తెలుగు భాషకి కొత్త తలుపు...ఇంటర్నెట్!

కల్లూరి శ్యామల గారు డిల్లీలోని ఐ‌ఐ‌టి లో అధ్యాపకులు. తెలుగు నించి ఇటీవలి సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి విస్తృతంగా అనువదిస్తున్నారు. తెలుగు సాహిత్యంతో పాటు ప్రపంచ సాహిత్యాన్ని సునిశితంగా చదువుకున్నారు. ఈ అభిప్రాయాలు పంపినందుకు వారికి ధన్యవాదాలు.


మొదటిప్రశ్న: ఇంటర్నెట్ తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన బాగా కనిపిస్తున్న మార్పులు.

విదేశాంధ్రులు, ప్రవాసాంధ్రులు తెలుగుని ఏదో ఒకరకంగా చదవగలుగుతున్నారు. భాషతో అనుబంధం నిలబెట్టులోవాలనే ఆదుర్దా నిజానికి తెలుగు యువతరంలో చదువుకునేరోజులలో దాదాపు మృగ్యమయిందనే చెప్పాలి. స్పర్ధతో కాంపిటీషన్ నిండిన ప్రపంచీకరణ విస్తరించిన నేటి సమాజంలో, తల్లిదండ్రులకి తమ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలనే ఆదుర్దాతో ఎక్కువ అవటంవలన భాషా సాహిత్యాలపట్ల ఒక వయస్సులో అంటే దాదాపు పదోఏటనుంఛి ఇరవైరెండేళ్ళ వయస్సు వరకు దూరంగా వుంచుతున్నారు. స్వంత భాషని చదవాలనే కోరికగాని కుతూహలంగానీ నేటి యువతకి లేదు అందులో వాళ్ళ తప్పుకంటే విద్యావిధానపు లోపాలు కారణమని చెప్పవచ్చును. అయితే ఉద్యోగాల్లో సెటిలయినతర్వాత మళ్ళీ భాషతో అభిమానం పెంచుకుని ఎక్కడికక్కడ తమ స్వంత వెబ్సైట్ లద్వారానో బ్లోగింగ్ ద్వారానో మూసుకున్న తలుపుల్ని తెరుస్తున్నారని చెప్పవచ్చును. ముప్పై అయిదు సంవత్సరాలు దాటిన తర్వాత కొందరు భాషని తిరిగి స్వంతం చేసుకుని తమతమ అస్థిత్వాలని సుస్థిర పరుచుకుంటున్నారు.

రెండో ప్రశ్న:

నిజంచెప్పాలంటే తెలుగుభాషకి ముందునుంఛి నెట్జెన్స్ తక్కువ. గృహిణులు, పత్రికల పాఠకులు నగరాలలో కంటే మద్యంతరమైన పట్టణాలలో, గ్రామాలలో వున్నారు. సాహిత్యం సృష్టింపబడేదిగూడా నెట్ సంస్కృతికి దూరంగా వుండే రచయితల వలననే. చాలమంది తెలుగురచయితలకి ఈమెయిల్ని మించి, ఒక్కొక్కసారి అదికూడా లేదు, తెలుసుకోవాలనే జిఙాస లేదు. వాళ్ళ ప్రపంచం వాళ్ళ పాఠకులు వాళ్ళకి వున్నారు. కాని రాయాలని ఆకాంక్షవున్న ఎంతోమందికి నెట్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తోంది. పూర్తిగా వారైన పాఠకులు, చెదివేసంస్కృతి దీనివల్ల ప్రచారామవుతున్నాయి.

ఇది ఒకరకంగా మంచిదనే అనిపిస్తోంది. భాష సజీవంగా వుండటమేగాక తక్కిన ప్రపంచంతో ముందుకు నడుస్తోంది.

మూడో ప్రశ్న:

ఒక కొత్త సంస్కృతికి సాహిత్య అంశాలకి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కవితలు, కథలు. మిని కథలు మనంమర్చిపోయిన రచయితలు ఈ చర్చలద్వారా మళ్ళీ సజీవులవుతున్నారు. అయితే ఇందులోనుంచి బహుకాలంనిలచి వుండే సాహిత్యాన్ని గుర్తించి నెట్ అనే జాలంనుంచి పైకితీసి నిలబెట్టే మార్గాలని అన్వేషించాలి. ఎంతైనా చెయ్యటానికి అవకాశం వుంది. మన ఆంధ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగులో ఎంత ముందంజ వేశారంటే ఎన్నైనా ప్రాజక్ట్లని చేపట్టి పురాణ సాహిత్యాన్ని, నిలబడదగినదానిని, ఇప్పుడు అందుబాటులోలేని పుస్తకాలని మళ్ళీ ప్రచురించవచ్చు. నేట్ దీనికొక ఆసరా అవుతుంది.

ఇన్ని చెప్పాక ఒకవిషయం తప్పక చెప్పాలి. పుస్తకాన్ని పుస్తకంగా ఒళ్ళో పెట్టుకుని పడుకుని చెదవడలో వున్న ఆనందం నెట్ లో చదవడంలో లేదు.

email: s_kallury@hotmail.com s.kallury@gmail.com

syamala@hss.iitd.ac.in

కొత్త తరం వస్తేనే అమెరికా తెలుగుకి కొత్త వెలుగు...విష్ణుభొట్ల లక్ష్మన్న!




1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?

అమెరికా రావటం మాత్రమే కాకుండా "అమెరికా నా దేశం" అని విశ్వసించి ఇక్కడ జీవితం గడిపే అందరి తెలుగువారి జీవితాల్లో జీవితం పట్ల మార్పు వస్తుంది!
ప్రతి వ్యక్తికి కొత్తవి, గొప్పవి అయిన అనుభవాలు కలిగినప్పుడల్లా జీవితం పట్ల దృష్టి మారుతూనే ఉంటుంది. నా విషయంలో కూడా అంతే! అమెరికా రాక ముందు ఎనిమిదేళ్ళు ముంబాయిలో గడిపిన నా జీవితం కొన్ని మార్పులకు గురి కావటం ఒక అధ్యాయం అనుకుంటే అమెరికా జీవితం మరొక పెద్ద అధ్యాయం. అయితే మామూలుగా మనకి పరిచయమైన ఒక సమాజంలోని అనుభవాల వల్ల జీవితం పట్ల కలిగే మార్పుల కన్నా మరొక దేశం రావటం, పరిచయం లేని ఒక కొత్త సంస్కృతి పరిచయం కావటం వల్ల కలిగే అనుభవాలు తప్పకుండా జీవిత గమనాన్ని మారుస్తాయి. ఈ మార్పు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా ఉండొచ్చు.
రచయితకి తన రచనల్లో ప్రేరణకి జీవితమే ముడి సరుకు అయినప్పుడు అమెరికా జీవితం ఎంతో పెద్ద ముడి సరుకు. ఇది అమెరికా పెద్ద దేశం, ఒక సూపర్ పవర్ కావటం వల్లనే కాదు. ఇక్కడి జీవితం ఎంతో వైవిధ్యమైనది. అనేక సంస్కృతుల కలబోత ఇక్కడి జీవితం. నిశిత దృష్టితో చూడగలిగే వారికి చెప్పాలనుకునే విశేషాలు ఎన్నో! అందరికీ తేలికగా కనపడే వస్తుపరమైన ఇక్కడి సమాజం వెనుక పైపైకి బులబులాగ్గా కనపడని జీవితం - అందుకు సంబంధించిన ఎన్నో మానవతా విలువలు ఈ సంస్కృతిలో దాగి ఉన్నాయి. ఒక తెలుగువాడిగా ఇతర తెలుగు వారితో మాత్రమే పరిచయాలు పెంచుకొని చూస్తే అమెరికా జీవితాన్ని విశాలంగా చూడలేము. అటువంటి విశాలమైన జీవితాన్ని చూడటం కోసం నేను ప్రత్యేకంగా కొన్ని ప్రయత్నాలు చేసాను. ఆ ప్రయత్నాల వల్లే జీవితం పట్ల నా దృష్టి మారిందని నేను అనుకుంటాను.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?

మొదటి విషయం. నేను ఎక్కువగా రాసిన వ్యక్తిని కాదు. నా రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఐతే గత పాతికేళ్ళుగా అమెరికాలో గడిపిన జీవితం వల్ల నా అనుభవాలు అమెరికన్ తెలుగు మిత్రుల అనుభవాల్లాగే వైవిధ్యం ఉన్నవి. అందుకు తోడు అమెరికా నుంచి మూడేళ్ళ కోసం వృత్తి రీత్యా కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ బదిలీ అవటం వల్ల పాశ్చాత్య జీవితాన్ని కొంచెం లోతుగా చూసే అవకాశం వచ్చింది. అవి నా రచనల్లో ఒకటీ, రెండు చోట్ల అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేసాను.

మొదటి ఉదాహరణ: ఈ ఆలోచనలతో మిత్రులతో కలిసి పన్నెండేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ-పత్రిక "ఈమాట". ఈ ఈ-పత్రిక ఒక ధ్యేయం అమెరికాలో తెలుగు రచయితలు ఇక్కడి జీవితంపై తమ అభిప్రాయాలను సాహిత్యపరంగా ఎలా ప్రకటిస్తారో తెలుసుకోవాలన్న తపన. ఈ విషయమై నేను స్వయంగా ఎక్కువ రచనలు చెయ్యకపోవచ్చు కాని, నా మిత్రులతో పాటు నా ఉత్సాహం మాత్రం ఈ దిశలోనే ఉండేది. ఉంది. అప్పుడప్పుడు నేను రాసిన కొన్ని ఈమాటలోని నా రచనలు ఈ అంశాన్ని స్పృశించాయనే అనుకొంటున్నా.

రెండవ ఉదాహరణ: "నా ఫ్రాన్స్ అనుభవాలు" అన్న పేరుతో కొంచెం విపులంగానే నా ఒక్క అనుభవాలే కాక నా భార్యా పిల్లలు కలిపి పొందిన అనుభవాలను అమెరికాలో ఒక వెబ్ పత్రికలో ప్రచురించారు. కొన్ని మార్పులతో అవే అనుభవాలను "ఆల్ప్స్ అంచున మూడేళ్ళు" అన్న పేరుతో ఆంధ్రాలో ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించబడ్దది. ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే అంధ్రదేశంలో పుట్టి పెరిగిన నా వంటి ఒక తెలుగువాడు ఇరవై సంవత్సరాలు అమెరికాలో జీవితం గడిపి ఫ్రాన్స్ లో ఉన్న జీవితాన్ని ఎలా చూస్తాడో తెలుగులో చెప్ప ప్రయత్నించాను. చిత్రమైన విషయం ఏమిటంటే అమెరికా జీవితపు మూలాలు నాకు నా ఫ్రాన్స్ జీవితంలో అనుభవం అవటం ఎక్కువైంది. ఇవి చదువుదామనుకున్న వారు ఈ లింక్ నొక్కండి.
(http://www.eemaata.com/em/issues/200709/1142.html?allinonepage=1).

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి?

నేను ఆంధ్రాలో ఉండగా ఏమీ రచనలు చెయ్యలేదు. కాకపోతే అక్కడ విసృతంగా పుస్తకాలు చదివేవాడిని. ఇతరులతో చర్చించేవాడిని. నిజానికి అమెరికా వచ్చాకే తెలుగులో రాయాలని (వేరే భాషలు, సంస్కృతుల పరిచయాలు కలిగినప్పుడు వారు తమ తమ భాషలను, సంస్కృతులను నిలుపుకోటానికి చేసే ప్రయత్నాలు నాకు ఈ దిశగా ప్రేరకాలు) బలమైన కోరిక మొదలైంది.
23 ఏళ్ళ వయస్సులో ఆంధ్రదేశాన్ని వదలటం జరిగింది. అప్పటి దాకా చదువులు, పరీక్షలతోనే కాలం సరిపోయింది. సాహిత్యం పట్ల మక్కువ ఉన్నా రచనా వ్యాసాంగాన్ని మాత్రం మొదలెట్టలేదు. అసలు తెలుగులో రాయాలని అప్పట్లో నాకు అనిపించలేదు. తెలుగు భాష విలువ కూడా అప్పటి వరకు అందరి కుర్రకారు లాగే నాకూ తెలియ లేదు.

4. అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి?

అమెరికా జీవితాన్ని తెలుపుతూ వచ్చే రచనలు చెయ్యాలని ఒక పెద్ద తాపత్రయం. అందుకు ఒక ముఖ్య కారణం ఇప్పటి వరకూ ఈ విషయంలొ చెప్పుకో తగ్గ రచనలు రాసిలోనూ వాసిలోనూ రాలేదనే చెప్పాలి. అలా అని ఈ దిశగా పెద్ద ప్రయత్నాలు జరగలేదని కాదు. అయినా తగినంతగా అమెరికా తెలుగు సాహిత్యం పెరగలేదనే చెప్పాలి. అంతో, ఇంతో రాయగలిగిన వ్యక్తులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎక్కువగా యువ రచయితలు, రచయిత్రులు కనపట్టం లేదు. ఎప్పుడైనా సాహితీ సదస్సులకి వెడితే కనపడేవి తెలిసిన ఈ కొన్ని మొహాలు మాత్రమే!

అసలు ప్రశ్న! అమెరికా తెలుగు రచయిత ఎవరు? అమెరికాలో ఉండి ఏ విషయం మీద అయినా తెలుగులో రచనలు చేసేవారు అని అర్ధం చెప్పుకుంటే భవిష్యత్తు గురించి నా అలోచనలు ఇలా
ఉన్నాయి. అమెరికాలో తెలుగులో రచనలు చేస్తున్నవారు రెండు రకాలు. చాలా కాలం క్రితమే, అంటే
దాదాపు పదేళ్ళ క్రితమే, అమెరికా వలస వచ్చి కుటుంబంగా ఇక్కడ స్థిరపడిన తెలుగు
రచయితలు చాలా కాలంగా తెలుగులో రచనలు చేస్తున్నారు. వీరి సంఖ్య ఎక్కువ లేకపోయినా (నా
ఉద్దేశ్యంలో వీరి సంఖ్య 30, 40 కి మించదు) క్రమం తప్పకుండా వీరి రచనలు ఈ-పత్రికలు,
బ్లాగులు మాత్రమే కాక అచ్చు మాధ్యమంలో ప్రచురించబడే సావనీర్లు, అమెరికా తెలుగు
సాంస్కృతిక సంఘాల ప్రచురణల్లో కనపడతాయి. ఇక రెండో వర్గం కొత్తగా వలస వచ్చిన,
వస్తున్న యువతరం. వీరిలో కొన్ని పేర్లు నాకు పరిచయమైనా వీరి సంఖ్య ఎక్కువగా
ఉన్నట్టు తోచదు. నిజానికి అమెరికా తెలుగు రచయితల భవిష్యత్తు నిర్ణయించేది ఈ 20, 30
సంవత్సరాల వయస్సులో ఉన్న ఈ యువతరం మాత్రమే. వీరి ఆలోచనలు పాతతరం కన్న కొత్తగా
ఉండటమే కాకుండా పాతతరం అలవాటు పడ్డ ధోరణి మూసలోంచి బయటకు లాగగలిగే శక్తి
ఉన్నది ఈ యువతరానికి. వ్యక్తిగా, ఒక తెలుగు రచయితగా ఈ యువతని ప్రోత్సాహపరిస్తే భవిష్యత్తు బాగుంటుంది అని తోస్తుంది నాకు.
మరి ఇది సాధించటం ఎలా? సాహిత్య సభల వల్ల, సత్కారాల వల్ల ఇది సాధ్యం అవుతుందని నేను అనుకోను. అలాగే ఈ-పత్రికలు, బ్లాగులు మొదలైన అంతర్జాల మాధ్యమాలు ఇందుకు సాయపడచ్చేమో గాని ఈ విషయంలో దిశానిర్ధారణ చేయ్యగలవని నేను అనుకోను. ఈ విషయంలో మిత్రుల ఆలోచనలు, సూచనలు తెలుసుకోటం మంచిది.

అమెరికా తెలుగు పండగ..."ఇండియానా"నా? ఇండియానా?


(ప్రముఖ డాక్టర్ ఉమా ఇయుణ్ణి సమగ్ర రచనల ఆవిష్కరణ - ఫొటో సౌజన్యం: న.చ.కి)

కొత్త ప్రదేశాలు కొత్త పరిచయాల్లాంటివి

కొత్త పరిచయాలు కొత్త ప్రదేశాల్లాంటివి.

ఆకాశ వీధుల్లోంచి ఇండియానా పొలిస్ ని చూడగానే ఆ చెట్ల మీద అన్నేసి రంగులు చూసి భలే ముచ్చటేసింది!
అంతకు మించి గొప్ప సాహిత్య వాతావరణమేమీ వుండకపోవచ్చు లే అనుకున్నాను అక్కడి ఎయిర్పోర్టు లో దిగగానే! కానీ, రెండు రోజులపాటు చాలా ఉత్సాహంగా జరిగాయి ఈ సాహిత్య సభలు. వంగూరి ఫౌండేషన్, గ్రేట్ ఇండియానా పొలీస్ తెలుగు అసోసియేషన్ (గీత) వారు చేసిన ఏర్పాట్లు, అతిధి మర్యాదలు, సందడి ఒక కుటుంబ పండగలాగా అనిపించాయి. సాహిత్య సభలు ఇలాగే కనువిందుగా, మన్ పసందుగా, వీనుల విందుగా జరిగితే వాటికి ప్రేక్షకుల కరవు అనే సమస్యే వుండదు.


వ్యక్తిగతంగా నాకు - యార్లగడ్డ ప్రసంగం వినడం ఇదే మొదటి సారి.అక్కిరాజు సుందరరామకృష్ణ గారి తెంగ్లీషు పద్యాలు ఇంకా చెవుల్లో రింగుమంటున్నాయి. బీయెస్ రాములుని చాలా కాలం తరవాత చూడడం బాగుంది. నచకీనీ, కాలాస్త్రిని కలవడం గొప్ప అనుభవం. వాళ్ళిద్దరితోనూ సన్నిహితంగా గడపడం బాగుంది. ఇక బ్లాగులోనో, ఏమైలులోనో, ఫోనులోనో తప్ప ముఖాముఖీ చూడని "కొత్త పాళీ" నారాయణ స్వామి తో కలవడం, కబుర్లూ, జోకులూ బాగున్నాయి. సాహిత్యమే కాకుండా సామాజిక రంగంలోనూ యెమయినా చేయాలన్న తపన వున్న ఉమా ఇయున్ని, అమెరికా ఇల్లాలి ముచ్చట్లు చెప్పిన శ్యామల దశిక, క్రైస్తవ కీర్తనల గురించి సుధా నిట్టల గార్ల సాహిత్య కృషిని తెలుసుకోవడం బాగుంది. ఒక మౌనిలా వుంటూనే తన ఆహ్లాదకరమయిన వ్యక్తిత్వంతో "భలే" అనిపించిన పప్పు రామారావు గారిని కలవడం బాగుంది. శొంఠి శారదా పూర్ణ, మంధా భానుమతి గారు రామారావు గారి సతీమణి సూర్యకాంతం గారిని తలచుకోవడం బాగుంది. సూర్యకాంతం గారి కథ గుర్తొచ్చి ఇప్పటికీ నవ్వొస్తుంది.

ద్వాదశి శర్మగారు సభా నిర్వహణలో హెడ్మాస్టర్ లాగా అనిపిస్తూనే, కడుపుబ్బ నవ్వించారు.

శివప్రసాద్ కుంపట్ల గారు వెయ్యేళ్ల సాహిత్య చరిత్రని నాలుగేసి పాదాల పద్యాలలోకి కుదించారు.

దేవరాజు మోహన్ గారు రాజునీ రాణినీ కాదు కాదంటూనే నవ్వుల పూలు రువ్వారు. వంశీ రామరాజు కొన్ని కొత్త మెళకువలు నేర్పే ప్రయత్నం చేశారు.

ఇక మా టెక్సాస్ నివాసి వంగూరి చిట్టెన్ రాజు సంగతి చెప్పకరలేదు. నోరు విప్పితే జోకు! కామేశ్వర రావు, సురేఖల పాటల సంగతి చెప్పేదేముంది?

మొత్తం మీద సభల్లో జరిగిన హడావుడి చూస్తే, ప్రసంగాలు వింటే తెలుగు సాహిత్యంలో అంతర్జాల వాదం వొకటి రాబోతోందా అన్న సందేహ బాధ మొదలయ్యింది. అందరూ అంతర్జాలం గురించి, బ్లాగుల గురించి విపరీతమయిన ఆసక్తి చూపించారు. త్వరలో కొన్ని కొత్త బ్లాగులకి నాంది జరిగినా ఆశ్చర్యం లేదు. అంతర్జాలం వొక ఇంద్ర జాలం అన్నారు ఉమ గారు. కాదు మాయాజాలం అన్నారు ఇంకెవరో! సాలెగూడు అన్నారు నాసీ. కాదు, కాదు "మార్జాలమ్" అన్నారు శివప్రసాద్!

నిర్వాహకులు చింతల రాము, అజయ్ పొనుగోటి, శేఖర్ కృష్ణమనేని, వినోద్ సాధు సరదాగా అటూ ఇటూ తిరుగుతూనే చాలా పనులు చక్కదిద్దారు. కవులనీ రచయితలనీ నిజంగానే కంటికి రెప్పల్లా చూసుకున్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, అద్భుతమయిన టిఫినీలు, తెలుగు భోజనాలూ పెట్టారు.

ఈ సాహిత్య ఉత్సవాన్ని గురించి కొత్త పాళీ, కాలాస్త్రి, న.చ.కి మరిన్ని కబుర్లు రాయబోతున్నారు, కనుక వాటి కోసం నేనూ ఎదురుచూస్తున్నా.

తా.క: దేవరాజు మోహన్ గారు ఇచ్చిన వేటూరి పాటల సీడీ వింటూ ఈ కబుర్లు మీకు రాస్తున్నా.

సైన్సుకీ మనసుకీ మధ్య లోలకం లక్ష్మన్న!

ఈ గురువారం విష్ణుభొట్ల లక్ష్మన్న 'ప్రముఖా"ముఖి

పూర్తిపేరు: విష్ణుభొట్ల లక్ష్మన్న
ఇతరపేర్లు: లక్కీ విష్ణుభొట్ల
సొంత ఊరు: సరిపెల్ల గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం: 1013 Ogden Drive, ఆష్టిన్, టెక్సాస్ - 78733, USA
వృత్తి: రిసెర్చ్ సైంటిష్ట్
ఇష్టమైన రచయితలు: శ్రీపాద, కొ.కు., కాళీపట్నం, రావి. శాస్త్రి, విశ్వనాథ
హాబీలు: శాస్త్రీయ - లలిత సంగీతం, నాటకాలు వేయడం, టెన్నిస్ ఆడటం, తోటపని, పుస్తక పఠనం
E-mail: Lark_Vishnubhotla@yahoo.com


సాహిత్య, కళా విమర్శకులు సైంటిస్టుల్లా పని చేయాలని అనుకుంటాను నేను. సాహిత్య కళా విమర్శని వొక బాధ్యతగా తీసుకొని,రచనని మనః ప్రయోగశాలలో అనేక విధాలుగా పరీక్షించి, ఒక హేతుబద్ధమయిన బేరీజు వెయ్యాల్సిన అవసరం ఇప్పుడు వుంది. సరయిన సాధనాలలో నేర్పు సాధించుకొని, తగిన అవగాహన తో రచనని "లోనారసి" చూడడం వొక విద్య. ఇతర రంగాలలో - ముఖ్యంగా సైన్సు రంగాలలో- పనిచేస్తున్న వారు సాహిత్యం గురించో, సినిమాల గురించో, కళల గురించో రాస్తే అందులో ఒక నిర్దిష్టతా, కచ్చితత్వం, సూటి దనం, స్పష్టతా కనిపిస్తాయి. విష్ణు భొట్ల లక్ష్మన్న గారు అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.

వృత్తి రీత్యా ఆయన సెమీకండక్టర్స్‌ లో పరిశోధనా విభాగంలో, ఆష్టిన్‌లో ఉన్న "ఫ్రీస్కేల్ సెమీకండక్టర్స్" లో ప్రస్తుతం పని చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని "సరిపెల్ల" గ్రామంలో కవలల్లో (రామన్న – లక్ష్మన్న) ఒకరుగా జన్మించారు. ప్రాథమిక విద్య, కొంత వరకు కాలేజీ చదువు ఆంధ్రాలోనే చేసారు. తరవాత, ఐ. ఐ. టి. ముంబైలో ఇంజినీరింగ్ చదువు పూర్తి అయిన తరువాత, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో భౌతికశాస్త్రంలో పి. హెచ్. డి పూర్తి చేసారు.

రిసెర్చ్‌ లో చాలా ఇష్టం ఉన్న లక్ష్మన్నగారి అమెరికా జీవితం యేల్ విశ్వవిద్యాలయంలో రిసెర్చ్ సైంటిష్టుగా 1988 సంవత్సరంలో మొదలయ్యింది. సెమీకండక్టర్ పరిశ్రమలో పనిచేయటానికి 1994 సంవత్సరంలో డాలాస్ రావటం, అక్కడ తెలుగు సంఘంలో చేరి 1998 సంవత్సరంలో డాలాస్ వదిలి ఆష్టిన్ వెళ్ళేదాకా చురుగ్గా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

ఆష్టిన్ వెళ్ళిన తరవాత తెలుగు సాహిత్యంపై ఇష్టం, పరిచయం ఉన్న మిత్రులతో కలిసి "ఈమాట" అన్న పేరుతో ఒక వెబ్ మాగజైన్ ప్రారంభించారు. ఇప్పటికీ "ఈమాట" కోసం రచనలు చేస్తూనే ఉన్నారు. 2002 సంవత్సరంలో అప్పటి మోటొరోలా కంపెనీలో పనిచేస్తూ, అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్ తయారీకి కావలసిన పరిశోధన కోసం ఫ్రాన్స్‌ లో మూడేళ్ళు పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.

అంతో ఇంతో రాయటం వచ్చిన ప్రవాసాంధ్రులు అందరూ తప్పకుండా రాయాలని వీరి అభిప్రాయం.


విష్ణుభొట్ల లక్ష్మన్న రచనల సూచిక:

1. ఓడలో ఏడు రోజుల కార్నివల్, ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 20 - 2009, ఆదివారం అనుబంధం http://www.andhrajy othy.com/ sunday/sundaysho w.asp?qry= 2009/20-9/ travel
2. గుర్రం జాషువా పాపాయి పద్యాలు, ఈమాట, సెప్టెంబర్ 2009 http://www.eemaata.com/em/issues/200909/1464.html
3. హాయి హాయిగా ఆమని సాగే, ఈమాట, జూలై 2009
http://www.eemaata.com/em/issues/200907/1441.html

4. ‘అపు సంసార్ ‘ - సత్యజిత్ రాయ్ సినిమా మార్చి 2009 » వ్యాసాలు http://www.eemaata.com/em/issues/200903/1411.html?allinonepage=1
5. ‘అపరాజితో’ - సత్యజిత్ రాయ్ సినిమా జనవరి 2009 » వ్యాసాలు
http://www.eemaata.com/em/issues/200901/1390.html?allinonepage=1

6. రహదారి పాట - “పథేర్ పాంచాలి” సత్యజిత్ రాయ్ సినిమా "ఈమాట" నవంబర్ 2008 » వ్యాసాలు
7. ఒంటరి గృహిణి - “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా "ఈమాట" మే 2008 » వ్యాసాలు
8. ఏది నిజం? - “రషోమాన్” జాపనీస్ సినిమా "ఈమాట" మార్చి 2008 » వ్యాసాలు
9. ఎందుకు రాయాలో అందుకే చదవాలి "ఈమాట" జనవరి 2008 » వ్యాసాలు
10. రొసెట్టా రాయి కథ - వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష
"ఈమాట" నవంబర్ 2007 » వ్యాసాలు
11. మా ఫ్రాన్స్ అనుభవాలు "ఈమాట" సెప్టెంబర్ 2007 » వ్యాసాలు
12. మా ఈజిప్ట్ యాత్ర "ఈమాట" జూలై 2006 » వ్యాసాలు
13. కథాశిల్పం "ఈమాట" మార్చి 2006 » వ్యాసాలు
14. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? "ఈమాట" జూలై 2001 » వ్యాసాలు
15. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి "ఈమాట" మే 2001 » వ్యాసాలు
16. మీ ఘంటసాల "ఈమాట" మే 2001 » సమీక్షలు
17. రాగలహరి: హిందోళం "ఈమాట" మార్చి 2001 » వ్యాసాలు
18. రాగలహరి: కల్యాణి "ఈమాట" జనవరి 2001 » వ్యాసాలు
19. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు "ఈమాట" నవంబర్ 2000 » వ్యాసాలు
20. రాగలహరి: సింధుభైరవి "ఈమాట" నవంబర్ 2000 » వ్యాసాలు
21. రాగలహరి: అభేరి "ఈమాట" జూలై 2000 » వ్యాసాలు
22. రాగలహరి: మోహనం "ఈమాట" మే 2000 » వ్యాసాలు
23. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి "ఈమాట" నవంబర్ 1999 » వ్యాసాలు
24. ఘంటసాల - బాలసుబ్రహ్మణ్యం "ఈమాట" నవంబర్ 1999 » వ్యాసాలు
25. ఆల్ప్స్ అంచున మూడేళ్ళు, "ఆంధ్రజ్యోతి", ఆదివారం అనుబంధం, అక్టోబర్ 14, 2007
26. రొసెట్టారాయి - చచ్చి బతికిన ఓ రాయి కథ, "ఆంధ్రజ్యోతి", ఆదివారం అనుబంధం, డిసెంబర్ 23, 2007

తెలుగుకి వలసొచ్చిన ఓ గుజరాతీ!



దావిన్ పటేల్ మొదటి సారి తెలుగు క్లాస్ కి వచ్చినప్పుడు అది మూన్నాళ్ల ముచ్చటే అనుకున్నాను నేను.
రెండో రోజు నేను క్లాస్ లోకి అడుగుపెట్టేసరికి, అతనితో పాటు ఇంకో నలుగురు ఉత్తర భారతీయులు, వొక పాకిస్తానీ తెలుగు క్లాస్ లో కూర్చొని వున్నారు. నేను రాగానే వాళ్ళు నా దగ్గిరకి వచ్చి, "దావిన్ చెప్పాడు క్లాస్ చాలా బాగుందని! మేము తెలుగు తీసుకుంటాం. మాకు అనుమతివ్వండి" అని అడిగారు. "ఒక వారం చూద్దాం" అన్నాన్నేను. అలా వచ్చిన ఆ అయిదుగురు ఉత్తరాది వాళ్ళూ , వొక పాకిస్తానీ అబ్బాయీ ఇవాళ రెండో సంవత్సరం క్లాస్ దాకా తెలుగుని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మూడో సంవత్సరం తెలుగు పెట్టండి, మేము తీసుకుంటాం అని మా ఛైర్మన్ కి వాళ్ళే పిటిషన్ పెట్టే దాకా వెళ్లారు.

ఆస్టిన్ తెలుగు క్లాస్ లో తెల్ల వాళ్ళు వుండడం ఆశ్చర్యం కాదు. కానీ, ఉత్తరాది వాళ్ళు వచ్చి తెలుగు తీసుకుంటూ, తెలుగు భాష మీద ప్రేమ పెంచుకోవడం అన్నది ఆస్టిన్ లో దావిన్ తోనే మొదలయ్యింది. ఇంతా చేస్తే, దావిన్ కి కనీసం ఓ తెలుగు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు! కానీ, తెలుగు మీద అతను ఎంత ఇష్టం పెంచుకున్నాడంటే, ఇంట్లో అమ్మతో మాట్లాడుతున్నప్పుడు గుజరాతీ మాటల మధ్య తెలుగు మాటలు వచ్చేస్తున్నాయట!

దావిన్ ఇవాళ టెక్సాస్ యూనివర్సిటీ కాంపస్ లో చాలా మందికి వొక మోడల్ గా మారాడు. అతనూ, అతని మిత్రులు కాంపస్ లో దాదాపు వొక తెలుగు ఉద్యమమే నడుపుతున్నారు. కాంపస్ లో తెలుగు భాషా దినోత్సవం , తెలుగు సినిమా పండగ లాంటివి ఇవాళ దావిన్ అతని మిత్రులు ముందుండి చేస్తున్నారు.

ఉత్తర భారతం, అమెరికన్ విద్యార్ధులలో తెలుగు పట్ల పెరుగుతున్న ఈ ఆసక్తిని గమనించిన శాన్ ఆంటోనియో తెలుగు సమితి సభ్యులు, ముఖ్యంగా గోవింద రాజు మాధవ రావు గారు తెలుగేతర తెలుగు విద్యార్ధులకి మనం వొక అవార్డు ఇస్తే బాగుంటుందని సంకల్పించారు. 250 డాలర్ల ఈ అవార్డు, ఉత్తమ తెలుగు విద్యార్థి అవార్డు దావిన్ కే ఇవ్వాలని తెలుగు విద్యార్ధులంతా ముక్తకంఠంతో వోటేశారు.

ఉత్తమ తెలుగు విద్యార్ధి దావిన్ కి ఈ అవార్డు ఈ నెల 30 న శాన్ ఆంటోనియో లో జరిగే దసరా ఉత్సవాల్లో ప్రదానం చేస్తున్నారు.

దావిన్ పటేల్ కి అభినందనలు!

కాంపస్ లో విదేశీ విద్యార్థులకు దావిన్ పటేల్ రాసిన లేఖ ఇది!

Telugu is not just for Telugus!

Being Gujarati, I honestly didn't know the first thing about the Telugu language before coming to UT. My major requires four years proficiency of a foreign language and a friend recommended Telugu, so I decided to try it out. From the first day in class, I knew I made the right decision. Learning a new alphabet and language has been challenging, but also extremely rewarding. Professor Afsar has created a great learning environment that isn't like any other traditional, lecture-based class. I don't even feel like I'm going to class, it's more of a discussion where I've been able to create bonds with many of my classmates through conversation. We are encouraged to leave English at the door and converse in Telugu, and through various exercises, my confidence in speaking a foreign tongue has increased so much.This carries over to outside of the classroom as well. I have participated in events like Telugu Culture Day, where I've been able to apply what I've learned in class. Our class also made a trip to Madras Pavillion to experience South Indian Cuisine. Activities like these reinforce the Telugu culture that I've learned about. In just the past couple of semesters, I've seen the growth in the program at UT firsthand, and I hope to help continue its progress. Just like first year Telugu isn't just another class, Afsar gaaru isn't just another professor. In my 2+ years of college, I've never had a professor that is more attentive to his students needs or cares more about our progress. He welcomes new students and makes the class enjoyable for all. His passion about the language and culture is visible in every single class and he instills this passion in all of his students. Afsar gaaru makes me excited to learn and there is no way I could have come this far without him. I still have a long way to go in becoming fluent, and I know that Professor Afsar and the UT Telugu program will help me get there.

అమెరికా తెలుగుదనం నేర్పిన పాఠాలే నా రచనలు: "కొత్త పాళీ" నారాయణస్వామి




“అమెరికా వచ్చాకే నాకు ఇండియా అర్ధమయింది” అంటారు ఏకె రామానుజన్ వొక సందర్భంలో! చిత్రకారుడు చిత్ర రచన చేస్తున్నప్పుడు వొక దృశ్యం గీశాక, వొకడుగు వెనక్కి వేసి సాలోచనగా తన బొమ్మ వైపు పరికిస్తాడు. వొక దూరాన్ని వూహించుకొని తనని తాను “ఆబ్జెక్టివ్” గా చూసుకుంటాడు. రామానుజన్ చేబ్తోంది కూడా అదే! ఎంతో కొంత దూరం అయితే తప్ప/ దేనికీ దగ్గిర కాలేమని నేను వొక కవితలో రాసినట్టు గుర్తు. ఆ దూరం అనుభవంలోకి వచ్చి కలం పట్టిన రచయిత నారాయణ స్వామి. “రంగుటద్దాల కిటికీ” ఆయన తాజా పుస్తకమే కావచ్చు, కానీ, రచయితగా నారాయణస్వామి అనేక సంవత్సరాలుగా పాఠకులకి సుపరిచితులే. “తుపాకి” నారాయణస్వామి గా కూడా ఆయన ప్రసిద్ధుడు. రాత కన్నా ఎక్కువ చదువు, చదువు కన్నా ఎక్కువ పరిశీలనా, పరిశీలన కన్నా ఎక్కువ అవగాహనా, అవగాహన కన్నా ఎక్కువ చురుకుదనమూ ...అన్నీ వెరసి నారాయణ స్వామి! మిత్రులకి “నాసి”, బ్లాగ్మిత్రులకి “కొత్త పాళీ”, సాహిత్య మిత్రులకి నారాయణ స్వామి..ఏ పేరున పిలిచినా అది వొక్కటే రూపం! నచ్చినా నచ్చకపోయినా వెంటనే స్పందించే సహృదయం...నిరాశలో ఆశనీ, దురాశలో దుఖాన్నీ తలపించే స్నేహం...బతుకు తీపీ, కష్టాల వగరూ, ఆలోచన విగరూ ... అన్నిటికీ మధ్య వొక సమతూకాన్నీ సాధించాలన్న తపన నారాయణస్వామి! సంగీత సాహిత్య నృత్య సమలంకృత ప్రతిభ.... ఆయన సొంతం! ఇటీవల “పాలపిట్ట” మాసపత్రికలో “ఆవలి తీరం” శీర్షిక కింద అమెరికా తెలుగు అనుభవాలని రికార్డు చేస్తున్న రన్నింగ్ కామెంటేటర్ ఆయన.




1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
కచ్చితంగా. అసలు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడినదే అమెరికా వచ్చినాక అనుకుంటాను. వరంగల్లో కాలేజి చదువుమూలంగా నా ఆలోచనలకి కొంత ఎరుపు రంగు అంటుకుంది. సాహిత్యం వల్ల కేవలం వినోదమేకాక, అంతకు మించిన ప్రయోజనం కూడా ఉంటుంది అనే ఆలోచన పరిచయమయింది. కానీ విస్తృతంగా చదవడం మొదలు పెట్టింది అమెరికా వచ్చినాకనే. ఆ లెక్కన, ఆంగ్ల సాహిత్యాన్నీ, ప్రపంచ సాహిత్యాన్నీ, తెలుగు సాహిత్యాన్నీ ఒక్కమాటే చదివాను నేను. సాహిత్యంలో ప్రపంచాన్ని చూడ్డం, ప్రపంచంలో సాహిత్యపు ముద్రలు చూడ్డం అమెరికా జీవితంలోనే అలవాటయింది నాకు. అమెరికా వచ్చేదాకా అసలు నాకు జీవితంపట్ల ఒక అవగాహన కానీ ఒక దృక్పథంగానీ ఏర్పడిన గుర్తులేదు. ఈ విషయంలో అమెరికా ఏదో పెద్ద దోహదం చేసిందని కాదు నా ఉద్దేశం. కొత్త దేశంలో కొత్తతరహా జీవితం మొదలయేప్పటికి కొన్ని కొన్ని అనుభవాలు, తద్వారా నేర్చుకున్న గుణపాఠాలు తప్పనిసరి. అటుపైన, విశ్వవిద్యాలయ వాతావరణంలో, liberal intellectualsతో ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు గడించినవారితో సుదీర్ఘ స్నేహాలు నా ఆలోచనా పరిధిని చాలా విస్తృతం చేశాయి.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
తుపాకి, ఇండియన్ వేల్యూస్, వీరిగాడి వలస, లోకస్ట్వాక్ కార్నర్లో - ఈ నాలుగు కథల్లో అమెరికను ఇమిగ్రంటు జీవితాల్లోని నాలుగు విభిన్న కోణాల్ని చిత్రించగలిగానని అనుకూంటున్నాను. నా కథల్ని గురించి విడిగా మాట్లాడ్డం, రాయడం నాకు ఇష్టం ఉండదు. చెప్పాల్సిన విషయమేదో కథలోనే ఉంది అని నా ఉద్దేశం. మనల్ని మనం సాధారణంగా ఏదో ఒక పరిధిలో నిర్వచించుకుంటూ ఉంటాం. మనిషి తనని కట్టిపడేసి ఉంచే పరిధుల్ని అధిగమించాలని ఒక రచయితగా నా ఆశ. అమెరికాలో జరిగినట్టు రాసిన నా కథల్లో ఇటువంటి పురోగమనాన్ని చిత్రించడానికి ప్రయత్నించాను. వీరిగాడి వలస కథలో ప్రధానపాత్ర రాఘవరావు సుమారు అరవయ్యేళ్ళ వాడు, రిటైరైనాడు, భార్య మరణించింది, అమెరికాలో కొడుకూ కోడలు దగ్గర వచ్చి ఉన్నాడు. ఆయన ఆలోచనలు కానీ, తీరుతెన్నులు కానీ సాధారణ భారతీయ తండ్రుల్లా ఉండవు. ఈ మధ్య రాసిన నీవేనా ననుతలచినది కథలో సహాయపాత్రగా ఉన్న మాధవి - కథానాయకుడు తేజా తల్లి - ఈమెకూడా విలక్షణమైన పాత్ర. సాధారణంగా అమెరికను భారతీయకథల్లో కనిపించే భారతీయ తల్లిలా ఉండదు. ఇలా, కథల్లో పాత్రలూ ఇతివృత్తాలూ భారతీయమే అయినా, కొన్ని కోణాల్లో ఆ పరిధినిదాటిన ఒక ఔన్నత్యాన్ని చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నాను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
అమెరికా రాకముందు నేను రచనలు చెయ్యలేదు. అసలు అమెరికా రాకపోతే రాయాలి అనే ఆలోచన నాకు బలంగా తోచి ఉండకపోవచ్చు. అంటే అదేదో అమెరికా గొప్పతనం కాదు, మాతృభూమిని, సుపరిచితమైన భాషనీ సంస్కృతినీ వదిలి వచ్చిన ఒక వలస ఫీలింగ్. ఆంధ్ర వదిలి కాన్పూరులో ఉండగా మొదటిసారి ఈ రచన తృష్ణ కలిగింది. అమెరికా వచ్చాక అది కచ్చితంగా తీరనిదాహంగా పరిణమించింది.

4. అమెరికా వచ్చాక మీ మొదటి రచన ఏది? దాని నేపధ్యం కొంచెం చెప్పండి.
నేను రాసిన మొదటి కథ "ఓరి భగవంతుడా" - ఇది అమెరికా వచ్చినాక రాసినదే. కానీ ఇందులో అమెరికా నేపథ్యం ఏమీలేదు. ఈ కథ ఇండియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జరుగుతుంది. కొకు కథల మత్తులో, ముఖ్యంగా ప్రేమించిన మనిషి అనే పెద్ద కథ చదివిన మత్తులో రాశాను దీన్ని. ఒక మధ్యతరగతి యువకుడు (పదహారు పదిహేడేళ్ళ వాడు) తనని ఆకర్షించిన ఇద్దరు అమ్మాయిల పట్ల - ఒకామె తన ఆర్ధిక స్థాయికి చెందిన పొరుగింటి వారమ్మాయి, రెండో ఆమె తన ఇంట్లో పని మనిషి - విభిన్నంగా ఎట్లా ప్రవర్తిస్తాడు అనే ప్రశ్న ఈ కథకి కీలకం. పరుగుపందెంలో పాల్గొనబోయే ముందు కండరాల్ని సాగదీసుకున్నట్టు, నా రచనాశక్తిని సాగదీసుకోడానికి ఈ కథ రాశానని అనుకోవచ్చు.
నే రాసిన రెండో కథ తుపాకి. దాన్ని గురించి ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం.


5. డయాస్పోరా సాహిత్యాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు డయాస్పోరా సాహిత్యం అంటూ వుందనుకుంటున్నారా?
ఇది ఒక్క పేరాలో ఇమిడే ప్రశ్న కాదు. కానీ అడిగినందుకు నెనర్లు. దీనికి ఇంకా విపులంగా సమాధానమివ్వాలని ఉంది. రాస్తాను త్వరలో. టూకీగా కొన్ని మాటలు: తెలుగు వల్సవారు రాసినదంతా డయాస్పోరా సాహిత్యమే. కాదని ఎవరూ అనలేరు. అందులో కొన్ని విషయాలే ఎక్కువగా ఉన్నాయి, మిగతా విషయాలు లేవూ అంటే - అంతే మరి, మన వలసవారికి ఆ విషయాలే ఇప్పటికీ ఇంకా ముఖ్యమైన విషయాల్లాగా కనిపిస్తున్నాయి అన్న మాట - మాతృదేశాన్ని గురించి నాస్టాల్జియా, నివాసం ఉన్న దేశ సంస్కృతిని గురించి కొంచెం ఎగతాళి, లేదా ఇదే గొప్పది అనుకునే ఒక అభిమానం, పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, రెండు సంస్కృతుల భేదాలు - ఇంకా ఇల్లాంటివి .. ప్రస్తుతానికి ఇంకా ఇవే మనవారికి ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఇతివృత్తాలు. అందుకే అవే మన సాహిత్యాన్ని నింపుతున్నాయి. ఈ విషయాలకి పరిమితమైనందువల్ల మనవాళ్ళు రాస్తున్నది డయాస్పోరా సాహిత్యం కాదు అనే వాదనకి అర్ధం లేదు. ఈ సాహిత్యం కొత్త పుంతలు తొక్కాలి అంటే వలస సామాజిక స్పృహలో కొత్త ప్రశ్నలు ఉదయించాలి, దానికి కొత్త అనుభవాలు రావాలి - ఉదా. ఒక తెలుగు కుటుంబపు అబ్బాయి ఇరాకులోనో ఆఫ్ఘనిస్తానులోనో సైనికుడిగా పనిచేస్తే? తమాషాగా, ఈ విషయంలో నిజజీవిత అనుభవాలకంటే సాహిత్యం వెనకబడి ఉన్నదని నా అనుమానం.

6. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
అమెరికను - ఇండియను అనే లేబుల్సుని అధిగమించి ఒక విశ్వమానవుడి ప్రతీకతో రచనలు చెయ్యాలని ఆశ. దానికి ముందు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో భారతీయ వలససమాజం ఎలా మసలుతున్నదో అని విపరీతమైన ఆసక్తి. దాన్ని కొంతవరకైనా నా రచనలో పట్టుకోవాలని పట్టుదల.

సిద్ధార్థ తెలుగు ప్రయాణం!




జంపాల సిద్ధార్థ రంగా ఆస్టిన్ కి దగ్గిరలో వున్న టెంపుల్ టెక్సాస్ నివాసి. అతను టెక్సాస్ యూనివర్సిటీలో తెలుగు నేర్చుకుంటున్నాడు.అమ్మానాన్నల భాష రాకపోవడం సిగ్గుగా వుందని, తెలుగు ఎలాగయినా నేర్చుకోవాలన్న పట్టుదల వుందని క్లాస్ లో మొదటి రోజు అతను తనని తాను పరిచయం చేసుకున్నాడు. సిద్ధార్థ ఇప్పుడు తెలుగు రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అమ్మ, నాన్న, అక్క అనే పదాలు తప్ప ఇంకో తెలుగు పదం తెలియని సిద్ధార్థ ఇప్పుడు తెలుగులో చక్కగా మాట్లాడతాడు. రాస్తాడు. చదువుతాడు. క్యాంపస్ లో ఎవరయినా తెలుగు విద్యార్థి కనిపిస్తే తెలుగులో మాత్రమే మాట్లాడాలని నియమం పెట్టుకున్నాడు సిద్ధార్థ. ఇటాలియనో, మరో భాషో నేర్చుకునే వాళ్ళని కూడా "తెలుగు ఇటాలియాన్ ఆఫ్ ది ఈస్ట్. తెలుగు నేర్చుకోండి" అంటూ తెలుగు వైపు వాళ్ళకి ఆసక్తి కలిగిస్తాడు.

"నేను చాలా ఇష్టంగా వెళ్ళే క్లాస్ ఇది. ఈ గంట సేపూ చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది నాకు." అంటాడు తెలుగు క్లాస్ గురించి.
ఈ యేడాది శాన్ ఆంటోనియో తెలుగు అవార్డ్ సిద్దార్థ కి రావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఈ అవార్డు సంగతి ప్రకటించగానే, "సిద్ధార్థ ఈ అవార్డుకి అన్నీ విధాలా తగిన వాడ"ని అందరూ అతన్ని అభినందించారు.

క్యాంపస్ లోని విదేశీ విద్యార్థుల కోసం సిద్ధార్థ రాసిన ఈ నోట్ ని యధాతధంగా ఇక్కడ అందిస్తున్నాను.

సిద్ధార్థని మీరూ ఆభినందించండి!


Siddhartha's Note for Foreign Language Learners on the UT campus

When I first learned that Telugu was being offered at the University I was truly excited. I knew it would be a great opportunity for me to learn a language that I could share with my family. Growing up my parents talked to me in English and Telugu, so I could always understand the language but unfortunately could not speak, read, or write Telugu. I was hoping that by taking Telugu I could better relate to my own culture and family and feel that the course has helped me achieve that goal.

My learning of Telugu was facilitated by our literary genius of a professor in Afsar gaaru. Afsar gaaru truly enjoys every aspect of teaching and it shows through the fun-filled environment of class. It is neat to see that every time I go to class I get a little dose of culture and India. I can speak for all the students when I say that it is surprising to see how far everyone has progressed in their language skills of Telugu in such a short amount of time. Going into our first year of Telugu together, most of the students started from the very basics but now we can communicate with great speed and understanding. We can attribute our successes to our professor who is the architect of the Telugu program here at the University.

The growth of the Telugu program at the University is very exciting. The growing interest in the class is not only in reference to native speakers, but also for anyone who would like to learn a foreign language. The language of Telugu is naturally beautiful, as our professor reminds us everyday, “It is the Italian of the East.”
Category: 11 comments

ఈ వారమే ఇండియానాపొలిస్ లో అమెరికా తెలుగు సాహితీ సదస్సు!





ఈ వారం ఇండియానా పొలిస్ లో అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుగుతోంది. ఇది ఏడవ సదస్సు. వంగూరి ఫౌండేషన్ 1998 నించి రెండేళ్ల కోసారి ఈ అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సులు నిర్వహిస్తోంది. ఈ శనివారం ఉదయం 8 గంటలకు సదస్సు మొదలవుతుంది. సాయంత్రం 6:30 గంటల దాకా సాహిత్య ప్రసంగాలూ, చర్చా వేదికలూ జరుగుతాయి. ఆరున్నర నించి 8 గంటల వరకు మధుర గాయకులు ఘంటసాల ఆరాధనోత్సవాలు జరుగుతాయి. హైదరబాద్ నించి వచ్చిన శ్రీమతి దివాకర్ల సురేఖా మూర్తి, "అపర ఘంటసాల" బాల కామేశ్వర రావు ల మధుర గీతాలు వుంటాయి. ఈ ఇద్దరి గాన మాధుర్యం ఇప్పటికే టెక్సాస్ తెలుగు వారికి సుపరిచితం. అది నిజంగా వీనుల విందే! మరునాడు స్వీయ రచన పఠనంతో రెండో రోజు కార్యక్రమాలు మొదలవుతాయి.

వంగూరి చిట్టెన్ రాజు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ సదస్సుకి ఆంధ్రా నుంచి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మంధా భానుమతి, అక్కిరాజు సుందర రామకృష్ణ హాజరవుతున్నారు.

ఈ సదస్సులో నేను "అమెరికా తెలుగు సాహిత్యం - రెండు దశాబ్దాలు" అనే అంశం మీద మాట్లాడతాను. 1990 ల తరవాత అంతర్జాతీయ ఆర్ధిక రాజకీయ పరిణామాల తరవాత అమెరికా తెలుగు సాహిత్యం ఎలాంటి మార్పులకి లోనయ్యిందో, ఎలాంటి తెలుగు రచయితలు ఈ పరిణామాల నించి వెలుగులోకి వచ్చారో ప్రధాన చర్చనీయాంశం అని నా వుద్దేశం.

నా ఈ-చిరునామా ఇది:afsartelugu@gmail.com
Category: 1 comments

ఓ బెజవాడ అబ్బాయి అమెరికా కథ!



- యాళ్ళ అచ్యుత రామయ్య
అమెరికాలో స్థిరపడిన ఓ విజయవాడ అబ్బాయి ఆ రెండు సంస్కృతుల మధ్య వైరుధ్యాలను సమన్వయ పరుచుకుంటూ తను తెలుసుకున్న జీవిత సత్యాలను అందమైన కథలుగా మలచి తీసుకొచ్చిన పుస్తకమే రంగుటద్దాల కిటికీ. ఒక దశాబ్దకాలంలో ఎస్. నారాయణస్వామి రాసిన 21 కథల సంపుటి అది.

ఈ కథల్లో మంచి తెలుగు నుడికారం ఉంది. కథా వస్తువుకూ, నేపథ్యానికీ అనుగుణంగా శిల్పాన్నీ, భాషనీ, టోన్‌నీ, మూడ్‌నీ ఎన్నుకోవడం చూస్తే ప్రపంచదేశాల కథా సాహిత్యాన్ని ఈ రచయిత శ్రద్ధగా అధ్యయనం చేసి ఉంటాడనిపిస్తుంది. ఒక జనవరి శుక్రవారం లోకస్ట్‌వాక్ కార్నర్లో అనే కథ ఈ సంకలనానికి తలమానికం. దీనిలో చైతన్యస్రవంతి ధోరణిని రచయిత చాలా సమర్ధవంతంగా నిర్వహించారు. మంచి సందేశంతో కూడిన ఈ కథని చదువుతుంటే ఓ ఇరాన్ సినిమాచూసినంత భావోద్వేగానికి గురవుతాం.

వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన 1999 ఉగాది కథలపోటీలో మొదటి బహుమతి పొందిన తుపాకి కథ తుపాకితో ప్రారంభమై తుపాకితోనే ముగుస్తుంది. ఇలా ఆద్యంతాలను సమన్వయం చేయడంలోగాని కథా సందర్భానికి తగిన సీరియస్ వాతావరణాన్ని కల్పించడంలో గానీ ఈ రచయిత తీసుకున్న శ్రద్ధను వర్ధమాన రచయితలు గమనించాలి. ఈ కథ హృదయాన్నీ మెదడునీ ఏకకాలంలో కదిలిస్తుంది.

ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి అనే కథలో శీర్షిక, కథనం, సంభాషణలు, ప్రారంభం, ముగింపు, అన్నిట్లో కనిపించే వ్యంగ్యధోరణి అద్భుతంగా ఉంది. అయితే ఇంతమంచి కథల మధ్య కథా ప్రక్రియలోకి ఏమాత్రం ఒదగని గల్పిక / స్కెచ్ లాంటివి (ఉదా: నిరసన, ఆదా ..) ఉంచడం వలన జీడిపప్పు ఉప్మాలో ఇసుక తగిలినట్లనిపిస్తుంది. ఈ చిన్న లోపాన్ని పక్కన పెడితే కథా శిల్పంపై రచయిత సాధించిన పట్టును, తనదైన ప్రత్యేక దృష్టికోణంతో జీవితాన్ని దర్శించిన తీరును ఆస్వాదించడానికి ఈ కథలను శ్రద్ధగా చదవండి.


(కొత్త పాళీ గా అంతర్జాల లోకంలో ప్రసిద్ధులయిన కథకులు నారాయణ స్వామి "ప్రముఖా"ముఖి ఈ శుక్రవారం "అక్షరం" లో చదవండి)
Category: 0 comments
Web Statistics