అమెరికా జీవితం వల్ల తేడాలు తెలిశాయి : నిడదవోలు మాలతి ముఖాముఖి

నిడదవోలు మాలతి - ఓటమి ఎరుగని కలం. ఆ మాటకొస్తే కలం కాలం నించి ఇప్పటి కీబోర్డు కాలం దాకా విరామమెరుగని కలం. రాత నుంచి కంప్యూటరు దాకా ఎంతో ఓపికగా, శ్రద్ధగా రూపాంతరం పొందడమే కాకుండా, రచనా స్వభావాన్ని కూడా కాలానుగుణంగా మార్చుకున్న మాలతి గారు అటు ఆంధ్రా, ఇటు అమెరికా తెలుగు జీవితాల మధ్య సామ్యాలనూ, సామరస్యాలనూ వెతికే ప్రయత్నం చేశారు. స్వీయ రచనల్లోనూ, అనువాదాల్లోనూ వొక నిష్టతో, నియమంతో పని చేస్తున్నారు. వయసూ, బతుకు బాధలతో నిమిత్తం లేకుండా ఎత్తిన కలం...(టచ్ చేసిన కీబోర్డు అనాలా?!) వదలకుండా, అన్ని అవరోధాలనీ జయించి రచయితగా తన ఉనికిని సదా కాపాడుకుంటున్నారు. అచ్చు లోకంలోనే కాకుండా, అంతర్జాల లోకంలో కూడా సుపరిచితమయిన పేరు నిడదవోలు మాలతి.






1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
వచ్చింది. అయితే అది అమెరికా రావడంవల్ల మాత్రమే కాకపోవచ్చు. సాధారణంగా జీవితంలో జరిగే అనేకసంఘటనలలో అమెరికా రావడం ఒకటి. అమెరికా రావడంవల్ల మరొక సంస్కృతిగురించి సవిస్తరంగా ఆలోచించుకోడానికి అవకాశం కలిగింది. విదేశీ సంస్కృతి, మనస్తత్త్వాలవిషయంలో అవగాహన మెరుగు పడిందనుకుంటాను ఇక్కడికి వచ్చేక.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
ఆమార్పు నేను అమెరికా వచ్చినతరవాత రాసిన కథలన్నిటిలోనూ కనిపిస్తుంది. ప్రధానంగా, ఏ సంస్కృతిలో కానీ వారి నైతికవిలువలు వారున్న వాతావరణం, సామాజికపరిస్థితులు ప్రాతిపదికగా ఏర్పడతాయి. వారి ఆలోచనాధోరణి వారి సామాజికచరిత్రలోనుండీ ఉదయిస్తుంది కనక ఈ రెండు సంస్కృతులలోనూ గల వైవిధ్యమూ, అంతర్గతంగా గల సామ్యాలూ ఎత్తి చూపుతూ రాయడానికి ప్రయత్నించేను,

నా ఈ అవగాహనకి మంచి ఉదాహరణ - రంగుతోలు కథ. మనకి రంగు కేవలం అందానికి సంబంధించినది అయితే, అమెరికాలో తొక్కరంగు జాతికి సంబంధించినది. ఇక్కడ “నల్లవాడు” అన్నపదంలో వాళ్ళ ఆర్థిక, సామాజిక, చారిత్ర్యక ఛాయలెన్నో ఉన్నాయి. దానితోపాటు, గత 50 ఏళ్ళుగా జరుగుతున్న సివిల్ లిబర్టీస్ ఉద్యమంమూలంగా, తొక్క రంగులో గల నెగిటివ్ ఇమేజిని తొలగించే ప్రయత్నం కూడా ఉంది. ఇది ఎత్తిచూపడానికి ప్రయత్నించాను రంగుతోలు కథలో.
అలాగే, కొత్తసీసా పాతసారా కథలో ఉమ్మడికుటుంబాలలో అనూచానంగా వస్తున్న జీవనసరళి అమెరికాగడ్డమీద ఎలాటి మార్పులకి (metamorphosis) లోనవుతుందో చిత్రించాను. అంతేకాదు. మనవారి ఈ ప్రవర్తనా, పరివర్తనా కూడా అమెరికనులు ఎలా అర్థం చేసుకుంటారో కూడా చూపించడానికి ప్రయత్నించేను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనలకి ఏ విధంగా భిన్నమయినవి?
ఈప్రశ్నకి కూడా సమాధానం పైజవాబులో కొంతవరకూ ఉంది. నాకథల్లో అక్కడా, ఇక్కడా కూడా నాచుట్టూ ఉన్న సమాజంలో మనుషుల తత్త్వాలని, నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలనీ, ఆ సమస్యలని పరిష్కరించుకునే తీరులో వైవిధ్యాన్నీ పరిశీలించి ఆవిష్కరించడానికే ప్రయత్నించాను. ప్రయత్నిస్తున్నాను. ఏపరిస్థితుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఆ ప్రవర్తనకి కారణభూతమయిన పరిస్థితులు ఏమిటి అనే నేను సదా ఆలోచిస్తుంటాను. అంచేత అమెరికా వచ్చినతరవాత నా మొట్టమొదటి కార్యక్రమం అమెరికా, ఆంధ్రా - ఈ రెండుసంస్కృతులలో గల వ్యత్యాసాలూ, సామ్యాలూ, వాటికి సంబంధించిన తాత్త్విక చింతనా - ఇవి పరిశీలించి చూసుకోడమే అయింది. అది కొంతైనా అర్థమయిన తరవాతే కథలు రాయడం మొదలు పెట్టేను. అమెరికన్ సమాజంలో, సంస్కృతిలో నాకు అర్థమయినవిషయాలే నాకథల్లో కూడా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇతివృత్తం దృష్ట్యా ఇది ఒక మార్పు.

రెండో మార్పు శైలిలో. కొందరు స్నేహితులు ఎత్తి చూపినతరవాతే నేను పరిశీలించి చూచుకొన్నాను. మొదట భాష చూడండి. మనదేశంలో ఉన్నప్పుడు రాసినకథల్లో సంస్కృత సమాసాలు ఎక్కువ. ఆ పద్ధతిలో నారచన సాగిస్తే, ఇప్పుడు నాకథల్లో ఇంగ్లీషు ఎక్కువ ఉండాలి న్యాయానికి. కానీ అలా జరగలేదు. ఇక్కడికి వచ్చేక పూర్వంకంటె మంచి తెలుగులో రాయాలన్న తపన నాకు ఎక్కువయింది. నిజానికి ఇంగ్లీషు మాటలు ఇప్పటికంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు రాసినకథల్లోనే ఎక్కువ.

శైలిలో మరొక అంశం వ్యంగ్యం. ఇండియాలో ఉన్నప్పుడు నాకథల్లో హాస్యం ఉంది కానీ వ్యంగ్యం లేదు. అది ఈమధ్య ఎక్కువగానే ఉంటోంది నాకథల్లో.

మూడోది రచన పట్ల నాదృష్టి. ఇండియాలో ఉన్నప్పుడు రచయితగా నాస్థాయి ఏమిటి అన్న స్పృహ నాకు ఉండేది కాదు. రాయాలనిపించింది రాయడం, పత్రికలకి పంపడంతో నా పని అయిపోయేది. ఇప్పుడు ఎవరు నన్ను రచయితగా గుర్తించడం లేదు? ఎందుచేత? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి కారణాలు అనేకం. నా పరిస్థితులూ, జీవితంలో, సమాజంలో, సాహిత్యంలో వచ్చినమార్పులూ - అన్నీ కలిసి నాలో ఇలాటి ఆలోచనలు కలిగిస్తున్నాయేమో. వయసు కూడా ఒక కారణం కావచ్చు. జీవితంలో చరమదశకి చేరుకున్నాక, “నేను నా జీవితంలో సాధించినదేమిటి?” అన్న ప్రశ్న రావడం సహజం కదా.

4. అమెరికాలో వున్న తెలుగురచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
తెలుగురచయితగా నాకు రెండు శాఖలున్నాయి. 1. స్వీయరచనలు, 2. అనువాదాలు.
స్వీయరచనల్లో తెలుగులో నేను రాసిన తెలుగుకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. ఇంగ్లీషుఅనువాదాల్లో నారచనలతోపాటు ఇతర రచయితలకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. విశేషంగా కాకపోయినా కొన్ని కవితలు కూడా రాశాను. నాకృషి ఇంత విస్తృతంగా ఉండగా, ఈనాటి రచయితలు “మాలతి అనువాదాలు చేస్తోంది” అని నా మొత్తం వ్యాపకాలని ఒక్క వాక్యానికి కుదించేయడం నాకు అయోమయంగా ఉంది.

భవిష్యత్తుమాటకొస్తే, నాకు భవిష్యత్తు అమెరికాలోనూ లేదు, ఇండియాలోనూ కూడా ఉన్నట్టు కనిపించడంలేదు.
అంతర్జాలంలో నా వెబ్ సైట్, http://thulika.net, నా బ్లాగు http://tethulika.wordpress.com
నాకు గర్వకారణం కావాలి. మొదట, తూలిక.నెట్‌ గురించి చెప్తాను. ఈ సైటులో నాధ్యేయం ఉత్తమ తెలుగుకథలని అనువదించి తద్ద్వారా మనసంస్కృతిని విదేశీ పాఠకులకి తెలియజేడం. ఈ కారణంగానే తూలిక.నెట్ కొన్ని యూనివర్శిటీ సైటులదృష్టిని ఆకర్షించింది. ఉదా. http://www.intute.ac.uk/cgi-bin/search.pl?term1=thulika.net&submit=Search&limit=0&subject=All (Great Britain). కొన్ని ప్రముఖ సైట్స్ నా వ్యాసాలని వారి సైట్లలో మునర్ముద్రించుకున్నారు.
ఉదా. www.driftline.org. (University of Iowa, Bowling Green, Iowa),
http://www.india-forum.com/forums/
ఇలాటి గుర్తింపులవల్ల నాతరవాత తూలిక.నెట్ భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచన నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. నాకు సన్నిహితురాలు, వర్థమాన రచయిత్రి అయిన వి. బి. సౌమ్యని (పుస్తకం.నెట్), అడిగితే, తాను ఆ బాధ్యత స్వీకరించడానికి అంగీకరించింది. ఇది నాకు కొంత సాంత్వన కలిగించినవిషయం. మరి ఆమెచేతిలో తూలిక ఎలా రూపు దిద్దుకుంటుందో మీరే చూసుకోవాలి.

తూలిక.నెట్ నేను ఒక్కదాన్నీ చేపట్టిన కార్యక్రమం. అమెరికాలో తెలుగు సాహిత్యానికి విస్తృతంగా సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వివిధ సాహిత్యసంస్థలు ఈ నా ప్రయత్నానికి తగిన మద్దతు ఇచ్చి, విజయవంతం చేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు.
ఎందుకంటే, ఈనాడు సాహిత్యక్షేత్రం కూడా ఒక వ్యాపారమే. అన్ని వ్యాపారాలలోలాగే సాహిత్యంలో కూడా అవే నీతులకి ప్రాముఖ్యత. అంటే - p.r. work , people skills, పెట్టుబడిదారీ ధోరణీ (చందాలూ, రిజిస్ట్రేషను ఫీజులూ, నానా సంస్థల పెత్తందారులతో భేటీ) లాటివి. నావ్యక్తిత్వంలో ఆ పోకడలు లేవు. నాకు ఆ సామాజికస్థాయి కూడా లేదు. ఈ సాహిత్య ప్రముఖుల ఎజెండాలలో, ఇజాలజాలంలో పడి కొట్టుకుపోయే బలం కూడా లేదు.
అంతకంటే ప్రబలకారణం - కొందరు సాహిత్య ప్రముఖులకి, ముఖ్యంగా అమెరికా తెలుగు సాహితీ ప్రముఖులకి, నేను నావ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు బాధాకరం అయేయి అనుకుంటాను. అంచేత కూడా వీరిదృష్టికి కూడా నేను ఆనలేదు. అపార్థం చేసుకోకండి. నానా సంఘాలూ, సంస్థలూ నన్ను వారిసభలకి పిలిపించి దుశ్శాలువాలు కప్పాలనీ, విశిష్టసేవా పురస్కారాలు నాకు ఇవ్వాలనీ నేను కోరడం లేదు.
నేను ఏధ్యేయంతో తూలిక.నెట్ స్థాపించేనో ఆ ధ్యేయాన్ని బలపరచడానికి మన తెలుగుసంఘాలూ, సాహిత్యాధినేతలూ (నేను తెలుగుకి ఎంతో గొప్పసేవ చేస్తున్నానని నామొహంమీద పొగిడేవాళ్ళతో సహా) ఈ సైటుకి ప్రత్యేకించి ఇస్తున్న మద్దతు ఇదీ అని చెప్పడానికి నాకేమీ కనిపించడం లేదు అని అంటున్నాను. ఆ సంఘాల ప్రత్యేకసంచికలలో ప్రచురించే వ్యాసాలూ, సాహిత్య సభల్లో ఇచ్చే ఉపన్యాసాలూ చూస్తే మీకే అర్థమవుతుంది ఈమాటల్లో యథార్థం.

పోతే, తెలుగు తూలిక విషయం - నేను 2007 డిసెంబరులో మొదలు పెట్టేను. ఈ బ్లాగుద్వారా ఈనాటి యువతరం పాఠకులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వారికి నేనెవరో, నా బతుకేమిటో తెలియదు. నన్ను కేవలం మరొక బ్లాగరుగా మాత్రమే గుర్తించి, నాకథలనీ, కబుర్లనీ, వ్యాసాలనీ చదివి, నాసాహిత్యాన్ని నిష్కల్మషంగా ఆదరిస్తున్నారు. తెలుగు తూలిక చదివే పాఠకులలో బ్లాగరులు కానివారు కూడా చాలామందే ఉన్నారు. వీళ్ళంతా ఈనాటి పాఠకులు కనక వారి ఆదరణ నాకొక ప్రత్యేకగౌరవంగానే భావిస్తున్నాను.
తెలుగుతూలికద్వారా కూడా నేను ఇంతకుమించి చెయ్యగలిగింది ఏమీ లేదు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంరంభంలో నాకు రవంత నిరాశ కలిగిస్తున్నది నేను చర్చలకి పెట్టిన అంశాలలో పాల్గొనేవారు ఎక్కువమంది లేకపోవడం. ఎందుచేతో తెలీదు మరి.

చివరిమాటగా బ్లాగ్ రచనలగురించి - బ్లాగులలో ప్రచురించేరచనలకి సాహిత్యస్థానం ఉందా లేదా అన్నవిషయంలో - నా అభిప్రాయం చెప్తాను. సూక్ష్మంగా చూస్తే, బ్లాగులలో రెండు రకాల సాహిత్యం కనిపిస్తోంది. మొదటిది - నలుగురు కూడి మాటలాడుకునేవేళ తమ సహజధోరణిలో చెప్పుకునే కబుర్లలాటివి. దీన్ని సుమారుగా జానపదవాఙ్మయంతో పోల్చవచ్చు. రెండోరకంలో చేర్చదగ్గవి శిష్టజనవ్యావహారికంలో, ఎకెడమీకానికి బెత్తెడు ఎడంగా వస్తున్న కవితలూ, కథలూ, సాహిత్యచర్చలు. ఉదాహరణకి, భైరవభట్ల కామేశ్వరరావు, పి. సత్యవతి, మీరు, కల్పన - మీబ్లాగుల్లో కనిపించే రచనలు. (ఇక్కడ తెలుగు తూలిక కూడా చేర్చవచ్చుననుకుంటాను). ఈ రచనలు కేవలం బ్లాగుల్లోనే కనిపించినా వీటికి సాహిత్యవిలువ లోపం ఏమీ లేదు. అలాగే పుస్తకాలగురించి వి. బి. సౌమ్య, అనేక సాంకేతికవిషయాలు వివరిస్తున్న వీవెన్ ... ఇలా ఎందరో ఎంతో మంచి విషయాలు అందిస్తున్నారు. వీరి రచనలు ఏ పత్రికలలో రచనలకీ తీసిపోవు.

అసలు బాధ ఏమిటంటే, మనకి వ్యక్తిపూజలే కానీ వస్తునిష్ఠ లేదు. రచయితపేరుని బట్టి, అది అచ్చయిన పత్రికపేరుని బట్టీ రచనవిలువ నిర్ణయించడం మన రాచరికపుసంప్రదాయమేమో మరి. ఏమైనా, రచనని మాత్రమే రచనగా తీసుకుని విశ్లేషిస్తే, మన సాహిత్యం మెరుగు పడే అవకాశం ఉంది.

అమెరికా తెలుగు సాహిత్యం: ప్రముఖుల అభిప్రాయాలు

అమెరికా తెలుగు సాహిత్యం పైన చర్చ ప్రారంభించడానికి నాందిగా రేపు ఈ శీర్షిక మొదలవుతుంది. ఈ ముఖాముఖీ కోసం రచయితలనీ అడుగుతున్న ప్రశ్నలు ప్రస్తుతానికి ఇవి నాలుగు మాత్రమే. కొన్ని సమాధానాలు ఇప్పటికే నాకు చేరాయి. ఇంకా కొందరి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నాను. కానీ, కొంత మంది రచయితలనీ, కవులనీ నేను మరచిపోయి వుండ వచ్చు అన్న నమ్మకంతో కూడిన అపనమ్మకం వల్ల ఇలా బ్లాగోన్ముఖంగా కూడా ఈ-లేఖ రాస్తున్నాను. ఇదే మీకు వ్యక్తిగత లేఖగా భావించి, ఎలాంటి మొహమాటం లేకుండా మీ సమాధానాలు పంపండి. మీ సమాధానాలని వొక డాకుమెంటు గా నాకు పంపే ఈమైల్ లో జత చేస్తే చాలు. నా ఈమెయిలు: afsartelugu@gmail.com
కేవలం నాలుగు ప్రశ్నలు మాత్రమే నేను అడుగుతున్నాను. మీ వీలు వెంబడి సమాధానాలు ఇవ్వండి.
1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
4. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?




ఈ వారం ముఖాముఖీ: నిడదవోలు మాలతి (రేపు "అక్షరం"లో చూడండి)

అఫ్సర్ ఇంటర్వ్యూ "పొద్దు"లో...!

చింతకాని బడిలో మా నాన్న గారు విద్యార్ధుల కోసం “మధుర వాణి” అనే పేరుతో దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడపత్రిక ప్రతి నెలా రాయించి పెట్టే వారు. ఈ గోడపత్రిక బడికే పరిమితమయినా, విద్యార్ధుల రచనల మీద ఆయన చాలా నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా అభిప్రాయాలు చెప్పడమే కాకుండా, విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకొని మార్పులూ చేర్పులూ చేయించేవారు. అవన్నీ నేను గమనిస్తూ వుండేవాణ్ని. వొక రచనని ఎడిట్ చేసుకోగలగడం గొప్ప కళ అని నమ్ముతాను నేను, నా రచనా జీవితం వొక విధంగా ఆ ఎడిటింగ్ పాఠాల నించే మొదలయ్యింది. కానీ, ఆయన అక్కడ వున్నంత కాలం నా కవిత్వం కానీ, చిట్టి కథలు గానీ వొక్కటి కూడా వేయలేదు. ఆ గోడపత్రికలో రచన చూసుకోవాలని విద్యార్ధులందరికీ తహతహగా వుండేది. నేను రచన ఇచ్చినప్పుడల్లా, చదివి, నవ్వి “నువ్వు బాగా రాయాలంటే బాగా చదవాలి” అని నా రచనని పక్కన పెట్టేసే వారు. అప్పుడు నేను నాటకాల వైపు మొగ్గాను. నేనే పది మందిని కూడదీసి, కొన్ని సీన్లు రాసి, మా ఇంటి పక్కన కిలారు గోవిందరావు గారి గొడ్లపాకలో అయిదు పైసల టిక్కెటు మీద వాటిని వేసే వాళ్ళం. అయిదు పైసలు లేని వాళ్ళు అయిదు చీట్ల పేకలు ఇవ్వాలని రూల్. ఆ వచ్చిన పేకలతో బెచ్చాలు ఆడేవాళ్లం.

(మిగతా భాగం "పొద్దు" లో...)

పన్నెండేళ్ళ క్రితం...ఒక ఈ-లేఖ నుంచి...!

అమెరికా తెలుగు సాహిత్యం మీద ఈ చర్చ పట్ల ఇటు అమెరికా తెలుగు వాళ్ళే కాక, అటు ఆంధ్రా (ఆంధ్రా అంటే, ఆంధ్రా, తెలంగాణా, సీమ) నించి కూడా అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఈ-లేఖలు రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు.

ఈ చర్చకి తగిన ఆధార భూమికని ఏర్పరచడానికి వీలుగా ఇదివరకు జరిగిన చర్చల నించి కొన్ని భాగాలని అందించాలని అనుకున్నాను.

అందులో భాగంగా విష్ణుభొట్ల లక్ష్మన్న గారు ఒక చాట్ గ్రూప్ లో రాసిన ఈ ఈ-లేఖని పునప్రచురిస్తున్నాను.




namastE: June 12, 1998

I have not posted to this news group for a while but I have been following the
news of this group for a long time.

Following the tremendous interest a lot of us have shown on Telugu Sahityam in
the recent past, I would like to share these comments with you all.

Though there are a number of knowledgeable people with good writing skills there
seems to be fewer people attempting to write in Telugu in general. Even fewer
among those who are writing are doing sobecause they want to JUST write. I
sincerely feel that it is time that we refocus on the contemporary or relevant
issues that Telugus face in the USA and put them succinctly in an accepted
literary form (kadha, kavita, etc.). And we should also strive to bring a higher
quality in these writings.

Honestly, I have read many Telugu stories originated in this country in the last
few years, but I can count only a few that I remember today as good. I have
always felt that a good literary piece of work would withstand the test of TIME
and people will remember it for a longtime no matter where and who produced it.
I do think that it will take our telugu sahitya community some more time to
achieve a higher quality of literary work. However, the efforts of a number of
writers in this direction are applaudable. And they should also be challenged to
produce better literary works.

If we ask ourselves the simple question, "How can one produce good literary
work?", I have the following to say.

Besides the writer being a competent person, he/she SHOULD

(1) have access to good literature (Classics etc.)

(2) have knowledgeable critic friends who are not afraid to criticize the works
(not the person) and help the writer produce better sahityam, and

(3) enjoy a good & sizable readership.

Unfortunately, our community lacks in the first two areas. I was surprised to
find that most of the literary people I know have read very few classic books.
Similarly, they feel uncomfortable to receive criticism that is not in praise of
their work. However, I feel that there are a large number of literally oriented
people for the readership.

I would like to continue on this later.


Best wishes,

/Lakshmanna Vishnubhotla

గోరీమా - అఫ్సర్ కథ "కథాజగత్"లో...!

గోరీమా - అఫ్సర్ కథ "కథాజగత్"లో...!


ఇంకో అరగంటలో మా ఊళ్లో ఉండబోతున్నానంటే ఒంటినిండా ఏవేవో ప్రకంపనలు.
నెమ్మదిగా వెళుతున్న పాసింజరు కిటికిలోంచి బయటికి చూపు సారిస్తే అప్పుడప్పుడే చురుకెక్కుతున్న ఎండ సూటిగా పైకి చూడనివ్వడంలేదు.
దూరంగా చెట్టునిండా ఎర్రెర్రని పూలతో దిరిసెన చెట్టు ఆకుపచ్చని నది మధ్యలో ఎగరేసిన ఎర్రజెండాలా వుంది. చూపులు ఇంకాస్తా క్రిందికి వెళ్తే కంకరరాళ్ళ ఆవల పసుపుపచ్చని తంగేడుపూల గుంపులు.
నేను నా కృత్రిమమైన నగర జీవనం తళుకుబెళుకులన్నీ వదిలించుకుని కాసేపు ఆ దృశ్యంలో కరిగిపోయాను.
చిన్నచిన్న ఫ్లాట్‌ఫారాలు దాటుకుంటూ వాటికంటే వేగంగా చెట్లనీ, పొలాన్నీ, చెరువుల్నీ దాటేస్తూ నా చిన్నతనంలోకి నన్ను పరిగెత్తిస్తోంది రైలు.

(మిగతా కథ "కథాజగత్" లో చదవండి. ఈ కథని సంపాదించి ఎంతో ఓపికగా, శ్రద్ధగా అచ్చు వేసిన మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు)

అమెరికా తెలుగు సాహిత్యం - కొత్త శీర్షిక గురించి...

ఆంధ్రా తెలుగు సాహిత్యం, అమెరికా తెలుగు సాహిత్యం అన్న పదాలు వినడానికి అంత బాగుండక పోవచ్చు కానీ, ఇప్పుడు అమెరికాలో పెరుగుతున్న తెలుగు సాహిత్య సందడిని గమనిస్తే ఇవి నిజమే కదా అనిపిస్తుంది. నిజానికి గత అరవై ఏళ్ల పైబడి అమెరికాలో తెలుగు రచయితలు ఏదో వొకటి రాస్తూనే వున్నారు. కథలూ, కాకరకాయలూ, వ్యాసాలూ కొత్త కాదు. కానీ, గత అయిదారేళ్లుగా గమనిస్తే ఈ ఉరవడి పెరిగినట్టు స్పష్టమయిన ఆధారాలే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఆంధ్ర దేశపు తెలుగు పత్రికలలో అమెరికా తెలుగు రచయితల రచనలు ఎంత వెతికినా కనిపించేవి కావు, అవి ఎంత సేపటికీ ఏ తానా, ఆటా సావనీరుకో పరిమితమయ్యేవి. ఇప్పుడు అలా కాదు. అమెరికా తెలుగు రచయితల రచనలు చెప్పుకోదగిన స్థాయిలో కనిపిస్తున్నాయి. ప్రచురణ రంగంలో అమెరికా తెలుగు రచయితలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.


ఇక అమెరికాలోని కొన్ని పట్టణాల్లో ఎక్కడ తెలుగు సాహిత్య సభ జరిగినా కనీసం వంద మందికి తక్కువ కాకుండా హాజరవుతున్నారు. తానా, ఆటాలు నిర్వహించే సాహిత్య సభలతో పాటు, స్థానికంగా అనేక సాహిత్య సంఘాలు ఏర్పడి చురుకుగా పనిచేస్తున్నాయి. ఇవి కనీసం నెలకి వొక సభ అయినా ఠంచన్ గా నిర్వహిస్తున్నాయి. పైగా, ఈ సాహిత్య సభల్లో నలభై యేళ్ళ లోపు వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తున్నారు.


ఇక అదనంగా, అమెరికాలోని వివిధ యూనివర్శిటీలలో తెలుగు అంశాల మీద పరిశోధన చేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని యూనివర్శిటీలలో తెలుగు కోర్సులకి ఆదరణ కూడా పెరుగుతోంది. ఒక్క టెక్సాస్ యూనివర్సిటీలోనే ఏడాదికి 30 మంది విద్యార్థులు ఈ కోర్సుల నించి గ్రాడ్యుయేట్ అవుతున్నారు. మిగిలిన యూనివర్సిటీలు కూడా తెలుగు మీద ఆసక్తి చూపిస్తున్నాయి. తెలుగు సాహిత్యం మీదనే కాకుండా, ఇతర సాంస్కృతిక అంశాల మీద మన వాళ్ళకే కాకుండా, అమెరికన్ విద్యార్ధులకి ఆసక్తి పెరుగుతోంది.


అంతర్జాలంలో తెలుగు హడావుడి చెప్పనే అక్కరలేదు. అంతర్జాల పత్రికలూ, బ్లాగులూ రోజూ కొన్ని వందల పేజీల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో సాహిత్యేతర అంశాలకే పరిమితమయిన అంతర్జాలం ఇప్పుడు సాహిత్య అంశాల మీద కూడా దృష్టి పెడుతోంది. ఈ-పత్రికలకి పోటీగా బ్లాగర్లు సాహిత్య సృష్టి చేస్తున్నారు.


ఇది ఒక రకంగా అమెరికా తెలుగు సాహిత్యం ఒక రూపం దాల్చే వాతావరణం. ఒక అభిరుచిని తీర్చి దిద్దుకునే దశ. కొత్త తరం రచయితలు కొత్త ఇతివృత్తాల వైపు మళ్లి, సాహిత్యాన్ని మార్చగలిగిన సన్నివేశం.


ఈ దశలో అమెరికా రచయితలు కొంత ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి. మారుతున్న పాఠక లోకాన్ని అవగాహన చేసుకోవాలి. అలాగే, అంతర్జాలం, అమెరికా జీవితమూ తమ సాహిత్య అభిరుచిని ఏ దిశగా తీసుకువెళ్తున్నాయో ఆలోచించుకోవాల్సిన బాధ్యత పాఠకులది కూడా.

అటు రచయితల, ఇటు పాఠకుల మధ్య వంతెన కట్టే శీర్షిక : అమెరికా తెలుగు సాహిత్యం.

ఈ శీర్షికకి ప్రసిద్ధ రచయితలే కాదు, ఇప్పుడే పుస్తకం పట్టి పాఠకులుగా మారుతున్న వారు కూడా రాయవచ్చు.
మీరు చదివిన రచన గురించో, మీరు కలిసిన రచయిత గురించో, మీరు హాజరయిన సాహిత్య సభ గురించో, మీలో కలుగుతున్న కొత్త సాహిత్య స్పందనల్ని గురించో ఏమయినా మీరు రాయవచ్చు. ఫలానాది రాయాలి, ఫలానా రాయకూడదు అన్న నిబంధన లేదు, పెద్ద రచయితలే రాయాలి అన్న నియమం అసలు లేదు. మీ రచనలు నా ఈమైలు కి పంపండి. afsartelugu@gmail.com


ప్రతి నెలా ప్రసిద్ధ అమెరికా రచయితల ముఖాముఖీ మాత్రం ఈ శీర్షికలో తప్పక వుంటుంది. వచ్చే శనివారం ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతి గారి ముఖాముఖితో ఈ శీర్షిక మొదలవుతుంది.

ఈ-పత్రికల చదువరులు తగ్గారా?

ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యం అనే అంశంపై చర్చలో భాగంగా ఈ-పత్రికల ధోరణుల గురించి కూడా చర్చ జరిగితే బాగుంటుందని కొందరు మిత్రులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ-పత్రికల చదువరులు తగ్గి, బ్లాగులకు ఉరవడి పెరిగిందని అంటున్నారు. ఇది ఎంత వరకు సరయింది?

ఇంతకు ముందు నేను అడిగిన మూడు ప్రశ్నలతో పాటు ఈ ప్రశ్నకి కూడా మీ సమాధానం జత చెయ్యండి.

ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యం ; చర్చకి ఆహ్వానం!




ఈ వారం టెక్సాస్ టెంపుల్ లో తెలుగు సాహిత్య సదస్సు జరగబోతోంది. సాధారణంగా టెక్సాస్ లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా అది వొక పెద్ద పండగ, వొక సందడి. పైగా, టెంపుల్ నిజంగా గుడి లాంటి వూరు. చిన్న వూరు. పెద్ద వినాయకుడి గుడి. చూడ ముచ్చటయిన వూరు. అక్కడ తెలుగు సాహిత్య సభ అంటే అచ్చంగా అది పండగే!

ఈ సదస్సుకి రమ్మని మందపాటి సత్యం గారు, టెంపుల్ రావు గారు ఆహ్వానం పంపినప్పుడు మొదట వక్తగా వెళ్లడానికి పెద్ద ఉత్సాహంగా అనిపించలేదు. వేదిక కిందనే వుండి అందరితో పిచ్చాపాటి మాట్లాడుతూ కాస్త బాధ్యత లేకుండా సరదాగా గడిపేద్దామని అనుకున్నా. కానీ, రావు గారు మళ్ళీ ఈ-లేఖ రాసి, ఉత్సాహ పరిచారు. చాలా ఆలోచించిన మీదట ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యం ఎట్లా మారిందో మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. నాకు ఇంటర్నెట్ లోకంతో అంత పరిచయమేమీ లేదు. కానీ, అచ్చు పత్రికలలో చాలా కాలం పాటు సాహిత్య పేజీలూ, ఆదివారం అనుబంధాలు ఎడిట్ చేసిన అనుభవం వున్నందు వల్ల, ఇంటర్నెట్ లోకం సాహిత్యాన్ని ఎట్లా ప్రభావితం చేసిందో మాట్లాడితే బాగుంటుందని అనుకున్నా. నెట్ వచ్చాక తెలుగు భాష కూడా కొంత మారింది. నెటిజనులు, అంతర్జాలం, బ్లాగరి, బ్లాగడం లాంటి పదాలు పుట్టడం పైకే కనిపిస్తున్న మార్పు. ఇది కాక సాహిత్య సంస్కృతి బాగా మారిందని నా అభిప్రాయం. పాఠకుడు అన్న పదానికి అర్ధం మారిందని నాకు అనిపిస్తోంది. అసలు నెట్ చూసే జనం ఎంత అన్న ప్రశ్న పక్కన పెడితే, ఈ మార్పు తెలుగు సాహిత్య సంస్కృతిని కొంచెం మలుపు తిప్పేదేనని నాకు అనిపిస్తోంది.

ఈ విషయం మీద ఇప్పుడిప్పుడే నేను ఆలోచనలు కూడదీసుకుంటున్నా. ఈ లోగా మీ అందరితో ముచ్చటించవచ్చు కదా అని అనుకుని, ఈ విషయం మీద మీ అభిప్రాయాల్నీ, మీ అనుభవాల్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నా.

మీరు నెట్ లో చదివే పత్రికల గురింఛీ, రచనల గురింఛీ, నెట్ చదవడం మొదలు పెట్టాక మీ అభిరుచిలో వచ్చిన మార్పుల గురించీ ఇక్కడ రాస్తే అది నాకు ఎంతో వుపయోగపడుతుంది. మీ మాటల్ని మీ మాటలుగానే నేను సభాముఖంగా, ఆ తరవాత నా సుదీర్ఘ వ్యాసంలోనూ పేర్కొంటాను. 

ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించండి.

1. ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?
2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా? పెరిగితే ఈ పాఠకులు ఏ వర్గం నించి పెరిగారు?
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?

ఈ మూడు ప్రశ్నలకే పరిమితం అవ్వాలని లేదు, అంతకి మించి చెప్పాలనుకున్న విషయాలు వుంటే నిర్మొహమాటంగా చెప్పండి.

మీ అభిప్రాయాలూ తప్పక రాస్తారని నమ్ముతున్నా.

తెనాలి దాటుతూ....


ఊరు దాటుతున్నప్పుడు

పక్కనే ఏరు కదలాలి

అమ్మ చాచిన చెయ్యిలా.



అప్పుడే తెరుచుకుంటున్న

ఎండ తలుపుల్లోంచి

సూర్యుడు తొంగి చూస్తుండగా

చల్లని నుదుటి మీద

ఆడుకుంటున్న నులి వెచ్చని జ్నాపకం.





అప్పుడప్పుడూ

ఈ గట్టు మీంచి ఆవలి గట్టుకి

కళ్ల పక్షుల్ని చివరంటా షికారుకి పంపాలి.



ఏరు మీంచి పారే గాలి అలల మీంచి

ఏ భాషకీ తెగని మాటల్ని పంపి

తిరుగుటపాలో

కళ్ళు పట్టేటన్ని ఆకాశప్పాఠాల్ని వొంపుకోవాలి.



రోడ్డు మీద నడిచేటప్పుడు

నీటి పొరల మీద కాళ్ళు మోపినట్టుండాలి



నదిని రెక్కల కింద దాచుకున్నంత తృప్తిగా

బుడుంగున మునిగి తేలుతున్న కొంగలు

అలా మాటి మాటికీ ఆకాశంలోకి

ఏ మాటల్ని ఎగరేస్తున్నాయో చూడాలి.



చిత్రంగా మనం

గదులు కట్టుకున్నట్టే

నదులకూ తాళాలు వేస్తాం కదా

ఆ తాళాల సందుల్లోంచి

నురుగులు కక్కుతున్న నీళ్ళల్లో

కన్నీళ్ళున్నాయో లేదో చూడాలి.



ఆ పచ్చని నేలని దాటి

ఆకాశం తప్ప అక్కడ ఇంకేమీ లేనట్టు

అల్లుకుపోయిన లోకంలో

ఏ కాలానికీ ఏ దారికీ దొరక్కుండా

ఎక్కడెక్కడికో తప్పి పోవాలి.



ఊరు చేరుతున్నప్పుడు

పక్కనే ఏరు కదలాలి

అమ్మ చాచిన చెయ్యిలా.



నీటి ఉరుకులకి తెగిపోతున్న గట్ల మీదికి

వొంగి వొంగి ఆ చెట్లన్నీ

ఏ వూసులు చెబుతున్నాయో వినాలి.



లోపలి గుస గుసలన్నీ

బయటికి వచ్చీ రాకుండానే



అప్పుడొస్తుందింక తెనాలి!



(1994. “వలస” నుంచి)



ముస్లిం సాహిత్య విమర్శ - ఎటు వైపు?!

అక్షర సాంకేతికైకమౌ విద్యల

నెల్ల వారును నభ్యసింప గలరు

అవి కృతకంబులు, నధ్యాత్మ విదులయిన

సాధకునకు ప్రపంచకమె చదువు.

మేఘాల రేఖలు మెరపుల చలనంబు

కడలిని సిగారు సుడులు నిసుక

నేల గాలికిగ్రాలు చాలును సెలయేళ్ళ

వాలును నిజమయిన వ్రాతలనగ...



1939లో "బ్రహ్మర్షి" ఉమర్ అలీ షా కవి తన "సూఫీ వేదాంత దర్శము" అనే దీర్ఘ కావ్యంలో ఆ పద్యం రాసినప్పుడు సూఫీ తత్వం గురించి ఇప్పుడున్నంత చర్చ లేదు. కాని, ఆశ్చర్యంగా ఈ దీర్ఘ కావ్యం సూఫీ వేదాంత దర్శనం దగ్గిరే ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళి, లోతయిన సాహిత్య విమర్శ కూడా చేస్తుంది. కావ్యం పుట్టుక, కవిలోనూ, పాఠకుడిలోనూ అది కలిగించే రస స్పందనల్ని గురించి చాలా మంది విమర్శకులు అనేక విధాల వ్యాఖ్యానించారు. కాని, ఉమర్ అలీ షా వాటన్నిటికీ భిన్నంగా "మతాంతర మహా పరివర్తన"తో నిండిన సాహిత్య విమర్శ తత్వాన్ని ప్రతిపాదించారు. సాహిత్య విమర్శకి సూఫీ భావనలు ఏ విధంగా దోహదం అవుతాయో కవితాత్మకంగా వివరించారు. 1990ల తరవాత తెలుగు ముస్లిం సాహిత్యంలో తిరిగి సూఫీ తత్వచాయలు కనిపించడం మొదలెట్టాయి.అయితే, కాలం మారింది, భావనలూ మారాయి. విమర్శ విధానమూ మారింది. ముస్లిం సాహిత్యం, ముస్లిం సాహిత్య విమర్శ ఈ రెండు రంగాలలో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు చాలా సంక్లిష్టమయినవి. ముస్లిం సాహిత్య విమర్శని వొక ప్రత్యేక రంగంగా గుర్తించాల్సిన చారిత్రక అవసరం ఇప్పుడు ఏర్పడుతోంది. ముస్లిం సాహిత్య విమర్శకి సంబంధించిన భావనల చరిత్ర అన్వేషణ

కూడా ఇప్పుడు జరగాల్సి వుంది.



ముస్లిం సాహిత్య విమర్శ అంటే, సూఫీ భావనల నేపధ్యం మాత్రమే కాకపోవచ్చు. కాని,స్థానిక ముస్లింల భావ చైతన్యంలో అదొక ప్రధాన సాధనం. పైన పేర్కొన్న పద్యంలో మూడు కీలక పదాలు ఈ సూఫీ భావనకి ముఖ్యం. అవి 1. కృతకమయిన అక్షర సాంకేతికత 2. ప్రపంచక చదువు 3. నిజమయిన వ్రాత.

సూఫీలు సమకాలీన వ్యవస్థల్లోని అన్ని రకాల కృతిమత్వాల మీదా నిరసన ప్రకటించారు. ఈ విషయంలో వాళ్ళు మన భక్తి ఉద్యమ తాత్వికతకి దగ్గిరగా వస్తారు. చాలా సందర్భాల్లో బసవన్నకీ, అక్క మహాదేవికీ, అన్నమయకీ, భక్త రామదాసుకీ వీళ్ళు ఆత్మ బంధువులు. భక్తిని ఇహ పర ఐక్యతకి సాధనంగా భావిస్తూనే, ఇహంవైపు, భౌతికమయిన శరీర ప్రతీకలవైపు మొగ్గు చూపించడం ద్వారా భక్తిని భూమార్గం పట్టించాలన్న పట్టింపు సూఫీ-భక్తి సంప్రదాయాల వారసత్వంగా కనిపిస్తుంది. తెలుగు నాట పల్లె ముస్లింల జీవన ఆధ్యాత్మిక సరళిని సమీపంగా చూసిన అనుభవం వున్న వారికి ఈ సామరస్య సారస్యం బోధపడుతుంది.

మౌఖిక సాహిత్య విమర్శ ఇప్పుడు అనివార్యంగా చర్చలోకి వస్తోంది కాబట్టి, మొహర్రం గీతాల గురించి తూమాటి దోణప్ప గారి వ్యాసంలోని ఈ వాక్యాలు పరిశీలించదగినవి.

"పల్లె పట్టులలో ముస్లింలు ముక్కాలు మువ్వీసము నిరుపేదలు. వీరిలో చాలా మందికి చదువు రాదు. ...ఇందులో ఉరుదూ నేర్చిన వారు ఉడ్డా ముగ్గురు. అరబ్బీ నెరిగిన వారు అసలే అరుదు. పట్టింపు కలవారు కొందరు ఉరుదూ భాషామయ గీతికలను తెలుగులో రాసికొని, కొరాను సమీప భాషలో పాడితిమని తృప్తి పడుదురు. వట్టి అట్టహాసంలేల అని మరికొందరు ప్రాంతీయ భాషలో పాడి, తమ దుక్ఖమును ప్రకటింతురు." (దోణప్ప)

భావనల వ్యాప్తిలో భాషకి అంత ప్రాముఖ్యం లేదని దీన్ని బట్టి అర్ధం అవుతుంది. వ్యక్తీకరణ అనేది భాషని మించిన ప్రక్రియ అనీ దీని భావం. ఇప్పుడు తెలుగు ముస్లింలు రాస్తున్న ఆధునిక కవిత్వానికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే, అందులో ఏది 'కృతకం' ? ఏది 'నిజమయిన వ్రాతా? ఏది 'ప్రపంచకం చదువు ' అన్నది ప్రశ్న. ఈ మూడు లక్షణాలు ఆయా కాలాల సాహిత్యంలో ఏ విధంగా నిలబడుతున్నాయో తరచి చూడవలసిన/ చూపించవలసిన బాధ్యత విమర్శ రంగానిది. ముస్లిం సాహిత్య విమర్శ రంగంలో ఇప్పుడు ఈ పని అంత సజావుగా సాగడం లేదనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం సాహిత్య విమర్శ పరిధులని ముస్లిం సాహిత్య విమర్శకులు సరిగా గుర్తించకపోవడం. ఈ విషయం లోనారసి వివరించే ముందు మనం కొంత వెనక్కి వెళ్ళాలి.

1



తెలుగు సాహిత్య రంగంలో "ముస్లిం సాహిత్యం " అనే వొక ప్రత్యేక ఉనికి సంబంధిత పదం వాడుక 1990ల తరవాతనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకు ముందు అనేక మంది ముస్లింలు అనేక సాహిత్య ప్రక్రియల్లో విశేషమయిన కృషి చేశారు. ఉమర్ అలీ షా మొదలుకొని ఇప్పటికీ రాస్తున్న పూర్వపు చాలా మంది ప్రముఖ ముస్లిం రచయితలకు సాహిత్య రంగంలొ పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ, 'ముస్లిం' అనే గుర్తింపు లేదా ఉనికి సమస్యని ఆ రచయితలు ఎదుర్కోలేదు. జాతీయోద్యమం నించి విప్లవోద్యమం దాకా ఇలాంటి ధోరణినే గమనించవచ్చు.ఉనికి ఉద్యమాలు ప్రధానంగ 1985 తరవాత వచ్చినవే కనుక ఈ విషయం దళిత, స్త్రీ వాదాలకు కూడా వర్తిస్తుంది.



అయితే, ముస్లిం రచయితల పరిస్తితి దళిత, స్త్రీ వాదాలకి భిన్నమయినది. అంతకు ముందు నించీ రాస్తూ వచ్చిన తెలుగు ముస్లిం రచయితలకు 'ముస్లిం' అనే ముద్ర లేకపోయినప్పటికీ, ఆ రచయితలు చాలా మంది ఉర్దు సాహిత్యం వల్ల ప్రభావితులు.ఇస్లామిక్ సాహిత్య అధ్యయనంలో పెరిగినవాళ్ళు. తెలుగు సాహిత్య పఠనం వల్ల అదనంగా వారి అవగాహన విస్తరించింది. ఏదో వొక రూపంలో తెలుగులో ఈ రచయితల రచనల మీద ఆ సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. ఆ విధంగా ముస్లిం భావన/ఉర్దూ సాహిత్య ప్రభావాలు తెలుగు సాహిత్యంలో 1990ల పూర్వం నించీ వున్నాయి. ఈ ప్రభావం ముస్లిం రచయితల మీద ఎంత వుందో , ముస్లిమేతర రచయితల మీదా అంతే వుంది. దీనికి స్పష్టమయిన వుదాహరణ గురజాడ కథలే.



కాని, సాహిత్య విమర్శ రంగాన్ని ఈ 'ముస్లిం' భావన ఎంత వరకు ప్రభావితం చేసిందన్నది ప్రశ్న. ఉమర్ అలీ షాలో కొంత స్పష్టంగా కనిపించే ఈ భావన దేశ విభజన తరవాత ఉర్దూ, ముస్లిం సంస్కృతులకు ఇతర గుర్తింపు ఆపాదింపబడింది. దీనికి సంబంధించిన సంఘర్షణ కవిరాజ మూర్తి, నెల్లూరి కేశవ స్వామి లాంటి రచయితల్లో కనిపిస్తుంది. విమర్శ రంగానికి వస్తే, సదాశివ గారి విమర్శ వ్యాసాల్ని ఈ నేపధ్యం నించి చూడాల్సి వుంది. అభ్యుదయోద్యమం నించి వచ్చిన కౌముది లాంటి వారు తమ విమర్శ పరిభాషలో ఆ ఉర్దూ సాహిత్య సిద్ధాంతాల వల్ల ప్రభావితం అయినట్టుగా కనిపిస్తారు. దాశరధి, నారాయణ రెడ్డి, శేషేంద్ర, ఖాసిం ఖాన్,బిరుదు రాజు రామరాజు, కే.వి.గోపాల కృష్నా రావు, మొహమ్మద్ అలి, కాళోజి లాంటి వారి నించి ఇప్పటికీ విమర్శ రంగంలో వున్న ఖాదర్ మొహినుద్దిన్ లాంటి వారి విమర్శ పరిభాషపైన ఉర్దూ/ముస్లిం సంస్కృతుల ప్రభావం వుంది.

తెలంగాణా నించి వచ్చిన ప్రతి విమర్శకుడి పైనా, పరిశోధకుడి పైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొంత ఉర్దూ/ముస్లిం సంస్కృతి చాయ కనిపించడంలో ఆశ్చర్యం యేమీ లేదు. అయితే, అదంతా "ముస్లిం సాహిత్య విమర్శ" అని నిర్ధారించడానికి అవకాశం లేదు. కాని, ముస్లిం సంస్కృతికి సంబంధించిన అంశాలు తెలుగు సాహిత్య విమర్శకి కొత్త కాదు అని చెప్పడానికి మాత్రం ఉపయోగ పడతాయి. కాని, "ముస్లిం" అనే గుర్తింపు వచ్చాక విమర్శ ఎలా మారిందో ఇప్పుడు చూద్దాము.



2



ముస్లిం సాహిత్య విమర్శ అని ఇవాళ వాడుకలో వున్న ధోరణికి నిర్దిష్టమయిన ఉనికి రాజకీయాలు వున్నాయి. 1990ల తరవాత ముస్లింలు రాస్తూ వస్తున్న సాహిత్యంలో ముస్లిం ఉనికి అంతకు ముందు వున్న అమూర్త ముస్లిం ఉనికికి భిన్నమయింది. దానికి తగినట్టుగానే, కొత్త ప్రశ్నలకి సమాధానంగా ముస్లిం సాహిత్య విమర్శ కొత్త గీటురాళ్ళని ఏర్పరుచుకుంది. అందులో మొదటిది: ముస్లిం ఉనికిని బాబ్రీ మసీదు అనంతర పరిణామాల నించి తిరిగి నిర్వచించుకోవడం. రెండు: సాంప్రదాయంపైన ధ్వజమెత్తడం. మూడు: తమ గుర్తింపు బహిరంగ ప్రకటనకి సాహిత్యంలో ఉర్దూ/ముస్లిం పరిభాషని వినియోగించడం. ఇప్పుడు ముస్లిం సాహిత్య విమర్శ అనగానే కొన్ని పడికట్టు రాళ్ళు కూడా స్థిరపడి పోయాయి.

ఈ వ్యాస రచయితతో సహా ఖాదర్ మొహినుద్దీన్, కరీముల్లా, ఖాజ, స్కై బాబా, దిలావర్,ఖదీర్ బాబు, ఉష యస్ డాని, షమీవుల్లా లాంటి వారు ఈ కొత్త ఉనికి నేపధ్యంలోనే ముస్లిం సాహిత్య విమర్శ చేస్తున్నారు. నాన్-ముస్లిం వర్గాల నించి ముస్లిం సాహిత్యం మీద విమర్శ రాస్తున్న వారు కూడా ఈ ఉనికి రాజకీయాలను విస్మరించలేని స్తితి వుంది. గుడిపాటి, సుంకిరెడ్డి, కాసుల ప్రతాప రెడ్డి, సురేంద్ర రాజు లాంటి వారు ముస్లిం సాహిత్య విమర్శకి అందించిన దోహదాన్ని ఈ సందర్భంగా విడిగా చెప్పుకోవాలి. విషాదం ఏమిటంటే, ఆది నుంచీ ముస్లిం సాహిత్యకారుల మద్దతుతో బలపడుతూ వచ్చిన దళిత సాహిత్యకారులు ముస్లిం సాహిత్యం గురించి కనీసం ప్రస్తావనలు చెయ్యకపోవడం. ఉనికి ఉద్యమాలు బలపడడానికి దళిత-ముస్లిం సాహిత్యకారుల మధ్య అయిక్యత బలపడాల్సిన అవసరమూ వుంది.



ముస్లిం సాహిత్య విమర్శ ఇప్పుడు ఏ స్తితిలో వుందంటే, అసలు సృజనాత్మకమయిన సాహిత్యం వెనక్కి పట్టి, ప్రతి వొక్కరూ ఏదో వొక స్తాయిలో విమర్శ వ్యాసాల సుడిగాలిలో చిక్కుకుపోయారు. ఈ పరిణామం దళిత/ స్త్రీ వాదాల సాహిత్య చరిత్రకి భిన్నమయిన నడక. దళిత/స్త్రీ వాదాల విషయంలో సాహిత్య విమర్శ వాటి వాటి సృజనాత్మక సాహిత్యానికి అనుబంధంగా సాగి, ఆ ఉద్యమాలకు వూపునిచ్చింది. దానికి భిన్నంగా ఇప్పటి ముస్లిం సాహిత్య విమర్శ ముస్లింల సాహిత్య సృష్టిని నీరుకారుస్తోంది. దీనికి ప్రత్యామ్నాయ దిశలో ముస్లిం సాహిత్య విమర్శ పురోగమించాల్సిన అవసరం ఇప్పుడు వుంది. ఈ వ్యక్తి కేంద్రిత సాహిత్య విమర్శ కూడా ఇప్పుడు వెనక పట్టి, అటు విమర్శా, ఇటు సృజనాత్మక సాహిత్యం కూడా మందగించాయి.



ముస్లిం సాహిత్య విమర్శ ముఖ్యంగా మూడు పాయలలో ప్రవహించడానికి అవకాశం వుంది.

ఒకటి: పూర్వ సాహిత్యంలో ముస్లిం సందర్భాల విశ్లేషణ. - కే.వి. గోపాల కృష్ణా రావు, బిరుదురాజు రామరాజు, సదాశివ లాంటి వారు చూపించిన మార్గం ఇప్పటికే వుంది. దీని కోసం అవసరం అయితే ఉర్దూ, పర్షియన్ భాషలు నేర్చుకోవడం చారిత్రక అవసరం. మంచి సాహిత్య విమర్శకి కేవలం రాజకీయ పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. ఆయా సంస్కృతులకి మూలమయిన భాషల పరిజ్ఞానం అవసరం.

రెండు: వర్తమాన జీవితంలో ముస్లిం సమూహాల సాంస్కృతిక అంశాల శోధన, వాటికి సాహిత్యంతో అనుసంధానం. ముస్లిం చరిత్ర, సాంస్కృతిక రంగాల అధ్యయనం పైకి దృష్టి సారించాలి. మన దేశంలోనూ, ఇతర ముస్లిం దేశాల్లోనూ ముస్లిం మేధావులు సాంస్కృతిక అధ్యయన రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చరిత్ర రంగంలోనూ, తాత్విక రంగంలోనూ. కనీసం వాటి అవగాహన ముస్లిం సాహిత్య విమర్శకులకు వుండాలి.



మూడు: సృజనాత్మక ముస్లిం రచయితలని నీరసపరిచే, పెడతోవన పట్టించే వ్యక్తి -కేంద్రిత రాజకీయ విమర్శల నించి బయట పడడం. వ్యక్తులు, వ్యక్తి కేంద్రిత ఉనికి రాజకీయాల వల్ల వ్యక్తులు కొంత కాలం పెత్తనం చెయ్యవచ్చు. కాని, మొత్తంగా ఆ సాహిత్య చరిత్ర తుడుచుకుపోతుంది. కొత్త తరం సాహిత్యంలోకి రాకుండా పోతుంది. ముస్లిం సాహిత్య విమర్శ అంటూ నిలబడాలంటే, ముందు ముస్లిం రచయితలు అంటూ కొందరు "నిజమయిన వ్రాతలు" రాయాలి. సృజనాత్మక సాహిత్యం పునాదిగా విమర్శ అభివృద్ధి చెందాలి. లేకపోతే, గాలిలో కత్తులు దూయడం అవుతుంది.

("పాలపిట్ట" మాస పత్రికలో "కాలి బాట" శీర్షిక నించి)

"పొద్దు"లో కొత్త కవిత :ఒక నిజ రేఖ మీద...'

పద్యం నీకొక భద్ర గది.


అది నాకు నిప్పు చేతుల నెగడు.

- మిగతా కవిత "పొద్దు" లో చదవండి.
 
http://www.poddu.net/?q=node/739
Category: 0 comments

గతం ఇప్పటిదేనని...!

            - కృష్ణుడు (హస్తినా పురి నించి )



ఎప్పుడో ఒకప్పుడు


ఏదో ఒక దుస్స్వప్నం

గుండెను పిండించి

సిరాలో ప్రవహిస్తుంది

ఏదో ఒక నిశీథి

......నక్షత్రం రాలి

మనసుకు గుచ్చుకుంటుంది

ఉన్నట్లుంది

ఒక పాట కత్తిలా మారి

పొరల్ని చేదిస్తుంది

ఎప్పుడో ఒకప్పుడు

ఏడు సముద్రాల అవతలి నుంచి

అఫ్సర్ కవిత

గతం ఇప్పటిదేనని గుర్తు చేస్తుంది.


(కృష్ణుడు...ఇప్పుడు కృష్ణా రావు గా పత్రికాలోకానికి సుపరిచితుడు. ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్. 1980లలో తెలుగు దినపత్రికలలో సాహిత్య పేజీల సాంప్రదాయం నిలబెట్టడంలో కృష్ణుడిది కీలక పాత్ర. అలనాటి అనువాదాలూ, వాద వివాదాలలో కృష్ణ దౌత్యాలు ముఖ్య ఘట్టాలు. అఫ్సర్ బ్రాండ్ కవిత్వం, అఫ్సరీకులు అనే పదబంధాలు అతని సృష్టే! )

గజల్ సాయంత్రాలు కొన్ని

చూడలేదు



కళ్లలోనే వుండిపోయాడు కానీ
గుండెల్లోకి ఎప్పుడూ చూడలేదు.

నౌక మీదనే బహు దూరాలు వెళ్ళాడేమో
కానీ, సముద్రాన్ని ఎన్నడూ చూడలేదు.

ఎక్కడయినా చుక్కలా రాలిపడ్డానా
ఎగాదిగా చూస్తారు అందరూ

పగటి బతుకులోనే గడిచిపోయింది కాలమంతా
కాసింత నీడ ఎలా వుంటుందో తెలియలేదు.

నడుస్తూనే వున్నాను అనంతంగా
మైలు రాయి వొక్కటయినా ఇందాకా  చూడలేదు.

గుబాళించే ఈ పూలన్నీ నావి కావు
నేను పడుకుని వున్న ముళ్ళ పడక నువ్వు చూడలేదు.

నన్ను ప్రేమించిన ప్రతి వొక్కరూ అంటారు
నేనొక బండ రాయినని!

 కాలుతున్న  కొవ్వొత్తిని కదా,
నన్నెవరూ తాకి చూడలేదు.



మూలం: బషీర్ బద్ర్


ఇఫ్తార్ సైరన్












నాకు భలే ఇష్టమయిన కేక!

ఇక ఈ పూట కడుపులో చంద్రోదయమే!


ముప్పొద్దులూ ఎక్కడున్నాయిలే

ఈ చీకటి పొయ్యిలో సూర్యుణ్ణి రాజేసేది

ఎప్పుడూ వొక్క పొద్దే!

కడుపులో భగభగా మండే సూర్యుళ్ళ చుట్టూ

గిరగిర తిరిగే భూగోళం అమ్మ.


ఎల్లా తెల్లారుతుందంటావ్?!

ఫజర్ నమాజ్ అయ్యాక

అజా పిలుపుకి ఆకలి తెలీదు

ఆ ఆకలి కేకకి భాషా తెలీదు



భూమి చుట్టూ ఏకనాదమయి మోగిన కంఠం

తిరిగి మసీదుని చేరేలోగా

కడుపు ఆ మూల ఖిబ్లా కన్నా ఖాళీ, ఖాళీగా..దిగులు దిగులుగా...


ఈ పగలు ఎంత స్వచ్ఛంగా వుందో తెలుసా?

మీరంతా ఎంత

పవిత్రమయిపోతున్నారో నెలంతా వొక్క పొద్దుతో!

నేను ఏళ్ల తరబడి

ఈ వొక్కపొద్దు అగ్నిలో కాలీ కాలీ

బూడిద కాలేక

మీరంతా తొక్కీ తొక్కీ

అలిసిపోయిన నిప్పు గుండంలా పడి వున్నా.



చిన్నప్పటి నించీ ఏం చూశానో ఏం విన్నానో

అదే చెబుతున్నా.

కాలెండర్లో రోజు రోజుకీ పెరిగిపోతున్న

రోజుల భారాన్ని మోయలేక నాన్న

అసహనంతో వేసిన కేకల్లో

ఎన్ని రోజా పిలుపులున్నాయో?



ఎప్పుడూ నిండుకునే ఇంట్లో

మిగిలిన ఖాళీల్ని భర్తీ చేయలేక

రెప్పల బురఖా కింద దాక్కున్న కన్నీటి చుక్క అమ్మ.

నిజంగానే

ఆ మూడో వాడు రాకపోతే

ముప్పొద్దులూ వుండెనా మాకు?!



5.20 ఇఫ్తార్

మధ్యాన్నమయ్యేసరికి గడియారానికీ చులకనే!

తక్కుతూ తారుతూ నడుస్తుంది రోగిష్టి ముండ!

ఆ గంజి నీళ్లూ, ఆ బూందీ ఓ అరటి పండూ

రోజంతా వెంటాడే ఆ తీయని పరిమళం


ఎలాగోలా జాలి పడి, పరిగెత్తవే కాలమా?



పోనీలే,

ఈ వొక్క నెలయినా వొక్క పొద్దయినా దక్కనీ...

ఇక మిగిలిన 330 రోజులూ మూడంకెలే కాదా!

నేనెంత పవిత్రమయిపోతున్నానో ఈ నెలంతా?!



                                            (1997, “వలస “ నించి)

(ఏదో వొక నెల పుణ్యం కోసం కాకుండా, పూటకి ఠికానా లేక, ఏడాదిలో మూడు వందల రోజుల పైనే వొక్క పొద్దులుంటున్న కోట్ల మందికి)
Category: 7 comments

తేనెటీగల గుహ







ఈ దారి పక్కన ఎప్పుడు నడిచినా

కనీసం వెయ్యి తేనెటీగల తుట్టెలు

కదిలించినట్టే!



రాకాసి తేనెటీగలు

కట్టుకున్న తేనె గూడు

ఈ కొండ.




ఆకుపచ్చ లోయ

లోతు కనుక్కోమని సైగ చెసినట్టే వుంటుంది



అటూ ఇటూ కొండల అల్లిక జిగిబిగి

రహస్యాలు వెతుక్కుంటున్నట్టే వుంటుంది



రెండు కొండల మధ్య ఈ నడక

ఎప్పుడూ



పొరలుపొరలుగా

చుట్టుకున్న ఆచ్చాదనలన్నీ విప్పి



నన్ను నా లోపలి లోయల్లోకి

వడి వడిగ రువ్వుతుంది

                                 వడిసేల రాయిలాగా.



(ఆస్టిన్-టెక్సాస్ లో నాకు చాలా ఇష్టమయిన బీ కేవ్స్ దగ్గిర )
Category: 5 comments

వానలో హైదరాబాద్!




వొంటరి రాస్తా మీద
చిట్టికప్పల్లా ఎగిరెగిరి పడ్తుంటాయి చినుకులు

చినుకు వొక అల్లావుద్దీన్ అద్భుత దీపం.
దీని బుడగ దేహంలోకి నేను జారిపోతాను
నగరపు పైపై మెరుగుల నా దేహం
కాసేపు దీప కాంతిని ధరిస్తుంది.

వొంటరి రాస్తా పక్కన
కాసిన్ని వాన నీళ్ళు
పిల్ల మడుగులయి ఎటో పారాలని చూస్తాయి
నా వొంటిని మడిచి
కాయితప్పడవలాగా అందులోకి వదిలేస్తాను.

అది ఎటు వెళ్ళి
ఎటు వస్తుందా అని చూస్తూ వుంటాను.

దాని రెక్కల మీద నా కన్ను అతికిస్తాను.

అది కదలడం మరిచిపోయిందని
కాసేపటికి
అర్ధమవుతుంది నాకు.

ఈ వూళ్ళో వానకి ఏ పనీ లేదు
అది ఎవరికోసమూ కురవదు

తనలో తానే తపస్సు చేసుకునే నీటి బుడగ
ఓ అరక్షణం నన్ను నిలదీసే పాము పడగ.

కొత్త ప్రపంచపు కవిత్వం "ఊరి చివర": చింతపట్ల సుదర్శన్ సమీక్ష






(వార్త ఆదివారం సంచిక నుంచి)

హైదరాబాద్ వొక కవి సమయం

ఇది నన్ను వెతుక్కుంటుందో లేదో నహీ మాలూం -

లేకిన్-

నేనెప్పుడూ దీని వేళ్ళ సందులోంచి చిరిగిన ఆకాశాన్నీ, చింపిరి జుత్తు నేలనీ, కొంకర్లు తిరిగే చలి చెట్లనీ వెతుక్కుంటూ వుంటా పొద్దస్తమానం.


ఆ కాంపస్ కెళ్ళే దారిలో ఆ ఆకుపచ్చ మలుపు మీద వాలిపోయిన సాయంత్రం రెక్క మీద
ఎటు ఎగిరి వెళ్ళానో నహీ మాలూం..


కానీ-


జారిపోతున్న వొక రాత్రి దాని మోదుగు పూల ఎర్రదనంలో కరిగిపోతా ఇప్పటికీ.

ఇప్పుడక్కడ పొద్దుటా సాయంత్రం ప్రతి రాత్రీ వొక కల వెయ్యి గులాబీ రేకులై దారిని పరచుకుంది

అప్పుడెప్పుడో మరిచిపోయిన కల జెండా అయి ఎగరడం చూస్తున్నా.


ఈ చీకటి దారి చివర వొక సూర్యుడి కోసం

చూస్తున్నా.
Category: 5 comments
Web Statistics