వున్నాయి, కాని, చాలా మందికి "వలస" నచ్చింది. "ఊరి చివర" లో నేను రూప వైవిధ్యం వైపు నడిచాను. బిస్మిల్లా ఖాన్ మీద రాసిన కవిత కానీ, "తోలు మందం" అనే కవిత గానీ, "నెత్తుటి నెమలీక" కానీ వస్తు, రూప ప్రయోగాలు. వ్యాఖ్యలు చేసే అమెరికన్ తెలుగులు నెత్తురు అనే పదం చూడగానే, పసి పిల్లల్లా భయపడుతున్నారు కాని, "నెత్తురు" అనే పదచిత్రం, పదం ఎన్ని సందర్భాల్లో ఎంత భిన్నంగా వాడానో చూడలేకపోతున్నారు.నెత్తురు అనగానే ముఖం మాడ్చుకొని కవిత్వం పక్కన పడేస్తే జాలేస్తోంది వీళ్ల మీద. "ఊరి చివర" మొహమాటాలు లేని రాజకీయ భావ ప్రకటన. అందులో రాజకీయ భావాలతో పేచీ వున్న వాళ్ళు ఇంకేమీ అనలేక కవిత్వమూ/అకవిత్వమూ/ అయోమయమూ/ లాంటి పదాల కింద దాక్కుంటున్నారు. ఇందులో గుణాత్మకమయిన మార్పు అదే. అది అర్ధం అయ్యింది కాబట్టే, కొంత మందికి ఈ మార్పుని చూడడం ఇష్టం లేదు, కనీసం కవిత్వ పాతివ్రత్యాన్ని అయినా కాపాడుకోవాలన్న పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నన్ను "అకవి" అన్నా నాకు పరవాలేదు, కాని, ఈ భావ ప్రకటనల నిజాన్ని ఎవరికి వాళ్ళు సొంత కళ్ళతో చూడగలిగితే చాలు. కవిత్వం కన్నా, అలాంటి "ప్రకటన" ఇప్పటి అవసరం అని నాకు రాను రానూ అర్ధం అవుతోంది. దానికి వ్యాసాలు రాసుకోవచ్చు కదా అని అతితెలివి పరులు కొంత మంది అనవచ్చు. కాని, కవిత్వం అనేది శుద్ధ వాదుల సొంత ఆస్తి కాదు కదా! ఇప్పుడు నేను చదివే ప్రపంచ కవిత్వం అంతా నాకు రాజకీయ కవిత్వంగానే కనిపిస్తోంది. "ప్రాణ హిత" లో తెరిచిన దర్వాజా ఆ రకం కవిత్వంలోకే.

(రెండో భాగం తరవాత...)
- ఇంటర్వ్యూ: నారాయణ స్వామి (ప్రాణహిత)
Category: 2 comments
Web Statistics